Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#13
అశ్వత్థామ పరాభవము:

పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇంకా శిబిరములలో అందరు పడుకొని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడిచేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమునకు అంతటికీ కలిగిన ఆపద, దుర్యోధనునికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమయిన బాధ, ఆవేశము కలిగాయి. కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు.

ఉపపాండవులు అంటే పాండవులయిన ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపదియందు జన్మించిన కుమారులు. వారు అయిదుగురు. ఆ అయిదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలిసిపోయి బాగా నిద్దర్లో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్న ఉపపాండవుల కుత్తుకలు కోసేసి అయిదుగురిని చంపేశాడు. అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ’నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు ఉపపాండవులకు వంశము లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలోమరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ అయిదుగురిని చంపేశాను’ అని చెప్పాడు.

తెల్లవారింది. మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతలివైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చెయ్యగలిగిన వాడెవడో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒకమాట అన్నాడు – ’నేలమీదపడి పొర్లిగుండెలు బాదుకొని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపదీ! ఏ నీచుడు నీ కడుపున పుట్టిన అయిదుగురి పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదములముందు ఉంచుతాను. నీకుడికాలితోనో, ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీపగ తీర్చుకో’ అన్నాడు.

పిమ్మట అర్జునుడు కృష్ణభగవానుని సారధిగా పెట్టుకొని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది, తనను చంపేస్తాడన్న భయంతో పరుగెడుతున్నాడు. ఇలా పరుగెడుతుంటే పోతనగారు ఒక అందమయిన ఉపమానం వేశారు.
'తన కుమార్తె వెంటపడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్నట్టి పరమశివుని చేతినుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరుగెడుతున్నాడు' అన్నారు. ఎందుకు అంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు. ద్రోణసుతుడు. పరుగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇక పరుగెత్తలేకపోయాడు. వెనకనుంచి అర్జునుని రథం వచ్చేస్తోంది. కృష్ణుడు సారధ్యం చేస్తున్నాడు. 'ఈ రథమే, ఈ సారధ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే, పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమును మట్టుపెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు' అని ఉపసంహారము తెలియని బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా ఫరవాలేదు – తానుమాత్రం బ్రతికి ఉంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునకు ఉండకూడని బుద్ధి. అది పొగలు గ్రక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వస్తోంది.

అర్జునుడు వెనక్కితిరిగి కృష్ణుడివంక చూశాడు. 'మహానుభావా, ఎవరు సారధ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమయిన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడయినవాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటిని సాధించగలిగాను. లోకములన్నిటిని నిండిపోయి సంక్షుభితం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది' అని అడిగాడు.

అలా అడిగితే అప్పుడు కృష్ణభగవానుడు చెప్పాడు – ’ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇపుడు ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి. విడిచిపెట్టు’ అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణభగవానుడు ఉన్న రథమునకు ప్రదక్షిణం చేసివచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. ఇపుడు రెండు బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురువచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకొని దేవతలు, ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడ ఉత్కంఠను పొందాయి. అందరు హడలిపోతున్నారు. లోకములనన్నిటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణపరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కాని ఆయన అన్నాడు – ’ధూర్తుడయిన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారము తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసెయ్యి’ అన్నాడు. రెండు బ్రహ్మాస్త్రములను అర్జునుడు ఉపసంహారం చేసేశాడు.

ఉపసంహారం చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి వానిని ఒక పశువును కట్టినట్లు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథంమీద పెట్టాడు. పెట్టి విపరీతమయిన వేగంతో యుద్ధభూమి లోనికి వచ్చి రథమును అక్కడ నిలబెట్టాడు. అర్జునునికి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్లు నిలబడి వున్నాడు. అశ్వత్థామ వణికిపోతున్నాడు. కృష్ణుడు అన్నాడు ’అర్జునా, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు ఈ అశ్వత్థామ. ఇతనిని బ్రాహ్మణుడని చూడకు. గురుపుత్రుడని చూడకు. సంహరించు. కుత్తుక కత్తిరించు’ అన్నాడు. అర్జునుడు మారుమాట్లాడలేదు. చంపలేదు.

ఇక్కడ ఉపనిషత్సారమును చెప్తున్నాడు. దానిని మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు. రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు.

త్రాటితో కట్టబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్లు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకువెళ్ళి అక్కడ పారవేశాడు. ’ద్రౌపదీ, వీడి శిరస్సును నీ కాలితో తన్నమని నీకు చెప్పాను. తీసుకువచ్చి అశ్వత్థామను అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను’ అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒకతల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో గానీ తన పసుపుకుంకుమలకు గానీ, తన బిడ్డలకు గానీ, ఆపద తెచ్చిన వారిని క్షమించదు. అశ్వత్థామ తన అయిదుగురు బిడ్డలను చంపేశాడు. ఆయనను చూసి వెంటనే నమస్కారం చేసింది. ఆవిడ అంది ’మహానుభావా, అశ్వత్థామా, నా భర్తలైన ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ”ఆత్మావైపుత్రనామాసి’ తండ్రి తన కొడుకు రూపంలో భూమిమీద తిరుగుతూ ఉంటాడు. నీవు మా గురు పుత్రుడవు. అందుచేత నాకు నీయందు నా భర్తల గురువు దర్శనమౌతున్నాడు. అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నిన్ను నేను ఒక్కమాట అనను.’ ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో మీరూ ఆలోచించండి. ఇదీ ద్రౌపది అంటే! ఆవిడ కోప్పడలేదు. ఎంత మాటన్నదో చూడండి!

’కోపంతో అశ్వత్థామను చంపేస్తామని నా పిల్లలు అస్త్ర శస్త్రములు పట్టుకొని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకుపూర్వం వారు నీకు ద్రోహం చేయలేదు. అపారమైన నిద్రలో ఉన్న నాకుమారులు యుద్ధము చేయడమునందు ఆసక్తి లేనివారై గాఢనిద్రలో ఉన్నారు. ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు. ద్రోణాచార్యునికి కొడుకువు అయ్యావు. నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నీవు పుత్రరూపంలో ఉన్న గురువు అని తలంచి నా అయిదుగురు కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను’ అంది. ’రాత్రి చంపేటప్పుడు నీకీవిషయములు జ్ఞాపకం రాలేదా? అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి వుండవలసిన ధర్మములు తెలియదా? అని అడిగినట్లు అవుతుందని “నీకు నా పిల్లలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయయ్యా?” అని అర్జునుని వంక చూసి అంది.

అర్జునా, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా! అయిదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేనిప్పటివరకూ ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి రెండు చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగిన నైపుణ్యం ఉన్నవాడివై గాండీవం పట్టుకొని రథము ఎక్కి పగబట్టి, అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడకు తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపి (ద్రోణుడి భార్య, అశ్వత్థామ తల్లి)కి వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒక ఎత్తు. ఇంక చచ్చిపోతున్నాడు, ఇంక రక్షించుకోలేను అని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య, నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చునా? అశ్వత్థామా, మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తోందోనయ్యా! తలచుకుంటే నా మనస్సు వికలం అయిపోతోంది.”
అని అర్జునుని పిలిచి, “ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతనిని సంహరించకూడదు. ఆయనను విడిచిపెట్టేయండీ. ఆయనకు కట్టిన బంధనములను విముక్తి చేయండి” అంది.

ఈమాట భీముడు విన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. “ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకొని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను” అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే.

అప్పుడు కృష్ణుడు అన్నాడు. “అర్జునా, నేను నీతో ఒక మాట చెప్తాను దానిని జాగ్రత్తగా విను. ఎవడు ఉపపాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీనిని క్షమించవలసిన పనిలేదు. వీడు ఆతతాయి (చంపుటకు ఉద్యమించినవాడు). కాబట్టి చంపి అవతల పడేయవచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తోంది. ఇతడు ఆతతాయి కాబట్టి చంపివేయాలి. బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏమి చేయాలో దానిని నీవు చేయవలసింది” అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలివేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉపపాండవులను ధర్మం తప్పి చంపినప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు. అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉంది. పుట్టుకచేత అశ్వత్థామకి శిరస్సుమీద ఒక మణి ఉంది. ఆ మణికాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు. అది సామాన్యమైన కత్తి కాదు. అది ఎంతమంది నెత్తురు త్రాగిందో. అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురక వృత్తికి వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఊడబెరికి తను పుచ్చేసుకున్నాడు. అశ్వత్థామకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క త్రోపు తోసి అవతల పారేశాడు. ఆ త్రోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు. హీనుడై, కాంతిపోయిన వాడై, తల వంచుకొని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సూతుడు అన్నాడు – శౌనకాది మహర్షులారా, వృత్తాంతమును విన్నారు కదా! ఇదీ కృష్ణలీల అంటే! ఇదీ కృష్ణుడు అంటే! ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అందుకని భాగవతం అంటే ఈశ్వర స్వరూపుడైన కృష్ణ తత్వమే.

ఇక ఆ ఉపపాండవుల పార్థివ శరీరములను తీసుకువెళ్ళి, దహన క్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలచుకొని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడంటే భగవానుడే!
కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఃఖములను ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తున్న కాలమునకు నీవు పరతంత్రుడవు. నీవు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం - by Vikatakavi02 - 05-08-2019, 05:06 PM



Users browsing this thread: 1 Guest(s)