Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#1
మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము

వేరొక site లో చదివిన ఈ ఆర్టికల్ నాకు చాలా నచ్చింది. అది మీతో పంచుకోవాలని ఇక్కడ పెడుతున్నాను.


చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి


చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి ఈ రెండు పేర్లూ ఆధునిక కాలంలో తెలుగు భాష చరిత్రలో చాలా పెద్ద పేర్లు. వీళ్లిద్దరి రచనలూ ఏ సందర్భంలో ప్రచారం లోకి వచ్చాయో పరిశీలించడం, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభం కలిగిందా, నష్టం కలిగిందా? అన్న విషయం చర్చించడం, ఈ వ్యాసంలో ఉద్దేశించిన పని. సూరిగారి అభిప్రాయాలు, రామమూర్తి పంతులుగారి అభిప్రాయాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి.

ఈ వైరుధ్యం ఆధునిక కాలంలో గ్రాంథిక, వ్యావహారిక భాషా వైరుధ్యంగా వ్యక్తమయింది. చిన్నయ సూరిగారు గ్రాంథిక భాషావాదిగా, రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదిగా మన మనస్సుల్లో స్థిరపడిపోయారు. ఈ మాటలు ఈ కాలంలో ప్రచారం లోకి వచ్చిన మాటలు. ఈ రెండు రకాల భాషలకీ వైరుధ్యం ఏర్పడిన రోజులలో అమలులో ఉన్న మాటలు ఒకసారి చూద్దాం. చిన్నయ సూరి ఉద్దేశంలో వ్యాకరణ యుక్తమైన భాష లాక్షణిక భాష (భాషకి లక్షణాన్ని చెప్పేది వ్యాకరణం కాబట్టి). లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యము. గిడుగు రామమూర్తి పంతులుగారి దృష్టిలో ఈ లాక్షణిక భాష పాత పుస్తకాల్లోనే కనిపిస్తుంది. పుస్తకాలకే పరిమితమైన భాష కాబట్టి అది గ్రాంథిక భాష. ఆయన కోరుకున్న భాషకి ఆయన పెట్టిన పేరు వ్యావహారిక భాష.

20వ శతాబ్దిలో భాష విషయంలో తీవ్రమైన వాగ్యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ రెండు జంటల మాటలూ అమలులో వుండేవి.
లాక్షణికభాష X గ్రామ్య భాష

గ్రాంథిక భాష X వ్యావహారిక భాష


ఈ రెండు జంటల పేర్లలో రెండవ జంట పేర్లే ప్రచారంలోకి వచ్చి మొదటి జంట పేర్లు కనుమరుగయి పోయాయి. అంటే లాక్షణిక భాషావాదులు ఓడిపోయారని అర్థం.

ఈ కాలానికి పూర్వం తెలుగుకి వ్యాకరణాలు సంస్కృతంలో ఉండేవి. నన్నయ రాశాడని చెప్పబడుతున్న ఆంధ్రశబ్దచింతామణి (దీనికే నన్నయభట్టీయం అని పేరు), త్రిలింగశబ్దానుశాసనము, అహోబల పండితీయము, ఆంధ్రకౌముది, మొదలైనవి అన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి.

తెలుగులో వచ్చిన ఒకే ఒక్క వ్యాకరణం కేతన ఆంధ్రభాషాభూషణం. దీనికి శాస్త్రగౌరవం కలగలేదు. 19వ శతాబ్దిలో కుంఫిణీ ప్రభుత్వం వాళ్ళు తమ ఉద్యోగస్తులకు తెలుగు నేర్పాలి అనుకున్నారు. కాబట్టి, ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు వచ్చాయి. ఉదాహరణకి, విలియం కేరీ (William Carey, 1814), కేంప్‌బెల్ (A.D. Campbell, 1816), విలియం బ్రౌన్ (William Brown, 1820), మారిస్ (J.C. Morris, 1823), సి.పి.బ్రౌన్ (C.P. Brown, 1840) రాసిన వ్యాకరణాలు. వీళ్ళల్లో బ్రౌన్ ముఖ్యమైనవాడు. అప్పటి కచేరీల్లోనూ, కోర్టుల్లోనూ, అర్జీల్లోనూ, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోనూ వాడుకలో వున్న తెలుగు భాష బ్రౌన్ వ్యాకరణంలో కనిపిస్తుంది.
వేదం పట్టాభిరామరావు లాంటి తొలినాటి పండితులు తెలుగులో రాసిన తెలుగు వ్యాకరణాలలో ఆ రకమైన భాష కనిపించదు. బ్రౌన్ వ్యాకరణంలో వున్న భాషకి ఒక పేరు లేదు. నిజానికి పండితులు ఆ భాషే మాట్లాడేవారు. కాని, ఇంగ్లీషు ఉద్యోగస్తులు తెలుగు నేర్చుకోవాలని ఈ పండితుల దగ్గరకి వెళ్తే వాళ్లు ఈ తెల్లదొరలకి ఆంధ్రశబ్దచింతామణి చెప్పేవాళ్లు. నిత్య వ్యవహారంలో వున్న భాష పండితుల దృష్టిలో వ్యాకరణం వున్న భాష కాదు. అంటే వాళ్ల దృష్టిలో ఈ భాషకి వ్యాకరణం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ పండితులకి తాము మాట్లాడే తెలుగు ఎలా నేర్చుకున్నారో తెలియదు. వాళ్లు నేర్చుకున్న భాషే వాళ్లు నేర్పగలరు. అంటే వ్యాకరణమే నేర్పగలరు. (ఇప్పటికీ తెలుగు పరిస్థితి ఇదే.)

పండితుల పాఠాలతో విసిగిపోయిన బ్రౌన్ లాంటి తెల్లవాళ్ళు తమ అనుభవం లోకి వచ్చిన తెలుగుకి కావలసిన వ్యాకరణాలు. నిఘంటువులు వాళ్లే రాసుకున్నారు. వ్యాకరణాలు, నిఘంటువులు తయారు చేసినందుకు కుంఫిణీ నుంచి వారికి చక్కటి పారితోషికం లభించేది కూడా. తెలుగు సొంతభాషగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళకి ఈ వ్యాకరణాలు అక్కరా లేదు, ఇంగ్లీషులో రాసిన అవి వీళ్ళకి అర్థమూ కాలేదు. ఈ పరిస్థితుల్లో మెకాలే’స్ మినిట్ (Macaulay’s minute) అని మనకందరికీ పరిచయమైన పత్రంలో ఉన్న కొత్త ఆలోచన ఇంగ్లీషు పాలకులకి నచ్చింది. మొత్తం పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరపాలని, తెలుగు వాళ్లకే ఇంగ్లీషు నేర్పి వాళ్ళని ఒక రకమైన ఇంగ్లీషు వాళ్లుగా తయారు చేయాలని ఈ కొత్త అభిప్రాయం సారాంశం. దీని ఫలితంగా ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకోవడం మానేశారు. దానితో పాటు ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు మరుగున పడిపోయాయి.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
పద్ధెనిమిదవ శతాబ్ది చివరి కాలం నాటికి రాజులు దెబ్బతిని పోయారు. ఒకరి తరువాత ఒకరుగా కుంఫిణీ ప్రభుత్వ ప్రాబల్యానికి లొంగిపోయారు. కుంఫిణీ ప్రభుత్వం నయానా భయానా, ఆ రెండూ చెల్లకపోతే మోసానా ఈ రాజ్యాలకి సైనిక అధికారం లేకుండా చేసింది. తెలుగుదేశంలో కుంఫిణీ ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోట్లాడిన ఆఖరి రాజ్యం విజయనగర రాజ్యం. ఒక పక్క ఫ్రెంచివాళ్ళు, ఇంకొక పక్క ఇంగ్లీషువాళ్ళు దక్షిణదేశంలో ప్రాబల్యం కోసం పోటీ పడుతూ ఉండగా తెలుగు ప్రాంతంలో స్థానికంగా వైరాలు ఉన్న విజయనగరం, బొబ్బిలి రాజ్యాలు, ఇంకా ఇతర చిల్లర రాజ్యాలు తమ తగాదాల పరిష్కారం కోసం ఒకరు ఇంగ్లీషు వాళ్ళని, ఇంకొకరు ఫ్రెంచి వాళ్లని సహాయం కోరుతూ ఉండేవారు.

ఫ్రెంచి వాళ్ళని ఓడించి స్థిరంగా ఇంగ్లీషు కుంఫిణీ అధికారాన్ని సంపాదించుకున్న తరవాత ఈ స్థానిక సంస్థానాలని ఒక దాని వెనక ఒకటి తమ ఆధీనం లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర వివరంగా చెప్పడానికి ఇది చోటు కాదు కాని, విజయనగర రాజులు ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా పద్మనాభం అనే చోట యుద్ధం చేశారని చట్రాతి లక్ష్మీనర్సకవి రాసిన పద్మనాభ యుద్ధం చెప్తుంది. కానీ ఈ పద్మనాభ యుద్ధకావ్యం విజయనగర రాజుల ఓటమిని ఒప్పుకోదు. అలాగే బొబ్బిలి రాజులకి ఫ్రెంచి సేనాని బుస్సీకి మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి ఓడిపోయినా దిట్టకవి నారాయణకవి రాసిన రంగరాయ విజయం కూడా బొబ్బిలి ఓటమిని ఒప్పుకోదు. ఆ రాజులు వీరస్వర్గం పొందినట్లు గానో మరోవిధంగానో వారిని పైచేయిగా ఈ కావ్యాలు చూపిస్తాయి. ఈ కావ్యాలు చదివితే, సాంస్కృతికంగా ఈ రాజులు తమ ప్రపంచంలో నిర్మించుకున్న వాతావరణానికీ — ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వమూ బుస్సీ దొరా అమలు చేస్తున్న రాజకీయ, సైనిక వ్యూహాలకీ మధ్య పెద్ద అగాధం ఉందని మనకి బోధ పడుతుంది. తమ మనస్సుల్లో వీరత్వం, గౌరవం మొదలైన నమ్మకాలు ఒక పట్టాన ఈ రాజులు పోగొట్టుకోలేదు. దేశమంతా ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చింత చచ్చినా చావని పులుపు లాగా వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని, మర్యాదల్ని, విశ్వాసాల్ని, ఎక్కడో ఒకచోట అట్టే పెట్టుకున్నారు.

రాజ్యంలో సైనికాధికారం పోయిన తరువాత వీళ్ళు నిజానికి పన్నుల వసూలు చేసే జమీందార్లు మాత్రమే అయ్యారు. రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి, ఆ పన్నుల్లో కొంత భాగం ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వానికి, దాని తర్వాత దాని స్థానంలో వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఏటేటా చెల్లించి, వాళ్ళ అనుమతితో ఈ జమీందార్లు బతుకుతూ ఉండేవారు. తర్వాత తర్వాత ఈ పన్నుల్ని వసూలు చేసే పనిని బ్రిటిష్ ప్రభుత్వం వేలం వేసేది. ఆ వేలంలో రకరకాల కులాల వాళ్ళు పాట పాడి కొనుక్కుని జమీందార్లు అయ్యారు. అలాంటి జమీందార్లలో ఒకప్పుడు రాజ్యాధికారానికి అలవాటు పడ్డ వెలమ దొరలు, వాళ్ళతో పాటు ఎప్పుడూ రాజ్యాధికారం లేని బ్రాహ్మణులు, వైశ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ జమీందారీ విస్తీర్ణాన్ని బట్టి, దాని మీద వచ్చే పన్నుల ఆదాయాన్ని బట్టి, బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు పోగా మిగిలిన ఆదాయాన్ని బట్టి, ఈ జమీందారులు పెద్దాచిన్నాగా రకరకాల స్థాయిల్లో ఉండేవారు (తూమాటి దోణప్ప, 1969).

రాజులు పోయిన తరవాత, అంటే దాదాపుగా 18వ శతాబ్దాంతానికి పండితులు, కవులు బతకడానికి ఆధారం లేని వాళ్ళయ్యారు. అందులో ఏ కొద్దిమందికో తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండేవి. అవి రైతులకి అమరకానికి ఇచ్చి ఆ రైతు పండించిన పంటలో కొంత భాగం వీళ్లకివ్వగా, ఆ డబ్బుతో ఈ కవులు, పండితులు సుఖజీవనం చేస్తూ వుండేవాళ్ళు. పుస్తకాలు చదవడం, కవిత్వం అల్లడం వీళ్ళకి వచ్చిన ఒకే ఒక విద్య. ఆ విద్య పోషింపబడటానికి కవిత్వాన్ని ఆదరించేవాళ్ళు కావాలి, పాండిత్యాన్ని గౌరవించేవాళ్లు కావాలి; ఆ దశలో ఈ కవులు, పండితులు పోషకుల్ని తయారుచేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. జమీందార్లకి అర్థం కాకపోయినా పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలు చెప్పి, వాళ్లకి లేని ఆస్థానాలని కల్పించి, ఆ జమీందార్లకి మహారాజులని, కవిపోషకులని గౌరవకరమైన బిరుదులిచ్చి, వాళ్ళ ఆస్థాన కవులమని, ఆస్థాన పండితులమని పేర్లు తమకిచ్చుకుని ఈ కవులు, పండితులు బతుకుతుండేవాళ్లు.

కాని, తెలుగులోనే పని చేస్తున్నవాళ్లు ఒక ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చేది. వాళ్ళు కవులే కానీ పండితులు కారు. పండితులు అవాలంటే సంస్కృతంలో వ్యాకరణము, అలంకారశాస్త్రము క్షుణ్ణంగా రావాలి. పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు. పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే. ఈ పరిస్థితుల్లో తెలుగు కవులకి పాండిత్య గౌరవం లేకుండా పోయింది. జమీందారుల దగ్గరికి వెళ్లి తమకి వచ్చిన సంస్కృతాన్ని హడావిడిగా చూపించుకోగల శక్తి సంస్కృత పండితులకే ఉండేది. పెద్దగా చదువుకోని ఈ జమీందారులు సంస్కృత పండితుల హడావిడి చూసి ఉబ్బితబ్బిబ్బై పోయేవారు. వాళ్ళ ఎదుట నిలబడి, సంస్కృత పండితులతో పోటీ పడగలమని ధైర్యంతో మాట్లాడగలిగిన తెలుగు కవులు ఉండేవారు కారు. ఈ సంగతి చెళ్ళపిళ్ళ వెంకటరావుగారి జీవితచరిత్ర చూస్తే బాగా బోధపడుతుంది. తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు. అందుచేతనే వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పడం, వందమంది అడిగిన ప్రశ్నలకి, వాళ్ళు ఇచ్చిన సమస్యలకీ పద్యాల్లోనే సమాధానాలు, పూరణలు చెప్పి, ఆ పద్యాలన్నీ మళ్ళా వాళ్ళే ధారణ పట్టి తిరిగి మరుపు లేకుండా అప్పచెప్పడం — ఇలాంటి విద్యలవల్ల వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు. కాని, అంతకు ముందు పరిస్థితి చూస్తే సంస్కృత విద్వాంసులదే పైచేయి. గీర్వాణం అంటే దేవతల భాష కానీ గీర్వాణం అంటే గర్వం, పొగరుమోతు తనం అనే అర్థాలు తెలుగులో వచ్చాయి. తిరుపతి వెంకట కవుల పుణ్యమా అని తెలుగుకి ఆస్థాన ప్రవేశము, సాహిత్య గౌరవము ఏర్పడ్డ తర్వాత ‘తెలుగు మీరిపోతోంది’ అనే మాట కూడా అందుకే వచ్చింది. తెలుగుకి, సంస్కృతానికి ఈ రకమైన పోటీ కొన్నేళ్ల పాటు కొనసాగింది.

ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం — (తెలుగు భాషతో నిండిన కావ్యం ఇనుముతో చేసిన నగ లాంటిది) అని సంస్కృత పండితులు ఈసడిస్తే,
సంస్కృతారణ్య సంచారి విద్వన్మత్తేభ శృంఖలం — (సంస్కృతమనే అడవిలో యధేచ్ఛగా తిరిగే పండితుడు అనే ఏనుగుని కట్టేసే గొలుసు ఇది) అని తెలుగు కవులు అనేవారుట. చాటు ప్రపంచంలో జ్ఞాపకం వుండే శ్లోకం ఈ వైరుధ్యాన్నే తెలియ పరుస్తుంది (వెల్చేరు, షూల్మన్, 1998).
చెళ్ళపిళ్ళ వెంకటరావుగారి కన్నా ఒక 20, 30 ఏళ్ళు ముందుకి వెళ్లి చూస్తే ఈ వివాదాలు ఇంకా బలంగా కనిపిస్తాయి. తెలుగు కవులకి, పండితులకి ఆసరాగా నన్నయ తిక్కనలు ఉన్న్నారు కానీ శాస్త్ర పండితులు ఎవరూ లేరు. జమీందార్ల పోషణలో వుండే తెలుగు కవులు, సంస్కృత పండితులు ఇలాటి అంతర్గత వైరుధ్యాలతో సతమతవుతూ వుండేవారు. తెలుగు వ్యాకరణం సంస్కృతంలో వుంది. అది సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. పండితులు అంటే సంస్కృత పండితులు అనే పేరే వున్నా తెలుగులో కవి అనే పేరుకి అంత గౌరవమూ సంపాదించి తెలుగులో తాము చెప్పే కవిత్వమంతా ప్రామాణికం చెయ్యడానికి, అంటే శాస్త్ర గౌరవాన్ని సంపాదించుకోవడానికి, తెలుగు కవులు ప్రయత్నించేవారు. ఇలాంటి వారిని గౌరవిస్తే తప్ప జమీందార్లకి కూడా సాహిత్యపోషకులు అనే బిరుదు వచ్చేది కాదు. కుంఫిణీ ప్రభుత్వం తెలుగుని ఏ రకంగా చూచినా జమీందార్లు మాత్రం ఆంధ్రశబ్దచింతామణి ఒప్పుకున్న తెలుగునే ఆదరిస్తూ వచ్చారు. తమ ఆశుకవిత్వంతో, శతావధానాలతో జమిందార్లనే కాకుండా డబ్బున్న విద్యావంతులని కూడా ఆకర్షించిన తిరుపతి వెంకట కవులు కూడా తమ కవిత్వాన్ని ఎదుర్కునే పండితులతో పోట్లాడి, తమ ప్రయోగాలు వ్యాకరణ రీత్యా సమర్ధించుకోవడానికి ప్రయత్నించి, చివరికి ‘తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది’ అనే మాట అన్నా, వ్యాకరణాన్ని మాత్రం వాళ్లెప్పుడూ కాదనలేదు.

తెల్లదొరలు తెలుగు నేర్చుకోవడం మానేసి తెలుగువాళ్లకే ఇంగ్లీషు నేర్పడం మొదలుపెట్టిన తరువాత తెలుగుకి ఏ దిక్కూ లేకుండా పోయింది. ఒక పక్క జమీందార్లు చెప్పుకోదగ్గ బలంగా యెక్కడా లేరు. ఇంకొకపక్క కుంఫిణీ వారు తెలుగు వాళ్లకి ఇంగ్లీషు నేర్పే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో స్కూళ్లలో తెలుగు చెప్పేవారు. వీళ్లకోసం తెలుగు పండితులు వ్యాకరణాలు, కథల పుస్తకాలు రాశారు. ఆ వ్యాకరణాలలో ముఖ్యమైనవి: వేదం పట్టాభిరామరావు – ఆంధ్ర వ్యాకరణము లేక పట్టాభిరామ పండితీయం, రావిపాటి గురుమూర్తిరావు – తెనుగు వ్యాకరణం, పుదూరి సీతారామరావు – ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, వేదం వెంకటరమణరావు – లఘువ్యాకరణము, తాడినాడ వెంకయ్య – ఆంధ్రవ్యాకరణం, ఇత్యాది. ఈ వ్యాకరణాలతో పాటు రావిపాటి గురుమూర్తి రావు రాసిన విక్రమార్కుని కథలు, ఆయనే రాసిన పంచతంత్రం, దీనితో పాటు అందరికీ పరిచయమైన పెద్ద బాలశిక్ష (పుదూరి సీతారామరావు), పాటూరి రామస్వామి రాసిన శుకసప్తతి కథలు పఠనపాఠనాలలో వుండేవి.

 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#3
చిన్నయ సూరి


పరవస్తు చిన్నయ 1809లో, సాతానులు అనే చాత్తాద వైష్ణవ సంప్రదాయంలోని కుటుంబంలో పుట్టాడు. నిడదవోలు వెంకటరావుగారు రాసిన చిన్నయ సూరి జీవితము ప్రకారం చిన్నయ పదహారేళ్ళొచ్చేదాకా అక్షర జ్ఞానం లేకుండా పెరిగాడు. ఎప్పుడో ఒకసారి కంచి రామానుజాచార్యులుగారు చదువుసంధ్యలు లేని ఈ కుర్రవాణ్ణి తిడితే అప్పట్నించీ చదువు కోవడం మొదలు పెట్టి సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో గట్టి పట్టు సాధించాడు. అప్పుడు పండితులకందరికీ కుంఫిణీ ప్రభుత్వమే పెద్ద ఆధారం. మున్షీలుగాను, ఇంగ్లీషువారికి తెలుగు పాఠాలు నేర్పించే ట్యూటర్లు గాను, కొద్దిమొత్తాలకే ఈ పండితులు ఉద్యోగాలు కుదుర్చుకొనేవారు. అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి, పండితుల ఆర్ధిక పరిస్థితుల గురించి మనకు సరయిన సమాచారం లేదు. కాని, కుంఫిణీవాళ్ళు ఫోర్ట్ సెయింట్ జార్జి కోటలో ఏర్పరిచిన కళాశాలలో ఒక తెలుగు పండితుడికి ఒక మోస్తరు ఎక్కువ జీతంతో ఉద్యోగం ఇచ్చేవారని తెలుసు. (ఈ కళాశాల 1840లో మూసివేయబడి, ఆ తరువాత ప్రెసిడెన్సీ హైస్కూలుగా మారింది.) మొట్టమొదట ఆ ఉద్యోగంలో వేదం పట్టాభిరామరావుగారు, ఆయనకు సహాయకుడిగా రావిపాటి గురుమూర్తి రావుగారు నియమించబడ్డారు. ఏ ఉద్యోగాలు లేని పండితులకి ఈ రెండు ఉద్యోగాలు గొప్ప పదవుల కిందే లెక్క. కోటలో ఉన్న కాలేజీలో తెలుగు పండితుడికి నెలకు 70 రూపాయిలు జీతం ఇచ్చేవారు. (వేదం పట్టాభిరామరావుగారికి 175 రూపాయిల జీతం వచ్చేదని నిడదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు.) పుదూరి సీతారామరావుగారు 1847లో రిటైరు అయిన తరువాత ఆ తెలుగు ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వారే కాకుండా కొంత ఇంగ్లీషు కూడా వచ్చిన వాళ్ళకోసం కళాశాల వారు ఒక ప్రకటన చేశారు. దానికి చిన్నయ అర్జీ పెట్టుకున్నాడు.

ఆ రోజుల్లో ఆ కళాశాలకు అధ్యక్షుడు ఎ.జె. అర్బత్‌నాట్. అర్జీ పెట్టుకున్న చిన్నయని ఒక పండిత సభవారు పరీక్షించాలి. ఆ పరీక్షలో నెగ్గినవాళ్లకే ఆ ఉద్యోగం వస్తుంది. చిన్నయని, ఆ ఉద్యోగానికే అర్జీ పంపిన పురాణం హయగ్రీవరావుని, పండితులు పరీక్షించి ఆ ఇద్దరిలో చిన్నయే సమర్ధుడు అని పండిత సభ వారు నిర్ణయించారు. అప్పటి కాలమాన పరిస్థితులు మనకి అంతగా తెలియవు కానీ పండితులలో కులభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులోను, బ్రాహ్మణ కులంలో పుట్టని చిన్నయ మీద చిన్నచూపు ఉండేది (చూ: ఆరుద్ర, స.ఆం.సా. పు:28-29 సం.10, 1990; బూదరాజు రాధాకృష్ణ, పరవస్తు చిన్నయ సూరి, పు. 12, 1995). పండితులందరూ రావు అనే బిరుదు పెట్టుకునేవారు. కేవలం వైదీకులే కాకుండా నియోగి అయినా రావిపాటి గురుమూర్తి కూడా రావు అనే పేరే పెట్టుకున్నాడు. చిన్నయకి రావు అనే బిరుదు ఎందుకు లేదు అని అర్బత్‌నాట్ అడిగాడట. తాను అబ్రాహ్మణుడవటం చేత ఆ బిరుదుకి తను అర్హుణ్ణి కానని చిన్నయ అన్నాడట. అయితే ఏ బిరుదు పెట్టుకుంటావు అని అడిగితే సూరి అనే బిరుదైతే తనకి నప్పుతుంది అన్నాట్ట. అర్బత్‌నాట్ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం సూరి అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒక్కటి ఇంగ్లండు నుంచి తెప్పించి చిన్నయకి బహుమతిగా ఇచ్చాడట. చిన్నయ అప్పటినుంచీ చిన్నయ సూరి అనే పేరుతొ ప్రచారం లోకి వచ్చాడు. చిన్నయ సూరి బాలవ్యాకరణానికి పూర్వం సూత్రాంధ్రవ్యాకరణం అని, పద్యాంధ్రవ్యాకరణం అని, ఆంధ్రశబ్దానుశాసనం అని అనేక వ్యాకరణాలు రాసి పెట్టుకున్నాడు. కానీ తెలుగులో చివరికి బాలవ్యాకరణమనే పేరుతొ 1858లో ఒక వ్యాకరణం ప్రకటించాడు. ఇది చిన్నయ సూరి దృష్టిలో కేవలం చిన్న పిల్లల కోసం రాసిన వ్యాకరణం.

“మును మదుపజ్ఞం బగుచుం
దనరిన వ్యాకృతిని సూత్రతతి యొకకొంతం
దెనిఁగించి యిది ఘటించితి
ననయము బాలావబోధ మగు భంగిఁదగన్

తెనుఁగునకు శబ్దలక్షణ
మనయం బరయంగ వేడ్క నందినవారల్
తనరఁగ నీవ్యాకరణం
బున మూలంబయినకృతిని బోలఁ గనఁదగున్

అని చిన్నయ సూరి ఆ వ్యాకరణం చివర పద్యాల్లో రాసుకున్నాడు. (బాలవ్యాకరణము, దూసి రామమూర్తిరావు వ్యాఖ్యానంతో, వావిళ్ల, మద్రాసు, 1937.)
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#4
సెయింట్ జార్జి కోటలో వున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకకముందు చిన్నయ కొన్నాళ్ళు సి. పి. బ్రౌన్ దగ్గర పని చేశాడు. బ్రౌన్ పద్ధతులు చిన్నయకు నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ స్కూలు లోను, పచ్చియప్ప హైస్కూలులోను (1844-47) పని చేసినప్పటికీ, సెయింట్ జార్జి కోటలో వుద్యోగం దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది. (1857లో ప్రెసిడెన్సీ హైస్కూలు మద్రాసు విశ్వవిద్యాలయంగా మారినాక చిన్నయసూరి మొట్టమొదటి తెలుగు విభాగాధిపతిగా ఉద్యోగం కొనసాగించాడు.) ఈ కాలంలోనే అతను పంచతంత్రంలో మిత్రలాభం, మిత్రభేదం రాసి ప్రచురించాడు. చిన్నయ బహుశా అర్బత్‌నాట్ ప్రాపకం వల్లే కావచ్చు, మద్రాసు స్కూల్ బుక్ సొసైటీలో (దీనినే ఉపయుక్త గ్రంథకరణసభ అంటారు) సభ్యుడయ్యాడు. అతని అధికార ప్రాభవం వల్లో లేక ఇతర కారణాల వల్లో అతని బాలవ్యాకరణం, పంచతంత్రంలో మిత్రలాభం, మిత్రభేదం (ఈ రెండు అర్బత్‌నాట్‌కే అంకితం యిచ్చాడు) పిల్లలకు పాఠ్యగ్రంథాలుగా వాడేవారు. దీని తరవాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు బాలవ్యాకరణంలో చెప్పని విషయాలని కలుపుకుని ప్రౌఢ వ్యాకరణము, దానితో పాటు తెలుగుకి ఇప్పటికీ పనికొస్తున్న శబ్దరత్నాకరము అనే నిఘంటువు రాశారు. ఈ మూడింటి వల్ల గ్రాంథిక భాషకి ఒక బలమైన దన్ను ఏర్పడింది. వ్యాకరణము, నిఘంటువు భాషకి ప్రాణం లాంటివి. ఇవి తెలుగు భాషకి బలమైన శాస్త్ర ప్రాతిపదికని ఏర్పాటు చేశాయి. ఏదైనా పదం ఈ రెండు వ్యాకరణాల వల్ల కానీ సాధించడం కుదరకపోతే అది గ్రామ్యం. అలాగే ఏదైనా పదం శబ్దరత్నాకరంలో కనిపించకపోతే కూడా అది గ్రామ్యమే. ఇవి ఆధారంగా తెలుగు భాషలో పండితులకి పుస్తకాలు రాయడానికి పుష్కలమైన అవకాశం దొరికింది.


చిన్నయ సూరిలో చాలామంది గ్రహించినా పైకి చెప్పని ఒక ప్రత్యేకమైన గుణం వుంది. ఆయనకి తెలుగుభాషలో సౌందర్యం, వాక్యనిర్మాణంలో స్పష్టత, పదాల కూర్పులో చక్కదనం, బాగా తెలుసు. ఈ గుణాలు తన సమకాలికులకెవ్వరికీ లేకపోగా చిన్నయ సూరి కొక్కడికీ ఎలా వచ్చాయో చెప్పడం కష్టం.
చిన్నయ సూరి రాసిన పుస్తకాలు ఆయన స్థాపించిన ప్రెస్ (వాణీదర్పణ ముద్రాక్షరశాల) లోనే అచ్చయేవి. అవి పిల్లలకి పాఠ్యగ్రంథాలుగా నిర్దేశించబడ్డాయని ముందే చెప్పాం. సూరి పుస్తకాలకి ప్రాచుర్యము, సూరి పాండిత్యానికి గౌరవము, కుంఫిణీ ప్రభుత్వంలో వున్న అర్బత్‌నాట్ వంటి వారి ప్రాపకం వల్ల జరిగిందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి.

చిన్నయ సూరి బాలవ్యాకరణం పాణిని అష్టాధ్యాయి లాగా బిగువైన సూత్రాలతో చదవడానికి, కంఠస్థం చేయడానికి చక్కగా వుండే నిర్మాణ పద్ధతిలో తెలుగు కవులకి ఆసరాగా నిలబడింది. అల్పాక్షరం ఆసందిగ్ధం సారవత్ విశ్వతోముఖమ్ అని చెప్పడానికి అనువైన సూత్రాలు చిన్నయ సూరి రాశాడు. ఆ వ్యాకరణం ఆధారంగా మాకూ ఒక శాస్త్ర గ్రంథం వుంది అని, మేము కూడా శబ్ద సాధుత్వ, అసాధుత్వాలు నిర్ణయించగలం, అని తెలుగు పండితులు ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణంలో ఒప్పుకున్నాడు. బాలవ్యాకరణం చాలా శాస్త్రబద్ధంగా సూత్రాల పూర్వాపర నియమాలతో పాణిని సంప్రదాయంలో వుండే పరిభాషనే వాడుతూ తెలుగు భాషకి అంతకు ముందు లేని పాండిత్య గౌరవాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో వున్న ఒక లేమిని ఈ పుస్తకం పూర్తి చేసింది. తెలుగువాళ్ళు ఇలాంటి ఒక పుస్తకం కోరుకుంటున్న దశలో ఆ ఖాళీ (power vacuum) భర్తీ చేస్తూ బాలవ్యాకరణం ప్రవేశించింది. అది కారణంగా తెలుగు పండితులకి పెద్ద శాస్త్రాధారం దొరికింది.

కవిత్రయంతో మొదలు పెట్టి దాదాపు 8 శతాబ్దుల పాటు కవులు ఛందోబద్ధ కావ్యాలలో వాడిన భాషకి చిన్నయ సూరి వ్యాకరణం కచ్చితంగా సరిపోతుంది. ఏమన్నా తేడాలుంటే అవి చిన్నవి. కాని, మనం వేసుకోవలసిన ప్రధానమైన ప్రశ్న ఛందోబద్ధ కావ్యాలలో వాడిన భాష నన్నయ్య నుంచి ఈనాటి వరకు చిన్న చిన్న మార్పులు మినహా ఒకే పద్దతిలో ఎలా ఉండగలిగింది? అని. కవులందరూ వ్యాకరణ విధేయులై వ్యాకరణాన్ని వ్యతిరేకించే ఏ రూపాలు వాడకుండా ఉండటం దీనికి కారణం అని మనకు అందరూ చెప్తారు. కానీ అంత విస్తృతమైన వ్యాకరణం తెలుగుకి చిన్నయ సూరి వచ్చేదాకా నిజానికి లేదు. ఆంధ్రశబ్ద చింతామణి చాలా చిన్న వ్యాకరణం.

అయినప్పటికీ ఇన్నాళ్లపాటు కావ్యాలలో వుండే ఈ భాష దాదాపుగా ఒకే రూపంలో ఉండటానికి కారణం పండితులు అనుకున్నట్టుగా వ్యాకరణాలు కాదు. ఎవరో ఒకరు వ్యాకరణం రాయబట్టి, ఆ వ్యాకర్త వాగనుశాసనుడు కాబట్టి, ఆ తరవాత దక్షవాటిలో వుండే కవిరాక్షసుడు అనే ఆయన ఎవరో మనకి తెలియకుండా ఒక శాసనం చేశాడు కాబట్టి, కవులందరూ ఆ శాసనాన్ని పాటించారని వ్యాకరణ పండితుల వాదన.

ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపగా బడియె నెందును దానినె కాని సూతసం
పాదన లేమిచే దెనుగు పల్కు మరొక్కటి గూర్చి చెప్పగా
రాదని దక్షవాటి కవిరాక్షసు డీనియమంబు జేసినన్

(ఆంధ్రకవి తరంగిణి – మూడవ సంపుటము; పు. 73)

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#5
ఈ వాదనకి ప్రధానమైన బలం — ముందు వ్యాకరణం పుట్టి, దాన్ని అనుసరించి కావ్యాలు వస్తాయి అనే నమ్మకం. పండితులందరూ నన్నయ్య ముందు వ్యాకరణం రాసి తరవాతే మహాభారతం రాశాడని నిక్కచ్చిగా నమ్ముతారు. కానీ ఈ భాష ఇంత కాలం పాటు పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఈ రూపంలో ఉండడానికి కారణం వాగనుశాసనులూ కాదు, కవిరాక్షసులూ కాదు. ఛందస్సు ఆ పని చేసింది. తెలుగు కావ్యాలలో ఏ ఛందస్సులు వాడబడాలో దాదాపుగా నన్నయ తన మహాభారతంలో వాడి చూపించాడు. దానికి తోడుగా ఏ కొద్ది కొత్త ఛందస్సులో జేర్చి పద్య కావ్యాలలో కవులు వాటినే వాడుతూ వచ్చారు. కవులు దాదాపుగా ఛందస్సు తమకు రెండవ భాష అయినట్టుగా చెప్పగలవి నన్నయ, తిక్కనలు వాడిన ఛందస్సులే. ఈ ఛందస్సులే దాదాపుగా అందరు కవులు కొన్ని వందల సంవత్సరాల పాటు యథేచ్ఛగా వాడారు. ఈ ఛందస్సులలో విశేషమేమిటంటే వాటిలో కొన్ని రకాల పద సంపుటులు మాత్రమే పడతాయి. అక్షరబద్ధం కాబట్టి వాటిని ఇష్టం వచ్చినట్లు మనం వాడే వాక్యాలలోకి నప్పించడం కష్టం. కష్టమే కాదు, అసాధ్యం కూడా! ఎక్కడైనా ఒక చోట మనం వ్యవహారంలో వాడే ఒక మాటనో, పేరునో ఏ కంద పద్యం లోనో, సీసపద్యం లోనో ఇమిడించవచ్చు గాక. కాని, పాతకాలపు మాట ఒక్కటి కూడా లేకుండా ఇప్పుడు మనం మాట్లాడే తెలుగులో పద్యం రాయడం అసాధ్యం. ఉదాహరణకి పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు అనే మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఏ తెలుగు పద్యం లోను పట్టవు. పరుచూరి శ్రీనివాసుడు అని చేసుకుంటే కంద పద్యంలో ఇమిడించొచ్చు. వెల్చేరు నారాయణరావు ఒక పట్టాన ఏ పద్యంలోను పట్టదు. సాధ్యమైనన్ని వాడుకలో ఉండే తెలుగు మాటలతో శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకం రాశాడు. కానీ అందులో కూడా వ్యవహారంలో లేని తెలుగు మాటలు పెట్టక పొతే పద్యం నడిచింది కాదు.


నీకొక సిగరెట్టిస్తా
నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా
త్రైకాల్య స్థాయిగ
శ్రీ కావ్యమ్ము వరలు సిరిసిరిభాయీ

ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే పద్యాలలో ఉన్న తెలుగు భాష ఇంతకాలం పాటు ఒకే రూపంలో ఉండటం ఏ వ్యాకరణం వల్లనూ కాదు, ఏ శాసనం వల్లనూ కాదు, కేవలం ఛందస్సు వల్ల. పద్య ఛందస్సులు వాడకుండా మాత్రా ఛందస్సులు వాడి పాటలు రాసిన అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి మనం వ్యవహారికం అనుకునే మాటలు (నిజంగా వ్యవహారికం కావు) రాయగలగడానికి కారణం వాళ్ళు అక్షర ఛందస్సులు అనుసరించక పోవడమే.
చిన్నయ సూరికి ముందు తెలుగు వాళ్ళే రాసిన తెలుగు వ్యాకరణాలు నాలుగైదు ఉన్నాయని ఇంతకు ముందు చెప్పాం. ఆ వ్యాకరణాలు పరిశీలిస్తే అవి శాస్త్రబద్ధంగానే ఉండటానికి ప్రయత్నించాయని తెలుస్తుంది. అంటే సంస్కృత వ్యాకరణ మర్యాదల్ని అనుసరించడానికి ప్రయత్నించాయి. ఇంకో మాటలో చెప్పాలంటే తెలుగు కావ్యాలలో వుండే భాషనే అవి ప్రమాణంగా పెట్టుకున్నాయి. భాషకి లక్షణం చెప్పేది వ్యాకరణమే అని, లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యమని ఈ వ్యాకరణాలన్నీ వొప్పుకున్నాయి. అరసున్నలు, సరళాదేశాలు, గసడదవాదేశాలు, కళాదృతప్రకృతికవిభాగాలు, సంధి నియమాలు ఈ వ్యాకరణాలన్నీ పాటించాయి. ఒక్కసారి వేదం వెంకటరమణ రావుగారు రాసిన లఘువ్యాకరణాన్ని చూస్తే దాదాపుగా చిన్నయసూరి బాలవ్యాకరణం చదువుతున్నట్టే ఉంటుంది. పుదూరి సీతారామరావుగారి ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణంలో ప్రశ్నలు శాస్త్రంలో వుండే ఉత్థాపిత ప్రశ్నల్లా ఉంటాయి. శాస్త్రార్ధం చేసే వాళ్లకి ఇలాంటి ప్రశ్నలు పరిచితమే.

ఇవి కాక తెలుగు పద్య కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసిన పాత పండితులు ఒక రకమైన వ్యాఖ్యాన భాష రాసేవారు. ఇది పద్యకావ్యాలలో వుండే భాష కాదు. ఇవి చూస్తే ప్రక్రియని పట్టి భాష మారుతోందని, ఏ ప్రక్రియకి అనువైన భాష ఆ ప్రక్రియ రాసేటప్పుడు వాడారని, భాష కంతటికీ కలిపి ఒక వ్యవహారం లేదని, బోధపడుతుంది. భాష ఇలాంటి పరిస్థితిలో ఉందని గుర్తించి పద్యాలకి వాడిన భాషే సలక్షణమైన భాష అని భావించి, దానికి శాస్త్రీయంగా లక్షణం చెప్పి, ఆ భాషనే ఆధునిక వచన వ్యవహారానికి కూడా వాడవచ్చునని చూపించిన వాడు చిన్నయ సూరి. తెలుగులో పద్యాలకి మాత్రమే వాడుతున్న భాషని ఆధునిక వచన వ్యవహారానికి నప్పించి తెలుగు భాషని సమగ్రంగా ఆధునీకరించినవాడు ఆయనే. అందరూ చూచే చిన్నయ సూరి వచన రచనలు ఆయన నీతిచంద్రికలో రాసిన మిత్రలాభము, మిత్రభేదము మాత్రమే. ఇందులో మిత్రలాభం కన్నా మిత్రభేదం ఒక రకమైన గడ్డు భాషలో వుండి, బడిపిల్లలకు పాఠ్య గ్రంథాలుగా పెట్టబడి, బాలవ్యాకరణం ప్రకారం వచనం అంటే అలాగే ఉండాలనే అభిప్రాయం బలపడింది. కానీ చిన్నయ సూరే తెనిగించిన హిందూధర్మశాస్త్ర సంగ్రహము చూసినవాళ్ళకి చిన్నయ సూరి బాలవ్యాకరణం ప్రకారం రాసిన భాష ఆధునిక తెలుగు వచన రచనలు చేయడానికి కూడా పనికి వస్తుందని ఆయన భావించాడని తెలుస్తుంది.

ఈ అభిప్రాయం సరయిందేనా కాదా? చిన్నయ సూరి చేసిన పనిని సవిమర్శకంగా చూడవలసిన అవసరం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు గిడుగు రామమూర్తిగారు, గురజాడ అప్పారావుగారు చేసిన పనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహారికా భాషావాదంలో ఉపయోగాలకు పరిమితులున్నాయా? అనేవి తర్వాత వ్యాసంలో వివరంగా చర్చిస్తాం.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#6
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2


చిన్నయ సూరి, మెకాలే (Macauley)


[Image: taa.venkayya-Grammar_1916.JPG]


చిన్నయ సూరి బాలవ్యాకరణం 1858లో అచ్చవడమే మొదలుగా ప్రతులు బాగా అమ్ముడుపోయాయని అంకెల వల్ల తెలుస్తోంది. 1900నాటికి అది 17ముద్రణలు పొందింది. ఈ పుస్తకం ఇంత ప్రచారంలోకి రావడానికి కారణం తెలుగు పాఠాలు చెప్పే పండితులా, లేకపోతే ఈ పుస్తకమే వాడాలని స్కూల్ బుక్ సొసైటీ వారి ఉత్తరువా అన్న సంగతి స్పష్టంగా చెప్పడానికి కావలిసిన సమాచారం మన దగ్గర లేదు. కానీ తెలుగు వ్యాకరణాలు అమ్ముడు పోయేవి అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు దొరుకుతున్నాయి. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు 1916లో ప్రచురించిన తా. వెంకయ్య రాసిన ఆంధ్ర వ్యాకరణము మూడవ ముద్రణ అయిదువేల కాపీలు వేశారని మొదటి అట్టమీద ఉంది. ఈ పుస్తకం వాడాలని స్కూల్ బుక్ సొసైటీ వాళ్లు చెప్పే అవకాశం లేదు. అలాగే ఎవరు రాసినా 1830-1930 మధ్యకాలంలో వ్యాకరణం పుస్తకాలు పలు ముద్రణలు పొందాయి. అంచేత పిల్లలకి తెలుగు చెప్పవలసిన అవసరమూ, ఆ తెలుగు చెప్పడానికి వ్యాకరణం కావాలని ఒక అభిప్రాయమూ వున్నాయి కాబట్టి ఈ వ్యాకరణాలు ఇంత బాగా అమ్ముడు పోయాయని అనుకోవాలి. చిన్నయ సూరి బాలవ్యాకరణం కూడా ఈ కారణం చేతనే బాగా అమ్ముడు పోయి వుంటుంది. అది అమ్ముడుపోడానికి స్కూల్ బుక్ సొసైటీ వాళ్ల తాఖీదు ఒక కారణం కాని అదే కారణమని మనం అనుకోనక్కరలేదు.

ఆరుద్ర గారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో: “చిన్నయ సూరి గ్రంథానికి వ్యాఖ్య రాయించాలని గాజుల లక్ష్మీ నరసు శెట్టి గారు ప్రయత్నించారుగాని ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. … ఇరవయ్యో శతాబ్దంలో వ్యాఖ్యానాలు వెలువడ్డాక గాని బాల వ్యాకరణం రాజ్యమేలడం ప్రారంభించలేదు. పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్థంలో శేషయ్య వ్యాకరణం, వెంకయ్య వ్యాకరణం వంటివే పఠన పాఠనాదులలో ప్రసిద్ధాలు.” అన్నారు. ఈ వివరాలు ఆయన ఎక్కడ సేకరించినది మనకి చెప్పలేదు. (చిన్నయ సూరి పెద్దరికం; స.ఆం.సా; సంపుటం 10, 1990, పేజి 36) నిడదవోలు వెంకటరావుగారు పైన చెప్పిన వ్యాసంలోనే (1962) 1887 నాటికి బాలవ్యాకరణం 8 ముద్రణలు పొందితే శేషయ్య వ్యాకరణం, వెంకయ్య వ్యాకరణం 10-12 ముద్రణలుపొందాయని చెప్పారు.

ఉదయగిరి శేషయ్య రాసిన “తెలుగు వ్యాకరణము” (1857) 19వ శతాబ్దం రెండవ భాగంలో వచ్చిన వ్యాకరణాల కంటే చాలా భిన్నమయింది. దీనిలో భాష సరళంగాను, పుస్తకం అచ్చు వేసిన తీరు కంటికి చాలా సొంపుగాను ఉంటుంది. తక్కిన వ్యాకరణ పుస్తకాల రచయితలతో పోలిస్తే శేషయ్య పెద్ద హోదాలో పని చేయలేదు..

[Image: telugu-vAkaraNamu_udayagiri-SEshayya_1857.JPG]

చిన్నయ సూరి పుస్తకం బాగా వాడుకలోకి రావడానికి రెండవ కారణం పండితుల ఆదరణ. తా. వెంకయ్య పేరుతో వున్న వ్యాకరణానికి చిన్నయ సూరి వ్యాకరణానికి భాష విషయంలో తేడా లేదు. రెండూ వ్యాకరణ మర్యాదలకి లోబడిన భాషనే ప్రమాణీకరిస్తున్నాయి. మాట్లాడుకునేప్పుడు వాడే భాషను తా. వెంకయ్య గ్రహించలేదు. అంతే కాదు, అప్పటికి రాసిన అన్ని వ్యాకరణాలు ఒకే రకమైన భాషకి నియమాలు చెప్తున్నాయి. ఉదాహరణకి బాలవ్యాకరణం కంటే ముందు వచ్చిన వేదం పట్టాభిరామరావు రాసిన ఆంధ్ర వ్యాకరణము (1810ల నాటి రాతప్రతి, మొదటి ముద్రణ 1951); రావిపాటి గురుమూర్తిరావు రాసిన తెనుఁగు వ్యాకరణము (1836, పునఃప్రచురణ 1951); పుదూరి సీతారామరావు రాసిన ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము (1834, 1852, 1859); వేదం వేంకటరమణరావు రాసిన తెనుగు లఘువ్యాకరణము (1856); ఇవన్నీ ఒక రకమైన భాషకే వర్తించే వ్యాకరణాలు. వ్యాకరణం అంటే అప్పటి వాళ్లందరికి ఒక రకమైన భాషే మనసుల్లోకి వచ్చింది. ఇది లాక్షణిక భాష. ఇది కాక ఆ కాలం నాడే అచ్చయి చదువుకున్న వాళ్ల చేతిలో ప్రచారంలోకి వచ్చిన పుస్తకాలు–ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర, ఎర్రమల్లి మల్లికార్జునుడి చార్ దర్వీషు కథలు (1876), రావిపాటి గురుమూర్తి రావు విక్రమార్క కథలు (1819) ఇలాంటివి. వీటిలో వున్న భాష వ్యాకరణాలలో ఉన్న భాష కాదు. ఇది నేర్పక్కరలేకుండానే వచ్చే భాష. దీనికి వ్యాకరణ గ్రంథాలలో గ్రామ్యము అని పేరు.

సరిగ్గా ఆ రోజుల్లో కుంఫిణీ ప్రభుత్వం వాళ్లు మెకాలేస్ మినిట్ (Macaulay’s minute) అనే పేరుతో వున్న అభిప్రాయం ఆధారంగా పరిపాలన అంతా ఇంగ్లీషులో మొదలుపెట్టారు. తెలుగుకి ప్రభుత్వ ఆదరణ తగ్గిపోయింది. అయినా స్కూళ్లలో తెలుగు పండితులు తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు ఈ వ్యాకరణాలే అనుసరించారు. చిన్నయ సూరి వచ్చిన తరవాత ఆయన వ్యాకరణమే పండితులందరికీ ఆమోదయోగ్యమయింది. అప్పటి రోజుల్లో చిన్నయ సూరికి అధికార వర్గాలలో మంచి పేరే వుండేది. ఒక వంక అర్బత్ నాట్ లాంటి తెల్ల దొరలు, గాజుల లక్ష్మీనరసయ్య శ్రేష్టి, కోమలాపురం శ్రీనివాస పిళ్ళే వంటి ధనవంతులైన అబ్రాహ్మణులు చిన్నయ సూరికి దన్నుగా వుండేవాళ్లు. పాండిత్య ప్రపంచంలో మద్రాసులో బ్రాహ్మలదే ప్రాపకం అనీ ఆ బ్రాహ్మణుల్లో స్మార్తులు, వైష్ణవులు రెండు వర్గాలుగా చీలి వుండేవారనీ ఇంతకుముందే చెప్పాం. అటువంటి పరిస్థితులలో సాతాని కులంలో పుట్టిన అబ్రాహ్మణుడైన చిన్నయ సూరికి ఇంత ప్రాధాన్యం రావడం, అతని పుస్తకాన్ని బ్రాహ్మణ పండితులు కూడా అంగీకరించడం ఎలా జరిగిందో మనకి స్పష్టంగా తెలియదు. అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు ఉన్నట్టుగా నిర్ణయించడానికి తగినంత విస్తృతమైన పరిశోధన ఇంతవరకూ ఎవరూ చేయలేదు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#7
మంచి విషయాన్ని పంచుకున్నారండి .....

మన తెలుగు గురించి కృషి చేసిన గ్రంధికాభిమానులకు(లాక్ష నికాభిమానులకు) , వ్యవహరికాభిమానులకు(గ్రామ్యఅభిమానులకు) , ఆంగ్లేయులకి , సదా సరితాభిమానుడిని .
Like Reply
#8
ఈ సందర్భంలో శిష్టు కృష్ణమూర్తి కవిని గురించి చెప్పుకోవాలి. ఆయన చిన్నయ సూరికి సమకాలికుడు. ఈయన గురజాడ శ్రీరామమూర్తి లెక్క ప్రకారం 1800-1877 ప్రాంతంలో జీవించాడు. ఈయన సంస్కృతంలోను, తెలుగులోను, సంగీతంలోను గొప్ప ప్రజ్ఞ కలవాడు. పురాణం చెప్పేటప్పుడు మధ్యలో పుస్తకం మూసేసి సొంతంగా పద్యాలు ఆశువుగా చెప్తూ మళ్ళా కొంచెంసేపు తరవాత పుస్తకం తెరిచి పద్యాలు చదివేవాడని, వినేవాళ్లకి ఆ రెండు రచనలు ఒకే రకంగా వుండేవని ఒక ప్రసిద్ధి ఉండేది. దానితో పాటు వసుచరిత్రలో పద్యాలకి ఎనిమిదేసి అర్థాలు చెప్పేవాడని ఒక వాడుక కూడా వుంది. ఈయన రకరకాల జమిందార్లను కలుసుకుని వాళ్లందరి దగ్గరా కొన్నేసి సంవత్సరాలు జీవించాడు. ఈయన చాలా పుస్తకాలు రాశాడని పేరుంది కాని సర్వకామదా పరిణయం ఒక్క దానిని గురించే కవిజీవితములలో గురజాడ శ్రీరామమూర్తి కొద్దిగా ప్రస్తావించారు. ఆ పుస్తకంలో పిండిప్రోలు లక్ష్మణకవి చాలా తప్పులు పట్టుకున్నాడని కూడా శ్రీరామమూర్తి రాశారు. శిష్టు కృష్ణమూర్తి కవి గొప్ప వైణికుడట. ఆయన వీణావాయిద్యాన్ని గురించి చెప్పిన ఒక పెద్ద ఉత్పలమాలిక శ్రీరామమూర్తి ఉదాహరించారు. కృష్ణమూర్తి కవి పెద్దపెద్ద ఉత్పలమాలికలు ఆశువుగా రచించడంలో నేర్పరి.


కృష్ణమూర్తి కవిని గురించి ప్రచారంలో వున్న కథల్లో ఒక కథ ఇక్కడ చెప్పడం అవసరం. కృష్ణమూర్తి కవి మాడుగులలో వుండగా అక్కడి జమిందారు కొడుకు జగన్నాథుడు అనే వాడు ఒక గుర్రం మీద మోజుపడి కొందామనుకున్నాడు. కానీ అశ్వశాస్త్రవేత్తలు దాని మెడ కింద గోగు(అంటే యేమిటో మాకు తెలియదు-ర.) ఉందని, అది ఒక దోషమని చెప్పారట. అయినా ఆ కుర్రవాడు ఆ గుర్రాన్ని వదిలిపెట్టలేక కృష్ణమూర్తి కవికి కనుసన్న చేసి, ‘ఈ కవిగారు అశ్వశాస్త్రంలో చాలా పండితుడు, ఈయన దగ్గర ఉన్న పుస్తకాలలో యేముందో కనుక్కుందాం’ అని అన్నాడట. ఆ జమిందారు కృష్ణమూర్తి కవిని మీదగ్గర ఉన్న అశ్వశాస్త్రంలో యేముందో చెప్పండి అని అడిగితే కృష్ణమూర్తి కవి చూసి మీకు రేపు చెప్తాను అన్నారట. ఈ జగన్నాథుడనే అబ్బాయి కృష్ణమూర్తి కవి ఇంటికి వెళ్లి మీరు గాని ఆ గుర్రంలో దోషమేమీలేదని చెప్పినట్లైతే మీకు బోలెడు డబ్బిస్తానని ఆశ పెట్టాడట. కృష్ణమూర్తి కవి రాత్రికిరాత్రి కొన్ని వందల శ్లోకాలతో అశ్వశాస్త్రం చెప్పారట. ఆయన మనవడు కృష్ణమూర్తి కవి దగ్గరున్న పాతతాటాకులు తీసుకుని ఆ శ్లోకాలన్నిటినీ ఆ తాటాకులమీద రాశాడట. సంస్కృతంలో నారద మహాముని ఒక మహారాజుకు చెప్పినట్లున్న ఈ శాస్త్రం జమిందారుకు చూపించి అటువంటి గుర్రానికి అటువంటి గోగు ఉండటం దోషం కాదు సరికదా దానివల్ల చాలా శుభాలే కలుగుతాయని కృష్ణమూర్తి కవి ఋజువు చేశారట. కృష్ణమూర్తి కవి ఈ పుస్తకాన్ని ఆశువుగా చెప్తునప్పుడు స్వయంగా అక్కడ ఉండి విన్న అప్పట్లో ఇరవైయేళ్ళ ఒక యువకుడి ద్వారా కవిజీవితాలు రాసిన గురజాడ శ్రీరామమూర్తి ఈ కథనంతటినీ తెలుసుకున్నారు.

కాళహస్తి ఆస్థానంలో పని చేసేటప్పుడు ఒకసారి, వెంకటగిరి సంస్థానంలో మరోసారి, శిష్టు కృష్ణమూర్తి చిన్నయ సూరితో ఘర్షణ పడినట్లు వేదం వెంకటరాయరావు మనవడి ద్వారా తెలుస్తోంది. చిన్నయ సూరి బాలవ్యాకరణం అంత శాస్త్రసమర్థంగా వుండడం, ఈ సాతాని పండితుడు బ్రాహ్మణులని తలదన్నేలా వ్యాకరణ నిర్మాణం చెయ్యడం శిష్టు కృష్ణమూర్తి కవికి నచ్చలేదు. ఈ విధంగా చిన్నయ సూరి మీద అసూయ పడిన కృష్ణమూర్తి కవి బాలవ్యాకరణం చిన్నయ సూరి స్వతంత్రంగా రాసింది కాదని, అది హరికారికలకి అనువాదమని ఒక వాదం తెచ్చిపెట్టాడు. హరికారికలు హరిభట్టు అన్న ఆయన రాశాడని అధర్వణుడు చెప్పడమే కాని నిజంగా ఆ గ్రంథం ఎవరూ చూడలేదు. చిన్నయ సూరి బాలవ్యాకరణాన్ని అనుసరించి, కృష్ణమూర్తి కవి సంస్కృతంలో ఆ గ్రంథాన్ని తానే రాసి చూపించాడు. శిష్టు కృష్ణమూర్తి చేసిన ఈ పని మంచి పని కాదని, అలాంటి ‘అసత్యవాదము చేయఁగూడదని’ వేదం వెంకటరమణరావు హెచ్చరించారట.

[Image: Guptartha.png]

ఈ కథ ఆ కాలంలో ఎవరు నమ్మారో తెలియదు కానీ తరవాత చాలా సంవత్సరాలకి కల్లూరి వేంకట రామరావు తన బాలవ్యాకరణం వ్యాఖ్యానం గుప్తార్థప్రకాశికలో (1915, 1929) మాత్రం ఇది నిజమని చాలా బలంగా ప్రతిపాదించారు. వేంకటరామరావు ప్రకటించిన గుప్తార్థప్రకాశిక టైటిల్ పేజిలోనే ఈ విషయం స్పష్టంగా వుంటుంది (బ్రహ్మశ్రీ శిష్టు కృష్ణమూర్తిరావు పండితవర్యప్రణీత హరికారికాంధ్రీభూత పరవస్తు చిన్నయసూరికర్తృక బాలవ్యాకరణంబునకు వ్యాఖ్యానము.)

వేంకటరామరావు ఇలా వాదించడానికి ఒక కారణముందని అంటారు. కల్లూరి వేంకటరామరావు తన వ్యాఖ్యానం రాస్తున్న రోజుల్లో ఆయన శిష్యుడైన సుంకర రంగయ్య అనే కుమ్మరి కులస్తుడు ఆయనకు లేఖకుడిగా పని చేశాడు. ఆ పుస్తకంలో మొదటి భాగాన్ని–కారక పరిఛ్ఛేదంలో చివరి వరకు ఉన్నదానిని– రాసి, ఆ ప్రతికి శుద్ధప్రతి తయారుచేస్తానని తీసుకెళ్ళి తన పేరుతో ఈ రంగయ్య ప్రకటించుకున్నాడు. ఈ లోపున వేంకటరామరావుకి శిష్టు కృష్ణమూర్తి రావు మనవడు (తాతగారి పేరే గల ఆయన) తన తాతగారు రాసిన హరికారికల రాతప్రతిని వేంకటరామరావుకి సర్వాధికారాలతో (స్టాంపు పేపరు మీద రాసి) దానంగా ఇచ్చాడు. అది చదివిన వేంకటరామరావుకి అది బాలవ్యాకరణానికి మూలగ్రంథం అని, బాలవ్యాకరణం కేవలం దానికి అనువాదమే అనీ నమ్మకంగా అనిపించింది. రంగయ్య వంటి శూద్రుడి మీది కోపాన్ని శూద్రుడైన చిన్నయ సూరి మీదికి మళ్ళించారు వేంకటరామరావు. అప్పట్నుంచి పండితలోకంలో చిన్నయ సూరి పట్ల అపప్రథ మొదలయింది.

బ్రాహ్మణ పండితులు ఆ వాదాన్ని ఆధారంగా చేసుకుని చిన్నయ సూరికి నిజంగా ఏమీ రాదని అతని పేరుని చిన్న+అసూరి (చిన్న అపండితుడు) అనీ, పర-వస్తు చిత్+నయ సూరి (ఇతరుల వస్తువులు దొంగిలించుటలో పండితుడు) అని అతని గురించి హాస్యంగా అనుకునేవారట.
దువ్వూరి వెంకటరమణరావు ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికలో కల్లూరి వేంకటరామరావు వాదాన్ని ఖండిస్తూ,ఒక పెద్ద వ్యాసం ప్రకటించి, రమణీయం అన్న పేరుతో రాసిన తన బాలవ్యాకరణంలో ఈ అపప్రప్రథలనన్నింటినీ ఖండించి చిన్నయ సూరి పాండిత్యాన్ని, అతని భాషా సౌందర్యాన్ని, అతని మౌలికతని బలంగా సమర్థించేదాకా చిన్నయ సూరి పేరు కళంకరహితంగా పండితలోకంలో స్థిరపడలేదు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#9
రామాయణంలో పిడకల వేటలాగా వచ్చిన ఈ కథలు ఇలా ఉండగా, ప్రభుత్వాదరణ అంతగా లేకపోయినా స్కూళ్లలో తెలుగు చెప్పడం కొనసాగింది. పంతొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో చెన్నపట్నంలో మూడు ఉన్నత పాఠశాలలు ఉండేవి. అప్పటికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడలేదు. అంటే ఇవే ఉన్నతమైన విద్యాసంస్థలు. వాటిలో ప్రతిష్ఠాత్మకమైనది ప్రెసిడెన్సీ లేక బోర్డు హైస్కూలు. దీనిలో ఎక్కువ భాగం తెల్లవాళ్లే చదువుకునేవారు, కాని 1840 ప్రాంతం తరువాత భారతీయుల్ని కూడా చేర్చుకున్నారు. రెండవది చెన్నపట్నంలోని ప్రముఖ హిందువులు స్థాపించిన పచ్చయప్ప హైస్కూలు. మూడవది కేవలం క్రైస్తవ మిషనరీల కోసం యేర్పరచిన (ఆప్టన్) మిషనరీ హైస్కూలు.

చిన్నయ సూరి ఈ మూడు సంస్థల్లోను పనిచేశారు. 1836-37 ప్రాంతాల్లో చిన్న జీతంతో మిషనరీ హైస్కూలులో ఉద్యోగాన్ని ప్రారంభించి తన పాండిత్యంతో నగరంలో పేరు ప్రఖ్యాతులు గడించిన తరువాత 1844లో పచ్చయప్ప హైస్కూలులో తెలుగు పండితుడి స్థానానికి, మూడేళ్ల తరువాత 1847లో ప్రెసిడెన్సీ హైస్కూలులో ప్రధాన తెలుగు పండితుడి స్థానానికి ఎదిగారు. మద్రాసులో యూనివర్సిటీ ఏర్పడినప్పుడు అక్కడి తెలుగు పండిత స్థానానికి కూడా చిన్నయ సూరే ఎంపిక చేయబడ్డారు (1857-1861). అంటే చిన్నయ సూరి ఉద్యోగం ఆ రోజుల్లో తెలుగుకి గొప్ప ఉద్యోగం. ఇక మిగిలిన తెలుగు ఉద్యోగాలు చాలా చిన్నవి. వాటికి చెప్పుకోదగ్గ గౌరవం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చెప్పుకోదగ్గ స్థాయిలో వుండడం, 1853 తరువాత చిన్నయ సూరి పుస్తకాలు బాగా అమ్ముడు పోవడం (నీతిచంద్రిక-1853, బాలవ్యాకరణం-1858), కారణంగా చిన్నయ సూరి సుఖంగానే జీవించారు.


ఇది ఇలా వుండగా ప్రధానమైన రాజకీయ భాష ఇంగ్లీషే అయింది. అంచేత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారందరూ ఇంగ్లీషే నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషులోనే ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ఆరోజుల్లో వాళ్ళు ఆఖరికి వాళ్ల ఉత్తరాలు, డైరీలు కూడా ఇంగ్లీషులోనే రాసేవారు. విద్యావంతుల్లో తెలుగు నీరసించడం మొదలయ్యింది. బాగా చదువుకున్నవాళ్లు, అంటే లాయర్లు, పెద్ద పెద్ద రెవెన్యూ ఉద్యోగస్తులు గొప్ప కోసం మాకు తెలుగు రాదని చెప్పుకోవడం మర్యాదయింది.

ఒక పక్క విద్యారంగంలో తెలుగు బలహీనపడుతూండగా, ఇంకొక పక్క అచ్చుయంత్రం వాడుకలోకి రావడం మొదలయింది. తెలుగు పుస్తకాలు అచ్చులోకి వస్తున్నాయి. తెలుగు, సాహిత్యేతర వ్యవహారాలకోసం–అంటే, రాజకీయ, లౌకిక వ్యవహారాలకు–వచన రూపంలో అభివృద్ధి కావలసిన అవసరం వుందని చిన్నయ సూరి గమనించారు. ఈ భాష ఆధునిక వ్యవహారాలకి ఒక నియతమైన రూపంలో యేర్పడాలని ఆయన అభిమతం. తెలుగు పదాల వర్ణక్రమం ఎవరి అవసరాలకి సామర్థ్యానికి తగినట్టుగా వారు రకరకాల పద్ధతుల్లో రాస్తున్నారు. ఈ వర్ణక్రమాన్ని ఒక దారిలో పెడితే తప్ప తెలుగు పదాలకి ఒక స్థిరత్వం యేర్పడదు. ఇటు పండితులు రాసే వ్యాఖ్యానాలలోను, అటు పండితులు అయిన వాళ్లు, కాని వాళ్లు పాడే పాటల్లోను, ఆ కాలంలో ప్రకటింపబడ్డ శాసనాల్లోను రకరకాల వర్ణక్రమాలు వున్నాయని గుర్తించి వాటిని ఒక స్థిరమైన రూపంలో ఆధునీకరించ తలపెట్టిన వ్యక్తి చిన్నయ సూరి. అందుకని మొదటిసారిగా తెలుగు భాషలో వచనం రాయడానికి అనువైన, సలక్షణమైన భాషని సూత్రబద్ధంగా నిర్మించారు. దానితోపాటు తెలుగుని ఒకవంక అందమైన భాష గాను, ఇంకొకవంక అందం కోసం కాకుండా కేవలం వ్యవహార అవసరాలకి తగిన భాష గానూ రూపొందించి చూపించాలి. ఇంత పెద్ద ఊహ మనసులో పెట్టుకుని ఒక పక్క వ్యాకరణము, ఇంకొక పక్క నీతి చంద్రికలో మొదటి రెండు భాగాలు, కేవలం లౌకిక వ్యవహారానికి పనికొచ్చే హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము సూరి ప్రకటించారు.

కానీ 1862లో చిన్నయ సూరి అకాల మరణం తరవాత ఆయన దృక్పథానికి కొనసాగింపు లేకపోయింది సరికదా దానికి వక్రీకరణలు ఆరంభమయ్యాయి. ఆ తరవాత చిన్నయ సూరి మిత్రలాభం, మిత్రభేదంలో వున్న వచనాన్ని అనుసరిస్తున్నామనుకొని ‘బండరాళ్ల లాంటి శుష్క వచనం’ రాసిన వీరేశలింగం పంతులు, కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆ వచనాన్ని పాఠశాలలో విద్యార్థులపై బలవంతంగా రుద్ది, తెలుగు భాష అలాగే రాయబడాలని మార్గ నిర్దేశం చేశారే తప్ప చిన్నయ సూరి ఉద్దేశాన్ని సరిగా బోధపరుచుకోలేదు. చిన్నయ సూరికి భాషా సౌందర్యం పట్ల ఉన్న సామర్థ్యాన్ని కూడా వాళ్లు గుర్తించలేదు. చిన్నయ సూరే హిందూ ధర్మశాస్త్ర సంగ్రహంలో ఎంత సులభమైన, స్పష్టమయిన వచనం రాశాడో ఎవ్వరూ మాట వరసకు కూడా అనలేదు. ఆ పుస్తకం ప్రతులు ఎవరికీ అందుబాటులోకి కూడా వచ్చినట్లు లేదు. దాన్ని తను రాసిన చిన్నయ సూరి జీవిత చరిత్రకి అనుబంధంగా ప్రకటించిన నిడదవోలు వెంకటరావు హిందూ ధర్మశాస్త్ర సంగ్రహాన్ని లండనులో బ్రిటిష్ లైబ్రరీ నుంచి ఫోటోకాపీ తెప్పించుకున్నామని చెప్పారు. దీన్ని బట్టి ఈ పుస్తకం ఎవరికీ అందుబాటులో లేదేమో అని అనుమానించడానికి ఆస్కారం వుంది. ఒక్క గురజాడ అప్పారావు మాత్రం పాఠ్యగ్రంథాలుగా వాడుతున్న నీతిచంద్రికలో చిన్నయ సూరి రాసిన మిత్రలాభం, మిత్రభేదం అందమైన వచనమని; వీరేశలింగం రాసిన భాగాలే గడ్డు వచనం, శుష్క వచనం అని గుర్తించారు.

చిన్నయసూరి మరణించిన తరవాత తెలుగు ఒక విధమైన దురవస్థలో పడింది. మెకాలే చెప్పిన మాటల ఆధారంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులోనే జరిగేవి. అంచేత తెల్లదొరలు తెలుగు నేర్చుకోవలసిన అవసరం పోయింది. గ్రామ పరిపాలనలోను, రైతులనుంచి పన్నులు వసూలు చేయడానికి కావలసిన లెక్కలు రాయడంలోను తర్ఫీదు పొందిన కరణాలు వాళ్లకలవాటయిన భాషలో ‘కరణీకపు తెలుగు’ రాస్తుండేవారు. ఈ కరణీకపు తెలుగు సర్కారు జిల్లాల్లో ఎంత విస్తృతంగా అమలులో వుందో మెకంజీ తరపున కావలి సోదరులు సంపాదించిన, కైఫీయత్తులలో వివరంగా తెలుస్తుంది. ఆ కైఫీయత్తుల లోని భాష నాలుగైదు భాషల్లో అవలీలగా వ్యవహరించగల కరణాలు తయారు చేసిన భాష. అప్పటికే దక్షిణాంధ్ర యుగంలో యక్షగానాల్లో చాలా పాత్రోచితమైన భాష వాడబడింది. దానితో పాటు విజ్ఞానశాస్త్ర గ్రంథాలయిన ఖడ్గలక్షణశిరోమణి వంటివి కూడా తెలుగులో వచ్చాయి. కాకపోతే ఆ పుస్తకాలు అచ్చులోకి రావడానికి దాదాపు 1940 దాకా పట్టింది. ఇవేవీ తెలియని తెలుగు పండితులకి అందుబాటులో వున్నవి తెలుగు కావ్యాలే. అందులోను మరీ ముఖ్యంగా ద్వ్యర్థికావ్యాలు, బంధకవిత్వము, చిత్రకవిత్వము పండితుల మేధాశక్తికి పదును పెట్టే జటిలమైన గ్రంథాలు ప్రచారంలో వుండేవి. నన్నయ నుంచి మొదలుపెట్టి నాటివరకు ఉన్న పుస్తకాలన్నీ పండితుల దృష్టిలో ప్రామాణిక గ్రంథాలు.

ఈ కాలంలో, తెలుగు పండితులకి ప్రభుత్వాదరణ పోయి జమిందార్ల ప్రాపకంలో మెలగవలసిన స్థితి వచ్చింది. అక్కడ సంస్కృత పండితులదే ప్రాబల్యం. సంస్కృత వ్యాకరణ సంప్రదాయంలో అంటే పాణిని, పతంజలి, భట్టోజి దీక్షితులు, అలాంటి వారితో పోటీ పడగల వ్యాకరణాలు తెలుగుకి సంస్కృతంలో కొన్ని ఉన్నాయని తెలుగు పండితులు వాదించడం మొదలుపెట్టారు. నన్నయ ఆంధ్రశబ్దచింతామణి నిజంగా నన్నయ రాసింది కాదు. కానీ అది నన్నయే రాశాడని తెలుగు పండితులు నమ్మవలసిన అవసరం వచ్చింది. చిన్నయసూరి కూడా నన్నయని పరమగౌరవంగా వాగనుశాసనులు అని వ్యవహరిస్తారు. బాలవ్యాకరణం పేరుకి బాలురకోసం రాశానని చిన్నయ సూరి చెప్పినా, అది పండితులకి పరమ ప్రామాణికం అయింది. దానిలో సూత్రరచనా నిర్మాణ దక్షత వాళ్ళని ముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా చిన్నయ సూరి వ్యాకరణం శాస్త్రబద్ధంగా కనిపించింది. అంచేత తెలుగు పండితులు ఈ వ్యాకరణాన్ని ప్రధానమైన ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు.

స్కూళ్లలో చెప్పే తెలుగు వ్యాకరణం కూడా చిన్నయ సూరి వ్యాకరణానికి అనుకూలమైనదిగా చేసి, చిన్నయ సూరి కంటే జటిలంగా చిన్నయ సూరి వచనంలోని అందం ఏ కోశానా లేకుండా వీరేశలింగం పంతులు రాసిన సంధి, విగ్రహము అనే పంచతంత్ర భాగాలు స్కూలు పిల్లలకి పాఠ్య గ్రంథాలుగా చెప్పేవారు. లోకానికి పనికొచ్చే భాష ఇంగ్లీషు కాబట్టి ఆ ఇంగ్లీషులోనే ప్రపంచ విషయాలన్నీ విశ్వవిద్యాలయాలలో పెద్ద చదువులు చదువుకున్నవాళ్లు రాస్తూ వుండగా తెలుగు పండితులు ఇంకా ఇంకా పాత పద్ధతుల్లోకి వెళ్లి విద్యార్థులు రాసే తెలుగులో సున్నలు, అరసున్నలు, ఱ-లు ఉన్నాయో లేవో చూసే పనిలో పడ్డారు. జీతాలు, అవకాశాలు తక్కువయిన ప్రపంచంలో కార్పణ్యాలు కక్షలు విపరీతంగా వుంటాయి. పండితులు ఒకరి పుస్తకంలో ఒకరు దోషాలు వెతకడమే పనిగా పెట్టుకున్నారు. తిరుపతి వెంకటకవులు ఒక పక్క ధారాళంగా ఆశుకవిత్వం చెబుతూ, తమ కవిత్వంలో వ్యాకరణ దోషాలు చూపించేవాళ్లతో అంత తీవ్రంగాను యుద్ధాలు చేస్తూ, తెలుగు సాహిత్యానికి ఒక పక్కన ప్రచారము, ఇంకోపక్క చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం లేకపోతే అది మంచి కవిత్వం కాదనే వాదనకి బలము రెండూ తెచ్చిపెట్టారు. ఆ కాలంలోనే,
Quote:కవనార్థం బుదయించితిన్ సుకవితా కార్యంబె నావృత్తి యీ
భవమద్దాన తరింతు తద్భవమ మద్భాగ్యంబు సర్వంబు మృ
త్యువు నేదాన జయించితిన్‌రుజ జయింతున్‌దానిచేన్ అట్టి నా
కవనంబున్ గురుడేమి లెక్క హరుడే కాదాడ వాదాడెదన్
లాంటి పద్యాలు వచ్చాయి.

 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#10
సామినేని ముద్దునరసింహం నాయుడు


సామినేని (స్వామినీన) ముద్దునరసింహం నాయుడు హితసూచని అన్న పేరుతో 1855 నాటికే ఒక ప్రతిభావంతమైన కొత్త పుస్తకం రాశారు. ఇది 1862లో అచ్చయ్యింది.
పురాణాల్లో వాస్తవమైన సంగతులు, వాస్తవం కాని సంగతులు కలిపేసి కొన్ని చోట్ల ధర్మశాస్త్రానికి సంబంధించిన సంగతులు కొన్ని ఒకదానికొకటి భేదించియుండే నిర్ణయములు చేసి ఇష్టానుసారముగా దిద్దుబాటు చేయబడుచూ వుండటంవల్ల జీవితానికి అవసరమైన విద్యలు, శరీరారోగ్యానికి అవసరమైన సంగతులు బాగా తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల‘ ముద్దునరసింహం నాయుడు తన పుస్తకంలో అనేక వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు వ్యాసాలుగా రాసి వాటికి ప్రమేయములు అని పేరు పెట్టారు. ఆయన పుస్తకంలో విద్యా ప్రమేయము, వైద్య ప్రమేయము, సువర్ణ ప్రమేయము, మనుష్యేతర జంతు సౌజ్ఞా ప్రమేయము, రక్షప్రభృతి ప్రమేయము, మంత్ర ప్రమేయము, పరోక్షాది జ్ఞాన ప్రమేయము, వివాహ ప్రమేయము అని తొమ్మిది ప్రమేయాలున్నాయి.
[Image: nayudu.png]

ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుగులో లేవని గుర్తించడంతో పాటు ముద్దునరసింహం నాయుడు అవి రచించవలసిన తెలుగు భాషాశైలిని గురించి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. పద స్వరూపం ఎలా వుండాలో తన ఆలోచనలు చెప్తూ భాష సాధ్యమైనంత సులభంగా వుండాలని ఆయన గుర్తించారు. అరసున్నలు ఉండాలని లక్షణ గ్రంథాలలో చెప్పినా, అరసున్నలు లేకుండా తెలుగులో పదాలు వాడుకలో వున్నాయని గమనించి అరసున్నలు లేకుండా ఆయన పదాలు రాశారు. అలాగే శకటరేఫ, సాధురేఫ రెండిటికీ మధ్య ఉచ్చారణ భేదం పోయినందువల్ల ఆ తేడా పాటించవలసిన అవసరం లేదని శకటరేఫ వాడుకని ఆయన మానివేశారు. సంధులు కలపడంలో లక్షణ గ్రంథాలు చెప్పిన నియమాలు వాడుకలో లేవని సంధి నియమాలు లేకుండా తమ వాక్యాలు రాశారు.

సంఘ సంస్కారం విషయంలో ఆరోగ్యకరమైన జీవితానికి కావలసిన వైజ్ఞానిక విషయాలు తెలుగులో కావాలని చెప్తూ స్త్రీలకు విద్య కావాలని, వాళ్లకి వ్యక్తి స్వాతంత్ర్యం కావాలని, రజస్వలానంతరమే వాళ్ల ఇష్టాన్ని అనుసరించి వివాహం చెయ్యాలని ఎంతో ముందుచూపుతో రాసినవారు ముద్దునరసింహం నాయుడు.

తెలుగు భాష ఆధునిక కాలంలో ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారానికి ఏ రూపంలో వుండాలో ఆయన స్పష్టంగా చెప్పి, తన పుస్తకంలో ఆయన వాడి చూపించారు. అందులో ఆధునిక విశ్వవిద్యాలయాల ద్వారా పాశ్చాత్య ప్రపంచం నుంచి వస్తున్న అనేక ఆలోచనలు శాస్త్ర విషయాలు తెలుగులోకి రావలసిన అవసరం వుందని, ఆ విషయాలు రాయడానికి అప్పటికి తెలుగు కావ్యాలలో వున్న భాష పనికిరాదని కూడా ఆయన గమనించారు. హితసూచనిలో మిగతా భాగాలు చూస్తే ఆయన ఉద్దేశం మనకి బాగా బోధ పడుతుంది.

తెలుగులో వచనం అనే మాట ఇప్పుడు మనం అనుకునే అర్థంలో అప్పుడు వాడుకలో లేదు. పద్యకావ్యాలలో వచన భాగాలే మనకు వచనం. దానికి గద్యం అనే పేరు కూడా ప్రబంధాలు వచ్చిన తర్వాత ఏర్పడింది. వచనంలో విషయ ప్రధానమైన పుస్తకాలూ లేవు, అలాటి పుస్తకాలని గుర్తించడానికి ఒక పేరూ లేదు. ముద్దునరసింహం నాయుడు వాటికి వాక్యగ్రంథాలు అని పేరు పెట్టారు. ఇలాంటి వాక్యగ్రంథాలు రావాలని, అందుకు అనువైన తెలుగు భాష మనం తయారు చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. వాక్యగ్రంథాలలో,
Quote:“బాలురకు అక్షరములయొక్క జ్ఞానమిన్ను వాటిని కూర్చేశక్తిని సలక్షణముగా వచ్చేకొరకు అచ్చులు హల్లులు మొదలైన వాటి వివేకముతో ఒకపత్రిక వ్రాయించి అదిన్ని శబ్దశబ్దార్థముల యొక్క జ్ఞానము వారికి కలుగడమునకు ఏయేదేశ భాషలయందు వాడికలోనుండే పదములలో వారుచ్చరించడమునకు అనుకూలముగానున్ను అర్థావగాహన చేసుకోవడమునకు జురూరుగానున్ను ఉండే పదములు ఏర్పరచి వర్గులుగానున్ను లక్షణక్రమముగాను (అనగా) నామవాచకాదిభేదముల వరుసనున్ను సులభముగా బోధకాతగిన ప్రతిపదములతో జాబితా వ్రాయించి అదిన్ని విభక్తులు మొదలైన హద్దులు వివరముగా తెలియడమునకు తగిన పత్రికయొకటి వ్రాయించి అదిన్ని వాక్యరచనాసార్థ్యము సలక్షణముగా కలుగడమునకు కర్తరిప్రయోగము మొదలైనవాటి వివకముగల పత్రికయొకటి వ్రాయించి అదిన్ని యొక పుస్తకముగాచేర్చి అచ్చువేయించి వారికి క్రమముగా చెప్పించవలసినది, …
అని. అంటే ఈ వాక్యగ్రంథాలలో వాడే భాష ఎవరికి తోచినట్టు వారు రాయడం కాకుండా కొన్ని నియమాలతో కూడిన ఒక పత్రిక (ఇది ఇప్పుడు మనం స్టైల్ మాన్యువల్ అని అంటున్న దానికి పర్యాయ పదం) కావాలని ఆయన అప్పుడే ఊహించారు. అలాగే,
Quote:“ఐతే, సంస్కృతము వగైరా భాషలయందు శారీరశాస్త్రము మొదలైనవి రచించబడి యున్నవి కాని ఆ గ్రంథములు బహు ప్రాచీనములైనవిన్ని దరిమిలాను పరిశీలనవల్ల తెలియవచ్చిన సంగతులచేత అభివృద్ధిని పొందించ బడనివిన్ని ఐయున్నందున వాటిని పట్టియేయే దేశభాషలను సంగ్రహములు చెయ్యడము కంటే యింగిలీషున ఇప్పట్లో వాడికెలో నుండే జిఆగ్రఫి, జిఆమిత్రి, ఎరిధ్మిటిక్‌, ఎస్త్రాన్మీ, ఫిలాస్సాఫి, ఎనాట్టొమి, అనే గ్రంథముల యొక్క సంగ్రహములు ఏయే దేశభాషలను వ్రాయించి విద్యార్థులకు చెప్పించడము జురూరై యున్నది.”
“ఈ అనుక్రమముగా విద్య చెప్పించేయెడల స్త్రీ జాతి ఎవరెవరి మర్యాదకున్ను స్థితికిన్ని అనుకూలమని తోచిన మట్టుకు విద్య చెప్పించవచ్చును సాధ్యమైనంతమట్టుకు గ్రంథములు స్త్రీలున్ను చదవడమునకు లాయబుగానుండేలాగు రచించబడవలసినది,…”
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#11
అటు సంస్కృతములోను ఇటు ఇంగ్లీషులోను ఉన్న విషయాలని కలుపుకుని వాటిని దేశభాషల్లోకి అనువాదం చేసి అందరికీ అర్థమయ్యే తెలుగులో పుస్తకాలని రాయించాలని ఆయన ఆలోచన. ఈ అభిప్రాయాలు 1862 వరకు ఎవరికీ తెలియకుండా వుండిపోయాయి. ఆ తరవాత కూడా గ్రాంథిక వ్యావహారిక భాషావివాదాలలో ముద్దునరసింహం నాయుడు చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు విస్మరించబడ్డాయి.
  1. ఆధునిక విజ్ఞానము; ప్రాచీన గ్రంథాలలో వుండే సమాచారము, ఇంగ్లీషు పుస్తకాల్లో వుండే సమాచారము రెండూ కలిపి, ఆలోచనాపూర్వకంగా సమన్వయించి పాఠ్య గ్రంథాలలో రాయాలి.
  2. ఆ వాక్య గ్రంథాలలో రాసే తెలుగు ఎలా వుండాలో చెప్పే నియమాలతో ఒక ‘పత్రిక’ తయారు చెయ్యాలి.
  3. ఇంగ్లీషు లోను, సంస్కృతం లోను వుండే పుస్తకాల లోని విషయాలు తెలుగు లోకి తర్జుమా చేయించాలి కాబట్టి ఆ భాషల్లో సమర్థులైన వాళ్లని ఈ పనికి నియమించాలి.
ఈ మూడు విషయాలు అప్పటికే కాదు, ఇప్పటికి కూడా ఎవరికీ తట్టడం లేదు. ఆ పుస్తకాన్ని చూసి గిడుగు రామమూర్తి ముద్దునరసింహం నాయుడు మనవడైన ముద్దుకృష్ణ దగ్గర దాన్ని ప్రశంసించారు కాని ఎందుచేతనో ఆ పుస్తకం ప్రసక్తి కానీ, ఆయన పేరు కానీ గిడుగు రామమూర్తి తమ పుస్తకాల్లో, వ్యాసాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మేము ఆయన చెప్పిన విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించాం. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా బోధపడాలంటే ఆ పూర్తి పుస్తకం చదవాలి.

[ఈ పుస్తకాన్ని ఈ సంచికలో ప్రకటించి ఈమాట గ్రంథాలయంలో చేరుస్తున్నాం. దీనిని టైపు చేసి ఇచ్చిన వాడపల్లి శాయిగారికి మా కృతజ్ఞతలు. – సం.]
ముద్దునరసింహం నాయుని పుస్తకం అచ్చయిన నలభయి ఏళ్ళకి లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాల పనిని గూర్చి సమీక్షించడానికి సెప్టెంబరు, 1901లో సిమ్లాలో పదహారు రోజుల పాటు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం తరువాత, అప్పటివరకూ జరిగిన విద్యాభివృద్ధిని గురించి ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసేందుకు ఒక సంఘాన్ని 1902లో నియమించాడు. ఆ సంఘం ఉద్దేశం బొంబాయి, మద్రాసు, కలకత్తా నగరాలలో 1852లో ఏర్పాటు చేసిన మూడు విశ్వవిద్యాలయాలలోను తయారయిన పట్టభద్రులు ఏమి చేశారో పరిశీలించడం. అక్కడ తయారయిన పట్టభద్రులు తమ తమ ప్రాంతీయ భాషల ద్వారా శాస్త్రీయ విజ్ఞానాన్ని, ఆధునిక భావాలను ప్రచారం చేయగలరని ప్రభుత్వం భావించింది. కానీ ఈ సమావేశంలో పాల్గొన్న విద్యావంతులు 1905 సంవత్సరంలో సమర్పించిన నివేదికని బట్టి చూస్తే విశ్వవిద్యాలయాలలో తయారయిన విద్యావంతులు ప్రాంతీయ భాషలలో ఏ రకమైన కృషి చేయలేదని బోధపడుతుంది. వాళ్లందరూ ఇంగ్లీషులో విద్య నేర్చుకున్నారు, వాళ్ల వాళ్ల సొంత భాషల్లో వాళ్లకి ఏ రకమైన శిక్షణా లేదు. అందుచేత సొంత భాషల్లో ఏమీ రాయలేరు. దానితో పాటు ప్రాంతీయ భాషల్లో ఇంగ్లీషులో వున్న కొత్త విషయాలు చెప్పడానికి కావలిసిన మాటలు కూడా లేవు. దీనికంతటికీ కారణం విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషని నిర్లక్ష్యం చేయడమే. ప్రాంతీయ భాషలు ఈ విశ్వవిద్యాలయాలలో బోధనా భాషగా ఎప్పుడూ లేవు. ఈ చర్చల ఆధారంగా కర్జన్ విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలు నేర్పడం మొదలు పెట్టాలని, ప్రాంతీయ భాషల్లో వ్యాసరచన ఇంగ్లీషునించి ప్రాంతీయ భాషలోకి అనువాదం ప్రత్యేక అంశాలుగా ప్రవేశపెట్టాలని నిర్ణయాలు చేశాడు. ఈ నిర్ణయాలు 21 మార్చ్ 1904 నాటినుండి చట్ట రూపంలో అమలులోకి వచ్చాయి. కానీ ఈ చట్టాన్ని ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న ఆర్. జి. భండార్కర్, బి. కె. బోస్ లను మినహాయించి భారతీయులందరూ వ్యతిరేకించారు, ముఖ్యంగా గోపాలకృష్ణ గోఖలే, అశుతోష్ ముఖోపాధ్యాయ ఈ చర్చలు జరిగిన రెండు సంవత్సరాల పాటు తీవ్రంగా ప్రతిఘటించారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తోందని ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి ప్రవేశించి వాటిని కూడా పాడు చేయదలుచుకుందని గోపాలకృష్ణ గోఖలే వాదన.

కర్జన్ బిల్లు ఫలితంగా స్కూలు ఫైనలు బోర్డ్ వాళ్లు 1909లో ఒక నిర్ణయం చేశారు. తెలుగులో వున్న రెండు రకాల తెలుగు శైలుల్ని గుర్తులో పెట్టుకుని కాబోలు విద్యార్థులు పరీక్షల్లో మోడర్న్ లేదా క్లాసికల్ తెలుగు రెండింటిలో ఏ శైలిలోనయినా రాయవచ్చునని అనుమతిచ్చారు.. వాళ్ల అభిప్రాయంలో మోడర్న్ తెలుగు అంటే బ్రౌన్ రీడర్ లోను, ఆర్డెన్ తెలుగు గ్రామరు లోని మొదటి భాగం లోను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర లోను ఉన్న రకమైన భాష. దీన్ని వాళ్లు వ్యావహారిక భాష అనలేదు. మోడర్న్ తెలుగు భాష అని మాత్రమే అన్నారు. ఈ మోడర్న్ అన్న మాటకి అర్థం వివరించి చెప్పినవాళ్లు ఎవరూ లేరు. అంతే కాదు, ఈ పుస్తకాలు చదివిన విద్యార్థులు ఈ పుస్తకాలలో వున్న భాషలోనే సమాధానాలు రాయాలా లేకపోతే ఇంకే శైలిలోనయినా సమాధానాలు రాయవచ్చా అన్న దాని గురించి మనకి ఏమీ తెలియదు.

ఒక పక్క కర్జన్ బిల్లు పైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత సాగుతుండగా ఆధునిక గ్రంథాల పేరుతో సెట్టి లక్ష్మీనరసింహం రాసిన గ్రీకు మిత్తులు, వేదం వెంకటాచలయ్య రాసిన విధిలేక వైద్యుడు స్కూలు ఫైనలు విద్యార్ధులకు నాన్-డిటెయిల్డ్ పాఠ్యగ్రంథాలుగా పెట్టారు. ముఖ్యంగా గ్రీకు మిత్తులు పుస్తకంలో వాడిన భాష, అంతకన్నా ఆ పుస్తకానికి పి. టి. శ్రీనివాస అయ్యంగార్ రాసిన ముందుమాట పండితుల కోపానికి గురయ్యింది. అలాగే శ్రీనివాస అయ్యంగార్ ప్రాంతీయ భాషల గురించి రాసిన (Death or Life: A plea for the Vernaculars, 1909) అన్న 41 పేజీల చిన్న పుస్తకం కూడా ఆధునిక విద్యావిధానం పైన వాదనలు మరింత వేడెక్కటానికి దోహదపడింది.

ఆధునిక గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా పెట్టాలనే కొత్త నియమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని తాము రాసిన పుస్తకాలని పాఠ్యగ్రంథాలుగా చేయించుకోవాలనే వాళ్లు కొందరు వుండేవాళ్లు. సెట్టి లక్ష్మీనరసింహం, వేదం వెంకటాచలయ్య ఆ కోవలో వాళ్లేనా? కాకపోతే వీళ్ల పుస్తకాలకి ఆధునిక గ్రంథాలుగా గుర్తింపు కాని వాటి పట్ల ఆమోదం కాని లేకుండా ఇవి పాఠ్య గ్రంథాలుగా ఎలా ప్రవేశపెట్టబడ్డాయి అనే ప్రశ్నకి సమాధానం దొరకదు. ఉదాహరణకి విధిలేక వైద్యుడులో వేదం వేంకటాచలయ్య రాసిన వాక్యాలు చూడండి:
Quote:తిమ్మా. – మరండి అందరంటుండారు, ఇట్టాటి కొత్త మందు లెట్టుండాయో కనుక్కోవాల్నని రోగుల కిచ్చి సంపేస్తారంట వొయిద్దులు. ఇంకా యెక్కవమందిని సంపితేనేగాని గొప్ప వొయిద్దుడు కాడంట. అందుశాత యీలైనప్పుడల్లా యిట్టాటి మందులిచ్చి సంపేస్తుంటారంటండి మా వొంటి బీదవోల్లను.

జాన. – ఔను, వింతేమి? ఆమెకు యిష్టంలేని వానికి ఆమె నిస్తనంటిరి. ఆమె కోరుకున్న లింగంనాయని కేల ఆమె నీరాదూ అంటా. ఆయన కిస్తే ఆమె సుకం గుంటది. ఆయనేమో ఈమెను ఇప్పుడూ యెంత రోగంతో ఉణ్ణా చేసుకుంటాడు; నిశ్చయం.

దీనితో తెలుగు సాహిత్యంలో మంచి పుస్తకాలు మీకేమీ దొరకలేదా అని పండితులు ప్రశ్నలు లేవదీశారు. అక్కడితో ఆగక, ఈ పుస్తకాల వల్ల తెలుగు భాష పాడైపోతుందని జయంతి రామయ్య పంతులు ఒక ఉద్యమం మొదలుపెట్టారు. రామయ్య పంతులు మొదలుపెట్టిన ఉద్యమం తీవ్రంగానే నడిచింది. ఆయనకి వున్న అధికార స్థానం బహుశా ఉపకరించడం వల్ల కావచ్చు, ఈ ఉద్యమానికి పెద్ద పెద్ద జమీందార్ల సహకారం ఆయనకి లభించింది. గ్రామ్యభాషలో వున్న గ్రీకు మిత్తులు, విధిలేక వైద్యుడు లాంటి చవకబారు పుస్తకాల్ని పిల్లలకి పాఠ్య గ్రంధాలు చెయ్యడాన్ని నిరసిస్తూ తెలుగు దేశంలో చాలా వూళ్లలో సభలు, పెద్ద ఎత్తులో సంతకాల సేకరణలు జరిగాయి. ఈ సభలలో పెద్ద పెద్ద పండితులు–కాశీభట్ల బ్రహ్మయ్యరావు, కాశీ కృష్ణాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, వీరేశలింగం, చెళ్లపిళ్ల వెంకటరావు, మొదలైనవాళ్లు పాల్గొన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మద్రాసు విశ్వవిద్యాలయ సిండికేట్ ఒక సంఘాన్ని (Telugu Composition Committee) నియమించింది. ఈ సంఘం చాలాసార్లు సమావేశమై 20 సెఫ్టెంబర్ 1912న వ్యావహారిక భాష వాడుకకు అనుకూలంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తరువాత ఒక నెల రోజులకు ఆధునిక భాష అంటే ఏమిటో ఒక వివరణ కూడా ప్రకటించారు. ఈ రెండు సవరణలు జరిగిన మూడు నెలల లోపే మరొక సవరణ తెచ్చిపెట్టారు. ఇదంతా తీవ్రమైన గందరగోళానికి దారితీసింది.

ఇదే సమయంలో, అప్పటిదాకా ఉన్న ఎఫ్.ఎ. (F.A) పరీక్షకు బదులు రెండేళ్ళ పరిమితితో ఇంటర్‌మీడియట్ చదువులు ప్రవేశ పెట్టబడ్డాయి. ఇంటర్ పరీక్షలలో వ్యాసరచనకు అనుసరించవలసిన శైలి గురించి కూడా ఒక కమిటీ ఏర్పాటయింది. దీనికి ‘ఇంటర్‌మీడియట్ కాంపోజిషన్ కమిటీ’ అని పేరు. ఈ కమిటీవారు 1911-1914 మధ్య కాలంలో ఏడు సార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుగుతున్న కాలంలో వ్యావహారిక భాష అమలుకి వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. 1914వ సంవత్సరం జూన్-జూలై నెలల్లో గ్రాంథికవాదులు (పండితులు) 24 ఊళ్ళలో సభలు జరిపి, దాదాపు పదివేల సంతకాలతో ప్రభుత్వానికి ఈ పుస్తకాలకి వ్యతిరేకంగా ఒక మహజరు సమర్పించారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి, తెలుగులో విద్యార్థులు, మోడర్న్ తెలుగు, క్లాసికల్ తెలుగు, ఈ రెండింటిలో ఏ భాషలోనైనా రాయవచ్చుననే వెసులుబాటుని 11 ఆగస్టు 1914 నాడు ఉపసంహరించుకుంది. దీన్ని గ్రాంథికవాదులు పెద్ద విజయంగా సంబరపడ్డారు.


 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
#12
చాలా రోజులు తరువాత మళ్ళి తెలుగు గురించి తెలిపారు. మీ తెలుగు హృదయానికి న జోహార్లు. నాకు నా యవ్వనం  చదువు నా తెలుగు మళ్ళీ గుర్తుకొచ్చాయ్. మన సైట్ లో తెలుగు తగ్గిపోతుంది. చాలా కాలం నుంచి మీకు అభినందనలు తెలియజేయలనుకున్నాను .ధన్యవాదాలు.
Like Reply
#13
clps clps clps
Like Reply
#14
clps clps clps yourock yourock yourock
Like Reply
#15
Thumbs Up 
clps clps .
Like Reply
#16
Shy Shy
Like Reply
#17
Heart
Like Reply
#18
సరిత్ గారు, థాంక్స్ సర్.
Like Reply
#19
కమల్ భాయ్ Namaskar 

నేను జాగ్రత్తగానే ఉన్నాను , మీ సలహా/సూచనని అనుసరించి మరి కొంచెం జాగ్రత్తగా ఉంటాను.

మీ
సరిత్
 horseride  Cheeta    
Like Reply
#20
ఇక మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ ఏర్పరిచిన కమిటీ లాక్షణిక భాషే వాడాలనే నిర్ణయం చేసిన తరవాత జరిగిన మార్పులు చూద్దాం. హైస్కూలు విద్య వరకు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చెప్పాలనే నియమం వుండేది. చరిత్ర, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణితం ఇవన్నీ తెలుగులో చెప్పవలసిన అవసరాన్నిబట్టి పాఠ్య గ్రంథాలు తయారయ్యేవి. ఆయా శాస్త్రాలలో సామర్ధ్యం వున్న పెద్ద ప్రొఫెసర్లకి మంచి తెలుగు రాదు. మంచి తెలుగు వచ్చిన వాళ్లకి ఆయా శాస్త్రాలలో చెప్పుకోదగ్గ పాండిత్యం లేదు. అందుచేత కేవలం సిలబస్ మాత్రమే ఆధారంగా హైస్కూలు పిల్లలకి పాఠ్యగ్రంథాలు తయారయ్యాయి. దాంతోపాటు ఆ భాష లాక్షణిక భాష అవాలనే నియమం వుండబట్టి అవి ఇంకా గందరగోళంగా వుండేవి. ఆ పుస్తకాలనీ ఎవరూ జాగ్రత్తగా పరిశీలించి ఆ పుస్తకాలలో వుండే భాష, విషయము ఏ స్థాయిలో వున్నాయో సరిగా చర్చించలేదు. కానీ Indian Ocean అనే మాటకి హిందూ మహాసముద్రము, Mediterranean sea అనే దానికి మధ్యధరా సముద్రము, Bay of Bengal అనే దానికి బంగాళాఖాతము లాంటి కొత్త మాటలు పిల్లల మనసుల్లోకి ప్రవేశించాయి.

ఈ విషయాలలో పరీక్షలు దిద్దేవాళ్లకి కూడా లాక్షణిక భాషలో చెప్పుకోదగ్గ ప్రావీణ్యం లేకపోవబట్టి వాళ్లకి అలవాటయిన ఆధునిక భాషనే కృతకంగా మార్చి అదే ఆధునిక భాష అనే అభిప్రాయంతో పేపర్లు దిద్దేవారు.

మద్రాసు యూనివర్శిటీ సిండికేట్ ఇంటర్‌మీడియట్ పాఠ్యగ్రంథాలలో ఏ రకమైన తెలుగు శైలి వాడాలో నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు చూస్తే అందులోని సభ్యులకు భాషని గురించి ఎటువంటి అభిప్రాయాలు వుండేవో మనకి తెలుస్తుంది. ఆ చర్చలన్నీ ఇంగ్లీషులో జరిగాయని వాళ్ల పుస్తకాలన్నీ ఇంగ్లీషులోనే రాశారని గమనిస్తే ఇంకా కొన్ని చమత్కారాలు బోధపడతాయి. ఇంగ్లీషు భాషలో తెలుగుని గురించి రాయడంలో కొన్ని పరిమితులున్నాయి.

ఆ పరిమితుల వల్ల ఇటు జయంతి రామయ్య పంతులు దగ్గర మొదలుపెట్టి అటు గురజాడ అప్పారావు వరకు ఇంగ్లీషులో తమ ఊహలు చెప్పడంలో బోలెడు ఇబ్బందులు పడ్డారు. పైగా వాళ్లు మాటమాటకి యూరోపియన్ భాషలో ఏం జరిగిందో ఉదాహరణలు ఇవ్వడం మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ శ్రమంతా ఎందుకు కలిగిందంటే ఈ వాదనలకి నిజమైన శ్రోతలు ఇంగ్లీషు మాత్రమే వచ్చిన మద్రాసు యూనివర్శిటీ సిండికేటువారు కావడం.
ఈ వాదనలలో పట్టుదలగా పాల్గొన్న వాళ్ళు ముగ్గురు: 1. గిడుగు రామమూర్తి పంతులు, 2. గురజాడ అప్పారావు, 3 జయంతి రామయ్య పంతులు. ఈ ముగ్గుర్ని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం.

గిడుగు వెంకట రామమూర్తి

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29న పుట్టారు. ఆయన పుట్టింది శ్రీకాకుళం ప్రాంతంలో పర్వతాలపేట అనే గ్రామంలో. చిన్నప్పటినుంచి ఏకసంథాగ్రాహి. సంస్కృతంలో శబ్దమంజరి అంతా ఎనిమిది సంవత్సరాలకే నేర్చుకున్నారు. బాలరామాయణంలో శ్లోకాలు, భారత, భాగవతాల్లో పద్యాలు ఆయనకు కంఠస్థంగా వచ్చేవి. 1875లో విజయనగరంలోని మహారాజావారి కళాశాలలో చేరారు. అప్పుడు ఆ కాలేజి ప్రిన్సిపాలు చంద్రశేఖరరావు మంచి సంస్కృత పండితుడు. ఆ కళాశాలలోనే, ఆ ప్రిన్సిపాలుగారి ఇంట్లోనే గిడుగు రామమూర్తికి గురజాడ అప్పారావుతో పరిచయం అయ్యింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 1879లో గిడుగు రామమూర్తి మెట్రిక్ పాసయిన తరువాత చదువు మానేయవలసి వచ్చింది. మన్యప్రదేశంలో మలేరియా తీవ్రంగా వ్యాపించే ప్రాంతంలో పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో నెలకి 30 రూపాయిలకి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో విజయనగరానికి దగ్గరలో కోనాడ అనే వూళ్ళో నెలకి 25 రూపాయలకి స్కూలు మాస్టారి ఉద్యోగం వుంది. కానీ ఆ అయిదు రూపాయిలు ఆ రోజుల్లో ఎక్కువ డబ్బే. అంచేత గిడుగు పర్లాకిమిడి వెళ్లి అక్కడే వుద్యోగంలో చేరారు. దాదాపు 56 సంవత్సరాలు అక్కడే వుండిపోయారు. రామమూర్తి పంతులుకి పర్లాకిమిడి ప్రాంతంలో వుండే కొండజాతి సవరలతో పరిచయం యేర్పడింది. అమాయకంగా ఆధునిక పద్ధతులేమీ తెలియని ఆ జాతి సంస్కృతి మీద ఆయనకి ఆసక్తి పుట్టింది. మూడేళ్లల్లో వాళ్ల భాష బాగా నేర్చుకున్నారు. ఆ తరవాత అక్కడికి దగ్గరలోనే వున్న ముఖలింగం క్షేత్రానికి వెళ్లారు. ఆ ముఖలింగం ఆలయంలోని శాసనాలని రాసుకుని కళింగదేశచరిత్ర రాయాలనే ప్రయత్నంలో పడ్డారు. ఆ శాసనాలు ఆయన గడగడా చదువుతూ వుంటే అక్కడివాళ్లందరూ ‘ముక్కు మీద వేలు వేసుకున్నారట. ఆ శాసనాలని దేవతలే రాశారని మానవులకర్థం కాని భాష అందులో వుందని స్థానికుల నమ్మకం’.

గంజాం జిల్లాలో వున్న సవరల విద్యాభివృద్ధి మీద దృష్టి పెట్టి వాళ్ల భాషని, సంస్కృతిని నేర్చుకున్నారు. వాళ్లతో పాటు కొండల్లో తిరిగి వాళ్ల పాటలు, కథలు, ఆచార వ్యవహారాలు తెలుగు లిపిలో రాసి పెట్టుకోవడం మొదలుపెట్టారు. అలా కొండల్లో తిరుగుతుండగా ఆయనకి మలేరియా జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో మలేరియాకి క్వినైన్ ఒక్కటే తెలిసిన మందు. క్వినైన్ 40 రోజులపాటు వేసుకునేసరికి ఆయనకి చెవులు వినిపించడం మానేశాయి. అప్పటినుంచి ఆయనకు వినికిడి పూర్తిగా పోయింది. అప్పుడే గిడుగు రామమూర్తికి జె. ఎ. యేట్స్‌తో పరిచయం అయ్యింది. యేట్స్ స్కూళ్ల ఇన్స్‌పెక్టర్‌గా రావడానికి, కర్జన్ ప్రాంతీయ భాషల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలనే నిర్ణయానికి ప్రత్యక్షంగా సంబంధం వుందో లేదో తెలియదు కానీ యేట్స్ తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. దానితో నేర్చుకునే భాషకి మాట్లాడే భాషకి మధ్య అంత తేడా వుండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన యేట్స్ ఆ విషయం పి. టి. శ్రీనివాస అయ్యంగార్‌తో చెప్పారు. అయ్యంగార్‌కి తెలుగు భాష నేర్పడం గురించి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ తను తమిళుడు కాబట్టి గురజాడ అప్పారావుతోను, గిడుగు రామమూర్తితోను మాట్లాడమని సలహా యిచ్చారు. అప్పటికి గిడుగు రామమూర్తికి తెలుగు సాహిత్యం గురించి తెలియదు.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)