Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#21
తరువాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధృతరాష్ట్రుని పక్షం అంతా ఓడిపోయింది. పాండవపక్షం గెలిచేసింది. అప్పటికి కూడా భీష్ముడు అంపశయ్య మీదనే ఉన్నాడు. మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగింది. ‘దాహం వేస్తోంది’ అన్నాడు. నీళ్ళు పట్టుకు వచ్చారు. అంపశయ్య మీద పడుకున్న వాడు లౌకికమయిన జలములు త్రాగడు. ఏ నీళ్ళు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు. ‘అర్జునా, మంచినీళ్ళు ఇయ్యి’ అన్నాడు. అపుడు అర్జునుడు పర్జన్యాస్త్రమును ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోనుండి అమృతోదకం పైకిలేచి భీష్ముని నోటిలో పడింది. ఆ నీటిని త్రాగాడు. త్రాగి అంపశయ్య మీద పడి ఉన్నాడు. భీష్ముడు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో ‘భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు. నీవు బయలుదేరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, ఆయన దగ్గర ధర్మములు తెలుసుకో. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మరల ధర్మం చెప్పేవాడు లేదు’ అని చెప్పాడు. అయితే భీష్ముడు చెప్పిన ధర్మములు భారతంలో చెప్పారు తప్ప భాగవతంలో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే ఉత్తర గర్భం మీదికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భమును కృష్ణుడు రక్షించాడు అనే మాటను భీష్ముడు విన్నాడు. ఉపపాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనేమాటను విన్నాడు. విని భీష్ముడు కాలమును ముందు స్తుతి చేస్తాడు.

పదినెలలూ పూర్తీ అయిన పిమ్మట ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించాడు. అసలు యధార్తమునకు అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆవంశము ఆక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. కానీ ధర్మరాజు అంతటి వాడు తనకు వంశంలేదు అని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా, తనను తానూ రక్షించుకోవడం చేతకాని వాణ్ణి, గర్భాస్తమయిన పిండమును రక్షించాడు కృష్ణుడు. కృష్ణ భగవానుని అనుగ్రహము చేత బ్రతికింప బడి బయటకు వచ్చిన పిల్లవాడు కనుక అతనికి ‘విష్ణురాతుడు’ అని పేరు పెట్టారు.

పరీక్షిత్తు పుట్టిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజుగారు సభాతీర్చి ఉన్నారు. లేకలేక కలిగిన పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తన తొడమీద కూర్చోబెట్టుకుని, సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతీవాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించారు. అలా ఎందుకు చూస్తాడంటే ‘మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రము అనే అస్త్రం వచ్చి అగ్నిహోత్రమును వేదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ స్తోత్రం చేస్తే, ఎవరో ఒక అంగుష్ఠ మాత్రమయిన మూర్తి శంఖ చక్ర గదా పద్మములతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెదతాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడయినా కనపడతాడా’ అని సభలో చూసేవాడు. విష్ణురాతుడు అని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లాడిని ‘పరీక్షిత్’ అని పిలిచారు. అందుకని ‘పరీక్షిత్’ అయ్యాడు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు ఆ పిల్లవాని జాతకం చూసి ‘యితడు రామచంద్రమూర్తి వంశమునకు మొదటివాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానములు చేశాడో అటువంటి దానములు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువులను, బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణములను విడిచి పెడతాడో అలా బాణములను విడిచి పెడతాడు. కార్తవీర్యార్జునుడు వేయి చేతులతో ధనుస్సును పట్టుకుని బాణములను వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్టచివర శరీరం విడిచి పెట్టవలసిన సమయం ఆసన్నమయిన నాడు ఆవు పాలు పితికినంత సేపు తప్ప ఎక్కడా నిలబడని బ్రహ్మజ్ఞాని, ఈ పిల్లవాడి ఆర్తిచూసి కృష్ణ భగవానుని పాదములయందు బుద్ధి రమిస్తూ ఉండగా శరీరమును విడిచిపెట్టి, మోక్షమును పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమయిన వ్యక్తి మీ వంశంలో పుట్టాడు’ అని చెప్పారు.

ధర్మరాజు గారు పొంగిపోయారు. అప్పుడు అనుకున్నాడు. ‘నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను కొన్ని కోట్లమందిని తెగటార్చాను. ఎందఱో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చేయాలి. అశ్వమేధయాగమునకు కావలసినటువంటి సంభారములు, బంగారము ఎక్కడి నుండి వస్తాయి?’ అని భీమార్జునులను పిలిచి అడిగాడు. అపుడు భీమార్జునులు ‘అన్నయ్యా, దానిని గురించి నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. ఎందుచేత అంటే ఇతః పూర్వం ఉత్తర భారతదేశంలో మరుత్తు అనే రాజు అశ్వమేధ యాగం చేసి తత్సంబంధమయిన కాంచన పాత్రలు మొదలయిన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలనాధికారం ఉన్నది కనుక, ఆ ప్రాంతం మన పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది కనుక ఆ సంపదను సంభారములను మేము తీసుకువస్తాము. నీవు అశ్వమేధ యాగము చేయవలసింది’ అన్నారు.

ధర్మరాజు గారు మూడు అశ్వమేధ యాగములు చేశారు.ఆ యాగములకు కృష్ణ పరమాత్మను ఆహ్వానించారు. ఆయనను సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. తరువాత కృష్ణ పరమాత్మ ద్వారకా నగరమునకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్నవాళ్ళందరూ ఆయనను ఎంతో స్తోత్రం చేశారు. అక్కడ ద్వారకా నగరంలోని ప్రజలు స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు.
అక్కడ హస్తినాపురంలో అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు.


గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
విదురుని ఆగమనము:

ఒకరోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి తీసుకొని వచ్చాడు. తరువాత విదురుడు చక్కటి భోజనం చేశాడు. తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని 'అయ్యా మహానుభావా, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు. ఇది మా అదృష్టం. మీరు మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రిగారు మరణిస్తే, ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల క్రింద పెట్టుకుని కాపాడి తానూ తీసుకువచ్చి ఆహారమును నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు దాక్షాగృహంలో (లక్క ఇంట్లో) పెట్టి మమ్మల్ని కాల్చేద్దామనుకున్నప్పుడు, అనేకమయిన ప్రయోగములు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని ఆదుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఏయే తీర్థములకు వెళ్ళారో, ఏమేమి చూశారో మాకు చెప్పవలసింది’ అని అడిగాడు.

తీర్థయాత్ర చేసివచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తే ఇవతలి వాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రములలోని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతమును కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే వింటారు. భాగవతము విన్న ఫలితం వట్టినే పోదు.



ధృతరాష్ట్రుని వానప్రస్థము:

తరువాత ధృతరాష్ట్రుని దగ్గరకు వెళతాడు విదురుడు. ధృతరాష్ట్రునితో ‘నామాట విని ఉత్తర క్షణంలో లేచి ఉత్తర దిక్కుకి వెళ్ళిపో. ఎవరికోసం చూడకు. ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట జీవితం నీకు చాలు. ఇప్పటికయినా నామాట విను. వెళ్ళిపోయి ఈశ్వరునియందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆహుతి చెయ్యి. అలా యోగమార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నీవు చేసిన పాపములకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది’ అన్నాడు. 

ధృతరాష్ట్రుడు ‘గొప్పమాట చెప్పావయ్యా! నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి? భీముడు మొదలయిన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటి కూడు తిని ఇంకా సంతోషంగా బ్రతికేస్తున్నానా? ఛీ నాకు రోత పుట్టింది వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.

అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు. భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ప్రతిరోజూ ఉదయం ధర్మరాజుగారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తరువాత వచ్చి పెదతండ్రిగారయిన ధృతరాష్ట్రుడికి, గాంధారికీ తల తాటించి నమస్కరించేవాడు. ఆరోజుకూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురమునకు వచ్చాడు. ఆయన కనపడలేదు. ‘నావల్ల ఏదో అపకారం జరిగి వుంటుంది. నా పెదతండ్రి అంధుడు, వృద్ధుడు. ఆయన బిడ్డలు అందరూ మరణించారు. వీళ్ళ వలన ఇంకా సుఖ పడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో! నాకు చాలా బెంగగా ఉంది. గాంధారీమాత కూడా కనపడడం లేదు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు’ అని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు.

ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు. "ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో మీకేమన్నా తెలుసా?" అని విదురుని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విడురుడిని పిలిచి ‘నాకు నిద్ర పట్టడం లేదు. ఏదయినా మంచిమాటలు చెప్పు’ అనేవాడు. అప్పుడు విదురుడు ‘నీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? దొంగలకి నిద్ర పట్టదు. నీవు దొంగవి. నీ తమ్ముడి రాజ్యం, నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నీవు దొంగిలించాలని ఆలోచన చేస్తున్నావు’ అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తరువాత వాటిని విని ధృతరాష్ట్రుడు ‘నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను. నేను ఈ మోహంలోంచి బయటకు రాలేను’ అనేవాడు. కనీసం ఒక మంచివ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకుని, బుర్రకి పట్టినా లేకపోయినా రాత్రి మంచి మాటలు వినేవాడు. ఈ పుణ్యమునకు గాను విశ్వరూప సందర్శనంలో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనం చేయించాడు. జీవితంలో ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో చూడండి!

అటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ‘ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలియదు.' అని కన్నుల నీరు పెట్టుకున్నాడు.

ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్కళ్యాణమే. 

'ఎందుకు ఏడుస్తున్నావు?' అని ధర్మరాజుని అడిగాడు. 'పాపం మా పెదనాన్న గారికి కళ్ళు లేవు, ఉత్తర దిక్కుకి తపస్సుకి అని వెళ్ళిపోయారు. ఆయన ఏమి తింటారు? ఎవరు పెడతారు?' అన్నాడు ధర్మరాజు. అపుడు నారదుడు 'ఈ పిచ్చి ప్రశ్న మానెయ్యి. ఎవరు పెడతారని అంటావేమిటి? రెండు కళ్ళు ఉన్న దానిని నాలుగు కాళ్ళు ఉన్నది తినేస్తోంది. నాలుగు కాళ్ళు ఉన్న దానిని రెండు కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి, పళ్ళు పండి అందవేమోనని క్రిందకు వంగి అందిస్తున్నాయి. కాయ కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్న వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకు బెంగ ఎందుకు? అతను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తరదిక్కున ఋషులు ఉంటే ఆశ్రమమును చేరుకున్నాడు’ అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అనిన మాటలకు చాలా వైరాగ్యమును పొందాడు.

ఇవాళ్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నింటిని వశం చేసుకొని అంతర్ముఖుడు అయిపోయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిల్ల జేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే అటువంటి యోగాగ్ని యందు తన శరీరమును బూడిద చేసేస్తాడు. బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మమును చేరిపోతారు. నువ్వు సంతోషించు’ అని చెప్పాడు. అర్జునుడు వెళ్ళి ఇప్పటికి ఏడు నెలలు అయింది. కృష్ణ భగవానుడిని చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది?’ అని ఆశ్చర్యపోతూ విదురుడిని ‘మీరు తీర్థయాత్రలు చేశారు. అనేక క్షేత్రములకు వెళ్ళారు. ద్వారకానగరం ఎలా ఉంది? కృష్ణ భగవానుడు క్షేమమేనా?’ అని అడిగాడు. 

కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విదురునికి తెలుసు. కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడన్న అప్రీతికరమయిన వార్త విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది.

‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం’

సత్యమయినా అప్రియమయిన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు.

కానీ ధర్మరాజు నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూస్తే అవతార పురుషుడై, ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజముల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడయిన కృష్ణుడు శరీరము విడిచి పెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్లే. నాకు అనుమానంగా ఉంది’ అని బాధపడ్డాడు.

ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అప్పుడు అర్జునుడు 'అన్నయ్యా, మన నెచ్చెలి, మన దైవము, బంధువు, మన సమస్తము అయిన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా! అడవిలో వెడుతున్న వాడు, ముల్లు కాలిలో గుచ్చుకుంటే ఆ ముల్లు తీయడానికి వేరొక ముల్లును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరీయించి, శరీరములో ఉన్న ముల్లు తీసేసిన తరువాత శరీరములో గుచ్చుకున్న ముల్లు, చేతిలో వున్న ముల్లు రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరముతో ఈ లోకములోనికి వచ్చి నిద్రయందు, అనవసర ప్రసంగముల యందు జీవితమును పాడుచేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి వచ్చి ముల్లును ముల్లుతో తీసినట్లు తాను శరీరమును ధరించి లోకమునకు గీత చెప్పి, నడవడి నేర్పి, మనలను ఉద్ధరించి, కాపాడి, రెండు ముళ్ళు పారేసినట్లు లోకోద్ధరణ అయిపోయిందని శరీరాన్ని వదిలేసాడన్నయ్యా!' అని అంటూ 'ఆశ్చర్యం ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకొని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు, కేవలం కడవలో నీళ్ళు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించినంత తేలికగా గాండీవము ఉన్న నన్ను ఓడించేశారు. నన్ను ఓడించి కృష్ణ పత్నులను నావద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకొకటి అర్థం కాలేదు. ఈ గాండీవమునే కదా నేను అప్పుడు పట్టుకున్నది. ఈ రథమునే కదా నేను అప్పుడు ఎక్కాను.'

యాత్ర యోగీశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః!

తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ!!

'ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుని తీసివేశావో ఆ నాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే!'

‘అన్నయ్యా, ఇవ్వాళ కృష్ణుడు లేదు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణమును గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను. ఖాండవ వనమును దహించ డానికి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాను. 18 అక్షౌహిణుల సైన్యమును చీల్చి చెండాడాను. అన్ని చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధము చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఈవేళ మనం జీవచ్ఛవాలమై ఉన్నాము’ అన్నాడు.

ఈ మాటలను విని ధర్మరాజు ‘ఇంక మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడయితే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తరువాతి యుగానికి అవకాశం చూపాడు. కాబట్టి మనం ఉండవలసిన అవసరం లేదు’ అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు.

తాను కట్టుకున్న సార్వభౌమ లాంఛనమయిన పట్టు వస్త్రములను, ఆభరణములను విడిచిపెట్టి, కేశ పాశములకు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనస్సులో పెట్టాను. మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకు వెళ్ళి అపానమనబడే మృత్యు వాయువు నందు పెట్టాడు. అపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమయిన శరీరమునందు పెట్టాడు. ఈవిధంగా ఇప్పుడు శరీరము పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమయిన సన్యాసమని అంటారు. ఇహ తను మాట్లాడడు. ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుట్టు విరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడి వెనుక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమయిన శరీరములోకి హోమము చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యమును పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీ దేవి. తన భర్తలు వెళ్ళిపోయిన తరువాత ఇంక తను ఉండకూడదని తానూ కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరమును విడిచి పెట్టేసింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను, ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులయిన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో, ఎవరు చదివారో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదారవిందములయందు భక్తిని కృప చేస్తాడు’ అని పోతన గారు అభయం ఇచ్చారు. ఆ ఘట్టం అంతా మహోత్క్రుష్టమయిన ఘట్టం.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#23
పరీక్షిత్తు – కలి – ధర్మదేవత :

పరీక్షన్మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు అయి దేశాన్నంతటినీ కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణ ప్రదంగా ఉన్నదో అంత ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరుకాయలు. నెలకి మూడు వానలు! ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తాను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశి, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర మొదలయిన రాష్త్రముల నన్నిటిని జయించాడు. ఏకచ్ఛత్రాధిపత్యంగా విశాలమయిన సామ్రాజ్యమును తన పతాకఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు.

పరీక్షిన్మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట! యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని, దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకుని వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకు వెడుతుంటే, శిబిరము వేసుకుని ఉంటే, ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి ‘మహానుభావా’ మీ పెదతాతగారయిన ధర్మరాజుగారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకుని ఉంటే, తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ, శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని, శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారధ్యం చేస్తుంటే పాండవ మధ్యముడయిన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి ఫల్గునా, రధం ఎటు తిప్పాలి’ అని అడిగేవాడు. అర్జునుని పిలిచి ‘బావా’ అని హాస్యం ఆడేవాడు. ‘శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆదరించాడో! ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరుగెడుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు బావా, ఎక్కడికి పరుగెడుతున్నావు?’ అని అడిగాడు. అపుడు అర్జునుడు ‘శివాలయానికి వెడుతున్నాను. ఈవేళ శివరాత్రి. అభిషేకం చెయ్యాలి’ అన్నాడు. అపుడు కృష్ణుడు శివాలయంలోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా’ అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం! కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. ‘నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో?” అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు.

కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదా పురస్కృతమైన విశేషములను విని, కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీని చీనామ్బరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదములయందు నిరంతరమూ రమించి పోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడయిన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన చూశాడు. దీనిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని మీరు కేవలము ఒక పురాణ కథగా చదివితే దానివలన ఎంత ప్రయోజనము వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ ఘట్టమును మీరు చాలా సునిశితంగా పరిశీలించాలి. భాగవతము భాగవతముగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమయిన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగేముందు దాని వెనకాతల ఒక కీలకమయిన సందర్భం ఉంటుంది. ఇపుడు శుకుడు వచ్చి కోర్చోవలసిన సందర్భం వస్తోంది. అలా రావడానికి గాను దాని వెనక ఏదో మహత్తరమయిన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణములో పరిశీలన చేయకపోతే భాగవతమును వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యం మీకు అందదు.
భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది.
పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి వున్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు. తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే, ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడయినా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే
‘క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షీ’ అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఒర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయింది. దీనిని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉంది. ఎద్దుకు నాలుగు కాళ్ళూ లేవు. ఒక కాలిమీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమిమీద డేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబదినట్లుగా ఉన్న ఎద్దు తన మూడుకాళ్ళు పోయాయని ఏడవడం లేదు – ఆవు ఏడవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇదీ మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది – ‘నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా’ అని అడిగింది. ‘మంగళప్రదురాలా’ అంటే ‘శుభం ఇవ్వడం మాత్రమే తెలిసివున్నదానా’ అని అర్థం.

మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గునపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. మనం అన్నం తినడానికి నాగలిపట్టి అమ్మ గుండెలమీద గాట్లు పెడతాం. అమ్మ పంటలు పండించి మనకి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులవెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇపుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా!’ అడిగితే భూమి అంది, ‘నేను దేనికి ఏడుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృత యుగమయినా, మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది.’ ఇక్కడ గోవు బాధ పడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నాడో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది ‘కలి ప్రవేశించాడయ్యా – నేను ఏడుస్తున్నా నంటావేమిటి? నీకు మూడు కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను’ అంది. ఆయనకీ మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు?
ఆవిడ అంది –
కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. అతను రావడానికి కాలము దారిని ఇచ్చింది కాలము ఈశ్వరరూపం. ఆ కలి లోపలి అడుగు పెట్టి పాదములు ఇంకా పూన్చుకోలేదు – పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు నాలుగు పాదములు ఉండేవి. ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది. మూడు పాదములు లేవు. కలిపురుషుడు వచ్చేయడం వలన నీకు మూడు పాదములు పోయాయి’ అంది.

అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మము. ధర్మమునకు, భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మమనబడే వృషభము. అందుకే శంకరుడు వృషభమును ఎక్కుతాడని అంటారు. అనగా ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెపుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ‘నేను దేవతల గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు’ అంది. రాబోయే కాలములో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువయిపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మున్నగు కార్యక్రమములు జరగవు. మీరు మరల సంపదను పొందడానికి అగ్నిహోతము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే, ప్రీతిచెందిన దేవతలు మరల వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. ‘హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చేయము’ అని దేవతలు శుభములను చేయరు.

ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో, ఆ సనాతన ధర్మము ఈ గడ్డమీద విమర్శకు గురి అయిపోతుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. ఎవరు వేదమును కష్టపడి చదువుకుని, స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెపుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళుపెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా నిమర్శ చేసే రోజులు బయలుదేరి పోతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు.

ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు. ఆవుమాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. ‘వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభం అయిపోతున్నది. అందుకు ఏడుస్తున్నానయ్యా’ అని అంటూ ఒకమాట చెప్పింది. ‘నీకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఇందులో మూడు పాదములు పోయాయి’ అంది.

ఇక్కడ ఎద్దును ధర్మ స్వరూపంగానూ, ఆవును భూస్వరూపం గానూ మనం తలంచాలి. ధర్మ స్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు. అధర్మమయినవి మూడు తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి. కాని సత్యము అనే పాదము మాత్రము ఎన్నటికీ తెగదు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్ని అధర్మములు చేసినా, దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు తిడుతున్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతఘ్నుడై తిట్టగలుగుతున్నాడు.

ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈలోకం ఉన్నది. కాబట్టి మారని పదార్థము ఇంకా కాపాడుతోంది. కాబట్టి నాలుగు పాదములలో సత్యమనే పాదము ఒక్కటే నిలబడింది. మరి పోయినవి ఏమిటి? శౌచము – దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది. జీవితములో అన్నిటికన్నా మీరు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా 50మంది రావచ్చు. వారంతా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడయిన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు పట్టాలి. ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము. ఇవన్నీ నశించిపోతాయి.

మూడవ పాదము దయ. దయ దేనివలన పోయినది? దయ పోవడానికి ప్రధాన కారణము అహంకారము. అహంకారము వలన దయ నశించి పోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు’ అని చెపుతారు. నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడడం మొదలు పెట్టాడనుకోండి – అపుడు మీకు ‘నా అంతటి వాడిని నేను’ అన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారము ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. కాబట్టి దయపోవడానికి అహంకారము కారణమయింది. దయ స్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్నచోట అహంకారము కనపడుతూ ఉంటుంది. ధర్మము స్థానంలో అధర్మము ప్రవేశిస్తోంది. మూడవది తపస్సు, తపస్సు సమ్మోహము వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమయిన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి. ధర్మమూ పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మ స్వరూపమయిన వృషభము. అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది. ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ‘ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీమూడు పాదములు లేకపోవడం’ అంది ఆవు.

అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమయిన క్రోధం కాదు. అపారమయిన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి! చూడడానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకున్తాడో, ఎటువంటి కిరీటము పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకు అంటే వానిలోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించి పోయివున్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి వున్న ఈ ఆవుని, అపారమయిన కోపంతో తన కాలు ఎత్తి ఒక్కతన్ను తన్నేడు. ఆ ఆవు నేలమీదికి తిరగబడి పోయింది. అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నేడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదేపనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ, కన్నులవెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. ఆతను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనయిన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెల మాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవ విభూతి రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొకరు లేరు. అందుకని ఆయనకు ‘శివ’ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమయిన విషయములు ఒకరియందు ఎకకాలమునందు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యడు. ఆవుకూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు.

నిరంతరమూ ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు అన్నాడు – ‘నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీ పేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగ పడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు త్రాగుతుంది. ఇందులో ఒక రహస్యం వుంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతిమీద కరిస్తే మాత్రం చాచిపోతుంది. అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టలమీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కాని, ఎద్దు కాని పుట్టలమీద గడ్డి తిని గబుక్కున ఎందులోకయినా జారితే గభాలున పైకి రాలేవు.

ఎద్దును చూసి, ‘వీధిలో గడ్డితిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకొనే నీ మూడు కాళ్ళను తెగగోట్టిన వాడెవడు? ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు? వాడు భూమిలో దాగున్నా, ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను’ అన్నాడు పరీక్షిత్తు. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు వున్నాడు భూమి మీద.

ఈ మాటలు అనిన తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ వున్న వృషభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టారు. గుర్తుపట్టి అన్నాడు – ‘అమ్మా, నువ్వు ధరణీదేవివి. ఆయన ధర్మమూ... మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు?’ అని అడిగాడు.

అపుడు వృషభము అంది – ‘కొందరు కాలము అన్నారు. కొందరు కర్మ అన్నాడు. ఇది యుగసంధి అన్నారు. ఇది యుగలక్షణం అన్నారు. ‘ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి’ అని చెప్పింది.
అంతే, ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటివరకు నృపాకారంతో ఉన్నవాడు గభాలున వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి ‘అయ్యా, నన్ను రక్షించండి. తప్పయిపోయింది. ఆ మూడు పాదములు నేనే నరికేశాను’ అన్నాడు. ధర్మము మూడు పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీచేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇపుడు కలి ప్రవేశం జరిగింది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#24

కలి అన్నాడు “నేను ఇంకా స్థిరముగా ఊన్చుకోలేక పోతున్నాను. ఇది నా తప్పు కాదు. నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. గట్టిగా ఊన్చుకొని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకుని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా! కలియుగంలో కలిని అయిన నేను ప్రవేశించాలి కదా! అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇక ఇబ్బంది ఉండదు. అలాకాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకూ, నాకూ సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు. యుగం వచ్చేసింది. నేను రావాలి. కాబట్టి నేను ఎక్కడ ఉండనో నీవే చెప్పవలసింది” అన్నాడు.

అపుడు పరీక్షిత్తు “నీకు నాలుగు స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు” అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. “జూదశాల యందు నీవు ఉండవచ్చు” అన్నాడు. రెండవది పానశాల. ‘ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు’ అన్నాడు. మూడవది ‘స్వేచ్ఛా విహరిణులై, ధర్మమునకు కట్టుబడని ఆచార భ్రష్టులయిన స్త్రీలవద్ద నీవు ఉండవచ్చు.’ నాల్గవది జీవహింస జరిగే ప్రదేశము. ‘జీవహింస జరిగే ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. ఈ నాలుగు ప్రదేశములను నీకు ఇచ్చాను’ అన్నాడు.

ఇలా కలికి ఈ నాలుగు స్థానములను ఇచ్చుట ద్వారా పరీక్షిత్తుకు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కాని, అలా నాలుగు స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూడశాలలో పేకముక్కలు ఇస్తాడా, లేకపోతే మత్తు పదార్థములను అమ్మేచోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తాను చేస్తాడా – మిమ్మల్ని కలి ఎలా పాడుచేస్తాడు? ఇది మీరు విశ్లేషణ చేయాలి. జూదశాలయందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యము ప్రబలుతుంది. లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు ‘ఏమండీ- నేను ఒక్కసారి శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు నేను సినిమాకి వెడుతున్నాను అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవడూ చెప్పడు. మర్యాద పోతుందని వాడికి తెలుసు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళివస్తానని అబద్ధం చెప్తాడు. లేకపోతే క్లబ్ ను ఒకదానిని పెట్టుకుని అక్కడికి వెడుతున్నానని చెప్పుకుంటారు. అలా చెప్పుకుందుకు సిగ్గుపడరు. మనం సాధారణంగా ఏమని అనుకుంటామంటే వీరందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారని అనుకుంటాము. ఏమీ ఉండదు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అది కలిస్థానం. అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది.

సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలయిపోతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం. తీరా వెళ్ళిన తర్వాత మూడుగంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుని ఉంటుంది. ‘ఏమండీ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండీ’ అంటుంది. అపుడు ఆయన ‘స్వామీజీ ఉపన్యాసమునకు వెళ్లాను. నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. అందుకని వెళ్లాను’ అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యం. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ‘మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు’ అంటుంది. ‘ఏమీ కాదు డబ్బు మా నాన్న గారికి పంపించాను’ అంటాడు. బుకాయిస్తాడు. దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్యరూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. రెండవది పానశాల. తాగగానే యుకాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాగగానే శుకపిక బకరవములు ప్రారంభమయిపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలుపెట్టేస్తాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత నీవు రాక్షసుడవు అయిపోతున్నావు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం చేసుకుంటున్నావు. అపుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమౌతుంది. మదోన్మత్తుడవు అవుతావు. ఆ మదము నిన్ను భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మదరూపంలో వస్తాడు. అందుకని పానశాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టు పడుతోంది. మనిషి విషయ సంగాలోలుడు అయిపోతున్నాడు.

నాల్గవది హింస. నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. అస్తమానూ చంపి వేయనక్కరలేదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తున్చేస్తారు. నీవు ఆకులను సృష్టించలేదు. అటువంటప్పుడు ఆ ఆకులను తుంచివేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమయిన హింస నోటిమాట.

‘కడుపుల్ రంపపుకోత కోయునదియే గాయాలు కాకుండినన్’ అన్నారు గయోపాఖ్యానంలో.
ఒక మనిషిని పడుకోబెట్టి మతుమందు ఇవ్వకుండా ఒక రంపము పట్టుకువచ్చి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి దూలమును కోసినట్లు కోస్తుంటే, ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో, అవతలవారు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగితజ్ఞానం లేకుండా, ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాక్కునందు అదుపు ఉండాలి. అవతలివారు బాధపడకుండా మధురమధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాటయందు కాఠిన్యము అలవాటయిపోతుంది. అవతలివారి యందు నిష్కారణమయిన కోపం పెరిగిపోతుంది. అవతలివాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలివాడి బాధ వీడి సంతోషమునకు హేతువయిన నాడు అది కలిపురుషుని ప్రవేశమును సూచిస్తుంది.

‘కాబట్టి ఈ నాలుగు స్థానములు నీకు ఇస్తున్నాను’ అన్నాడు పరీక్షితు కాలితో. తాను పరిపాలనలో వుండగా ఈ నాలుగు స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ నాలుగుచోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటి వాడు కలి ప్రతినిధి.

మీరు నాలుగింటిలో ఒకదానికి పట్టుకున్నారంటే మిగిలిన మూడింటివైపు మిమ్మల్ని ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన మీ జీవితం ఎక్కడ పాడయిపోతున్నదో మీరు తెలుసుకోగలుగుతారు.

కలిపురుషుడు చాలా తెలివితేటలుతో ప్రజలను మభ్యపెట్టగలదు. కలి పరీక్షిత్తుతో ‘అయ్యా, మీరు నాకు నాలుగు స్థానములు ఇచ్చారు. కానీ వీటిలో నేను ఊన్చుకోవడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక్క స్థానమును ఇప్పించండి’ అన్నాడు. అపుడు గభాలున పరీక్షిత్తు ‘నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను’ అన్నాడు. ‘చాలు మహాప్రభూ!’ అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బహుశః ఒక లక్షణం ఉండేది. నిస్సంగులయిన వారికి ఆత్మజ్ఞాన ప్రబోధము చేసేవారికి బంగారమునందు లోభము ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దానిమీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చినా ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. కానీ పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకము అయిపోయింది.

పరీక్షిత్తు ఒంటినిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన తరువాత పరీక్షిత్తుకి వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేటకోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశలలో బంగారమునుండి తానిచ్చిన వేరొక స్థానములోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకదానిద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోతాడు. పరీక్షిత్తు ఒంటిమీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. తరువాత పరీక్షిత్తుకు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే – జానపదులు వచ్చి, అయ్యా, క్రూర మృగముల సంఖ్యా పెరిగి పోయిందండి’ అని వేడుకుంటే, ఆ క్రూర మృగములు ఊరిమీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగాలను వేటాడతాడు. అలా వెళ్ళాలి. అంతేగానీ జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది.

పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగుట్టుకుందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అవుతోంది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. అక్కడ దాహార్తి తీర్చమని ఎవరిని అడగాలి? అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు.అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు.

ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? కదలిక లేదు.స్థాణువయిపోయి ఉన్నాడు. ధ్యానమునందు తపస్సునందు చాలా నిమగ్నుడయిపోయి బ్రహ్మమునందు రమిస్తున్నవాడు కదలిక లేక కర్ర నిలబడిపోయినట్లు స్థాణువయి ఉండిపోతాడు.

ఆయన అలా కూర్చుండి ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామము చేత ప్రాణమును నియంత్రించాడు. కుంభకము చేత వాయువును పూరించి ఆపుచేసేశాడు. కాబట్టి వక్షఃస్థలం కదలదు. మనస్సు ఊపిరిమీద ఆధారపడుతుంది. అటువంటి మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధికదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినబడవు. స్పర్శేంద్రియములు బాహ్యజ్ఞానము తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. ఆయన జాగ్రదాది మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి, తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు, గోళ్ళు, పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు.

అటువంటి శమీకమహర్షి దగ్గరకు దాహంకోసం ఆర్తిపొందిన పరీక్షిత్తు వెళ్ళాడు. ఆయన నీటికోసం వెళ్ళడం ప్రధానాంశం. కానీ పరీక్షిత్తు లోపల ఒక మౌనభాష బయలుదేరింది. ఏమిటది? ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధి భ్రంశము అయిపోయింది. బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలి. కానీ తాను అలా వెళ్ళలేదు. తానో మహారాజునని, వస్తే లేచి నిలబడలేదని, తనకు నమస్కరించలేదని, తనకి ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు.

ఇప్పుడేమయింది? అంత గొప్ప పరీక్షిత్తు, తెల్లవారిలేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మరచిపోయాడు. కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశము అయిపోయాయి. దీనివలన అతనిలో ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు.

ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు. అక్కడ సమీపంలో చచ్చిపోయి పడివున్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది. అపుడు మహర్షికి తెలివి వస్తుంది. అపుడు ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. ఇపుడు పరీక్షిత్తు లోపల వికృతాతివికృతమయిన ఆలోచనలు పెరిగిపోతున్నాయి. అపుడు తన ధనుస్సు చివరి భాగంతో మృత సర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్తు, ఇపుడు ఒక చెయ్యరాని పనిని చేశాడు. ఇపుడు ప్రపంచంలో పరమ భయంకరమయిన సన్నివేశము జరుగుతోంది. ఆ మృత సర్పమును పైకెత్తి శమీక మహర్షి మెడలో వేశాడు.

కానీ ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వియై ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుని పట్టి వున్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షిత్తులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు.

కాబట్టి మనం బాగుపడాలంటే శమీక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలి అని భాగవతం చెపుతోంది. శమీకుడు ఈశ్వరుని పాదములు పట్టుకుని ఉన్నాడు. నీవు కూడా వాటిని పట్టుకో. ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి నీ సమీపమునకు రాలేదు. ఇది భాగవతము చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి, అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి ప్రక్కనపెట్టాడు. బంగారు కిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు.

కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. ‘దాహం వేయడం ఏమిటి – నేను ఆయన ఆశ్రమమునకు వెళ్ళడం ఏమిటి – వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి – అయిపోయింది – నా రాజ్యం అయిపోయింది. నా ధనం అయిపోయింది – నా భోగం అయిపోయింది – నా పరిపాలన అయిపోయింది – నేను చెయ్యరాని దుష్కృత్యమును చేసేశాను – దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశం – ఎంత తప్పు చేశానో కదా’ అని పశ్చాత్తాప పడ్డాడు. పరీక్షిత్తు సహజ స్థితి అదికాదు. కానీ కలిపురుషుడి వలన అలా భ్రష్టుడయి పోయాడు.

పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం, అక్కడ సమీపంలో ఉన్న మునికుమారులు చూశారు. వాళ్ళు పరుగెత్తుకుంటూ అక్కడికి సమీపంలో కౌశికీనది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడయిన శృంగి వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు మహా తపస్వి. ఆ పిల్లలు ‘మీనాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అపుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనుస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు' అని చెప్పారు.

ఈ మాటలు విన్న వెంటనే శృంగి అన్నాడు ‘నాతండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడు' అని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలాలను చేతిలోకి తీసుకున్నాడు. 'చేతిలో ధనుస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరయినా ఉండవచ్చు గాక! వానిని ఈశ్వరుడు అడ్డినా, శ్రీమహావిష్ణువు అడ్డినా, నేటినుండి ఏడవ దినమునాటికి చచ్చి ఊరుకుంటాడు. తక్షకుడు అనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుగాక!’ అని శపించి, నీళ్ళు విడిచిపెట్టి, తిరిగి ఆశ్రమమునకు వచ్చి, తండ్రి ముందుపడి ఏడవడం ప్రారంభించాడు.

తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ‘ఎందుకు ఏడుస్తూన్నావు?' అని కుమారుని అడిగాడు. 'తండ్రీ మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది' అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారు అని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు. ఎవరో రాజు వేశాడట. నేటికి ఎడవనాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించాను అని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి అన్నారు – 'నాయనా, ఎంతపని చేశావు. నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు. కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. ఆ రాజు అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు! సమాజము భ్రష్టు పట్టిపోతుంది. పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీచేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వశుడవు అయిపోయావు. ఎంత పొరపాటు చేశావు!’ అన్నాడు.

ఈవార్త పరీక్షిత్తుకు అందిపోయింది. ఇంకా నాటికి ఎదవరోజున శరీరం విదిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్ళి, తూర్పుదిక్కుకు కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి, ఈశ్వరుని యందు మనస్సును నిలబెట్టాడు. గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరయినా గంగ దగ్గరకు వచ్చి ‘అమ్మా, గంగమ్మా’ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వానిని ఎంతగానో అనుగ్రహిస్తుంది. గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించివేస్తుంది. గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఎవరు యాగం చేస్తే దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహా పురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు. ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలయిన ఋషులందరూ వచ్చారు. ఈ ఏడురోజులలో తాను ఏమిచేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మమూ ఉన్నవాడు ఇంత అధర్మమయిన పని చేసేయ్యడమా! కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చేశాడు. కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్న వాడు మాత్రం చెక్కు చెదరడం లేదు. ఆ సమయంలో అక్కడికి పదహారు సంవత్సరముల వయస్సు కల ఒకాయన వచ్చాడు. ఆయన మంచి యౌవనంలో ఉన్నాడు. నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది. ఒక కౌపీనము పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు ఈ భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు ‘కృష్ణ భగవానుడిని మా వంశము అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ’ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాడులను ఇచ్చి శుకుడి కాళ్ళమీద పడితే, కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#25
శుకబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న మనం అందరూ కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. మనం అందరం కలి వలన బాధలను పడుతున్నాము. కలి ప్రభావం మనమీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే శుకుడు.

ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని చెప్పారనుకోండి – ‘అయ్యా మీరు ఇక రెండుమూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెప్పారనుకోండి – అప్పుడు ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘అయ్యా, మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని వచ్చామండి – మీకు భాగవతము చెపుదామని వచ్చామండి’ అని అన్నారనుకోండి – వాడు ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించడు. ఇప్పుడు ఎందుకండీ అంటాడు. ‘చచ్చేవేళ సందిమంత్రం’ అని మనవాళ్ళు ఒక మోటు సామెత ఒకటి చెపుతూ ఉంటారు. అపుడు సామాన్యమయిన వ్యక్తి చచ్చే వేళ ఎవరు రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు? ఎవడికయినా ఎలా ఉంటుంది అంటే – ఆ ఉన్న రెండురోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు గారు అన్నాడు – ‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయినది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రమూ ఖేదపడడం లేదు. కానీ నేను పరమధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడనయి, తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీ మూర్తియై వున్న ఒక మహర్షి మెడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పనిని చేశాను అని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచేప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మము వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడయినా స్వామి వారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా, గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కారబలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక! నిరంతరమూ ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించ వలసినది. నాకు ఆశీర్వచనం చేయవలసింది’ అని ప్రార్థించాడు.

ఉత్తర జన్మలో ఉత్కృష్టమయిన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు పరీక్షిత్తు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగూ నాకు కావాలి అని అడిగాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘అయ్యా, నాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక, నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#26
భాగవతము — ద్వితీయస్కంధము

భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తానూ ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్కమాట చెప్పాడు. “పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను. జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. అపుడు ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెపుతారా’ అని అడిగాడు. అపుడు దేవతలు వాని ఆయుర్దాయం లేక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నాడని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు శుకుడు.

ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతోంది ఒక్క అరగంటలో. ఏది నామరూపములు? వాడు పెట్టుకుంటే ఒక ఫోటో మిగిలిపోతుందంతే! పెట్టుకోక పోతే ఏ గొడవా లేదు. కాబట్టి ఇంతటి ఆభిజాత్యం కూడా పోయిందంతే! ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని నీవు ఈశ్వరాభిముఖుడవు కావలసింది. నీకు సంబంధించిన ఈ భౌతిక సంబంధములు కాని, వ్యక్తులు కాని, ఆస్తులు కాని, సంపద కాని, ఏవీ నిన్ను రక్షించవు. నీవు ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేశాడు. చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచామహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనపడడం లేదు. ఎందుకు? అదే మాయ. అది నామ రూపములయండు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయ అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు.

ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాన నేత్రము చేత చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. ‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. నీకు ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినడమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది.

భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత ‘నీవు భగవత్ కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#27
బ్రహ్మోత్పత్తి – స్వాయంభుమనువు:

విదురుడు కురుసభలో వుండగా ఒకానొక సందర్భంలో ఆయన అవమానింప బడ్డాడు. అప్పుడు విదురుడు అక్కడనుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉద్ధవుడిని ‘కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాడు. అపుడు ఉద్ధవుడు “కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు’ అని చెప్పాడు.
ఈ సందర్భంలో పరీక్షిత్తు ‘ఉద్ధవుడు కూడా యాదవుడే కదా – అతను ఎందుకు ఉండిపోయాడు?’ అని శుకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉన్నదో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడు తన తరువాత లోకమునకు చెప్పడం కోసం ఉద్ధవుడిని భూమిమీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశమును అనుసరించి బదరికాశ్రమమునకు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకుని ‘నీవు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానమును నాకు చెప్పవలసింది’ అని అడిగాడు. అపుడు ఉద్ధవుడు ‘అది నాదగ్గరే కాదు. జ్ఞానమును మైత్రేయుడికి కూడా చెప్పాడు. ఇపుడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వినవలసింది’ అని సలహా చెప్పాడు. అపుడు విదురుడు గంగపడిన చోటయిన హరిద్వారం వెళ్ళి, భాగవత జ్ఞానమును విన్నాడు. శ్రీమహావిష్ణువు నాభికమలంలో నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి వున్న లోకములందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేమీ అర్థం కాలేదు. ‘నేనన్న వాడని ఒకడిని వచ్చాను కదా – నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా’ అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ లేవు. జలప్రళయం అయిపోయి వుంది. కంగారుపడ్డాడు.

ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. అపుడు ఆయనకు పైనుంచి ‘తపతప’ అనే ఒక మాట వినపడింది. అపుడు ఆయన తపించాడు. ధ్యానమగ్నుడై ఈమాట ఎవరినుండి వెలువడిందో ఆయన దర్శనమును అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన ‘నీవు ఇలా సృష్టి చెయ్యి’ అని బ్రహ్మగారికి వేదములను ఇచ్చి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు సృష్టి చేయడం ప్రారంభం చేశాడు.

ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తయిన ప్రక్రియ జరిగింది. బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురుని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చేయండి. బిడ్డలను కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు ‘మేము ప్రవృత్తి మార్గములో వెళ్ళము. ఆ మార్గము మాకు అక్కరలేదు. మేము సృష్టి చేయము. మేము శ్రీహరి పాదములను చేరిపోతాము’ అన్నారు. వారు ఎప్పుడూ అయిదేళ్ళ వయసుతో, చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని, ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన భ్రుకుటి ముడివేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. వాడు క్రిందపడి ఏడవడం మొదలుపెట్టాడు. అపుడు బ్రహ్మగారు వానిని ఏడవకు అన్నారు. అపుడు ఆ రుద్రుడు ‘నేను ఎక్కడ ఉండాలి, ఏమి చేయాలి?’ అని అడిగాడు.

ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ సృష్టి సంకల్పంలోంచి ప్రారంభమయింది. ఇప్పుడు ఉన్న సృష్టి మిధున సృష్టి అనగా స్త్రీపురుష మైధునం చేతనే సృష్టి జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు జరిగిన సృష్టి కేవలము ఈశ్వర సంకల్పము చేత మాత్రమే జరిగిన సృష్టి.

అపుడు చతుర్ముఖ బ్రహ్మగారు ‘నువ్వు పుడుతూనే ఎడ్చావు కాబట్టి నిన్ను రుద్రుడంటారు అని చెప్పి రుద్రుడికి ఎనిమిది రూపములను, ఎనమండుగురు భార్యలను ఇచ్చి, ‘నీవు అలా ఉండి సృష్టి చెయ్యి’ అని చెప్పారు. అపుడు ఆయన కొన్ని గణములను సృష్టించాడు. ఆ గణములు అక్కడ వున్న వాళ్ళను తినివేయడం మొదలుపెట్టారు. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ‘ఇక నీవేమీ సృష్టి చేయవద్దు. కేవలం తపస్సు చేసుకుంటూ ఉండవలసింది’ అని చెప్పారు. అంతే, ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.

మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీరభాగముల నుండి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదమహర్షి బయటకు వచ్చారు. వీపులోంచి ‘అధర్మము’ వచ్చింది. అధర్మములోంచి ‘మృత్యువు’ వచ్చింది. ముందుభాగంలోంచి ‘ధర్మం’ వచ్చింది. అపుడు బ్రహ్మగారు ‘ఇలా నేను సంకల్ప వికల్పములు చేస్తే ఎంత సృష్టి చేస్తాను’ అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారియందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీయందు మోహమును పొందాడు. అపుడు ఋషులు ‘మీరు సృష్టించిన స్త్రీయందు మీకు మొహమేమిటి' అని ప్రశ్నించారు. ఆనాడు ఆయన ‘ఇది సృష్టికి ఉండే లక్షణము. కాబట్టి ఏ శరీరముతో అలా మోహమును పొందానో ఆ శరీరమును వదిలిపెట్టేస్తున్నాను’ అని శరీరమును వదిలిపెట్టేశాడు. ఆ శరీరం పొగమంచు అయింది. మనకి రోజూ కళ్ళకి అడ్డంగా వచ్చే పొగమంచు అదే!

తరువాత బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలని అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి ‘వీళ్ళయందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. అపుడు ధర్మబద్ధమై ప్రజాసృష్టి జరుగుతుంది’ అన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టిన వాడు స్వాయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. అపుడు బ్రహ్మగారు అన్నారు ‘కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి. నీవు సృష్టి చెయ్యి’ అన్నారు. అనగా స్వాయంభువ మనువు అయిదుగురు బిడ్డలను కన్నాడు. వచ్చి తండ్రికి తాను అయిదుగురు బిడ్డలను కనినట్లు చెప్పాడు. వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పాడు. ఒకాయన పేరు ప్రియవ్రతుడు, రెండవ కుమారుని పేరు ఉత్తాన పాదుడు. ఒక కుమార్తె పేరు అకూతి. మరొక కుమార్తె పేరు ప్రసూతి. మూడవ కుమార్తె పేరు దేవహూతి.

"అయిదుగురు బిడ్డలను కన్నాను. ఇప్పుడు ఏమి చెయ్యను?” అని తండ్రిని అడిగాడు. అపుడు బ్రహ్మగారు ‘శ్రీహరిని సంకీర్తన చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసినది అని చెప్పడు. అపుడు ఆయన ‘నాన్నగారూ, అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నదండీ? అని అడిగాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చిన సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకువస్తే ప్రాణులన్నీ భూమి మీదకు చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీనిని పరిపాలించడానికి ఆనుకూల్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళమును పైకెత్తండి’ అన్నాడు. ఆ భూమిని ఎలా పైకెత్తడమా అని ఆలోచించాడు బ్రహ్మగారు. ఈయన సంకల్పం చేయగానే వెనుక నుండి చేయిస్తున్న వాడు ఒకాయన ఉన్నాడు. ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి క్రిందపడ్డాడు. నాసికా రంధ్రములలోంచి చిన్న వరాహమూర్తి ఒకటి క్రింద పడింది.

ఆ వరాహము దంష్ట్రలతో(కోరలు) పెద్ద కొండంత అయిపోవడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ వున్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్లకి అర్థం అయింది. స్వామి సంకల్పమును అనుసరించి భూగోళమును పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నాడో అటువంటి ఈశ్వరుడు వచ్చాడు అనుకున్నారు. అనగా మొదటి అవతారము వచ్చినది.

ఇది యజ్ఞవరాహంగా వచ్చింది. వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమికోసం మూపుపెట్టి వెతుకుతోంది. అలా వెతకడంలో దాని ముఖం నిండా నీళ్ళు అంటుకుపోయాయి. అపుడు అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. అపుడు ఋషులందరూ ఋగ్యజుస్సామవేదములతో స్తోత్రం చేస్తూ, ఆ నీళ్ళు మీద పడేటట్లు నిలబడ్డారు. ఈ కంటికి గోచరమవని వాడు రక్షించడం కోసమని ఇప్పుడు ఒక విచిత్రమయిన మూర్తిగా వచ్చి నీతితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమయిన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా ‘యజ్ఞవరాహం వచ్చినపుడు ఈయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్ళలోంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ వున్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుడిని చంపి అవతల పారేశాడు’ అని చెప్పాఉద్.

‘ఆ వచ్చిన వాడెవడు? ఎందుకు వచ్చాడు? అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి? అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగాడు. అందుకు సమాధానంగా శుకుడు చెప్పడం ప్రారంభించాడు.


దితి – కశ్యపుడు:

కశ్యప ప్రజాపతికి పదమూడుమంది భార్యలు. ఆయన తన 13మంది భార్యలతోను ధర్మ బద్ధమయిన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యాసమయం ప్రారంభం అయింది. ఆయన సాక్షాత్తుగా రాశీ భూతమయిన తపశ్శక్తి. అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి ‘దితి’ వచ్చి ఆయనతో ఒక మాట అంది – “నామీద మన్మథుడు బాణ ప్రయోగం చేశాడు. నేను ఆ బాణ ప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. అందుచేత నీవు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు’ అని చెపుతూ ఆవిడ ఒకమాట చెప్పింది. ‘నేను ఇలా అడగడం వెనకాల ఒక రహస్యం ఉంది’ అంది. ‘అదేమిటో చెప్పవలసింది’ అని అడిగాడు కశ్యపుడు.

ఆవిడా అంది ‘నీకు 13మంది భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులం. 13 మందినీ ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో 12మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. సాధారణంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. ‘ఆత్మావై పుత్రనామాసి’ – భర్త భార్యకు అపురూపముగా ఇచ్చే కానుక ఏది? తానే తన భార్య కడుపున మళ్ళా ఉదయిస్తాడు. ధర్మపత్ని విషయంలో అది ధర్మం. ఒక దీపమును పట్టుకు వెళ్ళి ఇంకొక దీపమును వెలిగిస్తాము. రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ వత్తులు పొడుగు పొట్టి ఉండవచ్చు. ప్రమిదల రంగులలో తేడా ఉండవచ్చు. కానీ దీపశిఖ మాత్రం సమాన ధర్మమును కలిగి ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. రెండు దీపముల జ్యోతికి తేడా ఉండదు. కాబట్టి తండ్రికి, కుమారుడికి భేదం లేదు. తండ్రికీ, కుమారుడికీ భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్లు చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే ఈ అధికారమును పొంది ఉంటుంది. ఆయన తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్లు చేయగలదు. కాబట్టి నీ తేజస్సును నాయందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపము ఎక్కడ ఉంది? నాకు సంతానమును కటాక్షించు’ అంది. ఆవిడ ఎంత ధర్మబద్ధంగా అడిగిందో చూడండి!అపుడు ఆయన అన్నాడు – ‘దితీ! నీవంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. కానీ ఒక్కమాట చెపుతాను వినవలసింది. ఇది ఉగ్రవేళ. అసుర సంధ్యా కాలంలో పరమశివుడు వృషభవాహనమును అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన వెనక భూత గణములు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్లకి ఆ సమయంలో శివుడి పట్ల ఎవరయినా అపచారముగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో కానీ, ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమయిన ఫలితమును ఇచ్చేస్తారు. అందుచేత కొంతసేపు తాళవలసినది. ఒక్క ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను’ అన్నాడు.

దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మ భ్రష్టత్వము ఎక్కడ వస్తుందో మీరు గమనించాలి. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచెపట్టి లాగింది. అపుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి, తానూ ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకోని, ఆవిడ కోరుకున్న సుఖమును ఆవిడకు కటాక్షించి, స్నానం, ఆచమనం చేసి తన కార్యమునందు నిమగ్నుడయిపోయాడు. కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను. దీని ఫలితము ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి, రుద్ర గణములకు క్షమాపణ చెప్పింది. కానీ అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమును భూత గణములలో భద్రాభద్రులు అనే వారు చూసి ఉగ్రమయిన ఫలితమును ఇచ్చేశారు.

పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా’ అని అడిగింది. అపుడు కశ్యప ప్రజాపతి అన్నాడు ‘నేను వద్దని చెప్పాను. కానీ నీవు వినలేదు. నీ కడుపున పుట్టబోయే ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులు అవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది. నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్నివేల స్త్రీల కళ్ళమ్మట నీళ్ళు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమానపరుస్తారు. చిట్టచివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు’ అని చెప్పాడు.

ఈ మాటలను విని దితి బావురుమని ఏడ్చింది. ‘చివరకు నాకు ఇంత అపఖ్యాతా? దీనికి నీవారణోపాయం లేదా’ అని అడిగింది. అపుడు కశ్యపప్రజాపతి ‘దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నీవు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నీవు చేసిన దోషం పోదు. కానీ నీవు మహా భక్తుడయిన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడయిన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ అసురసంధ్య వేళలో నీవు చేసిన దుష్కృత్యము వలన కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరిచేతిలో మరణిస్తారు’ అని చెప్పాడు.

భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదములు ఎక్కడ నుండి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహా పతివ్రత. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా! అసలు పిల్లలను కనడం మానివేసింది. కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. అపుడు ఆ గర్భము నుంచి తేజస్సు బయలుదేరి లోకములను కప్పేస్తోంది. అపుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను అపుడు అందరూ వెళ్ళి మళ్ళా మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. కాబట్టి ఆవిడ బిడ్డలను కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. అపుడు కశ్యప ప్రజాపతి దితితో – ‘నీవు చేస్తున్న పని సృష్టి విరుద్ధం. నీ బిడ్డలను కనవలసింది’ అని చెప్పాడు. అపుడు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు.

ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్లకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. అందుకే ‘హిరణ్య’ ముందు పెట్టి ఒకనికి ‘అక్షి’, రెండవ వానికి ‘కశ్యప’ అని చేర్చి, ఒకనికి ‘హిరణ్యాక్షుడు’, రెండవ వానికి ‘హిరణ్యకశిపుడు’ అని పేర్లు పెట్టారు. ఒకడు కనబడ్డదానినల్లా తీసుకువెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపూ తానే గొప్పవాడినని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తనపేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార మమకారములే! ఈవిధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు దితి గర్భమునుండి జన్మించారు.

హిరణ్యాక్షుడు పుట్టీ పుట్టడం తోటే దుర్నిమిత్తములు అన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశమంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరికే! యుద్ధం కోసం అనేకమంది దగ్గరకు వెళ్ళాడు. చిట్టచివర సముద్రం లోపల ఉన్న వరుణుడి దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళి ‘ఏమయ్యా, నీవు ఎక్కడో సముద్రంలో ఉంటావు. నా భుజముల తీట తీరాలి. అందుకని నీవు వచ్చి నాతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అపుడు వరుణుడు ‘నాకు నీతో యుద్ధం ఎందుకు? నీకోసం వచ్చేవాడు ఒకాయన ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిందో వాడు వచ్చే సమయం అయిపోయింది. నీవు ఒక పర్యాయం సముద్రం మీదకు వెళ్ళు. ఆయన కనపడతాడు. ఆయనతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడు? అంటే దీనికి వెనుక ఇంకొక వ్యాఖ్యానం కలుస్తుంది. భద్రాభద్రులు అనే రుద్ర గణములు చూసి దితి యందు ఉగ్రమయిన బిడ్డలు పుట్టాలని ఎప్పుడయితే నిర్ణయం జరిగిందో, అప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము ఎంత శివ కేశవుల అభేదముగా నడుస్తుందో చూడండి!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#28
ayya meeku shathakoti vandhanalu, thanks for sharing here.
Like Reply
#29
జయవిజయులకు సనకసనందనాదుల శాపము:

శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవ ద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు ఏడవ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరమూ భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు ఏడవ ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అపుడు జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.

అపుడు సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయంలో ఆయనను దర్శనం చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యము. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడం మొదలు పెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.

ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తాము. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరమూ నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

అపుడు శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగాడు.

అపుడు వాళ్ళు – ‘స్వామీ మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు కనుక, వారు మాయందు విముఖులయి ఉన్నారు కనుక వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధం అంటే మన్నించవలసినది’ అన్నారు.

అపుడు శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మ జ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. కనుక ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను కనుక, నిత్యాపాయినియై నిరంతరమూ లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అన్నాడు. ఎంతపెద్ద మాటో చూడండి! ఎందుకు అంటే ఆ చేయి లోకములనన్నితిని రక్షించే చేయి. అటువంటి మీరు నిరంతరమూ నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు,చతుర్ముఖ బ్రహ్మ అంతటి వారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.

‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద వుండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండి అని చెప్పాను, లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరము తెలుసుకొని, ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింప బడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’
‘వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షస యోని యందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.

అప్పుడు జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి ‘స్వామీ, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు. అపుడు స్వామి ‘మీరు మూడు జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#30
యజ్ఞ వరాహ మూర్తి:

ఇప్పుడు అందులో ఒకడయిన హిరణ్యాక్షుడు, పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహ మూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వరుణుడు అన్నాడు – ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినాఏదయినా ఫోటో చూసినప్పుడు, ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహ మూర్తి అంటే ఎవరో తెలుసా! యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమయిపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞ వరాహం. ఇప్పుడు ఆయనను స్తోత్రం చేయాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ ఆ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

అపుడు యజ్ఞవరాహం అడుగులు తీస్తూ అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్ర అడుగు భాగమును కెలకడం ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.

అలా విసిరినప్పుడు దాని జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహంగా వచ్చారు. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎట్టి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.

యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. అపుడు స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి మూపురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమండలమును పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు.

అపుడు స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. అపుడు వాడు ‘నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను’ అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ‘స్వామీ, నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాపము విమోచనం అయిపోతుంది’ అన్నారు. అపుడు స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు.

ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడి గూబమీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రముల వెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థం అయింది. తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండు కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకీ ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు.

ఆదివరాహమై, యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి, చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టమును చదివినరోజు పరమోత్కృష్టమయిన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#31
కర్దముడు – కపిలుడు:

వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి, ఒక అద్భుతమయిన ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితము.

స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టిచేసిన పిదప, ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒకమాట చెప్పారు. ‘నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమును నిర్వహించాలి.నీకు అనురూపయై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కను. ఇది నాకోరిక’ అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితము. కర్దముడు తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు. అపుడు స్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణంగా భగవద్దర్శనము అయినపుడు భక్తుని కన్నుల వెంట ఆనందభాష్పములు కారతాయని చెప్తాము. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కన్నులవెంట ఆనందభాష్పములు జారి నీలమీద పడ్డాయి. అది ఎంత విచిత్రమయిన సంఘటన అంటే – ఆయన కన్నుల వెంట కారిన భాష్పబిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినచోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరమును ‘బిందు సరోవరము’ అని పిలిచారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి ‘ఈశ్వరా, నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము. అది ఎవ్వరిచేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగాద్వేషములు లేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలములో జీవులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలమునందు అల్పమయిన భోగములయందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమయిన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగము అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భాగమును అనుభవించి వైరాగ్యమును పొందాలి’ అన్నాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు ‘నాయనా, నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు?’ అని అడిగారు. అంటే ఆయన ‘నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశం చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రి మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యమ్. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి’ అని అద్భుతమయిన స్తోత్రం చేశాడు.

ఆయన స్తోత్రమునకు పరమాత్మ సంతోషించి ‘కర్దమ ప్రజాపతీ! నీ స్తోత్రమునకు నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వాయంభువ మనువు వస్తున్నాడు. ఆయనకు ‘అకూతి’, ‘దేవహూతి’, ‘ప్రసూతి’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లను ఇస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు’ అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోనుండి సామవేదమును కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనము అంటే ఒక పక్షి కాదు. సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు.

కర్దమ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వాయంభువ మనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్యయైన శతరూప తోటి, తన కుమార్తె అయిన దేవహూతి తోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు. కానీ జ్ఞానము చేత పెద్దవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వాయంభువ మనువు నమస్కరించి ‘నాకు ముగ్గరు కుమార్తెలు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశీల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినపుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్నతర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోర్కె నా కుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసినది’ అని అడిగాడు. అపుడు కర్దమ ప్రజాపతి ‘నీ కుమార్తె ఎంతటి సౌందర్య రాశో నాకు తెలుసు. ఎవరికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు.నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయింది. అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజున చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను’ అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతిల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహం మన అందరికీ మార్గదర్శకం.

శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరము స్వాయంభువ మనువు కూతురును కర్దమునికి అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళి పోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.

దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు పాటిస్తున్నాడు. నియమములు పాటిస్తున్నాడు. భర్త ఏమి చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తోంది. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడు అంత శుష్కించి పోయింది. ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు కర్దముని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్దముడు తపస్సులోంచి ఎందుకో ఒకసారి దేవహూతి వంక చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈమె సౌందర్యమును వర్ణన చేశాను. నాకోసం తపించడంలో, పరిశ్రమించడంలో ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇలా అయిపోయింది’ అనుకొని దేవహూతీ, నీ సేవలకి నేను సంతోషించాను. నీకు నావలన తీరవలసిన కోరిక ఏమి?’ అని అడిగాడు.

ఒక సౌశీల్యవంతురాలయిన స్త్రీ భర్తవలన తాను సంతానవతియై తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ అంది ‘ఈశ్వరా, మీరు నాకు పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి’ అని కోరింది. అంటే అప్పుడు ఆయన ‘తప్పకుండా కటాక్షిస్తాను’ అని ఒక అందమైన మాట చెప్పాడు. ‘నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని, ఉరఃపంజరము పైకి వచ్చేసి ఒక నారపంచె కట్టుకుని ఎప్పుడూ దండకమండలములు పట్టుకుని చాలా వెర్రివాడిలా, తపస్సు చేసుకుంటున్న వాడిలా ఏ భోగ భాగ్యములు లేని వాడిలా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ భూశయనం చేసే వాడిలా కనపడుతున్నాను కదా! నాకు ఉన్న భోగములు ఎటువంటివో తెలుసా? ఈ భూమియందు సార్వభౌములమని సమస్త భూమండలమును ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి.

నేను నిరంతరమూ శ్రీమన్నారాయణుని సేవించాను. అపారమయిన భక్తితో యోగమును అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. దానిచేత ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసిన భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు. వాటిని చూడడానికి వీలయియా దివ్యదృష్టిని నీకు ఇస్తున్నాను. భోగోపకరణములను చూడవలసినది’ అని దివ్యదృష్టిని ఇచ్చాడు.

ఆవిడ తెల్లబోయింది. ఒక పెద్ద భవనం వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యా మందిరములు ఉన్నాయి. ఆ శయ్యా మందిరములకు ఏనుగుల దంతములతో చేయబడిన కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్న చీనీ చీనాంబరములు – బంగారము, వెండితో చేయబడిన స్తంభములు, వజ్రవైడూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారములు, బయట విశాలమయిన ప్రాంగణములు.

వీటన్నింటినీ చూసి ఆమె అలా నిలబడిపోయింది. ఈ స్థితిలో వున్న దేవహూతికి ఉత్తరక్షణంలో ఇవన్నీ కనబడ్డాయి. అపుడు కర్దమ ప్రజాపతి “దేవహూతీ, అదిగో బిందు సరోవరము. అందులో దిగి స్నానం చేసి బయటకు రా’ అన్నాడు. వచ్చేసరికి ఇంతకు పూర్వం దేవహూతి ఎంత సౌందర్యంగా ఉండేదో దానికి పదివేల రెట్లు అధిక సౌందర్యమును పొందింది. అక్కడ ఒక వేయిమంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళు ఆమెకు పట్టు పుట్టములు కట్టి, అంగరాగముల నలది ఆమె చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకములయిన పువ్వులు పెట్టి ఒక నిలువుటద్దం పట్టుకు వచ్చి ఆవిడ ముందుపెట్టి సోయగమును చూసుకోమన్నారు. అద్దంలో తన సోయగమును చూసుకుని, వెంటనే తన భర్తను స్మరించినది. ఉత్తరక్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షం అయ్యాడు. మనం ఎవరూ అనుభవించని భోగాలు అనుభవిద్దాం, రావలసింది’ అని విమానం ఎక్కించాడు. ఈ విమానం సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగ గలిగిన విమానం. అటువంటి విమానంలో వాళ్లు తిరుగుతున్నారు. భోగములను అనుభవిస్తూ ఇద్దరూ ఆనందంగా క్రీడిస్తూ వుండగా ఆ విమానం మేరు పర్వత శిఖరముల మీద దిగింది. వారు మేరు పర్వత చరియలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు యక్షులు కిన్నరలు కింపురుషులు దేవతలు ఉన్నారు. గ్రహములన్నీ ఆ మేరు పర్వతమును చుట్టి వస్తుంటాయి. ఆ మేరు పర్వత చరియలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా భోగములను అనుభవిస్తూ ఉండగా వారికి తొమ్మండుగురు ఆడపిల్లలు పుట్టారు. తొమ్మిదవ పిల్ల పుట్టిన తరువాత కర్దమ ప్రజాపతి ‘మనం ఎన్నాళ్ళ నుండి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతీ?’ అని అడిగాడు. ఆవిడ ‘అయ్యో, తొమ్మండుగురు ఆడపిల్లలు జన్మించారు. పెద్దపిల్ల పెళ్ళి ఈడుకు వచ్చేస్తోంది. జ్ఞాపకమే లేదు. కాలము క్షణంలా గడిచిపోయింది’ అంది.

ఆయన ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరమూ తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. వైరాగ్య భావన మనస్సులో ఉండాలి. అది పండు పండిన నాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని దేవహూతీ, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను”. అన్నాడు. అప్పుడు దేవహూతి ‘నిన్ను ఆపను, నువ్వు పండడమే నాకు కావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు నువ్వు పండాలి. కానీ నాది ఒక్క కోరిక. నాకు తొమ్మండుగురు ఆడపిల్లలను ఇచ్చావు. ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుడిని తేవాలి. నేను ఆడదానిని ఏమీ తెలియవు. అందుచేత ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరల నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించే వాడు కావాలి. నన్ను కూడా జ్ఞానము వైపు తిప్పేవాడు కావాలి. అటువంటి వాడు కూతుళ్ళను గట్టెక్కించగలవాడు అయిన ఒక కొడుకును ఇచ్చి వెళ్లవలసినది’ అని అడిగింది.
అపుడు ఆయన ‘సెహబాష్! గొప్ప కోరిక కోరావు. నీకు ఒక కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను’ అన్నాడు. తదుపరి కర్దమ ప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భములోనికి ప్రవేశించి ఆయన కుమారుడయి కపిల భగవానుడు అని పేరుతో బయటకు వచ్చాడు.

కపిల మహర్షి జన్మిస్తే, సంతోషమును ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు. ‘కర్దమా, నిన్ను నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నీవు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు. గృహస్థాశ్రమము లోనికి వెళ్ళి, ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమయిన భోగమును అనుభవించి వైరాగ్యమును పొంది, వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి, భార్య కోర్కె తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు. కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షమును పొందుతుంది. సన్యాసాశ్రమమునకు వెళ్ళి నీవు మోక్షం పొందుతావు’ అన్నాడు. ఇదీ గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం.

చతుర్ముఖ బ్రహ్మ గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తరువాత కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను ఎవరికీ ఇచ్చి వివాహం చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద, తండ్రిగారయిన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. బ్రహ్మగారు ‘నీకు కలిగిన తొమ్మండుగురు పిల్లలను తొమ్మండుగురు ఋషులకు ఇచ్చి వివాహం చేయి’ అని చెప్పారు. ఆయన సూచన ప్రకారం తన కుమార్తె ‘కళ’ను మరీచి మహర్షికి, అత్రి మహర్షికి ‘అనసూయ’ను, అంగీరసునకు ‘శ్రద్ధ’ను, పులస్త్యునకు ‘హవిర్భువు’ అనే అమ్మాయిని, పులహునకు ‘గతి’ ని, క్రతువునకు ‘క్రియ’ను భృగువునకు ‘ఖ్యాతి’, వసిష్ఠునకు ‘అరుంధతి’, అధర్వునకు ‘శాంతి’ – అలా తొమ్మండుగురు ఋషులకు, తొమ్మండుగురు కన్యలు ఇచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తరువాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు. చంటి పిల్లవాడయిన కపిలుడు పడుకొని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంటి పిల్లవానిగా వున్న పిల్లాడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. ‘మహానుభావా, మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృ ఋణం తీరదు. అందుకని కొడుకుగా పుట్టి పితృ ఋణం నుండి నన్ను ఉద్దరించారు. అసలు మీ సౌజన్యమునకు హద్దు లేదు. తండ్రీ, మీకు నమస్కారము. అన్నాడు. అపుడు ఆయన అన్నాడు ‘ఇంతకుపూర్వం నేను ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యమనే వేదాంతమును బోధ చేశాను. తత్త్వము ఎన్ని రకాలుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పడమును సాంఖ్యము అంటారు. కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యం చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతాను అని మాట ఇచ్చాను, తప్పలేదు, పుట్టాను. నాయనా, నువ్వు సన్యసించి వెళ్ళిపో. నీవు మోక్షమును పొందుతావు’ అన్నాడు.
అపుడు కర్దమ ప్రజాపతి ‘నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిని నీవు ఉద్ధరించాలి’ అన్నాడు. ‘తప్పకుండా ఉద్ధరిస్తాను’ అన్నారు స్వామి.


కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దమ ప్రజాపతి తన భోగోపకరణములనన్నిటిని భార్యకు ఇచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. ‘నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండి పోయాను. నేను కూడా ఉద్ధరింపబడాలి’ అని అనుకుంది. అందుకని ఇప్పుడు దేవహూతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకొని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతున్నది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్త్వమును నాకు బోధచెయ్యి’ అని అడిగింది.

అప్పుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే ‘కపిలగీత’ అంటారు. కపిల గీత వినిన వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో, ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. ‘అమ్మా, ప్రపంచంలో అనేకమయిన జీవరాసులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణం ప్రాణం ఉన్నా చెట్లకన్నా గొప్పతనము ఒకటి ఉంది. స్పర్శ జ్ఞానము కలుగుట చేత వృక్షములకంటే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శ జ్ఞానము ఉన్నదానికంటే రస జ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్ప గలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. దానికన్నా ఆవు, గేదె, మేక మొదలయిన నాలుగు పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభము రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. రెండు పాదములు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు.

అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేయలేరు. కాబట్టి ఆ స్వామి పరమ భక్తులయిన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు. ఆ మూర్తిని ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా! పరమ సంతోషంతో నీ మనస్సును ఆయన పాదారవిందముల దగ్గర చేర్చు. స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తెనేమరిగిన సీతాకోక చిలుకలా హృదయము దానియందే రంజిల్లడం మొదలిడుతుంది. అప్పుడు మనస్సుకి భోగములవైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చేయాలి. చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడం మొదలు పెట్టాలి. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయ గలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు’ అని చెప్పాడు.

ఆ మాటలను విన్న దేవహూతి ఆ భోగములనన్నిటిని తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయమునందు నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, ఈ విషయములు వినిన తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు మనను ఉద్ధరించేవి కావని తెలుసుకుని, వాటిని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానమువలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతమును పొందినది. ఇది జీవులందరినీ ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమయిన గాథ.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#32
చతుర్థ స్కందము - దక్ష యజ్ఞం

చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో చెప్పుకున్నాము. ఈశ్వరుని దేహములోంచి వచ్చిన సృష్టి కొంత ఉన్నది. అందులో పదిమంది ప్రజాపతులను ఆయన శరీరమునుండి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటన వ్రేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రములలోంచి జన్మించినటు వంటి వాడు అత్రిమహర్షి. అత్రి మహర్షి సంతానమే ఆత్రేయస గోత్రికులు. దక్షప్రజాపతి పదిమంది ప్రజాపతులకు నాయకుడు. అటువంటి దక్షప్రజాపతికి పదహారుమంది కుమార్తెలు కలిగారు. ఈ 16మంది కుమార్తెలకు ఆయన వివాహం చేశారు. అందులోనే ‘మూర్తి’ అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వారే బదరీలో తపస్సు చేశారు. అందుకే ఉద్ధవుడు ఉండడం, నర నారాయణులు అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం – ఇలాంటి వాటివలన బదరీ క్షేత్రమునకు అంత గొప్పతనం వచ్చింది. బాదరాయణుడని పిలువబడే వ్యాసుడు అక్కడే కూర్చుని తపస్సు చేశాడు. భాగవతమును రచన చేశాడు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు ‘బాదరాయణుడు’ అని పేరు వచ్చింది.

బ్రహ్మ బొటనవేలునుండి ఆవిర్భవించిన దక్షప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునకు ఇచ్చి వివాహం చేశారు. దక్ష కుమార్తెలలో 15 మందికి సంతానం కలిగారు. కానీ శంకరునికి సతీదేవికి సంతానం కలగలేదు. శివుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మము అయినవాడికి మరల పిల్లలు, హడావుడి ఎక్కడ ఉంటుంది? అటువంటి తత్త్వము కలిగిన శంకరుడు, దక్షప్రజాపతి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉండేవారు.

ఆ సందర్భంలో ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘసత్రయాగం చేశారు. ఎవరయితే ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉండేటటువంటి యాగామునకు సత్రయాగమని పేరు. అక్కడికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు. ఆ సభలోకి ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు. ఆయన కత్తిచేత కూడా నరకబడడు. ఆయన శరీరం అంత మంత్రభూయిష్టం. ఆయనను చూసీ చూడడంతోనే అందరూ లేచినిలబడ్డారు. కానీ బ్రహ్మగారు, భర్గుడు మాత్రం లేవలేదు. బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన లేవనవసరం లేదు. కానీ శివుడు బాహ్యమునందు దక్షప్రజాపతికి అల్లుడు. మామగారు పితృ పంచకంలో ఒకడు. దక్షుడు లోపలి వచ్చి సభలో లేవని వాళ్ళు ఎవరా అని చూశాడు. అల్లుడు లేవకపోవడం గమనించాడు. కోపం వచ్చేసింది. క్రోధంతో సభలో వున్న వాళ్ళందరినీ చూసి శంకరుని చూపిస్తూ ‘వీడు ఎవడు’ అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ వున్నవాళ్ళు లేచి ఈయన శివుడండీ అని జవాబిచ్చారు. వీనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? వీనిని పట్టుకుని శివుడు అని పిలిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా! యజ్ఞోపవీతం లేని వాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఉంది’ అన్నాడు.

[Image: DAKSA-SHIVA-CURSING-YAGAM.jpg]
భయంకరమయిన శివనింద చేశాడు. ఈవిధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటే నిజంగా మంగళం చేసేవాడు కాబట్టి ఆయన ఏమీ అనలేదు. ఆయనకు దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం. అపుడు దక్షుడికి ఇంకా కోపం వచ్చేసింది. ఇన్ని మాటలు అన్నా నీవు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు. కాబట్టి ఇవాళ్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులయందు నీకు హవిర్భాగము లేకుండుగాక’ అని శపించాడు. ఈవిధంగా దక్షుడు తన పరిధిని దాటిపోయాడు. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భ్రుగువుకు సంతోషం కలిగింది. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఎక్కడలేని కోపం వచ్చింది. శంకరుని పట్టుకుని ఇంతంత మాటలు అంటాడా? నేనూ శపిస్తున్నాను దక్షుడిని. దక్షుడు ఇవాళ్టి నుండి సంసారమునందు పడిపోవుగాక! కామమునకు వశుడగుగాక! అని శాపము ఇచ్చేశాడు. నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భ్రుగువుకు కోపం వచ్చింది. ఆయన లేచి ఎవరయితే ఈ భూమండలం మీద శంకరుని వ్రతమును అవలంబిస్తారో, అటువంటి వారిని అనుసరించి ఎవరు వెడతారో వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమిమీద తిరిగెదరు గాక! అని వేదం విరుద్ధమయిన స్థితిని వారు పొందుతారు అని శాపం ఇచ్చేశాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎదురువచ్చింది. కానీ శంకరుడు దక్ష సభలో జరిగిన సంగతి ఏమీ ఆమెకు చెప్పలేదు. కొన్నాళ్ళయి పోయింది. ఇపుడు ‘నిరీశ్వర యాగం’ అని కొత్త వ్రతం మొదలుపెట్టాడు. దానికి బృహస్పతి సవనము అని పేరు పెట్టాడు. దానికి ముందుగా వాజపేయం చేశాడు. వెళ్ళకపోతే ఏమి శాపిస్తాడో అని ఆ యాగామునకు అందరూ వెడుతున్నారు. అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయడం లేదు. శంకరుడి మీద కక్షతో చేస్తున్నాడు. దాంతో శ్రీమహావిష్ణువు, బ్రహ్మగారు రాలేదు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#33
ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. . ‘దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం’ అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగామునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదాం’ అంది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టింది. ‘కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు. అంది. అపుడు శంకరుడు ‘దేవీ, నీవు చెప్పినది యథార్తమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు. కానీ నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలుకరించరు. మాట్లాడరు. వాళ్ళు మనలను చాలా దారుణంగా అవమానిస్తారు. కాబట్టి బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు వాడు ఎంతగొప్పవాడయినా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. కాబట్టి వెళ్ళవద్దు’ అని చెప్పాడు. అపుడు ఆవిడ ‘నాకు వెళ్ళాలని అనిపిస్తోంది’ అంది. అపుడు శివుడు ‘అయితే నీవు వెళ్ళవచ్చు’ అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు.

వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరివారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభ వాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం వుంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురి దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్త బ్రహ్మాండములను కాల్చివేయ గల శక్తి గలది. ప్రమథగణములు చూశాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. ఇప్పుడు చెపుతున్నాను నీకొక మాట ‘ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారం లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమ పవిత్రుడయిన శంకరునిసాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. అందుకని నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను’ అని పద్మాసం వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది.
[Image: images-3.jpg]
ఆపైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నిటి లోంచి 'అనిలము'అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని యందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పై క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథ గణములకు ఎక్కడలేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి ‘రుభులు’ అనబడే దేవతలను సృష్టించి రుద్ర గణములను తరిమికొట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడయిపోయాడు. ఒక్కసారి లేచాడు. పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికే హడలిపోయారు అందరూ. వీరభద్రావతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడి కి ప్రదక్షిణం చేసి ‘తండ్రీ, నాకు ఏమి ఆనతి’ అని అడిగాడు. ‘సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి’ అన్నాడు శంకరుడు.

వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వచ్చేస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య ‘ఉపద్రవం వచ్చేసింది’ అనుకుంది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. ‘ఆనాడుసభలో శంకర నింద జరుగుతుంటే కళ్ళు ఎగుర వేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు’ అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు. అప్పుడు భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. ‘పూష’ అనే సూర్యుడు ఉన్నాడు. ‘ఏమయ్యా, నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్దగ నోరు తెరచి నవ్వావు. ఇప్పుడు నీకు శిక్ష చూడు’ అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండుదవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూతమయిపోయి వుంది. ఎలా త్రుంచాలా అని ఆలోచించాడు. ‘ ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్న పశువు శరీరమును ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను అని గుండెల మీద కుడి కాలు వేసి తొక్కిపట్టి తోటకూర కాడను తిప్పేసినట్లు కంఠమును తిప్పేసి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పారవేశాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించిన వాడు లేడు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి. లేకపోతే పాడైపోతాము. అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, పాపకర్మ చేశాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు’ అని అడిగారు.
[Image: C5b-Kg63-WUAMx-JBg.jpg]
అపుడు బ్రహ్మగారు ‘పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం ఉంది. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో వాని దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పదిపొండి. ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ళమీద పడిపోతే మరల రక్షిస్తాడు’ అని సలహా చెప్పాడు. అపుడు వాళ్ళు ‘మాతో నీవు కూడా రావలసింది’ అని ప్రార్థించారు. ‘సరే పదండి’ అని బ్రహ్మగారు వీరిని తీసుకొని కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా, తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృస్టి,స్థితి,లయ ఈ మూడూ నీయందు జరుగుతుంటాయి. తెలియనటువంటివారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు’ అన్నారు బ్రహ్మగారు. మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. ‘మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను.’ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్ష ప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. అందుకని దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగాన్ని పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేతములు ఇస్తాను. కానీ ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి’ అని వరములను ఇచ్చేశాడు. దక్షప్రజాపటికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. ‘స్వామీ నీవు నన్ను దండించడాన్ని రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక! స్వామీ నన్ను మన్నించు’ అని నమస్కరించాడు. వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు శంకరుడు. తరువాత దక్ష ప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘స్వామీ నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అటుఅవంటి గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#34
ధ్రువోపాఖ్యానం:

భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది.
మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. అందునా భాగవతాంర్గతంగా వినడం అనేటట్టు వంటిది మరింత గొప్ప విషయం. అందునా ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ద్రువచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.

ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపమును ఒక పురుష స్వరూపమును సృష్టి చేశారు. వారే స్వాయంభువమనువు, శతరూప. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు..

ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుచున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజయిన ఉత్తాన పాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి వుంది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. అపుడు సునీతి కొడుకయిన ధ్రువుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధ్రువుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. అపుడు ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. “నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు”. కేవలం అభిజాత్యము(అభిజాత్యము=మంచి కులమునకు చెందడం)తో ఈమాట అంటోంది.
సురుచి మరల అంది “నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవు అయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన(అధోక్షజుడు=వేనిని తెలియుటకు ఇంద్రియజ్ఞానము అసమర్థమైనదో ఆతఁడు) శ్రీమహావిష్ణువు పాదారవిందములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు.” అంది.
నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం వున్నది కాబట్టి ధ్రువుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని 'ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి ‘నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు వుంటే నీ తండ్రి మనస్సును మరల అలా మార్చగలవాడెవడో తెలుసా! అది నీఅంతట నీకు సాధ్యం కాదు. ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ(అంకసీమ=ఒడి స్థానము) నీవు చేరగలుగుతావు’ అని చెప్పింది..

అపుడు పిల్లవాడయిన ధ్రువుడు ‘అమ్మా అయితే ఇప్పుడే నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుడి గూర్చి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. ఇప్పుడు అక్కడికి లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చాడు. ‘నాయనా, నీవు ఎక్కడికి అలా వెడుతున్నావు?’ అని అడిగాడు. ‘నేను అడవికి వెళ్ళిపోతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు ధ్రువుడు. అపుడు నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ఆ ధ్రువుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. అపుడు ధ్రువుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. 'ఏ పెద్ద పదవిని కోరతావు?’ అని నారదుడు అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది, ఆయన గురించి తపస్సు చేస్తాను. ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను. వెడుతున్నాను’ అన్నాడు.

అపుడు నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొండుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్ళకి రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి అంతంత కష్టాలు పడినవారికి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.

అపుడు ధ్రువుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. కానీ నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అంది. నా మనస్సు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును(గాయము) మాన్పగలదు. అందుకని శ్రీహరి కనపడతాడా, కనపడడా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. అంతే! నేను వెళ్ళిపోతున్నాను” అన్నాడు. గురువు ఆ పట్టుదలను గుర్తించి “నాయనా! యమునానది ఒడ్డున నిరంతరమూ శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. తరువాత నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడు అని పట్టు పట్టెయ్యి. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానంగా తులసి తెచ్చుకో. స్వామి వారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.
నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు...

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#35
నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు.

ఐదేండ్ల పిల్లవాడయిన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. అపుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అపుడు స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి. అందుకే ద్వాదశినాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అంటారు.

ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా. ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. అపుడు స్వామి అన్నారు ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా... ధర్మమూ అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలము నక్షత్ర మండలము ఋతువులు సూర్య చంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువ మండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు.

అపుడు ధ్రువుడు 'అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకొని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలిగి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా వున్నాడు. నారదుడు ఉత్తనపాడుడిని ‘అంత బాధగా వున్నావేమిటి” అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయమును పొందింది’ అన్నాడు. అపుడు నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.

ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరములు పొంది వచ్చాడు అని కాదు ఉత్తానపాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.
ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.
రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది.
సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తర దిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్తా విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది.

తదనంతర కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది. ‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ద్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువ పథమై ఉంటాడు. మిగిలినవి అన్నీ కదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలుత అని అర్థం. జ్యోతిశ్చక్రము నందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు నక్షత్రంలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము.

ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమయిన యక్షులతో విశేషమయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారయిన స్వాయంభువ మనువు కనపడి ఒకమాట చెప్పాడు. ‘నీవు పొందబోయే పావి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహరించి నువ్వు నీ ధనుస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో’ అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#36
ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధ్రువోపాఖ్యానం.

కుబేరుడు వచ్చి ‘నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడం నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను’ అన్నాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు ‘అపుడు నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా! నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా నీవారము చేత కటాక్షింపబడుగాక’ అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో ఆ వరమును ద్రువునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వారు నీల మేఘము వంటి శరీరము కలిగినవారి శంఖచక్రగదాపద్మములను పట్టుకుని తానూ అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. అపుడు వాళ్ళు “మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. అందుకని స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. మీరు విజయం చేసి విమానం ఎక్కండి’ అన్నారు.

అపుడు ధ్రువుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. ఆ విమానంలో కూర్చుని అనుకున్నాడు ‘ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితినా ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువ స్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ వుంటాను. ఎంత అదృష్టవంతుడిని’ అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరు అని ఆలోచించాడు. ‘దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో’ అనుకున్నాడు మనసులో. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. ‘నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు’ అన్నారు. ధ్రువుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీత వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడి లోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు.

ఇంతటి అద్భుతమయిన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#37
3. పృథు చరిత్ర: 

ఒకానొక సమయంలో ఈ దేశమును అంగరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా ధార్మికుడు. కేవలము ధర్మానుష్టానము తప్ప ఎన్నడు అధర్మము చెయ్యని వాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ సందర్భంగా దేవతలను అందరిని పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు. ఆ రోజులలో స్వాహా అంటూ ఆ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని హవిస్సును అగ్ని ముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఒక్క దేవత రాలేదు! ఏ దేవతా రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు. ‘ఎందుచేత ఇలా జరిగింది’ అని ఋషులను అడిగాడు.

అపుడు ఋషులు ‘వేదము స్వరప్రాకటము. మా స్వరమునందు దోషము లేదు. కానీ వారు రావడం లేదంటే వారు నీయందు అప్రసన్నులై ఉన్నారు. అందుకు నీలో ఏదో దోషం ఉంది ఉండాలి. కానీ నీ చరిత్రను పరిశీలిస్తే నీయందు ఎక్కడా దోషం కనపడడం లేదు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి’ అన్నారు. ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకు సంతానం లేదు. అందుచేత యజ్ఞములో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. అపుడు ఋషులు ‘నీకు ఇప్పుడు ఉత్తరక్షణం సంతానం కలగాలి. గతజన్మలో నీవు చేసిన పాపములు ప్రతిబంధకంగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకమును తీసివేయాలి. అందుకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. దానికి మేము యాగం చేస్తాము. ఆ యాగము చేత శ్రీమహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానం కలుగుతుంది’ అన్నారు.

అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతికొరకు యాగం చేశాడు. యాగం పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించ చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండం లోంచి ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ‘అంగరాజా, ఈ పాయస పాత్రలో వున్న పాయసమును నీ ధర్మపత్ని చేత తినిపించు. అపుడు నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది’ అని చెప్పాడు. పాయస పాత్ర తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీథ. ఆవిడ భర్తృ సంగమము చేతనే సంతానమును పొందింది. తేజస్సు అంగరాజు తేజస్సే. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేక పోయింది? అనగా ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలుగకుండా చేసింది. ఇపుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇపుడు సంతానం కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్ర శుద్ధి జరుగలేదు. క్షేత్రమునందు దోషం ఉన్నది. ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావము కలిగినటువంటి వాడు జన్మించాడు. వానికి ‘వేనుడు’ అని పేరు వచ్చింది. జన్మతః వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలాకష్టం. వేనుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గరనుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదు. అతను వేటనుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు. ఆడుకుంటున్న పిల్లలను బడిత పుచ్చుకుని వారు చచ్చిపోయేవరకు కొట్టేవాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఈయన అలా చెపుతుంటే కొడుకు కనుబొమలు ఎగురవేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు. మరల తెల్లవారున లేవడం పాపకృత్యములు చేయడం! ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. ఒకరోజు భార్య, కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు మాత్రం నిద్ర పట్టక ‘నా జీవితమునకు ఏమి సార్ధకత? నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహానమును అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడయినా నన్ను ఉద్ధరించాలి. నాకు ఇంత దుష్దుడు పుట్టాడు. ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత? సింహాసనం ఉంటే ఎంత? రోజూ వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. అనుకుని విరాగియై అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురమును, భార్యను, బిడ్డను విడిచి పెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు. వారు ఆయన తల్లిగారయిన సునీథతో మాట్లాడి వేనుడికి పట్టాభిషేకం చేశారు.

వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ అటు క్రూరుల వైపునుండి బాధ. యజ్నయాగాడి క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు. ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. ‘వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. కాబట్టి నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను’ అంది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు. ఎప్పుడయితే ఓషధీశక్తి ఉపసంహారం అయిందో వెంటనే వచ్చే ఫలితం ప్రతి వాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రాదు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగిపోయింది. దొంగతనములు పెరిగిపోయాయి.

ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీ తీరంలో సమావేశం అయ్యారు. రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకోని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. ‘రాజా, నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో’ అని చెప్పారు. అపుడు వేనుడు ‘అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగిరిపోతాయి’ అన్నాడు.

అపుడు ఋషులు ఇక అతడు మారాడు అనుకున్నారు. ‘వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు.’ అనుకున్నారు. అపుడు ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచ్చిపోయాడు. అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీథ గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వేనుడి శరీరమును కాపాడింది. అందుకని ఆశరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు. ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేదు. అప్పుడు ఋషులు అన్నారు ‘ఇప్పుడు మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. ఇపుడు మనం మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి రాజు సంతానమును తీసుకురావాలి’ అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. కానీ క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు కానీ వారి వాక్కుకు వాడు మాత్రం మారలేదు. ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి తపశ్శక్తితో మథనం చేస్తే పాపము పైకి రావడం మొదలు పెట్టింది. అందులోంచి బాహుకుడు అనబడే ఒక నల్లటి వాడు పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగి జుట్టుతో పుట్టుకొచ్చాడు. ‘నేను ఏమి చేయాలి’ అని ఋషులను అడిగాడు. అపుడు ఋషులు వానివంక చూసి ‘వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకొని నీవేమీ చేయవద్దు అన్నారు. ఇపుడు మరల సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే ‘నిషాదులు’ అని పేరు వచ్చింది.

ఇపుడు ఋషులు ‘స్వామీ, ఒక కొడుకు పుట్టడమును మేము అడుగుట లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము కాబట్టి శ్రీమహావిష్ణువా, నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా’ అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. ‘ఓహో మనం ప్రార్థన చేసిఅట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు’ అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు ‘అర్చిస్సు’ అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు.

ఆయన విష్ణు అంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకువచ్చారు. కుబేరుడు ఆయన కూర్చొనుటకు కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మేడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మేడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కట్టి పెట్టడానికి ఒర కావాలి. పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను ఇచ్చింది. సోముడు గుర్రమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును, ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు. అపుడు పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి ‘మహానుభావా ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది’ అన్నారు.

పార్వతీ దేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. ‘అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను’ అన్నాడు. పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. ‘స్వామీ నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను(నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపొయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉంది. నేను గోరూపంలో తిరుగుతాను. జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు’ అని అడిగింది.

అపుడు పృథు మహారాజు ‘ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు’ అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది. స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి. ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఇపుడు ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలం అయిపొయింది. ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. అందుకని పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది. విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాల సంతోషించారు. భూమిని పృథు మహారాజు పిండితే ‘పృథివీ’ అనే పేరు వచ్చింది. అందుకే జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#38
పృథు మహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఇంద్రుడిని దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి ‘వీర్యము’, ‘ఓజము’, ‘ఋతము’ అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది.

రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహ పాత్రలలో మూడు రకముల సురలని పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టి పాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణ అనే శక్తిని పిండుకున్నారు. యక్ష భూత పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చెసుకొని తమ పుట్టలనబడే పాత్రలలోకి ‘పురువులు’ ‘ఫలములు’ అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి వుంది మనకు రసపోషణం చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషంగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి ‘సరస్వతి’ ‘తృషద్వతి’ అనబడే రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధ యాగములు చేశాడు. నూరావడి చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి అన్నారు ‘గుర్రమును ఎత్తుకు పోతున్న వాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా ఆ బాణం వదిలెయ్యి అన్నాడు. బాణం వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి ‘విజితాశ్వుడు’ అని పేరు పెట్టారు.

మరల యజ్ఞం జరుగుతోంది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. ఈసారి మరల అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసిన వాడు అయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాప విముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడు కూడా అయి ఉంటాడు. కాబట్టి అతనిని వధించాలా వద్దా అని పృథువు అనుమాన పడుతున్నాడు. అపుడు అత్రి ‘నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వెయవలసింది’ అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. అపుడు ఇంద్రుడు ఆ రూపమును, గుర్రమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు ‘పాఖండరూపము’ అని పేరు. పాఖండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేదం విరుద్ధమయిన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. అపుడు ఋషులు ‘నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవ యజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఈ హోమంలో ఇంద్రుడిని పారేస్తాము’ అన్నారు.

అపుడు ఇంద్రుని మీద క్షాత్ర శక్తి, తపశ్శక్తి రెండూ కలిసిపోయాయి. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆయన అన్నారు ‘మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి వున్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే’ అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరంగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనం దిగి ‘పృథూ, ఇప్పటికి నీవు 99 అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా? 99 అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు. అనగా నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయిపోదువు. ఇంద్రుడి మీద బాణం వేయడంలో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గురించావా? నీయందు జ్ఞానము కలగాలని. అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ అతని చర్య పైకి దోషంగా కనపడుతోంది. ఇందుకని నీవు బాణం వెయవలసింది ఇంద్రుని మీద కాదు. నీకు బోధ చేయడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపం నుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేస్తున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. ఇపుడు నీవు నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనం చెయ్యి’ అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.

పృథు మహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

ఇందులో అర్చన భక్తికి పృథు మహారాజు గొప్పవాడు. పృథు మహారాజు జీవితంలో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది. ఇప్పుడు శ్రీమహా విష్ణువు ‘పృథూ, నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. అడిగితే పృథు మహారాజు ‘స్వామీ, నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరాలు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడం వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు’ అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజా నిష్ఠ అంటే.! అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.

ఒకనాడు సత్రయాగం చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందనాది మహర్షులు క్రిందికి దిగారు. మహా పురుషులయిన వారు నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు. సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి ‘స్వామీ, మేము సంసారమునందు వున్న తిన్గారులము. మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి’ అని ‘బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత’ అని అడిగితె సనక సనందనాదులు ‘ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నాడో అటువంటి వాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు’ అని చెప్పారు. వాళ్లు ఇంకా ఇలా అన్నారు ‘గృహస్థాశ్రమంలో ఉంది చాలా కాలం పాపకర్మల యందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగని వాడు జీవితం తరించదానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగియా నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో సేహం పెట్టుకో. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామ యోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునండు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతావు. సాయుజ్యము కలుగుతుంది’ అన్నారు.

సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణించి ఆశ్రమ వాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథువికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వ ముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేశాడు. ఈవిధంగా పృథు మహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేతూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.

ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభాఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథు మహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణ అయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానా రాజ్యం కావాలని పృథు మహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథు మహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారంలో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించే తత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియని వాడు కూడా ఇటువంటి పృథు చరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వ పాపములు నశించి శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహంతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#39
పురంజనోపాఖ్యానం:

భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్త్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్త్వమును మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేమిటో చాలా భయంకరంగా వుంది – ఇదంతా తమకు అందదని అంటారు. అందుకని ఋషులు బోధ చేసేటప్పుడు ఆ తత్త్వమును కథతో కలిపేస్తారు. నారదుడు ప్రాచీనబర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానమును వివరించాడు. ప్రాచీన బర్హి కేవలము ఈ శరీరమే శాశ్వతము అనుకొని, తాను భూమిమీద శాశ్వతంగా ఉండి పోతాననుకొని తానూ ఎటువంటి మార్గములో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకొని ఒక రకమయిన అజ్ఞానంలో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడయిన నారదుడు ప్రాచీన బర్హికి చెప్పిన కథకే ‘పురంజనోపాఖ్యానం’ అని పేరు. పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నిటా తిరిగాడు. కానీ ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణ కొసను ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అపుడు అందులోనుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండుమంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు. పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడు అని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు. అపుడు ఆమె ‘ఏమో నాకూ తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటూ ఉంటాను. నువ్వు మంచి యౌవనంలో ఉన్నావు. నా పేరు ‘పురంజని’, నీపేరు పురంజనుడు. అందుకని నీవు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని. ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది. ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది.

ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. పురంజనుడు అంటే ఎవరో కాదు, మనమే. మనకథే అక్కడ చెప్పబడింది. పురంజనుడు కోటకోసం వెదుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగమునందు వ్రేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అనగా ఎనాతికయినా శ్మశానములో చేరవలసినటువంటి శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్లేసరికి ఒక అందమయిన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరములో గల తల. శరీరమునకు పైన చక్కటి ఒక అందమయిన తలకాయ ఉంటుంది. దానిమీద ఉన్న వెంట్రుకలే పూలలతలు. చేతులు కాళ్ళు ఇవన్నీ అగడ్తలు. లోపల ఉన్నటువంటి ఇంద్రియములు భోగస్థానములు. లోపల రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయ స్థానము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. దానిమీద మనం రాత్రివేళ నిద్రపోతాము. అనగా ఇంద్రియములు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. అప్పుడు మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది. 

పురంజని ఎదురువచ్చి తనను వివాహం చేసుకోనమన్నది. అపుడు పురంజనుడు ఆమెను నీవు ఎవరు అని ప్రశ్నించాడు. ఆవిడ నాకు తెలియదు అంది. ఆవిడ బుద్ధి. ఆవిడని అయిదు తలల పాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచ ప్రాణములు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి అయిదు ప్రాణములు. ఈవిడతో పాటు 11మంది భటులు వచ్చారు. వారే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు. ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక వున్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడ వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు చేసుకుంది. ఆవిడ ఒక మాట చెప్పింది ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉన్నాయి – అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నీవు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది. 

మనం అందరమూ అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారములు. పనులు చేయడానికి మనం అందరం ద్వారంలోంచే కదా బయటకు వెళతాము. జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున వున్న రెండు ద్వారములే ఈ రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళతో జీవుడు బయటి ప్రపంచమును చూసి దానితో సమన్వయము అవుతూ ఉంటాడు. ఒకటవ ద్వారము పేరు ‘ఖద్యోత’, రెండవ ద్వారము పేరు ‘ఆవిర్ముఖి’. అవి ఎంత చిత్రమయిన పేరులో చూడండి. ఈ రెండు ద్వారములలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకొక్క స్నేహితుడితో వెళతాడు. ఒకడు ‘ద్యుమంత్రుడు’, రెండవ వాని పేరు ‘మిత్రుడు’. ‘ద్యు’ అంటే కాంతి. మిత్రుడు అంటే సూర్యుని పేరు. మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురూ వున్నపుడు మాత్రమే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకుని ‘విభ్రాజితము’ అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకమునంతటిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి రెండూ రెండు ద్వారములు.

క్రిందను మరో రెండు ద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు ‘నళిని’, ‘నాళిని’. ఈరెండు ద్వారముల నుండి బయలుదేరినపుడు ‘అవధూతుడు’ అనే స్నేహితుడితో వెడతాడు. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు. వాయువు. వాయువు అనే స్నేహితునితో ‘సౌరభము’ అనే దేశమునకు వెళతాడు. అనగా ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు. సౌరభము అంటే వాసన. ఈవిధంగా అవధూతుని సాయంతో నళిని, నాళిని గుండా సౌరభము అనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. మూడవది ఒకటే ద్వారం. దీనిపేరు ‘వక్తము’ నోరు. ఈ ద్వారంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేస్తాడు. ఆయన పేరు ‘రసజ్ఞుడు’. ఒకోసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు. ‘విపణుడు’ అనే ఆయనను పిలిచి ఆయన భుజమ్మీద చేయివేస్తాడు. ‘రసజ్ఞుని’తో వెళ్ళినప్పుడు ‘బహూదకము’ అనే దేశమునకు వెళతాడు. ‘విపణుడి’తో వెళ్ళినప్పుడు ‘అపణము’ అనే దేశమునకు వెడతాడు. రసజ్ఞుడితో వెళ్ళడం అంటే పండుకాయ అన్నం పులిగోర చక్రపొంగలి మొదలయినవి నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకొనుట. విపణుడితో వెళ్ళినపుడు ‘ఆపణం’ చేస్తాడు. ఆపణం చేయడం అంటే మాట్లాడడం. పనికిమాలినవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వర సంబంధమయిన విషయములు తప్ప మిగిలినవి అక్కర్లేని వన్నీ మాట్లాడతాడు. 

కుడిపక్కన ద్వారం ఉంది. దీనిపేరు ‘పితృహు’. ఇది కుడిపక్క చెవి. ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటకు వెళ్ళాలి. ఆయన పేరు ‘శృతిధరుడు’. అనగా వేదం. దీనితో వెళ్ళినపుడు పాంచాల రాజ్యమునకు వెడతాడు. అనగా వేదములో పూర్వభాగమయిన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు. చాలాకాలమయిన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమ చెవిద్వారం లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా శ్రుతిధరుడి మీదనే చేయి వేసుకుని బయటకు వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యమునకు వెళతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గ. సుఖములను కోరుకోడు. అది వేదము ఉత్తర భాగము. అందుకని ఎడమ చెవి ద్వారంలోంచి వెళ్ళినపుడు మోక్షమును కోరతాడు. ఆ తర్వాత ఉత్తరమునుండి వెళ్ళే ద్వారమునకు ‘దేవహూ’ అని పేరు. అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగంలో ఒక ద్వారం ఉంది. అదే మూత్ర ద్వారం. దాని పేరు ‘దుర్మదుడు’ అక్కడ మదమును కల్పించే ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళినపుడు దుర్మదుని భుజమ్మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును చేరతాడు. ఆ సామ్రాజ్యము పేరు ‘గ్రామికము’ పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు. అందుకని గ్రామికమయిన దేశమునకు వెళతాడు. 

పడమట అనగా వెనకభాగమందు ఒక ద్వారముంది. అది మలద్వారము. దాని పేరు ‘లుబ్ధకుడు’. అంటే ఉన్నదానిని బయట పెట్టని వాడు. లోపలే కూర్చుని వుంటుంది. బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది. అందుకని దానిపేరు ‘వైశసము’. అలా రెండు రకములుగా వెళుతుంది. జీవుడు నేను వెళ్ళను అని ఈ పురమును పట్టుకు కూర్చుంటాడు. ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు. అంత పెచీపెట్టి తన శరీరం మీద భోగముల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరంలో అధోభాగమున ఉన్న అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనే భయంకరమయిన నరకంలో యాత్ర మొదలుపెడతాడు. 

ఇన్ని ద్వారములు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందఱో ప్రజలు ఉన్నారు. అందులో ఇద్దరు కళ్ళులేని వాళ్ళు ఉన్నారు. వారు పుట్టుకతో అంధులు. పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాడు. ఒకాయన భుజమ్మీద చేయి వేస్తె ఆయన తీసుకువెళుతూ ఉంటాడు. కళ్ళు లేని వాడు. ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. ఆయన పేరు ‘దిశస్మృత్’. రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి. ఇంకొక అంధుడి మీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులకు కన్నములు ఉండవు. వాటిని ఏమి చెయ్యమంటే దానిని చేస్తూ ఉంటాయి. అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానె బంధింపబడుతూ ఉంటాడు. అందుకని ఇద్దరు గుడ్డివాళ్ళతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు ‘విషూచుడు’ అనబడే వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒకరోజున గుర్రం ఎక్కాడు. దానికి తన పక్కన 11మంది సేనాపతులను పెట్టుకున్నాడు. ఇవి పది ఇంద్రియములు, ఒక మనస్సు. వాటికి ఒకటే కళ్ళెం. ఒకడే సారధి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి, చంపకూడని వాటిని కూడా చంపేశాడు. అనగా తాను చెయ్యవలసిన, చెయ్యకూడనివి అయిన పనులను చేశాడు. చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగబట్టి ఇనుపకొమ్ములు ధరించి కూర్చున్నాయి. అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ‘అయ్యో నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాను. బాగున్నావా? అన్నాడు. ఆవిడ అలకా గృహంలో ఉంది. అనగా మరల సాత్విక బుద్ధియందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దది అయిపోతోందేమోనని అనుమానం వచ్చింది. అనగా మెల్లిమెల్లిగా బుద్ధియందు స్మృతి తప్పుతోంది. వీడికి అనుమానం రాగానే ఒకరోజున స్నానం చేసి ‘ఉజ్వలము’ అనే వస్త్రం కట్టుకుని వచ్చింది. ‘అబ్బో, మా ఆవిడకి యౌవనం తరగడం ఏమిటి’ అనుకున్నాడు. మళ్ళీ కౌగలించుకున్నాడు. ‘ఉజ్వలము’ అంటే తన బుద్ధియందు తనకు భ్రాంతి. అయినా ‘నా అంతవాడిని నేను’ అంటూ ఉంటాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#40
ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’ (కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. 
ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. అపుడు ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు.కానీ నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. అపుడు నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. కానీ ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు. 

తరువాత కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమంది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకునే అప్పుడే వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో నాన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తమ భార్యను తలుచుకుంటూ. సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడ ఈకోట శిధిలం అయిపొయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది. 

ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి” అని నారదుడిని అడిగాడు. అపుడు నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పాడడం ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.


గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 1 Guest(s)