Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ
"ఈ జపాన్ గర్ల్ సంగతికేంగానీ, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పమని అడుగుతాను" అన్నాను నేను.

"మన కెవళ్లకవకాశమొచ్చినా పాపారావు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. ఆ కీలకమేమిటో తెలుసుకోవడం అమనందరికీ అవసరం" సలహా యిచ్చేడు రాంభద్రం.

మేమందరం వో వరసగా కూర్చున్నాం. అందరి దృష్టీ వరండాలో వున్న తలుపుమీదే వుంది. అనిర్వచనీయమైన పవిత్రత యేదో పరిమళంలాగా ఆ వాతావరణంలో సమ్మిళితమై వుంది. ఆ ప్రశాంత నిశ్శబ్దతలో భక్తి విశ్వాసాలా పదధ్వని స్పష్టంగా వినబడుతోంది.
నెమ్మదిగా తలుపులు తెరచుకున్నాయి. ఎదురుగుండా బాబా అందం, ఆనందం, శాంతం, ప్రేమ అనే పదార్థాలతో పోతబోసి బ్రహ్మ సృష్టించిన ఆ మూర్తి, అడుగులో అడుగేసుకుంటూ అందరి మధ్యనా నడుస్తూంటే, అందరూ పాద నమస్కారాలు చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు చేతులు జోడించానో నాకే తెలీదు. మావాళ్లూ అదే తన్మయావస్థలో వుండటం చూసి, ఏదో ప్రబలమైన దివ్యశక్తి ఆధీనంలో వున్నామని గ్రహించేను.

బాబా మధ్య మధ్య కొందరిని వేలుతో చూపెడుతున్నారు. వాళ్లు లేచి వరండాలొ కూర్చుంటున్నారు. వాళ్లకే ప్రత్యేక దర్శనమన్నమాట. అప్పుడే వో పాతికమందిని ఏరేరు. అందులో వికలాంగులూ, దరిద్రులూ, ఐశ్వర్యవంతులూ, వయోవృద్ధులూ, యువతీయువకులూ, సనాతనులూ, అధునాతనులూ అందరూ వున్నారు. మా వరసలోకి పాదాలు మళ్లగానే నా గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలెట్టాయి. ఎటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసా లేకుండా ఏదో వినోదం కోసం వచ్చినవాళ్లం. దూరంగా నిలబడి వో నమస్కారం చేసి వెళ్లిపోక అక్కడ చతికిలబడ్డాం. తీరా నన్ను పిలిచి ఈ పేకాటా, సిగరెట్లూ మొదలైనవి మానేసి ఏ భజనో, పూజో చేసుకోమని ఆదేశిస్తే, పదిమందిలోనూ నా బ్రతుకేంగాను! ఏమిటో చూసి చూసి యిలాంటి యిరుకులో పడ్డాను అనుకుని ఏదో పదిమందితో పాటు పాదనమస్కారం చేసుకునే భాగ్యంతో సరిపెట్టి ఎటువంటి ప్రత్యేకమైన అనుగ్రహం నామీద ఆయన చూపెట్టకుండా వుండాలని శతకోటి దేవతలకి ఆ క్షణంలో అనంతకోటి ప్రార్థనలు చేశాను. పాదాలు నా దగ్గరకొచ్చిన కొద్దీ నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. వొచ్చేయి, ఆగేయి. విధి బలీయం. నా శిరస్సు మీద స్వామి దివ్యహస్తం క్షణం నిలిచింది. లేచేను. వరండా మీదకు వెళ్లమన్నాడు వలంటీరు. మా వాళ్లందరూ నాకేసి జాలిగా "పాపం! ఇక వీడు మనకి దక్కడు" అన్నభావంతో చూస్తున్నారు. విధి నిర్ణయానికి తలవొగ్గి వరండా మీదకు నడిచేను.

నా వంతు రాగానే భయంగా లోపలికెళ్లేను. బాబా ముఖంలోకి చూడగానే భయం పోయింది. వెయ్యి తల్లుల ప్రేమను మాటల్లో నింపుతూ భుజాలు నిమురుతూ "నువ్వు రావడం చాలా సంతోషం బంగారూ. జనన మరణాల గురించి ఆలోచించడమే ఆధ్యాత్మిక జిజ్ఞాసకు ప్రథమ సోపానం. ఇప్పుడా జపాన్ బాలిక పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో బయలుదేరారు మీరంతా. అజ్ఞాతంగా మిమ్మల్ని వేధించే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది మంచి సదవకాశం. అయితే, పూర్వజన్మ వున్నట్లు మీకు నమ్మకం కలిగిన తర్వాత మీ ప్రవర్తనలో రావల్సిన పరివర్తనను గురించి ఆలోచించేరా?" అన్నారు మందహాసంతో స్వామి.

"నా పూర్వజన్మను గురించి తెలుసుకోవాలని వుంది స్వామీ" అన్నాను ధైర్యం చేసి.

"ఉన్న ఈ సంసార జంఝాటం చాలకనా నీ పూర్వజన్మ బంధువులతో ఇప్పుడు సంపర్కం!" అన్నారు మృదువుగా.

"నా పూర్వజన్మ విశేషాలను తెలుసుకుని, జీవుల జన్మాంతర సంబంధాల్ని లోకమంతా చాటుతాను. నేనో పత్రికా సంపాదకుణ్ణి" అన్నాను.

"నీ తరంకాదు. నీ మాటల్ని ఎవరూ నమ్మరు. నిన్ను కూడా ఆ జపాన్ గర్ల్ లాగే వింత జంతువుగా చూస్తారు. నీ ముక్కు, చెవులు, మెదడుని సైంటిస్టులు పరీక్ష చేస్తానంటారు."

"సహేతుకంగా, నిదర్శనాలతో రుజువు చేస్తాను."

"ఇదివరకూ చేశారు. ప్రయోజనం లేదు. అసలు కారణం వాళ్లకి నమ్మకం లేకపోవడం. కాదు, నమ్ముతున్నామని ఒప్పుకునే ధైర్యం లేక, నమ్మకుండా వుండే అవకాశం ఎప్పటికైనా లభిస్తుందేమోనన్న భ్రమచేత"

"పోనీ నా అనుభవం కోసమైనా, నా కోర్కె తీర్చలేరా?"

"అది నువ్వనుకున్నంత సులభం కాదు. మహాజ్ఞానులు కూడా సులభంగా తాళజాలని అనుభవం. పూర్వజన్మస్మృతి లేకపోవడమనేది భగవంతుడు మానవునికిచ్చిన వరం. కాళ్లూ, చేతులూ, ముక్కూ, చెవులూ, కళ్లూ, మేధస్సూ మొదలయిన అవయవాలతో అద్భుతమైన శరీరాన్ని ప్రసాదించిన భగవంతుడికి మానవుడికి జ్ఞాపకశక్తి ఎంతవరకు అవసరమో తెలుసు" అన్నారు స్వామి నా భుజాల్ని పట్టుకుని ప్రేమతో వూపుతూ.

"మరి, ఆ జపాన్ గర్ల్ కెలా వొచ్చిందా పూర్వజన్మ స్మృతి?"

"పూర్వజన్మలో సంస్కారం నొక్క తీవ్రమైన ప్రభావంవల్ల"

"పూర్వజన్మ సుకృతం వల్ల స్వామి దర్శనం, అనుగ్రహం లభించేయి. కష్టమో, నష్టమో నకై నేను కోరుకుంటున్నాను. నాకు పూర్వజన్మ స్మృతిని ప్రసాదించండి" అన్నాను ప్రాధేయపూర్వకంగా.

"కోరికోరి జీవితంలో సుఖశాంతులకు దూరమవుతానంటున్నావు"

"పోనీ కనీసం క్రిందటి జన్మలో నేనేవర్నో చెప్పండి స్వామీ"

"సరే విను. రహస్యంగా వుంచుకో. ఎల్లుండి రాత్రి, అంటే శుక్రవారం రాత్రి ఏ యింట్లో వుంటావో అదే క్రిందటి జన్మలో నువ్వు పుట్టి పెరిగిన యిల్లు. క్రిందటి జన్మలో నీ మొదటి భార్య పేరు లక్ష్మి. ఆమే నీ మీద మమకారంతో చనిపోయి ఈ జన్మలో నీకు అన్నగా పుట్టి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు..."

"ఈ మధ్యనే చనిపోయాడు స్వామీ"

"అవును. అతనే నీకు మళ్లీ కుమర్తెగా పుట్టబోతున్నాడు. ఎల్లుండి నువ్వు నీకు నలభయ్యో యేట నీకు విషం పెట్టి చంపిన నీ రెండో భార్యను కూడా చూస్తావు. అప్పట్లో మీ కుటుంబానికి గర్భశత్రువయిన రాఘవులు చావుని నీ కళ్లతో నువ్వే చూస్తావు. ఈ జన్మలో ఆ రాఘవులు పేరు రాజా. మరింక క్షేమంగా వెళ్లిరా" అంటూ దీవించి పంపించేరు.

పుచ్చుకున్నది వరమో, శాపమో అర్థంకాని అయోమయ స్థితిలో బయటపడ్డాను. నన్ను ఎక్కడికి వెళ్లమన్నదీ, ఎప్పుడు బయలుదేరమన్నదీ చెప్పకుండా వెల్లి రమ్మన్నారు. మావాళ్లందరూ నన్ను చుట్టుముట్టి ఆశ్రమంలో దూరంగా తీసుకుపోయి ప్రశ్నలవర్షం కురిపించేరు. పేకాటకి పనికొచ్చే వరం పుచ్చుకున్నావా అని ఒకడూ, పాపారావు మరణ రహస్యం తెలిసిందా అని మరొకడూ ఇలా రకరకాల ప్రశ్నలతో వేధించారు. నేను నోరు విప్పలేదు. దేనికి సాయం నా తిరుగు ప్రయాణం గురించి నిర్ధారణ చేసుకోలేదు. దానాదీనా "వైకుంఠానికి మన వూరి మీదుగా వెడుతూంటే వుత్తరం రాయి. కనబడి పలకరిస్తాం. నువ్వు తిరిగొచ్చేక చచ్చినా నీతో పేకాడం, ఏమయినా యిదే మా శ్రద్ధాంజలి" అంటూ నా హోల్డాల్ బయటికి గిరవటెట్టి వాళ్లు వెళ్లిపోయారు.

ఆ రాత్రి ఆశ్రమంలోనే గడిపేను. ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనం అయ్యేక నా సమస్యను గురించి ఆలోచిస్తూ ప్రార్థనా మందిరం నుంచి తిరిగి వొస్తూంటే నిన్నటి వలంటీరు ఎదురయ్యేడు. "ఎల్లుండి రాత్రి ఏ యింట్లో వుంటావో ఆ యింట్లో వో అపూర్వ సంఘటన జరుగుతుంది వెళ్లిరా అన్నారు. స్వామి మరి ఎక్కడికి వెళ్లవలసిందీ చెప్పలేదు" అన్నాను.

"ఇంకా దీన్ని గురించి మీరాలోలించవల్సిందేమీ లేదు. స్వామి వెళ్లి రమ్మంటే వెంటనే వెళ్లడమే కర్తవ్యం. ఇప్పుడైనా వెంటనీ బయల్దేరండి" అని ఆయన సలహా యిచ్చేడు.

బెంగళూరెళ్లి అక్కణ్ణుంచి బస్ మీద భద్రాపూర్ వెళ్లి మనవాళ్లను కలుసుకుని ఆ జపాన్ గర్ల్ సంగతి తెలుసుకోవచ్చునన్న ఉద్దేశంతో, రైలుకందిస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన బస్ ఎక్కేను. స్టేషనులో కాలెట్టగానే రైలు వెళ్లిపోయిందన్న శుభవార్త ఎదురయింది. సరాసరి బెంగళూరుకేదయినా టేక్సీ దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. విఫలమయింది. గత్యంతరం లేక అంచీల మెద్నైనా వెడదామని హిందూపూర్ వరకూ వెలుతున్న లారీ ఎక్కేను. డ్రైవరు బహు బుద్ధిమంతుడు. అయితే యేం! లారీ మహా పెంకిఘటం. పదేసి మైళ్లకోసారి పేచీ పెట్టడం, తర్వాత రాజీ పడడంతో అలా అలా రాత్రికి హిందూపూర్ కి చేరుకున్నాను.

బెంగళూరులో సమ్మెలూ, గొడవలూ గందరగోళంగా వుందని తాత్కాలికంతా రవాణా రద్దు చెయ్యడంవల్ల ఆ రాత్రి హిందూపూర్లోనే గడిపేను. మర్నాడు ఆ వూళ్లో వున్న మా పత్రిక స్టాకిస్టు వొ ప్రయివేటు కారులో మధ్యాహ్నానికి బెంగళూరుకి చేర్చేడు. కానీ, ఏం లాభం! కొందరు దేశభక్తులైన యువకులు వో టేక్సీ డ్రైవరు ముసుగు పెట్టుకుని పడుకుని వుండగా తల అనుకుని పొరపాటున కాళ్లవైపు పెట్రోలు పోసి అంటించేరుట. దానికి వాడు రెచ్చిపోయి టేక్సీలన్నిటినీ సమ్మెలోకి దింపేడుట. ఇంత చిన్న విషయంలో అంత రాద్ధాంతం చేస్తే యిక మనం రాజకీయంగా ఎలా పురోగమిస్తాం!

ఒకచోట యూనివారంలో వున్న కండక్టర్ని ముచ్చటపడి బాలికలు పచ్చడి కింద తన్నేరుట. అక్కడ బాలురు లేకపోవడంవల్ల బాలికలు కలగజేసుకోవల్సివచ్చిందనీ, ఉద్యమం అన్న తర్వాత ఇలాంటి పట్టింపులు తప్పు తప్పని నాయకులు ఎంత చెప్పినా వినకుండా బస్సు సారధులందరూ సమ్మెట!

భావి పౌరులైన విద్యార్థులై వచ్చిన వాటిని మచ్చుకొకటి చొప్పున పుచ్చుకుని మిగిలిన ఫలహారాలు "రిలే హంగర్ స్ట్రైకర్స్"కి సకాలంలో అందించాలన్న సత్సంకల్పంతో కార్యరంగంలో నిమగ్నులై వుండగా, ప్రజల కళ్లముందరే హోటల్ ప్రొప్రైటర్ తిరగబడ్డాడంటే ఇంతకంటే అరాచకం ఏముంది? దీని మూలాన్ని హోటళ్ల సమ్మెట! ఇదంతా చూసి "జగమే మాయా" పాట పాడుకుంటూ అలా బెంగళూరు రోడ్డంట ఫేడవుట్ అయిపోదామనిపించింది.

ఇంతలోకే వో లారీ డ్రైవరు నా భుజం తట్టి "కష్టసుఖాలు కావడి కుండలు. భయపడకండి. నేను సాయంత్రం లోడ్ వేసుకువస్తాను. మిమ్మల్ని భద్రాపూర్ లో దింపుతాను. ఫ్రంట్ సీటు ప్రత్యేకంగా మీకే రిజర్వ్ చేస్తాను. జస్ట్ వో చిన్న వంద రూపాయలనోటు నా మొహాన్న పారేయ్యండి" అంటూ సవినయంగా అభయహస్తమిచ్చేడు. సరేనన్నాను. అతని పేరు ప్రహ్లాదుట. మనిషి కాస్త తండ్రి పోలికేమో... హిరణ్యకశిపుడిలాగున్నాడు. ఆడినమాట తప్పకుండా సాయంత్రం ఆరింటికి లారీ తీసుగొచ్చేడు. ఎక్కి కూర్చున్నాను.

డ్రైవర్ కూనిదీర్ఘాలు తీస్తూ, సిగరెట్లు కాలుస్తూ ఊరు దాటగానే స్పీడెక్కించాడు. డ్రయివరు తాలూకు ప్రొహిబిషన్ పరిమళం వల్లనయితే యేం, సిగరెట్టు పొగ తాలూకు మేఘాలవల్లనయితేనేం, మధ్య మధ్య ఎదురయ్యే కార్లలైట్లు మొహమ్మీద కమ్మడం వల్లనయితేయేం, రోడ్ మలుపుల్లో టైర్లు చేసే ప్రణవనాదం వల్లనయితేయేం, మొదట్లో దార్లో రోడ్ పక్కనున్న చెట్లూ, కల్వర్టులూ ట్విస్టు డాన్స్ చేసినట్టు కనబడింది. స్పీడెక్కించాక అంతరిక్షయానమంటే ఏమిటో తెలిసింది. మొత్తమ్మీద భూమ్మీద ప్రయాణం చెయ్యడం లేదని గ్రహించి భగవంతుడిమీద భారం వేసి కళ్లు మూసుకుని పంచాక్షరీ మంత్రాన్ని ప్రారంభించేను. మరి, కైలాసం ఎప్పుడు చేరేమో తెలీదు గానీ, హరహరమంటూ గంగలోకి దొర్లిపోడం చూచాయగా గుర్తుంది.

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - లేడిగాడు - by k3vv3 - 14-09-2025, 01:56 PM



Users browsing this thread: 1 Guest(s)