Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*రాయన్నది ఒక నాటికి రత్నమౌనురా!
#1
1 511 211 611 21.1707క2-6.
0810న3-5.
???????????
               
         *రాయన్నది ఒక నాటికి
                రత్నమౌనురా!
              ➖➖➖✍️

భోజనం చేసి చేతులు కడుక్కుని తీరిగ్గా వక్కపొడి నములుతూ సోఫా మీద విశ్రమించిన కృష్ణమూర్తి గారికి    ప్రసన్న వదనంతో ఒక ఇన్విటేషన్ కార్డ్ అందించింది త్రిపుర.  

ఆయన ప్రశ్నార్ధకంగా ఆమెకేసి చూసి,   ఆహ్వాన పత్రిక వైపు దృష్టి సారించారు.  చాలా క్లుప్తంగా అందంగా ఉంది అందులో ఆహ్వానం. 

"గాయత్రి నా సహధర్మచారిణిగా గత నెల 29 వ తారీఖున నా జీవితంలో అడుగు పెట్టింది.     ఆ సందర్భంగా పదవ తారీఖున మసబ్ టాంక్ దగ్గరలోని బంజారా ఫంక్షన్ హాల్ లో సాయంత్రం          7 గంటలకి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకి సకుటుంబంగా విచ్చేసి నన్ను బ్రహ్మానందభరితుడిని చేయమని విన్నవించుకుంటున్నాను ".

ఆ క్రింద  'ఎట్టి పరిస్థితులలోనూ బహుమతులు తీసుకురావద్దనీ, మీ ప్రేమ, ఆశీర్వచనములను మించి వేరే ఏ బహుమతి నాకు ఎక్కువ కాదన్న' వినమ్ర విన్నపం కూడా ఆయనను ఆకట్టుకుంది.

ప్రశ్నార్ధకంగా ఆమెకేసి చూస్తూ "ఎవరీ రఘునందన శర్మ ?" అని అడిగాడు ఆయన. ఆహ్వానంలో ఆ వ్యక్తి  పేరు తప్ప అతని చదువు గురించి కానీ     ఉద్యోగ వివరాలు కానీ లేకపోవడంతో ఆయనకు కొంచెం ఉత్సుకత పెరిగింది. 

"మా రఘు అండీ ! నా మొదటి స్టూడెంట్!" 

"ఓహో ! రఘూనా? అతని పూర్తి పేరు ఇప్పుడే తెలిసింది, ఏం చేస్తున్నాడు ఇప్పుడు ?"

"సూరత్ కల్  లో       ఆర్ ఈ సీ లో ఇంజినీరింగ్ చేశాక  అమెరికా మిట్స్ లో మెకాట్రానిక్స్ చేశానని అన్నాడు. మళ్ళీ ఇండియా వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని అన్నాడు. ఎక్కడ అని నేను అడగను లేదు, అతను చెప్పనూ లేదు. ఎప్పుడైనా పెద్ద ఉత్తరం వ్రాస్తాడు.  అందులో అన్నీ చిన్ననాటి స్కూలు జ్ఞాపకాలే  ! చివరి వాక్యం మాత్రం తప్పకుండా మీరు నాకు ప్రపంచంలో అతి ఇష్టమైన టీచర్ మిస్ !"  అని వ్రాస్తాడు అని మురిపెంగా ఇంకొకసారి ఆహ్వాన పత్రిక చదివింది త్రిపుర.

త్రిపురకు ఆ రాత్రి, నిద్ర పట్టలేదు . రఘు అంటే చాలా ఇష్టం, ఆప్యాయత ఆమెకు. పెళ్ళి బహుమతి ఏం తీసుకుని వెళ్ళాలా అని ఆలోచించింది. ఆమెకు రఘు ఇచ్చిన మొదటి బహుమతి గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. తను బి ఎడ్.  చేశాక టీచర్ గా చేరిన రోజులు గుర్తుకు వచ్చాయి. 

తూర్పు గోదావరి జిల్లాలో ఒక ట్రస్ట్ స్కూల్ లో లెక్కలు, సోషల్ స్టడీస్ టీచర్ గా అపాయింట్ అయ్యాక ఆమెకు నాలుగో తరగతి క్లాసును చూసుకోవలసిందిగా చెప్పారు. బీ ఎడ్ లో థీరీ, ప్రాక్టికల్ రూపంలో ట్రెయినింగ్ స్కూలు లో నేర్చుకున్నవి,  తను తయారుచేసుకున్న బోధనా పద్ధతులను అమలు చెయ్యడానికి ఆమె బహు ఉత్సాహంగా ఉంది.

ముందు కొద్ది రోజులు కొత్త టీచర్ కు మర్యాద ఇచ్చినట్లే కనిపించినా పిల్లలు నెమ్మదిగా వారి అల్లరి కొనసాగించారు. త్రిపుర తన పద్ధతి అమలుచేసి చాలామందిని దారిలోకి తీసుకుని వచ్చింది 

కానీ ఒక్కడు మాత్రం లొంగలేదు. అలా అని అల్లరి చేస్తాడా అంటే అదీ లేదు. క్లాస్ లో పాఠం మీద దృష్టి పెట్టడు. చాలా సార్లు తల బెంచి మీద పెట్టి నిద్రపోతాడు. ఒకవేళ కూర్చొని ఉన్నా కునికిపాట్లు పడుతూ ఉంటాడు.  హోమ్ వర్క్ అసంపూర్తిగా చేస్తాడు, చేసిన వర్క్ కూడా తప్పులతో, కొట్టివేతలతో ఉంటుంది. మొదటలో నయాన, తర్వాత భయాన చెప్పిచూసింది త్రిపుర. అప్పుడు బుద్ధి గా తల ఊపుతాడు. తర్వాత మళ్లీ మాములే.  

విసుగొచ్చి కొంతకాలం అయిన తర్వాత మిగిలిన పిల్లల.ముందు కోప్పడడం, చులకనగా మాట్లాడడం కూడా చేసింది. ఏం చేసినా, బెల్లం కొట్టిన రాయిలాగ, దున్నపోతు మీద వాన పడ్డట్లే పట్టించుకునే వాడు కాదు. చివరికి దండనకి కూడా లొంగలేదు. విసుగొచ్చి ఊరుకుంది. హాఫ్ ఇయర్లీ పరీక్షలలో అందరికన్నా చివరి రాంకు వచ్చింది. ఆ రోజు ప్రత్యేకంగా రఘు జవాబు కాగితాలు అందరికీ చదివి వినిపించి గేలి చేసింది.  ఆ రోజు మాత్రం రఘు కళ్ళలో కొద్దిగా కన్నీటి పొర ! చాలామంది పిల్లలు నవ్వినా కొంతమంది పిల్లలు జాలిగా, సానుభూతిగా రఘుకేసి చూడడం గమనించిన త్రిపుర కొద్దిగా గిల్టీగా ఫీల్ అయింది.

మర్నాడు స్టాఫ్ రూమ్ లో రెండవ క్లాస్ టీచర్ హరితను రఘును గురించి  వాకబు చేసింది. ఆమె చెప్పిన వివరాలు విని త్రిపుర కు ఆశ్చర్యము, విచారము, కోపము, దుఃఖం అన్నీ కలగలుపుగా చుట్టుముట్టాయి.

***********************

రఘునందన్ వాళ్ళ ఊరిలోని రామాలయం పూజారి గారికి ఒక్కగానొక్క కొడుకు. కొడుకును మంచి చదువులు చదివించాలని ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న మంచి స్కూల్ లో వేశారాయన. రఘు చదువులో చాలా చురుకే కాకుండా మంచి స్నేహపాత్రుడు.  ఇట్టే అందరితో కలిసిపోయే తత్వం. అందరికీ తలలో నాలుకలాగ మెలిగేవాడు.

 "రెండో తరగతి పూర్తయ్యే దాకా క్లాసులో ఫస్టు తనే తెలుసా త్రిపురా ?" అంటూ అప్పటి పరీక్ష ఆన్సర్ బుక్స్ చూపించింది హరిత. అవి చూసి నిర్ఘాంత పోయింది త్రిపుర.  రఘు వ్రాత ముత్యాల కోవ. ఎక్కడా దిద్దుబాటు,  కొట్టివేతలు లేవు.  దాదాపు అన్ని సబ్జక్టులలో వందశాతం మార్కులే ! లాంగ్వేజీలలో పూర్తి మార్కులు వేయడం ఆ స్కూలు చరిత్ర లో లేదు. 
 
"మరి ఇప్పుడు ఇంత దిగజారిపోయాడెందుకు  ?" అయోమయంగా అడిగింది.

"మూడో క్లాసు క్వార్టర్లీ పరీక్షలు జరుగుతుండగా రఘు అమ్మ గారికి క్యాన్సర్ అని తెలిసింది.  అది చాలా త్వరగా పాకిపోయే రొమ్ము క్యాన్సర్ ట. హాఫ్ ఇయర్లీ పరీక్షలు వ్రాయనేలేదు.  ఆ టైమ్ కి పూజారిగారు ఆవిడని వెల్లూర్ తీసుకుని వెళ్ళారు. రఘుని కూడా తీసుకుని వెళ్ళారు. ఫైనల్ పరీక్షలలో సరిగ్గా వ్రాయక తప్పాడు. రెండో సారి మూడో క్లాసు చదువుతుండగా వాళ్ళ అమ్మ గారు పోయారు. దానితో రఘు ఇంకా బ్యాక్ వర్డ్ అయిపోయాడు. ఇంట్లో అతని ఆలన పాలన చూసే తల్లి పోయేసరికి దుస్తుల మీద, తిండి మీద, చదువు మీద శ్రద్ధ పెట్టే వారు లేక అలా అయిపోయాడు." కళ్ళు తడిగా అవుతుంటే చెప్పింది హరిత. 

ఆమెను అలాటి మూడ్ లో అంతకుముందు చూడకపోవడం వలన త్రిపుర కూడా కదిలి పోయింది. 

"మరి మూడో క్లాసు టీచర్ ఏమీ పట్టించుకోలేదా?"

"ఆవిడ సంవత్సరం మొదట్లోనే ప్రెగ్నెంట్ అయింది. ఆరోగ్యం బాగలేక ఎక్కువ సెలవులు పెట్టేది. మిగిలిన వాళ్ళము ఆవిడ వర్కు షేర్ చేసుకునే వారము. మా క్లాసులు కూడా చూసుకోవాలి కదా. రఘు మీద ప్రత్యేకమైన దృష్టి ఎవరమూ పెట్టలేక పోయాము.  సంవత్సరం పరీక్షలకి ఆవిడ డ్యూటీలో జాయినైపోయారు. మా హడావుడి లో మేము ఉన్నాము.

 విచిత్రమేమంటే బొటాబొటీగా మార్కులతో రఘు నాలుగో క్లాసు కి ప్రమోట్ అయ్యాడు" అన్నది హరిత.

********************

త్రిపురకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మాటిమాటికి రఘు తడిసిన కళ్ళే కలలో కూడా వెంటాడాయి. తను బీ ఎడ్ ట్రైనింగ్ ఈ విషయంలో ఉపయోగించదని నిశ్చయించుకుంది. 

మరుసటి రోజు రఘు కొంచెం శుభ్రం గా ఉన్న డ్రెస్ వేసుకుని వచ్చాడు. రోజూ కన్నా అలర్ట్ గా కనిపించాడు. సోషల్ స్టడీస్, లెక్కలలో పిల్లల్ని ప్రశ్నలు అడుగుతూ రఘు దగ్గరకు వచ్చేసరికి కావాలనే సులభమైన ప్రశ్నలు, లెక్కలు ఇచ్చి చెప్పమంది. ఏ కళనున్నాడో సరైన సమాధానాలు టకటక చెప్పాడు. 

ఆశ్చర్యం నటించి త్రిపుర "పిల్లలూ ! ఇవాళ్టి హీరో రఘూయే !" అని అందరి చేత చప్పట్లు కొట్టించింది. పిల్లలు అందరూ ఒక్కుమ్మడిగా పెద్దగా చప్పట్లు కొట్టేశారు. అందరి ముఖాలలో ఆనందమే తప్ప ఈర్ష్య కనిపించలేదు త్రిపురకి. 

అనుకోని ఈ సన్మానానికి రఘు అవాక్కయ్యాడు.

లాంగ్ బెల్ కొట్టాక అందరూ వెళ్ళిపోతుండగా "రఘూ  !" అని పిలిచి అతని చేతిని చేతులోకి తీసుకుని "వెరీగుడ్ నాన్నా ! కీపిట్ అప్ !" అన్నది. 

రఘు ఒక్క నిమిషం త్రిపుర కళ్ళలోకి చూసి ఆ చేతిని రెండు చేతుల్లోకి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని తూనీగలాగ పరిగెత్తి పోయాడు. 

త్రిపుర పెదవుల మీద చిన్న చిరునవ్వు ! "నా ప్రయత్నం నేను చేస్తాను" అనుకున్నది.

నెమ్మదిగా రఘులో మార్పు స్పష్టంగా తెలియడం మొదలుపెట్టింది.  పూర్వంలాగ క్లాసులో నిద్ర పోవడం లేదు. హోమ్ వర్క్ దాదాపు నాగా లేకుండా చేస్తున్నాడు. దిద్దుబాట్లు, కొట్టివేతలు చాలావరకూ తగ్గిపోయాయి. మనిషి కూడా తాను చేతనైనంత మేరకు శుభ్రంగా,  తల దువ్వుకునీ,ఉతికిన బట్టలు వేసుకుని వస్తున్నాడు.  

త్రిపుర కూడా రఘుని విమర్శించడం మానేసింది. ఏ చిన్న ఇంప్రూవ్ మెంట్ కనిపించినా హృదయపూర్వకంగా మెచ్చుకునేది. 

హాఫ్ ఇయర్లీ పరీక్షలలో రఘు మార్కులు ఎంత బాగా వచ్చాయంటే క్లాసు మొత్తం మీద ఎనిమిదవ ర్యాంకులో నిలిచాడు. 

క్లాసులో నేస్తాలందరూ మరొకసారి, త్రిపుర మిస్ చెప్పకుండానే ఈలలు,  కరతాళ ధ్వనులతో ఆనందం ప్రకటించారు. త్రిపుర ఏనుగునెక్కినంత సంబర పడింది.

ఆ మరుసటి రోజు రఘు రోజూ కన్నా ముందుగా స్కూలు కి వచ్చాడు. నేరుగా స్టాఫ్ రూమ్ కి వెళ్ళాడు. త్రిపుర అప్పుడే వచ్చినట్లుంది. తన టేబుల్ లాకర్ లో పుస్తకాలు సర్దుకుంటున్నది. 

రఘుని చూసి చాలా సంతోషంగా "దా దా ! రఘూ  ! నీ మార్కులకి చాలా సంబరంగా ఉన్నది. ఆన్యుయల్ పరీక్షలో నీకు క్లాస్ ఫస్టు రావాలి. సరేనా  ?" అన్నది.

మాటలు పెగలక  సరే అన్నట్లుగా తల ఊపి "మా ఇంట్లో పూచాయి మిస్ !" అని తామరాకులో చుట్టిన గులాబీలు ఆమెకిచ్చి తుర్రుమని పారిపోయాడు.  ఆ గులాబీలతో ఒక చీటీ కూడా ఉంది. చక్కని వ్రాతలో "మీరంటే నాకు చాలా ఇష్టం మిస్!" అని వ్రాసి ఉంది.  

త్రిపుర కళ్ళు చెమర్చాయి.

***********************

ఆన్యుయల్ పరీక్షల సమయానికి రఘులో మార్పు కొట్టొచ్చినట్లు కనబడింది.  త్రిపుర అంతకన్నా ఎక్కువ గమనించలేదు.  కారణం పరీక్షలు మొదలవడానికి ముందు ఆమె వివాహం నిశ్చయమై, పరీక్షలు అయిపోయిన నాలుగు రోజులకి వివాహం జరిగిపోయింది. 

ఆమె అత్తవారు ఆ ఊరివారే అవడంతో ఆ స్కూలు లోనే ఉద్యోగం కొనసాగించడానికే నిర్ణయించుకున్నది. 

పరీక్ష మార్కులు, సమాధానం పేపర్లు ఇచ్చే రోజున పిల్లలందరూ రఘు నేతృత్వంలో కూడబలుక్కుని అందరూ తలకొక బహుమతి పట్టుకొచ్చారు. 

ఆరోజున త్రిపుర తల నిండా పువ్వులూ, నుదుట కుంకుమ, పాపిటలో సింధూరము, మెడలో తాళి,  నల్లపూసలతో వచ్చేసరికి పిల్లందరూ ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. రఘు చెప్పనే అక్కర్లేదు,  వళ్ళంతా కళ్ళు చేసుకుని ఆరాధనగా ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. 

ఫస్ట్ ర్యాంక్ అని త్రిపుర పిలిచినపుడు పక్కన నేస్తం చేత్తో తోసి "నువ్వే రఘూ  ! క్లాసు ఫస్టు " అన్నపుడు కూడా ఏదో కలలోలాగ నడిచి వెళ్లి రిపోర్ట్ కార్డు తీసుకున్నాడు. స్నేహితుల చప్పట్లకూ స్పందించలేదు. అందరి రిపోర్ట్ కార్డులు ఇచ్చే సమయంలో వారు పట్టుకొచ్చిన బహుమతులు ఆమెకు ఇచ్చారు. అన్నీ చిన్న చిన్నవే. త్రిపుర చాలా ఆనందంగా తీసుకుని ప్రతివారికి షేక్ హాండ్ ఇచ్చింది.

చివరలో "రఘూ ! నీ బహుమతి ఇవ్వలేదేం  ? ఇందాక నీ చేతిలో ప్యాకెట్ చూశాను." అన్నది కొంచెం హాస్యంగా. 

"అయ్యో ! మరిచి పోయాను మిస్ !" అని తను పుస్తకాలకు అట్టలు వేసే బ్రౌన్ పేపర్లో ప్యాక్ చేసిన బహుమతి ఇచ్చాడు. మిగిలిన వారు ఇచ్చిన బహుమతులు పక్కనే పెట్టినా, రఘు ఇచ్చిన పాకెట్ విప్పింది త్రిపుర అక్కడే. 

"నువ్వే పాక్ చేశావా? చక్కగా చేశావు" అని పాకెట్ విప్పిన త్రిపుర ఆశ్చర్యపడింది. అందులో యాళి మరికొళందు సెంట్ బాటిల్, ఒక వెండి కుంకుమ భరిణ ఉన్నాయి. సెంట్ బాటిల్ లో ఒక వంతు సెంట్ అయిపోయినట్లుంది. కుంకుమ భరిణ కూడా కొత్తదేమీ కాదు. కానీ చేతనైనంత వరకూ శుభ్రంగా తోమినట్లు తెలుస్తోంది. అందులో మూడు వంతులు ఎఱ్ఱని కుంకుమ ఉన్నది. 

ఎవరో అవి చూసి కిసుక్కున నవ్వారు కానీ త్రిపుర వెంటనే సెంటు మూత తీసి కొద్దిగా మణికట్టు వెనక రాసుకుని దీర్ఘంగా వాసన చూసి "అబ్బ ! ఎంత సువాసన !" అని భరిణలోని కుంకుమ నుదుటిన పెట్టుకుని, "చాలా థ్యాంక్స్ రఘూ  !" అన్నది. 

చిన్నబోయిన రఘు మొహం వెయ్యి వాట్ల బల్బులాగ వెలిగిపోయింది.  

"అవి మా అమ్మవి మిస్ ! థాంక్యూ మిస్ !" అని గాలిలో తేలుతున్నట్లే వెళ్ళి పోయాడు రఘు. 

చివ్వున కంట నీరు తిరిగింది త్రిపురకి.

**********************

 "ఏమిటోయ్ ? ఆ కవళికలు ? కొంచెం చిరునవ్వు, వెంటనే కన్నీరు !" అన్న భర్త మాటలకి ఈ లోకంలోకి వచ్చింది త్రిపుర. 
 
 "రఘు గురించి జ్ఞాపకాలండీ. అంతే !" అంది కళ్ళు తుడుచుకుంటూ.
 
 "ఓ ! సారీ త్రిపురా ! నీ జ్ఞాపకాలకు అడ్డం పడ్డాను."
 
 "ఎబ్బే ! ఫర్వాలేదు ! పెళ్లి గిఫ్ట్ ఏం ఇద్దామా అని ఆలోచనలో పడ్డాను. అది ఇట్టే తేలిపోయింది, ఇప్పడే. "
 
 "సరి సరి ! పొద్దుపోయింది. పడుకో" అని లైట్ ఆపేశాడాయన.

***********************

రఘు విద్యా ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోయింది. ఏడవ క్లాసులో కామన్ పరీక్ష లోనూ, పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ లోనూ జిల్లా టాపర్ గా నిలిచాడు రఘు.

ఆ తపస్సు వెనక త్రిపుర బాసట ఉన్నదని చాలా కొద్ది మందికే తెలుసు. పదవ తరగతి వరకు త్రిపుర లెక్కలు, సోషల్ స్టడీస్ కి టీచర్ గా ఉండేది. అందుకని రఘు, త్రిపుర మంచి టచ్ లో ఉండేవారు. 

ఏమైనా సందేహం వస్తే కలిసే దాని సమాధానం రాబట్టేవారు.  అవసరం అయితే లైబ్రరీ సహాయం కూడా తీసుకునే వారు. 

పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చిన రోజున ఇంకా ఎవరికీ చెప్పకుండా పరుగున త్రిపుర ఇంటికి వెళ్లి ఆ వార్త చెప్పి దంపతులిద్దరి కాళ్ళకి మొక్కాడు. ఆనందం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేస్తున్న రఘుని సముదాయించారు ఇద్దరూ. 

అప్పటికప్పుడు పాయసం చేసి తినిపించింది త్రిపుర. తిన్నాక "అచ్చంగా మా అమ్మ చేసిన పాయసం లాగే ఉన్నది మిస్ !" అన్నాడు చిరునవ్వు, కన్నీళ్ళ మధ్య.

"తర్వాత ఏంటి రఘూ  ? ఇంటర్ ఎక్కడ ?" అని అడిగింది  త్రిపుర.

"విజయవాడలో మా మేనమామ తో మాట్లాడాను మిస్ ! అక్కడ మంచి కాలేజీలు ఉన్నాయి. 75% ఫీజ్ కన్సెషన్ ఇస్తారుట." అన్నాడు. 

"చాలా సంతోషంగా ఉంది రఘూ  ! నీలాంటి స్టూడెంట్ దొరకడం ఆ కాలేజీ అదృష్టం". అన్నది త్రిపుర.

"మీ లాంటి టీచర్ దొరకడం నా అదృష్టం మిస్ !" అన్నాడు రఘు కళ్ళు మెరుస్తూండగా .

*********************

కాలేజీలు తెరిచాక రఘు తో పాటు అతని తండ్రి కూడా విజయవాడ వెళ్ళిపోయాడు. రఘు కాలేజ్ తెరిచాక క్రమం తప్పకుండా ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవాడు  ఎం పీ సి లో ఫీజ్ ఏమీ లేకుండా చేర్చుకున్నారనీ మంచి కాలేజ్ అనీ టీచర్లు అందరూ ఆదరంగా చూస్తున్నారని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారనీ వ్రాసాడు. చివరిలో ఏది ఏమైనా మీరు నాకు చాలా ఇష్టమైన టీచర్ అని వ్రాసాడు. 

ఇంటర్ మొదటి సంవత్సరం కాలేజ్ ఫస్ట్ అయినపుడూ ఫైనల్ పరీక్షల ముందూ కూడా  వివరంగా ఉత్తరాలు వ్రాసాడు. ఫైనల్ ఎక్జామ్స్ లో ఎంపీసీ స్ట్రీమ్ లో స్టేట్ సెకండ్ వచ్చాననీ . అంతా మీ కోచింగ్ చలవేననీ వ్రాసాడు.  చివరిలో ఎప్పటిలాగే "మీరు నాకు చాలా ఇష్టమైన టీచర్ అని వ్రాసాడు. చాలా సంతోష పడింది త్రిపుర. 

ఆ తరువాత ప్రతి సంవత్సరం కనీసం ఒక్కటైనా ఉత్తరం వ్రాస్తూ తన ప్రోగ్రెస్ వ్రాసే వాడు. సూరత్కల్ లో కంప్యూటర్ సైన్సెస్ లో చేరాననీ, పూర్తి చేసాక యూ ఎస్ లో  మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎం ఎస్ చేయాలన్నది తన ఆశయం అనీ వ్రాసాడు. 

అలాగే అకుంఠిత దీక్షతో తన మాట నిలబెట్టుకున్నాడు. యూ ఎస్ వెళ్లే ముందు ప్రత్యేకంగా వచ్చి త్రిపుర,  కృష్ణమూర్తి గార్లకి మొక్కి బట్టలు పెట్టి వెళ్ళాడు. 

అమెరికా వెళ్ళాక కూడా క్రమం తప్పకుండా ఉత్తరాలు వ్రాస్తూ ఉండే వాడు. మెకాట్రానిక్స్ లో ఎం ఎస్ దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆవిడతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.

 ఇండియా వచ్చేస్తున్నాననీ, తను తర్ఫీదు పొందిన విభాగం లో దేశానికి  అండగా ఉందామనుకుంటున్నానని వ్రాసి, "ఇప్పటికీ మీరే నాకు ఆరాధ్య టీచర్ మిస్ !" అని వ్రాసాడు. 

***********************

ఆ తర్వాత ఉత్తరాలు వ్రాయడం తగ్గినా, ఎప్పుడైనా ఫోన్ చేసే వాడు. గవర్నమెంట్ ఉద్యోగం లో చేరాననీ  చాలా సంతృప్తిగా ఉందనీ వ్రాసాడు. 

మళ్ళీ ఇప్పుడు ఈ ఆహ్వానం తో తీపి జ్ఞాపకాలన్నీత్రిపురని ఉక్కిరి బిక్కిరి చేశాయి .

మధ్యలో తండ్రి పోయాడని విచారంగా ఉత్తరం ఒక్కటి తప్పించి రఘు దగ్గరనుంచి ఏదైనా సమాచారం ఇప్పుడే రావడం..

10 వ తారీఖున సాయంత్రం ఏడు అవుతుండగా  బంజారా ఫంక్షన్ హాల్ లోకి ప్రవేశించిన త్రిపుర విస్తుపోయింది. 

కృష్ణ మూర్తిగారు కూడా "త్రిపురా వెన్యూ ఇదేనంటావా ?" అనేసారు.

పెద్ద ఫంక్షన్ హాలు, అందంగా లైట్లతో అలంకరించబడి ఉంది. ముందు పెద్ద ఆర్చి, "అతిధులకు సాదర స్వాగతం" అని వ్రాసి ఉన్నది. ఇంక రఘు, గాయత్రి పేర్లు కనిపించలేదు. 

లోపలకి వెళ్ళాక  స్టేజ్ మీద దంపతులిద్దరూ నిల్చుని వచ్చిన వారితో మాట్లాడుతూ, ఫోటోలు తీయించుకుంటూ ఉన్నారు. త్రిపుర రఘుని వెంటనే గుర్తు పట్టేసింది. 

"వెన్యూ ఇదేలెండి. సరైన అడ్రస్ కే వచ్చాం అన్నది. విశాలమైన హాలు పూల తోరణాలతో  అలంకరించడం వలన అందంగా ఉంది. స్టేజ్ మీద చాలా మంది  శుభాకాంక్షలు చెప్పేవారు ఉండడం వలన త్రిపుర, కృష్ణ మూర్తి గారు కుర్చీల్లో  కూర్చున్నారు. 

ముందు కుర్చీలలో కూర్చున్నవారు మాట్లాడుకోవడం త్రిపుర చెవుల్లో పడింది. " రఘునందన్ సార్ మొన్నటి దాకా  శ్రీహరి కోటలో శాటిలైట్ లాంచ్ డివిజన్ లో ఉండేవారు. రెండు నెలల క్రితమే బెంగళూరు ఇస్రో సాటిలైట్  ట్రాకింగ్ సెంటర్ కి హెడ్ గా వెళ్లారు. 

ఆ పొజిషన్ లో అపాయింట్ ఆయిన అతి చిన్నవారు సారు ". అన్న మాటలు విని నిర్ఘాంత పోయింది. రఘు వైపు చూసింది. లాల్చీ పైజామా, పైన స్టోల్  వేసుకుని ట్రెడిషనల్ గా ఉన్నాడు. గాయత్రి కూడా చక్కని పట్టు చీర కట్టుకుని పూలు పెట్టుకుని లక్ష్మీ దేవి లాగ మెరిసిపోతున్నది .

కృష్ణ మూర్తి గారు ఇంతలో "త్రిపురా ! మనలని పిలుస్తున్నాడుట రఘు." అనేసరికి పక్కకి చూసింది. సూట్ లో ఉన్న ఒక యువకుడు చాలా గౌరవంగా "అమ్మా ! మిమ్మల్నే పిలుస్తున్నారు సారు ." అనేసరికి మళ్ళీ స్టేజ్ వైపు చూసింది త్రిపుర. రఘు  చాలా ఉత్సాహంగా చేయెత్తి  రమ్మని సైగ చేస్తున్నాడు. 

అక్కడ ఎంతో మంది ఉన్నా ,.భార్యతో కలిసి స్టేజ్ దిగి ఆ దంపతులిద్దరికీ మోకాళ్ళ మీద కూర్చొని తల వారి పాదాలకు తాకించి నమస్కరించారు ఇద్దరూ ! 

త్రిపురను చేయి వదలకుండా స్టేజ్ మీదకు తీసుకుని వెళ్లి, నూతన దంపతులు కూర్చున్న సోఫా మీద ఆ దంపతులను ఆశీనులు చేసి వారి కాళ్ళ వద్ద రఘు, గాయత్రి కూర్చుని ఫోటో తీయించుకున్నారు. త్రిపుర, కృష్ణమూర్తి గార్ల అభ్యంతరాలు వారు పట్టించుకోకుండా నాలుగు ఐదు ఫోటోలు తీయించుకున్నారు. 

ఆ తరువాత నూతన దంపతులను బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టి అక్షింతలు వేసి మనసారా దీవించి తను తెచ్చిన బహుమతి వారి చేతిలో పెట్టారు ఆ దంపతులు.

"బహుమతులు వద్దని ప్రత్యేకంగా చెప్పాను కదా మిస్ ?" అన్నాడు రఘు కొంచెం నొచ్చుకుంటూ.

"ఆ పాకెట్ విప్పి చూడు తెలుస్తుంది" అన్నది చిన్నగా నవ్వుతూ. 

రఘు పాకెట్ విప్పుతుండగా "గాయత్రీ ! ఏం చేస్తున్నావమ్మా ?" అని అడిగింది త్రిపుర.

"చిన్న.స్కూలు నడుపుతున్నానమ్మా ! సాంఘికంగా, ఆర్ధికంగా వెనకబడిన పిల్లలకు పూర్తిగా ఉచితంగా విద్య నేర్పుతామమ్మా ! ఈ స్కూలు ప్రారంభించడానికి రఘూయే స్ఫూర్తి !" అన్నది గాయత్రి. 

ఆనందంతో నోట మాట రాలేదు త్రిపురకి.

"మిస్ ! ఇది ? ఇది ? మా అమ్మది కదా ? " అన్నాడు రఘు సంభ్రమంగా. 

అతని చేతిలో విప్పిన పాకెట్ నుండి తీసిన ఒక పెద్ద కుంకుమ భరిణ, అందులోనుంచి తీసిన అటువంటిదే చిన్ని కుంకుమ భరిణ ఉన్నాయి. వాటితో పాటు ఇంగ్లీష్   'ఆర్', 'జీ' అని ఎంబ్రాయిడరీ చేసిన రెండు తెల్లటి చేతి రుమాళ్ళు, మరికొళందు సెంట్ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. 

రఘు కళ్ళలో సుడులు సుడులు గా కన్నీరు.

త్రిపుర గబుక్కున "తప్పు ! కన్నీరు వద్దు నాయనా !" అన్నది అతని కళ్ళు తుడుస్తూ.

ఆమె రెండు చేతులలో మొహం దాచుకుని "మీరు నాకెంతో ఇష్టం మిస్ ! నా మీద నమ్మకానికి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పను ?" అన్నాడు రఘు వెక్కుతూ. 

ఈ సారి త్రిపుర కళ్ళ నీరు కార్చింది "నాయనా రఘూ ! కృతజ్ఞతలు నువు కాదు, నేను నీకు చెప్పాలి, నీ మీద నమ్మకం కాదు, నా మీద నాకు నమ్మకం కలిగించావు.తండ్రీ "  అని అతని నుదురు చుంబించి "దీర్ఘాయుష్మాన్ భవ !"అని దీవించింది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)