Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#1
శ్రీమదాంధ్ర మహా భాగవతం
[Image: IMG-20190803-180221.jpg]
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారి ప్రవచనం
~~~~~~
ప్రధమ స్కంధము

శ్రీ పోతన భాగవత రచన

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.


వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.

వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధివిధానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.

పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమినిచేత వెతమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.

‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ!
వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం!!


పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశాములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధంగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వారు తప్ప మరెవ్వరునూ పురాణమును చెప్పలేరు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రమునొకదానిని పెద్దలు ప్రతిపాదించారు.

‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!

‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!!


(దేవీభాగవతం 1-3-21)

టీకా:
'మ'ద్వయం – మకారంతో రెండు పురాణములు ప్రారంభం అవుతాయి. అందులో ఒకటి 'మార్కండేయ పురాణము', రెండవది 'మత్స్య పురాణము'.
'భ'ద్వయం – భ అనే అక్షరంతో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అవి 'భాగవత పురాణము', 'భవిష్య పురాణము'.
'బ్ర'త్రయం – 'బ్ర’ అనే అక్షరంతో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అవి 'బ్రహ్మ పురాణము', 'బ్రహ్మాండ పురాణము', 'బ్రహ్మవైవర్త పురాణము'.
'వ'చతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అవి 'వరాహపురాణము', 'విష్ణు పురాణము', 'వామన పురాణము', 'వాయు పురాణము'.
'అనాపలింగకూస్కా'ని – అని అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకూ ఒక్కొక్క పురాణం వస్తుంది. అవేమిటంటే...
అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.

వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు.

పురాణ వాజ్ఞ్మయమునంతటిని కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుకచేతనే అపారమయిన జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే – ఆయన మంచి నిండు యౌవనములో ఉండే రోజులలో తండ్రిగారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అపుడు ఆయన ‘నాకు వివాహం అక్కరలేదు...ఈలోకం అంతా దుఃఖభూయిష్టమయిపోయింది. నేను ఆనందమును అనుభవించాలి. అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను’ అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకనుంచి వ్యాసుడు పుత్రునిమీద వున్న కాంక్షచేత ‘హాపుత్రా హాపుత్రా’ అని అరుస్తూ వెంటవస్తున్నారు. శుకుడు ‘ఓయ్’ అనలేదు. అంతటా ఆత్మతత్త్వమును చూడడానికి అలవాటయిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో వున్న చెట్లు అన్నీ ‘ఓయ్ ఓయ్’ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యౌవనమునందే ఒంటిమీద బట్టలేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు.

శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్కనుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటిమీద వస్త్రం కట్టుకోకుండా లేచివచ్చి శుకునికి నమస్కరించారు. అపుడు శుకుడు నిండు యౌవనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అపుడు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కుమారుడు యౌవనంలో ఉన్నాడు. నేను వార్ధక్యమునందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి ఈ తేడా’ అని వ్యాసుడు అప్సరసలను అడిగారు. అడిగితే అప్సరసలు అన్నారు – ‘నీ కుమారునికి స్త్రీ పురుష భేదము తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీపురుష భేదము తెలుసు. అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము’ అని బదులు చెప్పారు. అదీ శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే!

శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరోకరిచేత చెప్పించకుండా శుకునిచేత మాత్రమే చెప్పించారు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్ధత చూశాడు. ‘కుశ’ అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంత సేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే – కర్మ చేయగా చేయగా ఇంటిని తుడుచుకుకుని తుడుచుకుని బూజులన్నీ దులుపుకుని పండగ వచ్చే ముందు శుభ్రపరుపబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చొనడానికి, సత్కర్మాచరణమును పూనికతో సంతోషముతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధియందు ఆనందప్రదమయిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానివలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానముచేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడం అనేదానికి దర్భాలతో సంబంధం ఉంది. తిరగేస్తే – ‘శుక’ అయింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణము లేదు. అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యడానికి కర్మలేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడు. ఆయన నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు. బ్రహ్మముతో కలిసిఉంటాడు. బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనందస్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన ‘కౌపీనపంచకము’ అని ఒక పంచకము చేశారు. అందులో – ‘అసలు కౌపీనము పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ వున్నాడు’ అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగియై ఈశ్వరుని పాదారవిందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వానికి ఇంద్రపదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు.

అటువంటి మహానుభావుడయిన శుకుడు నిరంతరమూ ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదయినా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవుపాలు పితకడానికి ఎంతసమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు వాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడయినా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి, వీరు ఫలానా వీరు ఫలానా అని గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ లోపలపెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమము తగ్గిపోయి లోకముతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని ఏడురోజులు భాగవతములు ప్రవచనము చేశాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
#3
భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది?
భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహేడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ‘ఎక్కడో ఏదో చెయ్యడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది’ అని అనుకున్నారు.

ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. ‘వేదరాశినంతటినీ విభాగం చేశాను. పదిహేడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది’ అని ఆలోచన చేశారు.

ఆ ఆలోచన చేస్తున్నప్పుడు మహానుభావుడైన నారదుడు వ్యాసునికి దర్శనం ఇచ్చారు.
మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడూ నారదుడే. భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడూ నారదుడే.
‘నారం దదాతి ఇతి నారదః’ – ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు. అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒకమాట చెప్పారు. ‘వ్యాసా, నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో, ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు. భారతమును రచించావు. కానీ భారతంలో కృష్ణకథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథకు కృష్ణ కథను అనుసంధానం చేశావు. అంతేతప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతున్నదో విశ్వము ఎలా సృష్టించబడిందో పంచభూతములు ఎలావచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై స్థితికర్తయై, ప్రళయ కర్తయై ఈలోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆ కారణం చేత నీమనస్సులో ఎక్కడో చిన్నలోటు ఏర్పడింది. ఇది పూర్తిచేయడానికి నీవు భాగవత రచన చెయ్యి’ అని ప్రబోధం చేశారు.

అపుడు వ్యాసభగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు. ఇంత చేసిన తరువాత, ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తనజన్మ సార్ధకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మలనుండి మనస్సు ఏది పట్టుకొనక పోవడం వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడం వలన మనుష్య జన్మకు సార్ధకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు.

అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు.అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగినవ్యక్తి. అందుకని తన కుమారుడయిన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు.

ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –

‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి’

నూరు సంవత్సరములు కాని పూర్ణంగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు యికలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవ్వరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడూ రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని యెడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను వుండీ మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధం ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునందు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#4
శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాడు – ’ఈ శరీరం చచ్చిపోతుందని బెంగలేదు’ అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా కల్పములు మారిపోయినా యుగములు మారిపోయినా శరీరము పడకుండా ఉంటుందా? ఉండదు. పడితీరుతుంది. ధ్రువుడంతటివాని శరీరం పడిపోయింది. ఎవని శరీరం అయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదు పడదు అని ఒక అసత్యమునందు నీవు ఒక పూనిక పెట్టుకొని ఉన్నావు. ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటున్నావు. ఈ శరీరం ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నావు. వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి ’నేను’ అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. ’నేను’ అనబడునది శరీరం అయితే అది చచ్చిపోయి తీరుతుంది. కాబట్టి ఉన్న సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉంటుంది. మరణభయంలో సమస్తమయిన అజ్ఞానం ఉంది. అవిద్య ఉంది. భయం ఉంది. ఏది పట్టుకుంటావు? సత్యమును పట్టుకో. అది అంత తేలికయిన విషయం కాదు. భాగవతమును వినినవాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకొనగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. అందుకని ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.

ఏడురోజులు భాగావతమును వినిన పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. కానీ ఆ ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యంతో ఒక మాట అన్నాడు. – ’శరీరమునకు మరణం వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను’ అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము.

’మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ (సౌందర్యలహరి – 97) అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా మాయలో తిరుగుతూనె ఉన్నాము. ఈ సత్యమును భాగవతం ఆవిష్కరిస్తోంది. అటువంటి భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. పెద్దలు అంటారు –

’నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’

భాగవతమును వినేవాళ్ళు "భాగవతమును నేను వింటున్నాను" అని ఎప్పుడూ వినకూడదు. 'పిబత భాగవతం' – భాగవతమును తాగేసెయ్యాలి. కానీ ఇదెలా సాధ్యం? భాగవతమును తాగడం ఎలా కుదురుతుంది? తాగడమును నోరు అనబడే ఇంద్రియం చెయ్యాలి. వినడం అనబడే దానిని చెవి అనే ఇంద్రియం చెయ్యాలి. కాని చెవి అనే ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది. నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నదనుకోండి – అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ వున్నా నోరు పుచ్చుకోను అనదు. పుచ్చేసుకుంటుంది. తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూడా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతంలో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి తాగేసెయ్యి. విడిచిపెట్టావంటే జారి క్రిందపడిపోతుంది.

ఏమిటి దాని గొప్పతనం?
వేదములనే కల్పవృక్షం ఒకటి ఉన్నది. వేదములను సేవించడం చేత మీకు కావలసిన సమస్తమయిన కోర్కెలను మీరు తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి. ఉపనిషత్తులనే జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తులచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దీనిని చిలక కొట్టింది. ఎవరా చిలక? శుకబ్రహ్మ. శుకుడు తననోటిద్వారా ప్రవచనం చేశారు. దేనిమీదా అపేక్షలేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. అందుకని ఆ భాగవతమును తాగేసెయ్యి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉంది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. అందుకని ఈ భాగవతం అంత గొప్పది.

ఇటువంటి భాగవతమును సంస్కృతంలో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనం చేశారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. 

మనకి ముగ్గురు రాజులు ఉన్నారు. వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉంది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ దిక్కుమాలిన రాచరికం వద్దు అని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసుగారు అయిపోయారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి అవతలపారేసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురూ జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు.

పోతనగారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణంగా ఒకమాట వింటూ ఉంటాము – ’ఏదోనండి, రామాయణం చదువుకుందాం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడండీ ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతం పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండీ – కుదరడం లేదు – నాకూ చదవాలని ఉంటుంది’ అంటూ ఉంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనం చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరినదిలో స్నానం చేసి ఒక సైకతం మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. అప్పుడు వారికి రామచంద్రమూర్తి సాక్షాత్కారం అయింది. ’పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. అందుకని నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి’ అన్నారు. వెంటనే పోతనగారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారు – ’అయ్యా మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!’

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
బలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా?

ఎంత వినయముతో చెప్పారో చూడండి! ’నేను భాగవతమును రచించడం ప్రారంభంచేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాను” అన్నారు ఎంత గొప్ప మాటయో చూడండి!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#5
పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!


పోతనగారి శక్తి ఏమిటో పోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.

పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెత్తే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయము చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు.
ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –

'కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా దింభకున్'

అన్నారు. 

ఎవరు ఈ మహానందాగనా? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో

’కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’

ఎదురుగుండా ఉన్న భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టాము అనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు కాబట్టి ఇపుడు శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ ఎందులోంచి వచ్చాయి? అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. కాబట్టి ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.

పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. ’ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యం పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి ’మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. తరువాత కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంతగొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. అదీ పోతనగారంటే! ఆ మహానుభావుడు అంత నిరాడంబరుడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
#6

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన!
విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేతపరతు!!


ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి! భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. కానీ ’మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన దానిని, నాకు శారదాదేవి ఏది కృపచేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఆయన అంటారు –

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!


విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

’అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.

’అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఎన్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికి దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యే అని ఏడిచేటటుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.
’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి
చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.
ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

’రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.
’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.
అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు 'ఓంఐంహ్రీంశ్రీం' – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు. మీరు అస్తమానూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఏమిటి? ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును ఇచ్చారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
#7
భాగవతం అనేది సామాన్యమయిన గ్రంథము కాదు.

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై!!


దీని స్కంధము చూస్తే లలితము. కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టుబాగా పెరగాలంటే చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తారు. అపుడు చెట్టు బాగా పెరుగుతుంది. శుకబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమయిన స్తోత్రము. అపారమయిన మంజులమయిన మాటలతో శోభిస్తూ ఉంటుంది. ఈ భాగవతము ఎవరు చదువుచున్నారో వారికందరికి, మంచిమనస్సుతో ఉన్న వారికి అర్థమయ్యే స్వరూపము కలిగినది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడిన కల్పతరువు. భాగవతమనేది వేరొకటి కాదు. సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్లే, భాగవతంలో ఒక పది పద్యములు వచ్చినట్లయితే అటువంటి వ్యక్తి కల్పవృక్షమును జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్క. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతనగారు గొప్పగొప్ప ప్రయోగములన్నిటిని, పద్యములుగా తీసుకువచ్చి పెట్టేశారు. వాని కోరిక ఎందుకు తీరదు? అందుకని భాగవతము అంత గొప్పది! అటువంటి భాగవతమును శుకబ్రహ్మ వివరణ చేశారు.

వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒకమాట చెప్పారు.
’వ్యాసా లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలు అందరికి కూడా తెలిసిన విషయములు రెండు ఉన్నాయి. అవి అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవరినీ తీసుకువచ్చి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కరలేదు. అందరికీ డబ్బు దాచుకోవడం తెలుసు. డబ్బు సంపాదించుకోవడం తెలుసు. ఇంకా బొడ్డూడదు కానీ రూపాయి ఎలా సంపాదించాలనే తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కారబలం తక్కువగా ఉంటుంది. అందునా కలియుగంలో ఉంటే వాళ్ళది అల్పాయుర్దాయం. బుద్ధి బలం చూస్తే తక్కువ. ప్రచోదనం ఎప్పుడూ అర్థకామములయందు మాత్రమే ఉంటుంది’.

వానికి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వచ్చేసరికి వానికి మీరు పెళ్ళి చేయలేదనుకోండి – మీరు వానికి పెళ్ళి చేయలేదనే విషయమును వాడు మీకు తెలిసేలా చేస్తాడు. వాడు అమ్మ దగ్గరికి వచ్చి ’నా ఈడువాడు – వాడికి అప్పుడో కొడుకమ్మా అంటాడు’. ఇదివాడు ’అమ్మా మీరు నా సంగటి పట్టించుకోవడం లేదు’ అని తల్లికి పరోక్షంగా చెప్పడమే! ఇంకా అశ్రద్ధ చేశారనుకోండి – ఎప్పుడో ఒకరోజు పెళ్ళి చేసేసుకొని మీ దగ్గరకి నమస్కారం పెట్టడానికి వచ్చేస్తాడు.

అందుకని ’మానవుడు ఎప్పుడూ అర్థకామములయందు తిరుగుతూ ఉంటాడు. అర్థకామములను గురించి ఎవరికీ ఏదీ ప్రత్యేకముగా బోధ చేయనక్కరలేదు. భగవత్సంబంధమును గురించి, భక్తి గురించి మాత్రం బోధ చెయ్యాలి’ అని నారదుడు చెప్పడం కొనసాగించాడు.

’రోగం ఎక్కడ పుట్టింది?’ అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. డాక్టరుగారు తినవద్దని చెప్పిన పదార్థములను తినడం ద్వారా మనిషి రోగమును పెంచుకుంటున్నాడు. అతను తన రసనేంద్రియములను నిగ్రహించలేకపోవడం వలన అతనికి అటువంటి స్థితి ఏర్పడుతోంది. రోగము వచ్చేస్తుంది. అని తెలిసినా సరే, శరీరమే పోతుందని తెలిసినా సరే, తినాలని కోరికను నిగ్రహించలేకపోయాడు. ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మలనుండి నిన్ను తరుముతోంది. డబ్బు పిచ్చి, ఇంద్రియముల పిచ్చి అలా తరుముతూనే ఉన్నాయి. వాటికి వశుడవు అయిపోతూనే ఉన్నావు. అయినాసరే ఒక బురదలో పడిపోయిన వాడు బురదనీటిని తీసుకొని స్నానం చేసేస్తే వాడు శుద్ధి అయిపోడు. నీవు ఇంద్రియముల చేత తరమబడి తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తినవాడివి, మరల ఇంద్రియములకు సంబంధించిన సుఖములనే శరీరమునకు ఇస్తుంటే నువ్వు ఇక ఎప్పుడూ ఉత్తమగతులు పొందలేవు. ఒంటికి పట్టిన బురదపోవాలంటే మంచినీటి స్నానము కావాలి. మంచినీటి స్నానము ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ఇక్కడ ప్రేమ వున్న అమ్మ స్వభావం కలవారు ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి. అందుకని ఆయన భాగవతం ఇచ్చారు.

నారదుడు వ్యాసునికి చెపుతున్నాడు – ’నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, వారికి రాజ్యములు ఎలా వచ్చాయో మున్నగు విషయములను గూర్చి వివరించి వ్రాశావు. అవి అన్నీ ఇప్పటి ప్రజలకు చాలాబాగా తెలుసు. ఇప్పటి వ్యక్తులు భారతము ఏమీ చదవకుండా దుర్యోధనుని కన్నా అహంకారముతో తిరగగలరు. ధృతరాష్ట్రునికన్నా బాగా పక్కింటివాడిది తెచ్చి దాచేసుకోగలరు. ’నీవు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గూర్చి ఏమీ చెప్పలేరు. భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో వీడు చేసుకున్న ఇంద్రియలౌల్యం వీనిని వచ్చే జన్మలో హీన ఉపాధులలోకి తీసుకుపోతుంది.’ భగవంతునికి ఏమీ రాగద్వేషములు ఉండవు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయిందనుకోండి. ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది. మీరు వినే వుంటారు.

వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే
వ్యర్థంబైచెడు వాక్ప్రవాహములచే వాత్సల్యచిత్తంబుచే
అర్ధజ్ఞానముచే మహద్భ్రమతచే హాస్యప్రసంగాలచే
స్వార్థంబే పరమార్థమై చెడుదు రీస్వార్థప్రజల్ శంకరా!! (శ్రీశంకర శతకము – ౮౦)


వాడికి కామం ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్బది ఏళ్ళు వయస్సు వచ్చేసిన తరువాత మంచి పంచె కట్టుకొని వచ్చాడనుకోండి – ’తాతయ్యా పెళ్ళికొడుకులా ఉన్నావు’ అని సరదాకి ఎవరయినా అన్నారనుకోండి – అంటే ’అమ్మా అలా అనకూడదు. పెళ్ళికొడుకులా ఉన్నాననకు. మిమ్మల్ని చూడగానే త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ఫలితం కనిపించే ఒక మంచి ఉపాసనాబలం పొందుతున్న వారినా ఉన్నారని అను – అది నా శరీరమునకు సరిపోతుంది. ఇంకా నేను పెళ్ళికొడుకునేమిటమ్మా’ అని అనాలి. కానీ వాడు అలా అనడు. వాడు ఏమంటాడంటే – 'నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు' అంటాడు. అంటే వాడికి కడుపులో ఎంతబాధ ఉందో చూడండి! వానికి ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడడం లేదు. ’నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే, సంబంధములు చూసి, తాతగారూ, మీరు చేసుకోండి అని పిల్లను తెచ్చి పెళ్ళి చేయవచ్చు కదా’ అని వీడికి కడుపులో బాధ! వృద్ధాప్యంలో ఒక విధమయిన ధూర్తతనం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికింకా వ్యామోహం ఉండిపోతుంది అపుడు శరీరములోంచి నిరంతరము చీము స్రవించే వ్రణములు బయలుదేరతాయి. అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి. అంతదూరంలో ఉండే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. ఎవరూ వాని దగ్గరకు వెళ్ళరు. ఎంతో బాధపడతాడు. అంత బాధపడ్డ తరువాత అప్పుడు కామం పోతుంది. ’నీవు వ్యాసుడవయినందుకు అంతబాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం ఉత్తరజన్మకు వెళ్ళకుండా ఆపేశక్తి వీళ్ళకి ఇవ్వాలి. వ్యాసా, నీవు ఏమి ఇవ్వాలో తెలుసా! భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు.’ వాడు తెలిసో తెలియకో వచ్చి భాగవతమును వినడం కాని, చదవడం కాని చేస్తే అంతమాత్రం చేత వీడు భాగవతం విన్నాడు అని వాని ఖాతాలో వ్రాస్తాడు. వాడు హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితమును అడ్డుపెట్టి వానిని మంచి జన్మవైపుకి తిప్పుతాడు. ’భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒకమంచిమాట చెప్పు. అంతేకాని నీవు మరల అర్థకామములను గురించే మాట్లాడితే కావ్యమునకు ఏమీ ప్రయోజనం ఉండదు. హరినామస్మృతిలేని కావ్యము వృథా. దాని వలన ఏవిధమయిన ఉపయోగం ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది. కానీ హరినామము చెప్పని కావ్యము, నీవు ఎంతగొప్ప అర్థములతో చెప్పినా అది తద్దినం పెట్టేచోటికి కాకులు వచ్చే రేవులాంటిది. అందుకని నీవు ఇప్పుడు భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విశేషములు, భగవద్భక్తుల కథలతో కూడిన విషయములను చెప్పు. భాగవతంలో అటువంటివి చెప్పు’ అని చెప్పాడు నారదుడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#8
శ్రీమదాంధ్ర భాగవతం - నారదుని పూర్వజన్మ వృత్తాంతము :

’వ్యాసా! నేను ఈవేళ ఎందుకు నారదుడుగా ఉన్నానో నీకు చెపుతాను. నా చరిత్ర వింటే నీవు తెల్లబోతావు’ అని నారదుడు తాను నారదుడెలా అయ్యాడో చెపుతాడు.
నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనంనుంచీ బాగా ఐశ్వర్యవంతులయిన బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితికి పెట్టడం మొదలగు పనులు చేసేది. తల్లి ఎక్కడికి వెడితే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ పిల్లవాడు బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు. వారు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ కొంతమంది సన్యాసులు చాతుర్మాస్యమునకని వచ్చారు. వస్తే అమ్మతోపాటు ఈ పిల్లవాడు కూడ అక్కడ ఉన్నాడు. రోజూ ’నీవు ఉదయముననే స్నానం చేసేసి, వాళ్ళకి పీటలు వెయ్యడం, దర్భాసనములు వెయ్యడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం, ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసినది’ అని యజమాని ఈ పిల్లవానికి చెప్పాడు.

దాసీ పుత్రుడైన నారదుడు రోజూ స్నానంచేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు. వాళ్ళు సన్యాసులు. సన్యాసులు అంటే లోకం అంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. వాళ్ళు ఆ పిల్లవాని దాసీపుత్రునిగా చూడలేదు. అయిదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవచూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టమును నారదునికి ఇచ్చేవారు. వాళ్ళు మహాభాగవతులు. వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషమును తినేవాడు. ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం, భగవంతుడిని అర్చన చేసుకోవడం, వేదవేదాంగములు చదువుకోవడం, వాటిని గూర్చి చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవాడు. ఆఖరుకి చాతుర్మాస్యమ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడయిన నారదుని పిలిచి –

అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నే గొలువగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతో గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్!!

ఆ పిల్లవానికి ఏమీ తెలియకపోయినా, ఏ తాపత్రయం లేకుండా మనస్సులో వాళ్ళమీద ఉన్న అపారమయిన భక్తిచేత అతడు వారిని సేవించగా – వారందరు కూడ కారుణ్యము అని చెప్పడానికి కూడ వీలు లేదు – మిక్కిలి వాత్సల్య చిత్తముతో నారదుని వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని వానికి కృష్ణ పరమాత్మమీద ద్వాదశాక్షరీ మహామంత్రమును ఉపదేశంచేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవానిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో, సత్యం ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇంతకాలం అటువంటి వారిని సేవించి, సేవించి ఉండడంవలన నారదునికి సత్పురుష సాంగత్యం కలిగింది.

సత్సంగత్వే నిస్సంగత్వం – నిస్సంగత్వే నిర్మోహత్వం!
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం – నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!!


అటువంటి సత్పురుషులతో తిరగడం వలన హృదయం అంతా పరిశుద్ధి అయిపోయింది. వెంటనే ఈయనకు మనసులోకి అందేసింది. చాతుర్మాస్యం అయిపోయింది. ఆ సన్యాసులు వెళ్ళిపోయారు. తాను లోపల ఆ శ్రీమన్నారాయణుని తలుచుకొని పొంగిపోతూ రోజూ అమ్మతో వెళ్ళేవాడు. ఒకరోజు చీకటిపడిపోయిన తరువాత గృహయజమానులయిన బ్రాహ్మణులు ఆమెను పిలిచి ’పెరట్లోకి వెళ్ళి ఆవులపాలు పితికి పట్టుకునిరా’ అని చెప్పారు తల్లిని. ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకుంది ఆవిడ చూడకుండా పొరపాటున దానిమీద కాలువేసింది. త్రాచుపాము ఆవిడని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. అప్పుడు పిల్లవాడు అనుకున్నాడు – ’ అమ్మయ్య, నాకు ఉన్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నది ఒకర్తి ఉండడం వలన నేను ఈ ఇంట్లో అమ్మతోపాటు తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను స్వేచ్ఛావిహారిని. అంతా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతాను” అని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి చివరకు ఒక మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్దపులులు తిరిగుతున్నాయి. క్రూరసర్పములు తిరిగుతున్నాయి. ఆయన అనుకుంటున్నాడు – ’నాకు ఏమిటిభయం! ఈలోకం అంతటానిండి నిబిడీకృతమయి శాసించే కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ నా స్వామి ఉండగా నాకు ఏ ఆపద జరగదు’ అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి విపరీతమయిన దాహం వేసింది. అక్కడ ఒక మడుగు కనబడింది. అక్కడ నీళ్ళు తాగి స్నానంచేసి ’ఇక్కడ నాస్వామి ఒకసారి నాకు సాకారంగా కనపడితే బాగుండును’ అని ఒక రావిచెట్టు క్రిందకూర్చుని ద్వాదశాక్షరీ మంత్రమును తదేకంగా ధ్యానం చేస్తున్నాడు. అలా ధ్యానం చేస్తుంటే లీలామాత్రంగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని దర్శనం అయింది. పొంగిపోయి పైనుంచి క్రిందకి మెరుపును చూసినట్లు చూశాడు. అంతే! స్వామి అంతర్ధానం అయిపోయారు. అపుడు అశరీరవాణి వినపడింది. ’ఈజన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టంచేత, వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణంచేత, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపమును అలా బాగా చూడాలి అని కోరుకుంటూ, నువ్వు నా గురించే చెప్పుకుంటూ, నా గురించే పాడుకుంటూ, నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మాన్ని అనుసరించి ఒకరోజున ఈ శరీరమును వదిలేస్తావు. అలా అదిలేసిన తరువాత నిన్ను గుప్తంగా ఉంచుతాను. ఒకనాడు నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకములయందు విహరిస్తావు. నీకీ కానుకను ఇస్తున్నాను’ అన్నాడు శ్రీమన్నారాయణుడు.

’ఆనాడు శ్రీమన్నారాయణున్ని దర్శనం చేస్తూ దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని, చెప్పుకుని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళిపోయాను. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తరువాత నారాయణుని నాభికమలంలోంచి మరల చతుర్భుజ బ్రహ్మగారు సృష్టింపబడ్డారు. మొట్టమొదట ప్రజాపతులను సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించారు. నాకు ’మహతి’ అను వీణను ఇచ్చారు. ఆ వీణ సర్వకాలములయందు భగవంతునికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములనంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నేను వైకుంఠమునకు వెళతాను. సత్యలోకమునకు వెళతాను. కైలాసమునకు వెళతాను. ఏ ఊరుపడితే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను. భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను. అదితప్ప మరొకటి నాకు రాలేదు.

వ్యాసా, నేను ఇవ్వాళ్టికి ఇంతటి వాడిని ఎందువల్ల అవగలిగాను? ఒకనాడు దాసీపుత్రుడనయిన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించిన జ్ఞానము ఇవ్వాళ నన్నీస్థితికి తెచ్చింది. రెండవజన్మలో బ్రహ్మకి కుమారుడను, నారదుడను అయిపోయాను. నీవు భాగవతమును, భగవత్కథను చెప్పగలిగితే శ్రద్ధగా విన్నవాడు ఉత్తరజన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు? ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని నీవు భగవద్భక్తి గురించి చెప్పవలసింది. దుర్యోధన ధృతరాష్ట్రులగురించి ఎందుకు చెపుతావు? చెప్పకపోయినా ప్రజలకందరకు వారిని గురించి తెలుసు. అందుకని భక్తి గురించి చెప్పు. భక్తికి ఆలవాలమయిన భాగవతమును రచించు’ అన్నారు.

అనగా ఆనాడు మహానుభావుడు వ్యాసభగవానుడు నారదుని మాటలు విని పొంగిపోయి ’నారదా ఎంతగొప్పమాట చెప్పావయ్యా! ఇప్పుడు నేను భగవంతుని గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తిగురించి, ఆయనను నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నీవు తరించిపోయినట్లు తరించిపోతారు. అటువంటి భాగవతమును రచన చేయడం ప్రారంభిస్తున్నాను’ అని ఆచమనం చేసి కూర్చుని వ్యాసభగవానుడు తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభం చేశారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#9

నారదభగవానుడిని వేదవ్యాసుడు ప్రార్థనచేస్తే ఆయన సలహామేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతమును రచించడం ప్రారంభించేశారు. దానిని మన అదృష్టవశాత్తు మన తెలుగువారయిన పోతనామాత్యులవారు ఆంధ్రీకరించారు.

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ!!


అని పోతనగారు ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. ఒక అద్భుతమయిన ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది.
అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరు కూడ దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. సత్రయాగము అనే యాగము ఒక విచిత్రమయిన యాగము. దీర్ఘసత్రయాగం అంటే చాలాకాలం పాటు కొనసాగే యాగం. దానిని నైమిశారణ్యంలో చేశారు. ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగము అని పిలుస్తారు. అటువంటి దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. దానికి అనువయిన ప్రదేశంగా నైమిశారణ్యమును నిర్ణయించుకున్నారు. అది విష్ణుభగవానుని శక్తి ప్రకటితమయిన క్షేత్రము. ఇరుసును ఆధారము చేసుకుని చక్రములు తిరుగుతూ ఉంటాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి (ఇరుసు) ఏ ప్రాంతమునందు శిధిలం అయిపోయిందో అటువంటి పరమ పవిత్రమయిన ప్రాంతమునకు నైమిశారణ్యము అని పేరు. ఆ నైమిశారణ్యములో చేసిన క్రతువు చాలా విశేషమయిన ఫలితమును ఇస్తుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహమునకు నోచుకున్న క్షేత్రము. అటువంటిచోట ఈ దీర్ఘసత్రయాగమును చేసినట్లయితే బాగుంటుందని శౌనకాది మహర్షులందరు కూడ ఈ యాగమును ప్రారంభం చేశారు. అక్కడికి సూతమహర్షి విచ్చేశారు.

ఒక కోయిల వచ్చిందనుకోండి – దానిని మనం పాట పాడాలని కోరుకుంటాము. ఒక నెమలిని చూసినట్లయితే అది ఒక్కసారి పురివిప్పితే బాగుండును అనుకుంటాము. ఎందుచేత అంటే పురివిప్పి ఆడుతున్న నెమలి అందంగా వుంటుంది. సూతుడు కనపడినప్పుడు ’అయ్యా, భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పండి’ అని అడగకపోతే అలా అడగని వాడు చాలా దురదృష్టవంతుడు. సూతుడు పురాణవాజ్ఞ్మయము అంతా తెలిసి ఉన్నవాడు. అటువంటివాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండే విశేషములను, హరికథామృతమును తెలుసుకొని గ్రోలాలి.

అందుకని శౌనకాది మహర్షులు సూతుడిని అడిగారు – ’అయ్యా, నీవు రోమహర్షణుని కుమారుడవు. నీకు పురాణములలో ప్రతిపాదింపబడిన విషయములు అన్నీకూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడిన భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామములు, హరిభక్తి, హరికథామృతము, విశేషంగా ప్రవచనం చేయబడ్డాయి. ఏ భగవంతుని గుణములు వినడం చేత వేరొకసారి పుట్టవలసిన అవసరము కలుగదో, ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను వినితీరాలో, అటువంటి విషయములను కలిగి ఉన్న గ్రంథము భాగవతము. అటువంటి పురాణమును మాకు వివరించవలసినది. అసలు జన్మనెత్తవలసిన అవసరంలేని పరమాత్మ కృష్ణభగవానుడిగా ఎందుకు జన్మించాడు? అందునా వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారములలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రివేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు? కంసుడిని ఎందుకు వధించాడు? తాను వచ్చిన అవతార ప్రయోజనమును నెరవేర్చడంలో అంత విడంబము చేస్తూ, అంతకాలంపాటు భూమిమీద తాను ఉండి శత్రుసంహారం చేసి జరాసంధుడివంటి రాక్షసులను సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమయిన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు.’

’కన్నులు తెరువని కడు చిన్నిపాపడై దానవి చనుబాలు ద్రావి చంపె’

’కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతకాని వయస్సులో ఉన్న కృష్ణపరమాత్మ పూతన పాలుతాగి పూతనాసంహారం చేశారు. అటువంటివాడు జరాసంధుడికి పదిహేడుమార్లు అవకాశం ఇచ్చాడు. పదిహేడుమార్లు జరాసంధుడు దండెత్తి వచ్చాడు. పదిహేడుమార్లూ జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. పద్దెనిమిదివ మారు జరాసంధుడు దండెత్తి వచ్చాడు, కృష్ణుడు పారిపోయాడు. యుద్ధంలో జరాసంధుడిని నిర్జించలేదు. కృష్ణ లీలలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంతమంది రాక్షసులను మట్టుపెట్టినవాడు జరాసంధుడిని మట్టుపెట్టలేడా? జరాసంధుడు కనపడినప్పుడు ఎందుకు పారిపోయాడు? ఈ లీలలు మాకు వినిపించవలసింది ఎన్ని కోట్ల జన్మములనుండియో భగవంతుని కథను విస్మృతిపొందడం చేత మేము మళ్ళీ మళ్ళీ అనేక యోనులయందు తిరుగుతున్నాము. ఇన్నాళ్ళకు మాకు భాగవతకథా శ్రవణం చేసే అదృష్టం పట్టింది. అందుచేత మహానుభావా, శుకమహర్షీ! ఆ భగవత్కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతము అని పేరు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#10
భగవంతుని అవతారములు:

"పరమాత్మను నీవు గుర్తుపడితే వారు ఇరవైరెండు రూపములు ప్రధానమయినవిగా వచ్చాడు. ఆ ఇరవైరెండు రూపములు గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థం అయిపోతుంది.” అన్నాడు సూతుడు. అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని శౌనకాది మహర్షులు పరమానందంతో అడిగారు.

అపుడు ఆయన అన్నారు – ’క్షీరసాగరమునందు శయనించి లోకుల అన్ని విషయములను యోగనిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా శంఖచక్రగదాధరుడై నాభికమలమునుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా, ’కదిలిన బాహుపదంబుల కంకణ రవముసూప’ అంటారు పోతనగారు – ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్న మణికంకణములు ధ్వనిచేస్తుంటే, ఆయన పాదమును లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురముల ధ్వని కలుగుతుంటే, పచ్చని పీతాంబరము కట్టుకొన్నవాడై, తెల్లటి శంఖమును చేతిలోపట్టుకొని, కుడిచేతిలో చక్రం పట్టుకొని, గద పట్టుకొని, పద్మం పట్టుకొని, శేషుని మీద పడుకున్న ఆ శ్రీమహావిష్ణువు వున్నాడే శ్రీమన్నారాయణుడు – ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమయిన స్వామి. అటువంటి స్వామి, ఆ నారాయణ తత్త్వము, ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు. ప్రతివాడి మాంసనేత్రమునకు కనపడడు. అది ఎవరో యోగులు – జీవితములలో మాకు సుఖములు అక్కర్లేదని తలచివవారై ఇంద్రియములను గెలిచినవారై తపస్సుచేసి కొన్నివేల జన్మలు భగవంతునికోసం పరితపించిపోయిన మహాపురుషులు, ఎక్కడో ధ్యానసమాధిలో ఈశ్వరదర్శనం చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్త్వం. అది ఉన్నది. దానిలోంచి మిగిలినవి అన్నీ వచ్చాయి. అది అవతారము కాదు. అది ఉన్న పదార్థము. అది మైనము. ఇపుడు ముద్దకట్టి దాంట్లోంచి ఎన్ని బొమ్మలయినా చేయవచ్చు.

అసలు ఉన్నది ఏది? నారాయణుడు. ఈ సృష్టి జరగడానికి నారాయణుని నాభికమలంలోంచి మొదట వచ్చినది చతుర్ముఖ బ్రహ్మగారు. నాలుగు ముఖములతో వేదం చెపుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టిచేసిన వాడెవడో అది మొట్టమొదటి అవతారం. ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు.
ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తరువాత వచ్చిన అవతారం ఈ భూమినంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోభబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షుని వధించడానికి వచ్చిన యజ్ఞ వరాహమూర్తి రెండవ అవతారము.
మూడవ అవతారము – సంసారమునందు బద్ధులై, కర్మాచరణం ఎలా చెయ్యాలో తెలియక కామమునకు, అర్థమునకు వశులైపోయిన లోకులను ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకివచ్చిన మహానుభావుడైన నారదుడు.

బ్రహ్మగారితోపాటు వచ్చినవారు సనకసనందనాదులు. నారదుని అవతారం తరువాత వచ్చినది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు. విశేషంగా వేదాంతతత్త్వమునంతటిని చెప్పాడు. కపిలుని అవతారము తరువాత వచ్చిన అవతారము దత్తావతారము. దత్తాత్రేయుడై అనసూయ అత్రి – వారిద్దరికి జన్మించి మహాపురుషుడై, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయిన బ్రహ్మవిష్ణు మహేశ్వరుల తత్త్వముతో కూడినవాడై జ్ఞాన ప్రబోధంచేసి ప్రహ్లాదాదులను ఉద్ధరించిన అవతారము ఏది ఉన్నదో అది దత్తాత్రేయస్వామి వారి అవతారము. కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత వచ్చిన అవతారము యజ్ఞావతారము. యజ్ఞుడు అనే రూపంతో స్వామి ఆవిర్భవించాడు.

ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికి ఋషభుడు అనే పేరుతో మేరుదేవి, నాభి అనబడే ఇద్దరి వ్యక్తులకు స్వామి ఆవిర్భవించారు.
తరువాత ఈ భూమండలమును ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు అందరు ప్రార్థనచేస్తే పృథుచక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి పృథుచక్రవర్తి ఓషధులను పిండాడు.

తరువాత వచ్చినది మత్స్యావతారము. మత్స్యావతారములో సత్యవ్రతుడు అనబడే రాజు రాబోయే కాలములో వైవస్వతమనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది. సముద్రములన్నీ పొంగిపోయి కలిసి పోయాయి. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఇక ఉండడానికి ఎక్కడా భూమిలేదు. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారయి పెద్దచేపగా మారి తనకు ఉండే ఆ మూపుకి ఈ పృథివిని పడవగా కట్టుకుని అందులో సత్యవ్రతుణ్ణి కుర్చోబెట్టి లోకములన్నీ ప్రళయంలో నీటితో నిండిపోతే ఆ పడవను లాగి, ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడిన అవతారము మత్స్యావతారము.

తదనంతరము క్షీరసాగరమథనం జరిగింది. అందులో లక్ష్మీదేవి పుడుతుంది. లక్ష్మీకళ్యాణం జరుగుతుంది. లక్ష్మీకళ్యాణఘట్టమును ఎవరు వింటారో వాళ్ళకి కొన్నికోట్ల జన్మలనుండి చేసిన పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆరోజుతో అంతమయిపోతుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. క్షీరసాగరమథన సమయంలో మందరపర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి కూర్మావతారం ఎత్తాడు. కూర్మావతారం వచ్చిన తరువాత వచ్చిన అవతారం మోహినీ అవతారం దేవతలకు, దానవులకు మోహినీ స్వరూపంతో అమృతమును పంచిపెట్టాడు. మోహినీ అవతారము తరువాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారము. ఈ అవతారములో స్వామి హిరణ్యకశిపుడిని వధించాడు.

నరసింహావతారము తరువాత వచ్చిన అవతారము వామనావతారము. ఇప్పుడు చెప్పుకుంటున్న అవతారక్రమము మనువుల కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతోంది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగిన శుభకార్యములు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగా పెట్టకపోయినా, తద్దోషం నివారించి ఆ కార్యం పూర్ణం అయిపోయినట్లుగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్పకథ వామనమూర్తి కథ.

వామనావతారము తరువాత వచ్చిన అవతారము పరశురామావతారము. గండ్రగొడ్డలి పట్టుకుని ఇరువతి ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియులను సంహరించాడు. పరశురామావతారము తరువాత వచ్చిన అవతారము వ్యాసావతారము.
కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేదవిభాగం చేసి ఉదారముగా పదునెనిమిది పురాణములను వెలయించిన మహానుభావుడుగా వ్యాసుడై వచ్చాడు.
వ్యాసావతారము తరువాత వచ్చిన అవతారము రామావతారము. రామావతారములో సముద్రమునకు సేతువుకట్టి దశకంఠుడయిన రావణాసురుణ్ణి మర్దించి ధర్మసంస్థాపన చేసి లోకులు ధర్మముతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము.

రామావతారము తరువాత వచ్చిన అవతారము బలరామావతారము.
బలరామావతారము తరువాత వచ్చిన అవతారము కృష్ణావతారము.

కృష్ణావతారము తరువాత వచ్చిన అవతారము బుద్ధావతారము. దశావతారములలో బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకటదేశము అనబడు మగధ సామ్రాజ్యమునందు దేవతలపట్ల విరోధభావనతో వున్న రాక్షసులను మోహింపచేయడానికి వచ్చిన అవతారము. మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారము గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు.

బుద్ధావతారము తరువాత వచ్చే అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్కిఅవతారము. కల్కిఅవతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా కలియుగం ప్రథమపాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతం అయిపోయేముందు యుగసంధిలో కాశ్మీరదేశంలో ఉన్న విష్ణుయశుడు అని పిలవబడే ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. ఆయన అవతారం రాగానే సవికల్పసమాధిలో ఉన్న యోగులందరూ పైకిలేస్తారు. అపుడు ఖడ్గమును చేతపట్టుకొని తెల్లటి గుర్రంమీద కూర్చుని ప్రజలను పీడించి ధనవంతులయ్యే పరిపాలకులనందరిని సంహరిస్తారు. యుగాంతం అయిపోతుంది. మరల క్రొత్త యుగం ప్రారంభమవుతుంది. కల్కి అవతరం యుగసంధిలో వస్తుంది.

ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారు. దీనిని వ్యాసుడు ఎప్పుడు చెప్తున్నారు? కృష్ణావతార ప్రారంభమునందు భాగవతమును రచిస్తున్న సమయంలో భూతభవిష్యద్వర్తమాన కాలజ్ఞానము ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయములను చెప్పగలుగుతున్నాడు. వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుని అంశ. మహానుభావుడు. ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు. అయితే అవతారములు ఈ ఇరవై రెండేనని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే! కొన్ని ప్రధానమయిన విషయములు మాత్రమే ప్రస్తావన చేయబడ్డాయి.
’అజాయమానో బహుధావిజాయతే” ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసిన అవసరం లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలయిన రూపమును పొందాడు. దేనికోసం? ఆయనే చెప్పారు.

"పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే!!"

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#11
భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్నావతారము చాలా గొప్ప అవతారము. ’కృష్ణస్తు భగవాన్ స్వయం’ – అందుకే భాగవతమునకు ’జయ’ అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే – ’నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!’ అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారం తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణావతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకంతటికి తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మప్రభోదము చేస్తాడు.

’కృష్ణావతారం పరిపూర్ణమయిన అవతారం. అందుకే మనం ’కృష్ణం వందే జగద్గురుమ్’ అంటాము. జగద్గురువయిన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు. అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై మీకష్టాన్ని పోగొడతాడు. తండ్రియై మిమ్మల్ని కాపాడతాడు. తల్లియై మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమయిన కృష్ణావతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెపుతాను వినండి’ అన్నాడు సూతుడు శౌనకాది మహర్షులతో.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#12
అద్భుతముగా ఉంది మిత్రమ.
రెండు విషయములు నాకు వింతగా అనిపిస్తాయి కృష్ణావతారములో.

1) కృష్ణుడినే నమ్ముకున్న రాధకి అతడు మథురకని బయల్దేరాక మరలా కనపడలేదు.
[Image: tumblr-pap12x-OGc-N1sjjdtyo1-1280.jpg]


2) యుద్ధం మొదట్లో కృష్ణుడు అంత సేపు భగవద్గీత చెప్పినా అన్నీ మర్చిపోయిన అర్జునుడు, అభిమన్యుడు చనిపోగానే తన కొడుకుని చంపిన జయద్రథుడిని మర్నాడు సూర్యాస్తమయం లోపు చంపడమో లేక తాను ఆత్మహత్య చేసుకోవడమో తథ్యం అని ఆవేశపడ్డాడు. నేరుగా విన్న అర్జునుడి మీదే భగవద్గీత ప్రభావం అంత తక్కువ సేపు ఉంటే ఇంక జనసామాన్యం సంగతి వేరే చెప్పాలా అనిపిస్తుంటుంది మిత్రమ.
[+] 1 user Likes dippadu's post
Like Reply
#13
అశ్వత్థామ పరాభవము:

పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ’నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు.

తెల్లవారింది. మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒకమాట అన్నాడు – ’నేలమీదపడి పొర్లిగుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపదీ! ఏ నీచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీకుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీపగ తీర్చుకో’ అన్నాడు.

పిమ్మట అర్జునుడు కృష్ణభగవానుని సారధిగా పెట్టుకొని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది, తనను చంపేస్తాడన్న భయంతో పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతుంటే పోతనగారు ఒక అందమయిన ఉపమానం వేశారు.
'తన కుమార్తె వెంటపడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్నట్టి పరమశివుని చేతినుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరుగెడుతున్నాడు' అన్నారు. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు. ద్రోణసుతుడు. పరుగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇక పరుగెత్తలేకపోయాడు. వెనకనుంచి అర్జునుని రథం వచ్చేస్తోంది. కృష్ణుడు సారధ్యం చేస్తున్నాడు. 'ఈ రథమే, ఈ సారధ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును మట్టుపెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు' అని ఉపసంహారము తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా ఫరవాలేదు – తానుమాత్రం బ్రతికి ఉంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునకు ఉండకూడని బుద్ధి. అది పొగలు గ్రక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వస్తోంది.

అర్జునుడు వెనక్కితిరిగి కృష్ణుడివంక చూశాడు. 'మహానుభావా, ఎవరు సారధ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమయిన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడయినవాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటిని సాధించగలిగాను. లోకములన్నిటిని నిండిపోయి సంక్షుభితం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది' అని అడిగాడు.

అలా అడిగితే అప్పుడు కృష్ణభగవానుడు చెప్పాడు – ’ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇపుడు ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి. విడిచిపెట్టు’ అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణభగవానుడు ఉన్న రథమునకు ప్రదక్షిణం చేసివచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. ఇపుడు రెండు బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురువచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకొని దేవతలు, ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడ ఉత్కంఠను పొందాయి. అందరు హడలిపోతున్నారు. లోకములనన్నిటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణపరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కాని ఆయన అన్నాడు – ’ధూర్తుడయిన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారము తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసెయ్యి’ అన్నాడు. రెండు బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసేశాడు.

ఉపసంహారం చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి వానిని ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథంమీద పెట్టాడు. పెట్టి విపరీతమయిన వేగంతో యుద్ధభూమి లోనికి వచ్చి రథమును అక్కడ నిలబెట్టాడు. అర్జునునికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి వున్నాడు. అశ్వత్థామ వణికిపోతున్నాడు. కృష్ణుడు అన్నాడు ’అర్జునా, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతనిని బ్రాహ్మణుడని చూడకు. గురుపుత్రుడని చూడకు. సంహరించు. కుత్తుక కత్తిరించు’ అన్నాడు. అర్జునుడు మారుమాట్లాడలేదు. చంపలేదు.

ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు. దానిని మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు.

త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకువెళ్ళి అక్కడ పారవేశాడు. ’ద్రౌపదీ, వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకువచ్చి అశ్వత్థామను అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను’ అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒకతల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గానీ తన పసుపుకుంకుమలకు గానీ, తన బిడ్డలకు గానీ, ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన అయిదుగురు బిడ్డలను చంపేశాడు. ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసింది. ఆవిడ అంది ’మహానుభావా, అశ్వత్థామా, నా భర్తలైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ”ఆత్మావైపుత్రనామాసి’ తండ్రి తన కొడుకు రూపంలో భూమిమీద తిరుగుతూ ఉంటాడు. నీవు మా గురు పుత్రుడవు. అందుచేత నాకు నీయందు నా భర్తల గురువు దర్శనమౌతున్నాడు. అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను నేను ఒక్కమాట అనను.’ ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో మీరూ ఆలోచించండి. ఇదీ ద్రౌపది అంటే! ఆవిడ కోప్పడలేదు. ఎంత మాటన్నదో చూడండి!

’కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్ర శస్త్రములు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకుపూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు. అపారమైన నిద్రలో ఉన్న నాకుమారులు యుద్ధము చేయడమునందు ఆసక్తి లేనివారై గాఢనిద్రలో ఉన్నారు. ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకువు అయ్యావు. నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నీవు పుత్రరూపంలో ఉన్న గురువు అని తలంచి నా అయిదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను’ అంది. ’రాత్రి చంపేటప్పుడు నీకీవిషయములు జ్ఞాపకం రాలేదా? అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి వుండవలసిన ధర్మములు తెలియదా? అని అడిగినట్లు అవుతుందని “నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయయ్యా?” అని అర్జునుని వంక చూసి అంది.

అర్జునా, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా! అయిదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటివరకూ ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి రెండు చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాండీవం పట్టుకొని రథము ఎక్కి పగబట్టి, అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి (ద్రోణుడి భార్య, అశ్వత్థామ తల్లి)కి వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒక ఎత్తు. ఇంక చచ్చిపోతున్నాడు, ఇంక రక్షించుకోలేను అని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య, నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామా, మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తోందోనయ్యా! తలచుకుంటే నా మనస్సు వికలం అయిపోతోంది.”
అని అర్జునుని పిలిచి, “ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతనిని సంహరించకూడదు. ఆయనను విడిచిపెట్టేయండీ. ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చేయండి” అంది.

ఈమాట భీముడు విన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. “ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకొని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను” అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే.

అప్పుడు కృష్ణుడు అన్నాడు. “అర్జునా, నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పనిలేదు. వీడు ఆతతాయి (చంపుటకు ఉద్యమించినవాడు). కాబట్టి చంపి అవతల పడేయవచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తోంది. ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏమి చేయాలో దానిని నీవు చేయవలసింది” అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపినప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు. అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉంది. పుట్టుకచేత అశ్వత్థామకి శిరస్సుమీద ఒక మణి ఉంది. ఆ మణికాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు. అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతమంది నెత్తురు త్రాగిందో. అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురక వృత్తికి వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను పుచ్చేసుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క త్రోపు తోసి అవతల పారేశాడు. ఆ త్రోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు. హీనుడై, కాంతిపోయిన వాడై, తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సూతుడు అన్నాడు – శౌనకాది మహర్షులారా, వృత్తాంతమును విన్నారు కదా! ఇదీ కృష్ణలీల అంటే! ఇదీ కృష్ణుడు అంటే! ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అందుకని భాగవతం అంటే ఈశ్వర స్వరూపుడైన కృష్ణ తత్వమే.

ఇక ఆ ఉపపాండవుల పార్థివ శరీరములను తీసుకువెళ్ళి, దహన క్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలచుకొని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే!
కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖములను ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తున్న కాలమునకు నీవు పరతంత్రుడవు. నీవు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#14
(05-08-2019, 04:42 PM)dippadu Wrote: అద్భుతముగా ఉంది మిత్రమ.
రెండు విషయములు నాకు వింతగా అనిపిస్తాయి కృష్ణావతారములో.

1) కృష్ణుడినే నమ్ముకున్న రాధకి అతడు మథురకని బయల్దేరాక మరలా కనపడలేదు.
[Image: tumblr-pap12x-OGc-N1sjjdtyo1-1280.jpg]


2) యుద్ధం మొదట్లో కృష్ణుడు  అంత సేపు భగవద్గీత చెప్పినా అన్నీ మర్చిపోయిన అర్జునుడు, అభిమన్యుడు చనిపోగానే తన కొడుకుని చంపిన జయద్రథుడిని మర్నాడు సూర్యాస్తమయం లోపు చంపడమో లేక తాను ఆత్మహత్య చేసుకోవడమో తథ్యం అని ఆవేశపడ్డాడు. నేరుగా విన్న అర్జునుడి మీదే భగవద్గీత ప్రభావం అంత తక్కువ సేపు ఉంటే ఇంక జనసామాన్యం సంగతి వేరే చెప్పాలా అనిపిస్తుంటుంది మిత్రమ.

నమస్కారం మిత్రమా...
కృష్ణావతారంలోని రెండు విషయాలను మీరు ప్రస్తావించటం బాగున్నది.
కేవలం రాధనే కాదు తనని పెంచి పెద్ద చేసిన యశోదను కూడ శ్రీ కృష్ణుడు చాలాకాలం కలవలేదు.
అలాగే, కృష్ణుడు చెప్పిన గీత విన్న అర్జునుడు అలా ప్రవర్తించాడు అన్నారు... మరి చెప్పిన కృష్ణుడు కూడా తను ఆయుధం పట్టను అన్న మాటను మరచి భీష్ముని కవ్వింపు చర్యలకి ఆయుధం పట్టాడు.
మనిషి పుట్టుక పుట్టినవాడికి (అతను పరమాత్ముడైనా) ఆకలి, దప్పిక, నిద్ర ఎంత సహజమో... మరుపు, కోపం, కన్నీళ్ళు అంతే సహజం.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply
#15
పరీక్షిత్తు జననము — కుంతీదేవి ప్రార్ధన:

ఇది జరిగిన పిమ్మట కృష్ణపరమాత్మ కాలము బలవత్తరమయిన స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కలిగించారు. తదుపరి ’ఇంక నేను ద్వారకా నగరమునకు బయలుదేరతాను’ అని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్న సమయంలో కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు అందరూ కూడ ఆయనను స్తోత్రం చేసి బెంగపెట్టుకొని దీనవదనములతో నిలబడ్డారు. ఆ సమయంలో ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరుగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చింది. వచ్చి రథం దగ్గర ఉన్న కృష్ణపరమాత్మ పాదములమీద పడిపోయింది. అప్పటికి ఉత్తర గర్భంతో వుంది. అభిమన్యుడు మరణించాడు.

ఉత్తర కృష్ణుని చూసి – ’కృష్ణా, నాకు ఏదో తెలియడం లేదు. కానీ ఏదో దివ్యమయిన తేజస్సు ఒకటి వచ్చేసింది. ఒక ఇనుప బాణం ఏదో వచ్చేస్తోంది. చిత్రం ఏమిటి అంటే అది బయటకు కనపడడం లేదు. నా కడుపులోకి ప్రవేశించేస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది. లోపల ఉన్న పిండము మీద పగబట్టి ఆ పిండమును చెణకేస్తున్నది. ఆ బాణం ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతోంది. నేను తల్లిని. ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపడడం లేదు. పిండమును తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు. కృష్ణా, నువ్వు రక్షించు’ అని ప్రార్థించింది.

బయటకు వచ్చిన ఉపపాండవులకోసం ద్రౌపది ఏడ్చింది. లోపల వున్న పిండము పోతున్నదని ఇప్పుడు ఉత్తర ఏడుస్తోంది.
ఉత్తర అలా అనగానే అడగని పాండవులు గబగబా ధనుస్సు పట్టుకున్నారు. ఎవరిమీద వేస్తారు? బయట ఎక్కడ ఉన్నాడు? శత్రువు ఉత్తర గర్భంలో ఉన్నాడు. పిండమును నరకడానికని బాణం వెళ్ళిపోతోంది. ఇప్పుడు కృష్ణుడు చూశాడు. ఉత్తర ఏమని ప్రార్థించింది? ‘కృష్ణా, నేను నీ చెల్లెలయిన సుభాద్రకి కోడలిని. అభిమన్యుని భార్య అయిన ఉత్తరను. నా కడుపులో వున్న పిల్లవాడు నీకు మేనల్లుడు అవుతాడు’ అంది. మేనల్లుడు అంటే ఏమిటి?
‘మేనమామల ముద్దు మేలైన ముద్దు – తాతలకు తాముద్దు తాను అబ్బాయి’
అని జానపదులు పాటలు పాడుతూంటారు. మనవలంటే తాతలకి ప్రీతి. మేనల్లుళ్ళు అంటే మేనమామలకు ప్రీతి. ‘నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు. కాని ఎవరో బాణం వేసేశాడు. అది లోపలికి వెళ్ళిపోతోంది. తామరపువ్వులవంటి నేత్రములు ఉన్నవాడా! నీవు కన్నువిప్పి చూశావంటే శత్రువు మడిసిపోతాడు. ఈ బాణం అగ్నిహోత్రంలా ఉంది . ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తోంది. బయట ఉన్నవాళ్ళకు ఏమి తెలుస్తుంది? కడుపులో వున్న పిండమును రక్షించవా కృష్ణా’ అని శరణాగతి చేసింది.

గాండీవమును ధరించిన అర్జునుడు ఉన్నాడు, చేతి గదతిప్పితే అగ్నిహోత్రమును పుట్టించే భీమసేనుడు ఉన్నాడు. నకుల సహదేవులు ఉన్నారు. అజాతశత్రువయిన ధర్మరాజు ఉన్నాడు. అయినా ఉత్తర వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు. నీ వాళ్ళు నిన్ను రక్షించరు. నీరక్షణ నీ ఇంటి ఈశాన్య దిక్కున ఉంది.
అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని నీ బంధువులను నిర్లక్ష్యం చేయకు. వాళ్ళని భగవంతునిగా చూసుకో. కానీ లోపల పూనికతో ఈశ్వరుడిని శరణాగతి చేయడం నేర్చుకో. ఆయన నీకు రక్షకుడు. అందుకని ఆవిడ పాండవులను ప్రార్థన చేయలేదు. కృష్ణుడిని ప్రార్థన చేసింది.

కడుపులో ఉన్న పిండము ‘అగ్నిహోత్రము వచ్చేసింది. నన్ను ఇది కాల్చేస్తుంది, నన్ను రక్షించేవాడు ఎవరు, నేను గర్భంలో వున్నాను. నేను మొరపెడితే ఎవరికీ వినపడుతుంది’ అని ఏడుస్తోంది. ఈయన ఆ పిండమునకు ఎదురువచ్చాడు. ఉత్తర గర్భములోని పిండము సంహరింపబడాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును వేసేశాడు. అది లోపలవున్న పిండం దగ్గరకి వచ్చేసింది. అపుడు కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమందు పెరుగుతున్నటువంటి పిండము ముందు భాగమునందు అంగుష్ఠమాత్రుడై నిలబడ్డాడు. గదను త్రిప్పుతున్నాడు. చక్రహస్తుడై వైష్ణవ మాయను ప్రకటించాడు. ఉత్తరగర్భంలో ఒక్కసారి తన తేజస్సును చూపించాడు. ఆ తేజస్సు పిండమునకు తప్ప మరెవరికీ కనపడడం లేదు. ఉత్తరకి గాని, పాండవులకి గాని, లోకమునకు గాని కనబడడం లేదు. స్వామి ఈ లీలను అమ్మకడుపులో ప్రదర్శిస్తున్నాడు. తానూ బయట అలా నిలబడి ఉన్నాడు. పాండవుల వంశం నిలబడడం కోసం తానూ పిండమునకు ఎదురువెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రమునుండి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకొని చాలా ఉల్లాసంగా, సంతోషంగా పిల్లాడి వంక చూస్తే, వాడు ఇంకా సరిగా అమరని రెండు చేతులతో ‘ఎంత అందగాడురా – బొటన వ్రేలు అంత ఉన్నాడు – పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తుడై మా అమ్మ కడుపులోకి వచ్చి అంతటి అగ్నిహోత్రమును త్రాగేసి నన్ను రక్షించాడా’ అని స్తోత్రము చెయ్యడం చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానం అయిపోయాడు. అశ్వత్థామ చేత విడువబడిన బ్రహ్మాస్త్రము నుండి పైకివచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.

అలా సూతుడు చెప్పి అన్నాడు – 'ఈమాట చిత్రంగా ఉందా? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నారా? మీకు నేను మొదటే చెప్పాను. స్వామి ఇరవై రెండు అవతారములలో ఆవిర్భవించాడు. ఇవి అన్ని శాశ్వత స్వరూపుడయిన నారాయణునిలోంచి వచ్చినవే. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన తేజస్సుని, ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్పకాదు. ఆవిధంగా తేజస్సును పుచ్చేసుకున్నాడు. ఈ పనిని పాండవులు చేయలేరు. కృష్ణుడు చేశాడు. ఇప్పుడు మనం జరిగిన సంఘటనలను అనుసంధానం చేసుకోవాలి. ద్రోణాచార్యుల వారి కుమారుడయిన ఆశ్వత్థామను రథం మీదనుంచి దింపగానే వానిని చంపి వేయవలసినదని కృష్ణుడు సలహా ఇచ్చాడు. అర్జునుడు వెంటనే అశ్వత్థామని చంపివేసి ఉండి ఉంటే ‘వీనికి నేను 18 అధ్యాయములు గీత చెప్పినా ధర్మం అంటే ఏమిటో అర్థం కాలేదు. కాబట్టి నేను ఉత్తర గర్భంలో ఉన్న పిండమును రక్షించనవసరం లేదు’ అని అనుకోని ఉండేవాడు. తను చెప్పినా అర్జునుడు అశ్వత్థామని చంపలేదు. ఈ ధర్మమును కృష్ణుడు తన దృష్టిలో పెట్టుకున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’ – ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాడిని తాను రక్షించాలి. ఇపుడు ఎవరూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఒక్క ఈశ్వరుడు మాత్రమే చేయగలడు. కృష్ణుడు మాత్రమే చేయగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి తన కోరికలు తీరవన్న అనుమానం పెట్టుకోనవసరం లేదు. అలా అనుమానం పెట్టుకున్న వానిని మార్చగలిగిన వాడు ప్రపంచంలో లేడు.

ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో ‘నా కడుపులో అగ్నిహోత్రం చల్లారి పోయిందయ్యా, నా పిండము రక్షింపబడింది. పాండవ వంశము రక్షింప బడింది’ అని పొంగిపోయింది.
శ్రీకృష్ణ పరమాత్మ రక్షణ వలన ఉత్తర గర్భమునందు జన్మించిన వాడు పరీక్షిత్తు. ధర్మరాజు గారు ఆ పిల్లవానికి విష్ణురాతుడు అని పేరుపెట్టారు. కానీ ఆయనను ఎవ్వరూ విష్ణురాతుడు అని పిలువరు, పరీక్షిత్తు అని పిలుస్తారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#16
తదనంతరం కుంతీదేవి స్తోత్రం చేసింది. ఆవిడ 'ఆదినారాయణా...' అని ప్రారంభించింది. 'కృష్ణా నాభక్తి ఇంకా పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు.' మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఎలాంటి మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదేవి అడుగుతోంది. 'పాండురాజు కుమారులయిన ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదనము చేయవలసింది. స్వామీ నీయందు నా మనస్సు రమించిపోవాలి. పూజామందిరంలోనే కాదు. నేను ఏపని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. నీ నామస్మరణము నుండి నా మనస్సు ఆగకూడదు. నీవు ఈశ్వరుడవు, నీవు సర్వ జగన్నియామకుడవు. నీవు తలచుకుంటే ఏమి ఇవ్వలేవు!? అందుకని కృష్ణా, నాకు అటువంటి భాగ్యమును కటాక్షించవా! నాకు ఆ మోహమును తెంపి అవతల పారవేయవలసింది. సంసారమనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి. వాటిని గండ్ర గొడ్డలితో తెంపి అవతల పారేయి’ అని అడిగిందా అమ్మ.

అంత కృష్ణ పరమాత్మ కూడా ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాడు. పొంగిపోయి ‘అప్పుడే ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి, నువ్వు సంతోషించాలి’ అనే భావం వచ్చేట్లుగా హేలనగా చూసి, ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. అంతే! మాయ ఆవరించింది. ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ మందహాసపు కాంతులలో మైమరచిపోయేటట్లు చేసేశాడు. ఆయన దర్శనానికి ఉండే శక్తి అటువంటిది. అందుచేత ‘స్వామీ నిరంతరమూ నీ గురించి భావన చేసే అదృష్టమును ప్రసాదించవలసింది’ అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోయిన తరువాత పదినెలలకు ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#17
భీష్ముని చరిత్ర:

కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజుగారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందఱో రాజులను తెగతార్చాను. దానివలన నాకు కలిగిన పాపం ఏవిధంగా పోతుంది’ అని బాధపడుతున్న సమయంలో, ‘ధర్మసూక్షములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్యమీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు – అక్కడికి వెడదాం పద’ అని మహానుభావుడు కృష్ణభగవానుడు ధర్మరాజును తీసుకొని వెళ్ళినప్పుడు, భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రం భాగవతంలో వివరించ బడింది.

భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది. భీష్ముని జీవితం అంత తేలికయిన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమయిన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది.

ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభనొక దానిని తీర్చారు. ఆ సభకు ఋషులు ప్రజాపతులు మొదలయిన వారందరూ విచ్చేశారు. వారు ఆ సభయందు కూర్చుని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్లు చూడడం ఎలాగా, భగవంతునియందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పథంలో నడిచినవారు అవుతారు. అందుచేత వీళ్ళందరికీ ఏవిధంగా కళ్యాణమును సాధించిపెట్టాలి అని సభ జరుగుతోంది.

ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్దకూతురు. సహజంగా ఆవిడ చాలా సౌందర్యరాశి. పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమయిన అందగత్తె. మహాసౌందర్యరాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు. వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది.

గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో వున్న అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. కాని ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారిరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయమును మరచిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకి అర్థం అయ్యేవి కావు. కథ నడిస్తే మనకి అర్థం అవుతుంది.

అపుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడమేమిటి, రాజర్షి అలా ప్రవర్తించడమేమిటా అని అనుకున్నారు. అనుకుని వారిద్దరినీ శపించారు. ‘ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించెదవు గాక’ అని రాజర్షిని శపించారు. గంగమ్మను ‘నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు జీవించెదవు గాక’ అని శపించారు. తదనంతరం ‘శరీరం విడిచిపెట్టిన తరువాత మరల స్వర్గలోకమునకు వస్తావు’ అని శాపవిమోచనం చెప్పారు. ఆకారణం చేత రాజర్షి తానూ ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు.

ఆ కాలంలో భారత వర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి. బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకొని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందికి వస్తోంది. ‘అయ్యో నేనెంత పొరబాటు చేశాను. నేనయినా ఆ సమయంలో పమిట సర్దుకుని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి’ అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్ట వసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత బాధగా ఉన్నారు’ అని అడిగింది. అపుడు వాళ్ళు ఒక చిత్రమయిన విషయమును ప్రతిపాదన చేశారు. ‘మేము అష్టవసువులము. భార్యలతో కలిసి ఆకాశమార్గములో వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము. మేము వసిష్ఠ మహర్షి ఆశ్రమమును చూశాము. అందులో ‘నందిని’ అనే కామధేనువు ఉంది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ, తేజస్సుతోనూ ఉంది. దానిని ‘ద్యు’ అనబడే వసువు భార్య చూసి ‘అది మామూలు ఆవేనా’ అని భర్తను అడిగింది. అపుడు ఆయన అది మామూలు ఆవు కాదు – దానిని కామధేనువు అంటారు – దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికయినా తీరుతుంది’ అని చెప్పాడు. అపుడు ‘ద్యు’ భార్య అంది –‘నాకు ‘ఉసీనర’ అనే స్నేహితురాలు వుంది. ఆమె కొద్దిగా రోగగ్రస్తయై వార్ధక్యమును పొందింది. ఆవిడకు మరల యౌవనం వస్తే నాతోపాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామదేనువును అపహరించి తీసుకువెళ్ళి దానిపాలు ఉసీనరకి పట్టిద్దాము’ అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ‘ద్యు’ ఆ కామదేనువును అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వశిష్ఠమహర్షి సాయంకాలం పూజకోసమని దర్భలు మొదలయినవి సేకరించదానికని వెళ్ళారు. వారు తిరిగివచ్చి ఆశ్రమంలో చూశారు. నందినీధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్ఠలో కూర్చుని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూశారు. అష్టవసువులు కామదేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు జన్మించెదరు గాక’ అని శపించారు. ఈ వార్తా తెలిసి అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠమహర్షి పాదాలమీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేతట్లు చేయండి’ అని ప్రార్థించారు. అపుడు ఆయన అన్నారు – ‘మీరు ఎనమండుగురు వసువులు. మీ ఎనమండుగురిలో ఏడుగురియందు పాపము తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం ‘ద్యు’కి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమయిన కారణము ‘ద్యు’. అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు. కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలి పెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన ‘ద్యు’ మాత్రం పరాక్రమవంతుడై, కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకము నందు కొంతకాలము ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ‘ద్యు’ మాత్రము కొంతకాలము భూలోకము నందు ఉండవలసినదే’ అని ఆయన శాపవిమోచానమును కటాక్షించారు.

ఆ ఎనమండుగురు ఇపుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయింది. ‘అమ్మా నీవు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు’ అని అడిగారు. అపుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి – ‘రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నాను’ అంది. అపుడు వాళ్ళు –‘అయితే అమ్మా, మాకు ఒక ఉపకారం చేసిపెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళుతున్నావు కనుక నీకడుపున మేము ఎనమండుగురం పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాపవిమోచనం కోసం మాకొక సహాయం చేసిపెట్టాలి. భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్నతల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాపవిమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము. నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచి పెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు’ అని కోరారు. అపుడు గంగమ్మ ‘తప్పకుండా అలాగే చేస్తాను’ అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా జరిగితే గంగాతీరము నందు భారతవంశములో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థియై తపిస్తున్నాడు. ఆయనకీ సామ్రాజ్యం ఉంది. సత్యం ఉంది, ధర్మం ఉంది. అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానము లేదు. ఈశ్వరానుగ్రహమును ఆపేక్షించి ఆయన గంగాతీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకుపూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియములను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమయిన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. తన తొడమీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆయన అన్నాడు – అమ్మా నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడమీద కూర్చున్నావు అని అడిగాడు. ఆవిడ అంది – నన్ను గంగ అంటారు. నేను గంగానదికి అధిష్ఠాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అపుడు ఆయన అన్నాడు. నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు. కానీ ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. కుడి తొడమీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే వుంది. ఎప్పుడయినా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడమీద కూర్చోవాలి. కానీ ఇపుడు నీవు వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. ఇపుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలులేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. కాన నాతో సామానమయిన వాడు నా కొడుకు. ‘ఆత్మావై పుత్రనామాసి’ నా తేజస్సు నా కుమారునియందు ఉంటుంది. అందుకని నీవు నా కుమారుడికి భార్యవు అవుదువు గాని. అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు.

ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్నా గోభిషుడు అనే రాజర్షి చూశాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజుగారి కుమారుడిగా జన్మిస్తాను’ అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు.

శంతన మహారాజు పెరిగి పెద్దవాడయిన తరువాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒకమాట చెప్పాడు. ‘నేను ఒకప్పుడు గంగాతీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడి తొడమీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకుంది. నిన్ను నా కోడలిని చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను. అందుకని గంగాతీరములో మెరుపు తీగవంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు’ అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు.

శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటాడదానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతికోసమని గంగాతీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అనినమ్మి ఆవిడను వివాహం చేసుకోవదానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడ అంది – ‘నేను నీకు భార్యను అవుతాను. కానీ నాదొక షరతు’ అంది. ‘ఏమీ నీ షరతు’ అని అడిగాడు శంతనుడు.

నే ఏపని చేసినా అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పనిచేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురుచెప్పుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను’ అంది.
శంతనమహారాజు బాహ్యసౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహు అందగాడు. అందునా పెద్దకొడుకు. మొట్టమొదట పుట్టిన వాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టీ పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండు చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది. అనగా ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. ఏడుగురు వసువులకి ఆవిడ మరల స్వస్తితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విదిచిపెట్టేసింది. శంతనుడు గంగమ్మకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. ఊరుకున్నారు.

అలా ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాదు ఏడు సార్లు అయిపోయింది. ఏడుగురు కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. ఎనిమిదవసారి మహా తేజోవంతమయిన కుమారుడు జన్మించాడు. ఎనిమిదవ మారు ఆ బిడ్డను తీసుకుని గంగవైపు వెళ్ళిపోతోంటే ఆయన అన్నాడు – ‘ఛీ రాక్షసీ! ఎవరయినా మాతృత్వమును కోరుకుంటారు. నీవేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ పని ఎనిమిదవ మాటు చేస్తున్నావు. ఇంక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలులేదు’ అన్నాడు.

అప్పుడు గంగమ్మ నవ్వి అంది – ‘నువ్వు నేను చేసినపనికి ఎప్పుడు అడ్డుపెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డుపెట్టావు. అందుకని నేను వెళ్ళిపోతాను’ అంది. ‘నీవు వెడితే వెళ్ళిపో. నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు’ అన్నాడు. అంటే ఆవిడ అంది – ‘అది కుదరదు. నీకొడుకు కాదు. అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా! నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు. నేను ఏడుగురు వసువులకి సహజస్థితిని ఇచ్చాను. వీడు ఎనిమిదవవాడు. వీడు బతకాలి. వీనిని తీసుకువెళ్ళి వసిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమయిన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెప్పుతాను. అప్పటి వరకు వీనిని నాదగ్గర ఉంచుకుంటాను’ అని చెప్పి కొడుకును తీసుకుని గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది.

తరువాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం ఎలుతున్నాడు. వేటకి వెడుతున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. గంగమ్మ చెప్పిన మాటను మరచిపోయాడు.
ఒకనాడు గంగాతీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యౌవనంలో వున్న వ్యక్తి అద్భుతంగా బాణ ప్రయోగం చేయడం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. ‘నాకొడుకు కూడా వుంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడు’ అని 'బాబూ నీవెవరు ఏమిటి’ అని ఆరా తీశాడు. అపుడు గంగమ్మ వచ్చి ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఈయన గాంగేయుడు. గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధములుగా రాశీ భూతమయిన రాజనీతిజ్ఞుడు. ధర్మమూ తెలిసి ఉన్నవాడు. పైగా విలువిద్యా నేర్పరి. నీ కొడుకును నీకు అప్పజెప్పుతున్నాను’ అని ఆ కొడుకును ఆయనకు అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది.
అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఏంటో సంతోషంతో ఉన్నాడు. సభచేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. 

ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీ దేవి యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినపుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోటునుండి ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగాతీరంలో పడవమీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది.
శంతనుడు సత్యవతీ దేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. ఆవిడ అంది – ‘ నేను స్వేచ్ఛా విహారిణిని కాను. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకు వెడుదువుగాని. నా తండ్రి అనుమతి తీసుకోనవలసినది’ అని చెప్పింది.
అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనుని చూసి దాశరాజు వంగివంగి నమస్కారములు చేసి ‘అయ్యా, మీకు నేను ఏమి చేయగలవాడను’ అన్నాడు. అపుడు శంతనుడు ‘నీ కన్యకా రత్నమును నాకు ఈయవలసింది’ అన్నాడు. అప్పుడు దాశరాజు – ‘నాకూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా?” అని అడిగాడు. అపుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్దకొడుకు ఉన్నాడు. అతడు మహానుభావుడు. ధర్మజ్ఞుడు. గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీ దేవి కోసం తను కొడుకును ఎలా విడిచి పెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

కానీ శంతనుడికి సత్యవతీ దేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్రపట్టడం లేదు. ఆహారం తీసుకోవడం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి ‘నాన్నగారూ ఏమయింది’ అని అడిగాడు. ఈ విషయమును సూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితే ‘మీనాన్న గారికి ఈ వయస్సులో మరల వివాహం మీదికి మనస్సు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాశరాజు ఒక నియమం పెట్టాడు’ అని ఆ విషయములను తెలియజేశారు.

అపుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ‘అయ్యా మీ కుమార్తె అయిన సత్యవతీ దేవిని మా తండ్రిగారికి ఇచ్చి వివాహం చేయండి’ అని అడిగాడు. అడిగితె దాశరాజు అన్నాడు – తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా?’ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ‘తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యమును పరిత్యాగం ఆచేసేస్తున్నాను. నేను రాజ్యం తీసుకొను. మానాన్నగారి కోర్కె తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి’ అన్నాడు. అపుడు దాశరాజు ‘ఇప్పటివరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమ వంతుడవు. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంత పరాక్రమ వంతుడయిన నీ కొడుకు సత్యవతీ దేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదనీ ఏమిటి హామీ?” అని అడిగాడు.

అపుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞచేశాడు. ‘నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవమును, తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత! మా తండ్రిగారి కోసం నేను భీష్మమయిన ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అన్నాడు. అది సామాన్యమయిన ప్రతిజ్ఞకాదు. వృద్ధుడయిన తండ్రికోసం ఇటువంటి ప్రతిజ్ఞచేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుభులు మ్రోగి పైనుంచి పుష్ప వృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞచేశాడు కనుక ఆ రోజునుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు.

ఈ విషయమును తండ్రిగారయిన శంతన మహారాజు విని తెల్లబోయాడు. ‘నీవు నాగురించి ఏంటో త్యాగం చేశావు. అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను. ఒకటి – యుద్ధభూమిలో నీవు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండు – నీకు మరణము లేదు. స్వచ్ఛంద మరణమును నీకు ప్రసాదిస్తున్నాను. మరణము నీవు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు’ అని.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#18
తదుపరి శంతనుడు సత్యవతీ దేవిని వివాహం చేసుకొని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యువు వచ్చింది. శంతన మహారాజు మరణించాడు. ఇద్దరి కొడుకులలో పెద్దవాడయిన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యమునకు వేటకు వెళ్ళాడు. అక్కడ ఆయన కర్మకొద్దీ చిత్రాంగదుడు అనే పేరు వున్న గంధర్వుడు కనబడ్డాడు. ‘నీవన్నాచిత్రాంగదుడు అనే పేరుతో ఉండాలి. నేనయినా ఆ పేరుతో ఉండాలి. నీవు ఆ పేరు వదులుతావా లేక నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మనలో ఎవరు బతికితే వాడు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు. లేకపోతే పేరు మార్చుకుని వెళ్ళిపో’ అన్నాడు. ‘నేను పేరు మార్చుకోవడం ఏమిటి? మనం ఇద్దరం యుద్ధం చేద్దాం. ఎవరు బ్రతికి ఉంటే వాడే చిత్రాంగదుడు’ అన్నాడు. అపుడు చిత్రాంగదుడు, గంధర్వుడు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో శంతన మహారాజుగారి కుమారుడయిన చిత్రాంగదుడు మరణించాడు. ఇంకా విచిత్రవీర్యుడు ఒక్కడే మిగిలాడు.

విచిత్రవీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపివేసేవాడు. ఇపుడు వంశం వర్ధిల్లాలి. ఇపుడు విచిత్రవీర్యునికి సరియైన భార్య దొరకాలి. ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషములతో తేలియాడుతుంటాడు. ఈయనకు తగిన భార్యను తేవలసిన బాధ్యత భీష్మునిమీద పడింది. ఆ వయస్సులో మహానుభావుడు భీష్మాచార్యుడు తాను చేసిన ప్రతిజ్ఞవల్ల ఎన్ని కష్టములను అనుభవించాడో చూడండి.

కాశీరాజుకు ‘అంబ’, ‘అంబిక’, అంబాలిక’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్రవీర్యుడు స్వయంవరమునకు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు. అక్కడి వాళ్ళందరూ ఆయనను చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానని ప్రతిజ్ఞచేసిన భీష్ముడు స్వయంవరమునకు వచ్చాడని విస్మయం చెందారు. అందరూ చూస్తూండగా ‘నేను పౌరుషంతో ఈ రాజులనందరినీ ఓడించి ఈ అంబ, అంబిక, అంబాలికలను తీసుకు వెడుతున్నాను. ఎవరయినా నన్ను ఎదుర్కొనేవారు ఉంటే ఎదుర్కోవచ్చు’ అని ముగ్గురిని చేయిపట్టి రథం ఎక్కించి తీసుకు వెళ్ళిపోతున్నాడు. రాజులు అందరూ కలిసి భీష్ముని మీదకు యుద్ధానికి వచ్చారు. భీష్ముడు వారినందరినీ తుత్తునియలు చేసి ఆ ముగ్గురినీ హస్తినాపురమునకు తీసుకువచ్చాడు.

అపుడు అంబ భీష్ముడి వద్దకు వెళ్ళి అంది – ‘మహానుభావా, నీకు తెలియని ధర్మం లేదు. నీకొక మాట చెపుతాను. నేను సాళ్వుడు అనే రాజును ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించాడు. ఆయన నాయందు పతీత్వ భావమును పొందాడు. కావున నేనిపుడు వేరొక పురుషునికి భార్యను కావడం అమర్యాద. అలా నేను కాకూడదు. అందుకని నన్ను తీసుకువెళ్ళి సాళ్వుడికి అప్పచెప్పవలసింది’ అంది. అపుడు భీష్ముడు – ‘మనసులేని స్త్రీ రాజునకు భార్యగా ఉండడానికి వీలుకాదు. అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగిన స్త్రీ భార్యగా ఇంట్లో ఉండడం త్రాచుపామును పెంచుకోవడం లాంటిది. అందుకని నువ్వు నా తమ్మునికి భార్యగా ఉండడానికి వీలులేదు. నిన్ను తీసుకువెళ్ళి సాళ్వుడికి అప్పజెప్పేస్తాను’ అని చెప్పి ఆమెను సాళ్వుడి రాజ్యమునకు రథంలో పంపించాడు. ఈమె సాళ్వుడి దగ్గరకు వెళ్ళి ‘నేను వచ్చేశాను, భీష్ముడు నన్ను నీవద్దకు పంపించి వేశాడు’ అని చెప్పింది. అపుడు ఆయన అన్నాడు – ‘అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చేయిపట్టి రథం ఎక్కించి తీసుకువెళ్ళాడో ఆనాడే నీవు భీష్ముడి సొత్తు అయిపోయావు. ఇపుడు చేతకానివాడినై భీష్ముడు పెట్టిన భిక్షను భార్యగా స్వీకరించడానికి క్షత్రియుడను, రాజ్యపాలకుడను, మహారాజును అయిన నేను నిన్ను ఒల్లను. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నీవు వాళ్ళకే సొత్తు’ అన్నాడు.

ఒక ఆడదాని బాధ చరిత్రను ఎలా మారుస్తుందో చూడండి. అందుకే స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్ళ మనస్సు ఖేదపడేటట్లు ప్రవర్తించకూడదు.

ఆవిడ బాధపడుతూ తపోవనమునకు చేరి ఋషులను సమీపించి ‘నేను తపస్సు చేసుకుంటాను – నాకు సన్యాసం ఇవ్వవలసింది’ అని కోరింది. అపుడు ఋషులు – ‘నీవు నిండు యౌవనంలో ఉన్నావు. నీవు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో కూర్చుంటే ఇక్కడ వున్నవాళ్ళ తపస్సులు పాడయిపోయి లేనిపోని గొడవలు వస్తాయి. అందుకని నీవు ఇక్కడ ఉండడానికి వీలులేదు. ఈవేళ రాత్రికి ఉండు. రేపటి రోజున నీమార్గము నీవు చూసుకో. పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి? ఉంటే భర్త దగ్గర ఉండాలి. లేకపోతే తండ్రిగారి దగ్గర ఉండాలి. అందుకని నీవు నీ తండ్రిదగ్గరకు వెళ్ళవలసినది’ అన్నారు. ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళనన్నది.

ఆవిడ అదృష్టంకొద్దీ మరునాడు ఉదయం ఆవిడ తల్లిగారి తండ్రిగారు వచ్చారు. తాతగారికి తనగోడు వెళ్ళబోసుకుంది. ఆయన –‘నేను పరశురాముడికి అంతేవాసిని (=శిష్యుడిని). పరశురాముడు భీష్ముడికి గురువు. అందుకని పరశురాముడితో భీష్ముడికి చెప్పిస్తాను’ అన్నారు. ఈలోగా ఒక పరిచారకుడు వచ్చి ‘అయ్యా పరశురాముల వారు వేంచేస్తున్నారు’ అన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి అంబ తనగోడు చెప్పుకుంది. పరశురాముని హృదయం కరిగిపోయింది. నేను నిన్ను తీసుకుని హస్తినాపురమునకు వెడతాను. భీష్ముడిని పిలిచి తను గెలుచున్న వాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెపుతాను’ అని ఆమెను రథం ఎక్కించి హస్తినాపురమునకు తీసుకువెళ్ళాడు.

హస్తినాపురం బయట విడిది చేసి భీష్ముడికి కబురుచేశాడు. వచ్చినవాడు గురువు కనుక భీష్ముడు ఒక ఆవును తీసుకొని వచ్చాడు. ఆవును దానం ఇచ్చి నమస్కారం చేసి ‘మహాప్రభో మీరు రావడమే అదృష్టం. రాజ్యంలోకి ప్రవేశించండి’ అన్నాడు. అపుడు ఆయన ‘నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు. నీవు ఓడించి తెచ్చిన కాంత అంబను భార్యగా స్వీకరించు’ అన్నారు. అపుడు భీష్ముడు ‘ఒకవేళ పంచతన్మాత్రలు తమతమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయుగాక కానీ నేను ఒకసారి చేసిన ప్రతిజ్ఞనుండి మాత్రం వెనకడుగు వేసే సమస్యలేదు. అందుకని నేను మాత్రం ఈమెను భార్యగా స్వీకరించాను అన్నాడు. అపుడు పరశురాముడు ‘అయితే ఎవరికోసం తెచ్చావో ఆ తమ్ముడిని చేసుకోమను’ అన్నాడు. అపుడు విచిత్ర వీర్యుడిని అడిగాడు. ఆయన అన్నాడు ‘వేరొకరియందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయింది. తిరిగివస్తే నేను ఎలా పెళ్ళి చేసుకుంటాను? నాకు అక్కర్లేదు’ అన్నాడు. పరశురాముడికి ఆగ్రహం వచ్చింది. ఆయన భీష్ముని ‘నువ్వు అంబని వివాహం చేసుకుంటావా లేక నాతో యుద్ధం చేస్తావా’ అని అడిగాడు. అపుడు భీష్ముడు ‘ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములను విడిచి పెట్టేస్తాను. మీరు కురుక్షేత్రమునకు పదండి. నేను అక్కడికి యుద్ధానికి వస్తాను’ అన్నాడు. ఇద్దరూ కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాండమయిన యుద్ధం ఇరవై రెండు రోజులు జరిగి ఒకళ్ళని ఒకళ్ళు తుత్తినియలుగా కొట్టేసుకున్నారు. ఆఖరుకి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్నారు. రోజూ భీష్ముడు పరశురాముడికి నమస్కారం పెట్టి ఆయనతో యుద్ధం చేసేవాడు. ఆయన తనకు గురువుగారు కదా! పరశురాముడిని నిగ్రహించడం ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అపుడు ఆయనకు అష్టవసువులు సాక్షాత్కరించారు. వారు ‘భీష్మా, నీవు బెంగపెట్టుకోకు. పరశురామునికి కూడా తెలియని అస్త్రం ఒకటి ఉంది. అది విశ్వకర్మ మంత్రంతో ఉంది అది నీ ఒక్కడికే తెలుసు. రేపటిరోజున దానిని ప్రయోగించి. ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రపోతాడు. యుద్ధభూమిలో నిద్రపోయిన వాడు మరణించిన వానితో సమానం. మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేడు కాబట్టి పరశురాముడు మరణించినట్లే. కాబట్టి ఆ అస్త్రమును ప్రయోగించు’ అన్నారు. ‘తప్పకుండా ప్రయోగిస్తాను’ అని లేచి ఆచమనం చేసి యుద్ధమునకు వచ్చాడు. పరశురాముడి మీద ఆ అస్త్రమును ప్రయోగిద్దామని బాణమును సంధించి మంత్రం పలుకుతున్నాడు. అపుడు ఆయనకు నారదాది మహర్షులు అందరూ దర్శనం ఇచ్చారు. వారు ‘భీష్మా, నువ్వు చాలా ఘోరమయిన పాపం చేస్తున్నావు. ఇది నీవంటి ధర్మజ్ఞుడు చేయవలసిన పనికాదు. నీవు ఆ అస్త్రమును ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వానితో సమానమయిపోతాడు. అంతటి అపకారం అంతటి అవమానం గురువుపట్ల చేయకూడదు. కాబట్టి నీవు ఆ అస్త్ర ప్రయోగం చెయ్యకు’ అన్నారు. అపుడు భీష్ముడు గురువును అవమానించాను’ అని ఆ అస్త్రమును ఉపసంహారం చేసేశాడు.

అదే సమయంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మొదలైన వాళ్ళు వచ్చారు. పరశురామునితో వాళ్ళు ‘నువ్వు బ్రాహ్మణుడివై నీ శిష్యుని మీద అంత బాణప్రయోగం చేయకూడదు. భీష్ముడు ధర్మమునకు కట్టుబడ్డాడు. నువ్వు ఉపశాంతి వహించవలసినది’ అని చెప్పారు. పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ళ మీద దొర్లి రథంలోంచి క్రిందపడిపోయాడు. అందుకని భీష్ముని చేతిలో ఓటమినంగీకరించాడు. ‘నేను ఓడిపోయినట్లే లెక్క, అంబా, ఇంకా నిన్ను నేను రక్షించలేను. నువ్వు నీకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నీకు ఎవరివలన వివాహం అవుతుంది అనుకుంటే వారిని ఆశ్రయించు’ అన్నాడు. ఆవిడ ‘ఇపుడు నాకొక విషయం అర్థమయింది. పరశురాముడు గతంలో ఇరవై ఒక్క మారులు భూమండలము చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వారినందరినీ తెగటార్చాడు. అటువంటి పరశురాముని భీష్ముడు ఓడించేశాడు. కాబట్టి భీష్ముని ఓడించేవాడు లేదు. కాబట్టి నాపెళ్ళి అవదు. కాబట్టి నేను ఒక ప్రతీకారం తీర్చుకుంటాను. భీష్ముడిని చంపుతాను’ అని ప్రతిజ్ఞచేసింది. ‘ఇంకా నాకు వివాహం అక్కరలేదు. భీష్ముడు ఎలా చనిపోతాడు. ఇది ఒక్కటే నాకోరిక’ అని ఆవిడ తపస్సు చేయడం మొదలుపెట్టింది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#19
ఒకచోట అంబ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసిందని పేర్కొనడం జరిగింది. స్కందుడు ప్రత్యక్షమై ‘ఏమి నీ కోరిక’ అని అడిగాడు. అపుడు ఆమె ‘భీష్ముడిని నిగ్రహించాలి’ అని చెప్పింది. అపుడు ఆయన ‘అది నేను చెప్పలేను. భీష్ముడికి వరం ఉంది. చేతిలో ధనుస్సు ఉండగా ఆయనను ఎవరూ చంపలేరు. పైగా ఆయన మహాధర్మజ్ఞుడు. అందుకని నేను నీకొక పుష్పమాలను ఇస్తాను. ఈ పుష్పమాల మెడలో వేసుకొని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు’ అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందఱో రాజులను అడిగింది. అపుడు వాళ్ళు ‘మహాధర్మాత్ముడయిన భీష్మునితో మేము ఎందుకు యుద్ధం చేయాలి? ఆయనను ఎందుకు సంహరించాలి? ఆ మాలను మేము వేసుకోము. ఆయనతో యుద్ధం చేయము’ అన్నారు. అపుడు ఆమె ఆ మాలను ద్రుపద రాజుగారి ఇంటిరాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘ఏమికావాలి’ అని అడిగాడు. అంటే ‘భీష్ముడిని సంహరించాలి’ అంది. అపుడు రుద్రుడు ‘నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు. వచ్చే జన్మలో నీకోరిక తీరుతుంది. కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోవలసింది’ అని చెప్పాడు. అపుడు ఆమె యోగాగ్నిలో శరీరమును వదిలివేసి మరల పుట్టింది.

ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదయి పుడితే భీష్ముడు యుద్ధం చేయడు. అందుకని మగవాడిగా మారాలి. అందుకని మరల తపస్సు చేసి మగవానిగా మారింది. అందుకే ‘శిఖండి’ అని పేరు పెట్టారు. అందుకే ఎవరయినా ఎంతకీ వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారనుకొండి – అపుడు వీడెక్కడ దొరికాడు రా నాకు –శిఖండిలా దొరికాడు’ అంటాము. శిఖండి వెనుక అంత కథ ఉంది. శిఖండి ద్రుపదుని కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలో చేరాడు.

మహానుభావుడు భీష్ముడు తన జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నాడు. ఇంత కష్టపడి విచిత్ర వీర్యునికి అంబిక, అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమయిన కొంతకాలమునకు విచిత్ర వీర్యునికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అంబిక, అంబాలిక విధవలు అయిపోయారు. వంశము ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీ దేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు. మనవలూ లేరు. వంశం ఆగిపోయింది. అపుడు సత్యవతీ దేవియే భీష్ముడిని పిలిచింది. ‘భీష్మా, వంశము ఆగిపోయింది. యుగ ధర్మముననుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళు అయినటువంటి అంబిక, అంబాలికలయందు వాళ్ళు ఋతు స్నానము చేసిన తరువాత నీవు వారితో సంగమించు. అలా సంగమిస్తే మరల వంశము నిలబడుతుంది. వంశము కోసమని అలా చేయడంలో దోషం లేదు.

అపుడు భీష్ముడు –‘అమ్మా, నేను ఆనాడు ప్రతిజ్ఞచేశాను. నేను ఏ స్త్రీయందు కూడా అలా ప్రవర్తించను. నేను బ్రహ్మచర్య నిష్ఠయందు ఉన్నవాడను. అందుకని వంశము లేకపోతే నేను ఏమీ చేయలేను. కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్కటే పరిష్కారం. ఎవరైనా బ్రహ్మ జ్ఞాన సంపన్నుడై, కేవలం వర కటాక్షం కోసమని సంగామించడం తప్ప శరీరమునందు అటువంటి కోర్కె లేని ఒక బ్రాహ్మణుని ఒక బ్రహ్మ జ్ఞానిని వేడుకో’ అన్నాడు. అపుడు సత్యవతీ దేవి వ్యాసుడిని ప్రార్థన చేసింది. తరువాత వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించడం జరిగింది. ధృతరాష్ట్రునకు దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకి పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాకుతూ తాతగారయి గడ్డాలు నెరిసిపోయి మహా ధర్మజ్ఞుడయి భీష్ముడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యులను గురువుగా పెట్టి ఆ వంశమును సాకుతూ నడిపిస్తున్నాడు.

ఆయన కళ్ళముందే పాండురాజు పుత్రులకు ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య బ్రహ్మాండమయిన కలహం బయలుదేరింది. అపుడు ఇంత ధర్మం తెలిసిన భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధనుని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అన్నాడనుకోండి అపుడు అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుని ఈ ఇద్దరిని చూసుకుని యుద్ధమునకు దిగాడు. సర్వసైన్యాది పత్యం ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది. భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం తానసలు యుద్ధ భూమికి రానన్నాడు కర్ణుడు.

భీష్ముడు ఎన్నోమార్లు ధర్మం చెప్పాడు. ‘అర్జునుని ఎవరూ గెలవలేరు. పాండవుల పట్ల ధర్మం ఉన్నది, వాళ్ళు నెగ్గుతారు’ అని. అటువంటి భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకును వ్రేలాడవలసిన అవసరం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి వుంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా! భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? అలాంటి భీష్ముడిని ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటులేకుండా అన్ని బానములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? భీష్మం చ ద్రోణం చ జయద్రథం చ’ అని పరమాత్మ వాళ్ళందరినీ తానే సంహరిస్తున్నానని గీతలో చెప్పాడు. భీష్ముడిని అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండూ భీష్మాచార్యుల వారి జీవితమునకు సంబంధించి చాలా గహనమయిన(=ఎఱుఁగరాని) ప్రశ్నలు.

అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచములో దేనికయినా ఆలంబనము ధర్మమే! భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అదికూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి, శకునికి మధ్య ద్యూతక్రీడ(=ౙూదము) జరుగుతోంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడంలో మరచిపోయి ముందు ధర్మరానుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నీవు పణంగా పెట్టుకో అనిన తరువాత, ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయినా తరువాత శకునికి గుర్తువచ్చింది ‘నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆవిడని ఒడ్డు’ అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు ‘దౌపదిని ఒడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి వెళుతుంది కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు. ఇప్పుడు నాకు శకుని యజమాని. నేను అయన దాసుడిని. దోషం ఆయనకీ వెడుతుంది’ అనుకుని ధర్మరాజు ద్రౌపదికి ఒడ్డి ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయిన ద్రౌపదీ దేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడ్చాడు. ఊడుస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది. ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసినది’ అని అడిగింది. అపుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డె అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీ దేవి శపిస్తే, ధృతరాష్ట్రుని సంతానం అంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ’ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమూ అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపదీ’ అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణము నందు వైక్లబ్యమే! ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణములతో కొట్టారు. ధర్మాచరణము అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి!

ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధమునకు వచ్చాడు. దుర్యోధనునితో ఒకమాట చెప్పాడు. ‘నీవు పాండవులవైపు ఉన్న వాళ్ళలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను. కానీ పాండవుల జోలికి మాత్రం వెళ్ళను’ అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహా అని నమస్కరించాడు. ‘తాతా, మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్ళం. మాకు విజయం కలగాలని ఆశీర్వదించు’ అన్నాడు.

అపుడు భీష్ముడు ‘నీవు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవమునకు పొంగిపోయాను. మీ అయిదుగురి జోలికి రాను’ అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడయిపోయాడు. తన కళ్ళ ముందు తనవాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షమునకు సర్వసైన్యాధిపతియై నిలబడ్డాడు. అపుడు ధర్మరాజు ‘తాతా నీవు రానక్క రలేదు. కానీ నీకు స్వచ్ఛందమరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనుస్సు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో వుంటే ఎలా తాతా’ అని చేతులు నులిమాడు. ‘ఇప్పుడు ఆ విషయం అడుగకు. కొన్నాళ్ళు పోయాక కనపడు. చూద్దాం’ అన్నాడు భీష్ముడు. ‘మా యోగక్షేమములు మాత్రం దృష్టిలో పెట్టుకో తాతా’ అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#20
భీష్ముడు రోజూ యుద్ధం చేసేవాడు. అనంతరము శిబిరమునకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి 'నీవు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను. ఎంతమందిని చంపావు? ఏమి చేశావు? నువ్వు తలుచుకుంటే ఆర్జునుడిని చంపలేవా? నువ్వు కావాలని పాండవులను వెనక వేసుకు వస్తున్నావు. నువ్వు పాండవ పక్షపాతివి.' అని సూటీపోటీ మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు భీష్ముడిని. పాపం భీష్ముడు, ఆ వయస్సులో అన్నిమాటలు విని ఒకరోజు దుర్యోధనునితో ‘దుర్యోధనా, ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కాని!’ అని మండలాకారమయిన ధనుస్సును పట్టుకున్నాడు.

ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్నివేల మందిని తెగటార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధమునకు పాండవులు గజగజ వణికి పోయారు. అర్జునుడిని భీష్ముని మీద యుద్ధమునకు పంపించారు. అర్జునుడు యుద్ధమునకు వచ్చాడు. భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారధ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుస్సు పట్టనని ఏ విధమయిన అస్త్ర శస్త్రములను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయమును దూతలు వచ్చి భీష్మునికి చెప్పారు. అపుడు భీష్ముడు ‘సర్వ సైన్యాధిపతిగా నేనూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను’ అన్నాడు.

కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. అటువంటి కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఇపుడు ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆరోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనుస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి, ఎందుకూ పనికిరాకుండా పోయాడు. భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది. కృష్ణుని మోదుగ చెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు ఏరులై కారిపోతోంది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మరచిపోయి భీష్ముడిని చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి క్రిందికి దిగిపోయాడు. అప్పుడు భీష్ముడు తన కోదండమును పక్కనపెట్టి కృష్ణుడికి నమస్కరించాడు.

పదిరోజుల యుద్ధం పూర్తయిన తరువాత ధర్మరాజుగారు కృష్ణుడిని పిలిచి అన్నారు, ‘పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంక మనం యుద్ధం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు. అరివీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా?' అని. అపుడు కృష్ణ పరమాత్మ అన్నారు ‘దీనికి ఒక్కటే పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరమునకు వెళ్ళి నమస్కారం చేసి, ఆయననే అడుగు, నేనూ మీతో వస్తాను. పదండి’ అన్నాడు.

అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజుగారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు ‘ధర్మజా, ఇంత రాత్రివేళ పాదచారివై ఎందుకు వచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదయినా కోరుకో’ అని చెప్పాడు. అపుడు ధర్మరాజు ‘తాతా, నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాతా?’ అని అడిగాడు. ప్రపంచంలో ఇది ఎంత దారుణమయిన మాటో ఆలోచించండి. అపుడు భీష్ముడు ఒక నవ్వు నవ్వి ‘నా చేతిలో ధనుస్సు ఉన్నంత కాలం నేను మరణించను. మనవడు అర్జునుని ప్రజ్ఞచూసి అతను వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనుస్సును కొన్ని సందర్భములలోనే ప్రక్కన పెడతాను. రథం మీద స్త్రీవచ్చి, బాణం వేస్తే, ఎవరిదయినా పతాకం క్రిందికి జారిపోతే, వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకుని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకమూ క్రిందకు జారిపోదు. కాబట్టి మీకు ఉన్న అవకాశం ఒక్కటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. ఆ శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి. అపుడు శిఖండి బాణములు వేస్తే నేను ధనుస్సు పక్కన పెట్టేస్తాను. ధనుస్సు పక్కన పెట్టిన పిదప మరల నేను బాణం వెయ్యను. అపుడు వెనకనుండి అర్జునునితో బాణపరంపరను కురిపించి, నా శరీరమును పడగొట్టండి’ అని చెప్పాడు. అపుడు పాండవులు అలాగే తాతా అని చెప్పి వెళ్ళిపోయారు.

వెళ్ళిన తరువాత శిబిరంలో అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. ‘మహానుభావుడు, తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్నా అని మేము ఎవరిని పిలవాలో తెలియక మాపట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధపెడుతుంటే నాన్నా అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నను కాను నాన్నా, నేను తాతను అని చెప్పి, ఆయన ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలములయందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తియై తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడి పోయాడు. అటువంటి వాడిని సవ్యసాచియై గాండీవం పట్టుకుని, శిఖండిని అడ్డుపెట్టుకుని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే, ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్యా?’ అని అడిగాడు. అపుడు కృష్ణుడు కొట్టక తప్పదు. ధర్మం కోసం కొట్టవలసిందే. నీవు కొట్టు తప్పదు’ అన్నాడు.

యుద్ధమునకు వచ్చారు. శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు. అపుడు భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. పెట్టిన తరువాత శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి నూరు బాణములు వేశాడు. భీష్ముని కవచం దుళ్ళి పోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతేలేదు. భీష్ముని శరీరంలో బొటనవేలంత సందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే! మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపులనుంచి నెత్తురు కారిపోతోంది. వీపు చూపించలేదు. కాబట్టి ఒక్క తలవెనక మాత్రం బాణములు తగలలేదు. ఒంటినిండా బాణపరంపరను వేసిన తరువాత సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో భీష్ముడు రథం మీద నుంచి దుళ్ళి క్రింద పడిపోయాడు.

అలా పడిపోయినపుడు ఆయన శరీరం భూమికి తగలలేదు. బాణములతో పడిపోయి ఉండిపోయాడు. అప్పుడు యుద్ధం ఆపి అందరు పరుగు పరుగున భీష్ముని దగ్గరకు వచ్చేశారు. అపుడు భీష్ముడు ‘నాపని అయిపోయింది. నేను స్వచ్ఛంద మరణమును కోరాను. ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరమును విడిచిపెట్టను. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తరువాత, రథ సప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక, ఏకాదశి ఘడియలలో నా ప్రాణం విడిచి పెడతాను’ అని అర్జునుని పిలిచి, ‘నా తల వెనక్కి వ్రేలాడి పోతున్నది. నా మర్మ స్థానములు అన్నీ కదిలిపోతున్నాయి. బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది. నాకు తలగడ అమర్చు’ అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకు వచ్చారు. ‘ఈ తలగడలు కాదు. నాకు కావలసింది యుద్ధ భూమియందు పడుకున్న వానికి బాణములతో తలగడను ఏర్పాటు చేయాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు’ అన్నాడు భీష్ముడు. అపుడు అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడను ఏర్పాటు చేసుకుని ‘నేను ఈ యుద్ధభూమి యందే పడి వుంటాను. ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకం తవ్వండి’ అని కందకం తవ్వించుకుని ఆ భూమిమీద పడి ఉండిపోయాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)