Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#60
ఏజెంట్ రూహి వాసుదేవ్...26




"మనల్ని పట్టించుకోని దేశం కోసం మనమెందుకు ప్రాణాలు త్యాగం చేయాలి మేడం..." వంశీ ప్రశ్నించాడు.

రూహి కాసేపు ఆశ్చర్యంగా ఉండిపోయింది. ఎడారిలో ఆకలి దప్పికాలతో వారి ప్రాణాలు పోవాల్సింది. ఒక భారతీయుడు వారిని చూసి కాపాడాడు. అంతే కాకుండా వారికి వైద్యం చేయించి కడుపు నిండా భోజనం పెట్టాడు. దాంతో అందరూ కోలుకున్నారు. అక్కడి నుంచి చైనా బోర్డర్ చేరుకోడానికి కేవలం అరగంట మాత్రమే పడుతుంది అని తెలిసింది.

త్వరగా అక్కడికి వెళ్దాం పదండి అని తను అందరినీ పిలిచింది. కాని ఇంతలో వంశీ ఇలా మాట్లాడుతున్నాడు. రూహి మరోసారి వంశీ వంక చూసింది.

"అవును మేడం. మీరు విన్నది నిజమే... ఇందాక న్యూస్ లో చూసాను. మన ఇండియా లో వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నారని ప్రేమికులను చంపేశారు అంట.
మా మతం గొప్పది, మా మతం గొప్పది అంటూ అల్లర్లు కూడా జరిగాయి. అంతే కాకుండా ఈ రాజకీయ నాయకులు కోట్ల కొద్ది స్కాం లు కూడా చేస్తున్నారు.
ఇలా కులం, మతం, డబ్బు, హోదా, అధికారం అంటూ దేశం లో ఎవరికి వారు స్వార్థం తో కొట్టుకొని చస్తుంటే... మనమెందుకు వారి కోసం బ్రతకాలి. నిన్న మనం ఈ ఎడారిలో చనిపోతే ఒక్కడైనా పట్టించుకునేవాడా....
మహా అంటే ఒకరోజు వాట్సాప్, ఫేస్ బుక్ లో స్టేటస్ పెడతారు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. మూడో రోజు మనమెవరో కూడా మర్చిపోతారు. మన కుటుంబాలు మాత్రం మనల్ని తలుచుకుంటూ నరకం చూస్తుంటాయి.
నన్ను పట్టించుకోని దేశం కోసం నేనెందుకు ప్రాణాలు వదలాలి.." వంశీ ఆవేశంగా పలికాడు.

మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిన వంశీ మాటల్లో రూహి కి న్యాయం ఉందని అనిపించింది. అలా మాట్లాడుతున్నప్పుడు వంశీ కళ్ళలో సన్నని నీటి పొర కమ్మడం కూడా గమనించింది. పార్వతి ఏమి మాట్లాడకపోయినా తన మనసులో కూడా ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి అని అర్థమైంది.

రూహి ఒక్కసారి ఊపిరి భారంగా పీల్చింది. తరువాత వారి వంక తిరిగి...
"వంశీ, నీకొక కథ చెప్తాను. కాసేపు వింటావా..
ఒక ఊర్లో ఓ చిన్న పాప ఉండేది. తనకు వాళ్ళ నాన్నంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే ప్రతి రోజు రాత్రి తన ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పుకోనిదే పడుకునేది కాదు. బేబీ బేబీ అని పిలుస్తూ తన వేలు పట్టుకొని తెగ అల్లరి చేసేది. తన నాన్నే తన ప్రపంచం అనుకునేది. ఇంతలో ఒకరోజు వాళ్ళ నాన్న పుట్టినరోజు రాబోతుంది. ఆ పాప చాలా రోజులుగా ఎవరికీ తెలియకుండా తనకు ఇచ్చిన పాకెట్ మని భద్రంగా దాచుకుంది. ఆ డబ్బులతో వాళ్ళ నాన్న కోసం ఓ మంచి వైట్ షర్ట్, ప్యాంటు కొనింది. వాళ్ళ నాన్న వస్తే ఆ బట్టలు ఇవ్వాలని, అవి చూడగానే తన కళ్ళలో కనిపించే ఆనందం చూడాలని... ఆ పాప వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది.

తరువాతి రోజు వాళ్ళ నాన్న ఊరి నుంచి తిరిగివచ్చాడు. కాని నడుచుకుంటూ కాదు.. నలుగురూ మోసుకుంటూ తెచ్చారు.
ఆ పాప పరుగున వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది. పిలిచినా పలకడం లేదు. కదిలించినా కదలడం లేదు. ఆ పాపకు కన్నీరు ఆగడం లేదు.
తనకోసం కొన్న కొత్త బట్టలు తీసుకొని వచ్చింది.
'నాన్న, ఈ బట్టలు నీకోసమే కొన్నాను.  ఇక నుంచి నువ్వు చెప్పినట్టే ఉంటాను. చాకొలెట్లు తినడం తగ్గిస్తాను. బుద్దిగా ఉంటాను. ఒక్కసారి లే నాన్న...'

కాని వాళ్ళ నాన్న వైపు నుంచి సమాధానం లేదు. రక్తం తో తడిచిన తన చొక్కా చూసి ఇక ఎప్పటికీ నాన్న లేవడని అర్థమైంది. వెక్కి వెక్కి ఏడుస్తూ నాన్న గుండెల మీద పడుకుంది. లాలి జో అని తనని జో కొట్టే గుండె చప్పుడు ఇప్పుడు మూగ బోయింది.

వాళ్ళ నాన్నని చూడటం కోసం కొన్ని లక్షల మంది వచ్చారు. గాల్లో తుపాకులు కూడా పేల్చారు. టీవీ లో ఎక్కడ చూసినా వాళ్ళ నాన్న గురించే... తరువాత తెలిసింది. దేశం లో ఎంతో మందిని కాపాడటం కోసం వాళ్ళ నాన్న ప్రాణం వదిలాడు అని.

కొన్ని రోజులకు అందరూ ఆ విషయం గురించి మర్చిపోయారు. కాని ఆ పాప మాత్రం ప్రతి క్షణం వాళ్ళ నాన్న జ్ఞాపకాలతోనే గడిపేది. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ నాన్న డైరీ చూసింది. అందులో ఓ పేజీ లో ఇలా రాసి ఉంది.

'మరణమా....
నాకు ఎదురుగా రాలేక చీకటి చాటున దాక్కొని, నా నీడలో నక్కి నన్ను వెంటాడుతూ...
ఏదో రోజు నా దరి చేరుతావని తెలుసు...

కాని నీకు తెలియంది ఏంటంటే...
నిజానికి ఓ సైనికుడు తను ఉద్యోగం లో చేరిన క్షణం నుంచి ప్రతి క్షణం తన చావు కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు.
నువ్వు ఏ క్షణం నన్ను చేరినా నా మోహం లో నీ స్నేహితుడు భయాన్ని మాత్రం చూడలేవు. మృత్యువు నన్ను కబలించినా సరే, నా పెదాల మీద చిరునవ్వు మాత్రం చెరగదు. దేశం కోసం పాటుపడే సైనికుడి ప్రతి అణువు లోను వీరత్వమే ఉంటుంది.

అందరూ అంటుంటారు... రాజులు మాత్రమే చరిత్రలో మిగులుతారు అని..
కాని అది తప్పు... ఆ రాజుల చరిత్ర రాయడానికి ఓ సిరా లా మా సైనికుల రక్తమే వాడారు అనేది చదివే మనిషి మరిచినా, పుస్తకం మరుస్తుందా...

ప్రతి మనిషి ముగింపు మరణంలో ఉంటుంది.
కాని ఓ సైనికుడి ముగింపు మాత్రం తన దేశపు మట్టి లో ఉంటుంది. ఈ నేల ఉన్నంత కాలం బ్రతికే ఉంటాం..

నా మరణం అందరూ మర్చిపోవచ్చు. కాని నా నెత్తుటి తో వీర తిలకం అద్దుకున్న ఈ దేశం మరువగలదా...
నా ఊపిరి తో పురుడు పోసుకొని రెప రెప లాడే నా మువ్వన్నెల త్రివర్ణ పతాకం మరువగలదా...
నేను నిదురించే నేల మీద స్వేచ్చగా తిరిగే ఈ ప్రజల అడుగులు మరువగలవా....

దీనెమ్మ జీవితం దేశం కోసం బ్రతికితే ఎలా ఉంటుందో తెలీదు కాని...  దేశం కోసం చచ్చే క్షణం లో మాత్రం చాలా గర్వంగా ఉంటుంది. ఆ గర్వం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టి చావాలని ఉంది.'

ఆ మాటలు చదవగానే ఆ పాప కు ఏం చేయాలో అర్థమైంది. తను కూడా వాళ్ళ నాన్న లాగానే దేశం కోసం బ్రతకాలని అనుకుంది. ఆ పాప ఎవరో, ఆ తండ్రి ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కాదా...
ఏజెంట్ రూహి వాసుదేవ్ D/o విక్రమ్ వాసుదేవ్...

మన దేశమంటే ప్రజలు మాత్రమే కాదు..  నేల... ఇక్కడ పారే నదులు.. మన భారతీయ సంస్కృతి... ప్రపంచానికి విజ్ఞానం అందించిన గ్రంధాలు... మేధావుల స్మృతులు... దేశ భక్తుల జ్ఞాపకాలు...
వీటన్నిటిని కాపాడుకోవడం మన బాధ్యత...

నా ప్రజలు నాకోసం నిలబడినా నిలబడకపోయినా... నేను మాత్రం నా దేశం కోసం చివరి క్షణం దాకా పోరాడుతాను. నిలబడతాను.

ఈ పోరాటం లో మీరు వెంట లేకపోతే ఒంటరిగానైనా యుద్ధం చేస్తాను. ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు నడక మాత్రమే నేర్పించారు. కాని ఆ అడుగులు నడిచింది మాత్రం ఈ నేల మీదే అని మరువను.."

రూహి చెప్పడం ఆపి బ్యాగ్ భుజాన వేసుకొని చైనా బోర్డర్ వైపు అడుగులు వేసింది. కాసేపటికి తన అడుగుల వెనుక మరో రెండు జతల అడుగులు కూడా వెంట నడిచాయి. వెనక్కి తిరిగి చూస్తే వంశీ, పార్వతి...

"కోపంలో ఏదో తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఎప్పటికి మీ వెంటే మేము కూడా మేడం..." అని వంశీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. రూహి చిరునవ్వుతోనే వారికి సమాధానం ఇచ్చింది.

తరువాత అందరూ ఆగకుండా ఆ బోర్డర్ వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆకలి దప్పికలు తీరడం తో, అలాగే కంటి నిండా నిద్ర పోవడం తో వారిలో అప్పటిదాకా ఆవహించిన నిశ్శత్తువ దూరమై ఉత్సాహం గా కదిలారు. పైగా ఇందాక రూహి మాట్లాడిన మాటలు వారిలో స్ఫూర్తిని నింపాయి. అందుకే అడుగుల వేగం పెరిగింది.

అందరూ చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నారు. ఎందుకంటే ఎటు వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. అందుకే సిద్ధంగా ఉన్నారు.

అప్పటిదాకా ఎటు చూసినా ఎర్రని ఎడారి కనిపించేది. కాని మెల్లగా ఆ ఇసుక మాయమై దాని స్థానం లో నేల, చెట్టు, పుట్ట కనిపించడం మొదలయింది. అది చూసాక బోర్డర్ కి దగ్గర పడ్డాం అని వారికి అర్థమైంది.

చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అలా వారి దారికి అడ్డంగా ఓ కొండ వచ్చింది. దాన్ని ఎక్కితే కాని ముందుకు వెళ్లలేం అని అర్థమై నిదానంగా దాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. ఆ కొండ అంచున ఓ పెద్ద లోయ ఉండటం తో నిదానంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నడుస్తున్నారు. కాళ్లకు వేసుకున్న షు లు కూడా చిరిగిపోయి ఉండటం తో పదునైన రాళ్లు గుచ్చుకుంటున్నాయి. దారిలో ఏపుగా పెరిగిన ముళ్ల కంపలు గీరుకుంటున్నాయి. కాని అవేవి లెక్క చేయకుండా ముందుకు సాగారు.

అలా కాసేపటి తరువాత ఆ కొండ మీదకు చేరుకున్నారు. ఆ కొండ మీద నుంచి ఎదురుగా చూసి కొన్ని క్షణాలు కదలకుండా ఉండిపోయారు. ఎన్నో ప్రమాదాలను దాటిన తరువాత అనుకున్న చోటుకు చేరువయ్యామని అర్థమై వారి మోహం లో ఆనందం విరిసింది. వారికి ఎదురుగా చైనా బోర్డర్ కనిపించింది.

ఇంకొన్ని అడుగులు వేస్తే గమ్యం చేరుకుంటారు. కాని ఆ చివరి అడుగులలో ఇంకెన్ని ప్రమాదాలు వారి కోసం ఎదురుచూస్తున్నాయో ముందు ముందు కాలమే సమాధానం చెప్పాలి.

--------------------------------------------------------------

హైదరాబాద్...

జలంధర్ చెప్పినట్టుగానే వాడి అనుచరులు మార్కెట్ బయట నిలిపిన ఆటో డ్రైవర్ల మెడ మీద కత్తులు పెట్టి అందరినీ తమ అధీనం లోకి తీసుకున్నారు. ఇక సుజిత బయటకు రావడం కోసం ఎదురుచూస్తూ నుంచున్నారు.

కాసేపటికి సుజిత కూరగాయలు కొని మార్కెట్ నుంచి బయటకు వచ్చింది. ఒకసారి చుట్టూ చూసింది. తనకు కొంచెం దూరంలో ఉన్న ఒక ఆటో ని పిలిచింది. ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న ఓ రౌడీ, తన చొక్కా మీద ఖాకి చొక్కా వేసుకొని సుజిత వైపు ఆటో పోనిచ్చాడు.

అక్కడున్నది జలంధర్ మనిషి అని తెలియక సుజిత ఆటో ఎక్కింది. అది చూసి ఆ రౌడీలు అందరూ మనసులోనే నవ్వుకున్నారు.

ఆటో కదిలింది.
ఆ ఆటో వెనుకే జలంధర్ మనుషులు కూడా కారులో వెంబడించడం మొదలుపెట్టారు.

ఊహించని ప్రమాదం లో చిక్కుకున్న సుజిత... దాని నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి..
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:21 AM



Users browsing this thread: 1 Guest(s)