Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#42
ఇపుడు నాభి ఒక కొత్త మార్గమును ఆవిష్కరించాడు. ఆయన యజ్ఞము గొప్పతనమును ఆవిష్కరించాడు. యజ్ఞము చేత భక్తిచేత పరమేశ్వరుడిని కట్టి ఎలాగ తన కొడుకుగా తెచ్చుకోవచ్చునో నిరూపించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చునో తెలియజేశాడు. ఆయన భగవంతుడిని మోక్షం ఇమ్మని అడగలేదు. ఋషభుడిని కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షమును పొందాడు. ఇది నాభి వృత్తాంతము.

ఋషభుడు చాలాకాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు. తరువాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు పిల్లలను పిలిచి ఒకమాట చెప్పాడు. ఋషభుడి చరిత్ర వింటున్న వారికి చదువుచున్న వారికి సాక్షాత్తుగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెపుతారు. “కుమారులారా! కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమయిన ఉపాధిని పొందిన మనిషి కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు. దేనివల్లనో తెలుసా? కేవలము కామము చేత కష్టములు పడుతున్నాడు. కామము అంటే కేవలము స్త్రీపురుష సంబంధమయిన గ్రామ్య సుఖము మాత్రమే కాదు. కామము అంటే కోరిక. కోరికకు ఒక లక్షణం ఉంటుంది. అది లోపల అందత్వమును ఏర్పరుస్తుంది. మీరు ఒక కోరికకు లొంగినట్లయితే ఒక పరిమితమయిన కోర్కె పెట్టుకొని మీ శక్తిని దృష్టిలో పెట్టుకుని అక్కడవరకు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం కాదు. కానీ వాళ్ళను చూసి వీళ్ళను చూసి అలవికాని కోర్కెను పెంచుకున్నారనుకోండి ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. అపుడు ధర్మము గాడితప్పవచ్చు. లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమయిన దానికి తిరగడంలో మీరు చేయవలసిన ఈశ్వరారాధన మీరు వదులుకుంటున్నారు. కాబట్టి కోరికలు మిమ్మల్ని మిమ్మల్ని బంధించి వేసి కళ్ళల్లో ధూళి పోసి కనపడకుండా చేస్తాయి. అప్పుడు మనిషి కుక్కకన్నా హీనం అయిపోతాడు. అందరిచేత ఛీ అనిపించుకుంటావు. కామమును అదుపు చెయ్యి. మనసులో ధారణ ఉండాలి, పూనిక ఉండాలి. అందుచేత కామన పెరిగిపోవడమే బంధహేతువు అయిపోతుంది. దీనిని విరగ్గొట్టదానికి నేను రెండు మార్గములు చెపుతాను జ్ఞాపకం పెట్టుకోండి. అందులో మొదటి తపము చెయ్యడం. తపము లేక ధ్యానము చెయ్యండి. ఈశ్వరునియందు భక్తిని పెంపొందించుకోండి. రెండవది సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యము ఒక్కటే ఈశ్వరుని దగ్గరకు తీసుకువెళుతుంది. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళను గౌరవించడం నేర్చుకో. క్రమక్రమంగా అంతటా ఈశ్వరుడిని చూడడం నేర్చుకో. ‘నేను, నాది’ అనే భావన విడిచిపెట్టు. అని బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన రూపమును చూసి ఏమి అందగాడని ప్రజలంతా మోహమును పొందారు. ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. స్నానం లేదు. ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ఇంతకు పూర్వం ఋషభుడిని చూసిన వారు ఇప్పుడు ఆయనను చూసినా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అలా వెళ్ళిపోయి చాలా కాలానికి ‘అజగరవ్రతము’ అని ఒక చిత్రమయిన వ్రతం పట్టాడు. 

అజగరము అంటే కొండచిలువ. కొండచిలువ ఎలా భూమిమీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒకచోట భూమిమీద పడిపోయి ఉండిపోయాడు. అతడు పొందిన యోగసిద్ధికి సిద్దులన్నీ ‘అయ్యా మేము నిన్ను వరిస్తున్నాము, స్వీకరించండి’ అని అడిగాయి. నాకీ సిద్ధులు అక్కరలేదు అని వెళ్ళిపొమ్మన్నాడు. అలా చాలాకాలం పడివుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందున్న అరణ్యమునందు నడుస్తున్నాడు. ఆయన అలా నడిచివెడుతుంటే అక్కడ వున్న చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి ఒక అగ్నిహోత్రము బయలుదేరింది. పెద్ద అగ్నిజ్వాలలు రావడం ప్రారంభించాయి. ఆయన వాటివంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. అవి వచ్చి అంటుకుంటే శరీరం పడిపోతుంది అనుకున్నాడు. యధార్థమునకు అలా ఉండడం అంత తేలికకాదు. అందుకే అన్నారు – ఋషభుడి కథ అసుర సంధ్యవేళ ఎవరు వింటున్నారో వాళ్లకి సమస్త కామితార్థములు ఇవ్వబడతాయి అని చెప్పబడింది. ఆ అగ్నిహోత్రం శరీరమును పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది. తాను ఆత్మలో కలిసిపోయాడు. ఋషభుడు ఇలా శరీరమును వదిలిపెట్టాడు అని రాజ్యమును ఏలుతున్న అరహన్ అనే రాజు తెలుసుకున్నాడు. తెలుసుకుని ‘మనకు ఒక సత్యం తెలిసింది. లోపల ఉన్నది ఆత్మా. ఈ శరీరం మనకు కాదు. కాబట్టి ఈ రాజ్యంలో వున్న వాళ్ళెవరూ స్నానం, సంధ్యావందనం చేయనక్కరలేదు. దేవాలయములకు వెళ్ళక్కరలేదు. పూజలు చేయనక్కర లేదు. బ్రాహ్మణులను గౌరవించనక్కరలేదు. యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతారు’ అని చెప్పాడు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలు పెట్టారు.

అయితే వ్యాసుల వారు ఇది మహా దోషము అన్నారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణము. మీరు ప్రయత్నపూర్వకంగా జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించలేరు. మీరు ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు. మీరు కర్మ చెయ్యాలి. అదే మిమ్మల్ని జ్ఞానిని చేస్తుంది. కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేయాలి. అది వైరాగ్యమును ఇచ్చి మిమ్ములను ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు. ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు. అదే అరహన్ చేసిన భయంకర కృత్యము. కాబట్టి ఒక మహాపురుషుని జీవిత కథగా దీనిని విని చేతులు ఒగ్గి నమస్కరించాలి. అలా చేస్తే మీకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మీరు కృష్ణ పాదములను చేతుకుంటారు. మీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 19-03-2020, 08:30 AM



Users browsing this thread: 1 Guest(s)