Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
11-07-2026, 10:27 PM
(This post was last modified: 2 hours ago by k3vv3. Edited 4 times in total. Edited 4 times in total.)
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 1
రచన: సిహెచ్. సీఎస్. రావు
మిత్రుడు, బంధువు... శివరామకృష్ణ వ్రాసిన వుత్తరాన్ని చదువుతున్నాడు హరికృష్ణ.
"2016 ఆగష్టు పదిహేను నాటికి మనకు స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరాలు..... ఏడు పదులైనాయి. పాత తరానికి ప్రొద్దు తిరిగింది. క్రొత్త తరం మూడు పువ్వులు.... ఆరు కాయలుగా నవనాగరీకతతో నడిపొద్దు సూర్యునిలా భాసిల్లుతూ వుంది. జగమంతా కంప్యూటర్ యుగం అయిపోయింది.
పోస్టుకార్డ్సు.... ఇన్లాండ్ లెటర్స్... తంతి సమాచారాలు మరుగున పడ్డాయి. అందరి చేతిలో సెల్..... ఐ ఫోన్... విద్యావంతుల టేబుల్స్ పై ల్యాప్టాప్స్..... పెన్తో కాగితంపై వ్రాసే విధానం తరిగిపోయింది. మనుషుల మనస్సులో ’ఎలాగైనా’ డబ్బు సంపాదించి దర్జాగా కారు, బంగళాతో.... హాయిగా బ్రతకాలనే తీవ్ర ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు మూలం, స్వార్థం.... ఆ స్వార్థం పెరిగేదానికి కారణం.... మనిషిలో మనుగడకున్న ప్రాధాన్యత.... విచక్షణ... విజ్ఞత.... యుక్తాయుక్త విమర్శనారహిత లక్ష్యసాధనాసంకల్పం. తాను పైకెదిగేదానికి ఎదుటివారి భుజాలను నిచ్చెనలా వాడుకోవడం.... పై అంతస్థుకు చేరగానే నిచ్చెనను కాలితో తన్నడం.... కొందరు వారి అభివృద్ధికి పాటించే సూత్రం.
తాత తండ్రుల చరిత్ర.... సంస్కృతి.... సాంప్రదాయం... హైందవతకు సంబంధించిన నీతి... నిజాయితీ... ప్రేమ... సౌభాంత్రం... సహనం.... ఈ కొత్త పధానికి క్రమంగా దూరం అయిపోతున్నాయి. యీ విధానంలో విచారకరమైన మరో విషయం.... కొందరు తల్లితండ్రులు.... తమ సంతతి ఎన్నుకొన్న ఆ జీవిత విధానాన్ని సమర్థించడం. అది తప్పు అని పిన్నలకు చెప్పి.... వారి లక్ష్యాన్ని... మనస్తత్వాన్ని మార్చలేకపోవడం.... పిన్నలు అహంకారంతో చేసే నేరాలను తమ పలుకుబడి.... చేతిలో వున్న ధనంతో... వారు చేసిన నేరానికి శిక్ష అనుభవించి పరివర్తన పొందేదానికి ఆస్కారం లేకుండా చేయడం, బిడ్డలను సక్రమమైన మార్గంలో నడిపించి వారి భవిష్యత్తును సాటివారికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దలేకపోవడం.
ధన, పదవీ బలాలతో... అన్నింటినీ సాధించగలం అనే పెద్దల మనస్తత్వం.... పిన్నలకు తల్లిదండ్రుల నుంచి సంప్రాప్తించిన కారణంగా... సాటి మనుషుల మీద పెద్దల మీద.... యువతకు గౌరవం.... అభిమానం.... ఆదరణ అనే మంచి భావాలు సమసిపోతూ వున్నాయి.
వారికి భిన్నంగా వర్తించేవారు.... వారి దృష్టిలో ఎలా బ్రతకాలో... అనే విషయం తెలియని అప్రయోజకులు. ఏ కొందరో తప్ప.... చాలామంది పై విధానంతోనే మనుగడ సాగిస్తున్నారు. యువత హృదయాల్లో వున్న వారి స్వార్థం కారణంగా.... తమ తల్లిదండ్రులు కూడా వారికి కానివారి జాబితాలో చేర్చబడుతున్నారు. పెద్దల ఆ స్థితికి కారణం.... కొడుకులు ఏరికోరి అర్థాంగిగా స్వీకరించిన నవనాగరీకతా సౌందర్యరాశులు... చదువరులు. ఓ నా నేస్తమా!.... ప్రియ బంధువా!.... హరీ!... నీ వుత్తరాన్ని చదివాను. మనస్సుకు ఎంతో బాధ కలిగింది. నీవు అనుకొన్నట్లున్నావు నేను పొద్దు తిరిగిన జీవితాన్ని పరమానందంగా యీ విశాఖ మహానగరంలో అనుభవిస్తున్నానని... మన ఇరువురి శేషజీవిత పయనం ఒకే రీతిగా సాగుతూ వుంది. నిన్ను చూడాలని... నా ప్రస్తుత సమస్యలను... మన చిన్ననాటి జ్ఞాపకాలను నీతో ముచ్చటించాలనేది నా ఎదలోని కోరిక.... వస్తున్నా నీ వద్దకు... త్వరలో....’
ఇట్లు
నీ.... శివ
వుత్తరాన్ని చదివిన హరికృష్ణ నిట్టుర్చాడు.
భార్య లావణ్య వరండాలోకి వచ్చింది. హరికృష్ణ చేతిలో వున్న వుత్తరాన్ని చూచింది. ఆమె చూపులోని భావాన్ని గ్రహించిన హరికృష్ణ... "మీ అన్నయ్య శివరామకృష్ణ వ్రాశాడు లావణ్య!..." అన్నాడు.
"అలాగా!.... అంతా క్షేమమే కదా!...."
"వుత్తరాన్ని చదువు.... నీకే తెలుస్తుంది... వాడు ఊర్మిళ అక్కడ ఆనందంగా లేనట్లు వున్నారు... మనలాగే!...." మెల్లగా చెప్పి వుత్తరాన్ని లావణ్యకు చూపించాడు.
లావణ్య వుత్తరాన్ని అందుకొంది. రెండు నిమిషాల్లో చదివింది... భర్త ముఖంలోకి చూచింది.
"విషయం అర్థం అయిందిగా!..." విరక్తితో కూడిన చిరునవ్వుతో అడిగాడు హరికృష్ణ.
"అయింది!..." శూన్యంలోకి చూస్తూ చెప్పింది...
కొన్ని క్షణాల తర్వాత....
"అన్నయ్యకు అక్కడ ప్రశాంతంగా లేకుండా వున్నట్లు వుంది!..." అంది మెల్లగా లావణ్య.
"ఎలా వుండగలడు?.... కొడుకులు ఒకరికి ఇద్దరుండీ కూడా... చంద్ర అమెరికాలో... రాఘవ ఆస్ట్రేలియాలో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారే కాని... వాణ్ణి నా చెల్లెలు ఊర్మిళను పట్టించుకోరాయె!.... ఇక ఆడపిల్లలు వైశాలి... శారద. పెద్దామె ముంబాయిలో.... చిన్నామె చెన్నైలో. వాళ్ళ సంసారాలు వారివి... వారూ వీరిని పట్టించుకోలేరు!.... చిన్నవాడు విష్టు జన్మతః అంధుడు... పేరుకు ఐదుగురు బిడ్డలు వున్నారని పేరేగాని... యీ వయస్సులో వారి స్థితిగతులు పట్టించుకునేవారు... లేరే అని వాడి బాధ" వివరంగా చెప్పాడు హరికృష్ణ.
"మనదీ అలాంటి బ్రతుకేగా!... పెద్దవాడు దివాకర్ అమెరికాలో... మధ్యలోని వాణి తన ఇష్టానుసారంగా ఢిల్లీలో... ఇకపోతే చిన్నవాడు ఈశ్వర్... శార్వరి... ఉద్యోగం... చదువురీత్యా హైదరాబాద్లో.... మన బ్రతుకులూ అన్నవాళ్ళలాగా ఒంటరి బ్రతుకులేగా!.... ఒక్కోసారి నాకు చాలా బాధగా అనిపిస్తుందండీ... వాళ్ళను కనిపెంచి పెద్దచేసి... మనకున్నదంతా వూడ్చి వారికి పెట్టి చదివించింది ఇందుకేనా!.... ఈశ్వర్కు తప్ప... శార్వరికి కూడా... మనలను వదలి పై చదువులకు అమెరికాకు వెళ్ళాలనే ఆశ... ఏం కాలమో!.... ఏం పిల్లలో.... తన మన అనే భావన... ప్రేమాభిమానాలు యీ కాలం పిల్లల్లో క్రమంగా... నశించాయనే చెప్పాలి..." అంటూ వీధి వాకిటి వైపు చూచిన లావణ్య....
"అదిగో మీ బావగారు!.... మంతనాల మాధవయ్యగారు వేంచేస్తున్నారు. ఊరకరారు మహానుభావులు. తస్మాత్ జాగ్రత్త...:" లోనికి వెళ్ళిపోయింది లావణ్య.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
మాధవయ్యగారు హరికృష్ణగారి మేనత్త కుమారుడు. వారు... మ్యారేజ్ బ్రోకర్... పురోహితుడు... మంచి మాటకారి.... ఏ వాలున తిరగలిని త్రిప్పినా పిండి తనవైపే పడాలనే లక్ష్యవాది. అవసరానికి అబద్ధాలు చెప్పడం అంటే వారికి మంచినీళ్ళను త్రాగడంతో సమానం....
"ఏరా!... హరీ.... బాగున్నారా అంతా!..."
"ఆఁ.....ఆఁ.... రా బావా.... రా... కూర్చో!..."
మాధవయ్యగారు హరికృష్ణ ముందరి కుర్చీలో కూర్చున్నాడు.
"ఏమిటి బావా!.... విశేషాలు!...." చిరునవ్వుతో అడిగాడు హరికృష్ణ.
"అదృష్టం నీ వాకిటిని వెతుక్కుంటూ వస్తూ వుందిరా!..." వికారంగా నవ్వాడు మాధవయ్య.
"నీ మాట నాకు అర్థం కాలేదు బావా!..."
"వివరంగా చెబుతాను విను...."
దీక్షగా హరికృష్ణ మాధవయ్య ముఖంలోకి చూడసాగాడు ఏం చెబుతాడో అని.
"మన ప్రజాపతి!...."
"ఏమయింది వాడికి!..." వ్యంగ్యంగా అడిగాడు హరికృష్ణ
"వాడికేం కాలేదురా!... వాడు మహారాజుయె!..." నవ్వాడు మాధవయ్య.
"నన్ను నీతో మాట్లాడమని పంపాడు..."
"ఏ విషయంలో!..."
"తన కొడుకు సీతాపతి... వివాహ విషయంలో!...."
"వాడి కొడుకు వివాహాన్ని గురించి నీవు నాతో ఏం మాట్లాడాలి!..." ముఖం చిట్లించి మాధవయ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు హరికృష్ణ.
"నేను చెప్పబోయే విషయాన్ని అలా వుంచు. ముందు నీవు గతాన్ని మరచిపోవాలి..."
"బావా!... మాధవయ్యా!... డొంక తిరుగుడు వద్దు. గతాన్ని నేను అంత సులభంగా మరువలేను. ఆ ప్రసక్తి ఇప్పుడు అనవసరం. నీవు చెప్పదలచుకొన్నదేమిటో చెప్పు."
హరికృష్ణలోని ఆవేశాన్ని చూచి మాధవయ్య జంకాడు.
"ఒరే హరీ!... నేనెవరు?.... నీ శ్రేయోభిలాషినే కదా!..."
"అయితే..."
"నేను ఏమి చెప్పినా నీ మంచికే చెబుతాను..."
"ఏమిటా మంచి!..."
"మాటకు మాట ఎలాంటి గ్యాప్ లేకుండా నాపై విసిరితే... నేను నీ గురించి ఏమనుకోవాలిరా!...."
"ఏమైనా అనుకో. అది నీ ఇష్టం... నాకు అభ్యంతరం లేదు..." వ్యంగ్యంగా నవ్వాడు హరికృష్ణ.
"లావణ్యను పిలువు!..."
"మన మధ్యన ఇప్పుడు లావణ్య ఎందుకు?..."
"బిడ్డల బాగోగుల విషయంలో నీకెంత బాధ్యత వుందో... ఆమెకూ అంతే బాధ్యత వుంది కదరా!..."
"నీవు మాట్లాడదలచుకొన్నది ఏ బిడ్డ విషయంలో... ఈశ్వరా!.... లేక శార్వరియా!..."
"శార్వరి విషయాన్ని గురించేరా!..."
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
"నా బిడ్డకు ఇప్పుడప్పుడే పెండ్లి చేయము మాధవయ్య అన్నయ్యా!..." సింహద్వారం ప్రక్కన నిలబడి లావణ్య చెప్పిన మాటలను విని... మాధవయ్య ఉలిక్కిపడి ఆశ్చర్యంతో ఆమె వైపు చూచాడు.
"ఆ ప్రజాపతికి చెప్పండి!.... తాను మాకు చేసిన ద్రోహాన్ని వాడు... వాడు మరిచాడేమో... మేము మరువలేదు.... మేము మరువలేదు... సంబంధాలను కలుపుకోవాలనే గొప్ప మనస్సు వాడికి వుండవచ్చు... కానీ మాకు అంతటి గొప్ప మనస్సు లేదు... ఇక మీరు... మా పిల్లలకు సంబంధాలు చూచే ప్రయత్నం చేయకండి. ఇంతకు ముందు మీరు చేసింది చాలు..." ఆవేశంగా చెప్పి లావణ్య లోనికి వెళ్ళిపోయింది.
హరికృష్ణ పెదవులపై చిరునవ్వు... నేను చెప్పదలచుకొన్న మాటలను నిర్మొహమాటంగా చెప్పి... ’ఇక నీవు బయలుదేరు’ అనే సంకేతాన్ని మాధవయ్యకి ఇచ్చి వెళ్ళిపోయింది లావణ్య అని అనుకొన్నాడు హరికృష్ణ.
మాధవయ్య... తల దించుకొని కొన్ని క్షణాలు మౌనంగా వుండి... మెల్లగా తల ఎత్తాడు.
’లావణ్య!... ఎవరి చెల్లెలు!... ఆ ప్రజాపతి చెల్లెలేగా!.... రక్తమహిమ ఎక్కడికి పోతుంది. అయినవాడినని కూడా లెక్కచేయకుండా.. ఇదిలించి వెళ్ళిపోయింది. ఇక ఈ హరికృష్ణ మాత్రం... నా మాటలు వింటాడా... అంగీకరిస్తాడా!... ఇది అయ్యే పనికాదు. మన మర్యాదను మనం కాపాడుకోవాలి...’ అనుకొన్నాడు మాధవయ్య.
"ఆఁ... హరీ!... సరేరా!..." అని నిట్టూర్చి "ఇకనే బయలుదేరుతా!..."
"మంచిది బావా!..."
కుర్చీ నుంచి లేచాడు మాధవయ్య... "వెళుతున్నానురా!..."
"ఆఁ.... ఆఁ...." తల ఆడించాడు హరికృష్ణ.
తనలో తాను ఏదో మాట్లాడుకొంటూ మాధవయ్య వీధి గేటు వైపుకు నడిచాడు.
లావణ్య.... ప్రజాపతి చెల్లెలు... ఆమె ఆ ఇంటి కోడలై ఇరవై ఎనిమిది సంవత్సరాలు. గడిచిన పదేళ్ళ క్రిందట మొదట మామగారు నరసింహం... సంవత్సరం లోపలే అత్తగారు మహాలక్ష్మి గతించారు. ఎంతో అన్యోన్యంగా వుండే దంపతులు... వారిలో ఏ ఒక్కరు గతించినా... మరొకరు ఎక్కువ కాలం జీవించలేరు. ఆస్తి వుండవచ్చు. మంచి సంతతి వుండవచ్చు... ’నా’ అని చెప్పుకొనే అధికారం స్త్రీకి (భార్యకు) తన పురుషుడి పైన... పురుషుడికి తన ఇల్లాలిపైన వారి జీవితాంతం వుంటుంది. ఒక వ్యక్తి నేలరాలితే.... ఎవరికీ చెప్పుకోలేని వేదనతో... ఆ మరోవ్యక్తి కూడా త్వరలో నేలరాలడం తథ్యం. అదే జరిగింది... లావణ్య అత్తమామల విషయంలో.....
* * * *
ఆ రోజు ఆదివారం.... గతరాత్రి పదకొండు గంటలకు హరికృష్ణ చిన్నకొడుకు ఈశ్వర్... లాయర్గా పనిచేస్తున్నాడు. చివరి సంతతి శార్వరి. బి.ఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెకు సెలవలైనందున వారిరువురూ సొంత వూరికి హైదరాబాద్ నుంచి వచ్చారు.
కాలకృత్యాలు ముగించుకొని అన్నాచెల్లెళ్ళు హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న తల్లిదండ్రులను సమీపించారు.
"అమ్మా శార్వరీ... ఈశ్వర్ కూర్చోండి!..." అన్నాడు హరికృష్ణ.
"అమ్మా కాఫీ!..." అడిగింది శార్వరి.
లావణ్య క్షణంసేపు భర్త ముఖంలోకి చూచింది. ఆ చూపును గమనించిన ఈశ్వర్....
"అమ్మా!... నీవు కూర్చో... నేను వెళ్ళి నాకు, శకటానికి కాఫీ తెస్తాను..."
"నాన్నా చూడు... వీడు నన్ను శకటం... శకటం... అని వెటకారంగా పిలుస్తాడు."
"నాన్నా మీరే చెప్పండి!.... శార్వరీ!.... అని పిలిచే దానికంటే శకటం... అని పిలవడం తేలిక కదూ!..." నవ్వుతూ అడిగాడు ఈశ్వర్.
"నాన్నా!... ఈశ్వర్... ఆ పేరు మా నానమ్మ పేరు... నాకు ఎంతో ఇష్టమైన పేరు... అలా హేళనగా పిలవకురా!..."
"సరే నాన్నా!. మీ ముందు పిలవను!..." నవ్వుకుంటూ వంటింటి వైపుకు నడిచాడు ఈశ్వర్.
"అంటే!...." గద్దించినట్లు అడిగింది లావణ్య చిరుకోపంతో కూతురివైపు తిరిగి....
"ఆడపిల్లవు నీవు... కాఫీ తెచ్చి వాడికి యివ్వవలసిన దానవు. మహారాణిలా తండ్రిప్రక్కన కూర్చున్నావు. వాడేమో నీకు కాఫీ తెచ్చేదానికి వెళ్ళాడు... వాడు ఎంత మంచివాడో నీకు అర్థం కాలా!..." కొడుకు పక్షాన తల్లి లావణ్య వాదన.
"నాన్నా!.... నేను చాలాకాలంగా గమనిస్తూనే వున్నాను..."
"ఏమిటమ్మాఅది!..."
"ఈ అమ్మ!.... నా అమ్మకు.... నీమీద కంటే... వాడిమీదనే ప్రేమ... అభిమానం జాస్తి!... అవును కదా జననీ!..." వ్యంగ్యంగా అడిగింది శార్వరి.
"అలాంటిదేమీ లేదులే అమ్మా!...." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
"అవునే!... వాడంటే నాకు ఇష్టమేనే!... వాడు నీలా పెంకిఘటం కాదు. సౌమ్యుడు..."
"నాన్నా!. విన్నావా!... నా మాతృమూర్తి మనస్సులోని మాట!...." తల ఆడిస్తూ తల్లి ముఖంలోకి చురచుర చూస్తూ చెప్పింది శార్వరి.
"ఆ పోలిక ఎవరిదంటావ్!..." చిరునవ్వుతో భార్య ముఖంలోకి చూస్తూ అడిగాడు హరికృష్ణ.
"నాదే!..." ధీమాగా చెప్పింది లావణ్య.
"చిన్న మహారాణిగారూ!... ఇదిగో కాఫీ!... సేవించండి..." నవ్వుతూ కాఫీ కప్పును ఈశ్వర్ శార్వరికి అందించాడు.
"థ్యాంక్యూ రా!... సోదరా!..." నవ్వుతూ చెప్పింది శార్వరి.
"అమ్మా!... విన్నావా సోదరి మాట... నామీద ఎంత అభిమానమో!..." ఓరకంట చెల్లెలి ముఖంలోకి చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.
"కాఫీ తెచ్చి ఇచ్చావుగా!..." నవ్వింది లావణ్య.
హరికృష్ణ... లావణ్య కూతురు కొడుకును చూచి ఆనందంగా నవ్వుకొన్నారు.
కాఫీ త్రాగుతూ ఈశ్వర్ వీధి వాకిటివైపు చూచాడు. వాకిట ఆగిన కారు నుండి ప్రజాపతి కూతురు దీప్తి గేటు తెరుచుకొని గృహ ప్రాంగణంలోకి ప్రవేశించింది.
దీప్తిని చూచిన ఈశ్వర్...
"అమ్మా!... నీ మేనకోడలు దీప్తి వస్తుంది!..."
"ఏమిటీ!..." లేచి అడిగి ఆశ్చర్యంతో సింహద్వారం వైపు చూచింది.
జీన్స్ ప్యాంట్.... టీషర్టు.... విరబోసుకొన్న పొడుగాటి శిరోజాలు... హైహీల్స్... పెదవులకు దొండపండు రంగు లిప్స్ టిక్.... మోడ్రన్ లక్షణాలు... నూటికి నూరుపాళ్ళతో దీప్తి వరండాలోకి ప్రవేశించింది.
ఈశ్వర్ తల్లి ఖాళీ చేసిన కుర్చీలో కుర్చున్నాడు. లావణ్య సింహద్వారాన్ని సమీపించింది. ఆమెను చూచిన దీప్తి "హాయ్!... అత్తయ్యా!... ఎలా వున్నావ్?..." చిరునవ్వుతో అడిగింది.
ఆమె వేషాన్ని చూచి... షాక్ తిన్న లావణ్య... ఆమె మాటలు వినగానే... వాస్తవానికి వచ్చి మరోసారి దీప్తిని క్రింది నుంచి పైదాకా పరీక్షగా చూచింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
డ్రైవర్ కాశీ... బత్తాయిల బుట్టను తెచ్చి అరుగుమీద వుంచి.. వినయంగా లావణ్యకు నమస్కరించాడు.
"అత్తయ్యా!.... నన్ను గుర్తుపట్టలేదా! నేను మీ అన్నయ్య ప్రజాపతిగారి కుమార్తెను. దీప్తిని... ఐదేళ్ళ తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఈ దీప్తి... డాక్టర్ దీప్తి!" కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది చిరునవ్వుతో.
దీప్తి మాటలను విన్న శార్వరి తల్లిని సమీపించింది.
"నాన్నా!.... విన్నావా దీప్తి మాటలు!..." ఆమె మాటలు నచ్చని ఈశ్వర్ కూర్చునే తండ్రి వంక చూచి చెప్పాడు.
హరికృష్ణ చిరునవ్వు నవ్వాడు "అంతా తండ్రి పోలిక!..." అన్నాడు.
"హాయ్!... శారు!... ఎంతగా ఎదిగిపోయావే!" ఆశ్చర్యంతో నవ్వింది దీప్తి శార్వరిని చూస్తూ.
"లోపలికి రా దీప్తి!..." సాదరంగా ఆహ్వానించింది శార్వరి.
"అత్తయ్యా!.... నన్ను చూచి షాక్ తిన్నట్లున్నావు!..." నవ్వింది దీప్తి.
"షాక్ తిన్నట్లు కాదే!... షాక్ తగిలినట్లు!...." వ్యంగ్యంగా అంది లావణ్య.
క్షణం తర్వాత "రా!..." అని చెప్పి భర్త కూర్చుని వున్న సోఫాను సమీపించి... ఎదుటి సోఫాలో కుర్చుంది. శార్వరి... దీప్తిలు హరికృష్ణ సోఫాను... లావణ్య... ఈశ్వర్ కూర్చొని వున్న సోఫాను సమీపించారు.
హరికృష్ణకు ఇరువైపులా శార్వరి... దీప్తి కూర్చున్నారు.
"ఏమ్మా దీప్తి!... ఎప్పుడొచ్చావు!" ప్రీతిగా అడిగాడు హరికృష్ణ.
హరికృష్ణ నిండుకుండ... అతను ఎప్పుడూ త్వరపడడు... ఎంతో జీవితాన్ని చూచి... కష్ణసుఖాలను అనుభవించి, సహనం, శాంతిని ప్రసాదిస్తుందనే నమ్మకాన్ని జీర్ణించుకొన్న గొప్ప వ్యక్తి.
"హాయ్!.... అంకుల్... బాగున్నారా!.... నేను నిన్ననే వచ్చాను. హాయ్! ఈశ్వర్!... హవ్ ఆర్ యు!...." నవ్వుతూ పలకరించింది ఈశ్వర్ను తదేకంగా చూస్తూ దీప్తి.
"మిమ్ముల్నందర్నీ చూడాలనిపించింది వచ్చాను.... ఆ... మామయ్యా! మీకు ఆరెంజ్ అంటే ఇష్టం అని నాన్న ఆ పండ్లను పంపారు" పరుగున వెళ్ళి వరండాలో వున్న పండ్ల బుట్టను తెచ్చి హరికృష్ణ ముందు ఉంచింది.
"చాలా ఫ్రెష్గా ఉన్నాయి తినండి" ప్రీతిగా చెప్పింది దీప్తి.
"ఐదేళ్ళు అమెరికాలో వున్నా, నీ మాటల ధోరణిలో ఏ మార్పు లేదు దీప్తి!...." అంది శార్వరి.
"అక్కడికి మన అవసరం కోసం వెళ్ళాం. అంత మాత్రాన మనం అమెరికన్స్ గా మారిపోతామా!.... నా దేశం ఎంతో పవిత్ర భారతదేశం... నేను ఆంధ్రుల ఆడపడుచును. మాట తీరు మారవచ్చు... కానీ మనం ఎవరమన్నది ఎన్నటికీ మరువరాదు... కదా మామయ్యా!..." అంది దీప్తి.
"అవునమ్మా!.... నీవు చెప్పింది నిజం..."
"అత్తయ్యా!.... ఈశ్వర్!... ఎం అలా మూగవాళ్ళలా కూర్చొని వున్నారు... నాతో సరదాగా మాట్లాడండి!..." ఆ ఇరువురినీ చూస్తూ చెప్పింది దీప్తి.
"మా ఇంట్లోనూ మూడు ఆరెంజ్ చెట్లు వున్నాయి. ఆ చెట్లకు ప్రస్తుతంలో కాయలు ఉన్నాయి. త్వరలో అవి పండ్లుగా మారుతాయి. పాపం... మీ నాన్న ఆ విషయాన్ని మరిచినట్లున్నాడు!...." వ్యంగ్యంగా నవ్వింది లావణ్య.
"లావణ్యా!" ’తప్పు’ అన్నట్లు భార్య ముఖంలోకి చూచి తలాడించాడు హరికృష్ణ.
"ప్రస్తుతం అవి కాయలేగా!.... ఇవి పండ్లు తినేదానికి బాగుంటాయి కదా మామయ్యా!..." లావణ్యను ఓరకంట చూస్తూ చెప్పింది దీప్తి.
"అవునమ్మా!..."
"ఈశ్వర్!.... ఏదైనా మాట్లాడు!..." అంది దీప్తి, ఈశ్వర్ను చూస్తూ...
"ఏం విషయాన్ని గురించి మాట్లాడమంటావ్?..."
"నీ విషయాన్ని గురించి... నా విషయాన్ని గురించి... మన అందరి విషయాలను గురించి!..." ప్రీతిగా అతని కళ్ళల్లో చూస్తూ చెప్పింది దీప్తి.
"నా విషయం... నేను ఎం.బి.బి.యల్ ముగించి ప్రస్తుతంలో హైదరాబాద్లో... హైకోర్టు సీనియర్ లాయర్ బలరామరావు గారి వద్ద పని చేస్తున్నాను. నీ విషయం... అమెరికాలో ఎం.బి.బియస్ పూర్తి చేశావు. స్వదేశానికి తిరిగి వచ్చావు.... ఇక... మనందరికీ సంబంధించిన విషయం... ప్రస్తుతంలో... మీ యింటివారు మా ఇంటికి రావడం కాని... ఈ ఇంటివారు మీ ఇంటికి పోవడం కాని లేదు... దానికి కారణం మీ నాన్న!... వివరాలు కావాలంటే... వెళ్ళి మీ నాన్ననే అడుగు...." లేచి వ్యంగ్యపు చిరునవ్వు నవ్వి... వేగంగా ఈశ్వర్ తన గదికి వెళ్ళిపోయాడు.
అతని మాటలకు దీప్తి ఆశ్చర్యపోయింది. అంతవరకూ ఆమె ముఖంలో వున్న ఆనందం స్థానంలో విచారం చోటు చేసుకొంది. తలదించుకొంది. కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయింది. లావణ్య లేచి వంటింటి వైపుకు నడిచింది.
నిట్టూర్చి దీప్తి లేచి నిలబడింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
12-07-2026, 03:46 PM
(This post was last modified: 21-07-2026, 11:54 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
"మీ మధ్యన ఏం గొడవలు జరిగాయో... నాకు తెలీదు మామయ్యా!... మీ యింటికి వెళతానని నాన్నకు ఉదయాన చెప్పాను. ’వెళ్ళిరా’ అన్నారు. ఎలాంటి అభ్యంతరాన్ని చెప్పలేదు. చాలారోజులు అయింది కదా, మిమ్మల్నందర్నీ చూచి సరదాగా మాట్లాడాలని వచ్చాను. కానీ అత్తయ్య మాటలు... ఈశ్వర్ మాటలు నా ధోరణికి వేరుగా వున్నాయి. ఇక నేను ఇంటికి వెళతాను మామయ్యా!... ఈశ్వర్ అన్నట్లు... మన రెండు కుటుంబాల మధ్యన రాకపోకలు లేకుండా చేసిన ఆ కారణం ఏమిటో నాన్నను అడిగి తెలుసుకొంటాను. తప్పు ఎవరిదో, ఒప్పు ఎవరిదో నా స్వనిర్ణయంతో తేల్చుకొంటాను. వస్తాను మామయ్యా!...." సోఫా నుంచి లేచింది దీప్తి.
శార్వరి దీప్తిని సమీపించింది.
"అన్నయ్య మాటలకు బాధపడుతున్నావా!...."
"బాధ కాదే.... అయోమయంగా వుంది. నిజాన్ని తెలుసుకోవాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి..."
"అమ్మా దీప్తి!..."
" ఏం మామయ్యా!..."
"వాడిని కాని, అమ్మను కానీ... నీవు ఏమీ అడగవద్దు"
ఆశ్చర్యంతో చూచింది హరికృష్ణ ముఖంలోకి దీప్తి....
"అంటే!...."
"నీవు చిన్నపిల్లవు.... ఐదేళ్ళ తర్వాత నిన్ననేగా నీవు వచ్చింది. ప్రయోజకురాలివై నీవు తిరిగి వచ్చినందుకు వాడు ఇప్పుడు ఎంతో ఆనందంగా వుంటాడమ్మా!... అ విషయాన్ని గురించి అడిగి... వాడికి ప్రస్తుతంలో వున్న ఆనందాన్ని వాడి నుంచి దూరం చేయకమ్మా!... ఇకపై ఇక్కడే వుంటావుగా!... నిలకడ మీద నిజాలు... నీకు తెలుస్తాయి. నా మాటను పాటించు..." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
హరికృష్ణ తత్త్వం... దీప్తికి బాగా తెలుసు. తన చిన్న వయస్సులో సెకండరీ చదువును చదివే రోజుల్లో దీప్తి... కాలేజీ హరికృష్ణ ఇంటి ప్రక్కనే అయినందున ఎక్కువ సమయం వారి ఇంట్లోనే వుండేది. హరికృష్ణకు దీప్తి అంటే ఎంతో ప్రేమ, అభిమానం. దీప్తికి హరికృష్ణ దగ్గర ఎంతో చనువు.
"సరే మామయ్యా!... నేను మీ మాటను పాటిస్తాను" ఆ గతాన్ని తలచుకొని... కొన్ని నిముషాల తర్వాత దీప్తి మెల్లగా చెప్పింది.
లావణ్య హాల్లోకి వచ్చింది. ఆమె చేతిలో మూతతో కూడిన ఓ స్టీల్ డబ్బా వుంది.
దీప్తి లావణ్యను చూచి... "వెళ్ళొస్తానత్తయ్యా!" అంది.
"ఆగు..." దీప్తిని సమీపించింది లావణ్య.
"ఎం తినకుండా, త్రాగకుండా వెళ్ళిపోతానంటున్నావ్!... అలా చేయమని మీ నాన్న చెప్పాడా!..."
"లేదత్తయ్యా!..."
"లావణ్యా!... దీప్తి... చిన్నపిల్ల” ఇక ఆపు అని చేతిని పైకెత్తి సౌంజ్ఞ చేశాడు హరికృష్ణ.
"నాతోరా!..."
"వెళ్ళమ్మా దీప్తీ!....." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
ముందు లావణ్య నడువగా వెనకాలే దీప్తి... శార్వరి నడిచి... డైనింగ్ రూంలో ప్రవేశించారు.
"కుర్చీలో కూర్చో!..." అంది లావణ్య.
దీప్తి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది.
శార్వరి తల్లిని సమీపించి... "అమ్మా! అన్నయ్య అన్న మాటలకు దీప్తి భయపడిపోయిందమ్మా!..." ఆందోళనగా మెల్లగా చెప్పింది.
"ఆఁ.... దానికి భయమా!... అది ఎవరి కూతురు.... వీరమనేని ప్రజాపతి కూతురు... నీలాంటి నాలాంటి వాళ్ళకి వందమందికి భయాన్ని కలిగిస్తుంది తన చూపుతోనే... దానికంటే ఐదేళ్ళు చిన్నదానివి. దాని సంగతి నీకేం తెలుసు!... ఆ గారెల ప్లేట్లు చేతికి తీసుకో... ఒకటి దానికి... ఒకటి నీకు... తినండి."
కుకింక్ ప్లాట్ఫామ్ మీద వున్న ప్లేట్లు చేతికి తీసుకొని శార్వరి డైనింగ్ టేబుల్ను సమీపించి.... ఒకదాన్ని దీప్తి ముందు వుంచి ఆమె ప్రక్కనే కూర్చొంది శార్వరి. దీప్తి ముఖంలోకి చూచి... "తిను" అంది.
దీప్తి వడను తుంచి నోట్లో పెట్టుకొంది.
పాలు కాస్తూ... లావణ్య...
"దీప్తి!... నీకు మినప వడలంటే ఎంతో ఇష్టం కదా!... పెట్టిన నాలుగింటినీ తినాలి!..." అంది.
"అలాగే అత్తయ్యా!..." అంది దీప్తి.
"గారె బాగుందా!..." అడిగింది శార్వరి.
"చాలా బాగున్నాయి..."
====================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 2
కాలేజీ నుంచి నేరుగా... హరికృష్ణ ఇంటికి వచ్చిన దీప్తి ఊయల చెక్కపై పుస్తకాల సంచిని వుంచి... పరుగున వంటింట్లోకి వెళ్ళింది.
"అత్తయ్యా!..."
"ఏరా కాలేజీ వదిలేశారా!.."
"వదలబట్టేగా ఇంటికి వచ్చాను!..."
"ఏమిటే పరాగ్గా వున్నావ్!..."
"ఆ జ్యోతి లేదూ!..."
"ఏ జ్యోతీ!..."
"రామలింగం అంకుల్ కూతురు!..."
"నిన్నేమన్నా అందా!..."
"అంది..."
"ఏమంది?..."
"అత్తయ్యా!... అది కాలేజీకు మూడు గారెలు తెచ్చింది. నాకు చూపించింది. నేను.. ’నాకు ఒకటివ్వవే’ అడిగాను. అది... నన్ను ఏమందో తెలుసా!..."
"ఏమందిరా!..."
"నేను ఇవ్వను... నీకు కావాలంటే నీ మొగుడి అమ్మను... అదే మీ మేనత్తను అడిగి చేయించుకొని తిను... అంది అత్తయ్యా!... అది చాలా చెడ్డది అత్తయ్యా!..." రోషంతో చెప్పింది దీప్తి. లావణ్య పకపకా నవ్వింది.
"అత్తయ్యా!.... మీరూ నన్ను వెక్కిరిస్తున్నారా!..."
లావణ్య దీప్తిని సమీపించి తన చేతుల్లోకి దీప్తి ముఖాన్ని తీసుకొని... చిరునవ్వుతో... "అది తప్పుగా ఏం చెప్పలేదురా. నీవు నా మేనకోడలివి. నేను నీ మేనత్తను. నా కొడుకు ఈశ్వర్ నీకు కాబోయే మొగుడు... ఇంతకూ ఇప్పుడు నా కోడలికి గారెలు కావాలి... అంతేగా!..." నవ్వింది లావణ్య.
"అవును..." బుంగముతితో చెప్పింది దీప్తి.
"అరగంటలో లోపల నీ ముందు వేడివేడి గారెలు వుంటాయి. ముఖం కడుక్కొనిరా. పాలు తాగు."
పరుగున దీప్తి వెళ్ళి ముఖం కడుక్కొని లావణ్యను సమీపించింది. పాలగ్లాసును దీప్తి చేతికి అందించింది లావణ్య. గటగటా త్రాగి గ్లాసును ఖాళీ చేసింది దీప్తి.
"హోంవర్కు ఏదైనా వుంటే వ్రాసుకో... గారెలు రెడీ చేసి పిలుస్తాను." అంది లావణ్య.
"వుంది అతయ్యా వ్రాస్తాను" వెళ్ళి ఊయల చెక్కపై కూర్చొని హోంవర్కు వ్రాయసాగింది దీప్తి.
అరగంట గడిచింది. హోంవర్క్ పూర్తిచేసింది దీప్తి.
"అత్తయ్యా!... హోంవర్క్ ఫినిష్!..." బిగ్గరగా అరిచింది.
"గారెలు కూడా రెడీ!... రా తిందువు గాని..." అంది లావణ్య.
దీప్తి వంటింట్లోకి వచ్చింది.
లావణ్య టేబుల్పై గారెల ప్లేటును వుంచింది.
దీప్తి కుర్చీలో కూర్చుంది.
"దీపూ!... గారెలు వేడిగా వున్నాయి. నిదానంగా వూదుకొని తిను..." అంది లావణ్య.
అదే... డైనింగ్ టేబుల్... అదే కుర్చీ...
* * * *
పది సంవత్సరాల క్రిందట జరిగిన ఆ సంఘటన దీప్తికి గుర్తుకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీరు...
వాటిని చూచిన... శార్వరి...
"దీప్తి! ఏడుస్తున్నావెందుకు?" ఆశ్చర్యంతో అడిగింది.
"గతం గుర్తుకువచ్చింది శారు. ఇవి కన్నీరు కాదు... ఆనందభాష్పాలు. అత్తయ్య... నాకు ఏది ఇష్టమో కాదో అనే విషయాన్ని మరువలేదు" సాలోచనగా చెప్పింది దీప్తి.
"తిన్నావా దీపూ!" అడిగింది లావణ్య.
"ఆఁ... తిన్నానత్తయ్యా!... గతాన్ని గుర్తు చేసుకుంటూ తిన్నాను."
"శార్వరీ!... వచ్చి పాలగ్లాసుకు తీసుకు వెళ్ళు." అంది లావణ్య.
శార్వరి వెళ్ళి పాలగ్లాసులతో డైనింగ్ టేబుల్ను సమీపించింది. ఒక గ్లాసును దీప్తికి అందించింది.
ఆ పాలగ్లాసులోని పాలపై దీప్తికి లావణ్య ముఖం గోచరించింది. చిరునవ్వుతో.... ’జరిగిన గొడవ ఏందో... దాని కారణంగా అత్తయ్యకు నాన్నమీద కోపం వున్నా... నా విషయంలో ఆమె మనస్సులో ఎలాంటి ద్వేషమూ లేదు. దానికి సాక్షి... తను నాకు ఎంతో ఇష్టమైన గారెలు చేయడం... నాచేత తినిపించడం.... నాకు ఇష్టమైన పాలు నాకు అందించడం...’ అనుకొంది దీప్తి.
లావణ్య... డైనింగ్ టేబుల్ను సమీపించింది.
"అత్తయ్యా!.... ఇక నేను వెళ్ళిరానా!..." చిరునవ్వుతో ప్రీతిగా లావణ్య ముఖంలోకి చూస్తూ అడిగింది దీప్తి.
"సరే వెళ్ళిరా!... ఆఁ.... ఒక్కమాట!...."
"తప్పుగా అనుకోవుగా!.."
"అనుకోనత్తయ్యా!..."
"ఈ మాటను నేను... నీపై నాకు వున్న వాత్సల్యంతో చెబుతున్నాను..."
"చెప్పండత్తయ్యా!..."
"ఈ ఇంటికి నీవు ఎప్పుడైనా ఇక ముందు వచ్చేటప్పుడు... శారూను చూడు... ఆ వేషంలో రావాలి..."
దీప్తికి.... విషయం అర్థం అయింది.
తల దించుకొని... "అలాగే అత్తయ్యా!.... బయలుదేరుతాను..." అంది.
టేబుల్ పైనున్న డబ్బాను చూపుతూ...
"దాన్ని చేతికి తీసుకో!..."
"శారూ!... దేవుడి రూంలో పూలు వున్నాయి తీసుకురా!..." అంది.
శార్వరీ పూజగదివైపుకు నడిచింది.
"ఈ డబ్బాలో ఏమున్నాయి అత్తయ్యా!..."
"సున్నివుండలు... మీ అమ్మకు ఎంతో ఇష్టం...."
"అమ్మకా!.... నాన్నకా!...."
"ఆఁ.... ఒకసారి చెబితే నీకు అర్థం కాదా!..."
"ఆఁ....ఆఁ.... అర్థం అయింది అత్తయ్యా!..." నవ్వుతూ చెప్పింది దీప్తి.
శార్వరి రెండుమూర్ల మల్లెపూల దండను తెచ్చి లావణ్యకు అందించింది. పూలను టేబుల్పై వుంచి...
"దీపూ!... వెనక్కు తిరుగు!..." అంది లావణ్య.
దీప్తి ఆమెకు వీపు మళ్ళించి నిలుచుంది.
తల వెంట్రుకలను తన చేతుల్లోకి తీసుకొని... మూడు పాయల జడను అల్లి... మల్లెపూలను తల్లో వుంచింది లావణ్య.
"ఏమిటత్తయ్యా!.... ఇది!..." అసహనంగా అంది దీప్తి.
"ఇది మన పద్ధతి... మరచిపోయినట్లున్నావు... గుర్తుకు తెచ్చుకో!..."
దీప్తి నవ్వి స్టీల్ డబ్బాను చేతికి తీసుకొంది.
"వెళ్ళొస్తానత్తయ్యా!..."
"మంచిదిరా!..."
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
దీప్తి హాల్లోకి వచ్చింది.
ఈశ్వర్ తన గదినుండి బయటికి వచ్చాడు.
దీప్తి చిరునవ్వుతో అతని ముఖంలోకి చూచింది.
ఈశ్వర్ ఆశ్చర్యంతో... "అమ్మా!..."
"దీప్తి ఇంటికి వెళుతూ వుంది. వీధి గేటు వరకూ వెళ్ళిరా!..." అంది లావణ్య.
"అమ్మా!..."
"ఈశ్వర్!.... మర్యాదను పాటించాలిరా!...."
"ఆఁ....ఆఁ.... అలాగే అమ్మా!...."
’ఈ అమెరికన్ రిటన్.... ఏం మాట్లాడిందో... ఏం మాయ చేసిందో... అమ్మ ఏంది ఇలా మారిపోయింది!....’ అనుకొన్నాడు ఈశ్వర్.
నలుగురూ వరండాలోకి వచ్చారు.
వాకిట రెండువైపులా వున్న పూలమొక్కలకు పైపుతో నీళ్ళు పెడుతున్నాడు హరికృష్ణ.
వరండాలో ఆగిపోయింది లావణ్య. ముందు దీప్తి, వెనుక శార్వరీ, ఈశ్వర్లు వీధి గేటువైపుకు బయలుదేరారు.
హరికృష్ణను చూచి... "వెళ్ళొసాను మామయ్యా!..." చెప్పింది దీప్తి.
"మంచిదమ్మా... వెళ్ళిరా!..." చిరునవ్వుతో చెప్పాడు.
శార్వరీ... ఈశ్వర్... దీప్తి వీధి గేటు ముందుకు వచ్చారు.
"శారూ!.... బావా!... వస్తాను..." నవ్వుతూ చెప్పి దీప్తి కార్లో కూర్చుంది.
డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. శార్వరి... ఈశ్వర్ ముఖంలోకి చూచి నవ్వింది.
"ఎందుకు మహాతల్లీ నవ్వుతున్నావ్!..." అడిగాడు ఈశ్వర్.
"దీప్తి నాకేమౌతుంది?...."
"నీకు తెలీదా!..."
"తమరి నోటితో విందామనే ఆశ..."
"పద అమ్మ దగ్గరికి!..."
"ఎందుకు?..."
"నీ ప్రశ్నకు సమాధానం కావాలిగా!..."
"అడిగింది నిన్ను... నీవే చెప్పాలి..."
"నేను చెప్పినా, అమ్మ చెప్పినా ఒకటే!..."
"అంతేనంటావా!...."
"అవును..."
"సరే పద!..."
ఈశ్వర్, శార్వరీలు లావణ్యను సమీపించారు.
"ఏమిటే నవ్వుతూ వూగిపోతున్నావ్!" అడిగింది లావణ్య.
"నీ కోడలు... ఈ నా అన్నయ్యతో వరస కలిపింది...." నవ్వింది శార్వరి.
"అమ్మా!.... దీప్తి నాకేమౌతుంది?..."
"ఒరేయ్!... ఏందిరా ఈ చచ్చు ప్రశ్న... ఏమౌతుందో నీకు తెలీదా!..."
"ఆఁ.... అమ్మా నేనూ ఇదే ప్రశ్న వేశాను!... జవాబు ఏం చెప్పాడో తెలుసా!..."
"ఏం చెప్పాడు?..."
"నిన్ను అడిగి కనుక్కోమన్నాడు.." వెటకారంగా చెప్పింది శార్వరి.
"అది వాడికి ఏమౌతుందో నీకు తెలీదా!..."
"తెలుసనుకో!... ఆ మాటను చిన్నబ్బాయ్ నోటినుండి వింటే..." నవ్వింది శార్వరి.
"అలాగా!..."
"అవును జననీ!..."
"ఈశ్వరా!... చెప్పు!..."
"ఏం చెప్పాలమ్మా!..."
"దీపు నీకు ఏమౌతుందో చెప్పరా!..."
"అమ్మా!.... ఇది చాలా అన్యాయం.."
పైపును ఆపి... వరండాలోకి వచ్చిన హరికృష్ణ వారి మాటలను విన్నాడు. నవ్వుతూ... "ఈశ్వరా! సిగ్గు వుండవలసింది ఆడవారికి... చెప్పరా చెప్పు..."
"ఏం చెప్పను!..."
"తనకు... నాకు... పెద్దవాళ్ళకు సమ్మతం అయితే నా భార్య అవుతుందని..." నవ్వాడు హరికృష్ణ.
"నాన్నా!.... మీరు నన్ను!...."
"ఆటపట్టిస్తున్నానంటావా!... నేను అన్నమాట ఈనాటిది కాదురా!... దీప్తి పుట్టగానే మేమంతా.. అంటే మన రెండు కుటుంబాల వారు ఆనాడు అనుకొన్నమాట..."
"అవునురా!.... మీ నాన్న చెప్పింది నిజం...."
"అది అప్పటి పరిస్థితి.... కానీ యీనాటి పరిస్థితి వేరు కదమ్మా!.... ప్రజాపతిగారు చేసిన ద్రోహాన్ని మీరు మరిచిపోగలరేమో కానీ.... నేను మరువలేను..." లోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్.
హరికృష్ణ లావణ్య ముఖంలోకి చూచాడు. ఆ చూపులోని ప్రశ్న లావణ్యకు అర్థం అయింది. తండ్రి ముఖంలోని గాంభీర్యాన్ని చూచి శార్వరి లోనికి వెళ్ళిపోయింది.
"కూర్చో లావణ్యా!...." వరండాలోని కుర్చీలో తను కూర్చొని చెప్పాడు హరికృష్ణ.
లావణ్య మౌనంగా ఆలోచనతో అతనికి ఎదురుగా కూర్చుంది.
"లావణ్యా!..."
భర్త ముఖంలోకి చూచింది లావణ్య.
"దీప్తి అంటే నీకు ఇష్టం కదూ!...."
"అవునండీ!...."
"ఆమె నీ ఇంటి కోడలు కావాలనే ఆశ కూడా వుంది కదూ!.... తను ఇంటికి రాగానే.... వాడి మీది కోపాన్ని ఆ పిల్ల మీద చూపించావ్. అమెరికాలో చదివి వచ్చినా... ఆ పిల్లలో ఎలాంటి పొగరు... అహంకారం... నాకు కనిపించలేదు... మరి నీకు?..."
"నాకు అంతేనండి. అందుకే దానికి ఎంతో ఇష్టమైన నెయ్యిగారెలు చేసి తినిపించాను. గారెలను తింటూ అది ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావని శార్వరీ అడిగితే.... గతం గుర్తుకు వచ్చిందని చెప్పింది. మన చేతుల్లో పెరిగిన పిల్ల... అదీ గతాన్ని మరిచిపోలేదు... నేనూ మరిచిపోలేదు. అందుకే తలదువ్వి, పూలుపెట్టి ఇది మన పద్ధతి అని చెప్పి పంపాను. మన పంతాలు, పట్టింపులు మన చిన్న పిల్లలకు శాపాలు కాకూడదండీ!..." విచారంగా చెప్పింది లావణ్య.
"అంటే!..." ఆశ్చర్యంతో అడిగాడు హరికృష్ణ.
"దీప్తి ఈ ఇంటి కోడలు కావాలి!... చూచారుగా ఎంత అందంగా తయారయిందో!..."
"ఆమె నీ మేనకోడలు కదా!... అంతా మేనత్త పోలిక..." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ. క్షణం ఆగి... "నీ నిర్ణయాన్ని నేను ఏనాడూ కాదనలేదు. మరి ఈశ్వర్ అభిప్రాయం... ఎలా వుందో!...."
"వాడు మన బిడ్డ! మన మాటను కాదనడు. ఇప్పుడు... సమస్య... ఆ ప్రజాపతి..."
"ప్రజాపతి కాదు నీవు అనవలసింది... నా అన్నయ్య అని...."
"ఆ పదానికి వున్న గౌరవాన్ని అలా పిలిపించుకునే అదృష్టాన్ని వాడు కోల్పోయాడండి" బాధలో చెప్పింది లావణ్య.
"అయితే... నా వాంఛ.... కాదు... కాదు... మన వాంఛ నెరవేరే మార్గం!...."
"నా నిర్ణయం సరైనదైతే మార్గాన్ని నేను నమ్మిన ఆ భగవాన్ రమణమహర్షి తప్పక చూపుతారు... ఆ నమ్మకం నాకుంది."
"ఈశ్వర్ని అడిగి చూద్దామా!..."
"ఇప్పుడు కాదు... అసలు వాణ్ణి అడగవలసిన అవసరం లేదు. వాడు మన మాటను కాదనడండీ!..."
"పట్టుదల... పగ... ప్రతీకార వాంఛలు వాడిలోనూ వున్నాయని నా అభిప్రాయం!..."
"మనం నచ్చచెబితే.... వాడు మన మాటను మీరడండీ!...."
"మొన్న నాతో వాడేమన్నాడో తెలుసా!..."
"ఏమన్నాడు!..."
"ఈ సంవత్సరంలో శార్వరి చదువు అయిపోతుందిగా... ముందు దాని వివాహం ఘనంగా జరిపించాలి. ఆ తర్వాతనే నా వివాహ ప్రసక్తి" అన్నాడు.
"వాడి నిర్ణయం మంచిదే కదా!..."
"అవును... చాలా మంచిది..."
"ఈ విషయంలో నా సలహా ఏమిటంటే!..."
"చెప్పు లావణ్యా!..."
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
"శివరామకృష్ణ అన్నయ్యకు ఉత్తరాన్ని వ్రాయండి. వారు రావాలనుకొంటున్నారుగా!... రాబోయే ముందు ఆ ప్రాంతంలో మనకు తగిన మంచి కుటుంబాల్లో మొగపిల్లలు వున్నారేమో విచారించి రావలసిందిగా వ్రాయండి. వారు పేదవారైనా సరే.... గుణ గణాల్లో.... పరువు మర్యాదల విషయంలో... మంచివారుగా... మనకు తగినవారుగా వుండాలి."
"అలాగే లావణ్యా!... ఈ రోజే వ్రాస్తాను."
"ఫోన్లో అన్ని వివరంగా మాట్లాడలేము. అందుకే అన్ని విషయాలను వివరంగా వుత్తరంలో వ్రాయండి."
"సరే..."
ఈశ్వర్ వరండాలోకి వచ్చాడు.
"నాన్నా!.... నేను మన తోటవరకూ వెళ్ళొస్తాను. కేరళ నుంచి ఆరుటెంకాయ మొక్కలను నా స్నేహితుని ద్వారా తెప్పించాను అవిగో... వాటిని తోటలో నాటించి వస్తాను..."
"సరే జాగ్రత్తగా వెళ్ళిరా!..."
ఈశ్వర్ తన... హీరోహోండా పై టెంకాయ మొక్కలను పెట్టుకొని తోటవైపుకు వెళ్ళిపోయాడు.
"అమ్మ!.... అన్నాన్ని దించేశాను.... కూర ఏం చేయమంటావ్!..." వరండాలోకి వచ్చి అడిగింది శార్వరి.
"వంకాయలు... బెండకాయలు... చిక్కుడుకాయలు వున్నాయ్.... నీకు ఏది యిష్టమో వాటిని తరుగు...."
"వంకాయలు తరుగుతా!..."
"సరే!...."
శార్వరి లోనికి వెళ్ళిపోయింది.
హరికృష్ణ కుర్చీనుంచి లేచి "లావణ్యా!... నేను శివాలయానికి వెళ్ళి వస్తాను" అన్నాడు.
"మంచిదండి వెళ్ళిరండి."
హరికృష్ణ వీధివైపుకు.... లావణ్య వంటగది వైపుకు నడిచారు.
కారులో ఇంటికి బయలుదేరిన దీప్తి... తాను హరికృష్ణ ఇంటికి వెళ్లడం... అక్కడ జరిగిన సంభాషణ... ఈశ్వర్ తనను చూచి పలకరించకపోవడం.... ’బయలుదేరుతాను’ అని చెప్పి లేచిన తనను, లావణ్య అత్త పిలవడం.... తనకు ఇష్టమైన గారెలు, పాలు ఇవ్వడం... తల దువ్వి పూలు పెట్టడం... అన్నీ చిత్రంగా ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా జరిగినట్లనిపించింది దీప్తికి.
’మామయ్య!... చిన్ననాడు నన్ను ఎలా పలకరించాడో అదేలా అభిమానంతో పలకరించాడు. అత్తయ్య తొలుత ఆవేశంగా మాట్లాడినా, తర్వాత నా ఇష్టాన్ని మరవలేదనే దానికి నిదర్శనంగా గారెలు, పాలు ఇవ్వడం... తలలో పూలు పెట్టడం... ’ఇది మన పద్ధతి... మరచిపోయినట్లున్నావు...’ అని చెప్పడం... అంటే ఒక్క ఈశ్వర్కు తప్ప అందరూ నన్ను పూర్వంలా ఆదరించే మనస్సు వున్నవారే... ఈశ్వర్కు మాత్రం ఎందుకు నా మీద అంత కోపం!... ఆ కోపానికి కారణం నేనా!... కాదే... మరి ఎవరు?... నాన్నా!!!... నేను ఇక్కడ లేని గత అయిదేళ్ళలో ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి వుంటుంది. మామయ్య, అత్తయ్య పెద్దవారు గనుక నా పెద్దవారిపైన వున్న కోపాన్ని వారు నా మీద చూపించలేదు. కానీ ఈశ్వర్.... ఈ ఇంటికి సంబంధించిన నన్ను అసహ్యించుకొంటున్నాడు. యువకుడు కదా!... యంగ్ హ్యాండ్సమ్ మ్యాన్!... ఆ కథ నాకు ఎలా తెలుస్తుంది. అమ్మను నాన్నను అడగవద్దని మామయ్య చెప్పారు. నేను తలూపాను. వారిని అడిగితే మాట తప్పినదాన్ని అవుతాను. వారికి ఆ విషయం తెలిస్తే ఈనాడు వారు నామీద చూపిన అభిమానం స్థానంలో అసహ్యం ఏర్పడవచ్చు. నాలో నిజాయితీ లేదని అనుకోవచ్చు... అలా జరుగకూడదు. పైన వున్నాడుగా... నే నమ్మిన శ్రీ భగవాన్ రమణ గురువులు... నా ఆవేదనను వింటున్నాడుగా... వారే ఏదో దారి చూపిస్తారు... నిజాన్ని వారు ఎవరో ఒకరి ద్వారా నాకు తెలియజేస్తారు’ అనుకొంది దీప్తి. కారు వారి ఇంటి పోర్టికోలో ఆగింది. దీప్తి దిగి ఇంట్లోకి నడిచింది.
====================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 3
హాల్లో కుర్చొని వున్న ప్రజాపతి.... కూతురు లోనికి రావడాన్ని చూచి....
"అమ్మా దీప్తి!.... ఎక్కడికి వెళ్లావురా!..."
"మీతో చెప్పాను కదా నాన్నా!,.... నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నానని."
"ఆఁ....ఆఁ... చెప్పావ్!.... నిన్ను చూచి ఏమంది మీ అత్త!..."
"ఆమె ముందు మీకు చెల్లెలు, తర్వాత నాకు అత్త అయింది కదా నాన్నా! మా చెల్లెలు నిన్ను చూచి ఏమంది అని కదా నాన్నా అడగాల్సింది?..." అంది దీప్తి.
దీప్తి ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు ప్రజాపతి.
కూతురు గొంతువిని దీప్తి తల్లి ప్రణవి హాల్లోకి వచ్చింది.
"కూతురు నాకు బాంధవ్యాలను గుర్తు చేస్తూ వుంది ప్రణవీ!..." వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.
"హక్కు వుంది కనుక... చెబుతుంది... అండులో అతిశయోక్తి ఏముందండీ!" చిరునవ్వుతో చెప్పింది ప్రణవి.
ప్రజాపతి నిట్టూర్చి తలను ప్రక్కకు తిప్పుకొన్నాడు.
దీప్తి తల్లిని సమీపించి...
"అమ్మా!... అత్తయ్య వీటిని నీకోసం పంపింది" తండ్రి ముఖంలోకి చూస్తూ చెప్పింది దీప్తి.
"ఏమిటే అవి?..."వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.
"సున్నివుండలట... అవి నీకు చాలా ఇష్టం అని కూడా చెప్పిందమ్మా!"
"అవునే!.... మీ అత్తయ్య అదే నా వదిన... సున్నివుండలను ఎంతో బాగా చేస్తుంది. ఇలా ఇవ్వు..." కూతురు చేతిలోని డబ్బాను అందుకుంది.
ప్రజాపతి గుటకలు మ్రింగుతూ ప్రణవి ముఖంలోకి చూచాడు.
"రంగీ!... ఓ ప్లేటు తీసుకురా!..." కాస్త హెచ్చుస్థాయిలో పలికింది ప్రణవి భర్త ముఖంలోకి చూస్తూ.
ఆ పిలుపును విన్న పనిమనిషి రంగి పరుగున వచ్చి ప్లేటును ప్రణవికి అందించింది.
మూత తీసి ఆరు వుండలను అందులో వుంచి ప్లేటుతో ప్రజాపతిని సమీపించింది.
"తీసుకోండి..." అంది.
"నాకు అక్కర్లేదు."
"ఉదయాన్నే కదా చేయమన్నారు!..."
"నిన్ను చేయమన్నాను..."
"మనం మనుషులం... కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు వుండడం సహజమే!.... కానీ ప్రాణం లేని యీ తీపికి మనలోని వాటికి అంటగట్టడం తప్పుకదండీ!... యీ వుండలను మా వదిన పంపింది మీ కోసమే!... మీ ఇష్టాయిష్టాలు ఆమెకు తెలియంది కాదుగా!.... తీసుకోండి!..." లాలనగా చెప్పింది ప్రణవి.
"నేను చెప్పింది నీకు అర్థం కాలేదా!..." గొంతులో కరుకుదనం.
"అంతేనా!...." అంది ప్రణవి.
"అంతే!...." కుర్చీ నుంచి లేచి వరండాలోకి వెళ్ళిపోయాడు ప్రజాపతి.
"ఏంటమ్మా!... నాన్న ఇంత పెంకిగా తయారైనాడు!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.
"పాపం... పాపం చేస్తే... మనిషికి శాంతి వుండదు. ఇలాగే ప్రతి విషయానికీ కోపం, ఆవేశం వస్తుంది తల్లీ!..."
"అంటే నాన్న!..."
"మీ అత్తయ్య, మామయ్యల విషయంలో నేను ఎంతగా చెప్పినా నా మాట వినకుండా తప్పుచేశాడు!..."
"ఏం చేశాడమ్మా!..."
"పాపాన్ని!..."
"అంటే!..."
"అదో పెద్ద కథలే!... ముందు నన్ను రెండు సున్నివుండలను తిననీ!..."
"ఆఁ... ఆఁ.... తినమ్మా!.... నాకూ రెండు ఇవ్వు!...."
"ప్రణవీ!.... ఓ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు!...." అడిగాడు ప్రజాపతి.
"అమ్మా!... నీవు కూర్చొని తిను. నాన్నకు నేను మంచినీళ్ళు ఇస్తాను" వేగంగా ఫ్రిజ్ను సమీపించి బాటిల్ను చేతికి తీసుకొని సున్నివుండను నోట్లో వేసుకొని వరండాలోకి వచ్చి...
"నాన్నా!.... వాటర్...!” అంది దీప్తి.
నోటిలో సున్నివుండ ఉండడం కారణంగా... మాటల్లో స్పష్టత లోపించింది. వంగి గ్లాసును ప్రజాపతికి అందించబోయింది దీప్తి. కూతురు ముఖంలోకి చూచాడు ప్రజాపతి. తల్లోని మల్లెలు ముందు వైపుకు జారాయి.
గ్లాసును అందుకొన్నాడు ప్రజాపతి... నీళ్ళను కొంత త్రాగి... "నీ తల్లోని మల్లెపూలు!..."
"మా అత్తయ్య అంటే మీ చెల్లెలు గారు ప్రేమతో తల్లో పెట్టారు. మల్లెల సువాసన చాలా బాగుంది కదా నాన్నా!..." గోముగా అడిగింది దీప్తి.
కొన్నిక్షణాలు దీప్తి ముఖంలోకి చూచి... అవునన్నట్లు తల ఆడించి మంచినీళ్ళు త్రాగాడు ప్రజాపతి. గ్లాసును దీప్తికి అందించాడు.
"ఏం తింటున్నావ్!..."
"సున్నివుండ!..."
"వాసన చాలా బాగుంది!..." అప్రయత్నంగా ప్రజాపతి నోటినుంచి ఆ మాట జారింది.
"తీసుకురానా నాన్నా!...."
రోషం... అహంకారాల బుస... "వద్దని చెప్పానుగా!..." అన్నాడు.
"సరే!... మీ ఇష్టం!...." లోనికి వెళ్ళిపోయింది దీప్తి.
మాధవయ్య ప్రజాపతిని సమీపించాడు.
"రా మాధవా!... కూర్చో..."
మాధవయ్య ప్రజాపతికి ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు.
ప్రజాపతి సింహద్వారం వైపు ఒకసారి పరీక్షగా చూచి....
"అక్కడికి వెళ్ళావా!... మాట్లాడావా!...." మెల్లగా అడిగాడు.
"ఆ రెండూ నేను చేయవలసినవి... సవ్యంగా చేశాను!.."
"మరి... వాళ్ళేమన్నారు?..."
మౌనంగా ఆ ఉదయం హరికృష్ణ ఇంట్లో తనకు జరిగిన పరాభవాన్ని తలచుకొంటూ కూర్చున్నాడు మాధవయ్య.
అతని మౌనాన్ని సహించలేక ప్రజాపతి...
"ఏమన్నారో చెప్పరా!..."
"మీ సోదరి నా నోటికి తాళం వేసింది..."
"అంటే!..."
"ఒరే! ప్రజా!... నేను హరికృష్ణతో శార్వరి వివాహం... అన్నానో లేదో.... ఆ మహాతల్లి నీ సోదరి లావణ్య నన్ను బెదిరించింది. నిన్ను అసహ్యించుకొంది. ’సంబంధాలను కలుపుకోవాలనే మంచి మనస్సు వాడికి వుందేమో కానీ మాకు అంతటి గొప్ప మనస్సులేదు. వాడు మాకు చేసిన ద్రోహాన్ని మేము మరువలేదు. మా పిల్లలకు సంబంధాలు చూచే ప్రయత్నాన్ని మీరు మానుకోండి..’ అంది" విచారంగా చెప్పాడు మాధవయ్య.
ప్రజాపతి... కళ్ళల్లో క్రోధం... ముఖంలో చిరాకు.
"హరి ఏమీ అనలేదా!..." సాలోచనగా అడిగాడు ప్రజాపతి.
"ఆ ఇంట్లో ఆమె మాటను కాదనే ధైర్యం ఎవరికి వుందిరా!... మీ బావ సత్తా నీకు తెలీదా!..." వ్యంగ్యంగా నవ్వాడు మాధవయ్య.
హృదయంలో ఆవేశాన్ని అణచుకొని మౌనంగా వుండిపోయాడు ప్రజాపతి.
"ప్రజా!... ఓ మాట చెప్పనా!...."
"అదేమిటో చెప్పు!..."
"నీ కోర్కె నెరవేరాలంటే ఒకే ఒక్క మార్గం వుంది!..."
"ఏమిటది?..."
"నీవు వాళ్ళ ఇంటికి వెళ్ళి నావలన మీకు అన్యాయం జరిగింది... తప్పు నాది... నన్ను మీరు క్షమించాలని వాళ్ళ ఇరువురి కాళ్ళు పట్టుకోవాలి!... అది నీవు చేయగలవా!..."
"అసంభవం!..." గర్జించినట్లు అన్నాడు ప్రజాపతి.
"నీవు అంత గట్టిగా ఆ మాటంటే... నీ ఆశయం నీళ్ళమూటే!..."
"నేను గతాన్ని మరచిపోవాలనుకొంటున్నాను మాధవా!..."
"వాళ్ళు ఆ గతాన్ని మరవలేదు ప్రజా!..."
"అంటే!..."
"నీవల్ల వారి హృదయాలకు తగిలిన గాయాలు మానలేదని అర్థం..."
"అది కాదు!..."
"మరేమిటి?..."
"వారికి నాతో పంతం!...."
"ఏ విషయంలో!...."
"నా విషయంలో!..."
"అవును... అది వారికి వుండడం సహజమే కదా!.... తప్పు చేసిన నీవే మూడేళ్ళుగా ఆ ఇంటివైపు చూడని వాడివి... నిన్న నీ కొడుకు శార్వరిని నేను ఇష్టపడుతున్నాను... పెండ్లి అంటూ చేసికొంటే దాన్నే చేసికొంటాను. లేకపోతే... సన్యాసుల్లో కలిసిపోతాను నీతో చెప్పటంతోటే... నీవు నీ కొడుకు ఆనందం కోసం.... వారితో రాజీకి దిగావు. నీ పంతం సడలించావు. నన్ను రాయబారానికి పంపావు. ఇందులో పూర్తిగా నీ స్వార్థం వుంది. కానీ... వారి మాటల్లో.... ఎలాంటి స్వార్థం లేదు... వున్నదల్లా అవమాన భారం!... పౌరుషం!..."
"నా గురించి నీకు బాగా తెలుసుగా!..."
"నేను ఇరువురికీ బంధువునేగా!.... వారిని గురించీ నాకు బాగా తెలుసు!... చూడు ప్రజా!... నేను అందరి మేలు కోరేవాడిని. నామాట విను. నీవు నేరుగా వెళ్ళి నీ చెల్లికి క్షమాపణ చెప్పు. నీ చెల్లెలు లావణ్యకు నీలాగే ఆవేశం... కోపం ఎక్కువ. ఎదుటి వారి మాటలు తనకు నచ్చకపోతే నిర్భయంగా తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది. మొహమాటపడదు, భయపడదు. ఆమె మనస్సు చాలా మంచిది. ఇక హరికృష్ణ... వాడు ధర్మరాజు... వాడిని గురించి నీకు బాగా తెలుసుగా!..." అనునయంగా చెప్పాడు మాధవయ్య.
తలాడించాడు ప్రజాపతి శూన్యంలోకి చూస్తూ.
"వస్తారా... చెప్పవలసింది నీకు చెప్పాను. ఇక నీ ఇష్టం!..." మాధవయ్య లేచి వెళ్ళిపోయాడు.
ప్రజాపతి... ఆలోచనలో మునిగిపోయాడు.
* * * *
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
ప్రణవి... దీప్తి తల్లి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి హైకాలేజీ మాస్టారు. ప్రణవిని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ఆమెను బి.ఎ వరకు చదివించారు. ప్రణవి... బి.ఇడీ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది.
ప్రజాపతి శ్రీరామనవమి నాడు ప్రణవిని రామాలయంలో చూచాడు. ఆమె అందచందాలకు భ్రమించి... పలకరించి... మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ ప్రణవి అతనికి ఆ అవకాశాన్ని కలిగించలేదు.
బి.ఇడీ కాలేజి నుండి తిరిగి వస్తుండగా ఒకనాడు దారికాచి పలకరించాడు ప్రజాపతి. తన మనస్సులోని మాటను నిర్భయంగా చెప్పాడు. పెండ్లి చేసికొందాం అన్నాడు. "నేను మీకు అంతగా నచ్చితే... మీ అమ్మానాన్నలను వచ్చి నా తల్లిదండ్రులను కలిసి మాట్లాడమని చెప్పండి. ఇలా దారికాచే ప్రయత్నాన్ని ఇకపై చేయకండి. మాది ఎంతో పరువు ప్రతిష్టలున్న కుటుంబం. ఆ ఇంట్లో నేను పెద్ద బిడ్డను. నా తర్వాత ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మేము మధ్య తరగతి కుటుంబీకులం. మీ తల్లిదండ్రులు కట్నకానుకలు ఆశిస్తే.... వారు కోరిన రీతిగా ఇచ్చే స్థోమత మాకు లేదు. మీరు అడిగిన దానికి నేను అన్ని వివరాలతో జవాబు చెప్పాను. నా దారికి అడ్డు తొలగండి. ప్లీజ్!..." వేగంగా వెళ్ళిపోయింది ప్రణవి.
ఆమె మాటల తీరు... ప్రజాపతికి ఎంతగానో నచ్చింది. ఇంటికి వెళ్ళి తన నిర్ణయాన్ని తల్లి రుక్మిణికి తెలియజేశాడు. ప్రణవి తండ్రి అచ్యుతరామయ్య. రుక్మిణికి దూరపు బంధువు. భర్త కైలాసపతితో కుమారుని నిర్ణయాన్ని తెలియజేసింది.
రుక్మిణి... "పిల్లవాడు ఆశపడుతున్నాడు. పైగా వారు నాకు బంధువులు. కులగోత్రాలను ఎంచుకొన అవసరం లేదు. మీరు సరే అంటే.... వరుసకు అన్నయ్య అయిన అచ్యుతరామయ్యను పిలిపించి మనం మాట్లాడుదాము" అంది.
కైలాసపతి నిగర్వి. కోటీశ్వరుడు. ఆయన చెల్లెలు శ్యామల. గోపీనంద భార్య. వారే హరికృష్ణ తల్లిదండ్రులు... కైలాసపతి చెల్లెకి పెళ్ళిచేసిన తర్వాత తాను పెళ్ళి చేసుకొన్నాడు. వారి భార్య పేరు రుక్మిణి. వారిరువురి సంతతి... కొడుకు ప్రజాపతి, కూతురు లావణ్య. అచ్యుతరామయ్య తన భార్య రుక్మిణికి బంధువై వున్నందున... భార్యాభర్తలు ఇరువురూ కలిసి అచ్యుతరామయ్య ఇంటికి వెళ్ళి ప్రజాపతి... ప్రణవిల వివాహాన్ని గురించి ప్రస్తావించారు.
అచ్యుతరామయ్యకు రుక్మిణీ అక్క వరుసైనందున... వారిని ఎంతో గౌరవించి... "మీ నిర్ణయమే మా నిర్ణయం..." అని సవినయంగా చెప్పాడు.
మంచిరోజున నిశ్చితార్థం... మూడు వారాల తర్వాత ప్రజాపతి... ప్రణవిల వివాహాన్ని వారికి వున్నంతలో ఘనంగా జరిపించారు అచ్యుతరామయ్య. ప్రణవి, కైలాసపతి ఇంట్లో కాలు పెట్టిన వేళావిశేషం... వారు చేస్తున్న అబ్రకం వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. విదేశ ఎగుమతి పెరిగింది. లక్ష్మీదేవి వారిని పరిపూర్ణంగా కటాక్షించింది. ప్రణవికి నోములు, వ్రతాలు, పూజలు అంటే చిన్నతనం నుంచి ఎంతో ఇష్టం. కారణం ఆమె తల్లిదండ్రులు ఆ నమ్మకాలు కలిగిన వారైనందున.
కోడలు సుగుణాలను చూచి కైలాసపతి... రుక్మిణి ఎంతగానో సంతసించారు. కానీ ఏడు సంవత్సరాలు గడిచినా ప్రణవికి సంతానం కలుగకపోవడంతో కైలాసపతి... రుక్మిణి... ప్రజాపతి ప్రశాంతతను కోల్పోయారు. తన దుస్థితికి ప్రణవి తనలో తాను ఏడ్చుకొనేది.
కైలాసపతి... వేరుశెనగ, నువ్వుల నూనె ఫ్యాక్టరీని నిర్మించారు. ప్రజాపతి ఆ ఫ్యాక్టరీల అజమాయిషీని చూచుకొనేవాడు.
హరికృష్ణ తల్లి మహాలక్ష్మి కైలాసపతి చెల్లెలు. ఆ చెల్లెలన్నా ఆమె భర్త నరసింహం అన్నా కైలాసపతికి ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం.
ప్రజాపతి కన్నా హరికృష్ణ ఐదు సంవత్సరాలుపెద్ద. నరసింహం పాలవ్యాపారి. హరి పుట్టిన వేళావిశేషం... ఆర్థిక వసతులు ఏర్పడి వారు పాల ఫ్యాక్టరీని స్థాపించారు. చుట్టు ప్రక్కనున్న ఇరవై గ్రామాల నుండి వారి ఫ్యాక్టరీకి పాలు వచ్చేవి. పెరుగు, వెన్న, నెయ్యి, పాల విక్రయంతో బాటు వాటిని చెన్నైకి కూడా సప్లై చేసేవారు.
ఎం.ఎ వరకు చదివిన హరికృష్ణ ఆ పాలఫ్యాక్టరీ వ్యవహారాలను స్వయంగా చూచుకొనేవారు.
కాశీకి వెళ్ళిన నరసింహం, భార్య మహాలక్ష్మి రైలు ప్రమాదంలో మరణించారు. కైలాసపతి తన మేనల్లుడికి అండగా నిలబడి ఓదార్చాడు. అతని అభివృద్ధికి సహకరించాడు. తండ్రి నరసింహం వలె... హరికృష్ణ తండ్రికి తగిన తనయుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న కారణంగా... కైలాసపతి తన ముద్దుల కుమార్తె లావణ్యకు.. హరికృష్ణకు ఎంతో వైభవంగా వివాహాన్ని జరిపించాడు.
హరికృష్ణతో లావణ్య వివాహం జరగడం ప్రజాపతికి ఇష్టం లేదు. తండ్రిని ఎదిరించలేక మౌనంగా వుండిపోయాడు. ఆకారణంగా... తల్లిదండ్రులను గౌరవించడం మాని... వారిపై ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచుకొన్నాడు. పెద్దల సలహాలు పాటించే వాడుకాదు. తన ఇష్టానుసారం స్వేచ్ఛగా నడుచుకొనేవాడు. ఎదిగిన కొడుకు ఆ రీతిగా ప్రవర్తిస్తూ.... తమని గౌరవించకుండా అభిమానించకుండా పోయాడనే బాధ ఆ దంపతులను కృంగదీసింది.
హరికృష్ణ, లావణ్యల వివాహానంతరం తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు ప్రసవాలు జరిగాయి.
కానీ... ప్రజాపతికి... ప్రణవికి ఆరు సంవత్సరాలుగా సంతతి లేదు. ఏడవ ఏట... తొలుత ఆడబిడ్డ. ఒకటిన్నర సంవత్సరంలోనే మగబిడ్డ కలిగారు.
కైలాసపతి.... రుక్మిణి గతించి ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. మొదట రుక్మిణి... ఆ తర్వాత ఆరునెలల లోపే కైలాసపతి స్వర్గస్థులైనారు.
వదిన మరదళ్ళు ప్రణవి, లావణ్యలు ఎంతో ఒద్దికగా అక్కాచెల్లెళ్ళ వలె వుండేవారు. కాలగమనంలో ప్రజాపతి మనస్సు మారింది.
ఆ వదిన మరదళ్ళవలె హరికృష్ణ, ప్రజాపతి కూడా పరస్పరం ఎంతో ప్రేమాభిమానాలతో వుండేవారు.
ప్రజాపతికి చెల్లెలు లావణ్య అంటే పిచ్చి ప్రేమ...
మూడు సంవత్సరాల క్రిందట జరిగిన ఒక దుస్సంఘటన ఆ రెండు కుటుంబాలను వేరుచేసింది. వారి మధ్యన వుండిన ఆత్మీయతను, అభిమానాలను చంపేసింది.
కైలాసవతి... చివరిరోజుల్లో తన యావదాస్తిని రెండు భాగాలుగా చేసి కొడుకు ప్రజాపతికి, కుమార్తె లావణ్యకు వీలునామా వ్రాసి రిజిస్టర్ చేయించి ఇరువురికీ అందించాడు. లావణ్య సంతోషించింది కానీ... ప్రజాపతికి తన తండ్రి నిర్ణయం... వ్రాసిన వీలునామా నచ్చలేదు. జరిగిన సంఘటనకు ముందే వీలునామాలు సిద్ధం అయిన కారణంగా తండ్రి గతించిన తర్వాత హరికృష్ణ, లావణ్యల మీద ప్రజాపతికి కోపతాపాలను పెరిగే దానికి ఆస్థిపంపకం కూడా ఒక ముఖ్యకారణం అయింది. ప్రణవికి మాత్రం... తన మామగారు ధర్మబద్ధంగా చేశారనే సంతోషం. భర్త ధోరణిలో, మాటల్లో ఆ కుటుంబానికి సంబంధించి పగ పెరుగుతూనే వుందని గ్రహించి అతనికి ఎదురుచెప్పలేక మౌనాన్ని పాటించేది.
కొన్ని కుటుంబాల్లో మగవారు స్వార్థంతో ఇంట్లో శ్రీరాముడిగా, వీధిలో రావణాసురుడుగా ప్రవర్తించేవారు కొందరుంటారు. కానీ ఆ ఇంటి గృహిణి... భర్త తత్త్వాన్ని విమర్శించలేక... అతన్ని హెచ్చరించలేక... తన మనోవ్యధను తాను నమ్ముకొన్న దేవునికి మొర పెట్టుకొంటుంది. తన భర్త తత్త్వాన్ని మార్చమని వేడుకొంటుంది. అలాంటి కోవకు చెందింది ప్రణవి. ఆమె ప్రార్థన.... దైవ ఆరాధన.. ప్రజాపతికి అతనికి తెలియని అండదండలు.
====================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
05-08-2026, 12:59 PM
(This post was last modified: 05-08-2026, 01:00 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 4
ఉదయం... ఎనిమిదిన్నరకు టిఫిన్ తిని దీప్తి తన గదికి వెళ్ళిపోయింది. తను హరికృష్ణ ఇంటికి వెళ్ళివచ్చాక తనకు తండ్రికి మధ్యన, తండ్రికి తల్లికి మధ్యన జరిగిన సంభాషణ, ప్రజాపతి ధోరణి... దీప్తికి విచిత్రంగా తోచాయి. తాను అమెరికాకు వెళ్ళేరోజున జరిగిన సంఘటన ఆమె కళ్ళముందు నిలిచింది.
హరికృష్ణ, లావణ్య వారి పెద్దకొడుకు దినకర్ అతని భార్య పద్మిని, కూతురు వాణి, తన తండ్రి ప్రజాపతి, తల్లి ప్రణవి, తమ్ముడు సీతాపతి, బాబాయ్ మాధవయ్య తనతో చెన్నైకి వచ్చారు.
దారి పొడుగునా సరదా సరదా కబుర్లు... ఇకఇకలు పకపకలు.. అందరూ ఎంతో ఆనందంగా దీప్తికి వీడ్కోలు చెప్పేదానికి చెన్నై ఎయిర్పోర్టుకు చేరారు.
అంతమంది తనవారిని వదిలి... తన పట్టుదలతో అమెరికాలో డాక్టర్ కావాలని బయలుదేరింది దీప్తి. ఆ రోజు దివాకర్ అతని భార్య పద్మినీ కూడా అమెరికాకు తిరిగి పయనం.
అందరూ ఎయిర్పోర్టులో వ్యాన్ దిగారు. అత్త లావణ్య దీప్తి దగ్గరకు వచ్చి తన చేతులతో ఆమె భుజాలు పట్టుకొని "దీపూ!... నీవు మా నుండి దూరంగా దేశంకాని దేశానికి వెళుతున్నావు. బాగా చదివి నీ లక్ష్యాన్ని సాధించు. వారి సాంప్రదాయాలకు, మన సాంప్రదాయాలకు ఎంతో వ్యత్యాసం. అక్కడి సమాజంలో జాగ్రత్తగా మసలుకోవాలి. వెళ్ళిన పనిని సవ్యంగా ముగించుకొని తిరిగి రావాలి. మన కుటుంబాల గౌరవ మర్యాదలను మరువకూడదు. నా కోడలుగా వెళ్ళే నీవు... నా కోడలిగానే తిరిగి రావాలి. జాగ్రత్తరా... నేను చెప్పినవన్నీ మనస్సున వుంచుకో. మరువకు..." ఆ క్షణంలో లావణ్య కళ్ళల్లో కన్నీరు. వాటిని చూచిన దీప్తి... మిగతా అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.
"ఆఁ.... అదిగో మీ ఫ్లయిట్కే అనౌన్స్ మెంటు బయలుదేరమ్మా!" అంది లావణ్య.
దివాకర్, పద్మిని, అత్తామామలకు, అమ్మా, నాన్నలకు వెళ్ళొస్తాం అని చెప్పి ఎయిర్పోర్టులో ప్రవేశించారు. అందరికీ వీడ్కోలు చెప్పిన దీప్తి.... వారి వెనకాలే ఎయిర్పోర్టులో ప్రవేశించింది. నలభై ఐదు నిముషాల తర్వాత ఆ ముగ్గురూ ఎక్కిన విమానం టేకాఫ్ను చూచి మిగిలినవారు, తమ వూరు గూడూరుకు బయలుదేరారు.
అంతటి ప్రేమాభిమానాలతో ఏక కుటుంబంగా వున్న యీ రెండు కుటుంబాలు నేడు ఈ రీతిగా... రాకపోకలు లేకుండా విరోధుల్లా ఎలా మారిపోయారు?... ఏదో బలమైన కారణం వుండి వుండాలి!... అది నాకు తెలియాలి... మామయ్య ఎవరినీ అడగవద్దని ఆంక్ష పెట్టాడు. అడగలేను... ’భగవాన్! నీవే నాకు సాయం చేయాలి తండ్రీ!...’
తాను నమ్మిన గురుదేవులు శ్రీరమణ భగవానులను దీనంగా వేడుకొంది దీప్తి. తల్లి ప్రణవి దీప్తి గదిలోకి ప్రవేశించింది.
"దీపూ!... ఏం చేస్తున్నావ్!"
పడుకొని గతానికి సంబంధించిన ఆలోచనలతో వున్న దీప్తి... తల్లి పిలుపు విని లేచి మంచంపైన కూర్చుంది. చిరునవ్వుతో తల్లి ముఖంలోకి చూచింది.
ప్రణవి మంచంపైన కూర్చుంది. దీప్తి ముఖంలోకి చూచింది. ఆమె దేన్ని గురించో ఆలోచిస్తున్నదనే భావన... ప్రణవికి దీప్తి ముఖంలో గోచరించింది.
"దీపూ!...."
"ఏమ్మా!..."
"దేన్ని గురించిరా... దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావ్!..." చిరునవ్వుతో అడిగింది ప్రణవి.
"భవిష్యత్తును గురించి."
"ఎవరి భవిష్యత్తును గురించి!..."
"మన కుటుంబ భవిష్యత్తును గురించి."
"నీ గురించి కాదా!..."
"నేను అన్న మన అనేదాంట్లో నేనూ వుంటాను కదా అమ్మా!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"ఆఁ.... అవునవును... మీ బావ...." ఆగిపోయింది ప్రణవి.
"ఏమ్మా ఆపావు?..."
"తప్పుగా అనుకోకు..."
"అనుకోను..."
"నీతో మాట్లాడాడ?..."
"లేదు..."
"ఎలా మాట్లాడుతాడు!..." నిట్టూర్చింది ప్రణవి.
"ఎందుకని?..."
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
"మీ నాన్నగారి మహిమ...."
"అంటే!..."
"ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నిప్పు అంటించింది మీ నాన్నగారేగా!"
"నీ మాటలు నాకు అర్థం కాలేదమ్మా!..."
"ఆ కుటుంబానికి మీ నాన్నగారు చేసిన అన్యాయాన్ని తలచుకొంటే నా మనస్సుకు ఎంతో బాధ. నీవు అమెరికాలో వుంటివి నీకేం తెలీదుగా!.."
అవునన్నట్లు తల ఆడించింది దీప్తి.
"నేను వివరంగా చెబుతాను విను. హరికృష్ణ అన్నయ్యగారి కూతురు వాణి ఎందుకు లేచిపోయిందో నీకు తెలీదు కదా!"
"తెలీదు. కానీ పెద్దబావ దినకర్ అమెరికాలో నాతో నీవు అన్నమాటనే... అంటే వాణి ఎవరితోనో లేచిపోయిందని" దీప్తి ముగించకముందే....
"ఆ పిల్ల లేచిపోలేదు. మీ నాన్న ఆ పిల్లను అతని పేరు... కళ్యాణ్తో లేచిపోయేలా చేశారు. అతని తండ్రి రామయోగి మీ నాన్నగారికి మంచి స్నేహితుడు.
ఒకరికి తెలియకుండా ఒకరు ఎలక్షన్లో నిలబడాలనుకొన్నారు. ఇరువురూ నామినేషన్స్ వేశారు.
ఆ విషయం విన్న రామయోగి మీ నాన్నగారిని కలిశాడు. వారు మన కులం వారు కాదు. రామయోగి కులస్థులు చాలామంది వున్నారు. మీ నాన్న విత్డ్రా చేసుకొంటే... అతను తప్పక గెలిచేవాడు...
తన వద్దకు వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించిన రామయోగితో మీ నాన్న... తాను విత్డ్రా చేసికోనని నిర్మొహమాటంగా చెప్పాడు. రామయోగిని తనకు సపోర్టు చేయమన్నాడు. రామయోగి కొడుకు కళ్యాణ్, వాణి ఒకే కాలేజీలో చదివినవారు. కళ్యాణ్ మంచి అందగాడు. వాణి కన్నా ఒక సంవత్సరం సీనియర్. అతను వాణిని ప్రేమించాడు. ఎంతో తెలివైన కళ్యాణ్ వలలో వాణి పడిపోయింది. తనూ అతనిని ప్రేమించింది. వారిరువురూ కలిసి తిరగడాన్ని మీ నాన్నగారు చూచారు. వాణిని పిలిపించి విషయాన్ని అడిగాడు మీ తండ్రి. ’మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము మామయ్యా!.... మీరే అమ్మా నాన్నలతో మాట్లాడి మా వివాహాన్ని జరిపించమని’ కోరింది వాణి.
అప్పటికి అందరం... బంధుప్రీతితో వున్నందున మీ నాన్నగారు హరికృష్ణ అన్నయ్య... మీ అత్త లావణ్యతో వాణి అభిప్రాయాన్ని చెప్పి... కాలం మారింది. మనం మన తత్త్వాలు మార్చుకొని... ఒకరిపట్ల ఒకరు ఎంతగానో ప్రేమ పెంచుకొన్న వాణి, కళ్యాణ్ల వివాహానికి సమ్మతించండి అని చెప్పారు.
మీ మామయ్య, అత్తయ్యలు మీ నాన్నగారి మాటలను లెక్కచేయలేదు.
ఆవేశంలో మీ అత్త లావణ్య ’నీ బిడ్డ విషయంలో మేము నీకు అలాంటి సలహా ఇస్తే నీవు పాటిస్తావా!... సరి కులంగోత్రం లేని వాడికి నా కూతురుని ఇవ్వను. పిల్లకు మేనమామ అయ్యుండి మాతో అలాంటి మాటలు చెప్పేదానికి నీకు నోరెలా వచ్చింది!!... వెళ్ళిపో మా ముందు నుంచి వెళ్ళిపో!’ అని మీ తండ్రిని అసహ్యించుకొంది.
అవమానంతో మీ నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చారు. వారి వాలకాన్ని చూచిన నేను విషయాన్ని గ్రహించాను. ’ప్రణవీ!... నా మాటలను జాగ్రత్తగా విను. ఈ క్షణం నుంచీ ఆ ఇంటికి... ఈ ఇంటికి రాకపోకలు జరుగకూడదు. ఈ మాటలను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకో!’ వీరావేశంతో నన్ను హెచ్చరించారు. కళ్యాణ్కు ఢిల్లీ ఆర్కలాజికల్ డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది. మూడు వారాల్లో వెళ్ళి డ్యూటీలో జాయిన్ కావాలి.
రామయోగి... తన చెల్లెలి కూతురుతో కళ్యాణ్ వివాహం జరిపించి ఇరువురినీ ఢిల్లీ పంపాలని సంకల్పించి... తన నిర్ణయాన్ని కళ్యాణ్కు తెలియజేశాడు. కళ్యాణ్ తాను వాణిని ప్రేమించిన విషయాన్ని తండ్రికి చెప్పి... వివాహం అంటూ చేసుకొంటే నేను వాణినే చేసుకొంటాను. ఆమె తల్లిదండ్రులను కలసి మాట్లాడి ముహూర్తాలు పెట్టించండన్నాడు.
హరికృష్ణ అన్నయ్య.... రామయోగికి పెద్దగా పరిచయం లేదు. అతనికి బాగా సన్నిహితుడైన మీ నాన్నగారికి రామయోగి విషయాన్ని చెప్పి వాణీకి కళ్యాణ్కు వివాహం జరిగేలా చూడవలసిందిగా కోరారు. స్వార్థం... ఆ ఇంటివారు తనను అవమానించారనే ద్వేషంతో మీ నాన్నగారు రామయోగికి ఒక షరతు పెట్టారు.
’నీవు ఎలక్షన్ నామినేషన్ విత్డ్రా చేసుకొంటే.... నీ కొడుకు కళ్యాణ్కు, వాణికి వివాహం జరిగేలా చేయగలను. ఒకరోజు ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజెయ్యి!...’ అని చెప్పి రామయోగిని పంపించేశారు.
ఒక్కగానొక్క కొడుకు... మంచి ఉద్యోగం... అతడు వివాహం చేసుకోకుండా సన్యాసిగా మారడం ఇష్టం లేని రామయోగి ఎలక్షన్కు వేసిన నామినేషన్ను విత్డ్రా చేసుకొన్నారు. రెండవరోజు వచ్చి ఆ విషయాన్ని మీ నాన్నగారికి తెలియజేశాడు. మీ నాన్నగారికి ఎంతో ఆనందం.
వాణిని పిలిపించి...
’చూడు వాణీ!... నేను నీ విషయాన్ని గురించి... మీ అమ్మానాన్నలతో మాట్లాడాను. కానీ వారు కళ్యాణ్తో నీ వివాహాన్ని జరిపించేదానికి అంగీకరించలేదు. నన్ను అవమానించారు. కానీ!. నీవు నీ నిర్ణయాన్ని నన్ను నీ తండ్రిగా భావించి చెప్పినందుకు... నేను నీ వివాహాన్ని నీవు ప్రేమించిన కళ్యాణ్తో జరిపిస్తాను. అతనికి ఇప్పుడు ఢిల్లీలో వుద్యోగం వచ్చింది. హాయిగా పెళ్ళి అయిన తర్వాత మీ ఇరువురూ ఢిల్లీకి వెళ్ళిపోండి. ఇక మీ అమ్మా నాన్నల విషయం అంటావా!... ఈనాటి కోపం... కలకాలం వుండబోదు. కాలం వారి మనస్తత్వాలను తప్పక త్వరలోనే మారుస్తుంది. మనస్సుకు నచ్చిన వాడితో సహజీవనం ఎంతో ఆనందంగా వుంటుందమ్మా. ఎం.ఎస్సీ వరకూ చదివినదానివి నీకెందుకమ్మా భయం. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా... నాకు ఫోన్ చేయ్యి నీవు నా మేనకోడలివి. నీవు ఆనందంగా జీవితం సాగించేలా చేయడం నా ధర్మం.... భయపడకు... బాధపడకు’
ఆ రీతిగా... చెప్పి వాణిని తన వశం చేసుకొన్నాడు మీ తండ్రి. కన్న తల్లిదండ్రుల కన్నా మిన్నగా వాణి నీ నాన్నను నమ్మింది. మీ అత్తయ్యా, మామయ్యా శ్రీశైలం యాత్రకు వెళ్ళారు. ఆ సమయంలో రిజిష్ట్రార్ ఆఫీసులో వాణి, కళ్యాణ్లకు మీ నాన్నగారు వివాహం జరిపించారు. రెండు రోజుల తర్వాత వారితో కలిసి చెన్నై వెళ్ళి వారిని విమానంలో ఢిల్లీ పంపారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
నాలుగురోజుల తర్వాత యాత్రనుండి తిరిగి వచ్చిన మీ అత్తయ్య మామలకు మాధవయ్య బావగారు వూర్లోలేని సమయంలో జరిగిన వాణి, కళ్యాణ్ల వివాహాన్ని గురించి... వారు ఢిల్లీకి వెళ్ళిపోయిన విషయాన్ని గురించి తెలియజేశాడు.
వీర ఆవేశంతో మీ అత్తయ్య మన వాకిటికి వచ్చి... ’ఒరేయ్! ప్రజాపతీ!... రారా బయటికి. మా సమ్మతం లేకుండా నా కూతురి వివాహాన్ని కులం కాని వాడితో జరిపించే హక్కు, అధికారం నీకు ఎక్కడిదిరా!... నీచుడా!... మేము నీకు ఏం అన్యాయం చేశామురా!... నా తండ్రి ఆస్థిలో నాకు అర్థభాగం ఇచ్చాడని మాతో పగతో... అన్నెపున్నెం ఎరుగని నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశావు కదరా!... దుర్మార్గుడా!.... నీదీ ఒక బ్రతుకేనా!... ఛీ...ఛీ..." కొట్టి ఎంత ఆవేశంతో వచ్చిందో అదే వేగంతో తిరిగి వెళ్ళిపోయింది మీ అత్తయ్య.
వరండాలో మాటలుడిగి... నేను మీ నాన్న చిత్తరువుల్లా నిలబడిపోయాము.
ఆనాటి ఒక సంఘటన... మన రెండు కుటుంబాల మధ్యన... పగ, ద్వేషాలను పెంచింది. ఇది జరిగి ఈనాటికి మూడు సంవత్సరాలు. గత ఐదారు ఏళ్ళుగా నేను మీ నాన్నగారి నిర్ణయాలతో ఏకీభవించలేకపోతున్నాను. దేవుడా!... ఆయనకు మంచి బుద్ధిని ఇవ్వు అని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఆడదాన్ని పరువుకలదాన్ని అంతకంటే నేను ఏమీ చేయలేను కదమ్మా!!" అని కన్నీటితో కథను ముగించింది ప్రణవి.
సూర్యరశ్మికి కరిగిన మంచులా... ప్రణవి చెప్పిన కథ మూలంగా దీప్తి మనస్సున వుండిన సందేహాలన్నీ తీరిపోయాయి. తన తండ్రి చర్య వలన... అత్తామామలు ఎంతగానో బాధపడ్డారని గ్రహించింది... బంధువులందరికీ... తల్లిదండ్రులకు దూరం అయిన వాణీ ప్రస్తుతం ఢిల్లీలో ఆ వ్యక్తితో ఎలా వుందో అనే సందేహం!...
"అమ్మా!... వాణి ఢిల్లీలో ఎలా వుందో నీకేమైనా తెలుసా!..."
"నాకేం తెలిదమ్మా!..."
"నాన్నగారికి తెలిసుంటుందా!..."
"ఏమో!..."
"నేను ఢిల్లీకి వెళ్ళిరానా!"
"ఎందుకు?"
"వాణిని చూచి వచ్చేదానికి!..."
"వాణిని ఎందుకు చూడాలనుకొంటున్నావు?"
"వాణి వదిన చాలా మంచిదికదమ్మా!..."
"ఆ ఇంట్లో వుండే వారంతా చాలామంచివారు. ఒక్క వాణియే కాదు!..." అంది ఆవేదనతో ప్రణవి.
"అమెరికాలో నేనుండే చోటికి పెద్దబావ దినకర్ నెలకు రెండుసార్లు వచ్చి నన్ను కలిసేవాడు. వాణి విషయాన్ని నాకు వారే చెప్పారు. నెలకొకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. ’నేను నిన్ను ఎత్తుకొని తిరిగేవాణ్ణి దీపూ!...’ అని చిన్ననాటి జ్ఞాపకాలను నాతో చెప్పేవాడు. అక్క... పద్మినీ, నన్ను సొంత చెల్లెలిలా చూచుకొనేది" సాలోచనగా చెప్పింది దీప్తి.
"దీపూ!... నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి!’"
"నేను నీ కూతురునమ్మా!... అడుగు!..."
"నీకు మీ ఈశ్వర్ బావ అంటే ఇష్టమేనా!"
దీప్తి ఆశ్చర్యంతో తల్లి ముఖంలోకి చూచింది.
"ఏందే!... అలా చూస్తున్నావ్!... నా ప్రశ్నకు జవాబు చెప్పు!..." అంది ప్రణవి.
"ఆ ప్రశ్నను నీవు నన్ను ఎందుకు అడిగావ్?"
"బుద్ధిలేక!" వ్యంగ్యంగా అంది ప్రణవి రెండు క్షణాల తర్వాత "ఎక్కడికి పోతాయ్!... పాడు బుద్ధులు! ఎదుటి వాళ్లను అవహేళన చేయడం, మీ రక్తంలో వున్న సద్గుణం" నిష్టూరంగా అంది ప్రణవి.
దీప్తి తల్లిని సమీపించి ఆమె భుజాలపై తను చేతులు వుంచి ప్రణవి ముఖంలోకి సూటిగా చూస్తూ "మా అమ్మ చాలా చాలా మంచి అమ్మ!" నవ్వుతూ "నీవు చెప్పు నీకు ఇష్టమేనా!..."
"ఏమిటి?"
"అదే, నీవు నన్ను అడిగిన విషయం!..."
"అదా!... అదృష్టం ఉండాలి..."
"దేనికి!..."
"ఈశ్వర్కు ఇల్లాలు కావడానికి!..."
"ఏం ఆయన అంత గొప్పా!..." వెటకారంగా అడిగింది దీప్తి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
"అవును... చాలా గొప్ప. నీకు మీ పెద్ద బావ దినకర్ చెప్పాడో లేదో... ఈశ్వర్ను అమెరికాకు రమ్మని పోయినసారి సంవత్సరం క్రింద వచ్చినప్పుడు ఎంతగానో చెప్పాడట. దానికి ఈశ్వర్... "ఏమన్నాడు!..." ఆత్రంగా అడిగింది దీప్తి ప్రణవి పూర్తి చేయకముందే.
"అన్నయ్యా!... అమ్మా నాన్న మన నలుగురినీ నాకు తెలిసినప్పటి నుంచీ ఎంతో గారాబంగా పెంచారు. మన ఇష్టానుసారం చదివించారు. నీవు అమెరికాకు వెళ్ళాలని ఆశపడ్డావు. మన కుటుంబానికి తగిన సంబంధాన్ని చూచి నీ కోరికపై వదినకు నీకు పెళ్ళి జరిపించి మిమ్మల్ని అమెరికాకు పంపారు. వాణి వారి ఆశలనన్నింటినీ కాల్చి భస్మం చేసి తన దారిన తను చూచుకొని మనకు తనకూ ఎలాంటి సంబంధం లేదని వెళ్ళిపోయింది. ఇక చెల్లి శార్వరి... మనందరి కంటే చిన్నది. మనలాగే బాగా చదవాలి. వాణి అక్కయ్యలా కాకుండా ఆమె వివాహం అమ్మా నాన్నల ఇష్టానుసారంగా జరగాలి. అమ్మా నాన్నలు... పెద్దవారవుతున్నారు. వారికి సాయంగా అండగా నేను వుండాలని నిర్ణయించుకున్నాను. శార్వరి చదువు పూర్తి అయ్యేవరకే నేను ఆమెకు తోడుగా హైదరాబాదులో వుంటాను. తర్వాత మన వూరికి వచ్చి నాన్నగారు నిర్వహించే పాలవ్యాపారాన్ని... ఫ్యాక్టరీని చూచుకొంటాను. మనకు రెండు వందల ఆవులకు పైగా వున్నాయి. గోవుల సంరక్షణ అంటే నాన్నకు అమ్మకు నాకు ఎంతో ఇష్టం. వారి ఆనందమే నా ఆనందం. మన వూర్లో వుండి అమ్మా నాన్నలను చూచుకొంటూ నాన్న చేస్తున్న వ్యాపారాన్ని సాగిస్తూ... నాన్నగారికి విశ్రాంతి నివ్వాలనేది నా నిర్ణయం. వాటినన్నింటినీ చూచుకొంటూ న్యాయవాది వృత్తిని సాగిస్తాను.
"అలా అన్నాడు ఈశ్వర్!..." అంది ప్రణవి.
"అమ్మా!.... ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు?"
"మా వదిన చెప్పింది..."
"అంటే నీకు మీ వదినకు మధ్యన...."
"సఖ్యతే! ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు" నవ్వింది ప్రణవి. రెండు క్షణాల తర్వాత "ఆఁ ఇప్పుడు చెప్పు నా ప్రశ్నకు నీ జవాబు!" అడిగింది ప్రణవి.
"వెరీ సింపుల్ అమ్మా!..."
"ఎందే సింపుల్!..."
"అంటే!... నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా!..." చిరునవ్వుతో చెప్పింది దీప్తి.
"నిజంగానా!...."
"అవునమ్మా!..." గోముగా చెప్పింది దీప్తి.
తన చేతుల్లోకి దీప్తి ముఖాన్ని తీసుకొని నొసటన ముద్దుపెట్టి... " నా బిడ్డ బంగారు!" ఆనందంగా చెప్పింది ప్రణవి.
దీప్తి నవ్వుతూ తల్లి ఒడిలో వాలిపోయింది.
దీప్తి తల నిమురుతూ....
"తల్లీ!...."
"ఏమ్మా!...."
"మీ నాన్నగారు సామాన్యులు కారు... వారు మన నిర్ణయానికి అంగీకరించరు. అప్పుడు ఏం చేస్తావు తల్లీ!..." విచారంగా అడిగింది ప్రణవి.
"నాన్నగారు నా మాటను కాదరనుకొంటానమ్మా!..."
"కాదంటే!..."
"నీవు నాకు అండగా వుంటావుగా!... నాన్నగారికి బెదిరిపోయి నీ నిర్ణయాన్ని మార్చుకోవు కదా!..."
"తల్లీ!.... వారి ముందు మాట్లాడి వారికి ఆవేశాన్ని పెంచకూడదని నా నిర్ణయం. ఇక నీ విషయంలో వారు ప్రస్తావించినా మనది మౌన ముద్రే. ఓటు నీకే!.. నా నిర్ణయం మారదు..." నవ్వుతూ చెప్పింది ప్రణవి.
"అమ్మా!...." సీతాపతి పిలుపు.
ఇరువురూ బెడ్రూం నుండి హాలువైపుకు నడిచారు.
"అమ్మా అసలు విషయం చెప్పలేదు!..."
"ఏమిటే!..."
"నాన్న ఎలక్షన్లో..."
"డిపాజిట్ పోగొట్టుకొన్నారు!..." వెటకారంగా నవ్వింది ప్రణవి.
దీప్తిని చూచిన సీతాపతి దగ్గరకు వచ్చి...
"అక్కా!... ఎంతగా మారిపోయావు..." ఆశ్చర్యంతో అడిగాడు.
"సీతూ!.... నీవు మాత్రం మారలేదా!... ఆరడుగుల అందగాడిలా మారిపోయావ్!..." ప్రీతిగా తమ్ముడి భుజంపై చెయ్యివేసి అతని ముఖంలోకి చూచింది దీప్తి.
"పెదబావా!... అక్కవాళ్ళు బాగున్నారా అక్కా!..."
"అంతా బాగున్నారు... ఎలా సాగుతోంది నీ బి.టెక్. చదువు వైజాక్లో!..."
"బాగుంది అక్కా!.... గోల్డుమెడల్ గెలవాలని ప్రయత్నిస్తున్నా!..."
"అమ్మా!.... నాన్నగారు ఏరి?" అడిగాడు సీతాపతి.
"చెన్నై వెళ్లారు వ్యాపార విషయంగా. రేపు తెల్లవారేసరికి దిగుతారు."
"అక్కా! దీపక్... నీతూలు ఎలా వున్నారు?"
"ఆఁ.... వాళ్ళకేం తక్కువ. ఆ ఇంట్లోవారు యువరాజా.... యువరాణి... నీతూ వుంది చూచావ్.... అది అంతా మన అత్తయ్యలాగేరా!.... భయం అనేది లేదు... మహా సాహసి" నవ్వింది దీప్తి.
"అమ్మా!.... మీరు భోం చేశారా!..."
"లేదురా..."
"నేను స్నానం చేసి వస్తానమ్మా!..... కలిసి భోం చేద్దాం. అక్కతో కూర్చుని భోంచేసి చాలాకాలం అయింది" సీతాపతి నవ్వి తన గదికి వెళ్ళిపోయాడు.
"అమ్మా!.... సీతూ ఎంతగా మారిపోయాడమ్మా!.... పెద్దమనిషిలా ఎంతో నీట్గా మాట్లాడుతున్నాడు?..."
"వాడిది నా పోలిక!..."
"మరి నేనూ!....." బుంగమూతితో అడిగింది దీప్తి.
"తల్లీ నీవూ నా పోలికేనే... పద.... వాడు ఎప్పుడు తినాడో ఏమో!... అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెడదాం..."
తల్లీకూతుళ్ళు వంటగది వైపుకు నడిచారు.
====================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 5
"హలో!...." మ్రోగిన సెల్ఫోన్ చేతికి తీసుకొని అడిగాడు హరికృష్ణ.
"హలో... హరీ!.... నేనురా!.... శివ..."
"ఒరేయ్!... శివా!... నీవా!.... గొంతు మారిందేం!...."
"అవునురా... వయస్సు అవుతూ వుందిగా!...."
"వస్తానని జాబు వ్రాశావు... ఎప్పుడు వస్తావ్?"
"అరగంటలో మన వూరి స్టేషన్లో దిగుతా!.... నేను ఒక్కడినే రావడం లేదు. మీ చెల్లెలు, విష్ణు.... నాతో వస్తానని బయలుదేరారు."
"అలాగా!... చాలా సంతోషం రా!.... నేను స్టేషన్కి వస్తాను."
"సరే కట్ చేస్తున్నా!..."
"అలాగే!..."
వంటింట్లో నుంచి వచ్చిన లావణ్య.
"ఎవరండీ ఫోన్ చేసింది!" అడిగింది.
"మీ అన్నయ్య శివ... ఊర్మిళా, విష్ణు మరో అరగంటలో వస్తున్నారట..."
"అలాగా!..."
"అవును లావణ్యా! నేను స్టేషన్కు వెళ్ళి వారిని పిలుచుకొస్తాను... వాడు ఈ వూరికి వచ్చిఎనిమిదేళ్ళయిందిగా!..."
"అవును... నాకూ పని పూర్తయింది. నేనూ వస్తానండి స్టేషన్కు..."
"అలాగే!.... ఆఁ... పిల్లలేరి?..."
"శివాలయానికి వెళ్ళారు. యీ పాటికి తిరిగి వస్తూ వుంటారు."
వీధి తలుపు తెరిచిన శబ్దం విని అటువైపు చూచింది లావణ్య.
ఈశ్వర్, శార్వరీలు నవ్వుకొంటూ లోనికి వచ్చారు.
"ఈశ్వర్!.... మీ శివ మామయ్య, అత్తయ్యలు వస్తున్నారు" చెప్పింది లావణ్య.
"ఎప్పుడమ్మా?..."
"మరో అరగంటలో!..." చెప్పాడు హరికృష్ణ.
"నేను నాన్న స్టేషన్కు వెళ్ళి వాళ్ళను రిసీవ్ చేసికొని వస్తాం. మీరు ఇంట్లో వుండండి."
"అలాగే అమ్మా!...." అంది శార్వరి.
"నాన్నా!.... నేను వెళ్ళిరానా!" అడిగాడు ఈశ్వర్.
"వద్దు నాన్నా!.... నేను వెళితేనే మీ మామయ్య ఆనందిస్తాడు. ఎనిమిదేళ్ళ తర్వాత వస్తున్నారు" అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
"వస్తున్నారు అంటే!" అడిగాడు ఈశ్వర్.
"మీ అత్తయ్య ఊర్మిళ, విష్ణు కూడా వస్తున్నారట. ఈశ్వర్!... అందువల్ల మేమిద్దరం స్టేషన్కు వెళ్ళి వారితో వస్తాం" చెప్పింది లావణ్య.
"అలాగే అమ్మా! వెళ్ళిరండి..."
"ఏమండి... ఇక మనం బయలుదేరుదామా!..."
"ఆ పద..."
భార్యాభర్తలు కార్లో కూర్చున్నారు. వరండా వరకూ వచ్చి ఈశ్వర్, శార్వరీలు టాటా చెప్పారు. హరికృష్ణ కారును స్టార్ట్ చేశాడు. కారు వీధిలో ప్రవేశిందింది.
"ఏమండీ!..."
"చెప్పు లావణ్యా!..."
"పాపం విష్ణు... వాడికి చూపు రాదు కదూ!..."
"రాదూ అని మనం నిర్ధారణగా ఎలా చెప్పగలం. ఆ దైవం తలచుకుంటే... కానిది... లేనిది... అనేవి వుంటాయా లావణ్యా!..."
"మీకు దైవం మీద చాలా నమ్మకం కదండీ!..."
"నీకు లేదా!...."
"రామ రామ ఎంతమాట!... లేదని ఎలా అనగలనండీ!..."
"అయితే... విష్ణుకు కళ్ళు రావాలి స్వామీ... వాడు మమ్మల్నందరినీ నీవు సృష్టించిన ఈ ప్రపంచంలోని అన్ని అందాలను చూచి ఆనందించాలని కోరుకో. వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను ఆ సర్వేశ్వరుని అదే కోరుకుంటాను."
"మీ నమ్మకమే.... వాడికి శ్రీరామరక్ష కావాలి."
"నీవూ నాలా కోరితే... అ దేవుడు విష్ణును తప్పక కరుణిస్తాడు." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.
"తప్పక నిత్యం కోరుకుంటానండి. వారు వైజాగ్ వెళ్ళిపోయి ఇరవై సంవత్సరాలు. అప్పటికి వాడి వయస్సు మూడేళ్ళు. అంటే విష్ణు వయస్సు ఇప్పుడు ఇరవై మూడు. శార్వ కన్నా మూడేళ్ళు పెద్దవాడు."
"అవును లెక్కల్లో నీవు జీనియస్ లావణ్యా!" నవ్వాడు హరికృష్ణ.
"మీరేగా నేర్పారు" చిరునవ్వుతో భర్త ముఖంలోకి చూచింది లావణ్య.
వారి కారు స్టేషన్ ఆవరణంలో ప్రవేశించింది. పార్కింగ్ స్థలంలో కారును ఆపి... రెండు ప్లాట్ఫాం టిక్కెట్లను కొన్నాడు హరికృష్ణ. ఇరువురూ స్టేషన్లో ప్రవేశించారు.
జమ్ముతావి ఎక్స్ ప్రెస్ ఐదుగంటలు ఆలస్యంగా వచ్చింది. అనౌన్స్ మెంటు విని హరికృష్ణ, లావణ్యలు ఆ ప్లాట్ఫాంను చేరారు. రైలు వచ్చి ఆగింది.
శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు కంపార్టుమెంటు నుండి దిగారు. ఆ ముగ్గురిని చూడగానే హరికృష్ణ లావణ్యలు నవ్వుతూ వారిని సమీపించారు. శివరామకృష్ణ చిరునవ్వుతో హరికృష్ణను కౌగలించుకొన్నాడు. లావణ్య ఊర్మిళ చేతులు పట్టుకొని... "వదినా!.... బాగున్నావా!..." ప్రీతిగా అడిగింది.
"సంవత్సరం రోజులుగా నిన్ను చూడాలనుకొన్న నా ప్రయత్నం... ఈనాటికి ఫలించిందిరా!..." నవ్వుతూ చెప్పాడు శివరామకృష్ణ.
చేతికర్ర సాయంతో విష్ణు హరికృష్ణను సమీపించాడు. ఆరు అడుగుల ఎత్తు... తెల్లని దేహచ్ఛాయ, గుండ్రటి ముఖం, ఒత్తైన జుట్టు అన్నీ ఎంతో గొప్పగా వున్నా దృష్టిలేని కారణంగా విష్ణు ఎవరినీ దేనినీ చూడలేని పరిస్థితి.
"మామయ్యా!.... అత్తయ్యా!.... బాగున్నారా!..." నవ్వుతూ అడిగాడు విష్ణు.
విష్ణు భుజంపై చెయ్యివేసి "మేమంతా బాగున్నాము. నీవూ వీళ్లతో రావడం నాకు ఎంతో సంతోషంరా!..." నవ్వుతూ చెప్పాడు హరికృష్ణ.
"సరే... ఇక పదండి... వదినా!... అన్నయ్యా!.... ఇంటికి వెళ్ళి అన్ని విషయాలూ భోంచేస్తూ మాట్లాడుకొందాం" అంది లావణ్య.
"విష్ణు చేతిని పట్టుకొని... విష్ణు జాగ్రత్తగా నడు" అంది.
ఐదుగురూ స్టేషన్ బయటికి వచ్చారు. కార్లో కూర్చున్నారు. పదిహేను నిముషాల్లో హరికృష్ణ కారును పోర్టికోలో ఆపాడు. అందరూ దిగారు.
వారి రాకకోసం... ఎదురు చూస్తున్న ఈశ్వర్, శార్వరీలు వారిని సమీపించారు. ఒకరినొకరు అభిమానపూర్వక పలకరింపులతో నవ్వుకొన్నారు.
ఈశ్వర్, విష్ణును సమీపించి అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని... "విష్ణూ!"
"ఎవరూ?..."
"నేనురా... ఈశ్వర్ని..."
"ఓ... బావా... మీరా!... గొంతు విని చాలాకాలం అయిందిగా! వెంటనే గుర్తుపట్టలేకపోయాను బావా!... సారీ!..."
"రా లోనికి వెళదాం..."
అందరూ హాల్లోకి ప్రవేశించారు. ఈశ్వర్ రెస్టు రూము వైపు వెళ్లాడు.
"బావా! ఊర్మిళా!... ముందు స్నానం చేయండి. ఎప్పుడు ఏం తిన్నారో ఏమో!.... భోజనం చేస్తూ మాట్లాడుకొందాం" అన్నాడు హరికృష్ణ.
"అలాగేరా!...." చెప్పాడు శివరామకృష్ణ.
"వదినా!.... నీకోడలు..." తన కూతురు శార్వరిని చూపి నవ్వుతూ చెప్పింది లావణ్య.
"నమస్తే అత్తయ్యా!" చిరునవ్వుతో చెప్పింది శార్వరి.
"ఇలారా!..." పిలిచింది ఊర్మిళ.
శార్వరి ఆమెను సమీపించింది.
"శారూ!... ఎంతగా ఎదిగిపోయావే.. ఏం చదువుతున్నావ్!"
"బి.ఎస్సీ ఫైనల్ ఇయర్"
"ఎక్కడ?"
"హైదరాబాద్లో"
"ఈశ్వర్ ఉద్యోగమూ అక్కడేగా!"
"అవును అత్తయ్యా!...."
రెస్టురూమ్కు వెళ్ళి హీటర్ ఆన్ చేసి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.
"మామయ్యా!.... మీరు స్నానానికి రండి..."
"వెళ్ళరా... స్నానం చేసిరా!..." అన్నాడు హరికృష్ణ.
"అలాగేరా!..."
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
ఈశ్వర్ వెంట శివరామకృష్ణ రెస్టు రూమ్ వైపుకు నడిచాడు.
సోపు... టవల్ శివరామకృష్ణకు అందించి ఈశ్వర్ హాల్లోకి వచ్చాడు.
"అత్తయ్యా!.... మీరూ రండి. నీళ్ళు కాగాయి. స్నానం చేద్దురుగాని!...." చెప్పింది శార్వరి.
ఊర్మిళ... శార్వరి వెనకాల ఆమె గదిలోనికి వెళ్ళింది.
ఈశ్వర్... విష్ణు ప్రక్కన కూర్చున్నాడు.
"విష్ణూ! మామయ్యగారు రావడంతోనే... నీవూ స్నానం చేస్తావుగా!"
"అవును బావా!..." కొన్ని క్షణాల తర్వాత అడిగాడు విష్ణు.
"బావా!"
"ఏమిటి విష్ణు"
"మీరు ప్రాక్టీస్ ప్రారంభించారుగా!..."
"ఆ... రెండేళ్ళయింది. శార్వరి హైదరాబాదులో చదువుతుందిగా అందువల్ల అక్కడ ఓ సీనియర్ లాయర్గారి వద్ద ప్రస్తుతం పనిచేస్తున్నాను. మరో మూడునెలల్లో శార్వరి బి.ఎస్సీ పూర్తి అవుతుంది అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభిస్తాను."
"శార్వరి బి.ఎస్సీ తర్వాత ఏం చేయాలనుకొంటూవుంది."
"ఎం.బి.బి.యస్ చేయాలని తన వుద్దేశ్యం..."
"ఓహో తనకు డాక్టర్ కావాలనే ఆశ అన్నమాట."
"అవును విష్ణు"
"బావా!... మీ అన్నయ్య నా పెదబావగారు... యు.ఎస్లో వున్నారుగా!... అక్కడికి పోవచ్చుగా!..."
"అమ్మానాన్నలకు ఇష్టం లేదు. వారికి ఇష్టంకాని పనిని నేనూ, శారూ... చేయము విష్ణు."
"అవును మామయ్యా, అత్తయ్యా చాలా మంచివారు. వారిని మీరు ఏ విషయంలో ఎప్పుడూ నొప్పించకండి..."
"విష్ణు! ఎంత గొప్పగా మాట్లాడుతున్నావురా!..."
"అంతా మీరు నా చిన్నప్పుడు నాకు ఇచ్చిన శిక్షణ. మరిచిపోలేదు, పాటించాను. నా గురువులు మీరే!..." నవ్వాడు విష్ణు.
శార్వరి హాల్లోకి వచ్చింది.
"అరుగో మామయ్యగారు వచ్చారు. అన్నా!.... విష్ణును త్వరగా స్నానం చేసి రమ్మను" అంది శార్వరి.
"ఏం నీవే వాడికి చెప్పవచ్చుగా!" నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.
శార్వరి అన్నను సమీపించి తలను వంచి అతని చెవి దగ్గర వుంచి... "నీ కన్నా ఎత్తుగా ఎదిగాడు. అతనికి నేను ఏమని చెప్పాలి!..." అంది.
"చిన్నప్పుడు ఏమని పిలిచేదానివి!..."
"విష్ణు అని..."
"ఇప్పుడూ అలాగే పిలువు..." నవ్వాడు ఈశ్వర్.
"బావా! నా గురించి శార్వరి నీతో ఏదో చెబుతూ వుంది కదూ!..." అడిగాడు విష్ణు.
"అవునురా!..."
"ఏమడిగింది?"
శార్వరి తన చేతితో ఈశ్వర్ నోరు మూసింది.
కొన్ని క్షణాలు గడిచాయి.
"ఏం బావా!... ఏం మాట్లాడవు?" అడిగాడు విష్ణు.
"అమ్మ అన్నీ భోజనానికి సిద్ధం చేసింది. మీరు వెళ్ళి స్నానం చేస్తే అందరం కలిసి భోంచేయవచ్చు" అంది శార్వరి.
"అలాగా!.." అన్నాడు విష్ణు. క్షణం తర్వాత "శార్వరీ! బావ ఇక్కడ లేడా!...."
"ఆఁ ఇక్కడే వున్నారా!... పద స్నానం చేద్దువుగాని" శార్వరి చేతిని తన చేతితో ప్రక్కకు నెట్టి చెప్పాడు ఈశ్వర్.
విష్ణు లేచి నిలబడ్డాడు.
"శారూ!.... విష్ణును రెస్టురూమ్ దాకా తీసుకొని వెళ్ళు.. టవల్, సోప్ ఇచ్చిరా!" చెప్పాడు ఈశ్వర్.
విష్ణు నేలకు పూనిన కర్ర చివరను తన చేతిలోనికి తీసుకొంది. "జాగ్రత్తగా రండి" అంది శార్వరి.
విష్ణు ఆమెను అనుసరించాడు. ఇరువురూ ఈశ్వర్ రెస్టు రూమ్ను సమీపించారు.
చేతిలోని కర్రను వదలి శార్వరి రెస్టురూం తలుపును తెరిచింది. బకెట్లో వేడినీళ్ళు నింపింది. స్టీల్రాడ్ పై టవల్ను వుంచింది.
వాకిట నిలబడివున్న విష్ణును చూచింది. కళ్ళు లేవు... కానీ ఆ బాధ అతని ముఖంలో కనిపించలేదు. ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడి వున్నాడు.
"శార్వరీ!... ఇక నీవు వెళ్ళు... నేను చూచుకొంటాను."
"ఎలా?..."
"మనోనేత్రంతో....!" నవ్వాడు విష్ణు.
శార్వరి గదినుండి బయటికి వచ్చింది. కర్ర సాయంతో విష్ణు తడుతూ రెస్టురూంలోకి ప్రవేశించాడు.
"థ్యాంక్యూ శార్వరి!"
"నో...నో... నేనేం చేశానని!"
"గొప్పవారు ఇతరులకు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోరు!"
"నేను మీరంటున్నంత గొప్పదాన్ని కాను. మీరు మా బంధువులు... మా ఇంటికి వచ్చారు. అన్నయ్య చెప్పాడు. వాడు చెప్పినట్లు చేశాను. అది నా ధర్మం. అంతే! మీరు నాకు ధన్యవాదాలు చెప్పవలసినంత విశేషమైన పనిని నేను ఏమీ చేయలేదు."
"ఓకే... ఓకే!.." నవ్వుతూ తలుపు మూసుకొన్నాడు విష్ణు.
తలుపు దగ్గరకు జరిగి... "బకెట్కు పైన గోడకున్న రాడ్పై టవల్ దానికింద... సోప్ కిట్లో సబ్బు వున్నాయి" చెప్పింది శార్వరి.
"చూచాను... అదే తాకి చూచాను" అన్నాడు విష్ణు.
శార్వరి తన అన్నయ్య దగ్గరకు వచ్చింది.
"పాపం అన్నయ్యా!..."
"ఏందిరా పాపం!..."
"విష్ణు విషయంలో!...."
ఈశ్వర్ నిట్టూర్చి... "వాడి విషయంలోనా!... అవును..."
"అతనికి చూపు వచ్చే ఆస్కారమే లేదా అన్నయ్యా!"
"మనకెలా తెలుస్తుందిరా!... వాణ్ణి మంచి డాక్టర్కు చూపించి సంప్రదించాలి"
"మనం ఆ పని చేయలేమా!.... ఆఁ... దీప్తి వదిన డాక్టరేగా!.... ఈ విషయంలో మనం ఆమె సలహా తీసుకొందామా!...."
"దాన్ని నేను అడగను!..."
"మరి నేను అడగనా!..."
"అది నీ ఇష్టం..."
"ఒరేయ్! అన్నయ్యా!... దీప్తి వదినంటే నీకెందుకు అంత చిరాకు!..."
"అబ్బా!...." అటూ ఇటూ తలాడించి.. "శారూ! నీతో నేను ఆ విషయాన్ని గురించి చర్చించదలచుకోలేదు. ఇక డాక్టర్ విషయమా నాకు వదిలై. నేను నీకు రేపు చెబుతాను. హూ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ అనే విషయం!"
"ఎవరిని కనుక్కొంటావ్?"
"నాకు ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో మంచి పరిచయం వుంది శారూ!... వారిని అడిగి కనుక్కొంటాను."
"అలాగా!"
"అవును"
విష్ణు స్నానం చేసి వచ్చాడు. ఈశ్వర్తో కలిసి అతని గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకున్నాడు.
అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. శార్వరి, లావణ్యలు భోజనాన్ని వడ్డించారు. సరదా కబుర్లతో హరికృష్ణ, శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు, ఈశ్వర్లు భోజనం చేశారు. హరికృష్ణ, శివరామకృష్ణాలు... హరికృష్ణ గదికి, ఈశ్వర్, విష్ణు ఈశ్వర్ గదికి వెళ్ళిపోయారు. ఊర్మిళ లావణ్యకు, శార్వరికి వడ్డించింది. అందరి భోజనాలు ముగిశాయి. ఆడవారు ముగ్గురూ శార్వరి గదికి వెళ్ళిపోయారు. ప్రయాణ బడలికతో శివరామకృష్ణ, ఊర్మిళ, విష్ణు మంచాలపై వ్రాలి నిద్రపోయారు. ఆ ఇంటివారూ నిద్రకు ఉపక్రమించారు.
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 1 user Likes k3vv3's post:1 user Likes k3vv3's post
• gora
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,007 in 2,574 posts
Likes Given: 8,549
Joined: Nov 2018
Reputation:
894
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 6
మిత్రులు... బంధువులు హరికృష్ణ, శివరామకృష్ణలు. శివరామకృష్ణగారి తల్లి హరికృష్ణగారి మేనత్త. పేరు శాంభవి. ఆమె బ్రతికి వున్నరోజుల్లో ఊరిజనం ఆమెను ’దేవతమ్మ’ అని పిలిచేవారు. కారణం... ఆమె తను... భర్త మహేశ్వర్... వారు తమ కుటుంబం మాత్రం బాగుండాలనే రకం కాదు. నా వూరు... నా వూరి జనం అంతా బాగుండాలని ఆశించేవారు. శాంభవి పేదలకు దానధర్మాలు చేసేది. ఎవరు ఏది అడిగినా లేదని ఆమె ఎన్నడూ తన జీవిత కాలంలో అనలేదు. అందుకే ఆ పేరు పెట్టారు ఆ వూరి జనం. ఆమె మేనమామ ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం, శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ బావమరుదులు.
ఆ మూడు కుటుంబాల ముందు తరం సభ్యులు... ఆ వూరిలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో బ్రతికినవారు. సంపన్నులు.
శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్. ప్రజాపతి తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం. బంధుత్వాలకు అతీతంగా మంచి స్నేహితులు.
ఆ రోజుల్లో గూడూరు ప్రాంతంలో మైకా వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. ప్రజాపతి తండ్రి కైలాసపతి ఆ వ్యాపారంలో ఎంతో సంపాదించాడు. అతన్ని చూచి శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ వున్న భూమిలో మైకా పడుతుందని తానూ కైలాసపతి వలే (అన్నగారు) లక్షలు సంపాదించాలనే ఆశతో కొంత భూమిని అమ్మి, వుంచుకొన్న భూమిలో అబ్రకం పడుతుందని సొరంగాలు త్రవ్వించాడు. అబ్రకం పడింది కానీ... క్వాలిటీ లేనిదైంది. విదేశీయులు... తరం తక్కువగా వున్న అబ్రకాన్ని కొనలేదు. దళారులు నూరు రూపాయలు విలువగల సరుకును పది పదిహేనుకు కొనేవారు.
మహేశ్వర్కు పంతం పెరిగి శివరామకృష్ణ (తనయుడు) అర్థాంగి శాంభవి చెప్పిన మాటలను వినక... మూర్ఖంగా అప్పులు చేసి మంచి అబ్రకాన్ని తన భూమిలో నుంచి తీయాలని గోతులు (ఎంతో లోతుగా) త్రవ్వించాడు. ఫలితం శూన్యం. మనశ్శాంతి నశించింది. మందుకు అలవాటు పడ్డాడు. వ్యాపారం పూర్తి నష్టానికి గురైంది. మనిషి అనారోగ్యం పాలైనాడు. భర్త ఆ రీతిగా తయారైనందుకు ఎంతో మంచిపేరున్న శాంభవి కూడా మనోవేదనతో మంచం పట్టింది. భర్త అంటే గౌరవం, ప్రేమ. ఎదిరించలేదు, విమర్శించలేదు. హృదయంలో భర్త విషయం ఎంతో ఆవేదన.
ఆ సమయంలో ఆ కుటుంబ గౌరవాన్ని వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బాగా తెలిసిన ఓ కుటుంబం మద్రాస్ నుంచి ఎం.ఎ పాసై వచ్చిన శివరామకృష్ణకు పిల్లనిస్తామంటూ గూడూరుకు వచ్చారు. కుటుంబ పరిస్థితి సరిగాలేదని తెలిసీ వారు తమ బిడ్డను యిచ్చేదానికి ముందుకు వచ్చారంటే దానికి కారణం కాలేజీలో శివరామకృష్ణ... ఊర్మిళ కలిసి చదువుకొన్నారు. ప్రేమించుకొన్నారు, వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నారు.
శివరామకృష్ణను ఊర్మిళ.... తన తల్లితండ్రులకు పరిచయం చేసిన రోజున.
"అవును అబ్బాయ్!.... పేరు... వూరు... కులం... గోత్రం అంతా బాగానే వుంది. ఆస్తిపాస్తులు ఏమాత్రమో చెప్పు!" అడిగాడు ఊర్మిళ తాత వెంకటరమణ.
అబ్రకం వ్యామోహంతో తన తండ్రి చేసిన నిర్వాకాన్ని... కలిగిన నష్టాన్ని గురించి వివరంగా చెప్పాడు శివరామకృష్ణ.
"తిండికి గుడ్డకు కొరతలేదండీ!.... ఎం.ఎ, బి.ఇడి ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. నామీద నాకు నమ్మకం వుంది. నా చూపు నాకంటే పేదవారి వైపే వుంటుంది కాని... మాకంటే గొప్పవారిపైన వుండదు. అది మంచిది కాదని మా తాతయ్యగారు చెబుతుండేవారు. మీ అమ్మాయికి ఏ కొరతా లేకుండా చూచుకోగలను. ఇద్దరం వివాహం చేసికోవాలని నిర్ణయించుకొన్నాము. మీరు మంచి మనస్సుతో మా వివాహాన్ని జరిపించండి. నాకు మీరు ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వవద్దు" ఎంతో వినయంగా ఆత్మవిశ్వాసంతో శివరామకృష్ణ చెప్పాడు. అతని మాటల తీరు వెంకట రమణకు నచ్చింది.
ఊర్మిళ తండ్రి నాలుగేళ్ళ క్రితం... ఓ లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంకటరమణ... తనకు ముఖ్యులైన వారిని ఇరువురిని గూడూరుకు పంపించి శివరామకృష్ణ కుటుంబ వివరాలను సేకరించాడు. ఆ వ్యక్తులు మద్రాస్కు తిరిగి వెళ్ళి...
"అన్నా!.... ఆ కుటుంబం బ్రతికి చెడ్డవారే కానీ... చెడి బ్రతికిన వారు కాదన్నా. అబ్బాయ్... అమ్మా నాన్నలకు ఎంతో గొప్ప పేరుంది. వ్యాపారంలో నష్టపోయారు. అంతే ఎవరినీ మోసం చేయలేదు. అన్యాయం చేయలేదు. నీతి నిజాయితీ గల మంచి కుటుంబం అన్నా!" చెప్పారు వారు.
వారి విశ్వాసనీయమైన మాటలు విని... వెంకటరమణగారు భార్య బాలమ్మా సమేతంగా గూడూరుకు వచ్చి మహేశ్వర్, శాంభవీలను కలసి తాము వచ్చిన విషయాన్ని వివరించారు.
తల్లి శాంభవికి శివరామకృష్ణ అంతకుముందే తన నిర్ణయాన్ని ఊర్మిళను గురించి చెప్పి వున్నందున ఆ దంపతులు శివరామకృష్ణ వివాహాన్ని ఊర్మిళతో జరిపించే దానికి అంగీకరించారు. రెండు నెలల తర్వాత శివరామకృష్ణ... ఊర్మిళల వివాహం జరిగింది. వారి వివాహం జరిగిన మూడునెలల తర్వాత హరికృష్ణకు, లావణ్యకు కైలాసపతి వివాహాన్ని జరిపించారు.
వారి వివాహం జరిగిన సంవత్సరం తర్వాత ప్రజాపతికి, ప్రణవికి వివాహం జరిగింది.
కైలాసపతి... శివరామకృష్ణకు, ఊర్మిళకు తనకు వున్న పలుకుబడితో హైకాలేజ్లో టీచర్ల ఉద్యోగాలు ఇప్పించాడు.
కోడలు ఇంటికి వచ్చినా... మహేశ్వర్ తన త్రాగుడు అలవాటును మానలేదు. భర్త వైఖరిలో మార్పులేనందుకు శాంభవి ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చేది. మనోవ్యధతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కోడలి ఆదరాభిమానాలు, కొడుకు ప్రేమానాలురాగాలు, భర్త విషయంలో ఆమె హృదయం నిండా నిండిపోయిన ఆవేదనను తొలగించలేకపోయింది.
ఒకరోజు రాత్రి... శయనించిన శాంభవి... శాశ్వతంగా నిద్రపోయింది.
ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఊర్మిళ అత్త శాంభవి గదికి వెళ్ళింది. సాధారణంగా శాంభవి అందరికన్నా ముందులేచి... స్నానం చేసి... ఆరున్నర లోపల దీపారాధన వెలిగించి దైవానికి పాల నివేదన చేసి... ఆ పాలతో కాఫీ తయారుచేసి అందరికీ అందించేది ఆ మహాతల్లి.
కదలకుండా వెల్లికిలా పడుకొని కళ్ళు మూసుకొని వున్న శాంభవిని చూచి ఊర్మిళ ఆశ్చర్యపోయింది. తల వైపుకు నడిచి చేతిని ఆమె నొసటిపై వుంచింది. చల్లని స్పర్శకు ఆశ్చర్యపోయింది. "అత్తయ్యా!...." పిలిచింది ఒకటికి రెండుసార్లు.
శాంభవి నుండి జవాబు లేదు.
వేళ్ళను నాసికారంధ్రాల ముందు వుంచింది. ఊర్మిళకు విషయం అర్థం అయింది.
"ఏమండీ!..." బిగ్గరగా అరిచింది.
పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన శివరామకృష్ణ అరుపును విని తల్లి గదిలోకి పరుగెత్తాడు.
అతన్ని చూచిన ఊర్మిళ....
"ఏమండి... ఏమండీ... అత్తయ్య... అత్తయ్య..." భోరున ఏడ్చింది.
శివరామకృష్ణ పరుగున వచ్చి తల్లి శరీరాన్ని తాకి చూచాడు.
"అమ్మా!..." అంటూ ఆమె పాదాలపై వాలిపోయాడు.
ఆ గదిలో... శాంభవి శాశ్వత నిద్రలో వుంది.
శివరామకృష్ణ, ఊర్మిళలు భోరున ఏడుస్తున్నారు.
గతరాత్రి తాగిన మైకంవదలి మహేశ్వర్ కళ్ళు తెరిచాడు. ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన ఉదయకాలం శివరామకృష్ణ, ఊర్మిళల ఏడుపులు... అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
వేగంగా భార్య గదిని సమీపించాడు. ద్వారం మధ్యన నిలబడ్డాడు. అతని రాకను చూచాడు శివరామకృష్ణ.
"నాన్నా! అమ్మ చనిపోయింది నాన్నా!..." భోరున ఏడ్చాడు.
మహేశ్వర్ మెల్లగా శాంభవి తలవైపుకు చేరాడు. మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు.
"శాంభవీ! నన్ను మన్నించు...నన్ను మన్నించు. నీవు నా కారణంగానే చచ్చిపోయావు" ఆమె చేతిపై తన తలను ఆనించి భోరున ఏడవసాగాడు.
పనిమనిషి మీరా వచ్చింది. గదిలోకి తొంగి చూచింది. ఆమెకు విషయం అర్థం అయింది. పరుగున వీధిలోకి వెళ్ళింది. తొలుత హరికృష్ణకు... తర్వాత కైలాసపతికి విషయాన్ని చెప్పింది.
కైలాసపతి భార్య రుక్మిణి, నరసింహం సతీమణి శ్యామల శివరామకృష్ణ ఇంటికి వచ్చారు. శాంభవిని చూచారు. ఎంతో ప్రేమాభిమానాలతో వరసలతో ప్రీతిగా పలకరించే... శాంభవి అచేతనంగా అందరినీ వదిలి శవాకారంగా మారిపోయినందుకు కన్నీరు కార్చారు.
ఆ వార్త వూరంతా నిముషాల్లో పాకిపోయింది. ఆ వాడ... వూరిజనం అంతా అరగంటలో ఆ ఇంటిముందుకు చేరారు.
కైలాసపతి, నరసింహం నట్టింట చాపను పరిచి... శాంభవిని దానిపైకి చేర్చారు. హరికృష్ణ వారి మిత్రులు సభాపతి, నరసింహం, వచ్చిన బంధుజాలం, వూరివారు అందరూ ఎంతగానో బాధపడ్డారు. కన్నీరు కార్చారు. ఆ రోజు సాయంత్రం బంధుమిత్రులతో ఐదు గంటల ప్రాంతంలో శాంభవి... నలుగురు వాహకులతో... పసుపు కుంకుమలు... పూలతో జన హరినామ సంకీర్తనలతో దక్షిణ దిశగా స్మశానం వైపు వూరేగింపుగా బయలుదేరింది.
’దేవత... ఇహాన్ని వదిలి వెళ్ళిపోయింది’ అది అందరి నోటిమాట.
అందరి వదనాల్లో కన్నీరు... కారణం ఆ మహాతల్లి అందరినీ అభిమానించింది. ప్రేమించింది. సాయం చేసింది.
ఆరున్నర ప్రాంతంలో ఆమె యాతనా తనువు అగ్నికి ఆహుతైపోయింది.
ఈ లోకపు బాధలన్నింటి నుంచి విముక్తి పొందింది.
కొందరు మంచి మనుషులు బ్రతికి వున్నా... గతించినా... వారి చర్యల వలన ఇతరుల హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా వుంటారు. కొందరు వారి రాక్షస ప్రవృత్తి వలన బ్రతికి వున్నా సాటివారి మనసుల్లో చచ్చి వారి చిట్టాలోనే వుండిపోతారు. అదే మంచి.... చెడుకు వున్న వ్యత్యాసం.
ఈ మానవ జన్మ అపూర్వమైనది. మరుజన్మ వున్నదో లేదో!... సృష్టిలోని అన్ని ఎలా అశాశ్వతాలో మానవుల జీవిత గతీ అంతే... అందుకే అన్నారు పెద్దలు ’పుట్టుట గిట్టుట కొరకే’ అని శాంభవి మరణం ఆ ప్రాంతంలోని అందరి హృదయాలకు తీరని ఆవేదనకు కారణం అయింది. అయినవారంతా ఎంతగానో బాధపడ్డారు. మహేశ్వర్ భార్యా వియోగానికి కృంగిపోయాడు. ఆహార పానీయాలను విసర్జించాడు. విపరీతమైన తాగుడులో సాగించిన అతని జీవనయాత్ర చివరి దశకు చేరింది. భార్య మరణించిన మూడు మాసాలకే మహేశ్వర్ శాశ్వతంగా కన్నుమూశాడు.
====================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|