Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
#1
ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష 
బ్యాంకుల ఇష్టం చెల్లదిక.. 
మార్కెట్‌ను బట్టి రుణాలపై వడ్డీరేట్లు 
ఆర్‌బీఐ సరికొత్త నిర్ణయం
అనుకున్నదే జరిగింది. అంచనాలకు తగ్గట్లే ఆర్‌బీఐ  కీలక రేట్లను మార్పు చేయలేదు. అయితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు లేనట్లు ధీమా కలిగితే మాత్రం రేట్ల కోత ఉంటుందని హామీ ఇచ్చింది.
ఆర్‌బీఐ రెపో రేటు పెంచబోతోంది అని వార్తలు రావడం ఆలస్యం... బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లుగా సమాచారం ఇచ్చేస్తుంటాయి.. తగ్గినప్పుడు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుంటాయి. వడ్డీ రేట్లను ఎలా నిర్ణయిస్తున్నారనే విషయంలో ఓ పారదర్శకత ఉండేది కాదు. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ఇది మారనుంది. బ్యాంకుల అంతర్గత ప్రామాణిక సూచీ ఆధారంగా కాకుండా.. మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా రుణాల వడ్డీ నిర్ణయం కానుంది. గృహ, వాహన రుణాలు కానీయండి.. చిన్న పరిశ్రమల కోసం తీసుకున్న అప్పు కానీయండి.. చలన వడ్డీ విధానాన్ని ఎంచుకుంటే.. మనం తీసుకున్నప్పుడు ఉన్న వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రైమ్‌ లెండింగ్‌ రేటు, బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు, బేస్‌ రేటు, మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)లాంటి అంతర్గత ప్రామాణిక సూచీలను ఆధారంగా చేసుకొని బ్యాంకులు ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంటాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంచినప్పుడు నిధుల సమీకరణ భారం పెరిగిందని వడ్డీ పెంచుతాయి. తగ్గిస్తే మాత్రం తమ ప్రామాణిక సూచీల రేటు తగ్గలేదు కాబట్టి, ఆ ప్రయోజనాన్ని మీకు బదిలీ చేయడం కుదరదు అన్నట్లు చెబుతుంటాయి. వడ్డీ రేట్ల నిర్ణయంలో పారదర్శకత లోపించిందనే ఆరోపణ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎంసీఎల్‌ఆర్‌ విషయాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించిన ఆర్‌బీఐ దీనిపై అధ్యయానికి ఒక అంతర్గత కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక నుంచి బ్యాంకులు అంతర్గత ప్రామాణిక సూచీలకు బదులుగా.. పారదర్శకంగా ఉండే సూచీలను (ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌) రేట్లను ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొంది. ఏప్రిల్‌ 1, 2019 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానానికి సంబంధించి, ఈ నెలాఖరుకు పూర్తి వివరాలను తెలియజేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.
కొత్త సూచీలు ఏమిటి? 


చలన వడ్డీ విధానంలో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ఎంఎస్‌ఈలు అప్పు తీసుకున్నప్పుడు, మార్కెట్‌లో ఉండే ప్రధాన సూచీలను బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. దీనికోసం నాలుగు సూచీలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. 


1. ఆర్‌బీఐ రెపో రేటు 


2. భారత ప్రభుత్వం జారీ చేసే 91 రోజుల ట్రెజరీ బిల్లుకు ఫైనాన్షియల్‌ బెంచ్‌మార్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌బీఐఎల్‌) నిర్ణయించిన రాబడి 


3. భారత ప్రభుత్వం జారీ చేసే 182 రోజుల ట్రెజరీ బిల్లుకు ఎఫ్‌బీఐఎల్‌ అందించిన రాబడి 


4. ఇవి కాకుండా.. ఎఫ్‌బీఐఎల్‌ రూపొందించిన ఇతర ప్రామాణిక సూచీలు. 


ఈ నాలుగింటి ఆధారంగానే బ్యాంకులు చలన వడ్డీ రేటును నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ ప్రామాణిక సూచీల వడ్డీ రేట్లపై ఎంత శాతం అధికంగా నిర్ణయించాలన్నది బ్యాంకుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. రుణం తీసుకునేప్పుడు రుణగ్రహీత వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఒకసారి ఈ విధానాన్ని ఎంచుకుంటే.. రుణ వ్యవధి ముగిసేదాకా వీటిపై ఆధారపడే వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.


పారదర్శకత పెరుగుతుంది 


ప్రస్తుతం ఒక రుణ విభాగంలో రకరకాల ప్రామాణిక సూచీలతో అప్పులు ఇస్తున్నాయి బ్యాంకులు. దీనివల్ల రుణగ్రహీతలకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటున్నాయి. బేస్‌ రేటు విధానంలో తీసుకున్న వారు ఇప్పటికీ అధిక వడ్డీ భారం మోస్తున్నారు. ఏప్రిల్‌ 1, 2016 నుంచి ఎంసీఎల్‌ఆర్‌ అమల్లోకి వచ్చినా.. కొత్త విధానంలోకి మారాలంటే రుసుము భరించాలి. బ్యాంకులకు నగదు లభ్యత తగ్గినప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లను పెంచుతుంటాయి. దీన్ని కారణంగా చూపించి, నిధుల సమీకరణ భారం పెరిగిందని ఎంసీఎల్‌ఆర్‌ను సవరిస్తూ, వడ్డీ భారాన్ని మోపుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే మార్కెట్‌ రేటును బట్టి వడ్డీ నిర్ణయం అవుతుంది. పైగా ఒక రుణ విభాగానికి ఏదో ఒక సూచీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. దీనివల్ల రుణగ్రహీతలకు కూడా స్పష్టత వస్తుంది.


రుణగ్రహీతలకు లాభమేనా? 


బ్యాంకులు నిధుల సమీకరణ భారాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేయడం ప్రస్తుతం నడుస్తున్న విధానం. బ్యాంకుల అసమర్థత వల్ల కొన్నిసార్లు నిధుల సమీకరణ భారం కావచ్చు. లేదా రుణాల వసూలు సరిగా జరగక నిరర్థక ఆస్తులు పేరుకుపోవచ్చు. ఇవన్నీ చిన్న రుణగ్రహీతలపై ప్రభావం చూపించేవి. అంతర్గత సూచీలకు బదులు.. ఈ కొత్త సూచీలతో వడ్డీ రేట్లను నిర్ణయించడం ప్రారంభం అయితే.. బ్యాంకులు తమ ఇష్టానుసారం వడ్డీ రేట్లను పెంచే పరిస్థితి తలెత్తదు. ఏ సూచీకి ఎంత శాతం అధకంగా వసూలు చేయాలన్నది బ్యాంకులు ముందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇది రుణ వ్యవధిలో మారదు. కాబట్టి, గృహరుణంలాంటి దీర్ఘకాలిక రుణం తీసుకున్న వారికి ఇది కలిసొచ్చే అంశమే. వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకుల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉంది. అయితే, ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు నిర్ణయిస్తుంది తెలిస్తే తప్ప రుణ గ్రహీతలకు నికరంగా ఎంత లాభం అనే విషయంలో స్పష్టత రాదు.


ముఖ్యాంశాలు 


కీలక రుణ రేటు(రెపో) 6.5 శాతం వద్దే. 


రివర్స్‌ రెపో రేటు 6.25%; బ్యాంక్‌ రేటు 6.75%,  నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)ని 4 శాతం వద్ద కొనసాగింపు. 


అక్టోబరు-మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనా 2.7-3.2 శాతం. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.4 శాతం వద్దే కొనసాగింపు. 


2019-20 ఏప్రిల్‌-సెప్టెంబరు వృద్ధి 7.5% నమోదు కావొచ్చని అంచనా కట్టింది. అయితే ఇంకా తగ్గడానికి అవకాశాలను కొట్టిపారేయలేదు. 


దేశీయ స్థూల ఆర్థిక మూలాలను బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని ఆర్‌బీఐ భావిస్తోంది. 


తక్కువ రబీ సాగు వ్యవసాయంపై, గ్రామీణ గిరాకీపై ప్రభావం చూపవచ్చు. 


ముడి చమురు ధరలు తగ్గుతుండడం వృద్ధికి ఊతమిచ్చే అంశం. 


ఆర్థిక మార్కెట్ల ఊగిసలాట, అంతర్జాతీయ గిరాకీ మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు కలిసి ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. 


తదుపరి సమావేశం ఫిబ్రవరి 5-7


వడ్డీరేట్లు తగ్గొచ్చు


ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు రేట్లు పెంచిన కేంద్ర బ్యాంకు తన ‘సమయానుకూల కఠిన’ వైఖరిని మాత్రం కొనసాగించింది. ద్రవ్యోల్బణ అంచనాలు దిగువకు సవరించినప్పటికీ.. ముడి చమురు ధరలు, పలు ఇతర అనిశ్చితులు ఇంకా ద్రవ్యోల్బణం చుట్టూ మబ్బులా ఉన్నాయ’ని పరపతి విధాన సమీక్ష సందర్భంగా ప్రకటించింది. 

ద్రవ్యోల్బణం పెరగకపోతే మాత్రం భవిష్యత్‌లో రేట్ల కోతకు అవకాశం ఉందంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఊరట కలిగించే వ్యాఖ్యలు చేయడం విశేషం. పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ)లోని ఆరుగురు సభ్యులూ కీలక రేట్లను యథాతథంగా ఉంచడానికే మొగ్గుచూపారు. దీంతో రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగుతోంది. జూన్‌లో ఒక సారి 6.25 శాతానికి; ఆగస్టులో 6.5 శాతానికి రెపో రేటును ఆర్‌బీఐ సవరించిన విషయం తెలిసిందే. అక్టోబరు నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, తాజా నిర్ణయం ఏకగ్రీవం అయినప్పటికీ.. ఎమ్‌పీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఒకరు మాత్రం(రవీంద్ర ఢోలాకియా) విధాన ధోరణిని తటస్థానికి మార్చాలంటూ ఓటు వేశారు. 

[Image: 5business1b.jpg]

భవిష్యత్‌ గణాంకాలను బట్టి రేట్ల కోతలు ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన సమయంలో వృద్ధి బలంగా ఉండే అవకాశాలున్నందున ఎమ్‌పీసీ తన ‘సమయానుకూల కఠిన ధోరణి’ని కొనసాగిస్తోంది. తద్వారా భవిష్యత్‌ విధాన చర్యలకు కొంత సమయాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. అపుడు ద్రవ్యోల్బణ సంకేతాలు కూడా అందుతాయి. ఒక వేళ ద్రవ్యోల్బణం పెరిగేందుకు సహకరించే అనిశ్చిత పరిస్థితులు కనిపించకపోతే ఎమ్‌పీసీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. 

- ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ 

[Image: 5business1c.jpg]

గణాంకాల్లో అనిశ్చితి కారణంగా నిర్ణయం తీసుకోవడం సంక్లిష్టంగా మారింది. ప్రస్తుత గణాంకాలు దిగువ స్థాయిల్లోనే ఉన్నప్పటికీ.. ఇంకా మధ్య కాల లక్ష్యం కంటే ఎమ్‌పీసీ అంచనాలు ఎక్కువ స్థాయిల్లోనే ఉన్నాయి. అందు వల్ల కొంత వేచిచూడాల్సిన అవసరం ఉంది. అపుడు అవసరమైతే విధాన చర్యలు ఉంటాయి. గత రెండు నెలలుగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లకు ద్రవ్యలభ్యతను అందించడానికి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్దతును కొనసాగించాల్సిన అవసరం ఆర్‌బీఐకి లేదు. అయితే అన్ని వ్యవస్థలూ విఫలమైనపుడు చేయూత ఇవ్వడానికి ఆర్‌బీఐ సిద్ధంగా ఉంటుంది. మా అంచనా ప్రకారం.. ప్రస్తుతానికి అయితే ఆ అవసరం లేదు. (నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)లో మార్పు లేకపోవడంపై మాట్లాడుతూ) ఎమ్‌పీసీ పరిధిలోకి సీఆర్‌ఆర్‌ రాదు. అదీ కాక ప్రత్యామ్నాయాలు ఉండడం వల్ల సీఆర్‌ఆర్‌ కోత ఇపుడు అవసరం లేదు అని భావిస్తున్నాం. 

- ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య

నగదు బదిలీ కాలేదా..! లోక్‌పాల్‌కు వెళ్లొచ్చు


పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆన్‌లైన్‌, డిజిటల్‌ సేవల వినియోగం వేగంగా పెరిగింది. అయితే, చిక్కల్లా డిజిటల్‌ విధానంలో నగదు బదిలీ చేసినప్పుడు..అది చేరాల్సిన వారికి చేరకపోతే ఎవరిని సంప్రదించాలి?బ్యాంకు బాధ్యత ఎంత? ఈ సందేహాలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది. డిజటల్‌ లావాదేవీల కోసం ప్రత్యేకంగా లోక్‌పాల్‌ను (అంబుడ్స్‌మన్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, మొబైల్‌ వాలెట్లు, యూపీఐ వంటి ద్వారా డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో.. సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీలకు ప్రత్యేకంగా లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు 2017-18 వార్షిక నివేదికలో ఆర్‌బీఐ వెల్లడించింది. బుధవారం నాటి సమీక్షా సమావేశంలో దీనిపై స్పష్టతనిచ్చింది. ‘నగదు వినియోగం తగ్గించేందుకు ఆర్‌బీఐ అన్ని చర్యలూ తీసుకుంటోంది. డిజిటల్‌ లావాదేవీలపై వినియోగదారులకు విశ్వాసం పెరిగితేనే ఇది మరింత విస్తృతం అవుతుందని భావిస్తున్నాం. దీనికోసం ఒక శక్తిమంతమైన, ప్రత్యేక సమస్యా పరిష్కార వేదిక ఉండాల్సిన అవసరం ఉంది’అని పేర్కొంది. ఇందులో భాగంగానే.. వినియోగదారులకు ఎలాంటి ఖర్చూ, వాయిదాలు లేకుండా న్యాయం అందించేందుకు ఈ డిజిటల్‌ అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. పూర్తి వివరాలను  జనవరి చివరి నాటికి ప్రకటిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

మోసపోతే మన బాధ్యత లేదు 


మొబైల్‌ వాలెట్ల వినియోగదారులకు రక్షణ




ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వాడకం పెరగడంతో వీటికి సంబంధించిన సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇలా మోసపోయినప్పుడు ఖాతాదారుడి బాధ్యత కొంత పరిమితంగా ఉంటుంది. కార్డు పోయిందని గుర్తించిన వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేసిన క్షణం తర్వాత జరిగిన ఏ లావాదేవీకీ ఖాతాదారుడికి సంబంధం ఉండదు. మరి మొబైల్‌ వాలెట్ల సంగతేమిటి? వీటిలో ముందే డబ్బు నింపి ఉంటుంది.. వీటిని ఎవరైనా మోసపూరితంగా వినియోగిస్తే రక్షణ ఏమిటి? ఆర్‌బీఐ ఇక నుంచి వీటికీ బ్యాంకింగ్‌ లావాదేవీలకు వర్తించే నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. మొబైల్‌ వాలెట్ల వినియోగదారులకు ఇది పెద్ద ఊరట.

సాధారణ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఖాతాదారుడి ప్రమేయం లేకుండా.. ఏదైనా లావాదేవీ జరిగిందనుకోండి.. దానికి సంబంధించిన సమాచారం వచ్చిన వెంటనే లేదా మూడు రోజుల్లోపు బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలి. అలాంటప్పుడు బ్యాంకు, కార్డు సంస్థ సేవాలోపం లేదా ఎక్కడైనా సాంకేతిక మోసం వల్ల అది జరిగి ఉంటే.. ఖాతాదారుడికి సహజంగానే ఏ బాధ్యతా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఖాతాదారుడి నిర్లక్ష్యంవల్ల లేదా అతని సమాచారాన్ని మోసగాళ్లు తస్కరించి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఇలాంటప్పుడు ఆ ఖాతాదారుడే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. కానీ.. అటు బ్యాంకు.. ఇటు ఖాతాదారుడి ప్రమేయం లేకుండా ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగిందనుకోండి.. ఈ సమాచారాన్ని నాలుగు నుంచి ఏడు రోజుల్లోగా బ్యాంకు దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఖాతాదారుడి బాధ్యత జరిగిన లావాదేవీని బట్టి.. రూ.5వేల నుంచి రూ.25వేల మధ్య మాత్రమే ఉంటుంది. ఒకవేళ 7 రోజుల తర్వాత బ్యాంకుకు సమాచారం ఇస్తే.. బ్యాంకు నిబంధనల మేరకు ఖాతాదారుడి బాధ్యత ఉంటుంది. ఖాతాదారుడు నష్టపోయిన మొత్తాన్ని బ్యాంకు నిబంధనల మేరకు 10 పనిదినాల్లోపు ఖాతాదారుడు ఖాతాలోకి జమ చేయాలి. ఖాతాదారుడికి బాధ్యత ఎంత మేరకు ఉంటుంది అనే విషయాన్ని 90 రోజుల్లోగా తేల్చేయాలి. జరిగిన ప్రతిలావాదేవీకి సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారుడి మొబైల్‌ నెంబరు, ఈమెయిల్‌కు పంపించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది. 

వాలెట్లలో ఏదైనా అనధీకృత లావాదేవీ జరిగితే దాని పూర్తి బాధ్యత మొబైల్‌ వాలెట్‌ వినియోగదారుడిదే అన్నట్లు ఉంది. ఇక నుంచి వీటికీ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులకు ఉన్న నిబంధనలు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ఈ నెలాఖరుకు రానున్నాయి.

బ్యాంకులకు మరిన్ని నిధులు  

[Image: 5business1d.jpg]


బ్యాంకుల వద్ద నిధుల లభ్యత పెరగడం కోసం ఆర్‌బీఐ కొన్ని చర్యలు తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కచ్చితంగా ఉంచాల్సిన నిధుల పరిమాణాన్ని తగ్గించింది. 2019 క్యాలెండర్‌ సంవత్సరంలో తొలి త్రైమాసికం నుంచి చట్టబద్ధ ద్రవ్యలభ్యత నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌)ని 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ వస్తుంది. ఎస్‌ఎల్‌ఆర్‌ 18 శాతానికి చేరేంత వరకు ప్రతీ త్రైమాసికం ఆ మేర కోత ఉంటుంది. చట్టబద్ధ ద్రవ్యలభ్యత నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌) ప్రస్తుతం 19.5 శాతం వద్ద ఉంది. ఈ నిష్పత్తిని తగ్గించడం వల్ల బ్యాంకులు మరిన్ని రుణాలు ఇవ్వడానికి వీలు చిక్కుతుంది.


ఈ ఏడాది 7.4% వృద్ధి  

[Image: 5business1e.jpg]


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని.. తన అంచనాలను ఆర్‌బీఐ కొనసాగించింది. మరో వైపు వచ్చే ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. పెట్టుబడుల కార్యకలాపాలు జోరందుకుంటాయన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. మధ్య కాలానికి వృద్ధికి ఊతమిచ్చేలా పెట్టుబడుల కార్యకలాపాల్లో వేగం కనిపిస్తోందని.. స్థూల ఆర్థిక మూలాలను బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా ఆర్‌బీఐ పిలుపునిచ్చింది.


ద్రవ్యోల్బణ అంచనాలు దిగువకు  

[Image: 5business1f.jpg]


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం 2.7-3.2 శాతానికి పరిమితం అవుతుందని ఆర్‌బీఐ అంచనా కట్టింది. సాధారణ వర్షపాతాలకు తోడు.. ఆహార వస్తువుల ధరలు మోస్తరుగా తగ్గడం వల్ల అంచనాలను తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి భత్యం(హెచ్‌ఆర్‌ఏ) ప్రభావాన్ని సర్దుబాటు చేసిన తర్వాతే ఈ అంచనాలకు వచ్చినట్లు తెలిపింది.




 

స్థిరాస్తి రంగానికి మంచిదే


[Image: 5business1g.jpg]

అభివృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాల విషయంలో ప్రభుత్వ అంచనాలతో ఎమ్‌పీసీ అంచనాలు సరిపోలాయి. ఎస్‌ఎల్‌ఆర్‌ తగ్గింపు వల్ల ప్రభుత్వ బాండ్లపై కొంత ప్రభావం పడొచ్చు. అయితే ముడి చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాక వల్ల మెరుగైన ఫలాలే అందవచ్చు. 

- ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి , సుభాశ్‌ చంద్ర గార్గ్‌


[Image: 5business1h.jpg]

మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే రేట్ల నిర్ణయం వెలువడినప్పటికీ.. భవిష్యత్‌ అంచనాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించడం కలిసివచ్చే అంశం.

- ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్


[Image: 5business1i.jpg]ఈ నిర్ణయం వల్ల స్థిరాస్తి పరిశ్రమకు ఊరట కలుగుతుంది. ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచుతుందేమోనన్న ఆందోళనలున్న నేపథ్యంలో తాజా పరిణామం ఆహ్వానించదగ్గదే. 

- నైట్‌ ప్రాంక్‌ సీఎండీ శిశిర్‌ బైజల్‌ 


ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు రుణాలు అందాల్సిన అత్యవసరం ఉంది. జీడీపీ వృద్ధి రేటు ఇప్పటికే మందగమనం పాలవుతున్న సంకేతాలు చూపిస్తోంది. ముడి చమురు ధరలు తగ్గుతున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 

ఫిక్కీ ప్రెసిడెంట్‌ రాశేశ్‌ షా


రేట్లను యథాతథంగా కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం మా అంచనాలకు అనుగుణంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనిపించకపోతే కోత వేస్తామన్న హామీ లభించింది.


         - అసోచామ్

సోర్స్:http://www.eenadu.net/business/business-news.aspx?item=business-news&no=1
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Thanks for the information, samanya manavuniki arthamu kaavali ante konchemu kastamuga.
Like Reply
#3
Thanks for the information bro

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#4
ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ 


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఉర్జిత్‌ నిన్న ప్రకటించారు. దీంతో తాత్కాలిక గవర్నర్‌గా, ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లలో సీనియర్‌ అయిన విశ్వనాథ్‌ను నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శక్తికాంతదాస్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు.

ఐఏఎస్‌ అధికారి అయిన శక్తికాంత దాస్ గతంలో రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది పదవీ విరమణ పొందిన అనంతరం 15వ ఆర్థిక కమిషన్‌ను సభ్యులుగా నియమితులయ్యారు.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply




Users browsing this thread: 1 Guest(s)