Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఋగ్వేద సంహిత
#2
తొలి కిరణం
ఓం నమోవేద పురుషాయ
హృదయం దక్షిణంచాక్షి మండలంచాధిరుహ్యయః |
చేష్టతే తమహం నౌమి ఋగ్యజుస్సామ విగ్రహం ||
కేవలం భగవదనుగ్రహం వలన శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రచన పూర్తి చేయగలిగాను.
భగవదనుగ్రహం లేక ఏకార్యమూ ప్రారంభమూకాదు - పూర్తికాదు. ఎందుచేతననగా సర్వకర్మలు కార్యాలు భగవదధీనములు.
ఈ సమస్త భువనమండలం నిరాధారంగా నిలిచి ఉన్నదంటే అందుకు భగవదాజ్ఞయే కారణం. భూమి, సూర్యచంద్రాదులు సమస్త చరాచర ప్రకృతి భగవదాజ్ఞవల్లనే ప్రవర్తిల్లుతున్నాయి. భగవంతుడు నియమించినరీతిగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయి.
   
పురుష ఏ వేదం సర్వంయ ద్భూతం యచ్చభవ్యం
ఉతామృతత్వ స్యేశానోయదన్నే నాతి రోహతి.     ఋగ్వేదం 10-4-90-2
వేదం హిమవదున్నతం. ఆకాశమంతటి విశాలం. సముద్రమంతటి గంభీరం వాయువువలె సర్వవ్యాప్తం.
వేదం అంతటిది. నేను ఇంతటివాణ్ణి! నేనేమిటి వేదాన్ని గురించి ఆలోచించడం ఏమిటి? వేదం పఠించడం ఏమిటి? వేదం వ్రాయడం ఏమిటి?
ఇది కేవలం భగవదనుగ్రహం కాకుంటే మరేమిటి?
ప్రతిప్రాణికీ అంతో ఇంతో శక్తి ఉంటుంది. అదీ భగవంతుడు ప్రసాదించిందే! ఆ శక్తివరకు పనులు చేసుకుంటే ఆ ప్రాణిశక్తి అనుకుంటే అనుకోవచ్చు. చెప్పుకున్నా చెప్పుకోవచ్చు.
కాని శక్తినిమించిన పనిచేసిందంటే? చీమకొండను కదిలించిందంటే! ఉడుత సముద్రం పీల్చేసిందంటే? గరుడుడు సూర్యుణ్ణి మింగేశాడంటే?
ఇవన్నీ కేవలం భగవదనుగ్రహంవల్ల జరిగాయని అనుకోక తప్పదు.
 అలాంటి పనే నేను వేదం అధ్యయనం చేయడం, అనువదించడం!
అసలు సంకల్పమే ఆశ్చర్యకరం! వెయ్యేళ్లపైబడిన ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎంతమంది మహామనీయులు లేరు! వారికి కలుగకపోవడం ఏమిటి? ఏ అర్హతలూలేని నాకు కలగడం ఏమిటి?
సంకల్పం సహితం భగవంతుడే కలిగించాడు!
నా బాల్యంలో మాతండ్రిగారు వేదంలోనిదని ఒక మంత్రం చదివేవారు :-
"దంతాన్ ధావయేత్ప్రాతః పలాశవటపిప్పలైః"
ఉదయమే పళ్లు తోముకోవాలి. మోదుగు, మఱ్ఱి దానితో అని అర్థం.
మానవుని దంతధావనం నుంచి సమస్తం వేదం నేర్పిందని చెప్పడం వారి ఉద్దేశం.
అన్ని వివరించిన వేదం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఆనాడు ఏర్పడింది. నాకు.
వేదం అనేది మా ఇంట్లో కనిపించలేదు.
అది రెండో ప్రపంచ యుద్ధకాలం. నేనింకా పిల్లవాన్ని. కాలేజ్లో ఉన్నాను.
అప్పుడు మేము ఖమ్మంలో ఉన్నాం. నలుగురు పెద్దలు కలిసినపుడు "మన వేదాలు ఎత్తుకెళ్లి హిట్లర్ బాంబులు వగైరా చేస్తున్నాడు, అనుకునేవారు. మరోమాటా అనుకునేవారు హిట్లర్ మనవాడు. ఆర్యుడు. అతడే గెలవాలి. మళ్ళీ మనకు వేదాలోస్తాయి" అని.
అది నాకు వేదాలు మీద మరింత ఆసక్తి కలిగించింది.
హిట్లర్ పతాకంలో స్వస్తిక్ ఉండేది. ఆర్యులకు తప్ప పాలించే హక్కు లేదనేది అతని వాదం "కృణ్వంతో విశ్వమార్యం" అనేది అతని నినాదం.
కొద్దికాలం తరువాత యుద్ధం, ప్రపంచ పరిస్థితులూ అర్థం చేసుకున్నాక హిట్లర్ నినాదం ఎంత ప్రమాదకరం అయిందో అర్థం అయింది. హిట్లర్ ఓడితీరాలి అనుకున్నాను. ఫాసిజం ఓడింది.
ఆ రోజుల్లోనే అంటే 1940 ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా ఖమ్మం హైకాలేజ్లో సమ్మె చేయించాను! అప్పుడు నాకు పన్నెండేళ్లు! నిజాంకు వ్యతిరేకంగా సమ్మే!! అది అత్యంత ఆశ్చర్యకరం!!!
నన్ను కాలేజ్లోంచి తీసేశారు. నైజాంలో ఎక్కడా చేర్చుకోరాదని ఫర్మాను చేశారు. రాజద్రోహినని మా నాయనగారు ఇంటినుంచి గెంటేశారు.
కుటుంబంలో కలతలు. కుటుంబం విచ్చిన్నం కావడం. మేము ఖమ్మం నుంచి గార్లజాగీరుకు మారడం, ఆంధ్ర మహాసభ పోరాట రాజకీయాలతో ప్రభావితులమై మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్య, నేను నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం, నైజాం మీద సెక్యూరిటీ ఆఫీసర్ చర్య జరగడం ఒకదానివెంట ఒకటి జరిగిపోయాయి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పోరాట వెల్లువలో వేదాల సహితంగా భారతీయ సాహిత్య అధ్యయనానికి దూరం అయినాం.
వచ్చిన స్వాతంత్ర్యం మాకు ఏవిధంగానూ ఉపకరించలేదు. నిన్నటిదాకా నైజాంను సేవించినవారే ఖద్దరు కట్టి ప్రభుత్వం వశపరచుకున్నారు!
ఈ వ్యవస్థలో త్యాగానికి స్థానం లేదని తేల్చుకున్న నేను స్వయంకృషితో రెండు డిగ్రీలూ, రెండు డిప్లొమాలు సాధించి ఉద్యోగంలోచేరి 1988వ సంవత్సరంలో పదవీ విరమణ చేశాను.
ఇంతటి సొంతరొద ఎందుకంటే నాకు పాఠశాల విద్యలేదు. గురువుల వద్ద చదవలేదు. ఆలాంటపుడు నా జ్ఞానం ఎంత? నేనెంత?
నేను వేదం అనువదించడానికి పూనుకోవడం ఏమిటి? పూర్తి చేయుట ఏమిటి!! దీన్నేమందాం? ఇది కేవలం భగవదనుగ్రహం కాదా!
ఉద్యోగం చేస్తూనే వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేశాను. వచన రూపంలో రచించాను. 1962లో శ్రీరామా బుక్ డిపోవారు ప్రచురించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. రాళ్లపల్లి అనంత కృష్ణ రావు, దీపాల పిచ్చయ్య రావు. దివాకర్ల వెంకటావధాని వంటి మహా మనీషులు నేను రచించిన రామాయణాన్ని ప్రశంసించారు. అది మరిన్ని ముద్రణలు జరిగి ప్రస్తుతం అందుబాటులో ఉంది.
1966లో వ్యాస భాగవతము, పోతన భాగవతాలననుసరించి వచన భాగవతం రచించాను. దానిని కూడా శ్రీరామా బుక్ డిపో శ్రీ పబ్బా శంకరయ్యగారు ప్రచురించారు.
తరువాత కొన్ని నవలలు, కథలు, వ్యాసాలు, అనువాదాలు ప్రచురించారు.
1962లో ప్రారంభించిన భారత రచన అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలూ, కలహాలు, కల్లోలాలను అధిగమించి శ్రీముఖ జ్యేష్ఠ ఏకాదశి 31-5-1993న పూర్తి చేయగలిగాను. 2000 పేజీలపైన శ్రీ మహాభారతాన్ని శ్రీరామ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. భవనామ సంవత్సర ఉగాది 11-4-1994న కనువిందైన ఉత్సవంలో "శ్రీమహా భారతమును" స్వామి పరమార్థానంద ఆవిష్కరించి ఆశీర్వదించారు.

Like Reply


Messages In This Thread
ఋగ్వేద సంహిత - by sweet1guy - 19-11-2019, 09:12 PM
RE: ఋగ్వేద సంహిత - by sweet1guy - 19-11-2019, 09:18 PM



Users browsing this thread: 1 Guest(s)