Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#31
కర్దముడు – కపిలుడు:

వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి, ఒక అద్భుతమయిన ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితము.

స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టిచేసిన పిదప, ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒకమాట చెప్పారు. ‘నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమును నిర్వహించాలి.నీకు అనురూపయై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కను. ఇది నాకోరిక’ అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితము. కర్దముడు తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు. అపుడు స్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణంగా భగవద్దర్శనము అయినపుడు భక్తుని కన్నుల వెంట ఆనందభాష్పములు కారతాయని చెప్తాము. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కన్నులవెంట ఆనందభాష్పములు జారి నీలమీద పడ్డాయి. అది ఎంత విచిత్రమయిన సంఘటన అంటే – ఆయన కన్నుల వెంట కారిన భాష్పబిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినచోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరమును ‘బిందు సరోవరము’ అని పిలిచారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి ‘ఈశ్వరా, నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము. అది ఎవ్వరిచేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగాద్వేషములు లేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలములో జీవులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలమునందు అల్పమయిన భోగములయందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమయిన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగము అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భాగమును అనుభవించి వైరాగ్యమును పొందాలి’ అన్నాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు ‘నాయనా, నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు?’ అని అడిగారు. అంటే ఆయన ‘నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశం చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రి మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యమ్. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి’ అని అద్భుతమయిన స్తోత్రం చేశాడు.

ఆయన స్తోత్రమునకు పరమాత్మ సంతోషించి ‘కర్దమ ప్రజాపతీ! నీ స్తోత్రమునకు నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వాయంభువ మనువు వస్తున్నాడు. ఆయనకు ‘అకూతి’, ‘దేవహూతి’, ‘ప్రసూతి’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లను ఇస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు’ అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చుని గరుడుని రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోనుండి సామవేదమును కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనము అంటే ఒక పక్షి కాదు. సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు.

కర్దమ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వాయంభువ మనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్యయైన శతరూప తోటి, తన కుమార్తె అయిన దేవహూతి తోటి వచ్చి కర్దమ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు. కానీ జ్ఞానము చేత పెద్దవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వాయంభువ మనువు నమస్కరించి ‘నాకు ముగ్గరు కుమార్తెలు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశీల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినపుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్నతర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోర్కె నా కుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసినది’ అని అడిగాడు. అపుడు కర్దమ ప్రజాపతి ‘నీ కుమార్తె ఎంతటి సౌందర్య రాశో నాకు తెలుసు. ఎవరికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు.నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయింది. అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజున చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను’ అన్నాడు. కర్దమ ప్రజాపతి దేవహూతిల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహం మన అందరికీ మార్గదర్శకం.

శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరము స్వాయంభువ మనువు కూతురును కర్దమునికి అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళి పోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.

దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు పాటిస్తున్నాడు. నియమములు పాటిస్తున్నాడు. భర్త ఏమి చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తోంది. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడు అంత శుష్కించి పోయింది. ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు కర్దముని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్దముడు తపస్సులోంచి ఎందుకో ఒకసారి దేవహూతి వంక చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈమె సౌందర్యమును వర్ణన చేశాను. నాకోసం తపించడంలో, పరిశ్రమించడంలో ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇలా అయిపోయింది’ అనుకొని దేవహూతీ, నీ సేవలకి నేను సంతోషించాను. నీకు నావలన తీరవలసిన కోరిక ఏమి?’ అని అడిగాడు.

ఒక సౌశీల్యవంతురాలయిన స్త్రీ భర్తవలన తాను సంతానవతియై తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ అంది ‘ఈశ్వరా, మీరు నాకు పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి’ అని కోరింది. అంటే అప్పుడు ఆయన ‘తప్పకుండా కటాక్షిస్తాను’ అని ఒక అందమైన మాట చెప్పాడు. ‘నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని, ఉరఃపంజరము పైకి వచ్చేసి ఒక నారపంచె కట్టుకుని ఎప్పుడూ దండకమండలములు పట్టుకుని చాలా వెర్రివాడిలా, తపస్సు చేసుకుంటున్న వాడిలా ఏ భోగ భాగ్యములు లేని వాడిలా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ భూశయనం చేసే వాడిలా కనపడుతున్నాను కదా! నాకు ఉన్న భోగములు ఎటువంటివో తెలుసా? ఈ భూమియందు సార్వభౌములమని సమస్త భూమండలమును ఏలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి.

నేను నిరంతరమూ శ్రీమన్నారాయణుని సేవించాను. అపారమయిన భక్తితో యోగమును అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. దానిచేత ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసిన భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు. వాటిని చూడడానికి వీలయియా దివ్యదృష్టిని నీకు ఇస్తున్నాను. భోగోపకరణములను చూడవలసినది’ అని దివ్యదృష్టిని ఇచ్చాడు.

ఆవిడ తెల్లబోయింది. ఒక పెద్ద భవనం వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యా మందిరములు ఉన్నాయి. ఆ శయ్యా మందిరములకు ఏనుగుల దంతములతో చేయబడిన కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్న చీనీ చీనాంబరములు – బంగారము, వెండితో చేయబడిన స్తంభములు, వజ్రవైడూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారములు, బయట విశాలమయిన ప్రాంగణములు.

వీటన్నింటినీ చూసి ఆమె అలా నిలబడిపోయింది. ఈ స్థితిలో వున్న దేవహూతికి ఉత్తరక్షణంలో ఇవన్నీ కనబడ్డాయి. అపుడు కర్దమ ప్రజాపతి “దేవహూతీ, అదిగో బిందు సరోవరము. అందులో దిగి స్నానం చేసి బయటకు రా’ అన్నాడు. వచ్చేసరికి ఇంతకు పూర్వం దేవహూతి ఎంత సౌందర్యంగా ఉండేదో దానికి పదివేల రెట్లు అధిక సౌందర్యమును పొందింది. అక్కడ ఒక వేయిమంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళు ఆమెకు పట్టు పుట్టములు కట్టి, అంగరాగముల నలది ఆమె చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకములయిన పువ్వులు పెట్టి ఒక నిలువుటద్దం పట్టుకు వచ్చి ఆవిడ ముందుపెట్టి సోయగమును చూసుకోమన్నారు. అద్దంలో తన సోయగమును చూసుకుని, వెంటనే తన భర్తను స్మరించినది. ఉత్తరక్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షం అయ్యాడు. మనం ఎవరూ అనుభవించని భోగాలు అనుభవిద్దాం, రావలసింది’ అని విమానం ఎక్కించాడు. ఈ విమానం సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగ గలిగిన విమానం. అటువంటి విమానంలో వాళ్లు తిరుగుతున్నారు. భోగములను అనుభవిస్తూ ఇద్దరూ ఆనందంగా క్రీడిస్తూ వుండగా ఆ విమానం మేరు పర్వత శిఖరముల మీద దిగింది. వారు మేరు పర్వత చరియలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు యక్షులు కిన్నరలు కింపురుషులు దేవతలు ఉన్నారు. గ్రహములన్నీ ఆ మేరు పర్వతమును చుట్టి వస్తుంటాయి. ఆ మేరు పర్వత చరియలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా భోగములను అనుభవిస్తూ ఉండగా వారికి తొమ్మండుగురు ఆడపిల్లలు పుట్టారు. తొమ్మిదవ పిల్ల పుట్టిన తరువాత కర్దమ ప్రజాపతి ‘మనం ఎన్నాళ్ళ నుండి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతీ?’ అని అడిగాడు. ఆవిడ ‘అయ్యో, తొమ్మండుగురు ఆడపిల్లలు జన్మించారు. పెద్దపిల్ల పెళ్ళి ఈడుకు వచ్చేస్తోంది. జ్ఞాపకమే లేదు. కాలము క్షణంలా గడిచిపోయింది’ అంది.

ఆయన ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరమూ తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. వైరాగ్య భావన మనస్సులో ఉండాలి. అది పండు పండిన నాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని దేవహూతీ, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను”. అన్నాడు. అప్పుడు దేవహూతి ‘నిన్ను ఆపను, నువ్వు పండడమే నాకు కావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు నువ్వు పండాలి. కానీ నాది ఒక్క కోరిక. నాకు తొమ్మండుగురు ఆడపిల్లలను ఇచ్చావు. ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుడిని తేవాలి. నేను ఆడదానిని ఏమీ తెలియవు. అందుచేత ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరల నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించే వాడు కావాలి. నన్ను కూడా జ్ఞానము వైపు తిప్పేవాడు కావాలి. అటువంటి వాడు కూతుళ్ళను గట్టెక్కించగలవాడు అయిన ఒక కొడుకును ఇచ్చి వెళ్లవలసినది’ అని అడిగింది.
అపుడు ఆయన ‘సెహబాష్! గొప్ప కోరిక కోరావు. నీకు ఒక కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను’ అన్నాడు. తదుపరి కర్దమ ప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భములోనికి ప్రవేశించి ఆయన కుమారుడయి కపిల భగవానుడు అని పేరుతో బయటకు వచ్చాడు.

కపిల మహర్షి జన్మిస్తే, సంతోషమును ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు. ‘కర్దమా, నిన్ను నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నీవు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు. గృహస్థాశ్రమము లోనికి వెళ్ళి, ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమయిన భోగమును అనుభవించి వైరాగ్యమును పొంది, వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి, భార్య కోర్కె తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు. కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షమును పొందుతుంది. సన్యాసాశ్రమమునకు వెళ్ళి నీవు మోక్షం పొందుతావు’ అన్నాడు. ఇదీ గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం.

చతుర్ముఖ బ్రహ్మ గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తరువాత కర్దమ ప్రజాపతి తన కుమార్తెలను ఎవరికీ ఇచ్చి వివాహం చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద, తండ్రిగారయిన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. బ్రహ్మగారు ‘నీకు కలిగిన తొమ్మండుగురు పిల్లలను తొమ్మండుగురు ఋషులకు ఇచ్చి వివాహం చేయి’ అని చెప్పారు. ఆయన సూచన ప్రకారం తన కుమార్తె ‘కళ’ను మరీచి మహర్షికి, అత్రి మహర్షికి ‘అనసూయ’ను, అంగీరసునకు ‘శ్రద్ధ’ను, పులస్త్యునకు ‘హవిర్భువు’ అనే అమ్మాయిని, పులహునకు ‘గతి’ ని, క్రతువునకు ‘క్రియ’ను భృగువునకు ‘ఖ్యాతి’, వసిష్ఠునకు ‘అరుంధతి’, అధర్వునకు ‘శాంతి’ – అలా తొమ్మండుగురు ఋషులకు, తొమ్మండుగురు కన్యలు ఇచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తరువాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు. చంటి పిల్లవాడయిన కపిలుడు పడుకొని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంటి పిల్లవానిగా వున్న పిల్లాడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. ‘మహానుభావా, మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృ ఋణం తీరదు. అందుకని కొడుకుగా పుట్టి పితృ ఋణం నుండి నన్ను ఉద్దరించారు. అసలు మీ సౌజన్యమునకు హద్దు లేదు. తండ్రీ, మీకు నమస్కారము. అన్నాడు. అపుడు ఆయన అన్నాడు ‘ఇంతకుపూర్వం నేను ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యమనే వేదాంతమును బోధ చేశాను. తత్త్వము ఎన్ని రకాలుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పడమును సాంఖ్యము అంటారు. కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యం చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతాను అని మాట ఇచ్చాను, తప్పలేదు, పుట్టాను. నాయనా, నువ్వు సన్యసించి వెళ్ళిపో. నీవు మోక్షమును పొందుతావు’ అన్నాడు.
అపుడు కర్దమ ప్రజాపతి ‘నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిని నీవు ఉద్ధరించాలి’ అన్నాడు. ‘తప్పకుండా ఉద్ధరిస్తాను’ అన్నారు స్వామి.


కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందు సరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దమ ప్రజాపతి తన భోగోపకరణములనన్నిటిని భార్యకు ఇచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. ‘నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండి పోయాను. నేను కూడా ఉద్ధరింపబడాలి’ అని అనుకుంది. అందుకని ఇప్పుడు దేవహూతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంతకాలం మోహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకొని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతున్నది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్త్వమును నాకు బోధచెయ్యి’ అని అడిగింది.

అప్పుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే ‘కపిలగీత’ అంటారు. కపిల గీత వినిన వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో, ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. ‘అమ్మా, ప్రపంచంలో అనేకమయిన జీవరాసులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణం ప్రాణం ఉన్నా చెట్లకన్నా గొప్పతనము ఒకటి ఉంది. స్పర్శ జ్ఞానము కలుగుట చేత వృక్షములకంటే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శ జ్ఞానము ఉన్నదానికంటే రస జ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్ప గలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. దానికన్నా ఆవు, గేదె, మేక మొదలయిన నాలుగు పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభము రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. రెండు పాదములు ఉన్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు.

అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేయలేరు. కాబట్టి ఆ స్వామి పరమ భక్తులయిన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు. ఆ మూర్తిని ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా! పరమ సంతోషంతో నీ మనస్సును ఆయన పాదారవిందముల దగ్గర చేర్చు. స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తెనేమరిగిన సీతాకోక చిలుకలా హృదయము దానియందే రంజిల్లడం మొదలిడుతుంది. అప్పుడు మనస్సుకి భోగములవైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చేయాలి. చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడం మొదలు పెట్టాలి. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయ గలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు’ అని చెప్పాడు.

ఆ మాటలను విన్న దేవహూతి ఆ భోగములనన్నిటిని తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయమునందు నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, ఈ విషయములు వినిన తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు మనను ఉద్ధరించేవి కావని తెలుసుకుని, వాటిని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానమువలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతమును పొందినది. ఇది జీవులందరినీ ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమయిన గాథ.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 09-10-2019, 07:54 PM



Users browsing this thread: 1 Guest(s)