Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
A Story by Dr Vempalli Gangadhar
#1
జమీందారి బంగ్లా -   Dr Vempalli Gangadhar
 
గుర్రపు బగ్గీ చెట్టు కింద నీడలో కనిపిస్తోంది.బయటికి వెళ్లే పని లేకుండా ఇవాళ జమీందారు గారు బంగ్లా లోనే ఉంటారు కాబోలు. నౌకర్లు అటు ఇటు గా ఇంటి పనులు చేస్తూ వేగంగా తిరుగుతున్నారు.
సిరా బుడ్డీ లో కలాన్ని అద్దుకొని చేవ్రాలు పెట్టిన కాగితాలు పట్టుకొని గుమస్తాలు కార్యాలయంలోని గదిలోకి పరుగులు పెడుతున్నారు. వాతావరణం అంతా హడావిడిగా ఉంది.
పట్నం నుంచి నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు.
తాము వచ్చిన సంగతి, తమ వివరాలను అక్కడున్న బంట్రోతుకు చెప్పారు.
అతను కాసేపు వాళ్లను ఆవరణ లోని చెక్క కుర్చీ ల్లో ఆసీనులు కమ్మని సైగ చేశాడు.
వాళ్లు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆ కుర్చీల్లో కూర్చుండిపోయారు.
కొంతసేపటి తర్వాత వారికి జమీందారు గారి గదిలోకి అనుమతి లభించింది. తేనీరు కప్పులు లోపలికి వెళ్లాయి.
గట్టిగా జమీందారు గారు నవ్విన నవ్వు బయటకు వినిపించింది. వారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. మామూలుగా అయితే వారి కేకలతో బంగ్లా మొత్తం దద్దరిల్లుతుంటుంది . క్షణమొక యుగమై , తుఫాను ముందు ప్రశాంతతను మోస్తూ, నిరంతరం అప్రమత్తమై ఉంటుంది.
నౌకర్లు గుండెను అరచేతిలో పెట్టుకొని తిరగడం ఒకటే తక్కువ.
బంగ్లాలో పని చేయడం అంటే ఆషామాషీ కాదు.
కొంత సమయం గడిచిన తరువాత జమీందారు గారి తో సహా,
ఆ నలుగురు కూడా బయటికి వచ్చారు. బంగ్లా మొదట్లో ఉన్న పొడవాటి రాతి మెట్లను దిగారు. అట్నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చారు. వాళ్ళల్లో పొడవుగా ,లావుగా ఉన్న వ్యక్తి అక్కడొక పెద్ద వలయం గీశాడు మట్టిలో. సరిపోతుంది అన్నట్లు జమీందారు గారు తలాడించారు. మళ్లీ వాళ్లను లోపలికి తీసుకెళ్లారు.
అక్కడ ఎడమ వైపు గోడకు ఉన్న ఎత్తైన తైలవర్ణ చిత్రాన్ని చూపిస్తున్నారు. అది జమీందారు గారి తండ్రి గారిది. ఆ చిత్రంలోని వ్యక్తి అశ్వం పై కూర్చున్న విధానంలోని గంభీర ధీరత్వం , ముఖకవళికలను, తేజస్సును, రాజసాన్ని, వీరత్వాన్ని గురించి కథలు కథలుగా చెప్తున్నారు. వాళ్లు వింటున్నారు. తన తండ్రిగారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తయారుచేయించి బంగ్లా బయట ప్రవేశ మార్గంలో ప్రతిష్టించాలని జమీందారు గారు చాలా కాలంగా అనుకుంటూ ఉన్నారు. ఆ పని నిమిత్తమై ఇప్పుడు పట్నం నుంచి అదేపనిగా ఈ తయారీదారులను పిలిపించారు. కాంస్య విగ్రహం ఎలా ఉండాలని తను కోరుకుంటున్నాడో, తన మనసులోని ఆలోచనలన్నింటినీ వారికి వివరంగా చెప్పారు. దివాణం లోని ఖజానా అధికారిని పిలిచి కొంత రొక్కాన్ని వారికి ఇప్పించారు. ఇక వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పి, వారు సంతోషంగా వెళ్లిపోయారు.
బంగ్లా లోపలికి అడుగుపెడుతూనే పైన ఎదురుగా 
భీకర రూపంలో ఉన్న పులి తల, దాని చర్మము గోడకు బిగించబడి ఉన్నాయి.
కుడి వైపు గది పై భాగాన బలిష్టమైన , నునుపైన తెల్లని ఏనుగు దంతాలు అలంకరించబడి ఉన్నాయి. ఎడమ వైపు గది పైభాగాన ఒంపులు సొంపులు గా పురి తిరిగిన జింక కొమ్ములు కనిపిస్తాయి. మరో వైపు గోడకు నాటు తుపాకులు సగర్వంగా పలకరిస్తాయి.
బంగ్లా దర్బారు మందిరంలో అటు ఒక సింహం , ఇటు ఒక సింహం తో తయారుచేసిన నైపుణ్య మైన కొయ్య సింహాసనం. దానికి అటువైపుగా నిలువెత్తు వీర ఖడ్గం. ధరించడానికి సిద్ధంగా ఉన్నా ముత్యాల పట్టుకుచ్చుల తలపాగా , పులిగోరు హారం, మెరిసేటి విదేశీ పట్టు వస్త్రాలు, ఆభరణాలు, మెత్తటి మేజోళ్ళు, పరిమళాల అత్తర్లు, పూలాభిషేకాలు .. ఒక్కటేమిటి ? తరతరాల జమీందారు గారి సంస్థానం చూడ్డానికి రెండు కళ్లు చాలవని జనం అందరూ చెప్పుకుంటారు.
జమీందారు గారు సంస్థానంలో కి ఎవరొచ్చినా మంచి ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ.
మీది ఏ ఊరు అయినా, ఏ పని ఉండి ఇక్కడికి వచ్చినా ఆకలి కడుపుతో బాధపడకూడదని జమీందారు గారి ఆజ్ఞ. అందుకోసమే ఎడమవైపు చింతవనం దగ్గర వంటశాల, భోజనశాల కట్టించారు. పొయ్యి ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. రావుబహద్దూర్ అనిపించుకున్న తన తండ్రి గారు బాటసారుల కోసం నిర్మించిన సత్రాలు కూలిపోయిన చోటల్లా మళ్లీ కొత్తగా నిర్మిస్తూనే ఉన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు చెరువులు, బావులు త్రవిస్తూనే ఉన్నారు. కరువు కాటకాలు వచ్చిన ప్రతిసారి, ఆదుకోమని చెయ్యి చాచి, బంగ్లా బయట నిలబడ్డ ప్రతి నిరుపేదకు, నిర్భాగ్యునికి సహాయం అందేది. వారి కన్నీళ్లు తుడిచి పంపేవారు.
జమీందారు గారి గుర్రాన్ని చూడ్డానికి కూడా చుట్టుపక్కల ఊర్లల్లో నుంచి జనం వచ్చేవారు. వారి గుర్రపుస్వారీ కనువిందుగా ఉండేది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గుర్రాలను తేప్పించే వారు.
తెల్లటి గుర్రానికి ముఖంపైన నల్లటి నామం ఉంటే అదృష్టం అని నమ్మారు. అలా రాజసం ఉట్టిపడేలా ఉండే గుర్రం కోసం చెన్నపట్నం వెళ్లారు. దొరకలేదు. అట్నుంచి బొంబాయి పోయారు. దొరకలేదు. అట్లా అన్వేషిస్తూనే బరోడా , ఇండోర్, గ్వాలియర్ తిరిగొచ్చారు. చివరికి మైసూరు లోనే దొరికింది. ఎక్కువ మొత్తానికి ఖరీదు చేసికొన్నారు
ఆ గుర్రం అంటే వారికి ప్రాణం. ఎంతో నమ్మకం. గుర్రపు పందాలు ఆడడం అలవాటైంది. సంస్థానంలో ఉన్న కాలం కంటే, గుర్రపు పందాలు ఆడుతూ ఎక్కడెక్కడో తిరిగే సమయం ఎక్కువ. బంగ్లాకు వచ్చినా కూడా మత్తుగా తాగి, చిత్తుగా పేకాట ఆడుతూ గడిపేవారు. విలాస పురుషుడు. సుఖ లోలుడు . అందుకే తన ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి చేయకుండానే పెద్ద వాళ్ళందరూ కాలంతో పాటు వెళ్ళిపోయారు
ఉదయాన్నే ఒక నాటక సమాజం వాళ్ళు వచ్చారు
ఇక్కడే మూడు రోజులపాటు విడిది చేసి, 'సారంగధర' నాటకాన్ని ప్రదర్శిస్తామని వేడుకున్నారు. తమరు దయతలచి సహాయ , సహకారాలు అందించాలని మనవి చేసుకున్నారు
ప్రతిరోజు సాయంత్రం నాటకం ఆసక్తిగా జనం చుట్టుపక్కల పల్లెల నుంచి బండ్లు కట్టుకొని వచ్చి మరీ తిలకించేవారు. బంగ్లా పైనుంచి మద్యం సేవిస్తూ జమీందారు గారు వీక్షించే వారు. నాటకంలో చిత్రాంగి పాత్ర వేసిన నాట్య నర్తకి ని తన గదికి రమ్మన్నాడు
వెళ్లక తప్పలేదు
చివరి రోజు పొద్దున్నే దివాణం లోని ఖజానా గుమస్తా వచ్చాడు.
నాటక బృందంతో మాట్లాడి వాళ్లకి ఏం కావాలో అది ఇచ్చి సంతోషంగా పంపాడు
కాలం ఇట్లా సాగుతుండగానే
సంస్థానంలోని గ్రామాల్లో మశూచి ప్రబలింది. అనారోగ్యంతో ఎంతోమంది ప్రాణాలు విడిచారు. కరువు మేఘాలు కమ్ముకున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి
ఆహారం అందని పరిస్థితి.
కూడళ్ళలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది
కాలం ఇప్పుడు ఏం బాగోలేదు. కర్కశంగా ఉంది
సాయంత్రం కాగానే బంగ్లా లోని దీపాలన్నిటికీ నూనె పోసి వెలిగించి వెళ్లిపోయారు పనివాళ్ళు
అవి అట్లా తెల్లవార్లూ వెలుగుతూనే ఉంటాయి.
బంగ్లా నిశ్శబ్దంగా ఉంది. నిర్మానుష్యంగా ఉంది.
 'దివాణం దివాలా తీసింది. ఖజానా ఖాళీ అయింది.' అని అందరూ అనుకుంటున్న మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి.
 జమీందారు గారికి రాత్రంతా ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి
అసహనంగా ఉంది. దూరం గా ఏదో పక్షి ఆగి ఆగి అరుస్తోంది .
కాలుస్తున్న నోట్లోని పొగచుట్ట అయిపోయింది. వేళ్ళ మధ్యలో మిగిలిన చివరి ముక్క అటువైపు కోపంగా విసిరేసాడు.
ఒక నిశ్చయానికి వచ్చాడు
తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
అప్పటివరకు బయట వరండాలో దేదీప్యమానంగా, ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపం నూనె అయిపోవడంతో ఒక్కసారిగా బగ్గున వెలిగి ఆరిపోయింది.
 
 
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సహదేవుడి వేణువు - Dr Vempalli Gangadhar
అంతఃపుర స్త్రీలందరూ గుమిగూడారు.రాణివాసం తలుపులు తెరుచుకున్నాయి.
'నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మేము కూడా వేణు గానం చేయాలి. ఆ విద్య నువ్వే మాకు నేర్పాలి' అని పట్టుబట్టారు.
బృహన్నల బేల చూపులు చూసింది. వేణువు ఊదడం తనెప్పుడూ నేర్చుకోలేదు.
రాజగృహ మాలినీమణుల కోరిక తీరేది ఎట్లానో...
'వేణుగానం నాకు రాదు. నన్ను శిక్షణ ఇమ్మని బలవంతం పెట్ట వద్దని' అమాయకంగా ముఖం పెట్టి ప్రాధేయపడింది. కానీ వాళ్ళు వినేటట్టు లేరు.
ఇప్పటికిప్పుడు వేణువు పైకి వీళ్లకు మనసు ఎందుకు పోయిందో అంతుబట్టడం లేదు.
 ' మన దగ్గర, ఈ గదిలో వేణువు కూడా లేదు కదా. మీకు నేర్పించడానికి...' అని తప్పించుకోవాలని చూసింది.
' అదెంత సేపట్లో పని, ఇప్పుడే కబురంపి చిటికెలో తెప్పిస్తాం ' అని అన్నారు వాళ్ళు ఉత్సాహంగా. ఎవరక్కడ? అనగానే వచ్చిన పరిచారిక తో వేగంగా వెళ్లి ఒక వేణువు ను తీసుకొని రమ్మని పురమాయించారు కూడా!
 'దేవుడా ...వీళ్లు వదిలేలా లేరు' అని తల పట్టుకుని కూర్చుంది బృహన్నల.
 ఏదో ఆలోచన మదికి తట్టింది. వెంటనే 'మన రాజ్యంలో బాగా వేణుగానం చేయగలిగిన కళాకారుడిని పిలిపించి అతని ద్వారా ఆ విద్య అందరం నేర్చుకుందాం.' అని తనకు తోచిన ఆలోచనను అందరికీ చెప్పింది. 'చాల్లే ఆపు నీ మాటలు' అన్నట్లు చూశారు.
'అంతఃపుర రాణివాసం లోకి పురుషుడు అడుగు పెట్టే అవకాశం లేనేలేదని' తేల్చి చెప్పారు.
 బృహన్నల గుండెల్లో బండ పడి పడినట్లయ్యింది. అటూ ఇటూ చూసి మెల్లిగా అక్కడి నుంచి బయట పడింది.
 2
మత్స్య రాజు పరిపాలించే రాజ్యం.
పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం ముగించుకున్నారు. విరాట నగరం చేరుకున్నారు. విరాట రాజు కొలువులో- 'కంకుడు ' పేరుతో ధర్మరాజు, 'బల్లవ ' గా భీముడు, ' బృహన్నల' గా అర్జునుడు, 'గ్రంధిక' గా నకులుడు, ' తంతి పాలుడు' గా సహదేవుడు, 'సైరంధ్రి 'గా ద్రౌపది... మారుపేర్లతో కొలువులు చేస్తున్నారు. కాలం గడుస్తూ ఉంది.
 ఇదిగో ఇప్పుడు ఇలా ఊహించని రీతిలో తనకు వచ్చిపడిన 'వేణుగాన' సంకటాన్ని గురించి అర్జునుడు సతమతమవుతూ ఉన్నాడు.
రాజమహల్ వద్ద తారసపడిన ధర్మరాజుతో తో ఇదే విషయాన్ని చెప్పాడు .
 ' అర్జునా... ఎందుకైనా మంచిది. నువ్వు ఒకసారి సహ దేవుడిని కలిసి మాట్లాడు. సమస్య ఒక కొలిక్కి వస్తుంది. శ్రీకృష్ణుడు, సహదేవుడు ఇద్దరూ కలిసి వేణుగానం విద్యపై , అందులోని మెలకువల పై లీనమై మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, నేను చాలా సార్లు చూసాను. నిన్న ఈ గండం నుంచి గట్టెక్కించగలిగినవాడు - సహదేవుడే' అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.
అర్జునుడు సహ దేవుడిని వెతుక్కుంటూ గోశాల వైపుకు కదిలాడు.
 
గోశాల నిశ్శబ్దంగా ఉంది. సహదేవుడు అక్కడ లేడు.
 
ఆవుల మందలను తోలుకొని ఉదయాన్నేకొండకు వెళ్లాడని సాయంత్రం తిరిగీ వస్తాడని అక్కడున్న పనివాళ్ళు చెప్పారు. అర్జునుడికి ఎందుకో ఒక సందేహం వచ్చింది.
'సహదేవునికి వేణువు వాయించడం వస్తుందా?' అక్కడున్న వారిని అడిగాడు.
వాళ్ళు ఆశ్చర్యంగా ఎగాదిగా చూశారు.
'సహదేవుడి వేణుగానానికి గోవులు పరవశించి పోతాయని' చెప్పారు.
 'అతడి వేణు గానం తో ప్రాతఃకాలంలోనే నిద్రలేచి గోవులు తమంతకుతాముగా పాలిస్తాయని' అని వాళ్లు చెప్పారు. అతడట్లా వేణువు వాయించుకుంటూ ముందు వెళ్తుంటే వెనుక వేలాది ఆవులు తన్మయత్వం తో లయబద్ధంగా అడుగులు వేసుకుంటూ, మెడలోని గంటల శబ్దం తో కొండకు కదులుతాయని, చూడ్డానికి అదొక వేడుకలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు.
అర్జునుడికి నమ్మశక్యంగా లేదు.
కొండలోని రాతి బండ పైన కూర్చొని సహదేవుడు వేణు గానం చేస్తున్నప్పుడు మేఘాలు నీడలుపడతాయని, ఆవులకు దాహం వేసినపుడు వానలు కురిపిస్తాయని, చెరువులు, కుంటలన్నీ నిండుతాయని, పచ్చని ప్రకృతి పరవశించి పశుపక్ష్యాదులకు ఆహ్లాదాన్ని ఇస్తుందని' వాళ్ళు అట్లా చెబుతూనే ఉన్నారు.
'వీళ్ళు చెబుతున్నది సహదేవుని గురించేనా?' అనే సందేహం లోనే అర్జునుడు ఉన్నాడు.
 'సహదేవుడి వేణుగానం వింటూ ఒకవైపు గోవులు, మరోవైపు పులులు ఆ ప్రాంతంలో పక్కపక్కనే సంచరిస్తూ ఉండటం కూడా మేము చూశామని' ఇంకొందరు చెబుతున్నారు.
అంతా గందరగోళంగా అనిపిస్తోంది.
'సరే... సహదేవుడు వచ్చిన తర్వాతనే కలుస్తాను' అని చెప్పి గోశాల నుంచి వెనక్కి వచ్చేశాడు అర్జునుడు.
పైన ఆకాశం నిర్మలంగా ఉంది.
సాయం సమయం కోవెల కోనేరు మెట్ల పైన
ఒకవైపు అర్జునుడు కూర్చుని ఉన్నాడు.
మరోవైపు సహదేవుడు ఉన్నాడు.
' నీకు వేణువు వాయించడం వచ్చునా...' సందేహంగా అడిగాడు అర్జునుడు
తన చేతిలోని వేణువు తీసి , చేత్తో తుడిచి, పెదవి అంచుకు చేర్చి సుతారంగా గాలి ఊదాడు.
 సమ్మోహన అమృత సంగీత తరంగాలు.
చూస్తుండగానే కొలనులోని పూలన్నీ విచ్చుకున్నాయి. ఎక్కడి నుంచో రెండు రాజహంసలు ఎగురుతూ వచ్చి కోనేరులోకి చేరాయి. పురివిప్పిన మయూరాలు పచ్చటి పచ్చిక పైన ఆడుతున్నాయి. 
 ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది.
' సహదేవ...! నాకు వేణువు వాయించడం నేర్పించాలి. ఆ విద్య నాకు ఇప్పుడు అవసరం వచ్చింది. అంతఃపుర రాణివాసపు స్త్రీలు తమకు నేర్పించమని పట్టుబడుతున్నారు.' అని అన్నాడు అర్జునుడు.
సహదేవుడు సరేనన్నట్టు తలాడించాడు.
 'నేనేం చేయమంటావు' అడిగాడు అర్జునుడు ఆసక్తిగా.
 'సాధన ' అని జవాబిచ్చాడు సహదేవుడు.
'ఇది నా ప్రతిభాపాటవాలు సంబంధించిన విషయంగా మారింది. సరిగ్గా చెప్పు'తీక్షణంగా చూస్తూ అన్నాడు.
'సాధన' అని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు.
'సరే , ఇదిగో నేను తెచ్చుకున్న వేణువు ను ఒక సారి వాయిస్తాను. చూడు.' అని అర్జనుడు వేణువును పెదవుల వద్దకు చేర్చి గాలి ఊదాడు.
 అందులోనుంచి ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది.
మరోసారి వాయించాడు .
అది పలకలేదు. గాలి తుస్సి పోయింది.
సహదేవుడి వైపు ముఖం చిట్లించుకొని చూసాడు.
'సాధన చేస్తూ ఉంటే వస్తుంది ' అని సావధానంగా అన్నాడు సహదేవుడు .
'వెదురు లో ఏదో లోపం ఉన్నట్టుంది ' అని సమర్థించుకున్నాడు అర్జునుడు.
సహదేవుడు చిన్నగా నవ్వాడు.
సహదేవుడి వేణుగాన విద్య అంతా అతడిలో ఉందా ? అతడి వేణువులో ఉందా ?
అర్జునుడికి ఏదో అర్థమైంది.
స్పష్టత వచ్చినట్లైయింది . దులుపుకొని పైకి లేచాడు.
సహదేవుడి వైపు సంతృప్తి గా చూసాడు.
'చివరిగా చెప్పు ...ఏమి చేయమంటావు?' అని అడిగాడు తన చేతిలోని వేణువును కోనేరులోకి విసిరేస్తూ.
'ఏ వేణువు అయినా ఒక కొయ్య ముక్కనే. అందులోకి నువ్వే ఊపిరి ఊది సంగీతాన్ని పుట్టించాలి. దాని కోసమే కావాలి-సాధన ' అంటూ స్థితప్రజ్ఞత తో చెప్పాడు . బయలుదేరడానికి పైకి లేచాడు సహదేవుడు.
ఆకాశం లోకి రాత్రి ని మోసుకొంటూ చంద్రుడు వస్తున్నాడు .
ఎవరి పాటికి వాళ్ళు వెళ్లిపోయారు.
ఎప్పటిలాగానే ప్రాతఃకాలంలోనే నిద్ర లేచాడు సహదేవుడు.
కాలకృత్యాలు ముగించుకున్న తరువాత వేణుగాన సాధన చేయడానికి పూనుకున్నాడు.
తలుపు కు అటువైపు ఉన్న గదిలో రోజూ వేణువు పెట్టె చోట చూశాడు. అది అక్కడ లేదు. కిందా, పైనా వెతికాడు. కనిపించలేదు.
తనలో తానే నవ్వుకున్నాడు.
కొత్త వేణువు తయారు చేసుకోవడానికి వెదురు పొదల దారి వైపు కి ముందుకు కదిలాడు.
 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#3
Nice stories  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)