Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కన్నీటికి రంగు లేదు
#1
*కన్నీటికి రంగు లేదు* _(కుటుంబ కథ)
                                         *శశిరేఖా లక్ష్మణన్*
 
ఈ కథ ప్రతిలిపి *జాతీయ కథలపోటీ2020 కై నేను ప్రత్యేకంగా రాసిన కొత్త కథ
———————**కథ**—————————
 
ఎంత సేపు ఏడ్చిందో అర్థం కాలేదు సుభద్రకు.తను తీసుకున్న తప్పుడు నిర్ణయం ఎలా ఇప్పుడు నిలువునా కాల్చేస్తోందో మనసుకు అవగతమవుతోంది.కొడుకు కోపంతో తనను దబీదబీమని వీపుపై కొట్టడంతో మనశ్శరీరాలు గాయపడ్డాక తనివితీరా ఏడ్వడం మొదలెట్టింది.
 
అసలేం జరిగిందంటే సుభద్ర తన తల్లికి తమ్ముడైన వీరేశంను పెళ్ళాడి ముగ్గురు మగపిల్లలనూ ఒక ఆఢపిల్లను కన్నది.వీరేశం సుభద్ర కన్నా పదహైదేళ్ళు పెద్ద.అది వరకే పెళ్ళయి పిల్లలున్నవాడు.
 
అంటే సుభద్ర చిన్నపిల్లగా ఉన్నప్పుడు అతడికి అరుణతో పెళ్ళయ్యింది. ఆ తరువాత తను యౌవనంలోకి వచ్చాక పదహైదేళ్ళ సుభద్రను మోహించి మాయమాటలు చెప్పి ముగ్గులో దింపాడు.అప్పుడు సుభద్ర తొమ్మిదో తరగతి చదువుతోంది.
 
తన మావయ్యనే కదా అని ప్రేమించి ఉత్తరం రాసి ఒక పక్కింటి పిల్లాడి చేత పంపించింది.ఆ ఉత్తరం కాస్తా వీరేశం భార్య అరుణకు అందింది.
 
తను ఊరంతా పోగుచేసి నలుగురిలో సుభద్రను అవమానపరచింది.ఊరిజనం ఇంత రచ్చ అయిన తరువాత సుభద్రను వీరేశం పెళ్ళి చేసుకుంటే బాగుండునని సూచించారు.
 
దాంతో సుభద్రను వీరేశం పెళ్ళి చేసుకున్నాడు.రెండోభార్య అయిన సుభద్రను హైదరాబాదు తీసుకొచ్చి మొదట్లో బానే చూసుకున్నాడు బస్ కండక్టర్ అయిన వీరేశం.అయితే ఆనక సుభద్ర నలభైపడిలో పడ్డాక మొదటిభార్యకి ఆమె పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వసాగాడు.
 
ముందు మొదటి భార్య కూతురుకి పెళ్ళి చేసాడు.ఆ కూతురు అల్లుడు ఇదే ఇంట్లోనే వీరితోపాటు కలిసి ఉన్నారు.
అది చాలదన్నట్లు రెండవ కూతురికి పెళ్ళయ్యాక ఆమె,ఆమె భర్త పెద్దల్లుడు ఉండగా ఇదే ఇంట్లో మేమూ ఉంటామనున్నారు.
 
మొదటి భార్య అల్లుడు ఆ రోజు బాగా త్రాగి వచ్చి ఎక్కడో మట్టిలో తొక్కివచ్చి ఆ బురద మరకల చెప్పులతో ఇంటి హాల్లో అడుగు పెట్టాడు.
 
"ఏంటి మావయ్య..!!బురద మరకలతో నడిహాల్లో అడుగు పెడుతున్నావు.ఇంట్లో ఇంత జనం ఉన్నారు..!!దేవుని పటాలున్నాయి.కొంచెం కాళ్ళు కడుక్కుని ఇంట్లో అడుగు పెట్టవచ్చుగా..!"చికాగ్గా అన్నాడు సుభద్ర మొదటి కొడుకు పాతికేళ్ళ శంకర్ .
 
"నీకెందుకురా..!నువ్వెవడివి నన్ను అడగడానికి ..?"ఈ ఇల్లు మా మామగారిది.మీ అమ్మ రెండో భార్య!ఎంతలో ఉండాలో అంతలో ఉండు."అని హెచ్చరింపుగా అన్నాడు.
 
శంకర్ కి అవమానంగా తోచింది.
 
అక్కడే ఉన్న సుభద్ర "నీకెందుకురా..!!ఎవరెట్ల ఇంటికి వస్తే ..!!" అని కొడుకును మందలించింది.
 
దాంతో శంకర్ కు ఒళ్ళు మండిపోయింది."నీవు ఆ పదహైదేళ్ళకే చదువుకోకుండా రెండోపెళ్ళివాడితో ప్రేమలో పడ్డం వల్లే మాకీ ఇంట్లో అవమానాలు జరుగుతున్నాయి."అంటూ ఛీత్కరిస్తూ కోపంలో కన్నతల్లిని గుభీగుభీమని వీపుపై రెండు పిడి గుద్దులు గుద్దాడు.
 
సవతి అల్లుడి ముందు అవమానమవడంతో సుభద్ర తట్టుకోలేక వలవలా ఏడ్వడం మొదలెట్టింది.
 
తనకు ఎంతో బాధగా అనిపించింది.తల్లిని కొట్టి కోపంలో ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయాడు శంకర్ .
 
సుభద్ర తలపై చేయిపెట్టకుని నట్టింట్లో ఓ మూల కూర్చుని ఏడవ సాగింది.ఇంతలో సుభద్ర సవితి అరుణ అక్కడికొచ్చింది.
 
ఇవేమీ పట్టించుకోకుండా కూతురిని పిలిచి అల్లుడికి భోజనం పెట్టమంది.సుభద్ర కన్నీళ్ళకు అంతు లేదు.
 
 _ ****************_
 
"ఏంటి సుభద్ర ఈ రోజు డల్ గా ఉన్నావు.?"అంట్లు తోముతున్న సుభద్రను అడిగింది మానస.
 
నిన్నటి గొడవంతా చెప్పి సుభద్ర కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
"నాకు నలభై అయిదేళ్ళవుతోంది.పెద్దకొడుకుకి పాతికేళ్ళు.ఆటో నడుపుతున్నాడు.ఏదో తోచింది ఇంటి ఖర్చులకి ఇస్తాడు.
 
చిన్నవాడికి పద్దెనిమిదేళ్ళు.ఇంటర్ చదివి ఏదో గ్యారేజిలో పనికి కుదిరి నెలకు పదివేలిస్తాడు.
 
మరో కొడుకు శ్యామ్ ఇంటర్ చదువుతున్నాడు.కూతురు శిల్ప ఎనిమిదవతరగతి చదువుతోంది.ఇంత వరకు నా ఒక్క సంతానానికి పెళ్ళవ్వలేదు.
 
నా మొగుడికి నేను వయసులో ఉండగా ఉన్న మోహం ఇప్పుడు లేదు.ఖర్చులకు డబ్బు ఇయ్యడు.రిటైరయ్యాక పెన్షన్ డబ్బు లోంచి కొంత ఇస్తాడంతే..!!
 
నేను ఇంట్లో పోట్లాడి...బ్రతిమలాడుకుని మరీ ఈ పాచి పని చేస్తున్నాను.పాపను,ఆఖరి కొడుకునూ చదివించాలిగా..!!
 
ఆ ఇంట్లో ఒక మంచి వంట చేసుకుని తినలేం.నా మొగుడి పెద్దభార్య కూతుర్లూ వాళ్ళ అల్లుళ్ళూ మేము అందరం ఒకే ఇంట్లో ఉంటాము.
 
రోజూ ఏదోక గొడవ.బయట వేరుపడి వెళ్ళలేం.పైగా ఆయన కోపంలో చాలా బూతుమాటలు అని అవమానిస్తాడు.
 
ఎదిగిన పిల్లల మధ్య ఆ మాటలు భరిస్తూ ఉండడం కష్టం."అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
 
మళ్ళీ తనే.."ఇదంతా నాదే తప్పమ్మా..!!పదహైదేళ్ళకే మంచి చెప్పేవారు లేక ఊరు విడిచి ఈయనను పెళ్ళాడి హైదరాబాదు వచ్చేసాను.ఇదంతా నా ఖర్మ..!!చేజేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధం."అంటూ వాపోయింది.
 
నల్లగా ఉన్నా సుభద్ర కళగా ఉంటుంది."అయ్యో!ఎందుకలా చేసావు..!!సరే..!!ఇకపై ఏం చేయగలం..!!పిల్లలైనా మంచివాళ్ళయితే చాలు అనుకో..!"మానస ఓదార్చింది.
 
"ఏం మంచమ్మా!నా పెద్దకొడుకుకి పాతికేళ్ళు.ఈ ఇంటి గొడవలు భరించలేక త్రాగుడికి అలవాటుపడ్డాడు.
ఆటో యాభైవేలు కట్టి కొన్నాడు.మిగిలిన డబ్బు నెలకింతని డ్యూ కట్టాలి.ఆఖరికి డ్యూ కట్టమన్నప్పుడల్లా అమ్మా!కట్టేసానమ్మా!అని అబద్ధం చెప్పి ఆ తరువాత నాలుగైదు డ్యూలు కట్టకపోవడంతో ఇదో మీ ఇంటి పక్కనున్న ఆటోలకి అప్పు ఇచ్చే చమన్ లాల్ సేఠ్ మావాడి ఆటోని మనుషులను పంపి లాక్కునిపోయాడు.
 
దాంతో ఏదో ఒక ఆటో బాడుగకి తీసుకుని నడిపి ఆ డబ్బు ఇస్తున్నాడు.నా పిల్లలెవ్వరూ ఇంకా స్థిరపడలేదు."తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నందు వల్ల పాపం సుభద్ర సంస్కారవంతంగా మాట్లాడుతుంది.
 
మానస మౌనంగా చూస్తుండి పోయింది.ఏం చెప్పాలో అర్థం కాలేదు.సాటి స్త్రీగా జాలిపడ్డం తప్ప.
 
 _**************_
 
సుభద్ర కష్టాలు మరింత పెరిగాయే గానీ తరగలేదు.
అరుణ కూతురు ఒకసారి సుభద్ర పనిలోకి వస్తుండగా దారికాచి ఆమెతో గొడవ పడింది."మా నాన్న డబ్బు రెండు కుటుంబాలకు పంచడం వల్ల, ఇంటి జరుగుబాటు కష్టమవుతోంది.నీ నలుగురు పిల్లల పోషణార్థం వల్ల మా నాన్నకు డబ్బు దండగ."అంటూ సూటిపోటి మాటలంది.
 
కానీ సుభద్ర తక్కువ తినలేదు.
"మా మామ నన్ను బాగా చూసుకుంటానని చెబితే ఆ మాటలు నమ్మి నేను పెళ్ళి చేసుకున్నాను.నాశనమయ్యింది నా బ్రతుకే..!మీ అమ్మకిచ్చిన గౌరవం నాకు మనింట్లో లేదు.పిల్లల చదువుకై నేను రెండిళ్ళల్లో పనిచేస్తున్నాను.
 
నా తప్పుకి నా బిడ్డలనుభవిస్తున్నారు.తండ్రి నీడలో ఉండడం వల్ల వారికో రక్షణ అని ఆ ఇంట్లో గతిలేక ఉంటున్నాను."అంటూ చెడామడా వాయించి పారేసింది.
 
దాంతో అంత వరకు వీరంగం వేసిన వీరేశం మొదటి భార్య అరుణ కూతురు అక్కడ నుండి విసవిసా వెళ్ళిపోయింది.
 
ఆ సాయంత్రం పనిచేసి సుభద్ర ఇల్లు చేరింది.చేరగానే కూతురు సుకన్య పెద్దమనిషయ్యిందని అర్థం చేసుకుంది.
 
"అయ్యో..!!ఇప్పుడేం చేయను..??ఆయన ఇంట్లోలేరు.అరుణక్కతో ఊరికెళ్ళారు.ఈ పిల్లను తీసుకుని నేను ఊరెళ్ళాలా..??లేదా ఇక్కడే ఉండాలా..??అర్థం కావడం లేదు."అంటూ సుకన్యకు మార్చుకునేందుకు బట్టలు ఇచ్చి లోదుస్తులు మార్చి...బజారు కెళ్ళి" విస్పర్" కొనుక్కొచ్చి ఎలా వాడాలో వివరించింది.
 
సుకన్య తల్లి చెప్పినట్లే చేసి ఓ మూల చాపపై కూర్చుంది.
సుభద్ర తర్ణనభర్జనలు పడి మొగుడికి ఫోన్ చేసి మాట్లాడింది.
ఊరికి పాపను తీసుకు రమ్మని ఫంక్షను ఊరులో చేస్తేనే బంధుమిత్రులు వస్తారు...రాబట్టాల్సిన "చదివింపులు" రాబట్టవచ్చని అన్నాడు.
 
"ఆ రోజే కూతురిని,కొన్ని బట్టలు సర్దుకుని సుభద్ర రైలెక్కింది.వెళ్ళాల్సిన చోటు తెల్లారేసరికల్లా వెళ్ళిపోయింది.ఊరికి వెళ్ళి పది రోజులుండి వచ్చింది.
 
మరునాడు పనిలోకి వెళితే మానస వేరే పనిమనిషి రంగమ్మను పెట్టుకునుంది.ఇక అంతే రంగమ్మను చూడగానే..!!
సుభద్ర అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది.
 
"ఏమే..!!నేను ముందే నిన్నడగలా..!!అమ్మగారింట్లో నాలుగురోజులు నేనొచ్చేదాకా పని చేయమని.అయినా నా వల్ల కాదన్నావు.ఆ తరువాత నెల రోజుల వరకు పనిచేయమన్నాను.ఆ తరువాత నే పన్లో జేరతానన్నాను.దానికి ఒప్పుకోలేదు.మరి ఇప్పుడెట్లా సెస్తన్నావు..?? కచ్చగా అంది.
 
రంగమ్మ పాతికేళ్ళ పడచు.సుభద్ర మాటలకి వణికిపోయింది.
 
"లేదక్కా..!!నేను సేయకూడదనే అనుకున్నా!కానీ మానసమ్మ అత్తగారు స్వయంగా రిక్షా వేసుకుని మా ఇల్లు వెతుక్కుంటూ రావడంతో కాదనలేక పోయాను."సంజాయిషీ ఇచ్చుకుంది.
 
ఆ మాటలకి సుభద్ర మెత్తబడి "అయితే..!!ఎలాగూ పదిరోజులు పన్జేసావు కాబట్టి ఈ పదిరోజుల పనికి డబ్బులు తీసుకుని ...పో.,!" అంది.
 
అయిష్టంగానే రంగమ్మ తలాడించింది.మరునాటి నుండి సుభద్ర పనిలో చేరింది.రంగమ్మ రెండ్రోజుల తరువాత వచ్చి తనకు రావలసిన డబ్బు ఇప్పించుకుని వెళ్ళిపోయింది.
 _*****************_
 
"అమ్మా!నే సదవను..??అన్నయ్యలు శంకర్ ,శ్యామ్ లాగా నేనూ ఏదైనా పనిజూసుకుంటా..?"సూటిగా అన్నాడు శ్రీధర్ .
 
"ఏరా..!!నీవైనా బాగా చదివి డిగ్రీ చేయాలనే కదరా..!నేను ఇంటిపని అంతా చేసి పాచిపని చేస్తున్నాను."సుభద్ర నిలదీసింది.
 
"లేదమ్మా..!డిగ్రీ చదువు నీవు చదివించలేవు.నాకు ఈ ఇంటర్ పాసవ్వగానే ఏదైనా షాపులో పనొస్తుంది.అక్కడజేరితే పదివేల దాకా జీతం మొస్తుంది.ఈ ఫైనల్ ఇంటర్ పరీక్షలైయ్యాక నేను పన్లోకెళతాను.కావాలంటే ఇంట్లో నుండే కరస్పాండెన్స్ లో డిగ్రీ చదువుతాను."స్థిరంగా అన్నాడు.
 
పిల్లలకు తనంటే చులకన.వాళ్ళు పడే అవమానాలకు తనే కారణమని తనంటే లోకువ.సుభద్ర "నీ ఇష్టం."అని వదిలేసింది.
 
 _***************_
శ్రీధర్ మంచి మార్కులతో ఇంటర్ ప్యాసయ్యాడు.అంత మంచి మార్కులొచ్చిన కొడుకుని చదివించలేకపోయానేనని సుభద్రకు ఎంతో న్యూనతగా ఉంటోంది.రోజూ పనిలో నుండి రాగానే పిల్లలకి ఏదైనా వండిపెడుతుంది.
 
ఓ రోజు శ్రీధర్ ఎవరో ఫ్రెండు అన్న పెళ్ళికి వెళ్ళి తిరిగి రాలేదు.ఆ రాత్రంతా సుభద్ర కళ్ళల్లో వత్తులు వేసుకుని కొడుకుకై కాచుకుని కూర్చుంది.ఆమె బాధ చూడలేక ఇరుగుపొరుగు వచ్చి ఓదార్చారు.
 
ఎవరైనా పోకిరి కుర్రాళ్ళు బిడ్డను ఏవైనా పెళ్ళి గొడవలల్లో పొడిచారేమో..??ఏదైనా యాక్సిడెంటు అయ్యిందేమోనని కన్నీరు మున్నీరుగా విలపించింది.
 
కనీసం ఫోను కూడా చేయలేదేమని వాపోయింది.
మరునాడు తీరిగ్గా టింగు రంగా అనుకుంటూ వచ్చిన శ్రీధర్ ను చూసి సుభద్ర కౌగిలించుకుని బావురుమంది.
 
శ్రీధర్ ....ఇంటి ముందు పోగైన జనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు."ఏమమ్మా..!! పెళ్ళికి వెళితే మరీ రాత్రవడంతో అక్కడే ఉండిపోమన్నారు.రాత్రంతా అక్కడే ఉండి ప్రొద్దున్నే బయల్దేరొచ్చాను.ఈ లోగా ఇంత "హంగామా " చేస్తావా..??"అంటూ హాస్యాలాడాడు.
 
"రేయ్ ..!!నాకు మీ నలుగురేరా..!!ప్రాణం..మీరు లేకుంటే నే బ్రతకలేను రా..!"అంటూ బేలగా వెక్కి వెక్కి ఏడ్చింది.తల్లి అమాయకత్వాన్ని శ్రీధర్ అర్థం చేసుకున్నాడు.
 
"ఇక పై ఫోను చేసి చెప్తాలే..!!సరే నా..!?ఫోనులో బ్యాలెన్సు లేదు.సరే..!!ప్రొద్దున్నే మొదటి బస్సు ఎక్కి వచ్చాను.ఆకలేస్తోంది..ఏదైనా ఉంటే పెట్టు..!"మాట మారుస్తూ అన్నాడు శ్రీధర్.
 
రాత్రంతా రాకుండా ఉండడంతో సుభద్ర ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని ఆ వీథి జనమంతా ఆమె ఇంటి చుట్టూ ఉన్నారు. శ్రీధర్ రావడంతో అందరూ వారివారి ఇళ్ళకు వెళ్ళిపోయారు.
 
వారి బస్తీలో అదే మరి ఐకమత్యమంటే..!!ఎవరికేమొచ్చినా అందరూ కలిసికట్టుగా పోరాడడం...చిన్నకష్టమొచ్చినా కాకులగుంపులా చుట్టూ చేరిపోవడం.ఆ తరువాత అబ్బే..!!
ఏమీ లేదంటే వెంటనే వెళ్ళిపోవడం.ఇదీ సంగతి..!!
 _*****************_
 
సుభద్ర మానస ఇంట్లో పన్జేస్తూ ఉంది.ఇంతలో రంగమ్మ సుభద్రను వెతుక్కుంటూ వచ్చింది.
 
"అరే..!!సుభద్రా..!!నీకు ఓ విషయం తెలుసా..??మన బస్తీలో యాదగిరిని సంపేసినారంట..!!
అక్కడంతా పరిస్థితి ఉద్రిక్తకరంగా ఉంది.నీవు వెంటనే బయల్దేరి జల్దీ రా..!!
 
మన బస్తీ కుర్రాళ్ళు అందరూ కలిసి ఏదైనా ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు..!!" అంటూ ఆపసోపాలు పడుతూ హడావుడి పెట్టింది.
 
"అయ్యో..!!రామా..!!"అంటూ సుభద్ర లబోదిబోమని మొత్తుకుని మానసతో "అమ్మా..!!రేపొస్తానమ్మా..!!పాపనూ కూడా స్కూలు నుండి తీసుకు రావాలి.మగ పిల్లకాయల్ని యాడికి పోకుండా ఆపాలా..!!యాదగిరి మా బస్తీలో ఓ పార్టీ తరపు చిన్నపాటి నాయకుడు.
తన పార్టీ పలుకుబడితో ఏవో గవర్నమెంటు పనులు చేసి పెట్టి డబ్బు తీసుకుంటాడు.కొంచెం బానే సంపాయించడంతో మా బస్తీలోని ప్రతిపక్ష పార్టీవాళ్ళకి కుళ్ళుపుట్టి సంపించుంటారు.నే వెళ్ళాళ్ళమ్మా..!!
 
మా బస్తీ కుర్రాళ్ళు మగపిల్లల్ని ప్రతీకారం తీర్చుకోవడానికై ఉసికొలిపి ఏదైనా బదులు తీర్చుకుంటారమ్మా!మా పిల్లలను బయటకెళ్ళకుండా నాలుగైదు రోజులు ఈ గొడవ సద్దుమణిగాక పనిలోకి పంపుకోవాలా..!!"అంటూ చకచకా మాట్లాడుతూనే అంట్లు తోమేసింది.
 
"అమ్మా..!!అడ్జస్ట్ చేసుకోమ్మా..!!రేపటికి తడిగుడ్డతో ఫ్లోరింగ్ తుడుస్తాను.ఈ రోజుకి కసువు ఊడ్చి వెళతాను.."అంటూ గబగబా ఆ పని చేసి వెళ్ళిపోయింది.మానస చేసేదేమి లేక చూస్తుండిపోయింది.
 
మరునాడు న్యూస్ పేపర్లో యాదగిరిని ఎలా చంపారో బాక్స్ కట్టి వేసారు.యాదగిరి తన పిల్లలను స్కూలుకు తీసుకెళుతుంటే దారికాచి అటకాయించి అతని పిల్లల కళ్ళ ముందే కసిగా అతడిని కత్తితో పొడిచి చంపేశారు.దాంతో జనం పోగవడంతో ఆటో ఎక్కి పారిపోయారు.ఆటో నెంబరు జనంలో ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్లకు రహస్యంగా అందించడంతో దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ సమాచారం..!!ఇదంతా మానస చదివి అమ్మో!అని నిట్టూర్చింది.సుభద్ర పనిలోకి ఖచ్చితంగా రోజూ వస్తే చాలు అనుకుంది.
 _****************_
 
ఆ రోజు ప్రొద్దున్నే వీరేశంని కడిగి పారేసింది సుభద్ర.
"నాకు నలభై అయిదేళ్ళవుతున్నాయి.నీవా రిటైర్ అయ్యి ఆ సొమ్ముతో నీ ఇద్దరి కూతుర్ల పెళ్ళిళ్ళు చేసావు.నా బిడ్డల గతేం కాను..???ముగ్గురు కొడుకులూ ఇంటరుతో ఆపేసి పన్లో కెళుతున్నారు.చదువుకోవాలసిన వయసులో ఒకడు ఆటో నడిపితే మరొకడు గ్యారేజిలో పన్జేస్తుంటే, ఇంకోడు బట్టల కొట్లో సేల్సుమేను.
మూడోవాడు కూడా సదువుకోకుండా బట్టలకొట్టులో పన్జేస్తుంటే నా గుండెలు పిండేసినట్లవుతాది.ఆడు సదివితే మంచి ఆఫీసరవుతాడు.అంత బాగా చదువుతాడు కూడా..!!అయినా నీవు పిల్లల చదువులు పట్టించుకోలా..!!ఎంతసేపూ నీ మొదటిపెళ్ళాం..వారి పిల్లలూ...వారి భవిష్యత్తు ఇదే ముఖ్యం నీకు..!!నాకూ...నా పిల్లలకూ ఓ దారి చూపు..!! ఆవేదనగా అంది.
 
"ఏంటి సూపేది..??నేనూ ఇత్తన్నానుగా డబ్బు.పైగా నువ్వు పన్లోకెళుతున్నావుగా..!!సదివించు.."ధీటుగా జవాబిచ్చాడు వీరేశం.
 
వీరేశంకి అరవై ఏళ్ళు.అయినా మనిషి బాగా దుక్కలాగా ఉంటాడు.ఆరోగ్యానికే లోటూ లేదు.సుభద్ర అక్క కూతురే కాబట్టి మోజుపడి చేసుకున్నాడు.ఇప్పుడు ఆ ఆకర్షణ తనలో తగ్గడంతో మొదటిభార్యతో చనువు పెంచుకుని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.
 
పైగా అరుణ యాభై పై బడిన స్త్రీ అయినా చాలా తెల్లగా అందంగా ఉంటుంది.అతనికి తగిన భార్యగా ఎన్నో సేవలు చేసింది.అయినా వీరేశం పదహైదేళ్ళ సుభద్ర యవ్వనానికి ఆశపడి పెళ్ళి చేసుకున్నాడు.
 
ఇప్పుడు మళ్ళీ అరుణ వైపు మొగ్గాడు.ఇరువురు భార్యలతో ఒకే ఇంట్లో ఉండడంతో ఇల్లు రణరంగంలా అప్పుడప్పుడూ మారుతోంది.
 
"ఆ ఇస్తున్నావు ??? ఇస్తున్నావు..??సంవత్సరానికోసారి పుస్తకాలు కొనిస్తావంతే..!!
మిగిలిన సంవత్సరమంతా పిల్లకేదైనా నోటుబుక్కు అయిపోతే కొనివ్వవు.!
అందుకే నేను పన్లోకెళ్ళేది.పాప చదువైపోగానే పని మానేస్తాను.నా బిడ్డలకెవ్వరికీ పెళ్ళి చేయలేదు.నీవెన్నాళ్ళుంటావో తెలీదు.నీ పెదభార్య పిల్లలకు పెళ్ళి చేసావు.నా పిల్లలకు ఏం బదులు చెబుతావు..!"అంటూ వాదులాడింది.
 
వీరేశంకి విపరీతమైన కోపమొచ్చేసింది.ఆవేశంలో ఏ మాటంటే ఆ మాటనేసాడు...."ఏంటి..???ఊరికే పిల్లలూ....పిల్లలూ...అంటున్నావు..???వీళ్ళేమన్నా నాకు పుట్టినవాళ్ళా..???వీళ్ళెవ్వరూ నాకు పుట్టలేదు.ఈ నలుగురు పిల్లలూ నాకు పుట్టలేదు..!!"అహంకారంగా అనేసాడు.
 
అభాండంగా నింద వేసాడు.స్త్రీ ఏదైనా తట్టుకోగలదు.కొట్టినా... తిట్టినా ...గొడ్డుచాకిరి చేయించుకున్నా సరే..!!
అయితే తన "శీలం" పైనింద వేస్తే అస్సలు భరించలేదు.ఆ మాట వీరేశం అనగానే సుభద్ర శివంగిలా రెచ్చిపోయింది.అతడి షర్టు పట్టుకుని ముందుకీ వెనక్కీ గుంజింది.
 
కళ్ళల్లో నీళ్ళు కుళాయిలో నీళ్ళు తిప్పినట్లు జలజలా కారిపోతుంటే "ఏమన్నావ్ ..!!ఎవరూ నీకు పుట్టలేదా..???నలుగురూ నీకు పుట్టలేదా..!!నన్ను ఏమార్చి మోసం సేసి మనువాడి ఇంత మాటంటావా..??నీవసలు మొగుడివేనా..??నీకు అస్సలు దిల్లుందా..??లేదా..??మరీ ఇంత గోరంగా మనస్సాక్షి లేకుండా ఎలా మాట్లాడగలవు..???అంటూ రొప్పుతూ అంది.
 
ఇంతలో ఈ గొడవకి అరుణ వచ్చింది."ఏంటే..???మొగుడిని పట్టుకుని గుంజుతున్నావ్ ..??అరవైఏళ్ళ ముసలోడని కనికరం కూడా లేదటే నీకు..???ఒకే ఇంట్లో పాతికేళ్ళు నీతో పాటు ఉన్నానే..??ఎన్నడైనా నా మొగుడిని బాధపెట్టడం గానీ సతాయించడం గానీ చూసావా నీవు..??"అంటూ మొగుడిని వెనకేసుకొచ్చింది.
 
సుభద్ర ఇద్దరినీ చీదరంగా చూస్తూ విడిపోయి జడగా వేలాడుతున్న పొడవాటి కొప్పు ముడి వేసుకుని వడివడిగా సెక్యూరిటీ ఆఫీసర్స్టేషనుకు బయల్దేరింది.
 
అక్కడ మొగుడు తనకు గవర్నమెంటు బస్ కండక్టర్ గా రిటైర్ అయ్యాక పైసా ఇవ్వలేదని పైగా పెద్దభార్యనే బాగా చూసుకుంటున్నాడని తనకూ తన పిల్లలకూ అన్యాయం జరిగిందని కంప్లైంటు చేసింది.
 
అక్కడి ఎస్ ఐ..."చూడమ్మా ..!!ఇలాంటి సంసారగొడవలు సెక్యూరిటీ ఆఫీసర్ల వరకు తీసుకు రాకూడదు..పైగా మీరందరూ ఒకే కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారన్నారు.
 
ఎవరైనా సరే చట్టపరంగా పెళ్ళాడిన భార్యనే సమర్థిస్తారు.మీ ఆయనని పిలిచి మందలిస్తాను.ఏదేని డబ్బు ఇమ్మని చెబుతాను."అని సర్దిచెప్పి పంపేశాడు.
 
అన్నట్లుగానే తన ఇద్దరు కానిస్టేబుళ్ళను పంపి వీరేశంని పిలిచి ముక్క చీవాట్లు పెట్టి సుభద్రకు ఎంతో కొంత రొక్కం ఇమ్మన్నాడు.యాభైవేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
అయ్యా..!!గతంలో యాభైవేలు పెట్టి పెద్దాడికి ఆటో కొనిచ్చాను.రెండేళ్ళు నెలకింతని డ్యూ కడితే ఆటో వాడి సొంతమవుతుంది.
 
వాడు ఆటో బాడుగలు దండిగ రాక డ్యూ కట్టలేకపోయాడు.దాంతో బాడుగకి ఏ రోజు ఆటో దొరికితే ఆ రోజు ఆటో నడిపి ఇంటికి డబ్బు ఇస్తున్నాడు.నా రెండోభార్యకు ముగ్గురూ కొడుకులు...బానే సంపాయిస్తున్నారు.డబ్బు సుభద్రకే ఇస్తారు.అలాంటప్పుడు నేనెందుకివ్వాలి..??
ఇన్నాళ్ళు ఎంతో కొంత నెలకు ఇస్తూనే వచ్చాను.నా ఇద్దరు అల్లుళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు.వారి తిండితిప్పల ఖర్చు నేనే భరించాలి..!ఇదంతా ఆలోచించండి మరి..!"అని వినయంగా అన్నాడు.
 
అక్కడే సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ లోనే ఉన్న సుభద్ర యాభైవేలు తీసుకోవడానికి అయిష్టంగానే అంగీకరించింది.అంతకన్నా మొగుడి దగ్గర డబ్బు లేదని తెలుసు.
 
కథ అప్పటికి ఓ కొలిక్కి రావడంతో ఎస్ .ఐ. ఊపిరి పీల్చుకున్నారు.సుభద్ర ఆమె ముగ్గురు కొడుకులూ అక్కడే ఉన్నారు.
 
ఎస్ .ఐ. "మీ తల్లిని మీరైనా బాగా చూసుకోండి.."అని హితువు పలికాడు.
 
"అలాగే సారూ..!"అంటూ తల్లినీ తండ్రినీ తీసుకెళ్ళారు.సుభద్ర అప్పటికి శాంతించింది.యాదగిరి హత్యకేసులో నిందితులు ఆ బస్తీ లోనే ఉన్న మరో పార్టీకి చెందినవాళ్ళు.
 
ఆటో నుండి దిగి యాదగిరిని మాటువేసి మరీ కత్తితో పొడవడం నేరుగా చూసిన స్థానికులు ,ప్రత్యక్ష సాక్షులు ఆ ఆటో నెంబరు చెప్పి క్లూ అందించారు.ఇదంతా అసూయతో చేసిన హత్య అని నిరూపించబడడంతో ఆ బస్తీలో చిన్న అలజడి ఏర్పడి రెండురోజులకి సద్దు మణిగింది.
 
సుభద్ర ఎప్పట్లానే పనిలోకి వెళ్ళడం ప్రారంభించింది.జీవితం అటూఇటుగా సాగిపోతోంది.ఇంతలో మళ్ళీ మరో అతలాకుతలం.
 
పులి మీద పుట్రలా వారి ఇరు కుటుంబాలపై పడింది.శంకర్ ఆటోలో ఒక కాలేజి అమ్మాయి రోజూ వెళుతుంది.ఎప్పుడు మొదలైందో ఎలా మొదలైందో వారి మధ్య ప్రేమ ఆరంభమైంది.
 
ఇంట్లో తెలిస్తే పెద్దింటిపిల్ల మనకు ఒద్దురా..!!
అని అంటారని శంకర్ రహస్యంగా ఆ పిల్లను పెళ్ళాడి ఇంటికి తీసుకొచ్చాడు.ఆ రోజు వీరేశం చెడామడా తిట్టి ఇంట్లో నుండి ఇద్దరిని వెళ్ళగొట్టాడు.రోషంతో శంకర్ తన ప్రేయసి సమీరను తీసుకుని వెళ్ళిపోయాడు.
 
సమీర ఇంట్లోనూ తిట్టిపోసారు.అయితే శంకర్ ఇంట్లోవారిని వెళ్ళగొట్టారని తెలియగానే వీరికి జాలి వేసింది.
 
రెండిళ్ళల్లోనూ వెళ్ళగొడితే తమ ఒక్కగానొక్క కూతురి గతేం కాను..??అందుకే ఇక తన కూతురూ అల్లుడూ ఇక్కడే ఉంటే మేలు అని భావించి వారిద్దరినీ లోనికి ఆహ్వానించారు.
 
 _*****************_
 
మిగిలిన ముగ్గురి పిల్లల జీవితం యథాలాపంగా కొనసాగింది.శంకర్ ఇంటికి అస్సలు రావడం లేదు.సుభద్ర పెద్దకొడుకు శంకర్ ని తలచుకుని ఏడవని రోజు లేదు.పెద్దకొడుకంటే సుభద్రకు పంచప్రాణాలు.శంకర్ మామగారి ఫాక్టరీ చూసుకుంటూ ఇంటల్లుడిగా ఉండిపోయాడు.సుభద్ర ఉనికి ఇష్టపడడం లేదు.
 
తన తల్లి తన తాహతుకు తగినట్లు మంచి చీర కట్టుకోవడం లేదని..
"అమ్మా..!!నీవు రావద్దు..!!వీలైతే నేనే వస్తాను..!!"అని నిర్మొహమాటంగా అనేశాడు.
 
అన్నట్లుగానే తల్లికి ఆరునెలల తరువాత మంచి చీరలు కొని అవి కట్టుకుని తన అత్తగారి ఇంట ఏదైనా ఫంక్షను ఉంటే "పిలిస్తేనే.." రమ్మని చెప్పేశాడు.
 
ఆ మాటలు సుభద్రకు ఎంతగానో అవమానంగానూ బాధగాను అనిపించిందంటే "కన్నీళ్ళరంగు ఎంత ఏడ్చినా ఎవరికీ కనపడదు..!!"
 
చారికలు కట్టిన బుగ్గలే కనపడతాయి తప్ప కళ్ళ నుండి స్రవించి కారిపోయి ఆరిపోయాక కన్నీళ్ళు ఎవరికీ కనపడవు.
 
ఎన్ని ఆటుపోట్లెదురైనా తట్టుకుంది.
కన్నకొడుకు మాటలకు ధైర్యం అంతా కోల్పోయింది.
 
మనసుకు ఎంతో వైరాగ్యంగా అనిపించింది.
 
తనకన్నా వయసులో పెద్దైనవాడికీ..!
అది వరకే పెళ్ళైనవాడికి "రెండోపెళ్ళాం" అవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు.
 
సినీతారలకీ ఇతరత్రా ఆర్థికంగా ఉన్నవాళ్ళకీ రెండోపెళ్ళివాడిని చేసుకోవడం వల్ల అవమానాలు,కష్టాలు తప్పలేదు మరి తనలాంటి ఏ ఆర్థిక ఆధారం పెద్దగా లేని స్త్రీలకు ఇంతకన్నా ఎక్కువ కష్టాలే ఉంటాయి గానీ ఇంతకు తక్కువ ఉండదు.
 
ఈ కష్టాలకు అంతం లేదు.
చేసుకున్నవారికి చేసుకున్నంత.
సవ్యంగా తల్లిదండ్రులు కుదిర్చిన మొదటిపెళ్ళివాడే కొన్ని ఇళ్ళళ్ళల్లో తన ఇల్లాలిని చిత్రహింసలు పెడుతున్నాడు.
ఇక తనకు ఎందుకు కష్టాలు రావు?
 
ఈ కష్టాలన్నీ తలచుకుని ఎంత ఏడ్చినా వినే ఎవ్వరి మనసూ కరగదు.
అస్సలు కన్నీటికి రంగు లేదు.
 
అయిపోయింది

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథ చాల అద్భుతంగా ఉంది  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)