08-01-2020, 08:16 PM
సిమ్ ఉండదు!
రాబోయే రోజుల్లో మనం వాడబోయే ఫోనుల్లో సిమ్ ఉండదట. దాని బదులుగా ఈ-సిమ్ ఉంటుందనీ దాన్ని ఆన్లైన్లో
తీసుకోవచ్చనీ అంటున్నారు నిపుణులు. ఇంకా... తయారీ: ఫోను వేడెక్కడం, బరువుగా ఉండడం,
పగిలిపోవడం... ఈ సమస్యల పరిష్కారానికి ఎంఐటీ పరిశోధకులు చేసిన కృషి ఫలించింది. వాళ్లు తయారుచేసిన
పాలిమర్ మెటీరియల్తో ఫోన్లు తయారుచేస్తే పైన చెప్పిన సమస్యలేవీ ఉండవు, పైగా ఫోన్లు చాలా చౌక అవుతాయి.
*కెమెరా:* 5- 8 మెగా పిక్సెల్స్తో మొదలైన ఫోన్ కెమెరాలు ఇప్పుడు పాతిక, ముప్పై దాటాయి. 48ఎంపీ
కెమెరాలున్న ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉంటే రాబోయే కొత్త ఫోన్లు ఏకంగా వంద ఎంపీ దాటబోతున్నాయి.
షియోమి, శాంసంగ్ కంపెనీలు 108 ఎంపీ కెమెరాలతో కొత్త ఫోన్లను తెస్తున్నాయి.
*ఛార్జింగ్:* ఎంత ఖరీదైన ఫోన్ అయినా దాని బ్యాటరీ మహా అంటే రెండు రోజులు వస్తుంది. ఆ తర్వాత
ఛార్జింగ్ చేసుకోవాల్సిందే. అందుకు కాసేపు ఫోన్ పక్కన పెట్టాల్సిందే. ఆ అవసరం రాకుండా ఎనర్గస్ అనే
కంపెనీ గాలి ద్వారా ఫోన్ దానంతటదే ఛార్జింగ్ అయ్యే సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో ఉంది. అది
అందుబాటులోకి వస్తే ఇప్పుడు సెల్ఫోన్ సిగ్నల్ టవర్లలాగే ఛార్జింగ్ టవర్లు కూడా రావచ్చు. అప్పుడిక
ఎక్కడికెళ్లినా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందన్న బాధ ఉండదు.
*సాగే ఫోను:* మడతపెట్టే ఫోన్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలా కాకుండా చిన్నగా ఉండి
కావాలనుకున్నప్పుడు కొద్దిగా సాగితే చాలు అనుకుంటున్నారా... అందుకూ ప్రయోగాలు జరుగుతున్నాయి.
మిషిగాన్ స్టేట్ యూనివర్శిటీ ఇంజినీర్లు అలా సాగే సర్క్యూట్ని తయారుచేయగలిగారట. కాబట్టి ఈ పరిశోధనను
మరింత ముందుకు తీసుకెళ్లి సాగే ఫోనునీ తయారుచేయగలమని వారు నమ్మకంగా చెబుతున్నారు.
*డ్రెస్కి మ్యాచింగ్:* ఫోను రంగుని కూడా మన దుస్తులకి తగినట్లుగానో, మూడ్కి తగినట్లుగానో
మార్చుకుంటే... అదీ వస్తుందట. పూర్తిగా పారదర్శకంగా ఉండే పగలని మెటీరియల్తో తయారైన ఫోన్లు వస్తాయి.
మనం సెట్టింగ్స్లోకి వెళ్లి కావాల్సిన రంగు ఎంచుకుంటే ఆ రంగులోకి ఫోను బ్యాక్ కవర్ మారిపోతుంది.
*మనసెరిగి...:* ఇప్పుడు స్పర్శతోనూ, మాటతోనూ ఫోనుతో పనిచేసుకుంటున్నాం. భవిష్యత్తులో మన ఆలోచననే
పసిగట్టే ఫోను రావచ్చు. మనసులో మనం ఊరెళ్లడానికి టికెట్ బుక్ చేసుకోవాలి అనుకోగానే ఆ వెబ్సైట్ ఓపెన్
అయిపోతుందన్న మాట. ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలనుకుంటే దానంతటదే టైప్ అయి పంపనా అని
అడుగుతుంది. దీనిపై ఫేస్బుక్ సంస్థలో పరిశోధనలు జరుగుతున్నాయి. నిమిషానికి వంద పదాలను టైప్
చేయగలగాలన్నది ఈ పరిశోధనల లక్ష్యం. ఎంఐటీలోని శాస్త్రవేత్తలు కూడా ‘ఆల్టర్ఈగో’ పేరుతో దాదాపు ఇలాంటి
పరిశోధనే చేస్తున్నారు. కేవలం ఆలోచనలతోనే మెషీన్లతో సంభాషించడం. ఇది చదువుతుంటే నమ్మశక్యం కానట్టుగా
ఉంది కానీ ఇప్పుడు మనం ఫోనుతో చేస్తున్న పనులన్నీ కూడా ఒకప్పుడు అలా అన్పించినవేనంటున్నారు
పరిశోధకులు.