Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నెరజాణల కథలు
#1
Wink 
ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తున్న కథలు ఏవి నేను రాసినవి కావు .......చదివిన కొన్ని కథలను ఇక్కడ పోస్ట్ చేస్తున్న ఇందులో ఎవరిని కించపరచడం ....అవమానపరచటం వంటి ఎటువంటి ఉద్దేశ్యాలు లేవు ..........ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటె పర్సనల్ గ తెలుపగలరు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నెరజాణల కథలు – 01


కరోనా కారణంగా అందరూ భీతావహులై యిళ్లల్లోనే వుండిపోయినపుడు ఎన్నో జోకులు, కార్టూన్లు, చమత్కారాలు, ఫన్నీ వీడియోలు పుట్టుకుని వచ్చాయి. భయానక వాతావరణం ప్రజల సృజనాత్మకతను పెంచిందనుకోవాలి. మరో రకమైన సృజనాభిలాష కూడా పెరిగి శిశుజననాలు పెరగబోతున్నాయట. ఈ గృహనిర్బంధం టైములో పోర్నో కూడా రికార్డు స్థాయిలో చూశారట. ఒక పక్క మృత్యుభయం, అంతుపట్టని వ్యాధిభయం ముప్పిరికొంటూండగా కూడా మనుష్యులు యిలా వుంటారా అని ఆశ్చర్యం వేసేవారు బొకాచియో రాసిన ‘’ద డెకామెరాన్’’ కథాసంపుటి చదవాలి. తెలియనివారి కోసం  ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఈ ఇటాలియన్ రచయిత క్రీ.శ. 1313లో ఫ్లారెన్స్‌లో పుట్టాడు. 62 ఏళ్లు జీవించాడు. అతని 35 వ ఏట ఇటలీలో ప్లేగు వ్యాపించింది. అప్పట్లో దాన్ని బ్లాక్ డిసీజ్ అనేవారు. తూర్పు నుంచి వచ్చింది అనుకున్నారు. యూరోప్ ఖండమంతా మూడేళ్లపాటు స్వైరవిహారం చేసి, దాదాపు మూడోవంతు జనాభాను తుడిచిపెట్టేసి, ఆ తర్వాత తనంతట తానే తగ్గిపోయింది. ప్లేగు వ్యాధి లక్షణాలేమిటో, దాని విలయతాండవం ఎలా వుండిందో, అది వ్యాపిస్తున్నపుడు జనాభాలో వివిధ వర్గాల వారు ఎలా ప్రవర్తించారో బొకాచియో రాసుకుని వచ్చాడు -

‘ఇదంతా మానవాళి చేస్తున్న పాపాలపై భగవంతుడి ఆగ్రహమని అనుకుంటున్నారు. క్షమించమని భక్తులు మొరపెడుతున్నా, ఆయన వినిపించుకోవటం లేదు. అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగం సోకినవారిని నగరంలోకి రానివ్వటం లేదు. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి తడవతడవకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తూర్పు ప్రాంతాల నుంచి వచ్చిందంటున్నా అక్కడ కనబడిన రోగలక్షణాలు యిక్కడ కనబడటం లేదు, వేరే రకంగా చంకల్లో, గజ్జల్లో కోడిగుడ్డు సైజులో వాపులు వస్తున్నాయి. తర్వాత లక్షణాలు మారి, శరీరమంతా మచ్చలు వస్తున్నాయి.

రోగమూలం కనుక్కోలేక పోవడం చేత వైద్యులిచ్చిన ఏ మందులూ పని చేయటం లేదు. రోగుల నుండి యితరులకు అతి వేగంగా, దావానలంలా వ్యాపిస్తోంది. రోగులు దుస్తులు, వాడిన వస్తువులు ఏవి ముట్టుకున్నా యిట్టే పాకిపోతోంది. వాటిని బయట పారేస్తే వాటిని మూచూసిన జంతువులు కూడా చచ్చిపోతున్నాయి. దాంతో మనుషులంతా రోగులను చూడగానే పారిపోతున్నారు. వాళ్ల అతీగతీ పట్టించుకునేవారు లేరు.

ఇలాటి పరిస్థితుల్లో కొంతమంది ఆరోగ్యవంతులు ఒక బృందంగా ఏర్పడి, అందరికీ దూరంగా ఒక చోట ఉండసాగారు. అక్కడ మితంగా తింటూ, మితంగా తాగుతూ రోగులను దరి చేరనీయకపోవడమే కాదు, వారి గురించి వార్తలు కూడా వినకుండా సంగీతాది లలితకళలతో కాలక్షేపం చేస్తూ బతకసాగారు. మరి కొంతమంది, ఎలాగూ చావబోతున్నపుడు మిగిలిన నాలుగు రోజులు కులాసాగా గడిపేయవచ్చు కదా అనుకుని విపరీతంగా తిని, తాగి, తిరగసాగారు. జీవితంలో తీర్చుకోవాలని అనుకున్న కోరికలన్నీ ఒకేసారి తీర్చుకోసాగారు. ఈ రోగం, ఈ చావు అన్నీ ఓ జోక్‌లా తోచసాగాయి వారికి.

కొంతమంది ఎలాగూ బతకబోవటం లేదు కదాని తమ ఆస్తులను తమతో బాటు అనుభవించమని దారిన పోయేవాళ్లను కూడా అడగసాగారు. దాంతో ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ యింట్లోకైనా వెళ్లి కొన్నాళ్లు ఉండడం రివాజైంది. ఎల్లెడలా భీతావహ వాతావరణం ఆవరించడంతో ప్రజలు చట్టాలను, ధర్మసూత్రాలను పట్టించుకోవడం మానేశారు. చిత్తమొచ్చినట్లు ప్రవర్తించసాగారు. చట్టాలు అమలు చేసే అధికారుల్లో చాలామంది చచ్చిపోవడం చేత, మిగిలిన వారికి కూడా సిబ్బంది లేకపోవడం చేత వారిని అదిలించేవారు లేకపోయారు.

మధ్యేమార్గంగా బతకదలచిన కొందరు మరీ ఎక్కువగా తినకుండా, మరీ తక్కువగానూ తినకుండా, మరీ జాగ్రత్తలు పడకుండా, జనాల మధ్య తిరగసాగారు. శవాల కంపు తెలియకుండా ఔషధ మూలికలు, పరిమళపుష్పాలు గుప్పిట్లో పట్టుకుని మధ్యమధ్యలో పీల్చేవారు. చాలామంది ఊరొదిలి పోతే రోగం వెంటాడి రాదని నమ్మి, ఫ్లారెన్స్ నగరం వదిలిపెట్టి గ్రామాల బాట పట్టారు. కొంతమంది విదేశాలు వెళ్లిపోయారు.

ఈ వర్గాలన్నిటిలో బతికినవాళ్లు బతికారు, పోయినవాళ్లు పోయారు. చావకుండా మిగిలినవారిని పట్టించుకుని సేవ చేసే వారు ఎవరూ వుండేవారు కారు. డబ్బున్నవాళ్లు సేవకులను పెట్టుకుంటే వారు విపరీతంగా డబ్బు గుంజేవారు. బీదవాళ్ల యింట్లో చావు సంభవిస్తే శవాన్ని వీధిలో పడేసేవారు. ప్రభుత్వసేవకులు వచ్చి తీసుకెళ్లి గుట్టలుగా పోసి అంత్యక్రియలు చేసేవారు. మామూలు యిళ్లల్లో ఎవరైనా చస్తే శవం వెంట పదిమంది కంటె ఎక్కువమంది వచ్చేవారు కారు.

శవం మోయడానికి బంధువులెవరో రాకపోవడంతో నిమ్నవర్గాల ప్రజలను పిలుచుకుని వచ్చేవారు. వాళ్లు, అంత్యక్రియలు చేసే చర్చి పూజారులు విపరీతంగా ‌డబ్బులు వసూలు చేసేవారు. ఇక మంత్రాలు కూడా మరీ ఎక్కువగా ఏమీ చదవకుండా, ఎక్కువ కొవ్వొత్తులు వెలిగించకుండా చప్పున ముగించేసేవారు. గోతులు మరీ లోతుగా తవ్వకుండా పైపైనే కానిచ్చేసేవారు. అంత్యక్రియల సమయంలో చిత్రంగా హోస్యోక్తులు, చతురోక్తులు వినబడేవి. అకాలమరణాల ధాటి తట్టుకోవడానికి కాబోలు!’

ఈ వర్ణన చూస్తూంటే యిప్పటి పరిస్థితులు గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ వాస్తవ వర్ణన తర్వాత బొకాచియో కథ మొదలుపెట్టాడు. ఫ్లారెన్స్‌లో వున్న ఒక చర్చిలో పనిచేసే ఏడుగురు మహిళలు, 18 నుంచి 27 ఏళ్ల వయసు మధ్యలో వున్నవాళ్లు, సమావేశమై చర్చించుకుని ఊరొదిలి, ఏదైనా గ్రామానికి వెళ్లాలని నిశ్చయించారు. తమతో బాటు ఎవరైనా తోడుగా వుంటే బాగుండుననుకుని మరో ముగ్గురు యువకులను కూడా తీసుకెళ్లారు. వెంట పనివాళ్లు కూడా వున్నారు.

మర్నాటి మజిలీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. తాము పదిమంది వంతులవారీగా బృందం బాధ్యతలు స్వీకరించాలని, పనులు ముగించుకుని కూర్చున్నాక ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పాలని. అలా మజిలీలు చేస్తూ రోజుకి పది కథల చొప్పున పదిరోజుల్లో వంద కథలు చెప్పుకున్నారు. వాటి సంకలనమే యీ పుస్తకం. డెకా అంటే పది, మెరాన్ అంటే రోజు. అలా యీ పుస్తకానికి డెకామెరాన్ అనే పేరు వచ్చింది. తెలుగులో గుర్తు పెట్టుకోవాలంటే ‘దశదిన కథాశతం’ అనుకోవచ్చు. దీన్ని రాయడానికి ఆయనకు ఐదేళ్లు పట్టింది.

ఈ వంద కథలలో చాలా వెరైటీ వుంటుంది. ఆనాటి ఇటలీ సమాజం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. కథకులలో చర్చిలో పనిచేసే మహిళలు వున్నా వారు నిర్భయంగా చర్చి పూజారుల అక్రమాల గురించి, లాలసత గురించి, సాధారణ గృహిణుల రసికత గురించి కూడా కథలు చెప్తారు. ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువదితమైంది. చాలా మంది ప్రఖ్యాత రచయితలకు, కవులకు ప్రేరణ కలిగించింది.

షేక్‌స్పియర్ 1605లో రాసిన ‘‘ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’’ దీనిలో ఒక కథను అనుసరించి రాసినదే. ఫ్రెంచ్ నాటకకర్త మోలియర్ రెండు నాటికలకు, టెన్నిసన్, కీట్స్, షెల్లీ, లాంగ్‌ఫెలో రాసిన కొన్ని గేయాలకు, జోనాథన్ స్విఫ్ట్ రాసిన ఓ కథకు మూలాలు యీ పుస్తకంలో కనబడతాయి. నా దగ్గరున్న పుస్తకం పెంగ్విన్ క్లాసిక్ సీరీస్‌లో భాగంగా 1975లో వెలువడినది. 825 పేజీలు. పీరియడ్ ఎఫెక్ట్ కోసం రాసిన పాతకాలపు ఇంగ్లీషులో వుంటుంది.

ఈ 100 కథల్లో కొన్నిటిని సరదా కథలను ‘‘నెరజాణల కథలు’’ పేర నేను సంక్షిప్తంగా పరిచయం చేస్తున్నాను. జాణ అనేది స్త్రీపరంగానూ, పురుషపరంగానూ కూడా వాడవచ్చు. సామాజికంగా స్వేచ్ఛ ననుభవించే పురుషులు అక్రమసంబంధాలు పెట్టుకున్నారంటే విశేషంగా ఏమీ అనిపించదు. కానీ ఎన్నో కట్టుబాట్ల మధ్య బతకవలసిన గృహిణులు తమకు నచ్చినవాడితో సంబంధం పెట్టుకోవాలంటే ఎంతో చాతుర్యం, సమయస్ఫూర్తి, జాణతనం కావాలి. అది మనకు చిరునవ్వు తెప్పిస్తుంది, అబ్బురపరుస్తుంది. ఆమె ఎలా సమర్థించుకుందో, ఎలా సంబాళించుకుందో తెలుసుకుంటే థ్రిల్ కలుగుతుంది. అందుకే శుకసప్తతి కథల వంటివి ఎన్ని శతాబ్దాలైనా పాఠకులను అలరిస్తున్నాయి.
ఇటాలియన్ మహిళల జాణతనం తెలుసుకునే అవకాశం మనకు వీటి ద్వారా కలుగుతుంది. అలాగే దేవుని ప్రతినిథులుగా పరిగణించబడే చర్చి పూజారులు కూడా తమ యిమేజికి భంగం కాకుండా శారీరకమైన కోరికలు తీర్చుకోవడానికి వేసే వేషాలు, చేసే మోసాలు కూడా నవ్విస్తాయి. అందుకే ఆ కథలను ఎంచుకున్నాను. 

క్రైస్తవ మతగురువుల గురించి గతంలో చెప్పినపుడు ‘పూజారి’ అనే పదం ఉపయోగిస్తే అది హిందూపదమంటూ కొందరు అభ్యంతరం చెప్పారు. పూజ అనేది అన్ని మతాల వారికీ వుంటుంది. పూజలు చేయించేవాడు పూజారి. క్రైస్తవంలో వివిధ స్థాయిల్లో పూజారులు వుంటారు. హోదా బట్టి, దేశం బట్టి పేరు మారుతుంది. అవన్నీ విపులంగా రాయడం అనవసరం. అందువలన సాధ్యమైనంతవరకు పూజారి అనే వాడేస్తున్నాను.

ఈ పరిచయం తర్వాత ప్రాటో నగరానికి చెందిన ఒక జాణ గురించి ఓ చిన్న కథ చెప్తున్నాను. (6-7, పేజీ 498)ఆమె పేరు మడోన్నా. కులీన కుటుంబానికి చెందిన వివాహిత స్త్రీ. చాలా అందంగా వుంటుంది. ఆ నగరంలో ఒక క్రూరమైన చట్టం వుండేది. ఎవరైనా  వివాహిత మహిళ డబ్బు కోసం కానీ, కేవలం ప్రేమ చేత కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమెను సజీవంగా దహనం చేయాలని ఆ చట్టం చెపుతోంది. చట్టం యింత కఠినంగా వున్నా ఆమె ఒక ప్రియుణ్ని చేరదీసింది. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు.

ఇది భర్తకు తెలిసింది. భార్యను స్వహస్తాలతో చంపేద్దామన్న కోపం వచ్చింది. అయినా ఆ పనికి చట్టం వుండగా తనెందుకు చేయిచేసుకోవడం అనుకున్నాడు. భార్య ప్రేమాయణం గురించి సాక్ష్యాధారాలు సేకరించి, కోర్టులో కేసు పెట్టాడు. మడోన్నా తన నేరాన్ని ఒప్పేసుకోవడానికి సిద్ధపడింది. ఆమె బంధువులు, స్నేహితులు వద్దని వారించినా వినలేదు. ధైర్యంగా కోర్టుకి హాజరయ్యింది. ఆమె ఏం సంజాయిషీ చెప్తుందో విందామని నగరంలోని స్త్రీపురుషులందరూ, ఊరిపెద్దలతో సహా కోర్టుకి హాజరయ్యారు.

ఆమె చాలా అందంగా, హుందాగా ఉందని, ఉన్నత వంశజురాలని గ్రహించిన న్యాయాధిపతి ఆమె తను అమాయకురాలని చెప్తే బాగుండునని, తన చేతుల మీదుగా ఆ క్రూరమైన తీర్పు యివ్వనక్కరలేకుండా పోతే మంచిదని ఆశించాడు. ‘‘నీపై అభియోగం విన్నావు కదా, నిజమా కాదా నువ్వే చెప్పు.’’ అని అడిగాడు.

మడోన్నా ధీమాగా ఆయన కళ్లలోకే చూస్తూ చెప్పింది – ‘‘న్యాయాధీశా, నా ప్రియుడి బాహువుల్లో వుండగా నా భర్త చూశాడన్నది నిజం. ఆ రోజే కాదు, అంతకుముందు అనేకసార్లు నేను అలా వుండడం సంభవించింది. ఇప్పుడున్న చట్టం ప్రకారం నేను శిక్షార్హురాలినని తెలుసు. కానీ ఆ చట్టమే అభ్యంతరకరం. న్యాయం దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే అని చెప్తారు. కానీ యీ చట్టం అలా లేదు. పురుషులను వదిలిపెట్టి స్త్రీలకు మాత్రమే శిక్ష విధిస్తోంది. ఈ చట్టాన్ని చట్టసభలో ప్రవేశపెట్టినపుడు ఏ స్త్రీని సంప్రదించలేదు, అనుమతి తీసుకోలేదు. అందువలన యిది పూర్తి ఏకపక్షంగా వుంది.

‘‘అలాటి చట్టాన్ని ఆధారం చేసుకుని నాకు శిక్ష విధిస్తానంటే మీ యిష్టం. కానీ దానికి ముందు నాదొక విజ్ఞప్తి – నీ భార్య నీ పట్ల ఎప్పుడైనా నిరాదరణ చూపిందా? నువ్వు తన శరీరాన్ని కోరినప్పుడు ఎన్నడైనా నిరాకరించిందా? ఏ సమయంలో కోరినా, ఎన్నిసార్లు కోరినా కాదు పొమ్మందా? అని నా భర్తను అడగండి.’’ అంది మడోన్నా.

న్యాయాధిపతి తనను అడిగేలోపే ఆమె భర్త ‘‘లేదు, లేదు. ఆమె నా కోర్కెలు తీర్చడంలో ఎప్పుడూ లోటు చేయలేదు.’’ అని చెప్పేశాడు.

మడోన్నా వెంటనే ‘‘నా ప్రేమలో ఆయన తనకు కావలసినంతా తీసుకుంటూ వచ్చాడు. మరి నా వద్ద మిగిలిపోయిన ప్రేమను ఏం చేసుకోవాలి చెప్పండి. మన వద్ద అదనంగా మిగిలినది యితరులతో పంచుకోమని సమస్త మతగ్రంథాలు ఘోషిస్తున్నాయి. నా భర్త అవసరం తీర్చగా యింకా నా వద్ద ప్రేమ మిగిలిపోతోంది. దాన్ని వీధిలో కుక్కలపాలు చేయనా? అంతకంటె నన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న ఒక యువకుడికి ధారాదత్తం చేస్తే తప్పా?

‘‘సరైన సమయంలో వాడుకోకపోతే పాలు మురిగిపోతాయి, అన్నం పాచిపట్టిపోతుంది.  వినియోగించి తీరాల్సిందే. ఇంట్లోవాళ్లను పస్తులు పెట్టి, బిచ్చగాళ్లకు ధారపోయటం లేదు. నా భర్త ఆర్తిని తీర్చిన తర్వాత మిగిలినదానినే నేను మరొక మానవుని కోసం వినియోగిస్తున్నాను. నాకు ఆ శక్తిని భగవంతుడు యిచ్చాడు. నేను చేస్తున్నది నేరమెలా అవుతుంది?’’ అని అడిగింది.

ఆమె వాదనకు, తర్కానికి అందరూ ఆశ్చర్యపడ్డారు, చప్పట్లు కొట్టారు. ఆమె చెప్పినది నిజమే కదా అని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్త్రీలు విపరీతంగా హర్షించారు. న్యాయాధిపతికి కోర్టు వాతావరణం బోధపడింది. ‘‘ఆమె వాదన సమంజసంగా వుందని మీ అందరికీ తోస్తే, ఊరి పెద్దలంతా యిక్కడే వున్నారు కాబట్టి చట్టాన్ని మార్చండి. ఇకపై ఆ శిక్ష డబ్బు తీసుకుని అక్రమసంబంధం పెట్టుకున్న వివాహితలకే వర్తిస్తుందని అనండి. అప్పుడే యీ మహిళను వదిలిపెట్టగలుగుతాను.’’ అన్నాడు.

ఊరి ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకున్న పెద్దలు వెంటనే ఆ మార్పు చేశారు. అది వింటూనే మడోన్నా భర్త మౌనంగా యింటికి వెళ్లిపోయాడు. అయితే మడోన్నా యిల్లు చేరడానికి కొంత సమయం పట్టింది. విజేతగా నిలిచిన ఆమెను ఆ వూరి స్త్రీలు ఊరేగింపుగా యింటికి తీసుకెళ్లారు. –
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#3
నెరజాణల కథలు 02

అరెజో నగరంలో తొఫానో అనే ధనికుడికి మోన్నా అనే అందమైన భార్య వుంది. భార్యంటే అమితమైన యిష్టం వున్నా అతన్ని అసూయ అనే జబ్బు ఆవహించింది. ఆమె ఎవరి కేసి చూసినా, ఎవరితో మాట్లాడినా, చిరునవ్వు నవ్వినా సందేహించేవాడు. వాడితో పడుక్కుంటున్నావంటూ అసహ్యంగా ఆరోపణలు చేసి గోల చేసేవాడు. నిజానికి ఆమె సౌశీల్యవతి. ఇతని వరస చూసిచూసి ఆమెకు చిర్రెత్తిపోయింది. ఆ అనుమానాలు నిజం చేయాలనే పట్టుదల పెరిగింది. అటూయిటూ చూపులు సారించింది.

నిజానికి ఆమె యిన్నాళ్లూ పట్టించుకోలేదు కానీ చుట్టుపట్ల యిళ్లలోనే అందమైన యువకులు, ఆమె అంటే పడిచచ్చేవాళ్లు చాలామందే వున్నారు. వారిలో ఒకతను ఆమె దృష్టి నాకర్షించాడు. కళ్లతోనే ప్రేమ సందేశాలు పంపడం, అందుకోవడం జరిగాయి. కోర్కెలు తీర్చుకునే ఉపాయం ఆలోచిస్తే చాలు, పని జరిగినట్లే!

తొఫానోకు మద్యం అలవాటుంది. హద్దు మీరి తాగితే సర్వం మర్చిపోయి, దుంగలా పడిపోతాడు. చుట్టూ ఏం జరుగుతోందో ఏమీ తెలియదు. ఇన్నాళ్లూ ఆ అలవాటును ఆమె నిరసిస్తూ వచ్చినా యిప్పుడు అది తనకు పనికి వస్తుందని గ్రహించి, అతని తాగుడు అలవాటును ప్రోత్సహించసాగింది.  రాత్రి యింటికి రాగానే దగ్గరుండి అనుపానాలు సైతం అందిస్తూ అతను మత్తెక్కి పడిపోయేట్లా చేసింది. అతను యింట్లో వున్నా లేనట్టే లెక్క కాబట్టి తన ప్రియుణ్ని తన పడకగదికే రప్పించుకుని సుఖించసాగింది. పోనుపోను ఆమె ధైర్యం ఎంత పెరిగిందంటే మొగుణ్ని యింట్లో పెట్టేసి తనే ప్రియుడి యింటికి వెళ్లి వచ్చేసేది.

కొన్నాళ్లకు తొఫానోకు ఒక విషయం తట్టింది - మద్యం విషయంలో భార్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనను విపరీతంగా తాగిస్తోంది కానీ తను మాత్రం చుక్క తీసుకోవడం లేదు. అసలే అనుమానస్వభావం, దానికి తోడు యిప్పుడే సందేహం కొత్తగా చేరింది. సంగతేమిటో కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఒక రోజు దుకాణం నుంచే తప్పతాగి వచ్చినట్లు నటిస్తూ యింటికి రాగానే కుప్పకూలిపోయాడు. ఇతనికి యింకా తాగిస్తే ప్రమాదం అనుకుని మోన్నా వూరుకుంది. అతనికి నిద్ర పట్టిన కాస్సేపటికి తన ప్రియుడి యింటికి బయలు దేరింది.

ఆమె వెళ్లిన తర్వాత యితనికి మెలకువ వచ్చింది. పక్కన చూస్తే భార్య లేదు. వీధి తలుపు దగ్గర వేసి వుంది. అంటే ఆమె ప్రియుడు యింటికి వెళ్లిందన్నమాట అనుకుని తలుపు లోపల్నుంచి గడియ వేసుకుని కాచుకున్నాడు. ఇంకో గంటకు ఆమె వచ్చి తలుపు నెట్టితే తెరుచుకోలేదు. పెరటి తలుపూ మూసేసి వుంది. మొగుడు కిటికీ తలుపు తెరిచి ''కాస్సేపటిలో తెల్లవారబోతోంది. ఇప్పటిదాకా ఎవడితో కులికావో వాడి దగ్గరకే పో. తెల్లవారగానే అందర్నీ పిలిచి పంచాయితీ పెట్టి నీ బండారం బయటపెడతాను.'' అన్నాడు.

ఆమె బతిమాలుతూ ''ఒక్కసారి తలుపు తీసి లోపలకి రానిస్తే విషయమంతా బోధపడేట్లు చెప్తాను. 'మా ఆయన వూళ్లో లేడు, ఒంటరిగా వుండడానికి భయంగా వుంది' అని పక్క వీధిలో ఆవిడ బతిమాలితే వెళ్లి కాసేపు కూర్చుని వస్తున్నాను. వెంటనే వచ్చేద్దామని తలుపు దగ్గరేసి వెళ్లాను. ఆవిడ బెదురు తీరేవరకు వుండడంతో కాస్త ఆలస్యమైంది. ఈ మాత్రానికే మీరు ఏదేదో వూహించేసుకుంటే ఎలా?'' అని వాపోయింది.

కానీ మొగుడు ఆమె మాటలు నమ్మలేదు. నువ్వు రంకులాడివి, బొంకులాడివి అన్నాడు. ఇక ఆమెకు విసుగెత్తి పోయింది. ''నీ అనుమాన ప్రవృత్తితో నా ప్రాణాలు తోడేస్తున్నావు. ఇలా బతకడం వృథా. పెరట్లోని బావిలో పడి ఛస్తాను. పొద్దున్న నా శవం బయటకు తేలాక తాగిన మత్తులో నువ్వే నన్ను తోసేశారని జనమంతా అనుకుంటారు. ఊళ్లో వుంటే ఉరి ఖాయం. అందువలన ఉన్నదంతా వదిలేసి శంకరగిరి మాన్యాలు పట్టి పోవాలి. ఆలోచించుకో.'' అంది.

ఇలాటి బెదిరింపులకు లొంగితే మరీ లోకువై పోతాననుకున్న భర్త ఏం చేసుకుంటావో చేసుకో పో అన్నాడు. ఇక ఆమె కాస్సేపాగి, పెరట్లోకి వెళ్లి  చీకట్లోనే ఒక పెద్ద బండరాయి వెతికి, ఎత్తి నూతిలో దభాలున పడేసింది. ఆ శబ్దం వింటూనే భర్త భయపడిపోయాడు. ఆవేశంలో అన్నంత పనీ చేసిందేమో, తనకు ఉరి తప్పదేమోనన్న కంగారులో తలుపు తీసి పెరట్లోకి పరిగెట్టాడు. గుమ్మం పక్కనే దాక్కున్న భార్య వెంఠనే యింట్లోకి చొరబడిపోయి వీధి తలుపు మూసేసింది.

జరిగిన మోసం గ్రహించిన భర్త నూతి దగ్గర్నుంచి గుమ్మం దగ్గరకు పరిగెట్టుకుని వచ్చి తలుపు తట్టి ''తెరు'' అని అరిచాడు.

అప్పటిదాకా భర్తతో గుసగుసలాడుతూ మాట్లాడిన మోన్నా హఠాత్తుగా బిగ్గరగా అరవసాగింది - ''తాగి యింటికి వచ్చే వేళ యిదా? సంసారం చేసే లక్షణమేనా యిది? చూసిచూసి విసుగెత్తిపోయాను. నీ సంగతి వూళ్లో అందరికీ తెలిసి రావాలి. ఇంటి దగ్గర నీ కోసం ఎదురుచూస్తూ నేను కూర్చోవడం, నువ్వు స్నేహితులతో కలిసి తాగితందనాలాడి తెల్లవారేవేళకి కొంప చేరడం? చూస్తాను ఎవరు వచ్చి నీ పక్షాన మాట్లాడతారో..'' అంటూ.

ఆమె కేకలకు యిరుగుపొరుగు లేచి వచ్చారు. మొగుడు బయట నిలబడి వుండడం చూసి అందరూ భార్య మాటల్నే నమ్మారు. 'అబ్బే, ఆమె చెప్పేది తప్పు, యిప్పటిదాకా ఎక్కడో తిరిగి వచ్చి గట్టిగా నిలదీస్తే బావిలో దూకుతానంటూ నాటకం ఆడింది' అంటూ అతను చెప్పబోయాడు. 'నేను ఎటువంటిదాన్నో మీ అందరికీ తెలుసు, బహుశా యిప్పటిదాకా తనే ఎవత్తెతోనో మజా ఉడాయించి వచ్చి వుంటాడు. చిత్తుగా తాగే అలవాటున్నవాడికి వ్యభిచారం అలవాటు కావడం ఎంత సేపు! నేను అదెక్కడ బయటపెడతానో అని భయపడి నేనే ఆ పని చేసినట్లు బనాయిస్తున్నాడు..' అంటూ ఆమె మరింత అల్లరి చేసింది.

వచ్చినవాళ్లల్లో స్త్రీలందరూ ఆమె మాటను బలపరచారు. తొఫానో తాగుబోతని అందరూ ధ్రువీకరించారు. తాగుబోతు, తిరుగుబోతు కావడంలో ఆశ్చర్యం లేదన్నారు. మగవాళ్లకు కూడా ఆ మాట నమ్మవచ్చనిపించింది. ఈ గొడవ పెరిగి పెద్దదై మోన్నా అన్నదమ్ముల దాకా వార్త చేరింది. వాళ్లు అక్కడకు చేరి తొఫానోను ఉతికిఉతికి వదిలిపెట్టారు. ''నా భార్యంటే నాకు చాలా యిష్టం. ఏదో కాస్త అనుమానపు బుద్ధి వున్నమాట నిజమే.'' అంటూ అతను మొత్తుకున్నాడు. అప్పుడు ఆమె ఉదారంగా ''ఆ మాట నిజమే, పోనీ వదిలేయండి.'' అని అన్నలకు సిఫార్సు చేసింది.
ఆమె చూపిన ఔదార్యానికి బదులుగా తొఫానో అప్పణ్నుంచి ఆమెను అనుమానించడం మానేశాడు. ఎవరితో ఏం మాట్లాడినా ఏమీ అనుకునేవాడు కాదు. ఆ అలుసు చూసుకుని ఆమె మరింత రెచ్చిపోయింది.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#4
నెరజాణల కథలు 03

ఇసబెల్లా అనే ఆమె ఒక జమీందారు భార్య. వసంతకాలంలో ఆమె నగరం నుంచి తమకు భూములున్న పల్లెటూరికి విహారానికి వచ్చింది. అక్కడ లియోనెట్టో అనే యువకుడు ఆమెకు తగిలాడు. జీవితంలో వైవిధ్యం కోరుకునే ఇసబెల్లా అతనికి తన ప్రేమ పంచి యిచ్చింది. జమీందారు అప్పుడప్పుడు పల్లెటూరికి వస్తూండేవాడు. అతని రాక ముందుగానే తెలిసేది. అందువలన వీళ్ల వ్యవహారం గుట్టుగానే సాగింది.

ఆ వూళ్లో మోతుబరి లాంబెర్‌ట్యుసియో కన్ను కూడా ఇసబెల్లాపై పడింది. ఆమె వద్దకు వచ్చి తనను కరుణించమని ప్రాధేయపడడంతో బాటు, కరుణించకపోతే యిబ్బందులపాలు చేస్తానన్న బెదిరించి కూడా వెళ్లాడు. అతని సత్తా తెలిసిన మనిషి కాబట్టి ఇసబెల్లా అతనికి మాయమాటలు చెప్పి పంపించి వేస్తోంది. కటువుగా మాట్లాడితే లియోనెట్టోతో వ్యవహారం కనిపెట్టి బయటకు లాగి అల్లరి పెడతాడన్న భయం వుంది.

ఒక రోజు జమీందారు ఉదయమే లేచి నేను ఊరెళ్లాలి, నాలుగైదు రోజుల వరకు రాను అని భార్యతో చెప్పి బయలుదేరాడు. వెంటనే ఆమె మధ్యాహ్నం ఎవరూ లేనివేళ లియోనెట్టోను పిలిపించుకుని అతనితో కులకసాగింది. జమీందారు పొరుగూరు వెళ్లిన సంగతి విన్న వూళ్లో మోతుబరి కూడా గుఱ్ఱం వేసుకుని ఆ యింటికి వచ్చాడు. తన గుఱ్ఱాన్ని యింటి ముందు ఆవరణలో గుంజకు కట్టేసి తను వచ్చానని యింటావిడకు చెప్పమన్నాడు.

దాసి వచ్చి చెప్పగానే పడకగదిలో వున్న ఇసబెల్లా ఉలిక్కిపడింది ''ఇప్పుడెలా?'' అని. ఆమె కంటె లియోనెట్టో యింకా భయపడ్డాడు - ''తనకు దక్కనందుకు కోపం కంటె నాకు యీ అదృష్టం పట్టినందుకు నాపై కోపం పెట్టుకుని సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు యింట్లోంచి బయటపడడమూ కష్టమే, గుమ్మంలోనే కూర్చున్నాడు.'' అని దిగాలు పడ్డాడు.

''అతనంటె నాకే మాత్రమూ యిష్టం లేకపోయినా నీ కోసమేనా అతనితో కాస్సేపు సరసాలాడక తప్పదు. నువ్వు వెంటనే బట్టలేసుకుని యీ గదిలోనే మంచం కింద నక్కి కూర్చో. మా కబుర్లు విని ఓర్చుకోవాల్సి వస్తుంది మరి, సమ్మతమేనా?'' అని అడిగింది. ''నీ మనసు నాకు తెలియనిది కాదు. నాకోసం వాడిని భరిస్తున్నందుకు నీ కాళ్లమీద పడాలి.'' అంటూ లియోనెట్టో మంచం కిందకు జారుకున్నాడు.

ఆమె మోతుబరిని పైకి గదిలోకి రప్పించుకుంది. అతను వస్తూనే ఆమెను ముద్దులు పెట్టుకున్నాడు. ''నీ భర్త వూళ్లో లేడు కదా, నా కోర్కె తీర్చడానికి యిప్పుడు నీకే సంకోచమూ వుండకూడదు'' అంటూ ఆమె మంచం ఎక్కాడు. కౌగిలింతలతో, ముద్దులతో ఆమె సరిపెడదామని చూసినా కుదరలేదు. అమిత తమకంతో ఆమెను పూర్తిగా ఆక్రమించడానికి ముందుకు వంగబోతూ వుండగా పడకగది తలుపు చప్పుడైంది.

''అయ్యగారు తిరిగి వచ్చేశారమ్మా, వాకిట్లో గుఱ్ఱం కట్టేసి వుండడం చూసి, ఎవరిదా అని ఆశ్చర్యపడుతూ దాని దగ్గరకు వెళ్లి చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా మెట్లెక్కి పైకి రావచ్చు'' అంది దాసి తలుపు అవతలి నుంచి.

ఇసబెల్లా కంగారుపడింది. ఒకరు కాదు, యిద్దర్ని దాచడం ఎలా? ఇతన్ని మంచం కిందకు పంపితే అక్కడ లియోనెట్టోను చూసి పగ పెంచుకుని అతని దుంప తెంపుతాడు. అసూయతో తన పేరు బజారు కీడుస్తాడు. అయినా గుఱ్ఱం చూసిన భర్త అనుమానంతో పడకగది సోదా చేస్తే ఒకరికి యిద్దరు దొరికితే కొంప కొల్లేరయినట్లే. తన ప్రాణం తీయవచ్చు కూడా.

ఆమె బుద్ధి పాదరసంలా పనిచేసింది. వంటింట్లోంచి ఒక కత్తి తీసి మోతుబరి చేతికి యిచ్చి ‘‘దీన్ని చేత్తో పట్టుకుని ఝళిపిస్తూ 'నిన్ను వదలనురా, ఇవాళ ప్రాణం తీసేదాకా నిద్రపోను' అని ఆగకుండా అరుస్తూ యింట్లోంచి పారిపో. వాకిట్లో గుఱ్ఱం ఎక్కి ఎవర్నో తరుముతున్నట్లు వెళ్లిపో. వెనకా ముందూ ఎవరూ కనబడని ప్రదేశానికి వచ్చాక అరుపులు ఆపి, మీ యింటికి వెళ్లిపో. మళ్లీ యిటువైపు ఎప్పుడూ రావద్దు. ఇవాళ మా ఆయన చూస్తాడు కాబట్టి మళ్లీసారి కనబడితే గుర్తుపడతాడు'' అని చెప్పింది.

కత్తీ, అరుపుల సంగతి అతనికేమీ అర్థం కాలేదు కానీ ఆమె చెప్పినట్లే చేశాడు. దారిలో ఆమె భర్త అడ్డుపడి ‘నువ్వెవరు? ఎందుకిలా వచ్చావ్‌?’ అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా పిచ్చి పట్టినవాడిలా తన ధోరణిలో తను కేకలు వేసుకుంటూ గుఱ్ఱం ఎక్కి పారిపోయాడు. భర్త అతన్ని వెంటాడబోయి, ఉద్దేశం మార్చుకుని యింటికి తిరిగి వచ్చి భార్య దగ్గరకు వెళ్లి 'ఏమిటిదంతా?' అని అడిగాడు.

''ఏం చెప్పమంటారు? అంతా నా ఖర్మ! మీరు అలా వెళ్లిన కాస్సేపటికే ముందు ఓ కుర్రాడెవరో పరిగెట్టుకుంటూ వచ్చి లోకంలో యింకెక్కడా చోటు దొరకనట్లు మన యింట్లోకి వచ్చిపడ్డాడు - ''రక్షించండి'' అంటూ. ఎవరయ్యా నువ్వు అని అడుగుతూండగానే యిదిగో యీ ఉన్మాది కత్తి పట్టుకుని వచ్చి 'ఏడీ ఆ కుర్రాడు, మీ యింట్లోకి దూరాడని వీధిలో చెప్పారు' అంటూ గదులు వెతకడం మొదలెట్టాడు. ఈ గలభాలో ఆ కుర్రాడు పడగ్గదిలో మంచం కింద దూరినట్లున్నాడు. అసలు వీళ్లెవరో, వాళ్ల మధ్య గొడవేమిటో, ఆ గుఱ్ఱంవాడు యితగాడి ప్రాణం తీస్తానని ఎందుకంటున్నాడో నాకేమీ తెలియటం లేదు.'' అంది ఇసబెల్లా నంగనాచిలా.

ఇదంతా పడగ్గది గుమ్మం ముందు నిలబడి చెప్పింది కాబట్టి మంచం కింద వున్న లియోనెట్టోకు అన్నీ వినబడ్డాయి. తనేం చెప్పాలో అర్థమైంది కూడా. నెమ్మదిగా బయటకు వచ్చి దణ్ణాలు పెడుతూ, ''ఆయనెవరో నాకూ తెలియదండి. ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నాడో ఏమో. నా పోలికలతో వున్నవాడెవడో ఆయన దగ్గర అప్పు పుచ్చుకుని ఎగ్గొట్టినట్టున్నాడు. నేను బజార్లో కనబడగానే 'ఎన్నాళ్లు తప్పించుకుని తిరుగుతావురా' అంటూ కత్తి పట్టుకుని పొడవబోయాడు. నేను భయంతో పరుగులు పెడుతూ వస్తూంటే మీ యిల్లు కనబడింది. నాకు ప్రాణభిక్ష పెట్టిన మీ దంపతులకు ఎల్లకాలం ఋణపడి వుంటాను. సెలవిస్తే వెళతాను.'' అన్నాడు.

''అప్పుడే బయటకు వెళ్లకు. అతను బయట నక్కి వున్నాడేమో. నేను పొరుగూరికై బయలుదేరి ముఖ్యమైన కాగితం మరచానని గుర్తువచ్చి వెనక్కి వచ్చాను. వెంటనే వెళ్లాలి. నా భార్య నీ ఆతిథ్యం సంగతి చూస్తుంది. నువ్వు కాస్త కుదుటపడి, భోజనాదులు ముగించుకుని, కాస్సేపు విశ్రమించి, బాగా చీకటి పడ్డాకనే యిక్కణ్నుంచి వెళ్లు.'' అని చెప్పాడు జమీందారు.
సరేనని తల వూపినా లియోనెట్టో చీకటి పడ్డాక కూడా యిల్లు విడిచి వెళ్లలేదని వేరే చెప్పనక్కరలేదు.
Like Reply
#5
నెరజాణల కథలు 04
టస్కనీలో ఒక ఏబీలో ఒక ఏబట్‌ వుండేవాడు. అతను మహాపండితుడు, పూజావిధానాలలో నిష్ణాతుడు కానీ అతనికి వున్న ఏకైక బలహీనత స్త్రీవ్యామోహం. అందమైన ఆడది కనబడితే అనుభవించకుండా వూరుకోలేడు. అతనా వూరికి కొత్తగా రాగానే వూళ్లో పరిచయమైన అనేకమందిలో ఒకడు - ఫెరోండో అనే డబ్బున్న మూర్ఖుడు. ఆ తెలివితక్కువవాడు ఏం వాగేవాడో ఎవరికీ తెలిసేది కాదు. అయినా ఏబట్‌ అతన్ని దగ్గరకు రానీయడానికి ఒకే కారణం - అతనికి ఒక అందమైన భార్య వుందని తెలియడమే!

ఆమె అందచందాలు ఎలా వున్నాయో చూడగోరి ఏబట్‌ ఫెరోండోతో 'నువ్వు ఒక్కడివే చర్చికి వస్తే సరిపోదు, నీ భార్యను కూడా తీసుకుని రా' అని పదేపదే చెప్పసాగాడు. ఓ రోజు ఆమె చర్చికి వచ్చింది. నిజంగానే అద్భుతసౌందర్యవతి. ఆమెను తన ప్రవచనాలతో ఏబట్‌ వూదరగొట్టడంతో ఆమె ముగ్ధురాలై పోయి మళ్లీ మళ్లీ చర్చికి వచ్చింది. ఒక రోజు కన్ఫెషన్‌ (పాపాల ఒప్పుకోలు) చేస్తానని అడిగింది.

ఏబట్‌ సరేనన్నాడు. కన్ఫెషన్‌లో ఆమె మనసు విప్పింది - ''ఫాదర్‌, నా జీవితం దుర్భరం. నా భర్త వట్టి మొద్దు. తెలివిలేనివాడు. అతనితో గంట గడపడమే కష్టం అనుకుంటే జీవితమంతా గడపడం మహా కష్టం. ఏదో యిన్నేళ్ల కాపురం వలన మాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ మా మధ్య శృంగార కార్యకలాపాలేమీ జరగటం లేదు. నాకు అతనితో మాట్లాడడమే దుర్భరం. ఇక శయనించడం ఎలా? నేను భర్త వున్న వితంతువును అనుకోవడం సబబు. పోనీ ఎలాగోలా ఒకే కప్పు కింద అపరిచితుల్లా గడిపేద్దామా అంటే అదీ సాగటం లేదు. అతను మహా అనుమానపు మనిషి. అనుమానజాడ్యం వలన నేను ఎవరితో మాట్లాడినా అనుమానిస్తాడు. ఇరుగుపొరుగులతో చిరునవ్వు నవ్వినా సందేహమే. మీరు మతాధికారి కాబట్టి నన్ను ఒకత్తినీ రానిచ్చాడు కానీ లేకపోతే మా యింటికి ఎవర్నీ రానివ్వడు, పోనివ్వడు. నాకేం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఇలా బతికి ప్రయోజనం ఏముంది?'' అని మొత్తుకుంది.

''బిడ్డా, నీ కష్టాలకు మూలం, నీ భర్తకు బుద్ధి వికసించకపోవడం. దానికి మందు లేదు. కానీ అతనికున్న అసూయారోగానికి మందు వుంది. అతన్ని నరకానికి పంపి ఆ రోగం కుదిరిస్తే బాగుపడతాడు. అప్పుడు నీ కష్టాలు కొంతమేరకు గట్టెక్కుతాయి.'' అన్నాడు ఏబట్‌.

''జీవించి వుండగా మనిషి నరకానికి ఎలా వెళతాడు?''

''నా వంటి పూజారి పర్యవేక్షణలో సరైన క్రతువు జరిపిస్తే అతని దోషగుణమంతా క్షాళన జరిగి దేవుడు అతన్ని పునీతుణ్ని చేసి మళ్లీ భూమికి పంపిస్తాడు. అప్పుడు నీ కాపురం చక్కబడుతుంది.''

ఫెరోండో భార్య చాలా సంతోషించింది. ''అలా చేయండి స్వామీ, మీకు ఋణపడి వుంటాను.'' అంది మోకరిల్లి.

''ఈ ఋణాలు వుంచుకోకూడదు. ఎప్పటికప్పుడు తీర్చివేయాల్సిందే. నా కోరిక తీర్చి ప్రత్యుపకారం చేయి.'' అన్నాడు ఏబట్‌.

ఆమె నిర్ఘాంతపోయి ''స్వామీ మీరు పవిత్రమూర్తి. మీకు యిలాటి తుచ్ఛమైన కోర్కె కలగడం..'' అంది.

''నా ఆత్మ పవిత్రమైనదే, పరిశుద్ధమైనదే. దేహం చేసే పాపాలు దానికి అంటవు. ఒక పూజారి నిన్ను చూసి మోహితుడయ్యాడంటే నువ్వు గర్వించాలి. ఎందుకంటే వృత్తిపరంగా మేము ఎందరో స్త్రీలను అతి సన్నిహితంగా చూస్తాము. వారిలో ఎందరో అందగత్తెలున్నా మా మనసు చలించదు. కానీ నిన్ను చూడగానే చలించానంటే దాని అర్థం, నువ్వు దైవకృపకు పాత్రురాలయ్యావని. అందువలననే దైవం నా ద్వారా నీ సంసారాన్ని చక్కదిద్దాలనుకున్నాడు. ఆ క్రమంలో నా దేహాగ్నిని తృప్తిపరచి, నా మనసును తనవైపు మళ్లించాలని చూస్తున్నాడు.''

ఆమె ఆలోచనలో పడింది. అదను చూసి ఏబట్‌ మరింతగా వివరించాడు - ''అతను తన పాపప్రక్షాళనలో మునిగివుండగా నేను నీకు తోడుగా వుంటాను. నా రాకపోకలు ఎవరికీ తెలియనివ్వను. చర్చికి విరాళాలుగా వచ్చిన అనేక నగలున్నాయి. నీ వంటి అపురూప సౌందర్యవతులే వాటిని ధరించడానికి  యోగ్యులు. ఇదిగో యీ వుంగరం ధరించు. సంశయాలు తొలగిపోతాయి.'' అన్నాడు. విలువైన ఆ వుంగరం చూసి ఆమె వూగిసలాట పటాపంచలైంది. అంగీకారంగా తలవూపింది.

కొన్ని రోజుల తర్వాత ఏబట్‌ ఫెరోండోను తన వద్దకు రప్పించాడు. అవీ యివీ కబుర్లు చెపుతూ అతనికి యిచ్చిన పానీయంలో తగుపాళ్లలో ఒక పొడిని కలిపాడు. ఆ పొడి అతను తూర్పుదేశాల నుండి సంపాదించాడు. దానివలన కొద్ది సేపటిలో ఎంతటి గాఢమైన నిద్ర వస్తుందంటే ఉచ్ఛ్వాసనిశ్వాసాలు ఆగిపోయి చచ్చిపోయారేమో ననిపిస్తుంది. పానీయం తాగించిన తర్వాత అతన్ని వెంటపెట్టుకుని యితర పూజారుల వద్దకు తీసుకెళ్లాడు.

అక్కడ అందరూ అతన్ని వేళాకోశం చేస్తూ ఆటపట్టిస్తూండగానే అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. అతని నాడి పట్టుకుని చూసి చనిపోయాడని వాళ్లు తేల్చాక, వెంటనే అతని అంత్యక్రియలకు చర్చి ఆవరణలోని శ్మశానంలోనే ఏర్పాటు చేయడం, శాస్త్రోక్తంగా శవపేటికలో పెట్టి సమాధి చేయడం జరిగిపోయాయి.

మూడు రోజుల తర్వాత ఏబట్‌ తాను గతంలో పనిచేసిన వూళ్లోని నమ్మకమైన సహచరుణ్ని రప్పించాడు. అతను మంచి దృఢకాయుడు. ఇద్దరూ కలిసి రాత్రి ఫెరోండో సమాధి తవ్వి అతన్ని బయటకు లాగారు. చర్చిలో ఒక మూల చీకటిగదిలోకి తీసుకెళ్లి అతని బట్టలూడదీసి, మొహం మీద నీళ్లు చిలకరించి లేపారు. పొడి ప్రభావం నాలుగురోజులే కాబట్టి ఫెరోండో నిద్రలోంచి లేచినట్లు లేచాడు.

వెంటనే ఏబట్‌ అనుచరుడు ఒక కొరడా తీసుకుని అతన్ని చితకబాదాడు. ''ఏమిటిది? ఎవరు నువ్వు? ఇక్కడంతా చీకటిగా వుందేమిటి?'' అని అడిగితే ''ఇది నరకం. బతికివుండగా చేసిన పాపాలకు శిక్ష వేసి, ప్రక్షాళన చేసి మన ఆత్మలను స్వర్గానికి పంపుతారు. నేను కూడా నీలాటి పాపినే. అయితే తక్కువ పాపిని. అందువలన నిన్ను శిక్షించే శిక్షను నాకు దేవుడు విధించాడు.'' అన్నాడతను.

''నేను చేసిన పాపమేమిటి?'' అడిగాడు ఫెరోండో.

''దేవుడు నీకు మంచి జీవితాన్ని యిచ్చాడు, అందమైన భార్యను యిచ్చాడు. అయినా నువ్వు అసూయాగ్రస్తుడివై ఆమె మనసు కష్టపెట్టావు. ఆమె నీ పట్ల ఎంతో విశ్వాసంగా వున్నా అనుక్షణం సందేహిస్తూ నీ జీవితాన్ని దుర్భరం చేసుకున్నావు. ఆమె జీవితాన్ని నాశనం చేశావు. అందుకని నీకీ శిక్ష.''

''నిజమే, నా భార్య చాలా మంచిది. ఆమెకు వేదన కలిగించాను.'' అని ఒప్పుకుంటూనే ఫెరోండో ''ఇది నరకమైతే వేలాదిమంది వుండాలి కదా, నువ్వూ నేనూ మాత్రమే వున్నామేం?'' అని అడిగాడు.

''లేరని ఎవరు చెప్పారు? చుట్టూ పాపులే, అయితే ఒకరి కొకరు కనబడరు. బాధలు భరించలేక వాళ్లు పెట్టే కేకలు విన్నా, రక్తసిక్తమైన వారి శరీరాలు చూసినా యితర పాపులు భయపడతారని దేవుడు యీ ఏర్పాటు చేశాడు. మనిద్దరం ఒక జంట. అందుకే ఒకరికొకరు కనబడుతున్నాం.'' అంటూ మళ్లీ కొట్టడం లంకించుకున్నాడు.

ఈలోగా ఏబట్‌ అతని దుస్తులు వేసుకుని ఎవరి కంటా పడకుండా చీకట్లో ఫెరోండో భార్య దగ్గరకి వెళ్లాడు. ఆమెకి మెళ్లోకి ఒక నగ బహూకరించి ప్రసన్నురాలిని చేసుకున్నాడు. ఆమె కూడా అతని తెలివితేటలను చూసి మురిసింది. మూర్ఖుడైన తన భర్త కంటె యితనే ఎంతో గొప్పగా తోచాడామెకు.

ఇక్కడ దెబ్బలు తినితిని ఫెరోండో సొమ్మసిల్లి పడేవేళకు లేపి ఏబట్ అనుచరుడు అన్నం, పానీయం యిచ్చాడు. ఫెరోండోకు అనుమానం వచ్చింది, ''చచ్చిపోయినవాళ్లకు ఆకలిదప్పులుండవని అంటారుగా..'' అని.

''ఎవరా అన్నది? తెలియనివాళ్లు చెప్పిన మాటలు వినకు. ఆకలి వేస్తుంది. వాళ్ల తాలూకువాళ్లు భూలోకంలో చర్చిలో ఏ ఆహారం యిస్తే అదే వీళ్లకు దక్కుతుంది. నిజానికి నీకిప్పుడు పెడుతున్నవి నిన్న ఉదయం నీ భార్య చర్చిలో పేదలకు పెట్టినవే.'' అని చెప్పాడు ఏబట్‌ సహచరుడు.

తినడం ముగించాక ఫెరోండో ''భోజనం బాగానే వుంది కానీ పానీయం బాగా లేదు. నా భార్య కక్కుర్తిపడి చవకరకం మద్యం పోసినట్లుంది. నేలమాళిగలో దాచిన నేను రహస్యంగా దాచుకున్న మద్యాన్ని దానమిచ్చినట్టయితే నాకు మంచిది దక్కేది.'' అన్నాడు.

వెంటనే యీ వార్త ఏబట్‌కు వెళ్లింది. అతను ఫెరోండో భార్యకు చెప్పి ఆ మద్యాన్ని బయటకు తీయించి యిద్దరూ కలిసి తాగారు.

నెలలు గడుస్తున్న ఏబట్‌ ఫెరోండో భార్యను మరింత శ్రుతి చేస్తున్నాడు. ఇక్కడ అతని అనుచరుడు ఫెరోండోను ఎడాపెడా వాయించేస్తున్నాడు. ఫెరోండో దుస్తుల్లో రాత్రి అయ్యేసరికి ఏబట్‌ వాళ్ల యింటికి వెళుతూ, తెల్లవారుఝామునే తిరిగి వచ్చేసేవాడు. కొన్ని సార్లు యిరుగుపొరుగులు అతన్ని చూడడం సంభవించింది కానీ ఏబట్‌ను సాధారణ దుస్తుల్లో చూడకపోవడం వలన, అతను వేసుకున్న ఫెరోండో దుస్తుల కారణంగా అది ఫెరోండో దెయ్యంగా భ్రమపడేవారు. భార్యమీద వ్యామోహంతో యింటి చుట్టుపట్లే సంచరిస్తోందని చెప్పుకునేవారు. ఈ పుకార్లు విని అతని భార్య నవ్వుకునేది.

ఇది ఎంతకాలం సాగేదో కానీ ఫెరోండో భార్య గర్భవతి అయింది. ఇక ఫెరోండోను బయటకు తీసుకురాక తప్పదని ఏబట్‌ గ్రహించాడు.

మర్నాడు దేవదూతలా వేషం వేసుకుని, గొంతు మార్చుకుని ''ఫెరోండో, నీకో శుభవార్త, దేవుడు నిన్ను కరుణించాడు. నీ తప్పు నువ్వు గ్రహించి అసూయాగుణాన్ని విడిచిపెట్టావు కాబట్టి నీకు మళ్లీ బతికే అవకాశం యిస్తున్నాడు. నీ భార్య నీకొక శిశువును కంటుంది. దాన్ని దైవప్రసాదంగా స్వీకరించు.  నీ భార్య, నీ స్నేహితుడైన ఏబట్‌ చేసిన ప్రార్థనల కారణంగానే నీవు పునర్జీవితుడవుతున్నావు. వాళ్ల మనసులు ఎప్పుడూ కష్టపెట్టకు. నీ భార్య ఉత్తమురాలు, ఎప్పుడూ శంకించకు. ఆమె ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా ఊరికే అనుమానించి వేధించి దైవాగ్రహానికి గురి కావద్దు. ఏబట్‌ మాట ఎన్నడూ జవదాటవద్దు. అతను నీ ప్రాణదాత అనే మాట మర్చిపోవద్దు.'' అని గంభీరంగా చెప్పాడు.

''చనిపోయినవారు మళ్లీ బతకడం కల్ల అంటారు కదా'' అంటూ ఆశ్చర్యపడ్డాడు ఫెరోండో.

''దేవుడు తలచుకుంటే ఏ అద్భుతమైనా జరుగుతుందని కూడా వారనలేదా?'' అని చివాట్లు వేశాడు ఏబట్‌.

ఆ రాత్రి పానీయంలో మళ్లీ పొడి వేసి కలిపారు. ఫెరోండో మూర్ఛపోయాడు. అతని బట్టలు మళ్లీ అతనికి తొడిగేసి, తీసుకెళ్లి సమాధిలో శవపేటికలో పడుకోబెట్టేశారు. మర్నాటికల్లా ఫెరోండోకు మెలకువ వచ్చింది. శవపేటిక చీలికల్లోంచి వెలుతురు పడడం చూసి, కాస్త ప్రయత్నించి మూత తీసుకుని బయటకు వచ్చేశాడు. అతన్ని చూడగానే చర్చిలోని పూజారులు కంగారుపడ్డారు. ఏబట్‌ను పిలుచుకుని వచ్చారు. అతను కాస్సేపు ఆశ్చర్యం నటించి, తన ప్రార్థనలను విన్నందుకు దైవాన్ని పొగిడి, దైవలీలను కొనియాడి ఫెరోండోను యింటికి పంపించాడు.

అతను యింటికి వెళ్లి తన నరకయాతనల గురించి చెప్తే అందరూ ఆశ్చర్యపడ్డారు. చచ్చి బతికిన మనిషిగా అందరూ మెచ్చుకున్నారు తప్ప అతన్ని చూసి ఎవరూ హేళన చేయలేదు. అతను తిరిగి వచ్చిన రాత్రే అతని భార్య దరిచేరింది. దేవుడు మనను మరో బిడ్డతో కరుణిస్తాడంటూ ఫెరోండో మురిసిపోయాడు. అప్పటికే కరుణించిన సంగతి తెలిసిన తెలిసిన అతని భార్య ముసిముసి నవ్వులు నవ్వుకుంది.
మళ్లీ 'నరకానికి' వెళ్లే ఉద్దేశం లేని ఫెరోండో తన భార్యపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. అప్పటికే ఏబట్‌ను బాగా మరిగిన ఆమె ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది. తొమ్మిది నెలల తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఫెరోండో ఆ బిడ్డను దేవుడిచ్చిన కానుకగానే చూసి మురిశాడు. అతని భార్య, ఏబట్‌ రహస్యంగా కలిసిన ప్రతీసారీ ఫెరోండో అమాయకత్వాన్ని తలచుకుని పడిపడి నవ్వుకునేవారు.
Like Reply
#6
నెరజాణల కథలు – 05

ఫ్లారెన్సునుంచి పారిస్‌ వెళ్లి స్థిరపడిన ఒక ధనికవర్తకుడికి లొడోవికో అనే కొడుకు వుండేవాడు. అతను ఫ్రెంచ్‌ రాజవంశీకుల పిల్లలతో కలిసి పెరగడం వలన కులీనసంప్రదాయాలన్నీ బాగా నేర్చాడు. ఒకసారి వారి స్నేహితుల మధ్య లోకంలో అందరి కంటె ఎవరు అందగత్తె అనే చర్చ వచ్చింది. బొలోనాలో వున్న ఎగానో అనే పెద్ద వ్యాపారి భార్య మడోనాను మించిన సౌందర్యవతి లేదని చాలామంది అన్నారు. ఆ మాట నిజమో కాదో తెలుసుకోవాలన్న కోరిక దహించివేయగా లొడొవికో తండ్రితో ఏదో సాకు చెప్పి బొలోనా వెళ్లాడు.

అదృష్టవశాత్తూ అతను వచ్చిన మూడో రోజునే ఒక విందు జరగడం, దానిలో ఆమెను చూడడం సంభవించింది. ఆమె ప్రేమను సంపాదించి తీరాలని, దానికై ఎంత కష్టానికైనా వెరవకూడదని నిశ్చయించుకున్నాడు. వాకబు చేయగా వాళ్ల యింట్లో పనివాడి అవసరం వుందని తెలిసింది. తను బస చేసిన పూటకూళ్లిల్లు యజమానితో ''నా పేరు ఎనోచినో. ఉద్యోగం కోసం యీ వూరు వచ్చాను. ఎగానో యింట్లో నౌకరు పని యిప్పించగలవా' అని అడిగాడు.

‘'మూడు రోజులుగా మీ ప్రవర్తన చూస్తున్నాను. ఎగానో వంటి కులీనుడి యింట్లో పనిచేయాలంటే నీలా మర్యాద, మప్పితం తెలిసున్నవాడే కావాలి, నేను సిఫార్సు చేస్తాను’' అన్నాడతను. అతని అందం, సంస్కారయుతమైన అలవాట్లు గమనించిన ఎగానో అతన్ని వెంటనే పనివాడిగా పెట్టుకున్నాడు.

ఒకే యింట్లో వుండడంతో అతనికి తరచుగా మడోనాను చూసే అవకాశం కలిగేది. ఆమె కూడా యితన్ని చూసి ముచ్చటపడేది. శ్రద్ధగా పనిచేసి యజమాని, యజమానురాలి అభిమానాన్ని చూరగొన్నాడు. ఏదో మంచి కుటుంబానికి చెందినవాడై వుండి, అనుకోకుండా ఆస్తి కరిగి పోవడం వలన యిలాటి పనికి వచ్చి వుంటాడని ఆమె అనుకుని అతన్ని ఆదరంగా చూస్తూ, కాస్త చనువుగా వుండేది.

ఇలా నెల్లాళ్లు గడిచాయి. ఒక రోజు ఎగానో వేరే వూరు వెళ్లినపుడు ఆమెకు ఏమీ తోచక అతన్ని చదరంగం ఆడడానికి పిలిచింది. ఆటలో నైపుణ్యం చూపడంతో బాటు చమత్కార సంభాషణతో అతనామెను ఆకట్టుకున్నాడు. ఆట చూస్తున్న పరిచారకులు ఒకరొకరు వెళ్లిపోయి, యిద్దరే మిగిలినపుడు అతను దీర్ఘంగా నిట్టూర్చాడు.

''ఏమైంది?'' అని ఆమె ఆదుర్దాగా అడిగింది. జవాబు చెప్పకుండా యిలా రెండు మూడుసార్లు చేశాక, ఆమె తన ప్రశ్నను రెట్టించింది. ''మీతో చెపితే యింకెవరికైనా చెప్తారని నా భయం'' అన్నాడితను.

ఎవరితోనూ చెప్పనని ఆమె ఒట్టు వేశాక తన కథ చెప్పి 'నా ప్రేమకు మీరు స్పందించకపోయినా ఫర్వాలేదు కానీ నన్ను పనిలోంచి తీసేయకండి, మిమ్మల్ని చూసే అవకాశం కూడా పోగొట్టుకుంటాను' అని వేడుకున్నాడు. ఇతని కథ విని ఆమె కూడా నిట్టూర్చింది.

''ఎనోచినో, నా అందం చూసి వెంట పడినవారు వందల సంఖ్యలో వున్నారు. కానుకలు పంపిస్తామని, నెత్తిన పెట్టుకుంటామని అనేక కబుర్లు పెట్టారు. కానీ నీలా ఎవరూ పనివాడిగా చేరలేదు. నీలాటి ఉత్తమవంశంలో పుట్టినవాడు కావాలనుకుంటే ఎవరైనా అందగత్తెను పెళ్లి చేసుకోవచ్చు. కానీ నా కోసం, నా చూపు కోసం, నీ కోరిక తీరుతుందో లేదో తెలియకుండా యింత కష్టానికి సిద్ధపడ్డావంటే, అందునా సేవకుడి అవతారం ఎత్తావంటే నీకు నాపై వున్న ప్రేమ అంతా యింతా కాదు. అంతటి ప్రేమ పొందగలగడం నా అదృష్టం.'' అందామె. ఆలోచించుకోవడానికి కాస్త సమయం యిమ్మనమంది.

ఇంకొక వారం పోయిన తర్వాత అతన్ని పక్కకు పిలిచి ''నేను చెప్పినట్లు చెయ్యి. ఆర్ధరాత్రి మా పడగ్గదికి వచ్చేయి. తలుపు తీసి వుంచుతాను. లోపలకి వచ్చి తలుపు గడియ వేసేసి, మంచం దగ్గరకి రా. మా ఆయన వైపుకి కాకుండా నా వైపుకి వచ్చి, నేను నిద్రపోతూ వుంటే మెల్లగా తట్టి లేపు. ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను.'' అంది. ఎనోచినో ఆనందంతో తల వూపాడు.

ఆ రాత్రి ఎనోచినో తన వక్షంపై చేయి వేయగానే ఆమె అతని అరచేతి వేళ్లలో తన వేళ్లను చొనిపి గట్టిగా పట్టుకుంది. అటు తిరిగి భర్తను నిద్ర లేపింది. ఇతను ఉలిక్కిపడ్డాడు, భయపడి పారిపోదామంటే ఆమె పట్టు వదలటం లేదు. ఒక చేయి ఆమెకు అప్పగించి వొంగి మంచం కింద నక్కాడు.

ఎగానో నిద్ర లేచి ''ఏమిటి సంగతి?'' అని అడిగాడు. ''మన దగ్గర పనిచేసే ఎనోచినోపై మీ అభిప్రాయం ఏమిటి?'' అని అడిగింది మడోనా.

''ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చాడు?'' అన్నాడతను చికాగ్గా. ''మంచివాడు, బుద్ధిమంతుడు. మన పనివాళ్లలో ఆణిముత్యం. అతని గురించి యిప్పుడీ చర్చ ఎందుకు?''

''నేనూ అలాగే అనుకున్నాను. కానీ నాకేదో తేడాగా అనిపిస్తోంది అతని వ్యవహారం. నిన్న మీరు సరుకులు కొనడానికి వూరెళ్లినపుడు నా దగ్గరకు వచ్చి నేనంటే పడి ఛస్తున్నానని, నా కోసం ప్రాణాలైనా యిస్తాననీ అన్నాడు.''

ఇది వింటూనే ఎనోచినో పై ప్రాణాలు పైకి పోయాయి.

భార్య చెప్పిన మాట విని ఎగానో నిద్ర తేలిపోయింది. లేచి కూర్చుని ''అవునా!? మరి దానికి నువ్వేమన్నావ్‌?'' అని అడిగాడు.

''అతని సంగతేమిటో పూర్తిగా తెలుసుకోవాలని నాకూ నువ్వంటే యిష్టమే అని చెప్పాను. అయితే రేపు రాత్రి తోటలో నీటిబుగ్గ దగ్గరకి రా, ప్రేమించుకుందాం' అన్నాడు.''

ఈ అబద్ధానికి ఎనోచినో కొయ్యబారిపోయాడు.

''ఎంత పొగరు? ఎంత మోసం?'' అని ఎగానో ఆవేశపడ్డాడు.

''అందుకే మీరేం చేస్తారంటే నా పరికిణీ కట్టుకుని, పైన మేలిముసుగు వేసుకుని అతను చెప్పిన చోటకి వెళ్లి చీకట్లో కూర్చోండి. ఎంత ఆలస్యమైనా అతను వచ్చి సరససల్లాపాలు చేయగానే చెయ్యి గట్టిగా పట్టుకుని యింట్లో పనివాళ్లందరినీ పిలిచి బాగా తన్నించండి. తక్కిన పనివాళ్లకు కూడా బుద్ధి వస్తుంది.'' అంది మడోనా.

''ఇప్పుడే వెళుతున్నా'' అన్నాడు ఎగానో. అతను వెళ్లగానే భయంతో బిక్చచచ్చి వున్న ఎనోచినోను మడోనా తనపైకి లాక్కుంది. గబగబా ముద్దులు పెట్టి అతని భయాన్ని పోగొట్టి ''వెళ్లి తలుపు గడియ వేసేసి రా, కనీసం యింకో అరగంట దాకా ఆయన రాడు.'' అంది. ఆ తర్వాత యిద్దరూ స్వర్గసుఖాలు రుచి చూశారు. ఆమె ఆంతర్యం తెలుసుకోలేక కాస్సేపు తిట్టుకున్న ఎనోచినో యిలాటి స్వేచ్ఛ దొరకడంతో రెట్టింపు ఉత్సాహంతో, ఉద్రేకంతో తన తమకం తీర్చుకున్నాడు. అరగంట గడిచాక ''మరి నేను వెళ్లిరానా?'' అని అడిగాడు.

''లేదు, మా ఆయన కథ ముగింపుకి తీసుకురావాలి కదా'' అంది మడోనా నవ్వుతూ. ఏం చెయ్యాలో చెప్పింది.

ఎనోచినో ఒక దుడ్డుకర్ర పట్టుకుని తోటలోకి వెళ్లాడు. మడోనా దుస్తులు వేసుకుని కూర్చున్న ఎగానోను వెనకనుంచి కర్ర తీసుకుని బాదడం మొదలుపెట్టాడు. ''ముదనష్టపుదానా, ఎగానో ఎంత మంచివాడు, ఎంత గొప్ప మనసున్నవాడు, నిన్నెంత బాగా చూసుకుంటాడు, అలాటి వాడికి ద్రోహం తలపెడతావా? నీ టక్కులమారితనం గమనించి, కావాలనే నీ వలలో పడినట్లు నటించాను. నీ అసలు రంగు బయటపడింది.'' అని తిడుతూ చితక్కొట్టేశాడు.

ఎగానో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు. చివరకు ఎగానో ముసుగు తీసేసి, పరికిణీ విప్పేసి, అతని చేతిని గట్టిగా పట్టుకుని 'నేను మడోనాను కాను, ఎగానోని' అని మొత్తుకున్నాడు. అతన్ని చూస్తూనే 'మీరా!?' అంటూ కాళ్ల మీద పడిపోయాడు ఎనోచినో.
దెబ్బలు తిన్నా అతనికి తనపై గల స్వామిభక్తికి, తన భార్య పతిభక్తికి ఎగానో ఎంతో సంతోషించాడు. ఇద్దరూ దక్కడం తన అదృష్టమనుకున్నాడు.  ఇద్దరూ మరింత చనువుగా వుండేట్లు అవకాశాలు కల్పించాడు. ఎనోచినో, మడోనా వాటిని పరిపూర్ణంగా వినియోగించుకున్నారు.
Like Reply
#7
నెరజాణల కథలు 06

ఫ్లారెన్సులో జియానీ అనే ఓ వ్యాపారస్తుడు వుండేవాడు. అతనికి పాటలు, కీర్తనలు పాడే పిచ్చి. చర్చికి వెళ్లి కీర్తనలు పాడుతాననేవాడు. అతని గొంతు బాగుండకపోయినా చర్చిలో పూజారులు అతన్ని ప్రోత్సహించి పాడిస్తూ వుండేవారు. ఎందుకంటే అతనో వెర్రిమాలోకం. తన కీర్తనలు మెచ్చుకున్న పూజారులకు విందులిప్పించేవాడు. వాటిని మరిగి వాళ్లు యితన్ని మరీమరీ పాడమనేవారు. నీ అంతటి భక్తుడు లేడని ప్రశంసలు కురిపించేవారు.

తన మొగుడు యిలా ఒళ్లూపై తెలియకుండా ఖర్చు పెట్టడం అతని భార్య మోనాకు నచ్చేది కాదు. ఆమె చాలా తెలివైనది, సరసురాలు. తనకు యిలాటి అయోమయం భర్త దొరికినందుకే బాధపడుతూ రోజులు నెట్టుకు వస్తూ వుంటే గత అయిదారేళ్లగా యీ కీర్తనల పిచ్చి పట్టుకోవడంతో చిర్రెత్తిపోయింది. వసంతకాలం మూడు నెలలూ పల్లెటూరిలో తమకున్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వుంటానంది. సంసారం అనే లంపటం లేకపోతే మరిన్ని కొత్త కీర్తనలు నేర్చుకోవచ్చు కదాని జియానీ సరేనన్నాడు.

ఆ పల్లెటూరిలో మోనాకు ఫెడిరిగో అనే అందమైన యువకుడు తారసిల్లాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ కలవాలంటే ఇంట్లోని వంటమనిషి భార్యకు, పనిపాటలు చూసేతని భార్యకు తెలియకుండా వ్యవహారం నడపాలి. అది కాక జియానీ మధ్యమధ్యలో హఠాత్తుగా వూరునుంచి వచ్చేస్తూంటాడు. అందువలన ఏ రోజు అనువైనదో తెలుసుకోవడానికి ఫెడిరిగోకు తెలియడానికి వాళ్లు సంకేతం పెట్టుకున్నారు.

మోనా యింటి పక్క పొలంలోని దిష్టిబొమ్మ మొహం తూర్పువైపుకి తిరిగి వుంటే జియానీ వూళ్లో లేడని అర్థం. అప్పుడు ఫెడిరిగో అర్ధరాత్రి వచ్చి అలికిడి కాకుండా తలుపును మూడుసార్లు గోకాలి. అప్పుడు మోనా తనే స్వయంగా పనివాళ్లకు మెలకువ రాకుండా మెల్లగా తలుపు తీసి ఫెడిరిగోను పడకగదిలోకి తీసుకెళుతుంది. దిష్టిబొమ్మ పడమటివైపుకి తిరిగి వుంటే రాకూడదని అర్థం. ఈ విధమైన ఏర్పాటుతో వాళ్ల రాసలీలలు నిరాఘంటంగా సాగిపోతున్నాయి.

ఒక రోజు మధ్యాహ్నం వంటమనిషి, అతని భార్య సామాన్లతో బండికోసం ఎదురుచూస్తూ ఫెడిరిగోకు కనబడ్డారు. సంగతేమిటని అడిగితే తమ బంధువులు పోయారని అందువలన వూరు వెళుతున్నామని చెప్పారు. 'మరి యీ రెండు, మూడు రోజులు మీ యజమానురాలు తనే స్వయంగా అన్నీ పనులూ చేసుకోవాలేమో పాపం' అన్నాడు ఫెడిరిగో.

'అవును, ఎవర్నీ ఏర్పాటు చేయలేకపోయాం. అయినా ఫర్వాలేదు వెళ్లి రమ్మంది.' అన్నారు వాళ్లు. మోనా ఒక్కత్తీ వుందని తెలియగానే వెంటనే ఫెడిరిగో ఆమె యింట్లో వాలిపోయాడు. ఇతన్ని చూస్తూనే ఆమె ఆనందాశ్చర్యాలలో మునిగిపోయింది. 'నువ్వు రావడం ఎవరూ చూడలేదు కదా' అని అడిగి నిర్ధారించుకుని, అతని చేతుల్లో వాలిపోయింది.

వాళ్లు శృంగారక్రీడలో మునిగివుండగా తలుపు చప్పుడైంది. ''మోనా'' అని జియానీ గొంతు వినబడగానే యిద్దరూ వులిక్కిపడ్డారు. ''చెప్పా పెట్టకుండా నా మొగుడు దిగబడ్డాడే. ఇప్పుడెలా?'' అని ఫెడిరిగో కంగారుపడ్డాడు. ''వెనకగుమ్మంలోంచి పారిపోవాలన్నా చుట్టూ పొలాలే కాబట్టి అతని కంటపడతాను.''  అని వాపోయాడు.

''మా స్నానాల గదిలో పాతకాలం నాటి ఆవిరి స్నానాల నిలువెత్తు తొట్టి వుంది. మూతి చిన్నగా, గుండ్రంగా వుంటుంది. దానిలోకి దూరి తల లోపలకి పెట్టుకో. ఎవరికీ కనబడవు. మా ఆయన స్నానాల గదిలోకి వచ్చినా చాలా ఏళ్లగా వాడటం లేదు కాబట్టి దాని కేసి చూడడు. చీకటి పడ్డాక, వీలు చూసుకుని నిన్ను బయటకు పంపేస్తాను.'' అంది మోనా.

జియానీ ఒక్కడూ రాలేదు, ఎవర్నో వెంటపెట్టుకుని వచ్చాడు. అతన్ని గుమ్మంలో నిలబెట్టి లోపలకి వచ్చి భార్యతో ''ఎల్లుండి వద్దామనుకున్నాను కానీ యింతలో యితను తగిలాడు. మనింట్లో పడి వున్న పాత ఆవిరి స్నానం తొట్టి గురించి చెపితే తను కొంటానన్నాడు. అయిదు వెండి నాణాలు యిస్తానన్నాడు.'' అని గొప్పగా చెప్పాడు.

మోనా బుర్ర పాదరసంలా పనిచేసింది. చరచరా మొగుణ్ని స్నానాల గది వైపు తీసుకెళ్లి తలుపు తీసి, లోపలున్న ఫెడిరిగోకు వినబడేట్లా గట్టిగా అరిచింది. ''ఇంత పెద్ద తొట్టెకు ఐదు వెండినాణాలు మాత్రమేనా? మీరు వ్యాపారం ఎలా చేస్తున్నారో నా కర్థం కాదు. ఏ వ్యాపారం తెలియని నేనే ఊళ్లో ఒకడు తగిలితే ఏడుకు ఒప్పించాను. లోపల ఎలా వుందో చూస్తానంటూ లోపలకి దిగాడు. ఈ లోపున పెద్ద బేరం దొరికిందంటూ ఫ్లారెన్సు నుంచి పరుగెత్తుకుని వచ్చారు మీరు. ఎంతరా అంటే ఐదు!'' అంటూ వెక్కిరించింది.

జియానీ ఆమెను రెక్క పట్టుకుని యివతలకు లాగాడు. ''నన్నంటున్నావు కానీ నీకు తలకాయుందా? తొట్టెలో వున్నాడంటున్నావు. మన మాటలు వినబడితే ఐదే యిస్తానంటాడు. నెమ్మదిగా మాట్లాడు.'' అంటూ మందలించి, బయటకు వెళ్లి తనతో వచ్చినవాడికి 'మా ఆవిడ అమ్మనంటోంది' అని చెప్పి పంపివేశాడు.

అతను తిరిగి వచ్చేటప్పటికి ఫెడిరిగో లోదుస్తులతో తొట్టెలోంచి బయటకు వస్తున్నాడు. జియానీని చూసి ''మీరెవరు?'' అన్నాడు. ''మీతో మాట్లాడినావిడ భర్తను. ఇదేమిటి మీరు లోదుస్తులతో వున్నారు?'' అని అడిగాడు జియానీ. ''ఏళ్లూ పూళ్లూ వాడని తొట్టెలోకి దిగేటప్పుడు యింకెలా దిగుతాం?'' అంటూ ఫెడిరిగో విసుక్కున్నాడు.

ఈలోగా తలుపు చప్పుడు వినగానే తను మంచం కింద దాచిన ఫెడిరిగో దుస్తులు చేతపట్టుకుని మోనా వచ్చి ''ఇవిగోనండి, మీ బట్టలు. ఇంతకీ మీకు తొట్టి నచ్చిందా?'' అని అడిగింది ఆతృత కనబరుస్తూ.

అతను మొహం చిట్లించి ''పెద్దగా, విశాలంగా వుంది కానీ లోపల తుప్పు పట్టినట్లుగా వుంది, ముక్కవాసన కూడా వేస్తోంది. బాగు చేసి యిస్తే కొంటా.'' అన్నాడు.

జియానీ ''తప్పకుండా చేయించి యిస్తాం. కాస్సేపు ఆగండి. ఏడుకి ఖరారు చేసుకుందాం.'' అన్నాడు.

మోనా అతన్ని పక్కకు లాగి ''చేయించి యిస్తాం అని గొప్పగా చెప్పేశారు కానీ, పనివాళ్లిద్దరూ లేరు. ఊరెళ్లారు, మీరే దిగాలి, లేకపోతే బేరం పోతుంది.'' అని బెదిరించింది.

''దిగక తప్పేదేముంది?'' అంటూ జియానీ పనిముట్లు పట్టుకుని తొట్టెలోకి దిగాడు. మోనా తొట్టె కన్నంలోంచి తొంగి చూస్తూ 'అదిగో ఆ మూల ఏదో వున్నట్టుంది, గోకండి, గట్టిగా పీకండి.'' అంటూ ఆదేశాలు యిస్తూ అతన్ని చాలాసేపు లోపలే వుంచింది. తాము మొదలుపెట్టిన పనికి మధ్యలో అంతరాయం కలిగినందుకు చింతిస్తున్న ఫెడిరిగో యీ అవకాశాన్ని చక్కగా వుపయోగించుకున్నాడు. ఎలాగూ లోదుస్తులతోనే వున్నాడు కాబట్టి మోనాను వెనకనుంచి తగులుకున్నాడు. ఆమె కూడా పూర్తిగా సహకరించింది.

లోపల తుప్పు గొడవలో వున్న జియానీకి బయటి కదలికల సంగతి పట్టించుకునే ధ్యాస లేకపోయింది. పైగా పై నుంచి మోనా తోముడుతో అతనికి ఏదో తోచటం లేదు. మోనా, ఫెడిరిగో యిద్దరూ తృప్తిపడి, ఫెడిరిగో వెళ్లి దుస్తులు పూర్తిగా ధరించేదాకా మోనా జియానీని బయటకు రానీయలేదు.

జియానీ బయటకు వచ్చాక, ఫెడిరిగో తొట్టెలోకి తొంగి చూసి ''సరే, నాకు నచ్చింది. ఇదిగో ఏడు నాణాలు. మీ పనివాళ్లు వూరి నుంచి వచ్చాక వాళ్ల చేత మా యింటికి పంపించండి.'' అని చెప్పి వెళ్లిపోయాడు.

రాత్రి అయేసరికి ఫెడిరిగోకు మళ్లీ కాంక్ష పుట్టుకుని వచ్చింది. మధ్యాహ్నం మాటల్లో జియానీ నేను సాయంత్రానికి ఫ్లారెన్సు చేరాలని అనడం విన్నాడు కాబట్టి మళ్లీ రాత్రి సమాగమానికి ఉవ్విళ్లూరాడు. ఎందుకైనా మంచిదని దిష్టిబొమ్మను గమనించాడు. అది తూర్పువైపు తిరిగి వుండటంతో హమ్మయ్య అనుకుని ధైర్యంగా మోనా యింటికి వెళ్లి ఎప్పటిలాగ తలుపును గోటితో గీరాడు.

జరిగినదేమిటంటే-ఊరు వెళ్లి పోవాలనే ఉద్దేశం మార్చుకుని జియానీ యింట్లో వుండిపోయాడు. ఆ విషయం తెలియని ఫెడిరిగో రాత్రి రావడానికి ప్రయత్నిస్తాడని వూహించిన మోనా దిష్టిబొమ్మ మొహాన్ని పడమటవైపుకి తిప్పి పెట్టింది. అయితే రాత్రివేళ ఒక తాగుబోతు ఆ కర్రను తన్నేసి కింద పడ్డాడు. మళ్లీ లేచి దిష్టిబొమ్మను నిలబెట్టి వెళ్లిపోయాడు. అలా నిలబెట్టడంలో దాని మొహం తూర్పువైపుకి మళ్లిపోయి, ఫెడిరిగోకు తప్పుడు సంకేతం యిచ్చింది. తలుపుపై గోకుడు వినగానే వచ్చినదెవరో మోనాకు తెలిసిపోయింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ వుండగానే జియోనీకి మెలకువ వచ్చింది. ఏమిటది? అన్నాడు.

''అదా, తోడేలుమానవుడని చెప్పుకుంటారు కదా, అది యీ ప్రాంతాల్లో సంచరిస్తోందట. అప్పుడప్పుడు యిలా తలుపు గోకుతుంది. నేను చెవులు మూసుకుని కూర్చుంటాను. కాస్సేపటికి అదే వెళ్లిపోతుంది.'' అని చెప్పింది మోనా.

''తోడేలు మానవుడు అనేది గ్రీకు పురాణగాథల్లో వున్న కల్పితప్రాణి. జనాల మూఢనమ్మకాల్లో ఒకటి అంటారు. అది నిజంగా మన వూళ్లో తిరుగుతోందా?'' అని ఆశ్చర్యంగా అడిగాడు జియానీ.

ఈ లోగా అసహనంగా వున్నా ఫెడిరిగో యీసారి గట్టిగా గోకాడు.

''మూఢనమ్మకమో, కాదో తెలియదు, ఊళ్లో చెప్పుకుంటారు, యిదిగో మీక్కూడా వినబడుతోంది కదా ఆ శబ్దం. కదలకుండా పడుక్కోండి.'' అంది మోనా భయం నటిస్తూ.

''నా వంటి దైవభక్తుడు దానికి భయపడడం దేనికి? నేను లేచి రెండు కీర్తనలు పఠిస్తే ఆ మంత్రమహిమకు అదే పారిపోతుంది.'' అంటూ పక్క మీద నుండి లేచాడు జియానీ.

మంత్రాలు చదివేముందు కిటికీలోంచి తొంగి చూస్తాడన్న భయం పట్టుకుంది మోనాకు. అందుకని ''మీరు మంత్రాలు చదివే ముందు నేనొక చిన్న మంత్రం చదువుతాను. మా అమ్మమ్మ చిన్నప్పుడు మాకు నేర్పించిన మంత్రం అది. ఆ తర్వాత మీ కీర్తనలు పాడుదురు గాని...'' అంటూ తలుపు వద్దకు వెళ్లి

''తోకెత్తుకుని వచ్చిన తోడేలు మానవుడా, తోక దించి తోవ పట్టు

పరమభక్తుడు, పతిదేవుడు జియానీ నా అండ నుండ నాకేటి భయము''

అంటూ మూడుసార్లు రాగాలతో పాడింది. అప్పుడు జియానీ తన కీర్తనలు అందుకున్నాడు.

కాస్సేపటికి తలుపు తీసి చూస్తే ఏ ప్రాణీ కనబడలేదు. ఇదంతా తన మహిమే అని నమ్మిన జియానీ తన వూరు వచ్చి చర్చి పూజారులతో చెప్పి మురిసిపోయాడు. జరిగినదేదో వారు వూహించలేకపోయినా, 'నీ వంటి భక్తుడు మరింత సాధన చేస్తే దెయ్యాలూ, భూతాలూ కూడా తరిమికొట్టగలడు'' అని ఉబ్బేసి అతని నుండి మరిన్ని చందాలు వసూలు చేసి, యింకొన్ని పాటలు నేర్పారు.

''నా సాధన పూర్తయేవరకు నువ్వు అక్కడే వుంటే మంచిది, లేకపోతే నా ఏకాగ్రత దెబ్బ తింటుంది.'' అని జియానీ భార్యకు కబురు పంపాడు. ''మీ మహిమ కళ్లారా చూశాను. ఎన్ని ఏళ్లు పట్టినా మీ సాధన పూర్తి చేయండి. ఇక్కడ కిందామీదా పడుతూ నా తిప్పలేవో నేను పడతాను.'' అని మోనా తిరుగు కబురు పంపింది.
Like Reply
#8
నెరజాణల కథలు 07
రిమిని నగరంలో చాలా ధనికుడైన భూస్వామి వుండేవాడు. అతని భార్య అత్యంత సౌందర్యవతి, శీలవతి. అయితే తనకున్న సందేహబుద్ధితో భర్త ఆమెను అనుక్షణం సతాయించేవాడు. ఆమెను చూడగానే తనకు వలపు పుడుతుంది కాబట్టి వూళ్లో మగాళ్లందరికీ అలానే పుడుతుందని, ఆమె తన కోర్కెను అంగీకరించినట్లే, వాళ్లందరి కోర్కెను అంగీకరిస్తుందని ఒక పిచ్చి వూహ పడిపోయిందతనికి. ఆమెను గడప దాటనిచ్చేవాడు కాదు. ఇంటి గుమ్మంలో నిలబడనిచ్చేవాడు కాదు. ఎవరూ యింటికి రావడానికి వీల్లేదు, వచ్చినా యీమె కిటికీ సైతం తెరవడానికి వీల్లేదు. పరపురుషుడి నీడ పడకుండా ఆమెను వెయ్యికళ్లతో కాపాడుకునేవాడు.

పోనుపోను భార్యకు యితని వ్యవహారం చిర్రెత్తుకొచ్చింది. మొదట్లో తనపై వల్లమాలిన ప్రేమ కొద్దీ యిదంతా చేస్తున్నాడని సరిపెట్టుకున్నా, కొంతకాలానికి తనను మనిషిగా చూడడం లేదని, తను పతివ్రతగా వున్నా అనుమానించి అవమానిస్తున్నాడని బాధపడసాగింది. ఎంత సముదాయించినా, ఎంత నచ్చచెప్పినా భర్త మారకపోవడంతో ఆమెలో కసి పుట్టింది. అతని సందేహాన్ని నిజం చేసి తీరాలనే పట్టుదల పుట్టింది.

పక్కిళ్లల్లో అందమైన యువకులు వుండేవుంటారని, వారితో సంపర్కం పెట్టుకోవాలని ఆమె తపించింది. కానీ యింట్లో అన్ని తలుపులను, కిటికీలను అష్టదిగ్బంధం చేశాక తొంగిచూడడం కూడా అసాధ్యం. ఆయినా ఆమె దీక్షగా యింటి తలుపులను, గోడలను అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించింది - ఎక్కడైనా చిన్న చీలికైనా, పగులైనా వుండకపోతుందాని. చివరకు ప్రయత్నం ఫలించి ఒక గది గోడలో సన్నటి పగులు కనబడింది. రిక్కించి చూస్తే పక్క వాటా వాళ్ల పడకగదిలా తోచింది. ఆ వాటాలో ముగ్గురు నలుగురు వుంటారు. వారిలో ఫిలిప్పో అనే అందమైన యువకుణ్ని గత క్రిస్‌మస్‌ పండగలో చర్చిలో చూసింది. ఇది అతని గది అయితే బాగుండును అనుకుంది.

ఆ ఆశతో ఆ పగులులో రాళ్లు, చెక్కముక్కలు దోపి పెద్దది చేస్తూ పోయింది. దానిలోంచి గమనిస్తే అది అతని పడకగదే అనీ, ఒక్కడే పడుక్కుంటాడనీ తెలిసింది. ఇక దాని ద్వారా కాగితం ముక్కలు తోసి, యీలలు వేసి కొన్ని రోజులకు అతని దృష్టిని ఆకర్షించింది. ముందులో కంగారు పడినా అతనూ పలకరించాడు. ఆ క్రిస్‌మస్‌ నాడే అతనూ యీమెను గమనించి ముచ్చటపడ్డాడు. ఇప్పుడామె స్వయంగా చొరవ తీసుకోవడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆమె తన దురవస్థ వివరించి చెపితే జాలిపడ్డాడు. వీలున్నప్పుడల్లా కబుర్లు చెప్పేవాడు, చెణుకులు విసిరి ఆమెను సంతోషపెట్టేవాడు.

వారి స్నేహం క్రమంగా వలపులోకి మారింది. ఒకరి పొందు కోసం మరొకరు తపించారు. కానీ ఆమె వుంటున్న పరిస్థితుల్లో అది సాధ్యపడడం కలలో కూడా వూహించలేని విషయం. అందుకే ఆమె ఒక దుస్సాహసానికి దిగింది. భర్తతో ''వచ్చేవారమే క్రిస్‌మస్‌ కదా. నేను చర్చికి వెళ్లి పాపాల ఒప్పుకోలు చేద్దామనుకుంటున్నాను. అనుమతించండి.'' అంది. అతను ఆశ్చర్యంగా ''నువ్వు చేసిన పాపాలేమున్నాయి కనుక, ఒప్పుకోవడానికి?'' అని అడిగాడు.

''మనిషన్నాక పాపాలు చేయకుండా వుంటారా? పాపిష్టి ఆలోచన రావడం కూడా తప్పే కదా? వాటన్నిటికి క్షమాపణ చెప్పకపోతే పరలోకంలో అవస్థ పడనా?'' అని అడిగింది. అసలే అనుమానస్తుడైన భర్తకు భార్య మెదడులో మసలే ఆలోచనలు కూడా తెలుసుకునే అవకాశం వదులుకోకూడదన్న ఆలోచన వచ్చింది. ''సరే వెళ్లు, కానీ నేను చెప్పిన చర్చికే, నేను చెప్పిన మతగురువు దగ్గరకే వెళ్లు. అది కూడా పొద్దున్నే జనాలంతా వచ్చేందుకు ముందే..'' అని షరతులు పెట్టాడు. ఆమె అన్నిటికి సరేనంది.

క్రిస్‌మస్‌ ముందు రోజే అతను తమ చర్చిలోని మతగురువు వద్దకు వెళ్లి బహుమతులు సమర్పించుకుని, తన భార్య ఒప్పుకోలు వినే అవకాశం తనకివ్వాలని, తనకు మతగురువు వేషం వేసి ఆమె వద్దకు పంపాలని కోరాడు. మొహమాటం కొద్దీ అతను సరేనన్నాడు. మర్నాడు భార్య వచ్చేసరికి భర్త మతగురువు దుస్తులు ధరించి పైన కుళ్లాయి పెట్టుకుని, తల కనబడకుండా చేసుకుని, గొంతు గుర్తుపట్టకుండా నోట్లో గులకరాళ్లు పెట్టుకుని ఆమె వద్దకు వెళ్లాడు. భర్తను చూడగానే ఆమె గుర్తు పట్టేసింది. అయినా ఏమారిపోయినట్లు నటించి ఒప్పుకోలుకు సిద్ధపడింది. దారుమందిరంలో ఒక కక్ష్యలో ఆమె కూర్చొనగా, మరో కక్ష్యలో అతను నిలబడి ప్రశ్నలడగసాగాడు.

ఆమె చెప్పసాగింది - ''ఒక మతగురువంటే నాకెంతో యిష్టం. అతను ప్రతిరాత్రి వచ్చి నాతో శయనిస్తున్నాడు.'' అని.

భర్త యిది వినగానే ఉలిక్కిపడ్డాడు. ''అదెలా సంభవం? నీ కుటుంబసభ్యులెవరూ అడ్డుకోరా?'' అని అడిగాడు.

''అతన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇంట్లో ఏ ద్వారమూ అతన్ని అడ్డుకోలేదు. అతను వస్తే పడకగది తలుపైనా సరే తెరుచుకోవాల్సిందే. రాత్రి ఏ సమయంలోనైనా సరే రాగలడు. అతని ప్రేమపరవశంలో నేనతన్ని అడ్డుకోలేను. అతనిచ్చే సౌఖ్యం నాకెంతో ఆనందాన్నిస్తుంది.''

భర్తకు ఏమనాలో తోచలేదు. ఆ మతగురువెవరో కాని మాయామంత్రం తెలిసినవాడై వుంటాడు. ఏదో యింద్రజాలం చేసి తన భార్య పక్కలో చొరబడుతున్నాడు. గట్టిగా కాపలా కాసి వాడి పని పట్టాలి అనుకున్నాడు. ప్రస్తుతానికి ''ఆ పూజారిని నిరోధించడానికి నేను నీకోసం దైవప్రార్థనలు చేస్తాను. వాటి ప్రభావం వలన అతను లోపలకి రాలేడు. నా శిష్యుణ్ని అప్పుడప్పుడు నీ దగ్గరకు పంపి అతను రాగలుగుతున్నాడో లేదో తెలుసుకుంటూ వుంటాను. దాన్ని బట్టి ప్రార్థనలు పెంచాలో వద్దో అర్థం చేసుకుంటాను. ప్రస్తుతానికి నీకు క్షమాపణ యివ్వలేను. అతన్ని పూర్తిగా ఆపివేయగలిగిన తర్వాతనే ఆలోచిద్దాం.'' అన్నాడు.

ఆ రాత్రి అతను భార్యతో ''నన్ను క్రిస్‌మస్‌ విందుకు స్నేహితులెవరో పిలిచారు. తిరిగి వచ్చేసరికి ఆలస్యమవుతుంది. కంగారు పడకు.'' అని చెప్పి బయటకు వచ్చి పడకగది తలుపులు గట్టిగా బిడాయించి తాళాలు వేశాడు. దానికి దారితీసే మెట్లగది తలుపుకు కూడా తాళాలే. తను సింహద్వారం దగ్గరే కాపలా కాశాడు. ఆ పూజారి ఎవరో రాగానే అతన్ని తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కేసి మంత్రాలు చదవకుండా ఆపేయడానికి గుడ్డముక్కలు, తాళ్లు సిద్ధంగా పెట్టుకున్నాడు. తెల్లవారేవరకు అతను అక్కడే కునికిపాట్లు పడ్డాడు.

రాత్రంతా భర్త తన గస్తీ స్థానం నుంచి కదలడని ముందే వూహించిన భార్య ప్రియుణ్ని తన పడకగదికి వచ్చేయమంది. అతను తన యింటి పై కప్పెక్కి, అక్కణ్నుంచి వీళ్ల వాటా పై కప్పు గాజు కిటికీ తెరుచుకుని లోపలకి దిగాడు. ఆ పై యిద్దరూ ఆనంద డోలికలలో వూగారు. తెల్లవారుతూండగా అతను వచ్చిన దారినే వెళ్లిపోయాడు. రాత్రంతా నిద్రలేక వాచిపోయిన కళ్లతో కాళ్లీడ్చుకుంటూ భర్త కోడి కూసే వేళకి భార్య దగ్గరకు వచ్చాడు. ''విందు ముగిసిందా?'' అని ఆమె అడిగిన ప్రశ్నకు తలవూపాడు.

మర్నాడూ, ఆ మర్నాడూ యిదే భాగోతం. వారం రోజులు పోయాక భర్తకు అనుమానం వచ్చింది - ఆ మతగురువు సింహద్వారం గుండా రాకుండా వేరే మార్గంలో లేదా అదృశ్యరూపంలో వస్తున్నాడా అని. చర్చిలో ఒక చిన్న గురువును భార్య వద్దకు పంపి 'గతంలో నీ దగ్గరకు వచ్చి శయనించే మతగురువు యీ మధ్య వస్తున్నాడా?' అని అడిగించాడు. 'వారం రోజులుగా రావటం లేదు' అని చెప్పిందామె.

అది విని భర్త సంతోషించాడు. ఇలా కాపలా కాయడమే సరైన పద్ధతి అనుకున్నాడు. భార్యకు రోజుకో అబద్ధం చెపుతూ పడగ్గదిలోంచి బయటకు రావడం, తాళం వేయడం, సింహద్వారం వద్ద దుప్పటి కప్పుకుని చలికి వణుకుతూ, కునికిపాట్లు పడుతూ పహరా కాయడం! అటు భార్య కూడా ప్రియుణ్ని యింటి పై కప్పుద్వారా రప్పించుకోవడం, సుఖించడం, వెలుగురేకలు పొడసూపేలోగా తిరిగి పంపించివేయడం మరిగింది.

మూణ్నెళ్లు గడిచేసరికి భర్త నీరసించిపోయాడు. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో పగలంతా జోగుతూ వుండేవాడు, ఆరోగ్యంతో పాటు అతని వ్యాపారం కూడా దెబ్బ తినసాగింది. కోపం, ఉక్రోషం ముంచుకువచ్చాయి. చివరకు తెగించి భార్యపై విరుచుకు పడ్డాడు. ''సిగ్గుమాలినదానా! పాపిష్టిదానా! నువ్వెలాటిదానివో, పూజారితో నీ కామకలాపాలెలాటివో నాకు తెలుసు. ఆ రోజు మతగురువు వేషంలో నీ ఒప్పుకోలు విన్నది నేనే!  నిన్ను దండించక మానను.'' అని అరిచాడు.

ఆమె బెదరలేదు, ఫక్కున నవ్వింది. ''ఆ విషయం నాకు తెలుసు. అందుకే అలా చెప్పాను.'' అంది.

భర్త తెల్లబోయాడు. ''నాకేం అర్థం కావటం లేదు.'' అన్నాడు.

''నేనేం చెప్పాను? రోజూ మతగురువుతో శయనిస్తున్నాను అన్నాను. మీరు ఆ రోజు మతగురువుగానే వున్నారు కదా!''

భర్త తల గోక్కున్నాడు ''అతనికి మంత్రాలు వచ్చు, ఇంద్రజాలంతో తలుపులు తెరిచేస్తాడు అన్నావు కదా''

''నేనలా అనలేదు. అవన్నీ మీరూహించినట్లుగా వున్నారు. నేనన్నది, 'అతన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇంట్లో ఏ ద్వారమూ అతన్ని అడ్డుకోలేదు. అతను వస్తే పడకగది తలుపైనా సరే తెరుచుకోవాల్సిందే. రాత్రి ఏ సమయంలోనైనా సరే రాగలడు.' అని. అది అబద్ధమా? మీరు యీ యింటి యజమాని. నా హృదయానికి రారాజు...''

భర్త నోటి వెంట మాట రాలేదు. ''నన్ను ఉద్దేశించి చెప్పావా? 'అతని ప్రేమపరవశంలో నేనతన్ని అడ్డుకోలేను. అతనిచ్చే సౌఖ్యం నాకెంతో ఆనందాన్నిస్తుంది.' అని అంటే వేరేవాళ్ల నుకున్నాను.''

భార్య అతన్ని తిట్టిపోసింది - ''మీరంటే నాకు ఎంతో ప్రేమ అన్న సంగతి తెలియదా? అయినా వేరేవాళ్లు ఎక్కణ్నుంచి వస్తారు? చీమ దూరే సందుకూడా లేకుండా తలుపులు, కిటికీలు బిడాయించి నన్ను యింట్లో బందీ చేసి కూర్చోపెడితే..?'' అని.

భర్త ఒక్కసారిగా తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. తల వంచుకుని కూర్చున్నాడు. కాస్సేపు పోయాక ''అవును, నిన్ను మనిషిలా చూడలేదు. ఇనప్పెట్టెలో దాచిపెట్టే వస్తువులా చూశాను. నీ మనసు చంపేశాను. అయినా నువ్వు నన్ను గాఢంగా ప్రేమిస్తూనే వున్నావు. నా పెడబుద్ధి వలన అది గుర్తించలేకపోయాను.'' అని పశ్చాత్తాప పడసాగాడు.

అంతలోనే తలెత్తి ''నువ్వు ఏ తప్పు చేయనప్పుడు మరి ఒప్పుకోలుకై ఎందుకడిగావు?'' అని అడిగాడు.

''నేనలా చెప్పగానే మీరే మతగురువులా తయారవుతారని ముందే వూహించాను. అందుకే అలా నర్మగర్భంగా మాట్లాడి ఉడికించాను. భార్యాభర్తల మధ్య ఆపాటి సరసం లేకపోతే అది యింకేం దాంపత్యం?'' అంది ఆ జాణ.
భర్త మనసు తేలికపడింది. ఆమె మాటలను పూర్తిగా విశ్వసించాడు. ఆమెపై ఆంక్షలన్నీ ఎత్తివేశాడు. ఎవరితో నవ్వుతూ మాట్లాడినా ఏమీ అనేవాడు కాదు. అప్పటికే ప్రియుణ్ని మరిగిన ఆమె ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది. భర్త యింట్లో లేని సమయంలో ప్రియుణ్ని పడకగది గుమ్మంలోంచే రప్పించుకునేది. కప్పులోంచి పిల్లిలా పాకుతూ రావలసిన అగత్యం అతనికి తప్పింది.
Like Reply
#9
నెరజాణల కథలు 08
బెర్లింగెరి అనే అతను కష్టపడి పైకి వచ్చినవాడు. ఇంకా పైకి రావాలంటే జమీందారీ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఫిలోమినా అనే అందగత్తెను చేసుకుంటానంటూ ఆమె సోదరులకు కబురంపాడు. తమ స్థాయికి తగినవాడు కాదని ఆమె తల్లి అభ్యంతర పెడుతున్నా, ఆమె సోదరులు యితను తెలివైనవాడని తమ తల్లికి నచ్చచెప్పి పెళ్లి చేశారు.

అయితే పెళ్లి తర్వాత బెర్లింగెరి తన భార్య తనను తక్కువగా చూస్తోందన్న పనికిమాలిన సందేహాలతో ఆమెను విసిగించి మానసికంగా దూరం చేసుకున్నాడు. ఇతని పట్ల విరక్తి చెంది ఆమె రుబెర్టో అనే యువకుణ్ని మరిగింది. ఈ సంగతి చూచాయగా విన్న భర్త ఆమెపై నిరంతరం నిఘా వేసి వుంచసాగాడు. ఆమె నిద్ర పోయేదాకా తను నిద్ర పోయేవాడు కాదు. దాంతో ఆమెకు పట్టుదల పెరిగి ఒక ఉపాయం కనిపెట్టింది.

వాళ్ల పడకగది మేడ మీద వుండేది, దాని కిటికీ వీధివైపు వుండేది.  ప్రియుడు వస్తాడని కబురు పెట్టిన రోజు రాత్రి పడుక్కునేటప్పుడు కాలు బొటనవేలుకి ఓ దారం కట్టుకుని కిటికీ ద్వారా కిందకు వదిలేసేది. అతను అనుకున్న వేళకు వచ్చి ఆ దారం లాగేవాడు. మొగుడు నిద్రపోతూ వుంటే వేలి నుంచి దారం యిప్పేసి, మెట్లు దిగి కిందకు వెళ్లి చడీచప్పుడు కాకుండా తలుపు తీసి ప్రియుణ్ని లోపలకి తీసుకుని వచ్చేది. కింద గదుల్లో ఏదో ఒక దానిలో అతనితో రమించేది. భర్త మెలకువగా వున్న పక్షంలో అతను లాగినా కదిలేది కాదు. మూడుసార్లు లాగి చూసి ప్రియుడు వెళ్లి పోయేవాడు.

ఈ ఏర్పాటు చాలా రోజులు బాగానే నడిచింది కానీ ఒక రోజు భర్త తన కాలు విదిలిస్తూంటే దుప్పటి కింద వున్న దారం కాలికి తగిలింది. ఎక్కణ్నుంచి వచ్చిందాని చూస్తే భార్య కాలి బొటనవేలుకి కట్టేసి కనబడింది. ఇందులో ఏదో తంత్రం వుందని అనుమానించి అతను ఆ దారాన్ని ఆమె వేలినుంచి విప్పేసి తన వేలుకి కట్టుకుని నిద్రపోయాడు.

అర్ధరాత్రి దాటాక ప్రియుడు వచ్చి దారం లాగాడు. భర్త గట్టిగా కట్టుకోకపోవడం వలన ఆ దారం వూడిపోయి లాగితే ప్రియుడి చేతికి వచ్చేసింది. ఓహో, తను కాస్సేపటిలో కిందకు వస్తుందన్నమాట అనుకుని ప్రియుడు అక్కడే కాచుకున్నాడు. అయితే, దారం లాగడం వలన మెలకువ వచ్చిన భర్త మహాకోపంతో మెట్లు దిగి విసురుగా సింహద్వారం తీశాడు.

ఫిలోమినా అయితే రహస్యంగా చప్పుడు కాకుండా వచ్చేది, వీరెవరో వేరే వాళ్లు అనుకుని ప్రియుడు పారిపోవడానికి సిద్ధంగా వున్నాడు. ఎప్పుడైతే భర్త విసురుగా తలుపు తీశాడో అతను పరుగు లంకించుకున్నాడు. భర్త గట్టిగా కేకలు వేస్తూ అతని వెంట పరుగు పెట్టాడు.

ఈ అలికిడికి ఫిలోమినాకు మెలకువ వచ్చింది. కాలివేలికి దారం లేకపోవడం చూసి జరిగినది గ్రహించింది. జరగబోయేది వూహించి అప్పటికప్పుడు ఒక పథకాన్ని రచించింది. తన పనిమనుషుల్లో ఒకదానికి తన వ్యవహారం సంగతి తెలుసు. దాన్ని తీసుకుని వచ్చి తన పక్కమీద  తన స్థానంలో పడుక్కోబెట్టింది. 'మా ఆయన వచ్చి తిట్టినా, కొట్టినా నోరు విప్పవద్దు, నీ మొహం చూపించవద్దు. నా మాట వింటే నీకు మంచి బట్టలు, డబ్బు యిస్తాను.' అని చెప్పింది. గదిలో దీపాలు ఆర్పివేసి తను వెళ్లి వేరే గదిలో దాక్కుంది.

అవతల బెర్లింగెరికి భార్య ప్రియుడు దొరకలేదు. చీకటి ఆసరాగా చేసుకుని ఎటో పారిపోయాడు. ఆగ్రహంతో, అక్కసుతో అతను యింటికి తిరిగి వచ్చి సరాసరి పడకగదికి వెళ్లి భార్యను చితక్కొట్టేశాడు. కింద పడేసి తొక్కేశాడు. ఇంకా కోపం పట్టలేక ఒక కత్తెర తెచ్చి జుట్టు సగానికి కత్తిరించేశాడు.

చివరకు ''నీ పని యిలాక్కాదు, వెళ్లి మీ అన్నలను తీసుకుని వచ్చి వాళ్ల చేత బుద్ధి చెప్పిస్తాను చూడు' అని యింట్లోంచి బయటకు వెళ్లాడు. అతనలా వెళ్లగానే ఫిలోమినా తన పడకగదిలోకి వెళ్లి అప్పటిదాకా తను అనుకుని భర్త చావగొట్టిన పనిమనిషిని ఓదార్చి, డబ్బు యిచ్చి యింటికి పంపివేసింది. పడకగదిలో  పక్క అంతా మామూలుగా సర్దేసి, జుట్టు చక్కగా దువ్వేసుకుని, దీపం వెలిగించి తను వెళ్లి మెట్ల మీద కూర్చుని వూలు మేజోళ్లు కుట్టుకుంటూ కూర్చుంది.

బెర్లింగెరి తన బావమరదుల యిళ్లకు, అత్తగారింటికి వెళ్లి 'ఫిలోమినా చేష్టలు చూడండి' అంటూ అందర్నీ లేపి తీసుకుని వచ్చాడు. అర్ధరాత్రి నిద్ర లేపినందుకు అందరూ తిట్టుకుంటూనే అతని మాట తీసేయలేక వచ్చారు. ఆమెను చూస్తూనే తిట్లు లంకించుకున్నారు - మా పరువు తీశావంటూ! ఆమె ఏమీ అర్థం కానట్లు మొహం పెట్టింది. 'నీ రంకుతనం భరించలేక మీ ఆయన నీ తోలు తీశాడటగా, నీ జుత్తు కత్తిరించాడటగా, అయినా బుద్ధి రాలేదా?' అన్నారు వాళ్లు.

''మా ఆయన నన్ను కొట్టడమేమిటి? నా ఒంటి మీద చిన్న గాయమైనా వుందా? నా జుట్టు చూడండి, ఎంత పొడుగ్గా వుందో, రాత్రికి రాత్రి మొలిచేసిందా? మా ఆయన యీ మధ్య బాగా తాగుతున్నాడు. మాదకద్రవ్యాలు కూడా సేవిస్తున్నాడేమో ఏవేవో భ్రమలకు లోనై చిత్తం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మీరు నమ్మి యింత రాత్రివేళ వచ్చారా?'' అందామె ఆశ్చర్యపడుతూ.

ఆమె చెప్పినది విని బెర్లింగెరికి నోట మాట రాలేదు. పడకగదిలో తాను చేసిన బీభత్సమూ కనబడటం లేదు, యీమె ఒంటి మీద గీతైనా లేదు,  తను కలగన్నాడా? నిజంగా ఏమీ జరగలేదా? అనే సంశయం పట్టుకుంది.

ఫిలోమినా గుడ్లలో నీళ్లు కుక్కుకుంటూ ''నిజానికి ఫిర్యాదు చేయాలంటే నేను చేయాలి. అతను తాగుతాడు, వేశ్యల వెంట తిరుగుతాడు. వాళ్లతో తిరిగితిరిగి నన్నూ అలాటిదాన్నే అనుకుంటాడు. చాలా హీనంగా చూస్తూంటాడు. నేనెక్కడ మీతో వచ్చి మొత్తుకుంటానో, తను సంజాయిషీ చెప్పవలసి వస్తుందో అని, తనే నా మీద కథలల్లి చెప్పాడు. ఇప్పుడు అతని గురించి నేనేం చెప్పినా మీరు నమ్మరు కదా..'' అంటూ ఏడ్చింది.

ఈ దశలో ఫిలోమినా తల్లి గొంతెత్తింది. 'మొదట్నుంచి మొత్తుకుంటున్నాను. డబ్బుంటే ఏం లాభం, ఉత్తమజాతి లక్షణాలు లేవని. నా మాట వినలేదు, పాపం దాని గొంతు కోశారు. ఈ సంస్కారహీనుడి చేతిలో దాని బతుకు దుర్భరం అయిపోయింది.' అని.

తల్లి మాటలతో ఫిలోమినా అన్నలకు తిక్క రేగింది. బెర్లింగెరి కేసి తిరిగి ''భూదేవంత సహనం వున్న మా చెల్లెలు గురించి మరొక్క మాట ఎప్పుడైనా అన్నావో నీ ప్రాణం తీస్తాం. బజారులో మా సత్తా ఏమిటో తెలుసుకదా, మాతో పెట్టుకుంటే సర్వనాశనమే. దాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకో. మరోసారి నీ గురించి ఫిర్యాదు చేసిందో... ఏం జరుగుతుందో మాకే తెలియదు.'' అని బెదిరించి యింటికి వెళ్లిపోయారు.
ఇక అప్పణ్నుంచి ఫిలోమినా అంటే బెర్లింగెరి భయపడసాగాడు. ఆమె వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు. ఎన్నిసార్లు ఆలోచించినా ఆ రాత్రి ఏం జరిగిందో అతనికి తెలియలేదు. ఆ చిక్కుప్రశ్న అతన్ని ఎన్నటికీ వెంటాడుతూనే వుంది.

[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#10
chaala bagunnai sir. kathalu
Like Reply
#11
Grateandhra web site e kathalu unnai
[+] 1 user Likes Vakra's post
Like Reply
#12
వింతగా ఉంది
Like Reply




Users browsing this thread: 1 Guest(s)