Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
అందమైన అబద్ధం



రచన: నీరజ హరి ప్రభల 






"ఏయ్ సుజీ ! సాయంత్రం బ్యాంకు నుంచి త్వరగా వస్తాను. సరదాగా సినిమాకెళ్లొద్దాం. నీవు, వంశీ సిధ్ధంగా ఉండండి". చెప్పాడు హరి. 



"అలాగే" అని భర్త చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది సుజాత. దాన్ని అందుకుని 'బై' చెప్పి ఆఫీసు కెళ్లాడు హరి. కాసేపటికి వంశీని లేపి వాడి పనులన్నీ చూసి, వాడికి బాక్సు రెడీ చేసి వాడిని కాలేజీలో దించి వచ్చింది. ఆతర్వాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసింది. సాయంత్రం కాలేజీకు వెళ్లి వంశీని తీసుకుని వచ్చి వాడిని రెడీ చేసి తనూ రెడీ అయింది. హరిరాగానే అతనికి స్నాక్స్, టీ ఇచ్చింది. ముగ్గురూ కలిసి సరదాగా సినిమాకు వెళ్లివచ్చారు. చక్కని జంట, ముచ్చటైనసంసారం. రోజులు సాఫీగా గడుస్తున్నా యి. 



ఒకరోజున సుజాత షాపింగ్ చేస్తుంటే అక్కడ ఎదురైన ఒకామెను చూసి ఆశ్చర్యపోయింది. ఆవిడ కూడా అంతే. సుజాత వెంటనే తేరుకుని సంతోషంగా "హాయ్ రాధా!" అనటం, ఆవిడ కూడా అంతే ఆనందంతో " హాయ్ సుజీ" అనటం, ఇద్దరూ ఒకళ్లనొకళ్లు హత్తుకోవటం జరిగింది. కాలేజీలో ఇద్దరూ మంచిస్నేహితులు. చదువు పూర్తయాక రాధ వాళ్లు వేరే ఊరికి వెళ్లటం, తర్వాత సుజాతకు పెళ్లి అవటంతో ఇంక ఇద్దరి మధ్యనా కమ్యూనికేషన్ లేదు. మరలా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కలవటం. షాపింగ్ పూర్తి చేసుకున్నాక సుజాత రాధను తీసుకుని తన ఇంటికి వచ్చింది. 



అతిథి మర్యాదలయ్యాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. సుజాత హరితో తనకు పెళ్లి, వంశీ పుట్టటం అంతా చెప్పాక, రాధ తన గురించి వివరంగా చెప్పింది. 'బాంకు లో పనిచేస్తున్న వెంకట్ తో తనకు పెళ్లి, సంతోషంగా కాపురం. అన్యోన్యంగా ఉన్న జంటను చూసి 'విధికి కన్నుకుట్టిందా' అన్నట్లుగా పెళ్లైన 2సం..తర్వాత ఒక యాక్సిడెంట్ లో వెంకట్ ఈలోకాన్ని వీడటం, కొన్నాళ్లకు అతని ఉద్యోగం తనకు రావటం, 'దెబ్బ మీద దెబ్బ' అన్నట్లుగా కూతురికి వచ్చిన కష్టాన్ని చూసి దిగులుతో తన తల్లిదండ్రులు చనిపోవడం, ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, తల్లితండ్రులు లేని బాధను భరిస్తూ ఇలా ఒంటరిగా రోజులు గడుపుతున్నాను. ' అని గద్గదిక స్వరంతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే సుజాత స్నేహితురాలిని దగ్గరకు తీసుకుని కన్నీటిని తుడిచి "ఇంక నుండీ నీకు నేనున్నాను. నీకే కష్టం వచ్చినా నాతో చెప్పటం మరవద్దు" అని సముదాయించి ధైర్యం చెప్పింది. 



కాసేపు ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నాక రాధ తన ఫోన్ నెంబరు, ఇంటి అడ్రసు చెప్పి తనింటికి తప్పకుండా రమ్మని చెప్పి వెళ్లింది. ఆతర్వాత ఇద్దరి మధ్యన తరచూ ఫోన్ల సంభాషణలు మాములే. కొన్నాళ్లకు రాధ అదే ఊరిలో వేరే బ్రాంచ్ కు బదిలీ అయింది. అక్కడే తన సహోద్యోగి అయిన హరిని చూసింది. హరిది తన ప్రక్క సీటులోనే. పరిచయాలయ్యాక ' సందేహం వచ్చినా తనను అడగమన్న ' అతని మాటతీరు, కలుపుగోలుతనాన్ని మనసులోనే మెచ్చుకుంది రాధ. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా అతన్ని కొన్ని సలహాలు, సందేహాలు అడిగేది రాధ. బాంకులో కూడా అతనికి మంచి పేరుంది. క్రమేపీ ఇద్దరి మధ్యనా మంచి స్నేహం ఏర్పడింది. కొన్ని నెలలకు రాధ గతం గురించి ఆమె నోటి వెంట విన్న హరి బాధపడి 'ఒక స్నేహితుడిగా నీకు ఏకష్టం వచ్చినా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండమని' చెప్పి ఓదార్చాడు. తన గురించి చెప్తూ 'తన భార్య చాలా మంచిదని, భార్యా బిడ్డతో సంతోషకరమైన జీవితం' అని చెప్పాడు. ఎవరి ఉద్యోగబాధ్యతలలో వాళ్లు బిజీగా ఉన్నారు. కాలం సాఫీగా గడిచిపోతోంది. 



ఒక రోజున ఏదోపనిమీద సుజాత బయటకు వెళ్లింది. బాగా నీరసంగా అనిపిస్తే దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేద్దామనుకుని వెళ్లింది. బేరర్ కు ఆర్డరిచ్చాక చుట్టూ పరికించి చూడగా ఒక్క చోట చూపులు ఆగిపోయాయి. ఒక టేబుల్ ప్రక్కన కుర్చీలలో తన భర్త, రాధ కూర్చుని మాట్లాడుతూ కన్పించారు. వాళ్లని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ల వద్దకు వెళ్లి కూర్చుందామనుకుని వాళ్లేదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారని ప్రయత్నాన్ని విరమించుకుంది. వాళ్లు తనని చూడలేదు. కాసేపటికి వాళ్లు బయటకు వెళ్లాక తను కూడా ఇంటికి వెళ్లింది. 



సాయంత్రం హరి బాంకు నుంచి ఇంటికి రాగానే రోజూలాగానే అతనికి స్నాక్స్, టీ ఇచ్చింది. మాటల మధ్యలో తను హోటల్ కు వెళ్లిన విషయం చెప్తూ ' అక్కడ మీతో మాట్లాడుతున్న ఒకావిడను చూశాను. ' అంది సుజాత. ' ఆవిడ తన సహోద్యోగి రాధ. అనుకోకుండా అక్కడ ఆవిడను కలిసి ఏదో మాట్లాడుతూ టిఫెను చేశాము' అన్నాడు హరి. రాత్రి రాధ ఫోన్ చేసి 'తన సహోద్యోగి హరి సాయంతో అత్తింటి వైపు కోర్టు కేసు నుంచి బయటపడ్డాను. అతను చాలా మంచి వ్యక్తి. ఒక సోదరుడిలా తనకు సాయపడ్డాడు. కృతజ్ణతగా అతన్ని ఈరోజున హోటల్ కు పిలిచి లంచ్ ఏర్పాటు చేశాను' అని మాటల మధ్యలో చెప్పింది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - 2 - by k3vv3 - 10 hours ago



Users browsing this thread: 1 Guest(s)