Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇదేమి ఊరురా నాయనా
తినగ తినగ వేము

[Image: Picture1.png]

రచన: వసుంధర 

 


డిసెంబరు 10. 
సమయం సాయంత్రం ఐదు.
మోహన్‌ కాలింగ్‌బెల్‌ మ్రోగించగానే చప్పున వచ్చి తలుపు తీసి, “నేను రెడీ” అంది రేవతి.


మోహన్‌ ఆమెను తేరిపార చూశాడు. 
సన్నగా నాజూగ్గా ఉంది. దుస్తులు వంటి వంపులకు వన్నె తెచ్చేలా అమిరాయి. 
కట్టు, బొట్టు, అలంకరణ అన్నీ మ్యాచింగ్‌. 
చూస్తే కళ్లు తిప్పుకోలేనంత ఆకర్షణీయంగా ఉంది.
మోహన్ లోపల అడుగెట్టి తలుపేశాడు. 
మనం వెడుతున్నది సినిమా చూడ్డానికా, మనని ఎవరైనా చూడ్డానికా?” అన్నాడు కోపంగా. 


రెండూను” అంది రేవతి నవ్వుతూ.


మోహన్‌ కోపం పెరిగింది. 
నువ్వు బాగానే తయారయ్యావు. మరి నా సంగతేమిటి?" అన్నాడు ఇంకా కోపంగానే. 


మీకేం? మహారాజులా ఉన్నారు” అంది రేవతి ఇంకా నవ్వుతూనే.


ఉన్నాను కానీ ఇప్పుడు నీ పక్కనుంటే, నన్నంతా నీ కాళ్లకి మొక్కే పనివాడని అనుకుంటారు” అన్నాడతడు స్వరం పెంచి.


కాళ్లకి మొక్కినంత మాత్రాన పనివాళ్లైపోతారా? ఇంట్లో ఎన్నిమార్లు నువ్వు నా కాళ్లు పట్టుకోలేదూ- గుర్తు చేసుకో” అందామె చిలిపిగా. 


మోహన్ మొహం ఎర్రబడింది, “అది వేరు. ఇంట్లో ఇద్దరమే ఉన్నప్పుడు దేనికైనా సంకోచం నాకూ ఉండదు, నీకూ ఉండదు. ఎందుకంటే నువ్వు నాదానివి. నేను నీ వాణ్ణి” అని సద్దుకునే ప్రయత్నం చేశాడు.


దాందేముంది, పది నిముషాలు టైమివ్వు. బయటికెళ్లడానికి, నిన్ను నావాడిలా తయారు చేస్తాను” అంది రేవతి.


అంటే, ఇప్పుడు నేను పనివాడిలాగే ఉన్నానంటావు. అసలు నేనలా కనపడాలనే నువ్విలా తయారయ్యావు” అంటూ పెద్దగా అరిచాడు మోహన్‌.


ఆ తర్వాత ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. 
సినిమా ప్రోగ్రాం కాన్సిలయింది.
- - - - -
డిసెంబరు 17. 
సమయం సాయంత్రం ఐదు.
మోహన్‌ కాలింగ్‌బెల్‌ మ్రోగించగానే చప్పున వచ్చి తలుపు తీసి, “నేను రెడీ” అంది రేవతి.
మోహన్‌ ఆమెను తేరిపార చూశాడు. 
ముఖం జిడ్డోడుతోంది. కట్టిన దుస్తులు పాతగానే కాదు, బాగా నలిగి కూడా ఉన్నాయి. 
అప్పుడే ఇంటిపనులన్నీ ముగించిన పనిమనిషిలా ఉందామె.
రెడీ అవడమంటే ఇలాగేనా? నిన్నిలా చూసినవాళ్లు ఏమనుకుంటారు? పెళ్లాన్ని పనిమనిషికంటే హీనంగా చూస్తున్నానని అనుకోరూ?” అన్నాడు మోహన్‌.


వెడుతున్నది సినిమా చూడ్డానికి. నలుగురూ మనని చూడ్డానికి కాదు” అంది రేవతి.


ఒకసారి బయటికెళ్లేక, చూడొద్దన్నా నలుగురూ మనని చూస్తారని తెలియదా?”


ఏమో- సినిమాకెళ్లేది ఇతరులు మనని చూడ్డానిక్కాదని నువ్వంటే కామోసనుకున్నాను” అంది రేవతి. 


మాటకి మాట బాగా నేర్చావ్‌” విసుక్కున్నాడు మోహన్. 


నేను నేర్చిందేం లేదు. అంతా నువ్వు నేర్పిందే!” రేవతి రిటార్టు.


అర్థమైంది. నువ్వు బయల్దేరింది సినిమాకని కాదు! పాత విషయం మనసులో పెట్టుకుని పగబట్టావ్! నలుగురిలో నన్ను తల దించుకునేలా చెయ్యాలని ఇలా తయారయ్యావ్‌” అరిచాడు మోహన్‌. 


రేవతి తక్కువ తినలేదు. తనూ గొంతు పెంచింది.
ఆ తర్వాత ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. 
సినిమా ప్రోగ్రాం కాన్సిలయింది.
- - - - -
జనవరి 22. 
సమయం రాత్రి పది.
మంచం మీద రేవతి ఒడిలో మోహన్. 
అతడి జుత్తుని వ్రేళ్లతో నిమురుతూ రేవతి.
మోహన్‌కి ఆమెపై ప్రేమ పొంగుకొచ్చింది. 
రేపు మనం సాయంత్రం ఆటకి హను-మాన్ మూవీ చూద్దాం” అన్నాడు.


ఇప్పుడిలాగే అంటావ్‌. రేపు సాయంత్రం ఆఫీసునుంచొచ్చి ఏదో గొడవ లేవదీస్తావ్‌. నువ్వరిచి, నాచేత అరిపించి, మూడంతా పాడు చేస్తావు” అంది రేవతి గోముగా.


నా అభిమాన నటి సమంతమీద ఒట్టు. నావల్ల ప్రోగ్రాం పాడవదు” అన్నాడు మోహన్‌.


ఆ ఒట్టయితే తప్పడని రేవతికి నమ్మకమే. 
నవ్వి ఊరుకుంది.
- - - - - 
జనవరి 23. 
సమయం ఉదయం తొమ్మిదిన్నర.
రేవతి మొబైల్లో నంబరు నొక్కింది. అవతల సిగ్నల్ సరిగ్గా లేదేమో, కాల్ వెళ్లడానికి పది నిముషాలు పడితే అసహనంగా ఫీలైంది. అవతల్నించి రెస్పాన్సొచ్చేక, “ఏయ్‌, దీపా! ఇంటి దగ్గర ఎప్పుడనగా బయల్దేరావ్‌! నేను రెడీ అయి పావు గంటయింది. హను-మాన్ షో పావుతక్కువ పదకొండుకని గుర్తుందా, లేదా?” అంది. 


బయల్దేరిన వేళావిశేషం. ట్రాఫిక్‌జాంలో ఇరుక్కున్నానే! ఇప్పుడే క్లియరయింది. ఇంకో పది నిముషాల్లో నీ ఇంటికొచ్చి పిక్ చేసుకుంటాగా, సినిమాకి స్లైడ్సు కూడా మిస్సవమని నాదీ హామీ” అంది అవతలి నుంచి దీప.
- - - - -
జనవరి 23. 
సమయం సాయంత్రం ఐదు.
మోహన్‌ కాలింగ్‌బెల్‌ మ్రోగించగానే చప్పున వచ్చి తలుపు తీసి, “నేను రెడీ” అంది రేవతి.
మోహన్‌ ఆమెను తేరిపార చూశాడు. 
మామూలుగా ఆధునిక దుస్తుల్లో కనబడే ఆమె అప్పుడు చీరకట్టులో, పీటలమీద వ్రతానికి కూర్చోబోయే ముత్తైదువలా ఉంది. 
థియేటరంటే నీకు దేవాలయంలా ఉన్నట్లుంది. ఏమైతేనేం, అంతా నీ ఇష్టం. ఐదు నిముషాల్లో ఫ్రెష్షయి వస్తాను. మనమీ రోజు హను-మాన్ చూస్తున్నాం. సరేనా” అన్నాడు మోహన్‌ శాంతంగా.


త్వరగా రా. కానీ వెళ్లేది హను-మాన్‌ సినిమాకి కాదు. హనుమాన్ గుడికి” అంది రేవతి. 


సినిమాకి టికెట్లు కూడా బుక్‌ చేశాను. ఇప్పుడు నువ్వు గుడి అంటావేమిటి?” 


సినిమాకి అన్నప్పుడు నా ఇంట్రస్టు చూడద్దా. నీమటుక్కు నువ్వు హను-మాన్‌కి ఫిక్సయిపోతే నాకు ఓకే ఐపోతుందా? సినిమా ప్రోగ్రాం కాన్సిల్‌. ఐనా ఈరోజు మంగళవారం కూడాను. ఇప్పుడు మనం హనుమాన్ గుడికే వెడుతున్నాం” అరిచింది రేవతి.


అరిచి మూడ్‌ పాడు చేస్తానని నామీద నింద వేసేదానివి. ఈ రోజు టికెట్లు కూడా తెచ్చి రమ్మని బ్రతిమాలుతున్నాను. ఉత్త పుణ్యాన అరిచి మూడ్‌ పాడు చేస్తావేం?” అన్నాడు మోహన్‌ కొంచెం చిరాగ్గా.


అరుచుకుని, మూడ్‌ పాడు చేసుకుని, అనుకున్న ప్రోగ్రాం కాన్సిల్‌ చేసుకోవడం అలవాటై, అలాగైతేనే నాకు బాగుంటోం దిప్పుడు. తినగ తినగ వేము తియ్యన కదా!” అంది రేవతి తాపీగా. 
  ---0---
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అర మార్కులోడు


[Image: Picture2.png]
 
రచన : సుస్మితా రమణ మూర్తి



సీనియర్ మాస్టారు వీరాస్వామిని కాలేజీ టీచర్లలో కొంతమంది మాత్రమే బాహాటంగా ప్రశంసిస్తారు. మిగతా వారు గోడ మీద పిల్లుల్లా ఉంటారు. విద్యార్థులలో మాస్టారంటే సదభిప్రాయం లేదు. 


వారు ఏ సబ్జెక్టు పేపరు దిద్దినా, అలా అలా చూసి మార్కులు వేసేయరు. జవాబులు పూర్తిగా చదివి మార్కులు వేస్తారు. అక్షర దోషాలు కూడా భూతద్దంలోంచి చూస్తారు. అర మార్కులు కూడా ఆచితూచి వేస్తారు. మిగతా టీచర్లు మాత్రం పట్టి పట్టి జవాబులు చదవరు. మార్కులు కొసరి కొసరి వేయరు. అందుకే వీరాస్వామి మాస్టారుకి విద్యార్థులలో మంచి పేరు లేదు. 
 మార్కులు మరీ కత్తిరించి వేస్తారు కాబట్టి వారిని ‘అర మార్కులోడు’ అని విద్యార్థులు అంటుంటారు. పదో క్లాసు పబ్లిక్ పరీక్షలకు మూడు నెలల సమయం ఉంది. అన్ని సబ్జెక్టులకు సిలబస్ ప్రకారం బోధన పూర్తయింది. 


 టీచర్లు మోడల్ పేపర్లు తయారు చేసారు. వీరాస్వామి మాస్టారు లెక్కలు, సైన్సు సబ్జెక్టులకు మూడేసి పేపర్లు తయారు చేసారు. మిగతా టీచర్ల చేత కూడా అలానే చేయించారు. 
మాస్ఠారు ఆధ్వర్యంలో మొదటి విడత నమూనా పరీక్షలు అన్ని సబ్జెక్టులకు పూర్తయాయి. అందరూ పేపర్లు దిద్దేసారు. విద్యార్థులకు అందజేసారు. మాస్టారుగారు దిద్దిన పేపర్లు చూసిన విద్యార్థులు ఆశ్చర్య పోయారు. చాలా మందికి లెక్కల్లో అరవైలు, డెబ్బైలూ వచ్చాయి. సైన్సులో కూడా అలానే మంచి మార్కులు వచ్చాయి. అన్నేసి మార్కులు మాస్టారు గారే వేసారా అని విద్యార్థులతో బాటు టీచర్లు కూడా ఆశ్చర్య పోయారు. 


మరో రెండు మోడల్ పరీక్షలు ఉత్సాహంగా రాసారు విద్యార్థులు. ఈసారి కూడా అందరికీ మాస్టారు దిద్దిన పేపర్లలో మంచి మార్కులే వచ్చాయి. 


 ****** 
పబ్లిక్ పరీక్షలకు పది రోజుల ముందు వీడ్కోలు సమావేశం జరిగింది. “ పరీక్షలు బాగా రాయండి. మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్!” చెప్పారు టీచర్లంతా. వీరాస్వామి మాస్టారు భిన్నంగా మాట్లాడారు. 


పబ్లిక్ పరీక్షలంటే భయపడకండి. మన కాలేజ్లో రాసిన ‘మోడల్ ఎగ్జామ్స్’ లాంటివే అవి. పకడ్బందీ వాతావరణంలో జరుగుతాయి అంతే! మీరంతా మోడల్ పరీక్షలు చాలా బాగా రాసారు. ఈ సందర్భంలో నాలుగు పనికొచ్చే మాటలు చెబుతాను. అందరూ బాగా గుర్తు పెట్టుకోండి ..”


భూతద్దం గారి ప్రవచనాలు మొదలు..” 


టీచర్లలో గుసగుసలు మాస్టారు విన్నారు. 


క్లాసులోనే కాదు. ఇక్కడ కూడా మన అర మార్కులోడి సుత్తి భరించక తప్పదు “ 


విద్యార్థులలో ఒకరు ఎంత నెమ్మదిగా అన్నా ఆ మాటలు మాస్టారు చెవులను తాకాయి. మాస్టారు అందరి వేపు దృష్టి సారించి మరల చెప్పసాగారు. 


ఏ సబ్జెక్టులోనైనా నిర్వచనాలను పుస్తకంలో ఉన్నట్లే రాయండి. వివరణలు మాత్రం స్వంత మాటల్లో రాయండి. ముందుగా మీకు బాగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు అర్థమయేట్లు నీట్ గా రాస్తే దిద్దే వారికి మంచి అభిప్రాయం కలుగుతుంది” మాస్టారు ఆగి దాహం తీర్చుకున్నారు. “ ప్రశ్నలకు జవాబులు చాలా బాగా వచ్చని పేజీలకు పేజీలు రాసి సమయం వృధా చేయకండి. ఎన్ని పేజీలు రాసినా ఎక్కువ మార్కులు వేయరు. అన్నిటికంటే ముఖ్యం సమయపాలన. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే వెళ్ళండి. మీ సందేహాలు తీర్చడానికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటాం. చివరగా ఎవరికీ తెలియని ఒక ముఖ్య మైన విషయం చెప్పాలి” అంటూ కొన్ని నిముషాలు ఆగారు వారు. 


అందరూ ఆసక్తిగా మాస్టారు మాటలు వినేందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. 


నా తోటి టీచర్లందరికీ నేనంటే ఎనలేని అభిమానం! అందుకే నన్ను ‘భూతద్దం‘ అని ప్రేమగా అనుకుంటుంటారు. ఆ మాట నూటికి నూరు పాళ్ళు నిజమే!.. ”


టీచర్లంతా కలవరం చెందారు. ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకున్నారు. 


విద్యార్థులకు కూడా నేనంటే అంతులేని ప్రేమ! వారి దృష్టిలో నేను అర మార్కులోడిని” 


విద్యార్థుల ముఖాలు కళ తప్పాయి. 


ఈ భూతద్దం ఏడాదంతా తూకం రాళ్ళతో జవాబులు తూచి తూచి, మార్కులు వేసినా, అందరూ ఓపికగా భరించారు. ఈ మాస్టారు ఆంతర్యం ఎవరూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించ కుండానే, నా పద్ధతి ప్రకారం కష్టపడి చదవడం, రాయడం అలవాటు చేసుకున్నారు” వారి మాటలు అందరినీ ఆలోచింప జేస్తున్నాయి. 


కఠినమైన ఈ శిక్షణ వలన, మీరంతా పబ్లిక్ పరీక్షలలో సునాయాసంగా ఉత్తీర్ణులు అవుతారు “ అంటూ వారు విద్యార్థుల వేపు నవ్వుతూ చూసారు. 


నమూనా పరీక్షలలో ముఖ్యంగా సైన్సు లెక్కల పేపర్లలో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు అభినందనలు” “ ఎవరికీ తెలియని ఆ విషయం చెప్పండి సార్!” టీచర్లలో ఒకరు అడిగారు. “ ఈసారి విద్యార్థుల లెక్కలు, సైన్సు పేపర్లు నేను దిద్దలేదు “


ఆ మాటలకు అందరూ నమ్మలేనట్లు మాస్టారు వేపు చూసారు. 


ఆశ్చర్య పోకండి. మీరు విన్నది నిజమే! పబ్లిక్ పేపర్లు దిద్దడంలో ఎంతో అనుభవం ఉన్న వేరే కాలేజీ టీచర్లతో దిద్దించాను” 


అప్పటికీ వారి మాటలు ఎవరూ నమ్మలేదు. 


మిగతా సబ్జెక్టుల పేపర్లు కూడా వేరే కాలేజీ టీచర్లే దిద్దారు” 


మాస్టారు మైండు సరిగ్గా లేనట్లుంది! మనం దిద్దిన పేపర్లు వేరే కాలేజీ వారు ఎలా దిద్దారు!? ’ స్వగతంలా అనుకుని టీచర్లు ఆశ్చర్య పోయారు. 


జవాబు పత్రాలు జిరాక్సువి మాత్రమే వేరే కాలేజీ వారికి పంపించి దిద్దించాను. సైన్సు, లెక్కల పేపర్లు తప్ప, మిగతావన్నీ రెండు సార్లు దిద్దడం జరిగింది. మార్కులలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనించ దగిన విషయం. మన టీచర్లు నేను చెప్పినట్లు పబ్లిక్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా దిద్దినందుకు సంతోషం”


టీచర్లు మాస్టారు చర్యకు సంతోషించారు. 


విద్యార్థులు నా తత్వం అర్థం చేసుకుని కష్టపడి చదివారు. వేరే వారు దిద్దినా మంచి మార్కులు తెచ్చుకోవాలనే చాలా కఠినంగా మీ పేపర్లు భూతద్దంతో చూసాను. మీరు మరింత బాగా చదువుతారనే నేనలా చేసాను. ఇంకా బాగా చదవండి. అందరూ ప్రథమ శ్రేణిలో తప్పకుండా పాసవుతారు. ఆల్ ద బెస్ట్!”


 విద్యార్థులు, టీచర్లు ఒకేసారి “మిమ్మల్ని తప్పుగా అనుకున్నందుకు మన్నించండి సార్! “ అనడంతో మాస్టారు మందహాసం చేసారు. 


 / సమాప్తం /
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఎప్పుడో, యెవరో, యేతావునో..
[Image: e.jpg]
రచన: పాండ్రంకి సుబ్రమణి






వర్షం కురుస్తోంది. పగటిపూట కురిసే వర్షం అలజడిగా చిత్తడి చిత్తడిగా ఉండవచ్చేమో గాని, సాయంత్రం పూట వచ్చే వాన, పూల వనాలను స్పర్షిస్తూ ప్రాణ పూర్ణమైన గాలుల్ని మోసుకువస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని మనసునంతటా వెదజల్లుతుంది. జీవన ప్రాంగణంలో కమ్మదనాన్ని నింపుతుంది. 



అప్పుడు నేను లాడ్జీ వరండాలోకి వెళ్ళి చేయి చాచి చూసాను. తుంపర ముత్యాలల్లిన దారంలా పడుతూనే ఉంది. చిన్ననాటి వానపాట గుర్తుకి వచ్చి నాకు మరింత హాయనిపించింది. ఎక్కడైతే నేమి వాన పాటంటే బాల్యాన్ని కళ్ళముందుకు తెచ్చుకోవటమేగా! నిదానంగా రూములోకి వచ్చి, ఆఫీసు మాన్వల్ పుస్తకాల ను ముందేసుకుని కాఫీ తాగుతూన్న దీనదయళుని అడిగాను.. ”ఇప్పుడేమి చేయదలచావు? ” 



అతడు తలెత్తి చూసాడు- “చూస్తే తెలియటంలే! సోమవారం హెడ్డాఫీసులో జరగబోయే పెర్ఫార్మెన్సు రివ్యూ మీటింగుకి కసరత్తు చేస్తున్నాను. రా! నువ్వూ వచ్చి కూర్చో—” 
నేను అడ్డంగా తలవిదిలిస్తూ అన్నాను- “ఇప్పుడు వీలుపడదు. రేపు ఉదయం చూసుకుంటాను. ఇప్పుడు నేను బైటికి వెళ్తున్నాను. నువ్వూ వస్తున్నావు నాతో—”



 నా మాట విని దీనదయాళు భృకుటి ముడిచాడు. “మనల్ని హయ్యర్ గ్రేడ్ టీ ఏ- డీయే యిచ్చి యిక్కడకు యెందుకు పంపించారో తెలుసు కదూ! మనం రీజనల్ ఆఫీసు తరపున టిప్ టాప్ గా వచ్చాం. పెర్ఫార్మెన్సు స్థాయిని అందరి ముందూ యెత్తి చూపించడానికి, రీజనల్ కార్యాలయ స్థాయిని పెంచడానికి. మరొకటి- నువ్వు జోవియల్ మూడ్ లో పడి మరచిపోతున్నట్టున్నావు- ఇద్దరికీ రిటైర్మంట్ యేజ్ దగ్గర పడుతూంది. ఈ సమయంలో వయసుకి తగని తైతక్కలాట మంచిది కాదోయ్!”



నేను నవ్వుతూ అన్నాను- “అటువంటిదేమీ సంభవించదు అగ్రసోదరా! గతకాల పాపాలెలా వెన్నంటి వస్తాయో- అదే రీతిన గతంలో చేసిన పుణ్యకార్యాలు కూడా మనల్ని- ముఖ్యంగా నిన్నువెన్నంటి వచ్చి నీడనిచ్చే గొడుగులా కాపాడుతాయి. ఐనా యెంత సేపని- గంటా- గంటన్నర లోపున అంతా ఐపోతుంది. నౌ గెటప్! డ్రెస్సప్పవు” అని ఒత్తిడి పెట్టాను. 



ఇంతకీ యెక్కడికి? యెందుకు?”అడిగాడతను. 



అతడిలోని కంగారు చూసి నవ్వుకున్నాను. “రామ్ నగరు లోనున్న మా బంధువులింటికి. వాళ్లమ్మాయికి నిశ్చితార్థం” 



దీనదయాళు ఆశ్చర్యంగా చూసాడు “నిశ్చితార్ధానికా! అదీను పిలవని పేరంటానికా! అనామకుణ్ణి. శివపూజలో యెలుగులా నేనక్కడ కనిపిస్తే బాగుంటుందా?”



ఈసారి నిజంగానే నవ్వేసాను- “మీ యింట్లో వాళ్ళు- ముఖ్యంగా మీ శ్రీమతి చెప్పిందో లేదోగాని- నాకు నీలో ఒక స్పార్క్ కనిపిస్తుంటుందోయ్! నువ్వు గాని ప్రక్కనుంటే-- జయమ్ము నిశ్చయమ్ము-- అందుకే నిన్ను అంటిపెట్టుకుని వస్తుంటాను” 



నా పొగడ్తకు దీనదయాళు పక్కున నవ్వేస్తూ “మాటల మాంత్రికుడవి” అంటూ ఆఫీసు మాన్వెల్ పుస్తకాలను, పీరియాడికల్ పెర్ఫార్మెన్సు రిపోర్టులను మూసాడు. 



మేం రామ్ నగరు చేరుకునేటప్పటికి సాయంత్రం మరింత చల్లబడింది. నన్ను చూసి మా అక్కయ్య ప్రత్యూత్థానం పలుకుతూ లోపలకు తీసుకు వెళ్ళింది. నేను వెళుతూ తిరిగి చూసాను. దీనదయాళు అక్కడే నిల్చుండి పోయాడు. నేను వెళ్ళి హాలు మధ్యకు రమ్మనమని పిలిచాను. అతడు తల అడ్డంగా ఆడిస్తూ రానన్నాడు. 



నేనెవరో వాళ్ళకు తెలియదు. వాళ్ళెవరో నాకు తెలి యదు. ఎందుకొచ్చిన రచ్చ- నేనటు వెళ్ళి కూర్చుంటాను” అంటూ వెనుక సైడుకి వెళ్ళి ఆసీనుడయాడు. 



అంతకు మించి దీనద యాళు పైన ఒత్తిడి పెట్టకూడదని తలపోస్తూ మావాళ్ళతో కలసిపోయాను. పురోహితుడు పంచాంగం ముందేసుకుని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వినిపించేలా యేదో వివరిస్తున్నాడు. పెండ్లి కూతురు కాబోయే అమ్మాయి ప్రక్కన వైదేహీ మాత్రం కూర్చుంది. వాళ్ళ అక్కయ్యేమో దూరంగా తొలగి కూర్చుంది. కాబోయే పెళ్ళికొడుకు తరపున అమ్మానాన్నలూ మేనమామా కలసి కూర్చున్నారు. మరి కాసేపటికి కాబోయే వధూవరులిద్దరూ మాలలు మార్చుకుని ఉంగరాలు తొడుక్కున్న తరవాత మిగిలిన తతంగం దాదాపు పూర్తయింది. 



నేను చివ్వున లేచి సెలిగిన కొబ్బరి బొండాను తీసుకు వెళ్ళి దీనదయాళుకి అందించి తిరగబోయాను. అప్పుడతను నన్నాపాడు- ఉఁ అంటూ ప్రక్కన కూర్చున్నాను. 
ఆ అమ్మాయెవరు?” అని చేయి చూపించాడు. 



ఆ పచ్చ చీర కట్టుకున్నమ్మాయేనా! పెద్దది. కాబోతూన్న పెళ్ళికూతురుకి అక్కయ్య. ఎందుకడుగుతున్నావు?” 



అబ్బే! మరేమి లేదు. చాలా చురుగ్గా బొంగరంలా అలుపనేది తెలియనీయకుండా పనులు చక్కబెడ్తూంటేనూ-- . బంగారు తీగలా కళ కళగా చురుగ్గా వెన్నెలలా కనిపించే అమ్మాయంటే నాకు మురిపెం. ఔను గాని— ఆ అమ్మాయి మెడ బోడిగా ఉందేం?” 



భళే వాడివోయ్! కనిపించడంలే-- మెడన బంగారు గొలుసు- వజ్రాల హారమూ- నడుమున వెండి వడ్డాణమూను—’



నేనడిగింది ఒకటీ— నువ్వుచెప్పేది మరొకటీను— మెడన పుస్తెల తాడు కనిపించడం లేదంటున్నాను” 



ఓ- అదా నువ్వడుగుతున్నదీ! దానికొక పెద్ద కథ ఉందిలే— మరి కాసేపట్లో రూముకి వెళ్తాం కదా- అప్పడు చెప్తాను” 



లేదు. ఇప్పుడే చెప్పు” 



నేను దీనదయాళు వేపు గుడ్లప్పగించి చూసాను. “అదేంవిటి? పరుల స్వంత విషయాలలో అంతెత్తు ఆసక్తి చూపిస్తున్నావు! ఇది అవసరమా?”
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఔను- అవసరమే అన్నట్టు తలూపాడతను. ఇక తప్పదన్నట్టు అతడి ప్రక్కన కుదురు గా కూర్చుని చెప్పసాగాను- 



మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వైదేహి పెద్దది. వైదేహి యేదో టెక్నికల్ కోర్సులో ఉన్నప్పుడు- యెదురు చూడని దుర్ఘటన సంభవించింది. మామయ్య డ్యూటీ చేస్తూన్న సెక్షన్ లో ఉన్నపాటున బాయిలర్ పేలిపోయింది. మామయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దానితో కుటుంబ పరిస్థితి దెబ్బతింది. దాదాపు చితికిపోయింది. నష్ట పరిహారంతో బాటు మా అక్కయ్యకు కంపెనీ మేనేజ్మెంట్ జాబ్ ఆఫరి చేసింది. 



కాని అక్కయ్యకు చెప్పుకోదగ్గ చదువు లేకపోవడాన జాబ్ ఆఫర్ ని అందుకోలేక పోయింది. అప్పుడు యింటికి పెద్దదయిన వైదేహి చదువుతూన్న ప్రొఫెషనల్ కోర్సు నుండి తొలగి జాబ్ లో చేరింది. అప్పట్నించి వైదేహికి పెళ్ళి సంబంధాలు యింటి గుమ్మం వద్దకు రాసాగాయి. కాని- కుటుంబం మరొక దుర్గతి యెదుర్కుంది. చెల్లి పరిమళ ప్రేమ వలలో పడ్డది” 



కాలేజీ రోజుల్లో అమ్మాయిలు ప్రేమ వలలో పడటం సహజమేగా! దీనిని అంత భయానకంగా చిత్రీకరించడం యెందుకోయ్!”



ప్రేమవలలో పడటం అంటే మనసిచ్చి మనసు తీసుకోవడం కాదు. పరిమళ కడుపు తెచ్చుకుంది. తద్ద్వారా ఆ పిల్లను పెళ్ళి పీటలపైన కూర్చోబెట్టడానికి వైదేహి తల్లితో చేరి యమయాతన పడాల్సివచ్చింది. లవ్ మ్యారేజీ అన్న పేరే గాని అన్ని లాంఛనా లూ తు. చ. తప్పకుండా పూర్తి చేయాల్సి వచ్చింది. కాస్తంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. 



ఆ బాదరాబందీలో వైదేహి తన పెళ్ళి కోసం యెలా ఆలోచించగలదు — చేసిన అప్పులన్నీ తీర్చ వద్దూ! ఒకటి తరవాత ఒకటిగా యెదురైన సమస్యల వల్ల వైదేహి తన పెళ్ళి గురించే కాదు- తన వయసు గురించి తలచడం కూడా మరచిపోయింది. మరైతే-- ప్రాయంలో ఉన్న ఆడ పిల్లల్నేగా వయసు వేగంగా తరుముకొస్తుంది! ఆ తరవాత వైదేహి పెళ్ళి సంబంధాల కోసం మా అక్కయ్య వెతికింది గాని కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దేనికైనా అదృష్టం కలసిరావాలి కదా! 



ఇప్పుడేమో పొరుగూరు నుంచి చిన్న అమ్మాయి భవానికి పెళ్ళి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఈడూ జోడూ కుదిరింది కాబట్టి కట్న కానుకలేవీ వద్దంటూ ముందుకి వచ్చారు పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు. ఇక యిటు వంటి సంబంధం మళ్ళీ దొరక్కపోవచ్చని వైదేహి తల్లికి నచ్చచెప్పి ఒప్పించింది. ఇదీ సంగతి—ఇంకేమైనా అడగాలా?”



తల అడ్డంగా ఆడిస్తూ పెదవులపైన నవ్వు తెరల్ని పొరలిస్తూ దీన దయాళు అన్నాడు- “చూసావా ఆడిపిల్ల మనసు! తనకింకా పెళ్ళి కాలేదనే తలంపు లేకుండా తండ్రి లేడన్న కొరత తెలియ నివ్వకుండా తోబుట్టు వుల్ని యెలా చూసుకుంటుందో! అందుకే అంటారు- వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీలోనూ తల్లితనం దాగుంటుందని. సరే—అదలా ఉంచు. నేను మీ అక్కయ్యతో మాట్లాడాలి. ఇప్పుడు కాకపోతే తరవాత కలుసుకుంటాను. ఓకే!” అని లేచాడు దీనదయాళు. 



లేదు లేదు. ఇప్పుడే యేర్పాటు చేస్తాను” అంటూ లోపలకు వెళ్ళి అక్కయ్యకు విషయం చెప్పాను. 
నాతో మాట్లాడటం యేమిట్రా! వైదేహికి చెప్పి భోజనం యేర్పాటు చేసి పంపించు” అని విస్తుపోతూ అంది. 



నాకు సర్రున కోపం వచ్చింది. “చెప్పింది చెయ్యవే అక్కాయ్! సంబరం తగ్గించి అక్కడ కూర్చో— చిన్న కూతురు కోసం తెగ యిదయి పోకు—” అని గట్టిగా అన్నాను. 



నా గొంతు విని అక్కడకు వేదేహి పరుగున వచ్చింది- “ఏం కావాలి మామయ్యా! ”అంటూ—
నేను అదే టెంపోతో అన్నాను. “నాకేమీ వద్దు. నా సహోద్యోగి దీనదయాళు గారు మీతో మాట్లాడాలంటున్నాడు. ఇక్కడ మీరిద్దరూ కుదురుగా కూర్చోండి. పిలుచుకు వస్తాను” అని బైటకు వెళ్ళి దీనదయాళుని తీసుకువచ్చాను. 



అతణ్ణి చూసి తల్లీ కూతుళ్ళిద్దరూ లేచి నమస్కరించారు. దీనదయాళు నవ్వుతూ యిద్దర్నీ కూర్చోమని సంజ్ఞ చేస్తూ యెదురుగా కూర్చుని వెంటనే సంభాషణ కుపక్ర మించాడు- “వైదేహీ! నీ గురించి మీ మామయ్య చెప్పాడు. విషయాన్ని నాన్చకుండా సూటిగానే ప్రస్తావిస్తున్నాను. నీకు పెళ్ళి చేసుకోవాలన్న తలంపు ఉంది కదూ? ” 



అప్పుడు నేను పుంజుకున్నాను- “అవేం మాటలోయ్! వైదేహి మాత్రం అమ్మాయి కాదా! ఆ పిల్లకు మాత్రం నిండు సంసారం ఉండాలన్న ఆశ ఉండదా? కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పిల్ల పెళ్ళి అటూ యిటుగా ఊగిసలాడుతూంది. అంతే—”



దీనదయాళు బదులి వ్వకుండా వైదేహిని తేరి చూసాడు. వైదేహి తల దించుకుంది. 
ఈసారి తలాడిస్తూ స్పందించాడు దీనదయాళు- “దెన్ ఇ టీజ్ ఓకే! ఊళ్ళో మా మేనల్లుడున్నాడు. వాడికి చెప్తాను. ఆ తరవాత యేమి జరగాలో అదే జరుగుతుంది” అంటూ లేవబోయాడు. 
నేను వెంటనే అతడి చేయి పట్టుకుని ఆపాను- “ముఖ్యమైన విషయాన్ని నువ్వుగా కదిపి అలా విసురుగా వెళ్ళిపోతావేంటి? కూర్చో—” అని వైదేహిని ఉద్దేశించి అన్నాను- “ఇంట్లో కాఫీ పొడి ఐపోయిందే మిటి? లేక అతిథులకి కాఫీ యివ్వాలన్నది మరచిపోయావా!” 



ఆ మాటతో వైదేహి ముఖం యెర్రబడింది. “సారీ మామయ్యా! ఏదో మూడ్ లో ఉండి పోయి మరచిపోయాను” అని సర్రున లేచి లోపలకు వెళ్ళింది. అప్పుడు మా అక్కయ్య అందుకుంది- “మరేమీ లేదండి— ఇంతకు ముందు యిటువంటి రెండు మూడు సంబంధాలు వచ్చి పెరడు వేపు నుండి వెళ్ళిపోయాయి. పెళ్ళి ఊసు యెత్తినప్పుడల్లా ప్రాత సంఘటనల్ని తలచుకుని అమ్మాయి అలా ఐపోయుంటుంది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన అబ్బాయి గురించి నేనొకటి అడుగుతాను. ఏమీ అనుకోరు కదా! ”



దీనదయాళు తల అడ్డంగా ఆడించి- “అడగండి” అన్నాడు. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
అబ్బాయిది రెండవ మనువా? ”



దీనదయాళు మరొకమారు తల అడ్డంగా ఆడించి- వైదేహి వచ్చి అందించిన కాఫీ కప్పు అందుకుంటూ బదులిచ్చాడు “కాదు. పవన్ కి ఇంత వరకూ పెళ్ళి కాలేదు. ఒక దుర్ఘటన వల్ల వాడికి షాక్ తగిలింది. సుమారు పదేళ్ళ క్రితం వాడు మనసార ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయి కారు యాక్సిడెంటులో చనిపోయింది. అదీను పవన్ డ్రైవ్ చేస్తూన్న కారులోనే— ట్రాక్టర్ అడ్డంగా వచ్చి ఢీకొంది. వాడు స్వల్పగాయాలతో బైటపడ్డాడు. కాని వాడి ప్రేయిసి వాడి కళ్ళ ముందే వాడి కళ్ళలోకి చూస్తూ ప్రాణాలు విడిచింది. 



అప్పట్నించి వాడు వైరాగ్యం పెంచుకున్నాడు. మెల్ల మెల్లగా చాలా రోజులుగా ఫాలో చేసి వాణ్ణి దారికి తీసుకు వచ్చాను. ’కాలమంతా మా అక్కయ్య నిన్ను కనిపెడ్తూ ఉండలే దురా! దానికీ వయసు మీరి పోతూంది. ఇకపైన నువ్వే చూసుకోవాలి. కనీసం మీ అమ్మకోసమైనా నువ్వు పెళ్ళి చేసుకోవాలి. కోడలి పిల్లను యింటికి తెచ్చుకోవాలి‘ అని వెదురుకి వంపు తీసినట్టు నా వేపు సానుకూలంగా వంచాను” అని చెప్పడం ఆపి వైదేహి వేపు తిరిగాడు- 



ఇలా అడుగుతున్నానని యేమీ అనుకోకమ్మా- నీకు యిరవై యెనిమిదుంటుందా? ”



వైదేవీ సిగ్గుపడుతూ తల అడ్డంగా ఆడిస్తూ అంది- “మొన్ననే ముప్పై దాటింది అంకుల్” 



ఇటీజ్ ఓకే! పవన్ కి ముప్పై ఆరుంటుంది, నేను సోమవారం ఊరుకి వెళ్లి— “నేను వెంటనే యేకలవ్యుడి బాణంలా యెలార్టుగా కట్ చేసాను-’



ఊరుకి వెళ్ళి చెప్పడం యేమిటోయ్! మనం ఊరుకి వెళ్ళేటప్పటికి ఆకాశం నలుపు దేలి నేలను భారీ వర్షాలు చిత్తు చేసి విడిచి పెడ్తాయి. ఇక్కణ్ణించే యిప్పుడే ఫోనులో అబ్బాయికి ఒక మాట చెప్పవచ్చుగా--”



అలాగంటావూ-- అంటూ దీనదయాళు పవన్ కి ఫోనుతో కనెక్టయాడు “ఈ రోజు సాయంత్రం దీపాలు పెట్టేవేళ దాటిపోక ముందు ఇక్కడకు రాగలవా? ఏమిటీ రెండు అర్జంటు కేసులున్నాయా! అలాగయితే— రేపు ఆదివారమేగా- మధ్యాహ్నం కల్లా రాగలవా? కారులో తిన్నగా మేముంటూన్న లాడ్జికి వచ్చేయి. అక్కడ ఫ్రెషప్పయి మాతో బాటు వద్దువు గాని— డబ్బై కిలోమీటర్లు- కారు నిదానంగా తోలుకుంటూ రా-- ఇప్పుటికిప్పుడు అక్కయ్యను తీసుకు రావద్దులే. --” అని ఫోను కట్ చేసాడు దీనదయాళు. 



అప్పుడు మా అక్కయ్య నవ్వుతూ మొహమాట పడుతూనే అడిగింది- “అబ్బాయి అర్జంటు కేసులంటున్నాడు. కోర్టు కేసులా!” 



కాదండి. వాడు చెప్పేది కోర్టు కేసుల గురించి కాదు. ముఖ్యమైన రెండు సర్జరీలు చేయాలట. ఊళ్ళో పవన్ పేరున్న సర్జన్. ప్రైవేటు హాస్టిటల్ నడుపుతున్నాడు. దానికి యెమ్డీ వాడే— వాడితో బాటు నలుగైదుగురు జూనియర్ డాక్టర్లు ఉన్నారు” అని లేచాడు దీనదయాళు. 



అతడితో బాటు నేనూ లేచాను. కాని నేను మాత్రం యింటి గడప వరకూ వెళ్ళలేదు. వెనక్కి తిరిగి వచ్చి అక్కయ్య ను సమీపించి ముఖంలో ముఖంపెట్టి అన్నాను- “నాకు తెలుసక్కాయ్ నీ మనసులో యేమి మెదుల్తుందో-- చెప్పేదా! ” 



నవ్వటానికి ప్రయత్నిస్తూ- “ఉఁ చెప్పు. వింటాను” అందామె. 



దీనదయాళుకి మేనల్లుడి పైన అమాంబాపతు అక్కర ఉంది కదా — అతనెందుకు తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయలేదు- ఇదే కదూ నువ్వు అడగాలనుకున్నది? ”
 
ఆమె బిత్తరపోయి చూడసా గింది. వైదేహి తల్లి భుజాలపైన చేతులుంచి నవ్వుతూ లేచి నిల్చుంది. 
అప్పుడు నేనందుకున్నాను- “దీనదయాళుకి ఇద్దరున్నారు. ఇద్దరూ కొడుకులే” అంటూ వడి వడిగా నడుస్తూ గడప దాటబోతూన్న దీనదయాళుని అందుకున్నాను. 



అనుకున్న ప్రకారం డాక్టర్ పవన్ మేముంటూన్న లాడ్జి చేరుకున్నాడు. మామయ్యను కౌగలించుకుని నాకు అభివాదం చేసి బాత్ రూములోకి వెళ్ళి ప్రెషప్పయి వచ్చాడు, ముగ్గురమూ కాఫీ మాత్రం తీసుకుని పవన్ కారులో బయల్దేరాం. వైదేహి నాకు ముందే చెప్పింది మా కోసం అల్పాహారం చేసి ఉంచుతానని. 



జీవన ప్రాంగణంలో కనిపించీ కనిపించని ఓ వైచిత్రి ఉంది. అశుభాలే కాదు; శుభకార్యాలు కూడా అప్పుడప్పుడు ఒకటి తరవాత ఒకటిగా జరుగుతుంటాయి. ఇముడ్చుకోలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. నిన్ననేమో కడపటి చెల్లెలి నిశ్చితార్థం. నేడేమో- వైదేహికి పెళ్ళి చూపులు. ఎంతటి శుభకరమైన క్షణాలు! అమృత ఘడియలంటే ఇవి కావా—



అక్కయ్య వాళ్ళ యింటి గుమ్మం చేరుకునేటప్పటికి నాకు స్టన్నయిపోయినంత పనయింది. ఇంటి ముంగిట పచ్చటి తోర ణాలు- గాలిలో యెగురుతూన్న రంగు రంగుల బెలూన్లు- మనసు పూరించుకుపోయింది. ఇంట్లోపలకు వచ్చిన తరవాత తెలుసు కున్నాను అక్కయ్య పెళ్ళి చూపుల కోసం చెల్లెళ్ళిద్దరూ హడావిడి చేస్తున్నారని. 



మా అక్కయ్యేమో హాలులోకి రాకుండా మూల న నిల్చుని నవ్వుతూ చూస్తూంది. అక్కయ్య ముఖాన తల్లి నిండుప్రేమ తొణికిసలాడుతూంది. పవన్ తిన్నగా వెళ్ళి అక్కయ్యకు నమస్కారం పెట్టాడు. ఆ తరవాత మామధ్యకు వచ్చి కూర్చున్నాడు. మరికాసేపటి చెల్లెళ్ళిద్దరూ అక్కయ్యను తీసుకు వచ్చి యెదురుగా కూర్చోబెట్టారు. లేత యెరుపు రంగు చీరలో- మెడన ముత్యాల హారంతో లేస్ తో అల్లిన బ్లవుజులో వైదేహి కళ కళ మెరిసిపోతూంది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
నిండు పుష్కరిణిలా పెళ్లి కళ వచ్చేసింది. సిగలో తురిమిన మల్లె చెండు పరవశించినట్లు పరిమళిస్తూంది. పవన్ హాయ్ అని పలకరించాడు. ఆమె మాత్రం నవ్వుతూ చూసి, నిదానంగా సంప్రదాయబధ్ధంగా కదలి వచ్చి మా ముందు మోకరిల్లి నమస్కరించింది. 



అబ్బే! మీరు శ్రమపడకండి. మీ గురించి మా మామయ్యా మీ మామయ్యా ముందే చెప్పారు” అని పవన్ లేచి నిల్చున్నాడు. వెనుక వైదేహి చెల్లెళ్ళిద్దరూ నవ్వేసారు. 



అప్పుడు నేనందుకున్నాను- “మేం చెప్తే సరిపోతుందా? నువ్వు స్వయంగా తెలుసుకోవద్దూ! అందునా ఈ కాలపు డేషింగ్ టైప్ కదూ మీరందరూ— అరటి పండు యిస్తే తీసుకోరు. ఒలిచి యివ్వాలి- అప్పుడు గాని అందుకోరు. ఇద్దరూ కాసేపు అలా పెరడు వేపు మాట్లాడుకొని రండి. నీకేమీ ఆక్షేపణ లేదు కదమ్మా వైదేహీ?”



తల అడ్డంగా ఆడిస్తూ పరిమళ వచ్చి అందించిన ట్రేని అందుకుని అందరికీ కాఫీ కప్పులు అందించింది. కాఫీకప్పు అందుకుంటూ పవన్ సగం సాసర్లో ఉంచుకుని మిగతా సగం వైదేహికి అందించాడు. 



వైదేహి ఆశ్యర్యపోతూ- “పర్వాలేదు సార్! మీరు తీసుకోండి. నేను తరవాత తీసుకుంటాను” అని దూరంగా జరగబోయింది. 



కాని అతడు తల అడ్డంగా తిప్పుతూ గ్లాసుని ఆమె చేతిలో ఉంచి సాసర్లోని కాఫీని తాగి అన్నాడు- “నాపేరు సార్ కాదు మేడమ్. పవన్- డాక్టర్ పవన్. ఓకే? ” అని పెరడు వేపు కదిలాడు. వైదేహి కూడా చేతిలోని కాఫీకప్పుతో అతణ్ణి అనుసరించింది. 



 అలా వెళ్ళిన యిద్దరూ యేమి మాట్లాడుకుంటున్నారో యేమో అరగంటవరకూ హాలులోకి రాలేదు, అప్పుడు దీనదయా ళు నవ్వుతూ నన్ను పురమాయించాడు- “ఓసారి అలా వెళ్ళి రావోయ్! పెరడు వేపు వెళ్ళారో లేక రోడ్డు దాటి వెళ్లిపోయారో—”



 అప్పుడు వైదేహి చిన్నచెల్లెలు భవాని నవ్వుతూ అంది- “వెళ్లొద్దు మామయ్యా! వాళ్ళిద్దరూ సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇద్దరి మాటలు యిక్కడకు వినిపిస్తున్నాయి”
 
ఆ మాటతో నేను లేవలేదు. ఆలోపల ఇద్దరూ హాలువేపు రాసాగారు. “సారీ! ఏమనుకోకు” పవన్ గొంతు వినిపించింది



పర్వేలేదండి” అని వైదేహి స్పందిస్తూ నడచి వస్తూంది. 



నేను లేచి యెదురు వెళ్లాను- “ మనసు విప్పిమాట్లాడుకున్నారా! లేక యింకా మాట్లాడుకోవలసిందేమైనా ఉందా?”



లేదు మామయ్యా! ఇప్పుడు మేమిద్దరమూ గుడికి వెళ్తున్నాం. వచ్చిన తరవాత భోజనాలు చేద్దాం” 



గుడికా! ఇప్పుడా!” అందరమూ దాదాపు ముక్త కంఠంతో ఒకేసారి అన్నాం. వైదేహి బదులివ్వలేదు.



పవన్ చేయి అంది పుచ్చుకుంటూ గేటవతల ఉన్నకారు వేపు నడిచింది. తల తిప్పి చూసాను- దీనదయాళూ ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నాడు. అక్కయ్యేమో నమ్మలేనట్టు కళ్ళు మిటకరిస్తూంది. 
 దైవదర్శనం చేసుకుని వచ్చిన తరవాత వైదేహి మరొక కుదుపు యిచ్చింది. “మీరందరూ డైనింగ్ హాలు వేపు రండి. వడ్డించేస్తాను. మేమిద్దరమూ తరవాత భోంచేస్తాం” 



అప్పుడు దీనదయాళు నాకు మాత్రం వినిపించేలా అన్నాడు- “ఇద్దరూ కాబో యే వధూవరుల్లా కాదు. చేరిపోయిన భార్యాభర్తల్లా లేరూ! ”



నేను బేలాగా నవ్వి తలూపాను. సినీ హీరో హిరోయిన్ల మధ్య కెమిస్త్రీ బాగా పండిందంటారు సీనీ సమీక్షకులు. మరి దీనినేమనాలి-- 



 నేనూహించినట్లే మధ్యాహ్నం ఊరుకి పవన్ తిరుగు ప్రయాణానికి ప్రెషప్ అవుతున్నప్పుడు దీనదయాళు మేనళ్ళుణ్ణి యెన్ కౌంటర్ చేసాడు. నేనప్పుడు అక్కడే ఉన్నాను, “ఏమిట్రా పవన్, నీ ప్రవర్తన ఓవర్ యాక్షన్ లా కనిపిస్తుందే! ఏమిటీ గంద్రగోళం? ” 



ఏమీ లేదు మామయ్యా! జస్ట్ లైక్ దట్—”



నాకలా మామూలు విషయంలా కనిపించడం లేదే! అక్కయ్య రావాలి. పెళ్ళి సంబంధం కుదర్చాలి. నిశ్చితార్థం జరిపించాలి. ఆ తవాత జరగవలసింది యెంతో ఉంది. ఈలోపల మొదటి రోజే చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్నట్టున్నావు. ఐనా నువ్వా టైపు కాదే! అమ్మాయిల ముందు నువ్వు చాలా షై- టైపుతో ఉంటావు. 



అంతెందుకు— హాస్పిటల్ జూనియర్ లేడీ డాక్టర్స్ తో కూడా దూరంగా జరుగుతూ మెసలడం నేను చూసాను. వాటీజ్ ది మేటర్?”



 “నా వేపు ఓసారి చూసి ఆతరవాత తలతిప్పుకుని నవ్వటానికి ప్రయత్నిస్తూ తల దించుకున్నాడు. దీనదయాళు విడిచి పెట్ట లేదు. 



నీ నిశ్శబ్దం బోలెడంత కథాకమామిషూ చెప్తూంది. ముందు దీనిని క్లియర్ చేయి. నువ్వు వైదేహికి సారీ చెప్తూ హాలు వేపు వచ్చావు. ఎందుకని? ” 



కొంచెం యెమోషనల్ ఐపోయి ఓవర్ యాక్ట్ చేసాను. అందుకని-- ” 



ఓవర్ యాక్ట్ చేసావా! కాని నువ్వాటైపు కాదే—ఇంతకీ యేమి చేసావు? ఎందుకు చేసావు? “ 



ఉద్వేగం ఆపుకోలేక వాటేసుకున్నాను. గుండెలకు గాఢంగా హత్తుకున్నాను” 



గౌరవ మర్యాదలు గల సెన్సిటివ్ అమ్మాయి వైదేహి. ఆ పిల్లను అలా చేయవచ్చా! ” 



అందుకేగా సారీ చెప్పాను. నేనెందుకలా యెమోషనల్ ఐపోయాననేగా మీ ప్రశ్న— చెప్తాను. మొదటి చూపులోనే నేను వైదేహికి సరెండర్ ఐపోయాను. ముఖం- కళ్లు- పొడవు- మేనిరంగు- రూపమంతా నన్ను పదేళ్ళ క్రితం విడిచి పెళ్ళిపోయిన విమలను చూస్తున్నట్లే వివశుణ్ణయాను. మోహంతో కాదు—ఆర్ద్రతతో కన్నీరు విడుస్తూ వైదేహిని కౌగలించుకున్నాను. వైదేహి నాకు దేవుడిచ్చిన వరం మామయ్యా! “ అంటూ కాళ్ళకు నమస్కరించాడు. 



దీనదయాళు దీవిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నేనేదో చెప్పాలని నోరు తెరవబోయాను. కాని చెప్పలేక పోయాను. నాకళ్ళు నాకు తెలియకుండానే తడిసి పోయాయి. విధి విన్యాసమంటే ఇది కాదూ! కృతజ్ఞతా భావంతో దీనదయాళ్ ని కౌగలించుకున్నాను. 
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
కమరావతీరాగం
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
హాస్యకథల పోటీకి వాగుమూడి లక్ష్మీ రాఘవరావు పంపిన హాస్యకథ “కమరావతీరాగం“. ఇల్లాలి కంఠ మాధుర్యానికి మురిసిపోదామనుకున్న మల్లన్నకు, ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తి ఎందుకు పుట్టేదో ఈ కథ చెబుతుంది.
బోనమెల్లి పోతుందే బోనమ్మ
అమ్మతల్లి బోనం – పెద్ద పట్నమెల్లి పోతుందే బోనమ్మ
సుంకు బియ్యం – గొర్రెపిల్ల – సరుగు తంతు – సంబురాలు
సంబురాలు సంబురాలు-సంబురాలు
బీరప్ప కమరావతుల సంబురాలు
పెళ్ళితంతు మొదలాయె సంబురాలు”
సంబరం అంబరమంట శుద్ధిగ బోనమొండుతుంది కమరావతి.
యింటిదాని సంబురాన్ని చూచి, అంబరమంటిన సింగిడి, రంగురంగులు విరజిమ్ముతున్నట్లు ముసిముసి నవ్వులతో మీసం దువ్వుకున్నాడు మల్లన్న.
“బుద్ధికుదిరి యింటిది గంటెపడితే, దాని చేతివంట తింటానికి బీరప్ప కమరావతులతో పాటు, బొజ్జగణపయ్య పంచె పైకెత్తి లగెత్తుకుంటూ రావల్సిందే” అని మల్లన్న అనుకున్నాడు.
“గోఱ్ఱె.. గోఱ్ఱెమ్మ గోఱ్ఱె – పెళ్ళీడుకొచ్చింది గోఱ్ఱె” అని పాడుతూ, బోనమొండుతున్న కమరావతి జీవాల పెళ్ళికి అన్నీ సిద్ధం చేస్తుంది.
‘గొప్పోళ్ళ పెళ్ళిళ్ళక్కూడ లేని మేమేల సరాగం గొఱ్ఱెల పెళ్ళిళ్ళకుంటుంది. ఇది తరాలనాటి పాట. పాటంటే అసోంటిసొంటి పాటకాదు. మస్తు హుషారయిన పాట. యింటిది అర్రలో కూర్చుని, సొక్కంగా గొంతు సవరించుకుని బువ్వ బుక్కుతూ అల్కగా పాడిందంటే కోయిలమ్మలు కూడ పులకలెత్తిపోతాయి. కాకుంటే పాటలోని గొఱ్ఱెను, యింటిది గోఱ్ఱె చేసేసినప్పుడే, నాబి చల్లబడినట్లే అవుతుంది. దీనికి కంఠశుద్ధి మస్తుగా ఉంది గని డొక్కశుద్ధి మాత్రం వీసమెత్తు కూడ లేదు’ స్మితవదన దరహాసంతో అనుకున్నాడు మల్లన్న.
భారతీయ సనాతన సంప్రదాయాల్లోని ఆదర్శదాంపత్యానికి, ఈ తరంలో కమరావతిమల్లన్నలే చక్కని తార్కాణం; ఇది బండమీది రాత అని కొందరంటారు. “ఆదర్శదాంపత్యమంటే ఏమిటో నాకు తెల్వదుగానీ, మా ఆవిడ చీపురుకట్ట పట్టుకునీ, పప్పుగుత్తి పట్టుకునీ, మజ్జిగ కవ్వం పట్టుకునీ నా వెనక పడేటప్పుడు మాత్రం, నాకామె ఆదర్శ పతివ్రతే అని అనిపిస్తుంది” ఆ కొందరితో నవ్వుతూ అంటాడు మల్లన్న.
“మీ ఆవిడ చీపురుకట్ట, పప్పుగుత్తి, మజ్జిగ కవ్వం పట్టుకుని మీ మీదకు సమరాని కెందుకు సై అంటుంద”ని ఎవరన్నా అడిగితే,”మనం మందుకొట్టి గొంతెత్తితే గార్దభాలే గాబరాపడిపోతాయి. ఇక మనుషుల సంగతి చెప్పేదేమిటి? ఆ మనుషుల కోసం పట్టేస్తుంది మా ఆవిడ చీపురుకట్ట; ఏమాటకా మాటే చెప్పుకోవాలి. మా ఆవిడ చల్లకవ్వం పట్టి, మట్టికుండలో చల్ల చిలుకుతుంటే, అబ్బ దాని వయ్యారం… హయ్యంగవీనమే దాని చిరునవ్వుల యవ్వారం” అని మల్లన్న కవితలల్లేస్తాడు.
పెద్ద పట్నం వెళ్ళడానికి కమరావతి పడే హడావిడిని చూడగానే మల్లన్నకి, అతని పెళ్ళినాటి ముచ్చట్లు యాదికొచ్చాయి. కమరావతి మల్లన్నల పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు గడిచింది. అయితే వారికి సంతానం కలగలేదు.
కమరావతి తను మహాపతివ్రతను కాదేమో, అందుకే సంతానవతిని కాలేక పోతున్నానేమోనని అప్పుడప్పుడప్పుడు బోరుమని ఏడ్చేసేది.. తను మహాపతివ్రత కావాలంటే ద్రౌపదిలాగా అయిదుగురిని కట్టుకోవాలా? అని భర్తనే ప్రశ్నించేది. మరల తనకు తానే చెంపలను వాయించుకునేది. బలవంతంగ భర్తకు పాదపూజ చేసేది. ఈ కాలంలో పతివ్రత కావాలంటే పాతపద్ధతులను అనుసరించకూడదని అనుకునేది.. కొత్త పద్ధతంటూ భర్తకు 101 బిందెలతో స్నానం చేయించేది. మల్లన్న జలుబు చేస్తుందే అంటే జలుబు రాకుండ నిమ్మపండ్ల వ్రతం చేస్తాననేది. మల్లన్న పటం ముందు భర్తను కూర్చో పెట్టి 108 భక్తి గీతాలు పాడి వినిపించేది. పాటలన్నీ బాగానే ఉండేవి గని కమరావతి పాడే అక్షరదోషాలకు అవి అర్థాలను మార్చేసుకునేవి. కమరావతికి పాడటమంటే మహాయిష్టం. ఆమె కంఠమాధుర్యంకూడ అందరిని ఆకర్షించేవిధంగ ఉంటుంది. అయితే ఆమె పాడేపాటల్లో అక్షరదోషాలు విపరీతంగ ఉంటాయి. అయినప్పటికీ కమరావతికి గానకోకిలనవ్వాలనే వాంఛ నిలువెల్ల ఉంది.
కమరావతి పాటలు పాడేటప్పుడు రామరామ అనడానికి బదులు రమరమ అని పాడేది. పతి సేవ అనడానికి పర సేవ అని పాడేది. నిన్నే నమ్మితిరా నాథ అనడానికి నిన్నే అమ్మితిరా అనాథ అని పాడేది. ఈ పడతిపూజ అందుకోరా అనడానికి ఈ బడితపూజ అందుకోరా అని పాడేది. నిన్ను మించిన దేవుడు నాకిల లేడురా అనడానికి నిన్ను దంచిన దేవుడు నాకిల లేడా రా? అని పాడేది.
ఒకసారి కమరావతి ధైర్యం చేసి,”దురితదుష్ట చతుష్టయరుధిరమంత” అనే పద్యాన్ని”డులిట డుసతచతుసట రంద్రమంతః” అని పాడేసింది.
ఇల్లాలి కంఠ మాధుర్యానికి మురిసిపోదామనుకున్న మల్లన్నకు, ఆమె పాటల్లోని అక్షరదోషాలు వినగానే ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తి పుట్టేది. అయితే భార్య వండి పెట్టే వంటల రుచులను తలచుకుని పుట్టిన విరక్తిని చంపేసేవాడు.
కమరావతి పెరుగావడ, పాలావడ, పీష్ ఆవడ, చికెన్ ఆవడ, మటన్ ఆవడ, తేనె ఆవడలను చేసి పెడితే, మల్లన్న లొట్టలేసుకుంటూ చిన్నముక్కకూడ వదిలి పెట్టకుండ తినేవాడు.  కమరావతి మల్లన్నల యింటిప్రక్కనున్న యింట్లో ఉమాదేవి శంకరులు ఉంటున్నారు. యిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఉమాదేవి తెలుగు టీచర్ కాగా, శంకరం గణిత ఉపాధ్యాయుడు. వేదపురాణేతిహాసాదుల మీద అభిమానం ఉన్నవాడు. వారికొక కుమార్తె, ఒక కుమారుడు, కుమార్తె పేరు అపాల.
ముద్దుగ అల అనీ, పాల అనీ, అప్ప అనీ ఎవరిష్టమొచ్చినట్లు వారు పిలుస్తారు. ఎలా పిలిచిన పలికే సహనవంతురాలు అపాల. కుమారుడు దిలీప్ అందరూ దీపు అని పిలిచేవారు. దీపు కొంటెకోణంగి.
అపాల కమరావతిమల్లన్నల యింట్లోనే ఎక్కువగ ఉండేది. పిల్లలు లేని కమరావతి అపాల దీపులను స్వంత బిడ్డల్లాచూసుకునేది. అపాల కమరావతి పాడే పాటల్లోని తప్పులను సరిచేస్తూ, క్రొత్తపాటలను నేర్చుకునేది. “అబ్బా ఆంటీ వంద మా తరం కాదు వందేమాతరం” అని అపాల తప్పులను సరిచేస్తుంటే మల్లన్న,”మొగుడా అని పాడమంటే మింగుడా అని పాడుతుందమ్మ” అని తన ఆవేదనను అపాలకి చెప్పుకునేవాడు. అపాల ఇంటర్‌లో ఉన్నతస్థానాన విజయం సాధించింది. ప్రేమలో పడింది.
కమరావతి కంఠమాధుర్యానికి ఉమాదేవికూడ అబ్బురపడిపోయేది. అయితే ఆమె అక్షరదోషాలను వినగానే ఆమెకు దిమ్మతిరిగి బొమ్మ కనపడేది. కమరావతి పాటల్లోని తప్పులను సరిచేస్తుండేది. దీపుకు మాత్రం కమరావతి తప్పులతో పాడుతుంటేనే ఆనందంగ ఉండేది. అప్పుడప్పుడు దీపు ఆనందంతో జత కలిపేవాడు మల్లన్న.
ఒకసారి “వల్లకాటికిపోయి ఓరయ్యో- చల్లటీ కబురెత్తుకోచ్చాను మారయ్యో ఊరునేలే ఆసామి ఊరకుక్క- ఊరుకూరికే చచ్చిందంట మారయ్యో ఆసామి ఊరకుక్క ఆహాహా చచ్చింది ఓహోహో చచ్చింది మారయ్యా” అంటూ గోరంత మంచిని కొండంత చేసిచెప్పే తిక్క శంకరయ్య పాటను దీపు వ్రాసుకొచ్చి కమరావతిని పాడమన్నాడు. కమరావతి గొంతు సవరించుకుంది. ఒకటికి పదిసార్లు పాటలోని మొదటి అక్షరం వ ని జపించింది. పాడటం మొదలు పెట్టేసరికి ఆమెకు వ అనే అక్షరం గుర్తుకురాలేదు. ” క..కు… గ.. గు. జ..జు..త..తు..మ..ము. ర..రు….” యిలా అన్ని అక్షరాలను యాది చేసుకుని కడకు “నల్లకడికి పోయి” అంటూ పాట అందుకుంది. భార్య కోడిమెదడుకు జుట్టు పీక్కున్నాడు మల్లన్న.
మల్లన్న కమరావతిని ఉమాదేవికి అప్పగించి డొక్కశుద్ధి చేయమన్నాడు. చిరునవ్వుతో ఉమాదేవి అలాగే అంది.
మల్లన్న జీవాలవ్యాపారం చేస్తుంటాడు. ఆ మార్కెట్ లోనే తిక్కశంకరయ్య పాటలు పాడుతూ కూరలు అమ్ముతూ కాలం గడుపుతుంటాడు. ఒకసారి తిక్కశంకరయ్య కమరావతి పాటలను విని రెండురోజుల వరకు తనెవరో మరిచిపోయి, “ముఖ్యమంత్రిగారు నా ముక్కుపొడుం డబ్బా పోయింది. గూఢచారి 116 ని పంపి వెతికించి తెప్పించి యివ్వండి, ఉపవాసముంటే అప్పుతీరదు–వల్లకాటి కెళితే పోయింది తిరిగిరాదు. మీరు ఉపవాసముండవద్దు. వల్లకాటికి వెళ్ళవద్దు. ముక్కుపొడుం డబ్బా తెప్పించి యివ్వండి” అంటూ ఊరంత తిరిగాడు. కడకు కమరావతి చేతిముద్ద తినే మనిషయ్యాడు.
కమరావతి పాటల్లో పాడే అక్షరదోషాలను ఉమాదేవి కూడ సరిచేయలేక పోయింది. కమరావతి ఖాళీ ఉన్నప్పుడల్లా తన పాటలను పాడి వినిపించడానికి ఉమాదేవి భర్త శంకరం దగ్గరకు వెళ్ళేది.
శంకరం కమరావతి పాటలను విన్నప్పుడల్లా “సున్నాను కని పెట్టింది నేనే; రామానుజంకి ఎక్కాలు నేర్పింది నేనే; పాస్కల్ నన్నడిగే పకోడీలు తిన్నాడు. పునరపి జననం – పునరపి మరణం – ఎందుకు భేదం – ఎందుకు మోదం” అని జుట్టు పీక్కునేవాడు. పీక్కున్న జుట్టును సవరం కట్టించుకోమని భార్యకు యిచ్చేవాడు. దీపు తన తండ్రి సినిమాకు డబ్బులివ్వనప్పుడల్లా తండ్రి మీదకు కమరావతిని పాటపాడటానికి పంపేవాడు. శంకరం యింటిలోకి అవతారం, ఆనందవనం అద్దెకు దిగారు. “హోహోహ్లాదహ్లాద! పాటలంటే నేను చెవి కోసుకుంటా” అన్న ఆనందవనానికి కమరావతి గురించి చెప్పింది అపాల.
ఆనందవనాన్నే అపాల ప్రేమించింది. ఇద్దరూ దగ్గరదగ్గరగా ఉండి ఒకరిగురించి మరొకరు బాగా తెలుసుకోవాలనుకున్నారు. అపాల ప్రేమపూర్వక అభ్యర్థనను అనుసరించి ఆనందవనం మిత్రుడు అవతారంతో అపాల యింటిలోనే అద్దెకు దిగాడు. ఈ విషయం ఉమాదేవికి శంకరానికి తెలియదు. నాలుగురోజుల పాటు అప్పులవాళ్ళ బాధనుండి బయటపడవచ్చని ఆనందవనంతో అవతారం వచ్చాడు.
అపాల మాటలను విన్న ఆనందవనం కమరావతి పాటల్లోని భాషాదోషాలను సరిచేసి, ఆమెను మహాగాయనిని చేస్తానని తన మిత్రుడు అవతారం మీద ఒట్టేసి గట్టిగ చెప్పాడు. ప్రేమికుని సాహసం చూసి అపాల మహదానంద పడింది. కమరావతిని పరిచయం చేసింది. “వచ్చేవచ్చే వసంతమాసం – పంపే పంపే శుకసందేశమ” అనే పల్లవిని ఆనందవనం పాడి, అలాగనే పాడమని కమరావతితో అన్నాడు. కమరావతి గొంతు సవరించుకుంది. ఆ సవరింపులో ఆమె గొంతుతో కదలాదిన స్వరాల మాధుర్యానికి ఆనందవనం పులకరించిపోయాడు. నవీనరాగకల్పనకు యిలాంటి కంఠాలే కావాలనుకున్నాడు. కమరావతి పాటను అందుకుంది.
“వాచ్చె వాచ్చే సంతలో మాసం – పందే పందే సంకసందేశం” అని కమరావతి పాడగానే వంటచేస్తున్న అవతారం “పాలల్లో వెయ్యాల్సింది పంచదార కాదు. చింతపండు” అంటూ చింతపండు వేసాడు. గుడ్లు తేలేసాడు.
ఆనందవనం కమరావతి భాషాసమస్యను అర్థం చేసుకున్నాడు. దీర్ఘ కాలప్రణాళికను ఒకదానిని రూపొందించుకున్నాడు. ఆ ప్రణాళికలో భాగంగ “నానూనెనీనూనెనానూనెనీనానూనె”అంటూ కమరావతితో అనిపించసాగాడు. కమరావతి పని చేసుకుంటూ కూడ నానూనెనీనూనె అని పాడుకోసాగింది. అదే నూనో అర్థంకాక మల్లన్న జుట్టు పీక్కునేవాడు. దేవదాసు కుక్కపిల్లను పక్కన పెట్టుకుని త్రాగితే, తను మేకపిల్లని పక్కన పెట్టుకుని తాగాలని రకరకాల ఆలోచనలు చేసేవాడు. ఆనందవనం కమరావతికి రకరకాలుగ తెలుగు అక్షరాలను పలికిస్తూనే, అపాలతో “జింగిరిజింగిరిబాల” అంటూ ప్రణయగీతాలాలపించసాగాడు.
ఆనందవనం ప్రణయగీతాలను కమరావతి పసిగట్టింది. వారి ప్రేమ గురించి భర్తకు చెప్పింది.
మల్లన్న ఆనందవనం గురించి ఆరా తీయసాగాడు. అవతారం ఖాళీ సమయాల్లో దీపు తెలుగు నోడ్సులు వ్రాసి పెట్టసాగాడు. కమరావతి ప్రభావాన నోట్సుల్లో, ‘పదిమంది’ అని వ్రాయాల్సింది ‘పందిమంది’ అనీ, ‘కళ్ళు తెరిచిచూడు’ అని వ్రాయాల్సింది ‘కాళ్ళు తెరిచిచూడు’ అనీ, ‘భారతం’ అని వ్రాయాల్సింది ‘భరతం’ అనీ వ్రాయసాగాడు. ఆనందవనం ‘నానూనె’తో పాటు ‘జాజిజిజూజోజో జీజజాజిజూజోజో’ వంటి అనేక అక్షరబంధాలను కలిపించి కమరావతితో పలికించసాగాడు. అతని “కాకీ కకీకాకకూ కాకరాకకాక కీకాకకూ కాక కేక కేక”వంటి అక్షరబంధాలు అందరిని ఆకర్షించాయి. దీపు వాటిని ఉచ్చరిస్తూ, బడిపంతులును కూడ అబ్బురపరిచాడు.
మల్లన్న ఆనందవనం గురించి మొత్తం తెలుసుకున్నాడు. అనందవనం తలిదండ్రులు అతని చిన్నతనంలోనే కారు ప్రమాదంలో చనిపోయారు. అతను అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యాడు. అనందవనం గురించి అపాల గురించి కమరావతి మల్లన్నలు ఉమాదేవి శంకరంలకు చెప్పి, వారి ప్రేమకు ప్రాణం పోసారు.
ఆనందవనానికి ఈ విషయం తెలిసింది. కమరావతిమల్లన్నలకు నమస్కరిస్తూ, “మీ మేకలకు మే భాష నేర్పి నా రుణం తీర్చుకుంటాను” అన్నాడు.
ఆనందవనం ప్రభావాన కమరావతి పాటల్లో అక్షరదోషాలు తగ్గిపోయాయి. ఆమెతో పాటల కచ్చేరి పెట్టించారు. తొలి కచ్చేరిలోనే ఆమెకు మహాగాయని అని బిరుదు వచ్చింది. కమరావతీగానం ప్రపంచవ్యాప్తంగ ప్రజాదరణను పొందింది. కమరావతి తన పేరు మీద కమరావతీరాగం అనే కొత్తరాగాన్ని కనిపెట్టింది. అది ఆదునిక సమాజాన్ని కూడ ఆకర్షించింది. ఆమె సన్మాన కార్యక్రమంలోనే ఆనందవనం అపాలాల పెళ్ళి జరిగింది.
కమరావతి అక్షరదోషాల జబ్బు అవతారాన్ని అంటుకుంది. అవతారం, ‘శివకుమారుడు’ అని వ్రాయాల్సింది ‘శవకుమారుడు’ అని వ్రాయడం, ‘కందిపప్పు’ అని వ్రాయాల్సింది ‘కిందిపప్పు’ అని వ్రాయడం, ‘సాంబారుపొడి’ అని వ్రాయాల్సింది ‘సోంబేరు పొడి’ అని వ్రాయడం చేయసాగాడు. ఆనందవనం అపాలలు యిద్దరూ కలిసి అవతారం కోసం మరో దగ్గుకాల… సారీ… సారీ… దీర్ఘకాల ప్రణాళికను సిద్ధంచేసారు.
సర్వేజనాః ఆనందో భవంతు!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
జడివాన - కొడవంటి ఉషా కుమారి

[Image: J.png]

“ఏవండోయ్! ఇదివిన్నారా!” 
“ఏమిటో చెప్పకుండా ఇది విన్నారా!అంటే ఏం తెలుస్తుందోయ్!సంగతి ఏమిటో చెప్పు! విన్నానో లేదో చెప్తాను!” అన్నాడు సుందరం.
“ఎదురింటి సత్యమూర్తి మాస్టారికి వాంతులట రాత్రి నుండి!హాస్పటల్ కి తీసుకెళ్ళేరట.”అంది సుందరి. “అయ్యో!చెప్పావుకావేమీ!ఉందిచూసివస్తాను!” అన్నాడు వంకీకి ఉన్న షర్ట్ వేసుకుని బయటకు నడుస్తూ!
” పక్కింటి ఆండాళ్ళు అన్ని గమనిస్తూనే ఉంది!దూరంగా ఉండటంతో సంగతి ఏమిటో పూర్తిగా తెలియటం లేదు! ‘వాంతులూ,హస్పటలూఅంటున్నారు! అదీ సత్య మూర్తి మాష్టారింట్లో! ఏదో జరిగే ఉంటుంది!’
 “ఇదిగో జగదంబ! ఇలారా!” “ఏమయ్యింది ఆండాళ్ళు వదినా!” “ఏమవడం ఏమిటీ!ఆ సత్య మూర్తి మాష్టారు పెద్దమ్మాయి వాంతులు చేసుకుంటుందట!చూడ్డానికి వెళ్ళాడట ఆ సుందరం!”
“అవునా! ఇంత జరిగిందా!”
“మరేమనుకున్నావు! వాళ్ళింట్లో వాంతులైతే వీళ్ళకేమిటి కడుపుబ్బరం!”
“ఆ…. మరే! అసలు వీళ్ళ అబ్బాయి ఆ అమ్మాయి కలిసి తిరగడం మనం చూస్తూనే ఉన్నముగా!” “ఆ నిజమే కారణం అదే అయిఉంటుంది!” వంకరగా నవ్వుతూ అంది ఆండాళ్ళు!
 “మరే! అయినా మనకెందుకు?” “నిజమే! మనం చూస్తే అమాయకులం!”
“అవును సుమా!ఆ వెనకింటి వెంకటేశం లేడూ!అరవై ఏళ్ళుదాటాయిరెండోపెళ్లి చేసుకుంటానంటున్నాడట!”
“అయ్యో! అవునా! ఇదేమిచోద్యం అమ్మా! అయినా మనకెందుకు?”
 “అవును వదినా!మనమసలే అమాయకులం!ఇంతకీ ఆ నాలుగిళ్ళవతల ఆనందరావు గురించి ఏమను కుంటున్నారో నీకు తెలుసా! ఆండాళ్లు వదినా!”
 “అయ్యో! తెలియకేం వదినా! ఆఫీసులోనే సెకండ్ సెటప్ పెట్టేడట!”
“ఓరి నాయినోయి!నీకింత తెలుసా!నేనేదో గాలి వాటంగా విన్నాను ఆండాళ్ళు వదినా!”
 “ఇంతేనా! ఇంకా చూడు తమాషా!మా వెనకాల సందులో మూడో ఇంట్లో నారాయణా నా నోటితో చెప్పలేను! ఇక నువ్వు రోజు వెళ్ళే అచ్చమ్మకి కన్ను లొట్ట నోరు లొడలొట్ట!”
 “అయ్యో! నిజమా!కళ్ళజోడు పెట్టుకుంటే ఏదో అనుకున్నాను సుమా!”
“అంత ఎందుకు జగదంబా! మన ముందు సందులో సీతాపతి లేడూ! భార్య అంటే తెగ భయం! ఆవిడ కూర్చోమంటే కూర్చుంటాడు! లేవమంటే లేస్తాడు!”
“నిజమే సుమా! నేను గమనించనే లేదు! ఇంతకీ నీకు ఈ విషయం తెలుసా! ఇక్కడినుండి తిన్నగా వెళ్లి కుడివైపుకు తిరిగితే అక్కడ రెండో ఇల్లు! అత్తా కోడలు రోజు గొడవలే! మొన్న అయితే కొట్టుకున్నారు కూడా!”
“ఓడియమ్మ నిజమా! అయినా మనకెందుకు జగదాంబా!”
“అవును సుమా! మనం అసలే అమాయకులం కూడాను! అయినా అందరూ మనలా జాలిగుండె కలవాళ్ళు ఉంటారా! ఆండాళ్ళు వదినా!” వాళ్ల నోళ్ళల్లో పడి అంతా కొట్టుకుపోతున్నారు! కొంతమంది లేచిపోతున్నారు! మరి కొంతమంది ఏమో అయిపోతున్నారు! అంతలో…..
 “ఇదిగో ఇక్కడ ఆండాళ్ళు, జగదాంబ అంటే ఎవరూ?” “మేమే! ఎందుకు అడిగావు?” ఆరాగా అడిగారు ఇద్దరూ.
“ ఆండాళ్ళక్కాయ్ మీ పెద్దమ్మాయి, జగదాంబ పెద్ద కొడుకూ కలిసి ఎక్కడికో జంపంట! ఊర్లో అందరూ ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు!ఇంతసేపూ అందరినీ ఆడిపోసుకున్నారు కదా! ఇప్పుడు మీవంతు!” వికవికా నవ్వుతూ అంది అనసూయ.
“ఓరి నాయనోయ్! నాకొంపకే ఎసరొచ్చిందా!” అంది ఆండాళ్ళు.
“వామ్మో ఇదేం తద్దినం! బోలెడంత కట్నంతో కోడల్ని తెచ్చుకుందాం అనుకుంటే!” అంది జగదాంబ.
“అవును! అందరి గురించి చెడుగా ఏమో అన్నారుగా! అది మీకే కొట్టింది! ఇప్పటికైనా ఆ నోటిని అదుపులో పెట్టుకోండి! లేకపోతే ఊరంతా ఏకమై నీ పని పడతారు!” అంది అనసూయ. జడివాన వెలిసింది! ఆకాశం నిర్మలంగా ఉంది.
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
చెన్నమ్మ సర్కిల్ - డా.ఎం.హరికిషన్  
[Image: image.jpg]

చెన్నమ్మ సర్కిల్ - (Heart ❤️ Touching Story) ఆంధ్రజ్యోతి సండే బుక్ లో ప్రచురింపబడిన కథ

"ఈ ఎర్ర రంగు చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా?" దగ్గరకు తీసుకుంటూ అన్నాడు గోపాల్.
ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇద్దరే!
సుందరి వాళ్ళ అమ్మ పొద్దున్నే పనికి పోగానే రహస్యంగా ఇంట్లోకి చేరాడు.
అతని ఒడిలో పడుకొని, కళ్ళలోకి తదేకంగా చూస్తూ “గోపాల్... ఇదంతా జరుగుతుందంటావా” దిగులుగా అడిగింది. ఆమె నుదుటిమీద చిన్నగా ముద్దు పెట్టుకుంటూ “నన్ను నమ్ము. మన స్నేహం ఇప్పటిది కాదు. చిన్నప్పటినుంచి ఒకరి చేయి మరొకరం పట్టుకుని నడిచాం. కలసి బడిలో పక్కపక్కనే కూర్చున్నాం. తిన్నాం. తిరిగాం. ఇప్పుడు ఇలా నిన్ను ఒంటరిగా వదిలేసి నా దారి నేను చూసుకోవడానికి మనసొప్పడం లేదు. బతికినా చచ్చినా కలిసే” ఆ మాటలు అంటుంటే గొంతు ఉద్రేకంతో వణికింది. సుందరి చప్పున గోపాల్ నోటిని చేతితో మూసి గట్టిగా తన గుండెలకు హత్తుకుంది. ఆమె కళ్ళలోంచి ఒక్కొక్క చుక్క కారుతోంది.
“నువ్వేం దిగులుపడకు. నేను వివరాలన్నీ తెలుసుకున్నాను. బాంబేలో ఆపరేషన్ చేసే వైద్యులు చాలామంది వున్నారు. ఆ తరువాత మనం పెళ్లి చేసుకొని మనమెవరో ఎవరికీ తెలియని చోటుకు వెళ్ళిపోయి బతుకుదాం.”
“మరి అంత డబ్బు!"
“దాని కోసమే రేపు బయలుదేరుతున్నా. పత్తికొండ దగ్గర జొన్నగిరి అనే వూరు వుందిలే. అక్కడ తొలకరి వానలప్పుడు వజ్రాలు దొరుకుతాయంట. సుంకన్న తెలుసు కదా... మన చిన్ననాటి స్నేహితుడు. వానితో కలిసి వెళుతున్నా. మన అదృష్టం బాగుంటే సమస్యలన్నీ తీరిపోతాయి.”
మధ్యాహ్నం పన్నెండవుతూ వుంది.
“సరే ఇంక నువ్వెళ్ళు. అమ్మ వచ్చే సమయం దగ్గర పడింది. జాగ్రత్త. అవసరమైతే మెసేజ్ చెయ్. ఫోన్ చేయకు.”
గోపాల్ ఆమె వంకే తిరిగి చూస్తూ వెళ్లిపోయాడు.
సుందరి గబగబా చీర విప్పేసి, బొట్టు తుడిచేసి, చొక్కా ప్యాంటు వేసుకొని, పాపిడి మధ్య నుంచి కుడికి తీసింది. చీరను జాగ్రత్తగా మడతలు పెట్టి బీరువాలో భద్రంగా దాచింది. వంట ఇంకా పూర్తి కాలేదు. అన్నం గిన్నె స్టవ్ మీదకి ఎక్కించి, బెండకాయలు తరిగి వేపుడు చేసింది. అమ్మ పనిచేసి అలసి ఆకలితో వస్తుంది. వంట సిద్ధంగా లేకపోతే విసుక్కుంటుంది.
“నేనూ నీతో పాటు వస్తాను మా... నీవొక్కదానివే ఎంత కాలం కష్టపడతావు" చాలాసార్లు అంది తల్లితో.
"వద్దు... బైట ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా తట్టుకోలేను.”
“ఎంత కాలం ఇలా ఒంటరిగా ఇంట్లో.”
"నేను బతికున్నంత కాలం" ఆమె కంట్లో నీటి పొర.
“ఆ తర్వాత?”
కాసేపు నిశ్శబ్దం. శూన్యంలోకి చూస్తూ “దేవుడున్నాడు” అంటూ పైకి రెండు చేతులు ఎత్తి మొక్కుకునేది.
చాలాసార్లు చచ్చిపోవాలి అనిపించేది. కానీ గోపాల్ బతుకుపై ఆశ కల్పించాడు. చిన్నప్పటినుంచీ ఎంతో స్నేహంగా వుండేవాడు.
అమ్మ బడి మానిపించాక కూడా ఒక్క గోపాల్ని మాత్రమే రానిచ్చేది.
ఎనిమిదో తరగతి వరకు అంతా బాగానే ఉండేది. కానీ తొమ్మిది నుంచి నెమ్మది నెమ్మదిగా మార్పు మొదలైంది. మామూలుగానే నాజూకుగా వుండే తెల్లని శరీరం మరింత నునుపుదేలసాగింది. గొంతు పూర్తిగా మగవాళ్లకు దూరంగా జరిగిపోయింది. మీసాలు గడ్డాలు రావలసిన మొహం నున్నగా తయారై ఛాతి పొంగడం మొదలైంది.
చుట్టూ గుసగుసలు మొదలయ్యాయి. నవ్వులు... అవహేళనలు... ఎత్తిపొడుపులు... రోజురోజుకి లోపలికి ముడుచుకొని పోసాగాడు. వెనుక మాటలు కాస్త మొహం మీదే అనటం మొదలయ్యింది.
మగపిల్లలు గిల్లటం, నవ్వటం, లాగటం మొదలుపెట్టారు. గోపాల్ వాళ్ళతో చాలాసార్లు గొడవ పడేవాడు. తన్నేవాడు.తన్నించుకునేవాడు.
ఆడపిల్లలు దూరంగా జరగటం మొదలుపెట్టారు.
తల్లికి అంతా అర్థమవుతూ వుంది. ఒకరోజు ఇంట్లో పెద్ద గొడవ. నాన్న గట్టిగా అరుస్తున్నాడు.
"వీన్ని ఎక్కడన్నా వదిలేసి వస్తా. ఊరిలో తలెత్తుకోలేకపోతున్నా. బిడ్డ పుట్టలేదనుకుంటే సరి.”
"లేకలేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ. ఎంతమంది వాళ్ళ పిల్లలకు కాలొంకరైనా, చేయొంకరైనా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవటం లేదు.”
"అది వేరు... ఇది వేరు... వాళ్లను చూసి అందరూ జాలిపడతారు. కానీ వీన్ని చూస్తే మొగం మీదే నవ్వుతున్నారు. భరించలేను.”
“నువ్వు ఎన్నైనా చెప్పు. చచ్చినా వీన్ని వదిలేయలేను.”
“సరే అయితే. నేనే మిమ్మల్ని వదిలేస్తా.” గదిలోంచి వస్తున్న మాటలు వింటూ వణికిపోయాడు. కళ్ళ నీళ్లతో ఒక మూల గోడకు అతుక్కుపోయాడు. మాటా మాటా పెరిగిపోయింది.
"వీడు వున్నంత వరకు ఇటువైపు అడుగు పెట్టను" అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
మూడు సంవత్సరాలయింది తండ్రి ముఖం చూడక.
తల్లి పనిచేసుకొని బతకడానికి ఏ ఊరయితేనేమి అనుకుంటూ ఆ ఊరు ఖాళీ చేసి, కర్నూల్లో తమ గురించి ఎవరికీ తెలియని చెన్నమ్మ సర్కిల్ దగ్గరికి చేరింది.
అక్కడ ఉదయం లేచినప్పటినుండీ ఎవరి బతుకు వేట వారిది.
ముందెవరున్నారు, వెనుకెవరున్నారు, బతికారా, చచ్చారా... తెలుసుకునే ఓపిక ఎవరికీ లేదు.
రేపటి వరకూ బతికి వుండడమే వారి ప్రధాన సమస్య.
అక్కడ వుండే ఇండస్ట్రియల్ ఏరియాలో పని వెతుక్కుంది. సుందరికి పంజాబీ డ్రెస్సులు తొడిగింది. చుట్టుపక్కల వాళ్లకి ఆడపిల్ల అనే చెప్పింది. ఇంట్లో మగపిల్లవానిలా బట్టలు వేసుకున్నా ఎప్పుడైనా బయటికి అడుగుపెడితే మాత్రం ఆడపిల్లలాగే బట్టలు వేసుకోమనేది. చుట్టుపక్కల ఎవరికీ ఎటువంటి అనుమానం రానీయకుండా గుట్టుచప్పుడు కాకుండా బతకసాగారు. ఎవరినీ ఇంటికి రానిచ్చేది కాదు. సుందరి ని కూడా బైటికి పంపేది కాదు. పిల్లలకోడిలా కాపాడుకోసాగింది.
కొంతకాలానికి గోపాల్ కూడా ఊర్లో పనులు దొరకక, పంటలు పండక, తాపీ పని నేర్చుకొని కర్నూల్లోకి అడుగు పెట్టాడు. మరలా ఇద్దరి మధ్య అనుబంధం మొదలై అది ప్రేమగా మారింది.
************
గోపాల్ బట్టలున్న తన పాత సంచితో సుంకన్న ఇంటికి చేరాడు. సుంకన్న పెళ్ళాం ఇచ్చిన కాఫీ తాగుతా వుంటే ఆమె వంటింట్లోంచి “అన్నా... అక్కడ వజ్రమూ లేదు, మట్టిగడ్డా లేదు. ఈయన మాటలు విని పనీపాటా వదిలేసి నువ్వు కూడా పోతున్నావే అనవసరంగా. పెండ్లయిన కాన్నించి చూస్తా వున్నా గదా... తొలకరి వానలు వస్తున్నాయంటే చాలు పంచ పైకెగ్గట్టి హుషారుగా ఎగురుకుంటూ పోవడం... చేతిలో దుడ్లు అయిపోగానే మొగమంతా నల్లగా చేసుకుని మట్టసంగా వూగులాడుకుంటా రావడం... ఇదే వరుస. నీకెందుకన్నా ఎండమావుల్లో ఎదుకులాట. హాయిగా పని చేసుకోక” అనింది.
సుంకన్న పెళ్ళాం వంక సురసురు చూస్తా “చూడు... అదృష్టదేవత ఎప్పుడు ఎవరి తలుపు తడతాదో ఎవరికి తెలుసు. చూస్తావుండు ఏదో ఒకరోజు నీ మొగుడు పెద్ద మిద్దె కట్టి, మోటర్ బండిపై నిన్నూ నీ బిడ్డను కూర్చోబెట్టుకుని చెన్నమ్మ సర్కిల్ వీధులన్నీ తిరగకపోతే.” "వాయబ్బో మాటలకేం తక్కువ లేదులే. వూ కొట్టేటోడు వుండాలగానీ చందమామ మీద ఇళ్ళుకూడా కట్టి చూపియ్యగలవు” అని నవ్వుకుంటా ఎంగిలి కాఫీగ్లాసు తీసుకుని వంటింట్లోకి వెళ్లింది.
సుంకన్న గోపాల్ వంక తిరిగి “రేయ్ జొన్నగిరి అంటే ఏమనుకుంటా వున్నావ్... అశోకుని కాలంలో రెండవ రాజధాని. అప్పట్లో దాన్ని సువర్ణగిరి అని పిలిచేవారట. అదే కాలక్రమేనా సొన్నగిరిగా... జొన్నగిరిగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ అశోకుడు వేయించిన శాసనాలు తప్ప కోట గుర్తులు ఏమీ లేవు. అన్నీ శిథిలమైపోయి సర్వసంపదలతో సహా భూమిలో కప్పబడిపోయాయి. 
అంతేకాదు విజయనగర రాజ్యం పతనం అవుతున్న సమయంలో శత్రువుల చేతికి చిక్కకుండా రాజ్యంలోని విలువైన రత్నాలు, వజ్రాలు అన్నీ సరిహద్దు ప్రాంతాలలోని గ్రామాల్లో ఈ చుట్టుపక్కల గుంతలు తీసి భద్రంగా దాచి పెట్టినారంట. అవే ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా భూమి కోతకు గురై ఒక్కొక్కటిగా వెలుపలికి వస్తా వున్నాయి. తినే ప్రతి గింజపైనా దేవుడు ఎవరో ఒకరి పేరు ముందే రాసిపెట్టినట్టు... ప్రతి వజ్రం పైన దాని యజమాని పేరు ముందే ఉంటుంది. అవి వాళ్ళు అడుగుపెట్టినప్పుడు మాత్రమే దొరుకుతాయి. నీ అదృష్టం ఎలా వుందో ఎవరికి తెలుసు?” ఊరించి ఊరించి చెప్పాడు.
ఇద్దరూ నెల రోజులకు అవసరమైన బియ్యాన్ని, వంట పాత్రలను, చిన్న కిరోసిన్ స్టవు, టార్చిలైటు, దుప్పట్లను, బట్టలను గోనె సంచుల్లో మూటగట్టుకొని బైలుదేరారు.
ఇంతలో పది సంవత్సరాల సుంకన్న చిన్న కూతురు ఎదురు వచ్చింది. పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. “బాయ్ నాన్నా... బాయ్ మామా” అంటూ టాటా చెప్పింది. “జాగ్రత్తగా పోయి రండి" కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ సుంకన్న పెళ్ళాం ఊరగాయ, రొట్టెలను దారిలో తినడానికి మూటగట్టి అందించింది.
******
వచ్చి అప్పటికే పదిహేను రోజులు అవుతావుంది. రోజూ పొద్దున్నే లేవడం, గుడి ముందున్న బోరింగు వద్ద స్నానం చేసి బట్టలుతుక్కోవడం, స్టవ్ మీద అన్నం పప్పు చేసుకోవడం, కొంచెం తిని మిగిలింది మూటగట్టుకుని పొలాల్లోకి బయలుదేరడం.
ఆ ఎర్ర నేలల్లో జనాలు గొర్రెలమందల్లా తలలు వంచుకొని గుంపులు గుంపులుగా వెదుకుతా వున్నారు. ఎవరెవరికో ఎప్పుడో వజ్రాలు దొరికి వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా మారిపొయినాయనే కథలు వింటూ... చస్తున్న ఆశలకు జీవం పోస్తూ... పొలాలను జల్లెడ పడుతున్నారు.
ఆ ఊరి రైతులు చానా మంచోళ్ళు. విసుక్కోరు.
ఒకపక్క వాళ్ళు దున్నుకుంటా వుంటే మరొక పక్క జనాలు వాళ్ళ వెంబడే ఏరుకుంటా వున్నా ఏమీ పట్టించుకోరు. ఎక్కడెక్కడి నుంచో ఆశతో వచ్చే వాళ్లను చూస్తే ఆ ఊరి వాళ్లకు జాలి.
గోపాల్ నీరసంగా తవ్వుతూ వున్నాడు. పొద్దున్నుంచీ ఏమీ తినలేదు. ఇదే ఆఖరి రోజు. తెచ్చుకున్న సరుకులూ డబ్బులూ అయిపోయాయి. ఆకలి లోపల చంపేస్తా వుంది. నీళ్ల బాటిల్ వంక చూశాడు. ఖాళీగా వుంది. దూరంగా ఒక వంక వుంది. బాటిల్ తీసుకొని అటువైపు అడుగులు వేశాడు. వంక చుట్టూ గుబురు మొక్కలు. ఆ మొక్కల్లో తినడానికి పనికి వచ్చేవి ఏమైనా వున్నాయా అని పరిశీలనగా చూస్తూ అడుగులు వేస్తుంటే... పొదలో ఏదో తళుక్కున మెరిసింది. ఒక్క క్షణం ఆగిపోయాడు. తీక్షణంగా అటువైపు చూశాడు. రెండు కళ్ళు తనని బెదురు బెదురుగా చూస్తున్నాయి. కుందేలు పిల్ల...
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
కడుపులో ఆకలి కాల్చివేస్తా వుంది. నోట్లో సర్రున నీళ్ళూరాయి. చప్పుడు కాకుండా చుట్టూ చూశాడు. కొంచం దూరంలో ఒక లావు కర్ర కనబడింది.
గోపాల్ బలమంతా ఉపయోగించి సరిగ్గా దాని వీపు మీద కొట్టాడు. కట్టె తాకేంతలోగా పొదల్లోకి ఒక్క గెంతు గెంతింది.
వెంట్రుకవాసిలో కట్టె దభీమని ఆ పక్కనే ఉన్న మట్టి ముద్దపై పడి ముక్కలైంది. రెప్పపాటులో కుందేలు మాయమైంది.
అది వెళ్లిన దిక్కే చూస్తూ వుండిపోయాడు కొద్దిసేపు. తర్వాత నిరాశగా వెనక్కి తిరుగబోతున్న వాడల్లా ఒక్క క్షణం ఆగాడు. ఏదో తళుక్కున మెరిసింది.
కొట్టుకుంటున్న గుండెతో అటువైపు చూశాడు. కట్టె దెబ్బకు పగిలి ముక్కలైన మట్టిముద్ద మధ్యలో పచ్చగా మెరుస్తున్న చిన్న రాయి. ఒక్కుదుటన ఎగిరి దాన్ని అందుకున్నాడు. గబగబా నీళ్ల వద్దకు పోయి మట్టిని కడిగి శుభ్రంగా తుడిచాడు. రాయి ఆకుపచ్చ రంగులో మినుకుమినుకుమంటా మెరుస్తావుంది.
చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. దాన్ని భద్రంగా ప్యాంటు జేబులో దోపుకున్నాడు. బాటిల్లో నీళ్లు నింపుకొని వడివడిగా సుంకన్న దగ్గరికి వచ్చాడు. వాన్ని పక్కకు తీసుకుపోయి రహస్యంగా జేబులోని రాయిని చూపించాడు. సుంకన్న కనుపాపలు పెద్దగా అయ్యాయి. ఆనందంతో గోపాల్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. శరీరం వణుకుతా వుంది. మొహం వెలిగిపోతా వుంది. "రేయ్... నాకు తెలిసినంత వరకు ఇది వజ్రమే. కానీ ఎంత విలువ వుంటాదో తెలియదు. వజ్రాల వ్యాపారుల ఏజెంట్లు ఇక్కడ గద్దల్లా తిరుగుతా వుంటారు. మాయచేసి చానా తక్కువ ధరకు అమ్మిస్తారు. ఎక్కడా నోరిప్పకు. గమ్మున నాతో రా. నాకు బాగా తెలిసిన మంచి ఏజెంట్ ఒకడున్నాడు.
వాని వద్దకు పోదాం” అన్నాడు గుసగుసగా. ఇద్దరూ పని ఆపేసి ఊర్లోకి బయలుదేరారు. ఛార్జీ కోసం తీసి పెట్టుకున్న డబ్బులతో కడుపునిండా అన్నం తిని ఏజెంట్ దగ్గరికి బైలుదేరారు.
“చూడు గోపాల్... పిల్చుకొచ్చింది, వసతి ఏర్పాటు చేసింది, అమ్మిస్తున్నది, దారి చూపిస్తున్నది అంతా నేనే కాబట్టి కనీసం పావు భాగమైనా నాకు ఇవ్వాల."
"రేయ్... లక్ష పైన ఎంతొచ్చినా అందులో సగం నీకిస్తా. కానీ లక్ష లోపల వస్తే మాత్రం ఈ ఒక్కసారికి వదిలేసెయ్. నీకు తెలుసు కదా సుందర్ గురించి. ఆపరేషన్ కి లక్ష ఖర్చు అవుతుంది. అర్థం చేసుకో. వాడూ నీ చిన్నప్పటి స్నేహితుడే కదా” చేతులు పట్టుకొని బతిమలాడుతూ అన్నాడు.
సుంకన్న కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత చిరునవ్వుతో “సరే... నీ దయ నా ప్రాప్తం. లక్ష కన్నా ఎక్కువ రావాలని కోరుకుందాం. నీ చెయ్యి మంచిగా వున్నట్టుంది. ఈసారి దొరికితే మాత్రం సగం సగం చూడు” అన్నాడు. గోపాల్ అలాగేనంటూ తలూపాడు.
సుంకన్న తనకు తెలిసిన ఏజెంట్ దగ్గరికి తీసుకుపోయాడు. వాడు దాన్ని పరీక్షించి వెంటనే వాళ్ళిద్దరిని తన మోటర్ సైకిల్ మీద గుత్తిలోని వజ్రాల వ్యాపారి దగ్గరికి పిలుచుకొని పోయాడు. అతను ఆ రాయిని పరీక్ష చేసి తొంభై వేలు వస్తుంది అన్నాడు. ఒక వ్యాపారిని కాదని ఇంకొక వ్యాపారి దగ్గరికి పోవడం కష్టం. ఇచ్చిన డబ్బులు తీసుకొని తిరిగి జొన్నగిరి చేరుకున్నారు. ఏజెంట్ కి కమీషన్ కింద పదివేలు ఇచ్చారు.
అప్పటికే బాగా చీకటి పడింది. కర్నూలుకు తిరిగి పోవడానికి బస్సులు లేవు. పొద్దున్నే వెళదామని అనుకున్నారు.
గుడిముందు పడుకున్నారు.
గోపాల్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నిద్ర రావడం లేదు. పదేపదే సుందరి గుర్తుకు
రాసాగింది. పెదాలపై నవ్వు తొంగి చూస్తోంది. విషయాన్నంతా సంబరంగా సుందరికి మెసేజ్ చేశాడు.
ఆలోచనల్లో కళ్ళు ఎప్పుడు మూతపడ్డాయో తెలియదు.
తనపై సుందరిపై పూల వర్షం...
“మీరిద్దరూ హాయిగా కలసి మెలసి బతకవచ్చు. ఇకపై ఏ సమస్యా వుండదు” అంటున్న బాంబే డాక్టర్లు...
ఎర్ర చీరలో ఆకుపచ్చ జాకెట్ వేసుకొని, జడలో మల్లెపూలతో, చేతిలో పూలదండతో తనకోసం వాకిలి దగ్గర ఎదురుచూస్తున్న సుందరి...
మెడలో పూలదండలతో కొత్త బట్టలతో చిటికెన వేలు పట్టుకొని తన వెనుకే ఏడడుగులు వేస్తూ...
కలలు ఒకదాని తరువాత ఒకటి...
ఒకదానితో మరొకటి కలిసిపోతూ....
అంతలో సుందరి వాళ్ళ అమ్మ కాళికాదేవిలా ఎర్రబారిన కళ్ళతో ప్రత్యక్షమైంది.
“వదులురా నా కొడుకుని" అంటూ విసురుగా చెయ్యి లాగి ఈడ్చి చెంపమీద కొట్టింది...
అదిరిపడి లేచి కూర్చున్నాడు.
చుట్టూ చీకటి.
గుండె వేగంగా కొట్టుకోసాగింది. నాలుక పిడచగట్టుకపోయింది.
బాటిల్ వైపు చూశాడు. ఖాళీగా వుంది.
పక్కకు చూశాడు. సుంకన్న లేడు!
బయటికి వచ్చి చూశాడు. అంతా చీకటి... నిశ్శబ్దం... కనుచూపుమేరలో ఎవరూ లేరు. చుట్టూ ఎటువంటి అలికిడీ లేదు.
మనసులో ఏదో అనుమానం కదిలింది. క్షణంలో అది పెరిగి పెద్దగై పెనుభూతమైంది. వణుకుతున్న చేతులతో వేగంగా లోపలికొచ్చాడు.
డబ్బు పెట్టిన సంచి లేదు.
క్షణాల్లో అంతా అర్థమయింది.
సమయం చూశాడు.
ఉదయం నాలుగవుతూ వుంది. ఇంత పొద్దున్నే ఊరు నుండి ఎవరూ బయటపడలేరు.
ఆరు గంటల వరకు ఆటోలు, బస్సులు కూడా కనీసం తిరగవు.
ఎవరైనా బండిమీద పోతూవుంటే వాళ్లతో లిఫ్టు ఎక్కి పోవాలన్నా వెలుతురు వచ్చేవరకు ఆగాల్సిందే.
కోపంతో బస్టాండ్ వైపు పరుగు తీశాడు. బస్టాండ్ దగ్గర పడగానే చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ... చుట్టూ గమనిస్తూ... చెట్ల చాటున పొదల చాటున దాక్కుంటూ... ఒక్కొక్క అడుగే వేయసాగాడు. బస్టాండ్ కు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద దాపుకు ఎవరికీ కనబడకుండా ముడుచుకొని కూర్చున్న సుంకన్న కనపడ్డాడు. వాని చేతిలో సంచి. జాగ్రత్తగా రెండు చేతులతో గుండెలకు అదుముకొని గట్టిగా పట్టుకొని వున్నాడు.
నెమ్మదిగా అడుగులు వేస్తూ వెనుక నుంచి వచ్చి “ఎక్కడికి తప్పించుకొని పోతావురా దొంగనాకొడకా... నన్నే మోసం చేయాలనుకుంటున్నావా" అంటూ ఎగిరి వాని
మీదికి దూకాడు.
సుంకన్న వణికిపోయాడు. “రేయ్ నా మాట వినరా. చాలా అవసరంరా. అక్కడ పాప...” అంటుండగానే గోపాల్ వాని మెడను చంకలో ఇరికించుకొని గట్టిగా నొక్కసాగాడు. పట్టు బిగుస్తున్నకొద్దీ సుంకన్నకు గాలి అందడం లేదు. నోట మాట రావడం లేదు. చేతులు టపటపా భూమిపై కొట్టుకుంటున్నాయి.
తప్పించుకోవడం చేతగాక నోటికి దగ్గరగా వున్న గోపాల్ భుజాన్ని పళ్ళతో కండ వూడి వచ్చేటట్లుగా కొరికాడు.
భుజం సుర్రుమనడంతో గోపాల్ చేయి వదిలాడు. రక్తం కారుతున్న చేతిని చూసి కోపంతో వూగిపోయాడు. చుట్టూ చూశాడు. దూరంగా రాయి కనపడింది. సర్రున దాన్ని అందుకుని ఈడ్చి సుంకన్న తలపై ఒక్కటి కొట్టాడు.
అంతే...
రక్తం సర్రున ఎగజిమ్మింది.
చేతులంతా రక్తంతో తడిసిపోయాయి. సుంకన్న పక్కనే పడి వున్న సంచిని తీసుకొని గోపాల్ దారితెన్నూ లేనట్టు పరిగెత్తాడు. ఇంతలో జేబులోని సెల్ ఒకటే మోగసాగింది. పరుగు తగ్గించి... తీసి చూశాడు.
ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆప్యాయంగా 'అన్నా' అని పిలిచే సుంకన్న పెళ్లాం!
గుండె పిసికినట్లు అనిపించింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తుందో తెలియక ఎత్తాడు. “అన్నా... చానా సేపటినుంచి ఫోన్ చేస్తున్నా. మా ఆయన ఎత్తట్లేదు. నిన్న రాత్రి నుంచి పాప ఆసుపత్రిలో తనకలాడతా వుంది. చేతిలో మందులకు ఒక్క పైసా లేదు. బతుకుతాదో చస్తాదో తెలియడం లేదు. అదేదో డెంగీ జ్వరం అంట. నిమిష నిమిషానికి కణాలు తగ్గిపోతున్నాయంట. నువ్వైనా విషయం చెప్పి వెంటనే పిలుచుకొని రా. నాకు కాలూ చేయీ ఆడడం లేదు" ఏడ్చి ఏడ్చి ఆమె గొంతు ఎండిపోయినట్లుంది. మాటలు ఎక్కడో నూతిలోనుంచి వస్తున్నట్లుగా వినబడుతున్నాయి.
గోపాల్ చేతిలోంచి సెల్ జారి కిందపడింది. “అన్నా... అన్నా..." ఆమె అరుపు
వినబడుతోంది.
సుంకన్నకు పాప పరిస్థితి ముందే తెలుసా? అందుకోసమేనా డబ్బులు దొంగతనం చేసి రాత్రికి రాత్రి పారిపోతున్నది! చిరునవ్వుతో వీడ్కోలు పలికిన పాప నవ్వు కళ్ళ ముందు కదలాడింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వేగంగా వెనక్కు తిరిగి సెల్ తీసుకుని చెట్టువైపు పరిగెత్తాడు.
తన ఆనందంలోనూ, దఃఖంలోనూ, వూహల్లోనూ, ఆలోచనల్లోనూ, ఆవేశంలోనూ, ఓదార్పులోనూ... అమ్మగా, అన్నగా, తమ్మునిగా ఇన్నాళ్ళు మనసులో మనసై నిలిచిన తన చిన్ననాటి స్నేహితుడు...
సుంకన్న... చెట్టు దగ్గర పడి వున్నాడు. తల నుంచి రక్తం కారి గడ్డ కడుతూ వుంది. పక్కనున్న బాటిల్లోంచి నీళ్లు తీసి ముఖం మీద చిలకరించాడు.
"రేయ్.. లెయ్ రా... ఒక్క మాట చెప్పొచ్చు కదరా పాప కోసమని. ఈ స్నేహితుని మీద ఆ మాత్రం నమ్మకం లేకపోయిందా. లే... ఇదిగో ఈ డబ్బంతా నీకే. పద పద... పాపను కాపాడుకుందాం" కుదుపుతూ అన్నాడు. సుంకన్నలో చలనం లేదు.
కళ్ళు ఎక్కడో ఆకాశం కేసి నిరాశగా రెప్ప వేయకుండా చూస్తూ వున్నాయి.
అంతలో ఫోన్ మోగింది...
అదిరే గుండెతో... ఎవరా అని చూశాడు.
సుందరి...
చెన్నమ్మ సర్కిల్ నుంచి ఆశగా...
**************************
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇదేమి ఊరురా నాయనా
[Image: Picture3.png]
 డా.ఎం.హరికిషన్ 

కందనవోలు అనే రాజ్యంలో దేవరాజు అనే వ్యాపారి ఉండేటోడు. ఆయన చానా కష్టజీవి. కడుపు నింపుకోడానికి తిండి వెతుక్కునే స్థాయి నుండి పదిమందికి అన్నం పెట్టే స్థాయి వరకు ఎదిగినాడు. ఆయన చేయని వ్యాపారమూ లేదు తిరగని ఊరూ లేదు. నెమ్మదిగా అతనికి వయసు మీద పడింది. చనిపోయే ముందు కొడుకు రంగరాజుని పిలిచి "రేయ్... అంతా నాకే కావాలా అని ఎప్పుడు అనుకోకు. పది రూపాయలు సంపాదిస్తే కనీసం ఒక రూపాయయినా దానం చెయ్యాల. అలాగే ఒక ముఖ్యమైన విషయం... నువ్వు ఏ ఊరికైనా పో ఏ వ్యాపారమైన చేయి... కానీ తూర్పు దిక్కున ఉన్న కంత్రీకట్టకు మాత్రం పోవద్దు. ఎందుకంటే" అంటూ విషయం చెప్పే లోపల ఆయన ప్రాణం విడిచినాడు.
రంగరాజు తండ్రి చెప్పినట్టే రకరకాల ఊర్లు తిరుగుతా ఎవరినీ మోసం చేయకుండా పదిమందిని ఆదుకుంటా చానా డబ్బు సంపాదించినాడు. ఒకసారి అడవిలో గుర్రం మీద పోతావుంటే దారిలో ఒక దొంగల గుంపు దాడి చేసింది. వాళ్లకు దొరుకుతే నిలువుదోపిడీ చేయడమే గాక చంపినా చంపుతారు. అందుకని వాళ్ళనుంచి తప్పించుకోడానికి గుర్రాన్ని వేగంగా అడవిలోనికి ఉరికించినాడు. అది అలా ఉరుకుతా ఉరుకుతా అడవిలో దారి తప్పిపోయింది. ఎటుపోవాల్నో తోచలేదు. ఎటు చూసినా చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు. దాంతో దొరికింది తింటా చెరువుల్లో కాలువల్లో నీళ్లు తాగుతా ఒక నాలుగు రోజులు అడవిలో తిరిగినాక ఆఖరికి ఒక ఊరు కనబడింది. సంబరంగా ఆ ఊరి లోపలికి పోయినాడు. దారిలో ఒక పిల్లోడు కనబడితే "ఏ ఊరు బాబూ ఇది" అని అడిగినాడు. దానికి వాడు "కంత్రీ కట్ట" అని చెప్పినాడు. ఆ పేరు వినగానే రంగరాజు అదిరిపడినాడు. వాళ్ల నాయన చెప్పిన మాటలు కళ్ళముందు మెదిలినయి. కానీ నాలుగు రోజుల నుంచి అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయినాడు గదా. దాంతోబాటు ఆకలితో కడుపు నకనకలాడి పోతావుంది. అందుకని ఈ ఒక్కరోజు ఇక్కడ పండుకొని తర్వాత రోజు పొద్దున్నే దారి కనుక్కొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు.
ఊరిలో పోతావుంటే ఒక ఇంటి ముందు ఒక ముసలాయన కనబడినాడు. రంగరాజు ఆయనతో "తాతా... అన్నం తినక నాలుగు రోజులైంది. అడవిలో దారి తప్పి ఇట్లా వచ్చినాను. నిద్ర లేదు. ఒక్కరోజు ఆశ్రయం ఇవ్వగలవా" అని అడిగినాడు. ముసలాయన వాన్ని ఎగాదిగా కిందికీ మీదికీ చూసినాడు. మెడలోని దండలు, వేసుకున్న బట్టలు చూడగానే బాగా ధనవంతుడని అర్థమైంది. దాంతో "ఎంతమాట నాయనా... ఆకలితో అన్నం పెట్టమని ఇంటి ముందుకు వచ్చినవారిని ఉత్త చేతులతో పంపిస్తే చచ్చిన తర్వాత నరకంలో వేడి వేడి నూనెలో వేయిస్తారంట" అంటూ లోపలికి పిలిచి తాగడానికి నీళ్లు ఇచ్చి స్నానం చేసి రమ్మన్నాడు. అతని మాటలు తియ్యగా, ఆప్యాయంగా సొంత మనిషి కదా మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. ఆ ముసలాయన రంగరాజును మాటల్లో పెట్టి "నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ అమ్మానాన్న ఎవరు, ఏం చేస్తారు" అంటూ అన్ని వివరాలు ఒక్కటి కూడా విడవకుండా కనుక్కున్నాడు.
రంగరాజు భోంచేశాక ఊరు చూద్దామని బయలుదేరినాడు. అతడు అట్లా కొంత దూరం పోయినాడో లేదో ఒక ఒంటి చేతి మనిషి ఎదురొచ్చినాడు. ఆయనకు కుడి చెయ్యి లేదు. అతను రంగరాజుతో "నువ్వు కందనవోలు దేవరాజు కొడుకువే కదా... అచ్చం మీ నాయన లెక్కనే వున్నావు" అని పలకరించినాడు. రంగరాజు అవునంటూ తలూపినాడు. వెంటనే అతను "మీ నాయన ఈ ఊరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చేటోడు. ఒకసారి నాకు ఐదు వందలు అవసరమైతే నా కుడిచేయి కుదవబెట్టుకొని డబ్బులు ఇచ్చినాడు. ఇదిగో ఈ ఐదు వందలు తీసుకొని వెంటనే నా చేతిని నాకివ్వు. లేదంటే నష్టపరిహారం కింద పదివేల బంగారు వరహాలు అనా ఇవ్వు" అని గట్టిగా పట్టుకున్నాడు. రంగరాజుకు అతనికి ఏం చెప్పాలో తోచలేదు. "ఇప్పటికిప్పుడు తిరిగి ఇమ్మంటే ఎలా... రేపటి వరకు నాకు సమయం ఇవ్వు" అన్నాడు.
అతను "సరే రేపు వస్తా" అంటూ వదిలేసినాడు.
రంగరాజు ఇంకొంచెం దూరం పోయినాడో లేదో ఒకామె ఏడుస్తా పరిగెత్తుకొని వచ్చి రంగరాజును గట్టిగా పట్టుకుంది. "మీ నాయన రెండు సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఇంటి ఖర్చులకోసం నెల నెలా క్రమం తప్పకుండా వేయి వరహాలు పంపిస్తా ఉన్నాడు. కానీ మీ నాయన సచ్చిపోయినప్పటి నుండి ఆరు నెలలుగా ఒక్క పైసా కూడా నాకు అందలేదు. అందరి వద్ద అప్పులు చేసి బ్రతుకుతా ఉన్నాను. మీ నాయనకు ఆస్తికైనా అప్పుకైనా నీవే కదా వారసునివి. వెంటనే నా అప్పులన్నీ తీర్చి నెలనెలా నాకు వేయి వరహాలు పంపు" అనింది. ఆ మాటలు వినేసరికి రంగరాజు నోట మాట రాలేదు. ఏం చేయాలో అర్థం కాక "నీవు మా నాన్న పెళ్ళానివి అనే విషయం ఇప్పుడే కదా నాకు తెలిసింది. రేపటి వరకు సమయం ఇవ్వు. ఏం చేయాలో ఆలోచిస్తాను" అన్నాడు. ఆమె సేఅ అనింది.
రంగరాజు అలా పోతావుంటే ఒకతను ఎదురుపడి "ఏం రంగరాజు మీ నాన్న వచ్చినప్పుడల్లా నాతో చదరంగం ఆడేటోడు. నువ్వు కూడా ఆడతావా. నువ్వు ఓడిపోతే నేను కోరింది ఇవ్వాలి. నేను ఓడిపోతే నువ్వు కోరింది ఇస్తా. ఏం పందానికి వస్తావా" అన్నాడు. రంగరాజుకు కూడా చదరంగం అంటే చచ్చేంత ఇష్టం. దాంతో సై అంటే సై అంటూ పందానికి దిగినాడు. ఇద్దరూ చానాసేపు పందెం కోళ్లలెక్క పోటీపడి ఆడినారు కానీ చివరికి రంగరాజు ఓడిపోయినాడు. దాంతో "చెప్పు... నీకు ఏం కావాలి" అన్నాడు. దానికి అతను "నువ్వు మా ఇంటి వెనుకున్న బాయిలో నీళ్లన్నీ తాగాలి లేదా నీ దగ్గర ఉన్న మొత్తం బంగారం అన్నా ఇవ్వాలి. ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం" అన్నాడు. రంగరాజుకు ఏం చెప్పాలో అర్థం కాక "రేపటి వరకు సమయం ఇవ్వు" అన్నాడు
రంగరాజు ఆలోచించుకుంటా తాను ఉండే ఇంటికి తిరిగి వచ్చినాడు. కడుపునిండా అన్నం తిని "చెప్పు తాతా... ఎవరు నువ్వు. ౠణం ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. రెండు రోజులు ఆశ్రయమిచ్చినావు అన్నం పెట్టినావు. నీకెంత ఇవ్వాలి" అన్నాడు. దానికాయన ఆయన " దబ్బులదేముందిలే నాయనా... నేను నిన్ను సంతోషపెట్టినట్లే నువ్వు కూడా నన్ను సంతోష పెట్టు చాలు" అన్నాడు. దానికి రంగరాజు సరేనని చిరునవ్వు నవ్వి మొత్తం తిన్న దానికి, ఉన్నదానికి మూడు వరహాలు అయితే అంతకు రెట్టింపు ఆరు వరహాలు అతని చేతిలో పెట్టినాడు. కానీ అతను ఏమాత్రం సంతోషపడలేదు. ఎంత డబ్బు ఇవ్వచూపినా అతను ఇవి నాకేం సంతోషాన్ని కలగజేయడం లేదు అంటున్నాడు. రంగరాజుకి ఏం చేయాలో తోచక "సరే నాకు ఒక్క రోజు సమయం ఇవ్వండి. మిమ్మల్ని సంతోష పరుస్తాను" అన్నాడు.
 
తర్వాత రోజు నలుగురు పొద్దున్నే వచ్చి రంగరాజును పట్టుకున్నారు. కానీ రంగరాజుకు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఇంకోరోజు గడువు కోరినాడు. దాంతో ఆ నలుగురు కలిసి ఆ గ్రామ పెద్ద దగ్గరికి న్యాయం కోసం పోయినారు. గ్రామ పెద్ద రంగరాజును పిలిపించినాడు. రంగరాజు ఆలోచనలో పడినాడు. "ఈ ఊర్లో అందరూ కాలికేస్తే వేలుకి వేలికేస్తే కాలికి వేసేటట్లు ఉన్నారు. తనకు సాయం చేసేవారు గానీ న్యాయం చెప్పేవారు గానీ ఎవరూ లేరు. తన ఆపదల్లోంచి తానే సొంతంగా బయటపడాలి. వీళ్లకు మంచిగా మర్యాదగా సమాధానం చెబితే సరిపోదు. దెబ్బ కొడితే మళ్ళా లేయకూడదు" అనుకుంటా అట్లాంటి సమాధానాల కోసం ఆలోచించకుంటా గ్రామపెద్ద ఇంటికి పోయినాడు.
గ్రామాధికారి రంగరాజును కోపంగా చూస్తా "ఏమయ్యా చూడడానికి బాగా చదువుకున్నోని మాదిరి కనపడుతున్నావు. ఇదేనా పద్ధతి. ఆ ఒంటిచేతి మనిషి డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తానంటూ ఉన్నాడు కదా... వెంటనే మీ నాయన కుదవ పెట్టుకున్న కుడిచేయిని తెచ్చి ఆయనకు ఇవ్వు. లేదా నష్టపరిహారం అనా చెల్లించు" అన్నాడు. దానికి రంగరాజు ఒక నిమిషం ఆగి "అయ్యా... మా నాన్న దగ్గర ఈయన ఒక్కడే కాదు చానామంది వాళ్ళ చేతుల్య్, కాళ్ళు కుదువ బెట్టినారు. కాబట్టి ఎవరిది ఏ చేయో ఎవరిది ఏకాలో కనుక్కోవడం కష్టం. ఇతను ఎడమ చేయి గనుక ఇస్తే అచ్చం దానికి సరిపోయే కుడిచేతిని వెతికి పట్టుకొని వస్తా" అన్నాడు. ఆ మాట వింటూనే ఒంటిచేతి మనిషి అదిరిపడినాడు. "ఓరి దేవుడోయ్... ఏదో పది రూపాయలు వస్తాయి కదా అని ఆశపడితే మిగిలిన ఈ ఒక్క చేయి కూడా పోయేటట్లుందే" అనుకుంటా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాడు. గ్రామపెద్ద చేసేదేం లేక "సరే... వాని సంగతి వదిలేయ్. నెల నెలా మీ నాయన పంపే డబ్బులతో గౌరవంగా బతుకుతున్న ఈమె మీ నాయన చచ్చిపోయినాక తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడతా ఉంది. ఈమెను చూసుకోవాల్సిన బాధ్యత వారసునివైన నీపైనే ఉంది కదా" అన్నాడు. దానికి రంగరాజు "అయ్యా... మీరు చెప్పింది నిజమే. నేనుండేదేనా కందనవోలు. ఈమె ఉండేది ఈ ఊరు. అక్కడికి ఇక్కడికి చానా దూరం. మా అమ్మ ఒక్కతే ఇంటి దగ్గర ఇంటి పనులన్నీ చేసుకుంటా కష్టపడతా ఉంది. కాబట్టి ఈమె కూడా తట్ట బుట్ట సర్దుకొని నా వెంబడి వచ్చేస్తే అక్కడ ఇద్దరమ్మలు కలసి హాయిగా పని చేసుకుంటా ఒకరికొకరు తోడుగా ఉంటారు. చచ్చేంత వరకు నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. తల్లి ఉండాల్సింది కొడుకు దగ్గరే కదా" అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె అదిరిపడి "నీవు నెలనెలా పంపే నీ డబ్బూ వద్దు. ఈ ఊరూ వద్దు. సచ్చినా ఇక్కడి నుండి ఒక్క ఇంచు కూడా కదలను" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఇద్దరూ అట్లా వెళ్ళిపోగానే గ్రామ పెద్ద తల గీరుకుంటా "మరి వీనితో కాసిన పందెం సంగతేమి. భావినీళ్లు మొత్తం తాగేస్తావా లేక నీ దగ్గర ఉన్న సొమ్మంతా అనాపైసల్తో సహా అప్పజెప్తావా" అన్నాడు. దానికి రంగరాజు "అయ్యా పందెం ప్రకారం బావిలో నీళ్లు మొత్తం తాగుతా. వెంటనే పోయి ఆ బావిలోని నీళ్లు ఒక్కచుక్క కూడా మిగలకుండా తోడుకొ రండి. ఆ తరువాత మాట పడకూడదు" అన్నాడు. ఆ మాటలు వినగానే పందెం కాసిన మనిషి అదిరిపడినాడు. అది అట్లాంటి ఇట్లాంటి అల్లాటప్ప బావి కాదు. ఏడు బొంగుల లోతుంటాది. ఎన్ని నీళ్లతోడినా ఎండాకాలం కూడా ఒక్క ఇంచు తగ్గవు. అట్లాంటిది ఆ బావి నీళ్ళన్నీ తోడేదెప్పుడు? వీడు తాగేది ఎప్పుడు? దాంతో అది తన చేతకాదు అంటూ మట్టసంగా అక్కడినుంచి వెళ్లిపోయినాడు.
ఇక చివరగా మిగిలింది అన్నం పెట్టిన తాత. అతన్ని సంతోష పరచాలి. ఎట్లాగబ్బా అని ఆలోచించి తాతతో "మీ గ్రామపెద్ద చానా మంచి మనిషి. ఈ చుట్టుపక్కల అరవయ్యారు ఊర్లలో ఇంత పద్ధతిగా తీర్పులు చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే వారికి గౌరవంగా ఒక పట్టు తివాచి బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను. నీకు సంతోషమేనా" అన్నాడు. ఆ మాట వినగానే తాత గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. నాకు ఇది సంతోషంగా లేదు అంటే గ్రామపెద్దకు కోపం వస్తుంది. కొరడాలతో కొట్టిచ్చి ఊరులోంచి వెలి వేయిస్తాడు. దాంతో ఏమీ చేయలేక "మా గ్రామపెద్దలని సన్మానిస్తే సంతోషం తప్ప బాధ ఎందుకు ఉంటాది" అన్నాడు. దాంతో రంగరాజు చిరునవ్వు నవ్వి "నిన్ను సంతోషపరిచాను కాబట్టి ఇక నీకు డబ్బు ఒక్క పైసా కూడా వెయనక్కర్లేదు" అంటూ పట్టు శాలువా తెప్పించి గ్రామ పెద్దను ఘనంగా సత్కరించినాడు. అట్లా తన తెలివితేటలతో ఆపదలన్నింటినుంచి బయటపదదమే గాక మరొక ఆపద వచ్చి మీద పడకముంద్ర ఒక్క క్షణం కూడా ఆ ఊరిలో ఉండకుండా అక్కడి నుంచి బయటపడినాడు.
**************************
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Superb!!! Thanks for sharing!!!
[+] 1 user Likes readersp's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)