23-11-2019, 08:17 AM
భయపెట్టి.. బుజ్జగించి.. ముంచి...
దిల్లీ సెక్యూరిటీ ఆఫీసర్లమంటూ రూ.7.71 లక్షలకు టోకరా
ఈనాడు డిజిటల్, విజయవాడ: ‘హలో నేను.. దిల్లీ సైబర్ క్రైం సెక్యూరిటీ అధికారిస్టేషన్ నుంచి అధికారిని మాట్లాడుతున్నాను. మీ ఫోన్ నంబరు నుంచి మహిళలను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. మీరు ఎక్కడ ఉంటారు.? ఏం చేస్తుంటారు.?’
విజయవాడ నగరంలోని కొందరికి ఇటీవల ఇలాంటి ఫోన్ కాల్స్ పెరిగాయి. దీంతో ఈ ఫోన్ కాల్ రాగానే.. వెంటనే బెంబేలెత్తిపోయిన బాధితులు తమ పూర్తి వివరాలు చెప్పేసి.. తమకేం సంబంధం లేదంటూ భయంతో చెబుతుంటారు. కానీ.. వారికి తెలియని అసలు కథ.. ఇక్కడి నుంచే ఆరంభమవుతుంది. వారిని గుల్ల చేసేలా సైబర్ నేరగాళ్లు ఈ కొత్త పంథాలో తమకు అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్లమంటూ తొలుత భయపెట్టి.. ఆ తర్వాత వీళ్లు ఇటునుంచి బతిమాలుకోవడం ఆరంభించాక.. అటునుంచి అసలు డ్రామా మొదలుపెడుతున్నారు. సరే.. మీరు చెప్పేది మేం నమ్ముతున్నాం. మీరు మంచి వారే.. కానీ.. మీ సిమ్కార్డ్ను ఎవరో క్లోన్(డూప్లికేట్) చేశారు. ఆ నంబరు నుంచి వాళ్లు ఫోన్లు చేసి వేధిస్తుంటే.. ఆ నేరం మీపైకి వస్తోంది. అందుకే.. దీని నుంచి బయటపడాలంటే మేం చెప్పినట్టు చేయండి అంటూ.. అటునుంచి నమ్మిస్తున్నారు. ఆ తర్వాత బాధితుల చేతులతోనే వారి సెల్ఫోన్ను హ్యాక్ చేసి రూ.లక్షలతో ఉడాయిస్తున్నారు. తాజాగా విజయవాడలోని ఓ బాధితుడికి ఇలాగే టోపీ పెట్టారు.
విజయవాడకి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇతని చరవాణికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. దిల్లీ సైబర్క్రైం సెక్యూరిటీ ఆఫీసర్లమంటూ పరిచయం చేసుకున్నారు. మీ నంబరు నుంచి పలువురి మహిళలను వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని మీ చిరునామా చెప్పండంటూ దబాయించారు. దీంతో భయపడిన బాధితుడు తనకు ఏం తెలియదని, నేను ఎవరికీ ఫోన్ చేయలేదంటూ చెబుతుండగా.. వారికి కావాల్సిన వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. మీ నంబరును ఎవరో క్లోన్ చేసి వినియోగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలంటే మేం చెప్పినట్టు చేయాలంటూ నమ్మించారు. మీరు ఏ ఫోన్ వాడుతున్నారంటూ అడగ్గా.. ఐఫోన్ అంటూ బాధితుడు తెలిపాడు. మీ నంబరును ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్లో వేయాలని సూచించారు. తాము కొన్ని కాంటాక్ట్లు, యాప్లు పంపిస్తానని వాటిని మీ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో కొన్ని చరవాణి నంబర్లను సంక్షిప్త సందేశం రూపంలో పంపగా.. డీవోటీసెక్యూర్.ఏపీకే అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమని సూచించారు. అనంతరం సేవ్ చేసుకున్న చరవాణి నంబర్లను బ్లాక్ చేసుకోమని చెప్పి.. ఇక మీకేం ఇబ్బందులుండవని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాతే అసలు కథ ఆరంభమైంది.
ఈ తతంగం మొత్తం దాదాపు గంట సేపు జరిగింది. ఈ సమయంలో బాధితుడి చరవాణిలో ఇన్స్టాల్ చేసిన యాప్ ద్వారా హ్యాక్ చేయడం మొదలు పెట్టారు. బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి దాదాపు రూ.7,71,388లను కాజేశారు. మొత్తం ఐదు విడతల్లో ఈ మొత్తాన్ని వివిధ యాప్లకు బదలాయించారు. ఈ సొమ్ముతో దేశంలోని పలు ప్రాంతాలకు విమాన టిక్కెట్లను కొనుగోలు చేశారు. అనంతరం వీటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. దీనిపై సైబర్సెక్యూరిటీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు.