Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ
#75
"నీ సంసారంల మన్నువడ! రేపటికి ఇత్తులేదు! ఈ దిక్మెల్ల బతుకు బతికే కన్నా ఏడనయినా పడి సచ్చింది నయం థూ!" ధుమ ధుమ లాడుతూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ, ఆఖరుగా మిగిలిన జొన్న సంకటి పొయ్యి మీదేసింది. రంగశాయి.

నాంపల్లి నిర్వికారంగా వింటున్నాడు.

"ఆ దిక్మెల్ల ఎడ్లను పట్టుకొనే ఏడుస్తడు! ఆ దొరసాని చెప్పినట్టు వాటిని అమ్మి నాశనం జేసి, వాళ్ల దగ్గర జీతముంటే ఎంత సక్కగుంటది! పెయ్యినిండ బట్ట, కడుపునిండా తిండన్నా దొరుకుతది. లగ్గమయి నాలుగేండ్లయినా, ఒక్కనాడు బుద్ధి తీర తిన్నదిలేదు. సోకయిన బట్ట కట్టింది లేదు. ఎవలయ్యా గంగెద్దు లాడిచ్చి బిల్డింగులు కట్టింది? అయినా నీ అన్న జేత్తుండా, ఈ రీతిలేని కొలువు నీ తమ్ముడు జేత్తుండా? ఎవలికి లేని పీకులాట నీ కెందుకయ్యా రంగశాయి అలుపూ సొలుపూ లేకుండా అరుస్తూనే ఉంది.

నాంపల్లి నిశ్శబ్దంగా వాగు కేసి నడిచాడు. రాత్రి ఎనిమిదవుతుందేమో తెల్లని వెన్నల కనుచూపు మేర పరచుకొంది. అతడు ఇసుకలో వెల్లకిలా పడుకున్నాడు. చల్లని ఇసుక స్పర్శ అమ్మ ఒడిని గుర్తుకు తెచ్చింది. అనుకోకుండానే నాంపల్లికి కళ్లలో నీళ్లు జలజలా రాలాయి.

ఎవరికి నచ్చని ఈ గంగెద్దులాట పట్టుకొని తాను నాశనమయిపోతున్నాడా!

ఒకవేళ ఈ ఎడ్లన్నీ అమ్మి దొర దగ్గర జీతముంటే నిజంగా ఏ చీకూ చింత ఉండదా?

కాని వాటిని అమ్మే దెట్లా?

తన తండ్రి తాతల ద్వారా సంక్రమించిన ఈ అపురూపమైన విద్యని ఎలా నేలమట్టం చేయగలడు?

ఇప్పటికే ఈ ఆట చాలా మంది వదిలేసుకున్నారు. తనకి తెలిసినంతవరకు నాలుగు జిల్లాల్లో తానొక్కడే ఈ ఆట ఆడుతున్నాడు. అంటే తానూ వదిలేస్తే గంగిరెద్దు లాట మాయమయిపోతుందా?

కాక ఏం చేస్తుంది? చేజేతులా తద్దినం బెడితే!

అంటే తరతరాల నుండి ఉన్న ఓ కళని తన చేతులతోనే పూడ్చి పెట్టడమా!

"ఛీ! బతుకు పాడుగాను!" నాంపల్లి దుఃఖం మానేరు వాగులా పొంగింది. అలా ఎంత సేపు ఏడ్చేవాడో గానీ, భోజనానికి పెళ్లాం పిలవడంతో వాగులోంచి లేచి చెట్టు కిందకి నడిచాడు.

భోజనాలయ్యాక రంగశాయి నాంపల్లి పక్కలో చేరింది.

"నా మాటినయ్యా! నీ కాళ్లు మొక్కుత! ఈ కాలంలో ఈ దిక్మెల్ల విద్య పట్టుకొని ఎవడేడుస్తుండు? రేపు మనకు పోరగాండ్లు పుడుతరు. సంసారం బెరుగుతది. మనకే గతి లేదు ఇగ పొరగాండ్లను ఎట్ల పెంచుతం! మన చుట్టాలూ, పక్కాలూ తెలిసిన వాళ్ళందరూ వదిలేసిన ఈ ఆట మన కెందుకయ్యా! ఈ గొడ్లన్ని అమ్మగా వచ్చిన పైసలతో మంచిగా బట్టలు కొనుక్కొందాము. తిండికి సర్పంచి ఇంట్లో కొదువలేదు. ఏడాదికి ఇద్దరికి. ఇచ్చిన రెండు వేలు దాసుకుందాం. అలా బతికి నన్నాళ్ళు వాళ్ల దగ్గర చాకిరి చేసుకున్నా నయమే" శాంతంగా సర్ది చెప్పింది రంగశాయి.

"సరేలేవే నీ ఇష్టమే కానీ!" నాంపల్లి ఆమెని దగ్గరగా తీసుకొని అన్నాడు.

రంగశాయి ఒళ్లు పూల విమానంలా గాలిలోకి ఎగిరింది. కాసేపటికి రంగశాయి నిశ్చితంగా నిద్రపోయింది. అయితే నాంపల్లి మాత్రం నిర్మలంగా ఉన్న ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు.

"రంగశాయి చెప్పిందాంట్లో అబద్ద మేమీలేదు. ఈ కాలంలో తన ఆటని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఇష్టపడుతున్నారు? ఎక్కడికి వెళ్లినా తనని, తన వేష భాషలను చూసి గేలి చేసేవారే! పైగా కష్టపడి పని చేసుకోక ఎందుకొచ్చిన సోమరి పని అంటూ చీత్కారాలు చేసేవారే! అంతేగానీ తనదీ ఓ విద్యేనని, దాంట్లో ఓ మెరుపు ఉందని తలాడించి మెచ్చుకున్నవారే లేరు. ఎవరూ పట్టింపుతో చూడకపోవడం వల్ల తనకూ చాలా వరకు ఆసక్తి తగ్గింది. ఈ ఆట మీద పదేళ్లుగా ఒక్కనాడైనా పది నోటు సంపాదించిన ఘడియ లేదాయే!

"మొన్న చబ్బీస్ జనవరి వేడుకల్లో ఆట ఆడటానికి నాలుగు జిల్లాలు వెదకగా తాను దొరికితే సర్పంచ్ ఎంతో బింకంగా కరీంనగర్ తీస్కపోతే, అక్కడ నిలబడి నిలబడి కాళ్లు పచ్చి పండ్లయిపోయె. ఎడ్లు తాగడానికి నీళ్ళు లేక నిలువు గుడ్లేసినయ్! మంత్రి వచ్చేసరికి పట్టపగలాయే! ఆఖరుకి అటో ఇటో ఆట అయిందనిపిస్తే గాడిదని తింపినట్టు తింపి తింపి నూట యాభయి రూపాయల చెక్కు చేతిల పెట్టిరి. అది బ్యాంకుల కెళ్లి విడిపించుకునే కంటే, దానికన్నా ఓ రోజు ఊరంత తిరిగి బిచ్చమెత్తుకున్నదే నయమనిపించింది.

ఇంకోసారి ఇల్లు జగాలు ఇప్పిస్తమని సర్పంచ్ తింపి తింపి ఆ కాగితాలు తెమ్మని ఈ కాగితాలు తెమ్మని ఒర్రిచ్చి ఒర్రిచ్చి ఆఖరుకి వచ్చే ఏడు సూద్దామనిరి. అట్ల ఏ ఏటికాయేడు అయిదేళ్లు గాలికి కొట్టుకపోయె. ఆఖరుకి ఆ సంగతే మర్చిపోవుడాయె. మల్లొకసారి జిల్లా పండుగలని వెళితే, అక్కడ ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకే శాలువాలు కప్పుడు, ఒకల్ల నొకళ్ళు పొగుడుకొనుడు, ఆఖరుకి జనానికి విసుగొచ్చి వెళ్లిపోయే వారు వెళ్లిపోగా మిగిలిన పది మంది ముందు ఆటాడితే పది రూపాయలు కూడా ఇవ్వలేదు. గద్దెలెక్కి కుక్కరాగాలు తీసిన కవులకు మాత్రం వేలకు వేల చెక్కు లిచ్చిండ్రు.

"ఛీ! ఈ ఆట వదిలేయక తప్పదు!"

ఆ నిర్ణయం తీసుకొన్నాక అతడి మనసెంతో తేలిక పడాల్సిందిపోయి మరింత దిగులు ఆవహించింది.

ఇక గొడ్లన్నీ అమ్మెయ్యాల్సిందే!

వెన్నెల్లో దూరంగా నెమరేస్తోన్న ఎద్దులను చూశాడు! చిక్కిపోయి ఉన్నాయి! వర్షాకాలంలో ఎలా ఉండేవి నిగనిగలాడుతూ వేసవికాలం వచ్చింది. ఎక్కడా గడ్డి దొరకడం లేదు!

"రేపే అమ్మెయ్యాలి! కష్టపడ్డా వాటికి కడుపు నిండా తిండైనా దొరుకుతుంది!"

"ఒరేయ్ నాంపల్లీ!" రాజన్న గొంతుకి ఉలిక్కిపడ్డాడు నాంపల్లి.

"అయ్యా నువ్వా!" ఆశ్చర్యంగా అన్నాడు.

"నేనేరా! ఈ ఆట ఇడిసి ఏడ్డను అమ్మేద్దామనుకుంటున్నావట్రా." ఆపైన మాటరాక వెక్కి వెక్కి ఏడవసాగాడు రాజన్న.

"లేదు నాయినా లేదు! నా పాణ ముండగా అమ్మను."

చప్పున మెలుకువ వచ్చింది నాంపల్లికి!

"కలా! ఔను కలే. లేకపోతే ఎన్నడో చచ్చిపోయిన నాయిన అర్ధరాత్రి హఠాత్తుగా తిరిగిరావడ మేమిటి?"

ఆ రాత్రి ఎప్పుడు నిద్రపోయాడో అతడికే తెలీదు.

***

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - వారసత్వం - by k3vv3 - 30-04-2025, 01:51 PM



Users browsing this thread: 1 Guest(s)