Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#52
రుద్రం భజే! ఎపిసోడ్ 17


గుడి దగ్గరికి వచ్చిన దీప్తి వాళ్ళు చెప్పింది విని గర్భగుడి నుంచి ఒక రాగి రేకుని తీసుకువచ్చి ఆ వస్తువు ఇక్కడికి ఎందుకు చేరుకుందో ఇప్పుడు అర్థమైంది. ఇది కుబేరుడు స్వయంగా రాసిన పత్రం అని చూపించాడు నారాయణ రావు.

**************

నారాయణ రావు చెప్పింది విని చేతిలో ఉన్న రాగి రేకుని చూసి "నాన్నగారు! మీరు చెప్పింది ఏమి అర్థం కాలేదు. కుబేరులు వారు స్వయంగా రాయడం ఏమిటి? అది ఈ గుడిలో ఉండడం ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు యోధ.

"మా పూర్వీకుల నుంచి అందరు ఈ స్వామివారి సన్నిధిలోనే ఉండేవారు. మా ముత్తాత గారి సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు దేవాలయాలు సందర్శిస్తూ,  ఈ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం దర్శించుకుని గర్భగుడిలో స్వామివారి సన్నిధిలో ఉన్న  తామ్ర  పత్రాన్ని చూసి ఈ స్థల పురాణం గురించి వివరంగా చెప్పారు." అని చెప్పాడు నారాయణ రావు.

"ఏమని చెప్పారు?" అని అందరు ఆత్రుత గా చూసారు.

యక్షరాజు కుబేరుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆయనను ధనానికి అధిపతిని చేశాడు.
కుబేరుడి మొదటి నివాస స్థలం బంగారు లంకా నగరం.

రావణుడు దేవతలను జయించి లంకా నగరానికి చేరుకొని కుబేరుడుని అక్కడి నుంచి పంపించి, ఆ నగరాన్ని సొంతం చేసుకున్నాడు.

తనకు జరిగిన అన్యాయాన్ని పరమశివుడికి విన్నవించుకోగా, తన నివాస స్థలమైన  కైలాస పర్వతం దగ్గర ఉండే అలకాపురి నగరాన్ని ప్రసాదించి, శివగణాలను రక్షణగా ఉంచాడు.
అప్పట్నుంచి అలకాపురి కుబేరుడి నగరం అయ్యింది.

ఒకసారి రావణాసురుడు పరమశివుడి దర్శనానికి కైలాస పర్వతం దగ్గరికి వచ్చి అనుమతి లభించక పోవడంతో ఆ పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.

అది చూసి కుబేరుడు అపహస్యం చేయడంతో, అలకాపురి మీద దండయాత్ర చేయాలి అనుకున్నాడు. కానీ శివగణాలు రక్షణగా ఉండడంతో ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యాడు రావణబ్రహ్మ.

ఎలాగైనా అలకాపురి మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న కల్పవృక్షాన్ని తన లంకలో ఉంచాలి అని నిశ్చయించుకుని  తపస్సు చేసి ఆ నగరం ద్వారాలను తెరిచే శక్తివంతమైన రెండు వస్తువులను సంపాదించి ఒకదానిని తన రాక్షస సైన్యానికి ఇచ్చి అలకాపురి మీద యుద్దానికి పంపించాడు.

కైలాస పర్వతం దగ్గరికి చేరుకున్న రాక్షసులను శివగణాలు అంతం చేయడంతో, వారి రక్తంతో ఆ ప్రదేశంలో ఒక సరస్సు ఏర్పడింది.
దానిని రాక్షసాల్ సరస్సు అంటారు. కైలాస పర్వతాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన వారు మానస సరోవరంలో  నీటిని సేవిస్తారు కానీ, రాక్షసాల్ సరస్సులో నీటిని సేవించరు.

ఆ రాక్షసులతో పాటు శక్తివంతమైన ఆ వస్తువు కూడా,  ఆ హిమాలయాలలో అంతర్ధానం అయిపోయింది. కొంత కాలానికి శ్రీరాముల వారి చేతిలో రావణాసురుడు మరణించడంతో, విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు ఆ రెండో వస్తువు లంకా నగరంలో ఆయన దగ్గర ఉండిపోయింది.

కొంతకాలం తరువాత తన నగరాన్ని తెరిచే శక్తివంతమైన వస్తువులు లంకలో ఉన్నాయని వాటి వల్ల కలికాలoలో ప్రమాదం వాటిల్లుతుందని, కాపాడగలిగింది విభీషణుడు అని తెలుసుకున్న కుబేరుడు  లంకకు బయలుదేరి వెళ్లి విభీషణుడుని కలిశాడు .

తన దగ్గరికి వచ్చిన కుబేరుడు చెప్పింది విని, తన దగ్గర ఉన్న వస్తువు కి తాను రక్షణగా ఉంటానని మాట ఇచ్చి మరొక వస్తువు హిమాలయాలలో అంతరార్థమైంది కాబట్టి త్వరలో అక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చే హనుమంతుడిని కలవమని చెప్పాడు విభీషణుడు.

ఆ మాటకి సంతోషంగా అరవకొండ మీద తపస్సులో ఉన్న  ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చి శరణు వేడాడు  కుబేరుడు.

అప్పుడు స్వామి వారు అనుగ్రహించి హిమాలయాలలో అంతరార్థమైన ఆ వస్తువు కలికాలంలో బయటకు వచ్చి ఈ ప్రదేశానికి చేరుకుంటుంది. దానికి నేను రక్షణగా ఉండి నీ దగ్గరికి చేరుస్తాను. అని మాట ఇచ్చారు.

కుబేరుడికి ఏది అయినా సరే నోటి మాటతో సరిపోదు సాక్షాత్తు కలియుగ దైవం  వెంకటేశ్వర స్వామి వారి దగ్గరే పత్రం రాయించుకున్నాడు. అలాగే ఆంజనేయస్వామి వారు ఇచ్చిన మాట మర్చిపోకూడదు అని తామ్ర పత్రం మీద రాసి తపస్సు చేసుకునే ప్రదేశంలో ఉంచి తన నగరానికి ప్రయాణమయ్యాడు

అప్పుడు స్వామి వారు చెప్పినట్టు ఆ వస్తువు హిమాలయాలలో దొరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన రక్షణలో ఉంది. ఇప్పుడు అలకాపురి నగరానికి చేరుకునే సమయం వచ్చింది అనుకుంటా.

ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంజనీ పుత్రుడు హనుమయ్య పటాపంచలు చేస్తాడు. శివగణాలు కూడా తోడుగా ఉంటాయి." అని వివరంగా చెప్పాడు నారాయణరావు.

అతను చెప్పిన కథ మొత్తం విని "అంటే! మరొక వస్తువు విభీషణుడి దగ్గర ఉందా..? ఆయన కుడా ఇంకా బ్రతికే ఉన్నారా..?" అని అడిగింది పూజా.

"కలికాలంలో కలిపురుషుడిని అంతం చేయడానికి ఆ నారాయణడు మరొక అవతారం ఎత్తుతాడు. అప్పుడు సప్త చిరంజీవులు అయిన అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు  ఆయనకి తోడుగా ఉండడానికి చిరంజీవులుగా వర ప్రసాదంతో జన్మించారు. కలికాలం పూర్తయ్యేంతవరకు వారు ఈ భూమి మీద ఉంటారు."  అని చెప్పాడు నారాయణ రావు.

"అంకుల్! వీళ్ళని ఇప్పటి వరకు ఎవరైనా చూశారా..?" అని అనుమానంగా అడిగింది దీప్తి.

"రామనామం ఎక్కడ జరుగుతుందో అక్కడకి హనుమంతుడు, విభీషుణుడు వస్తారు కానీ వారిని గుర్తించడం మన వల్ల కాదు." అని నవ్వుతూ చెప్పాడు నారాయణ రావు.

"నాన్నగారు! ఈ వస్తువును తీసుకుని మేము ఢిల్లీ వెళ్తున్నాము. ఇది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది." అని చెప్పాడు యోధ.

"శుభం వెళ్ళిరండి, ఆ స్వామి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఆయనే మీకు తోడుగా ఉంటాడు." అని చెప్పాడు నారాయణ రావు.

ఆ వస్తువుని ముష్రుని తీసుకొని  అరవకొండ నుంచి ఢిల్లీ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి బయలుదేరారు యోధ వాళ్ళు.

కార్ లో వెళుతూ "నిజంగా సప్త చిరంజీవులు ఉన్నారా..? వాళ్ళని మనం చూడాలంటే ఏం చేయాలి?" అని అడిగింది పూజా.

ఆ మాట విని వెనక్కి తిరిగి చూసి "హిమాలయాలకు వెళ్లి భక్తితో వెతికితే కనిపిస్తారు." అని చెప్పాడు యోధ.

"అలా అయితే మనం ఆ వస్తువుని తీసుకుని కైలాస పర్వతం దగ్గరకు వెళ్లి, కుబేరుడికి ఇద్దాము. అప్పుడు అందరూ కనపడతారు." అని ఉత్సాహంగా చెప్పింది పూజా.

"యోధ! నువ్వు చాలాసార్లు  హిమాలయాలకి  వెళ్లావు కదా నీకు ఎవరైనా కనిపించారా..?" అని అడిగింది దీప్తి.

"నేను వెళ్ళినప్పుడు నా దృష్టంత  శత్రువుల మీద ఉంది తప్పితే, స్వామిని చూడాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ ఈ వస్తువు మన చేతుల మీద గానే అలకాపురికి చేరాలని ఉంటే తప్పకుండా వారి దర్శనం అవుతుంది." అని చెప్పాడు యోధ.

**************

హిమాలయాలలో కైలాస పర్వతం దగ్గర తెల్లటి మంచు పర్వతాలు పక్కకి జరిగి, బంగారు వర్ణంలో ఉన్న కాంతి రూపంలో  బయటికి వచ్చి మామూలు మనిషిగా మారి ముందుకి నడుస్తూ,

"ప్రతి ఒక్కరికి నా నగరంలోకి ప్రవేశించాలని కోరిక, నా ధనం మీదే ఆశ! ఈ ఆపద నుండి గట్టిెక్కిస్తాను అని  త్రేతాయుగంలో  హనుమంతుడు నాకు మాట ఇచ్చాడు.

ఆ విషయం ఆయనకి గుర్తు ఉందో లేదో  వెళ్లి ఒకసారి గుర్తు చేయాలి, ఇప్పుడు ఈ పర్వతాలలో ఎక్కడ తపస్సు చేసుకుంటున్నడో ఏమిటో, ముందు ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుని నంది సహాయం అడగాలి." అని ఆయాస పడుతూ ఎదురుగా ఉన్న బంగారు పర్వతం ఎక్కుతూ అనుకున్నాడు కుబేరుడు.

కైలాస పర్వతం మీద అటు ఇటు తిరుగుతూ "నేను కాపలాగా ఉన్నాను అని తెలిసి కూడా, ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంత ధైర్యం!" అని కోపంతో రంకెలు వేసుకుంటూ వేగంగా పొడవడానికి వెళ్ళాడు నంది.

తెల్లటి ఆకారం తన వైపుకి వేగంగా రావడం చూసి "నంది! ఆగు ఆగు నేను కుబేరుడిని, స్వామి వారి దర్శనానికి వస్తున్నాను." అని కంగారుగా చెప్పాడు కుబేరుడు.

ఆ మాట విని ఆగి మామూలు రూపంలోకి మారి "కుబేర నువ్వా!  బొజ్జ ఇంకా పెరిగింది కదా గుర్తుపట్టలేకపోయాను ఏంటి నీ దగ్గర ఉన్న ధనం సరిపోలేదా.? మళ్లీ స్వామిని అడగడానికి వస్తున్నావా..?" అని అడిగాడు నంది.

ఆయశపడుతూ అక్కడ ఉన్న రాయి మీద కూర్చుని "ఇది కలికాలం మానవులకు ఎంత ధనం ఉన్నా సరిపోదు ఇంకా కావాలి అంటున్నారు.

అప్పుడు రావణాసురుడు ఒక్కడు ఉండేవాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు వంద మంది ఉన్నారు, సరేగాని నీకోసం అరటి పండు తెచ్చాను తీసుకో  నేను ఒకసారి స్వామి వారిని కలిసి నా కష్టం చెప్పుకోవాలి." అని చెప్పాడు కుబేరుడు.

అరటిపండు తీసుకుని తింటూ "ఇప్పుడు స్వామిని కలవడం కుదరదు నీ విన్నపం ఏమిటో నాతో చెప్పు స్వామికి చేరవేస్తాను." అని చెప్పాడు నంది.

"నా అలకాపురి నగరం తలుపులు తెరిచి నా ధనాన్ని తస్కరించాలని మానవులు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం స్వామికి చెప్పి మళ్ళీ శివగణాలను తోడుగా పంపించమని అడగాలి." అని చెప్పాడు కుబేరుడు.

"ఆ విషయం స్వామి దాకా ఎందుకు నీకు కలికాలంలో సహాయం చేస్తానని హనుమంతుడు మాట ఇచ్చాడు కదా!" అని చెప్పాడు నంది.

"ఆ మాట వాస్తవమే కానీ, ఆయన ఇప్పుడు తపస్సులో ఉన్నాడు. నారాయణుడు అవతారం దాల్చిన తర్వాతే ఆయన  అక్కడ నుంచి బయటికి వస్తాడు. ఈ లోపు నేను అక్కడికి వెళ్లాను అనుకో తోకతో చుట్టి గిరాటు వేస్తాడేమోనని భయం!" అని చెప్పాడు కుబేరుడు.

"అది కూడా వాస్తవమే! దానికి ఒక మార్గం ఉంది హనుమంతుడు తో మాట్లాడగలిగిన వారు ఆయన స్నేహితుడు విభీషణుడు మాత్రమే. వెళ్లి సహాయం అడుగు తప్పకుండా చేస్తాడు." అని చెప్పాడు నంది.

"నేను ఆ విభీషణుడిని ఎక్కడని వెతకను. ఇప్పుడు లంకా రాజ్యం లేదు. ఆయన ఎక్కడ దొరుకుతాడో తెలీదు." అని చెప్పాడు కుబేరుడు.

"ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. విభీషుణుడు ఇప్పటికీ శ్రీరంగంలో రాత్రివేళ స్వామివారి సేవించడానికి వస్తాడు. అక్కడికి వెళ్లి కలిసి నీ బాధ విన్నవించుకుంటే తప్పకుండా సహాయం చేస్తాడు." అని చెప్పాడు నంది.

"అవునా? పరమేశ్వరుడు నా నగరాన్ని కాపాడడానికి శివగణాలు తోడుగా ఉంటాయని సెలవిచ్చారు కాబట్టి నువ్వు నాకు తోడుగారా.. వెళ్లి విభీషణుని కలుద్దాము." అని అడిగాడు కుబేరుడు.

ఆ మాట విని కాసేపు ఆలోచించి "సరే పద! నాకు కూడా ఆడవిడుపుగా ఉంటుంది." అని చెప్పి వెనక్కి తిరిగి కైలాస పర్వతానికి నమస్కరించి కుబేరుడుతో పాటు శ్రీరంగం బయలుదేరాడు నంది.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 01-05-2026, 10:37 PM



Users browsing this thread: 1 Guest(s)