11-03-2026, 01:04 PM
Part - 15
తనని ఆయన ఇంటికి ఎందుకు పంపిస్తున్నారు అని అడిగితే తన పేరున హోమం జరిపిస్తున్నామని, దాని కోసం పది రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని, ఆదిత్యతో చెప్పారు..
ఆదిత్య కూడా సరేనని మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు..
ఆ రోజు సాయంత్రం మంజునాథ రావుకి చెప్పినట్టుగానే ఆదిత్యని అతని ఇంటికి పంపించాడు..
అదే రోజు సాయంత్రం శివుడికోసం, గోవింద రావు, సత్యనారాయణ రావు, విజయవాడ బయలుదేరారు..
ఆదిత్య విషయాలు తమకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండమని, సత్యంతో చెప్పి వాళ్లు బయలుదేరారు..
కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే మంజునాథ రావు గారి ఇంట్లో జరిగినదంతా
సత్యం ఆదిత్య కి పూసగుచ్చినట్లు చెప్పేసాడు...
మరుసటి రోజు మధ్యాన్నం కి విజయవాడ చేరుకున్నారు.. అక్కడనుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ప్రయాణ బడలిక వల్ల, విశ్రాంతి తీసుకున్నారు..
మరుసటి రోజు ఉదయం శివుడి కోసం ఇద్దరు అప్పుడు అతనుండే అతని ఇంటికి వెళ్లారు.. కానీ వెళ్లిన చోట ఇల్లు పూర్తిగా పాడు పడిపోయి ఉంది..
చుట్టుపక్కల ఇళ్లు కూడా ఏమీ లేకపోవడంతో, వారి గురించి వాకబు చేయలేకపోయారు..
శివుడు అక్కడ లేడనే ఆలోచన,
గోవింద రావుని, నిలువునా కుంగదీసింది..
చేసేదేమీ లేక అక్కడ నుంచి కొద్దిగా ముందుకు రాగానే.. గోవింద రావు కళ్ళు తిరిగి పడిపోబోయాడు...
సత్యనారాయణ రావు వెంటనే గట్టిగా పట్టుకొని, అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి గోవింద రావు ని తీసుకు వెళ్ళాడు..
అది దుర్గా దేవి ఆలయం...!!
దాన్ని చూస్తుంటే ఈ మధ్యనే కట్టినట్టు ఉన్నారు...
సత్యనారాయణ రావు, ఆయనను ఆలయంలో కూర్చోబెట్టి, అక్కడ ఉన్న మంచినీరు తీసుకువచ్చి, గోవింద రావు చేత తాగించాడు.
కొంతసేపటికి గోవింద రావు కోలుకున్నాడు..
ఆ రోజు శుక్రవారం...!!
అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది..
శివుడు అక్కడ లేకపోవడంతో, ఏం చేయాలో తోచక సత్యనారాయణ రావు మౌనంగా గోవింద రావు పక్కన కూర్చున్నాడు..
గోవింద రావు మాత్రం గర్భగుడిలో ఉన్న అమ్మవారి వైపు చూస్తూ.. కళ్ళు మూసుకొని ప్రార్థించసాగాడు.. సత్యనారాయణ రావు కూడా కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించసాగాడు
అలా బాధ తో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నా గోవింద రావు కి "తాతయ్య..!!" అని పిలుపు వినిపించింది..
అలా పిలుపు వినిపించడం తో కళ్ళు తెరిచి చూసాడు గోవింద రావు, ఆయన పక్కనే ఉన్న సత్యనారాయణ రావు కూడా ఆశ్చర్యంగా కళ్ళుతెరచి చూశాడు..
ఎదురుగుండా ఒక చిన్న పాప తెల్లటి పట్టు గౌను ధరించి, ఒంటినిండా నగలు ధరించి, పాలవంటి తెల్లని నవ్వుతో గోవింద రావు ముందు నుంచుని ఉంది..
అలా నవ్వుతూ ఉన్న ఆ పాప ని చూసేసరికి గోవింద రావు మనసులో అప్పటిదాకా ఉన్న దిగులంతా ఒక్కసారిగా పోయింది.. తనకి కూడా తెలియకుండానే తన ముఖంపై చిరునవ్వు వెలిసింది.
సత్యనారాయణ రావు కి కూడా ఆ పాప ని చూస్తే ముచ్చటేసింది....
ఆ పాప వయసు మహా అయితే
ఒక 3 సంవత్సరాలకి మించి ఉండదు..
తన వైపు నవ్వుతూ ఉన్న పాప ని చూసి గోవింద రావు నవ్వుతూ.." ఏం కావాలి అమ్మ..??" అని ప్రేమగా అడిగాడు..
నవ్వుతూ తన చేతులని గోవింద రావు ముందు చాపింది... అందులో కాగితంతో చేసిన ఒక గిన్నెలో ప్రసాదం ఉంది..
దాన్ని గోవింద రావు చూపిస్తూ..
" ప్రసాదం తీసుకోండి తాతయ్య...!!" అని అంది..
గోవింద రావు ఆ పాప చేతినుండి ప్రసాదం తీసుకుంటూ.."నీ పేరేమిటి తల్లి..?" అని అడిగారు..
"కాత్యాయని..!!" అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా..
ఆ పాప కొద్ది దూరం వెళ్ళగానే, ఆమెను వెతుక్కుంటూ ఆ పాప తల్లిదండ్రులు వచ్చారు..
ఆ పాపను చూసిన వెంటనే ఆ పాప తల్లి
తనని ఎత్తుకొని," ఎక్కడికి వెళ్ళిపోయావు..!!??
నీ గురించి గుడి అంతా వెతుకుతున్నాము...!!"
అంటూ ప్రేమగా కోప్పడింది..
అక్కడికి కొంచెం దూరంగా వెతుకుతున్న ఆమె భర్తను పిలుస్తూ.." ఏవండీ..!! పాప ఇక్కడే ఉంది..!!"అని పిలవడంతో ఆమె భర్త కూడా అక్కడికి వచ్చాడు..
తన భార్య దగ్గర నుంచి పాపని ఎత్తుకొని..
" ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి..??"అని ప్రేమగా అడిగాడు..
ఆ ప్రశ్నకు సమాధానంగా " అదిగో ఆ తాతయ్యకి ప్రసాదం ఇద్దామని వచ్చాను." అని గోవింద రావు వైపు చూపించింది..
పాప తండ్రి గోవింద రావు వైపు చూశాడు..!!
కొంతసేపు పరీక్షగా చూసి.. వెంటనే అక్కడి నుంచి వేగంగా అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్న
వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్లి, అక్కడున్న వాళ్ళ చెవిలో ఏదో చెప్పి, గోవింద రావు వైపు చూపించాడు..
దంపతులిద్దరి ని చూస్తే బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు..
గోవింద రావు ని చూసిన వెంటనే
ఆ దంపతులిద్దరూ వేగంగా ఆయన దగ్గరకు వచ్చారు..
గోవింద రావు కి, సత్యనారాయణ రావు కి, అసలేం జరుగుతుందో, ఏమీ అర్థం కావడం లేదు..
వాళ్ళు వేగంగా రావడం చూసిన వెంటనే వీళ్లు కూడా లేచి నుంచున్నారు...
వెంటనే ఆ దంపతులిద్దరూ గోవింద రావు పాదాలపై పడ్డారు..
వాళ్లతో పాటు పాప తల్లిదండ్రులు కూడా ఆయన పాదాలకు నమస్కరించారు..
తన పాదాలపై అందరూ అలా అకస్మాత్తుగా పడడంతో..
గోవింద రావు "దీర్ఘాయుష్మాన్ భవ" అంటూ దీవించారు..
"దయచేసి పైకి లేవండి...?? ఎవరు మీరు..??" అని అడిగాడు..
ఆ వృద్ధ దంపతులలో భర్త మాట్లాడుతూ.
" స్వామి..!!తమరు గోవింద రావు గారే కదా.!?" అని అడిగాడు..
"అవునండి.." అని సమాధానమిచ్చారు..
" మమ్మల్ని గుర్తు పట్టలేదా స్వామి..?? 30 సంవత్సరాల క్రితం మా బాబుని మీరు, శివుడు గారు కలిసి కాపాడారు కదా..?? గుర్తుపట్టలేదా..!!" అని అడిగాడు..
కొద్దిరోజుల క్రితమే ఆ కథ గురించి గుర్తు చేసుకోవడం వల్ల, గోవింద రావు కి వెంటనే గుర్తొచ్చింది..
వెంటనే గోవింద రావు " ఓహో.. మీరా బాగున్నారా..?? మీ బాబు ఎలా ఉన్నాడు..? అని అడిగాడు..
ఆ మాటలకి ఆ దంపతులిద్దరూ నవ్వుతూ
"వీడే స్వామి..!! మీరు కాపాడిన
మా అబ్బాయి..!! కిషోర్..!! " అని పక్కనే ఉన్న ఆ పాప తండ్రిని చూపించారు..
అతన్ని చూడగానే గోవింద రావు చాలా సంతోషించాడు..
తన పక్కనే ఉన్న తన భార్య ని చూపించి
" ఈమె నా భార్య స్వామి..! పేరు నందిని.!"
పరిచయం చేశాడు..
ఆమె గోవింద రావు వైపు చూసి నమస్కరించింది..
ఆ వృద్ధ దంపతులలో భార్య మాట్లాడుతూ
" దయచేసి మా ఇంటికి రండి స్వామి..!!"అంటూ బ్రతిమాలింది..
ఆమెతో పాటు మిగిలిన వారు కూడా ఇంటికి రమ్మని బ్రతిమాలసాగారు
"దయచేసి ఇప్పుడు నన్ను బలవంతం పెట్టకండి..నాకు ఒక ముఖ్యమైన పని ఉంది.
మరోసారి తప్పకుండా వస్తాను..." అంటుండగా
అక్కడే తల్లి పక్కనే నుంచుని ఉన్న పాప
గోవింద రావు చెయ్యి పుచ్చుకుని..
" తాతయ్య..! మా ఇంటికి రావా ప్లీజ్..!!"
ప్రేమగా బ్రతిమలాడి ఉంది..
ఆ పాప అలా ముద్దుగా అనేసరికి గోవింద రావు మనసు కరిగిపోయింది..
పాపని ఎత్తుకొని, ఆమె బుగ్గకు ముద్దు పెట్టి,
"సరే పదండి వస్తాను..!!" అంటూ సత్యనారాయణ రావుతో కలిసి వారితో కారులో బయలుదేరారు..
కారు విజయవాడ వైపు బయలుదేరింది..
ఆ ముసలి దంపతులిద్దరి పేర్లు రఘునాథరెడ్డి, జానకి.
కొద్ది సేపు ప్రయాణం తర్వాత ఒక పెద్ద అధునాతనమైన భవంతి ముందు ఆ కారు ఆగింది..
కారులో నుంచి దిగగానే ఇంట్లోకి గోవింద రావు ని, సత్యనారాయణ రావు ని, సాదరంగా ఆహ్వానించారు...
అప్పటికే మధ్యాహ్నం వేళ అయింది..
గోవింద రావు ని సత్యనారాయణ స్వామి రఘునాథ రెడ్డి భోజనానికి పిలిచాడు..
అతని భార్య జానకి దగ్గరుండి వారికి భోజన ఏర్పాట్లు చూసుకుంది.
వారి భోజనాలు పూర్తయిన తర్వాత..
రఘునాథ రెడ్డి వారిద్దరిని విశ్రాంతి తీసుకోమని చెప్పి, గోవింద రావు కి సత్యనారాయణ రావు కి ఒక గదిని కేటాయించారు..
గోవింద రావు నిద్ర పోయారు..
సత్యనారాయణ రావు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని.. సాయంత్రం అవుతుండగా..
ఇంటి వెనుక అనుకుని ఉన్న తోట లోకి వెళ్లి,చుట్టూ చూస్తూ ఉన్నారు..
సత్యనారాయణ రావు ని అక్కడ చూసిన రఘునాథరెడ్డి ఆయన దగ్గరకు వచ్చి..
"మీరు విశ్రాంతి తీసుకోలేదా స్వామి..!"
అని వినయంగా అడిగాడు..
సత్యనారాయణ రావు నవ్వుతూ..
" ఇప్పటి వరకు నిద్రపోయే ఉన్నానండి..!
ఇప్పుడే బయటకు వచ్చాను..!"అని అనగానే..
అక్కడ ఉన్న కుర్చీలను చూపిస్తూ
"ఇలా కూర్చోండి స్వామి..!!" అని అన్నాడు రఘునాథరెడ్డి.
ఇద్దరు కూర్చున్నారు..
ఒక పనివాడు వచ్చి వారిద్దరికీ
టీ అందించాడు.
" మీరు గోవింద రావు గారి అబ్బాయా..??"
అని అడిగాడు రఘునాథరెడ్డి.
" లేదండి..! వారి అన్న గారి అబ్బాయినీ..! ఆయన నాకు చిన్నాన్న అవుతారు..!!"
" అవునా..!! అయితే స్వామి గారి పిల్లలు ఏం చేస్తూ ఉంటారు..!??"
"ఆయనకు ఓకే ఒక్క కొడుకు.. ఆయన చనిపోయాడు.. మనవడు మాత్రమే ఉన్నాడు..!!" అని చెప్పగానే రఘునాథరెడ్డి బాధగా నిట్టూర్చాడు...
" స్వామి వారిని చూసి చాలా సంవత్సరాలయింది...!! ఆయన కలుద్దామని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ కుదరలేదు..అసలు మీరు ఆ గుడికి రావడం మాకు ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది."
" ఒక ముఖ్యమైన పనిమీద అక్కడికి వచ్చాము..
కానీ పని జరగలేదు..! ఇంతలో ఆయనకి కళ్ళు తిరగడంతో గుడి లోకి తీసుకు రావాల్సి వచ్చింది..!!" అంటూ నిరాసగా నిట్టూర్చాడు.. సత్యనారాయణ రావు..
" ఏమిటది.? చెప్పండి స్వామి..!!?
నేను చేయగలిగిన సహాయం అయితే తప్పకుండా చేస్తాను..!!" అని ఆతృతగా అడిగాడు రఘునాథరెడ్డి..
" మీకు శివుడు గారు తెలుసు కదా..!!??"
" శివుడు అంటే..? స్వామితో కలిసి
మా అబ్బాయిని కాపాడిన ఆయనే కదా..!!"అని అనుమానంగా అడిగాడు రఘునాథ రెడ్డి..
" అవునండి..?! ఆయన గురించి మేము వెతుక్కుంటూ వచ్చాము.. కానీ అతని గురించి తెలియలేదు.. మీకేమైనా తెలుసా..?"అని అడిగాడు
ఆ మాటలు విన్న రఘునాథరెడ్డి బాధగా నిట్టూరుస్తూ..!! " ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది స్వామి..!!"అని చెప్పాడు..
ఆ మాటలు విన్న సత్యనారాయణ రావు ఒక నిమిషం పాటు షాక్ లో ఉండిపోయాడు..
సత్యనారాయణ రావు అలా షాక్ లో ఉండటం చూసి
" ఏమైంది స్వామి..? అలా ఉన్నారు...? " అని అడిగాడు రఘునాథరెడ్డి
సత్యనారాయణ రావు మెల్లగా తేరుకొని...
ఆదిత్య ప్రమాదంలో ఉన్నాడన్న సంగతి.. అతనిని కాపాడే విషయంలో శివుడు సహాయం కోసం విజయవాడ వచ్చాము. అన్న విషయం పూర్తిగా చెప్పాడు..
ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా..
అక్కడికి గోవింద రావు వచ్చారు.
గోవింద రావు ని చూసి ఇద్దరు లేచి నుంచున్నారు..
గోవింద రావు ని కుర్చీలో కూర్చోబెట్టి, తాను మరొక చైర్ లో కూర్చున్నాడు రఘునాథ రెడ్డి .
"ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు..?"అని నవ్వుతూ అడిగారు గోవింద రావు..
" అదేం లేదు చిన్నాన్న.. శివుడు గారి గురించి నేను నీ దగ్గర ఏమైనా సమాచారం దొరుకుతుందేమో అని తెలుసుకున్నాను."
" మీకు ఏమైనా తెలుసా..!?"అని ఆతృతగా అడిగారు గోవింద రావు..
ఆయన ప్రశ్నకు సమాధానంగా మౌనం వహించాడు రఘునాథరెడ్డి..
"ఆయన చనిపోయాడంట చిన్నాన్న.."అని బాధగా చెప్పాడు సత్యనారాయణ రావు..
బాధతో నోట మాట రాలేదు గోవింద రావు కి.
" ఏం పరీక్షరా మనకిది..!? నాకంటూ మిగిలిన మనవడిని కాపాడుకోలేక పోతున్నాను.."అంటూ బాధపడసాగారు..
వాళ్ళిద్దరూ అలా బాధ పడడం చూసి..
" శివుడు లేకపోయినా అలాంటి వ్యక్తి నాకు తెలుసు స్వామి..!!"అని అన్నాడు రఘురాం రెడ్డి.
ఆశ్చర్యంతో గోవింద రావు తలెత్తి చూశాడు.
"ఎవరండీ..!!ఆయనా ..!!"అని ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ రావు..
ఎవరో కాదు స్వామి..! శివుడి గారి కొడుకే..!! పేరు రుద్ర...!!"
"మరి ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు.?"
ప్రస్తుతం అతను మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఫారెస్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు..
అతని గురించి పూర్తిగా చెప్పు నాయనా అని అడిగాడు గోవింద రావు..
రఘునాథ రెడ్డి రుద్ర గురించి పూర్తిగా చెప్పడం మొదలుపెట్టాడు..
" స్వామి..!! నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని..! నా బిడ్డను కాపాడిన తర్వాత
శివుడు గారి దగ్గర నాకు పరిచయం బాగా పెరిగింది.. నేను చేసే వ్యాపారం లో ఏవైనా ఇబ్బందులు వస్తే దోష నివారణ పూజలు చేసి, శాంతులు జరిపించే వారు.. క్రమక్రమంగా నా వ్యాపారం పుంజుకుంది.. నా బిడ్డను కాపాడినందుకు కృతజ్ఞతగా నేను వారి బిడ్డను కూడా నా బిడ్డ తో పాటు చదివించాను.. మా అబ్బాయి తను మంచి స్నేహితులు..!! "
" మరి ఆ అబ్బాయికి తాంత్రిక విద్యలు వచ్చని మీకు ఎలా తెలుసు..??"అని మధ్యలో అడిగాడు సత్యనారాయణ రావు.
"ఒక రోజు మా ఇంట్లో పూజ జరిపించడానికి శివుడు వచ్చాడు. మాటల క్రమంలో సరదాగా అడిగాను " ఈ విద్యలు రుద్రకి కూడా తెలుసా అని.."
ఆ మాటలకి శివుడు నవ్వుతూ...!!
" చూడండి రెడ్డి గారు..!! ఈ తాంత్రిక సాధన సముద్రం మధ్యలో ఈత లాంటిది..
అభ్యసించక పోతే ఎటువంటి ప్రమాదం ఉండదు.. కానీ ఒకసారి అభ్యసించి దుష్ట శక్తుల మీద ఈ విద్యను ప్రయోగించిన తర్వాత సాధన ఆపకూడదు. ఒకవేళ ఆపితే అలాంటి వాడి చావు చాలా భయంకరంగా ఉంటుంది.. ఎందుకంటే దుష్టశక్తుల ప్రమాదకరమైన నీడ మా మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మా తాంత్రిక సాధన ద్వారా వాటి నుండి మేము ఎప్పుడు రక్షించుకుంటూ ఉంటాము.. వాడికి ఆసక్తి కొద్దీ అభ్యసించాడు. వాడి పరిస్థితి కూడా అంతే.. సాధన మానడానికి లేదు.." అని చెప్పాడు..
రఘునాథ రెడ్డి చెప్పింది విన్న తర్వాత గోవింద రావు ఎలాగైనా రుద్ర ని కలవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు..
రఘునాథ రెడ్డి చెప్పింది విన్న తర్వాత సత్యనారాయణ రావు, గోవింద రావు తో..
" అయితే చిన్నాన్న..!! మనం వెంటనే మారేడుమిల్లి బయలుదేరాలి.. ఎలాగైనా రుద్ర ని వెతికి పట్టుకోవాలి.." అని అన్నాడు.
" అయితే ఆలస్యమెందుకు రేపే బయలు దేరదాం.." అన్నాడు గోవింద రావు.
వీరి సంభాషణ వింటున్న రఘునాథరెడ్డి..
వారి మాటలకి అడ్డొస్తూ..!! " మీ మాటలకి అడ్డువస్తున్నందుకు క్షమించండి స్వామి.
మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి."
అని అన్నాడు.
" ఏమైంది రెడ్డి గారు..??" అని అడిగాడు సత్యనారాయణ రావు..
" మీరు ఊహిస్తున్నట్టు రుద్ర మీకు సహాయపడకపోవచ్చు..!!"
ఆ మాటకి అనుమానంగా చూశాడు గోవింద రావు..
" అదేంటి..? అలా అన్నారు..?? మాకు ఎందుకు సాయం చేయ్యడు..??" అని ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ రావు.
" దాని వెనకాల పెద్ద కారణం ఉంది. స్వామి..!!"
" ఏంటా కారణం..??" అని అడిగాడు గోవింద రావు
రఘునాథ రెడ్డి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు..
" సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం..!!
రుద్రకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది..!!
అందువల్ల తల్లిదండ్రులను వదిలి దూరంగా మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఉంటున్నాడు..
ఒకరోజు శివుడు గారి దగ్గరికి దెయ్యం పట్టిందని ఒక ముసలావిడిని తీసుకువచ్చారు. కానీ అప్పుడు శివుడు గారు జ్వరంతో బాధపడుతున్నాడు. ఆమెకు వైద్యం చేయడం కుదరదని ఆయన భార్య చెప్పిన సరే, వాళ్ళు బ్రతిమాలడంతో
తన భార్య వద్దన్నా వినకుండా ఆమెకు నయం చేయడానికి పూనుకున్నారు..
కానీ ఆమెకు నయం చేస్తూ ఉండగా మధ్యలోనే హఠాత్తుగా శివుడు గారు చనిపోయారు. అక్కడే చూస్తూ ఉన్న ఆమె భార్య ఒక్కసారిగా పక్షవాతం వచ్చినట్లుగా నేలపై పడిపోయింది... ఆ విషయాన్ని నాకు అక్కడ ఉన్న వారు చెప్పగా వెంటనే నేను ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశాను..
రుద్ర వచ్చిన తరువాత శివుడు గారి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాను..
అలా తన తండ్రి చనిపోవడం, తన తల్లి అనారోగ్యంతో మంచానపడడంతో రుద్ర బాగా కుంగిపోయాడు.. అప్పుడు నేను ఓదారుస్తూ " బాధపడకు రుద్రా..!! మీ అమ్మగారికి ఏమీ కాదు..! మేము అందరం ఉన్నాం కదా..!! నువ్వేమి భయపడకు..!!" అని అంటుండగా..!
రుద్ర ఆవేశంతో.." నా తండ్రి ఏ నేరం చేసాడు అంకుల్..?? ఎవరికైనా సాయం చేయడమే తప్పా .?? అలా సాయం చేసినందుకు ఆయన చనిపోయాడు.
నా తల్లి మంచాన పడింది.. ఈ రోజున చెప్తున్నాను అంకుల్.. ఈరోజు నుంచి ఈ విద్యని నేను ఉపయోగించను.." అని కోపంగా చెప్పి ఆ తర్వాత అతని తల్లిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు..
ఆ తర్వాత నాకు ఫోన్ కూడా చేయలేదు..
ఇప్పుడు ఎలా ఉన్నాడో కూడా పూర్తిగా తెలియదు.."అంటూ చెప్పడం పూర్తి చేశాడు.
రఘునాథ రెడ్డి చెప్పింది ఇద్దరు పూర్తిగా విన్నారు..
సత్యనారాయణ రావు అసహనంతో గోవింద రావు వైపు చూస్తూ " ఏం చేద్దాం చిన్నాన్న..?"
అని అడిగాడు.
గోవింద రావు మాత్రం " మనం రేపు పొద్దున్నే మారేడుమిల్లి బయలుదేరుతున్నాం..!!" అంటూ స్థిరంగా చెప్పాడు.
" కానీ చిన్నాన్నా..??" అంటూ సత్యనారాయణ రావు ఏదో చెప్పబోతుండగా
అతని వైపు మాట్లాడవద్దు అన్నట్లుగా చెయ్యి చూపించారు..
" చూడు రావు..!! మానవ ప్రయత్నం మనం చేయాలి.. ముందు రుద్ర ని ఎలాగైనా కలవాలి. అతను ఒప్పుకుంటాడో.? లేదో.? అది తర్వాత విషయం, కానీ ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో అతను తప్ప మనకి వేరే దారి లేదు. కాబట్టి అతన్ని ఎలాగైనా మనం కలిసి తీరాలి..!!" అంటూ దృఢంగా తన నిర్ణయాన్ని వెలిబుచ్చాడు.
సత్యనారాయణ రావు కూడా సరైన అన్నట్లుగా తల ఊపాడు..
గోవింద రావు రఘునాథరెడ్డి వైపు చూసి..
" రెడ్డి గారు..! రుద్ర ని కలవడానికి మాకు మీ సహాయం కావాలి...?"అని అడగగానే
" అది నా భాగ్యం స్వామి..!! మా డ్రైవర్ పురుషోత్తం కి రుద్ర బాగా తెలుసు..! రేపు దగ్గరుండి నా కారులో అతడు మిమ్మల్ని అతని దగ్గరకు తీసుకు వెళతాడు. రుద్ర తో మీ పని పూర్తయ్యేంతవరకు అతను మీతో పాటే ఉంటాడు.." అంటూ ఎంతో మర్యాదగా చెప్పాడు..
" నువ్వు మాకు చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.." అని గోవింద రావు చెప్పగా..
" నా బిడ్డను కాపాడిన రోజున నేను డబ్బులు ఇచ్చినా సరే..మీరు తీసుకోలేదు.
శివుడు గారికి ఇచ్చేశారు.. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఈ విధంగానైనా మీరు చేసిన ఉపకారానికి కొంత బదులు తీర్చుకున్న వాడిని అవుతాను.."అంటూ గోవింద రావు కి నమస్కరించాడు..
" మంచిది..!! అయితే రేపు పొద్దున్నే సూర్యోదయానికి ముందరే మేము బయలుదేరుతున్నాము.."అని గోవింద రావు చెప్పగా
" రేపు ఉదయానికి మీరు బయల్దేరడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని నేను చూసుకుంటాను స్వామి..!!"అని చెప్పాడు రఘునాథరెడ్డి.
ఇంకా ఉంది.....!!!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)