Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఋగ్వేద సంహిత
#1
ఋగ్వేద సంహిత
 మొదటి భాగం
అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య

Note:
ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియజేస్తే ఈ పోస్ట్ ను తొలగించగలను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
తొలి కిరణం
ఓం నమోవేద పురుషాయ
హృదయం దక్షిణంచాక్షి మండలంచాధిరుహ్యయః |
చేష్టతే తమహం నౌమి ఋగ్యజుస్సామ విగ్రహం ||
కేవలం భగవదనుగ్రహం వలన శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత రచన పూర్తి చేయగలిగాను.
భగవదనుగ్రహం లేక ఏకార్యమూ ప్రారంభమూకాదు - పూర్తికాదు. ఎందుచేతననగా సర్వకర్మలు కార్యాలు భగవదధీనములు.
ఈ సమస్త భువనమండలం నిరాధారంగా నిలిచి ఉన్నదంటే అందుకు భగవదాజ్ఞయే కారణం. భూమి, సూర్యచంద్రాదులు సమస్త చరాచర ప్రకృతి భగవదాజ్ఞవల్లనే ప్రవర్తిల్లుతున్నాయి. భగవంతుడు నియమించినరీతిగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయి.
   
పురుష ఏ వేదం సర్వంయ ద్భూతం యచ్చభవ్యం
ఉతామృతత్వ స్యేశానోయదన్నే నాతి రోహతి.     ఋగ్వేదం 10-4-90-2
వేదం హిమవదున్నతం. ఆకాశమంతటి విశాలం. సముద్రమంతటి గంభీరం వాయువువలె సర్వవ్యాప్తం.
వేదం అంతటిది. నేను ఇంతటివాణ్ణి! నేనేమిటి వేదాన్ని గురించి ఆలోచించడం ఏమిటి? వేదం పఠించడం ఏమిటి? వేదం వ్రాయడం ఏమిటి?
ఇది కేవలం భగవదనుగ్రహం కాకుంటే మరేమిటి?
ప్రతిప్రాణికీ అంతో ఇంతో శక్తి ఉంటుంది. అదీ భగవంతుడు ప్రసాదించిందే! ఆ శక్తివరకు పనులు చేసుకుంటే ఆ ప్రాణిశక్తి అనుకుంటే అనుకోవచ్చు. చెప్పుకున్నా చెప్పుకోవచ్చు.
కాని శక్తినిమించిన పనిచేసిందంటే? చీమకొండను కదిలించిందంటే! ఉడుత సముద్రం పీల్చేసిందంటే? గరుడుడు సూర్యుణ్ణి మింగేశాడంటే?
ఇవన్నీ కేవలం భగవదనుగ్రహంవల్ల జరిగాయని అనుకోక తప్పదు.
 అలాంటి పనే నేను వేదం అధ్యయనం చేయడం, అనువదించడం!
అసలు సంకల్పమే ఆశ్చర్యకరం! వెయ్యేళ్లపైబడిన ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎంతమంది మహామనీయులు లేరు! వారికి కలుగకపోవడం ఏమిటి? ఏ అర్హతలూలేని నాకు కలగడం ఏమిటి?
సంకల్పం సహితం భగవంతుడే కలిగించాడు!
నా బాల్యంలో మాతండ్రిగారు వేదంలోనిదని ఒక మంత్రం చదివేవారు :-
"దంతాన్ ధావయేత్ప్రాతః పలాశవటపిప్పలైః"
ఉదయమే పళ్లు తోముకోవాలి. మోదుగు, మఱ్ఱి దానితో అని అర్థం.
మానవుని దంతధావనం నుంచి సమస్తం వేదం నేర్పిందని చెప్పడం వారి ఉద్దేశం.
అన్ని వివరించిన వేదం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఆనాడు ఏర్పడింది. నాకు.
వేదం అనేది మా ఇంట్లో కనిపించలేదు.
అది రెండో ప్రపంచ యుద్ధకాలం. నేనింకా పిల్లవాన్ని. కాలేజ్లో ఉన్నాను.
అప్పుడు మేము ఖమ్మంలో ఉన్నాం. నలుగురు పెద్దలు కలిసినపుడు "మన వేదాలు ఎత్తుకెళ్లి హిట్లర్ బాంబులు వగైరా చేస్తున్నాడు, అనుకునేవారు. మరోమాటా అనుకునేవారు హిట్లర్ మనవాడు. ఆర్యుడు. అతడే గెలవాలి. మళ్ళీ మనకు వేదాలోస్తాయి" అని.
అది నాకు వేదాలు మీద మరింత ఆసక్తి కలిగించింది.
హిట్లర్ పతాకంలో స్వస్తిక్ ఉండేది. ఆర్యులకు తప్ప పాలించే హక్కు లేదనేది అతని వాదం "కృణ్వంతో విశ్వమార్యం" అనేది అతని నినాదం.
కొద్దికాలం తరువాత యుద్ధం, ప్రపంచ పరిస్థితులూ అర్థం చేసుకున్నాక హిట్లర్ నినాదం ఎంత ప్రమాదకరం అయిందో అర్థం అయింది. హిట్లర్ ఓడితీరాలి అనుకున్నాను. ఫాసిజం ఓడింది.
ఆ రోజుల్లోనే అంటే 1940 ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా ఖమ్మం హైకాలేజ్లో సమ్మె చేయించాను! అప్పుడు నాకు పన్నెండేళ్లు! నిజాంకు వ్యతిరేకంగా సమ్మే!! అది అత్యంత ఆశ్చర్యకరం!!!
నన్ను కాలేజ్లోంచి తీసేశారు. నైజాంలో ఎక్కడా చేర్చుకోరాదని ఫర్మాను చేశారు. రాజద్రోహినని మా నాయనగారు ఇంటినుంచి గెంటేశారు.
కుటుంబంలో కలతలు. కుటుంబం విచ్చిన్నం కావడం. మేము ఖమ్మం నుంచి గార్లజాగీరుకు మారడం, ఆంధ్ర మహాసభ పోరాట రాజకీయాలతో ప్రభావితులమై మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్య, నేను నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం, నైజాం మీద సెక్యూరిటీ ఆఫీసర్ చర్య జరగడం ఒకదానివెంట ఒకటి జరిగిపోయాయి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పోరాట వెల్లువలో వేదాల సహితంగా భారతీయ సాహిత్య అధ్యయనానికి దూరం అయినాం.
వచ్చిన స్వాతంత్ర్యం మాకు ఏవిధంగానూ ఉపకరించలేదు. నిన్నటిదాకా నైజాంను సేవించినవారే ఖద్దరు కట్టి ప్రభుత్వం వశపరచుకున్నారు!
ఈ వ్యవస్థలో త్యాగానికి స్థానం లేదని తేల్చుకున్న నేను స్వయంకృషితో రెండు డిగ్రీలూ, రెండు డిప్లొమాలు సాధించి ఉద్యోగంలోచేరి 1988వ సంవత్సరంలో పదవీ విరమణ చేశాను.
ఇంతటి సొంతరొద ఎందుకంటే నాకు పాఠశాల విద్యలేదు. గురువుల వద్ద చదవలేదు. ఆలాంటపుడు నా జ్ఞానం ఎంత? నేనెంత?
నేను వేదం అనువదించడానికి పూనుకోవడం ఏమిటి? పూర్తి చేయుట ఏమిటి!! దీన్నేమందాం? ఇది కేవలం భగవదనుగ్రహం కాదా!
ఉద్యోగం చేస్తూనే వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేశాను. వచన రూపంలో రచించాను. 1962లో శ్రీరామా బుక్ డిపోవారు ప్రచురించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. రాళ్లపల్లి అనంత కృష్ణ రావు, దీపాల పిచ్చయ్య రావు. దివాకర్ల వెంకటావధాని వంటి మహా మనీషులు నేను రచించిన రామాయణాన్ని ప్రశంసించారు. అది మరిన్ని ముద్రణలు జరిగి ప్రస్తుతం అందుబాటులో ఉంది.
1966లో వ్యాస భాగవతము, పోతన భాగవతాలననుసరించి వచన భాగవతం రచించాను. దానిని కూడా శ్రీరామా బుక్ డిపో శ్రీ పబ్బా శంకరయ్యగారు ప్రచురించారు.
తరువాత కొన్ని నవలలు, కథలు, వ్యాసాలు, అనువాదాలు ప్రచురించారు.
1962లో ప్రారంభించిన భారత రచన అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలూ, కలహాలు, కల్లోలాలను అధిగమించి శ్రీముఖ జ్యేష్ఠ ఏకాదశి 31-5-1993న పూర్తి చేయగలిగాను. 2000 పేజీలపైన శ్రీ మహాభారతాన్ని శ్రీరామ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. భవనామ సంవత్సర ఉగాది 11-4-1994న కనువిందైన ఉత్సవంలో "శ్రీమహా భారతమును" స్వామి పరమార్థానంద ఆవిష్కరించి ఆశీర్వదించారు.

Like Reply
#3
ఆలాంటపుడు వేదంలో మంత్రాలను భాష్యకారుని వ్యాఖ్యాన నేత్రం నుంచి చూచి అర్థం చేసికోవాలి. ఋగ్వేదంలో 1017 సూత్రాలు, 10,580 ఋక్కులు లేక మంత్రాలు, 1,53,826 శబ్దాలు, 4,32,000 అక్షరాలు ఉన్నాయి.
నేను ప్రతి మంత్రాన్నీ పూర్తిగా అర్థంచేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. మంత్రం తన సంపూర్ణ జ్యోతితో నాకు దర్శనం ఇవ్వాలి.
నాకు అర్థం కానిది నేను చెప్పలేను. అర్థం అయిన తరువాత దాన్ని తెలుగులో నేను అనువదించాలి. తేట తెలుగు అందరికి అర్థమయ్యే తెలుగులో చెప్పాలి.
అందుకు నేనొక తపస్సు చేశాను. రోజుకు పదిగంటలపైన పరిశ్రమ చేశాను. ఇరవై నాలుగు గంటలు నిద్రలో సహితం మంత్రాల మననం ! అర్థం వెదకడానికి పలవరింపులూ సహజం అయిపోయాయి!!
వేదంముందు పెట్టుకుని కూర్చున్నపుడు మహారణ్యంలో అగమ్యగోచరంగా అడుగు పెడుతున్నట్టుండేది. అరణ్యంలో అడుగు పెట్టగలమా అని భయం! కాని అలా కాగితం మీద కలం పెట్టగానే అరణ్యం ఉద్యానంగా మారుతుంది. రాచబాటలు- పూలపొదలు-వృక్షచ్చాయలు. తామర కొలనులు అంతా మనోహరంగా కనిపిస్తుంది.
రచన అనాయాసంగా సాగుతుంది.
    ఏదో ఒక మహత్తమ శక్తి నాతో వ్రాయిస్తున్నట్లు అనిపిస్తుంది. వెనక్కు చూస్తాను. అదృశ్యం! ఏమీ ఉండడు!!
    వ్రాస్తున్నంతసేపు ఏదో చల్లని వెలుగు నన్ను నడిపిస్తుంది! కలం సాగుతుంది!! మనసు పొంగుతుంది!!! అదే భగవచ్చక్తి. భగవానుడే వ్రాయించి ఉండాలి. కాకుంటే నావంటి సామాన్యునికి ఇంతటి మహాకార్యం సాధ్యం అగునా?
    ఎన్ని విచిత్ర, వింత, విశిష్ట సంఘటనలు!
    ఒక్కొక్కసారి వాక్యం ప్రారంభిస్తాను. తరువాత ఏం వ్రాయాలో తెలియదు. అయోమయం. లిప్తలో కలం వెంట వెలుగు పాయ! వాక్యం పూర్తి అవుతుంది!! నాకే ముద్దొచ్చేంత అందంగా ఉంటుంది!!!
    శ్రీమదాంధ్రమహాభాగవతంలోని సిరికింజెప్పుడు.... పద్యం స్వయంగా శ్రీరామచంద్రమూర్తి పూరించాడంటారు. అలాంటివి నాకు ప్రత్యక్ష అనుభవాలు! భగవానుడు దర్శనం ఇచ్చాడని అబద్ధం చెప్పలేను. కాని అతడే వ్రాయించిన అద్భుత ఆశ్చర్యకర అనిర్వచనీయ అనుభూతులు రచనలో అనేకానేకం! అది అక్షరానికి చాలదు!!
    నేను అనువాదానికి కర్తనుకాను ద్రష్టను మాత్రమే అనిపిస్తుంది! కాదు అదే సత్యం!! అదే నిజం!!! ఒక్కొక్కసారి మంత్రం నన్ను ముప్పు తిప్పలు పెడ్తుంది. సాయణుని వ్యాఖ్య, త్రిపాఠీ అనువాదం వగైరాలు కరదీపికలు కాలేవు. సతమతం అవుతాను. ఒక కొండ నెత్తిన కూలినట్లవుతుంది. ఇహ అనువాదం సాగదు అనిపిస్తుంది. గుండె గుబులు పుడుతుంది.
    ఆలాంటప్పుడు కళ్లు మూసుకుంటాను. నిశ్శబ్దంగా ధ్యానంలోకి జారిపోతాను. అది యోగధ్యానం కాదు. అది నాకు రాదు. మరేధ్యాసలేని ధ్యానంలోకి జారిపోతాను. పరిసరాలద్యాస ఉండదు. అలా కొన్ని క్షణాలు గడుస్తాయి. ఒక వెలుగు రేఖ మొదలవుతుంది. అలా అది ఒక బింబం అవుతుంది!
    అప్పుడు కళ్లు తెరుస్తాను.
    మంత్రం అర్థం అవుతుంది!
    వివరణ విదితం అవుతుంది!!
    అనువాదం సాగిపోతుంది.!!!
    భగవానుడు అంతటి కృపాకటాక్షం కురిపించకుంటే ఇంతటి మహత్కార్యం ఇంత కొద్ది వ్యవధిలో అసాధ్యం! అనితర సాధ్యం!! దుస్సాధ్యం!!!
    1. నేను అరవై ఎనిమిదేళ్ల వృద్ధుణ్ణి.
    2. మధుమేహ వ్యాధి గ్రస్తుణ్ణి.
    3. మరీ అంత ఆరోగ్యవంతుణ్ణికాను.
    4. బలం కలవాణ్ణి అసలే కాను.
    అలాంటివాణ్ణి ఋగ్వేదంలోని 10,580 మంత్రాలను అనువదించడం భవ పుష్య పౌర్ణమి 16-1-95 నాడు ప్రారంభించి యువ మార్గశిర అమావాస్య 22-12-95 నాడు పూర్తి చేయగలిగానంటే అది కేవలం భగవదనుగ్రహమే ! పౌర్ణమినాడు, ప్రారంభించడం! అమావాస్యనాడు ముగించడం!!
    పదకొండు నెలల్లో వైశాఖంలో యమునోత్రి, గంగ్రోత్రి, కేదారనాథ్, బదరీనాథ్ యాత్రకు సకుటుంబంగా వెళ్లివచ్చాం. నేను రచించిన శ్రీ మహాభారతాన్ని బదరీ స్వామికి అంకితం సమర్పించి వచ్చాం.
    ఒకనెల అలా గడిచిపోయింది!
    అనారోగ్య కారణంగా ఒక నెల రచన నిలిచిపోయింది!!
    మిగిలిన తొమ్మిది నెలలలో సుమారు ఆరువేల పేజీలు  అధ్యయనం చేసి 1853 వ్రాత పేజీలు  రచన చేశాను! ఇది నా వంటి సామాన్యునకు సాధ్యమూకాదు! సాధారణమూకాదు!! అసాధారణములన్నీ భగవత్ప్రేరితములే అనేది నా విశ్వాసం మాత్రం కాదు. ఇది ఋతం. ఇది సత్యం. ఇది తథ్యం!!!
    కార్యంలో నాకు ఒక్కరూ సాయపడలేదు.
    కనీసం అడిగిన పుస్తకం అందించలేదు!!
    పుస్తకం వెదికి కావలసినది చూసినవాడు లేదు!!!
    ఒక్క అక్షరం మరొకడు వ్రాయలేదు. !
    ఇంత మహాగ్రంథం నేనొక్కణ్ణే వ్రాశాను!!
    నాకు వ్రాయసగాడు లేడు!!!
    ఇదంతా మానవ మాత్రునికి సాధ్యం అంటారా? ఇది కేవలం భగవదను గ్రహమే! మరొకటి కానే కాదు!! అగుటకు వీలులేదు!!! "నమో భగవతే వాసుదేవాయ".
    శ్రీమద్రామాయణ, శ్రీ మహాభారత, శ్రీమద్భాగవతం సహితంగా నవలలు, కథలు, వ్యాసాలూ, అనువాదాలు కలిసి పదేవేల పేజీలపైన నా రచనలు ఇప్పటికి అచ్చయినాయి.
    వాటిలో వేటినీ తొలిప్రతే తప్ప మలిప్రతి శుద్ధప్రతి వ్రాయలేదు. వ్రాసింది వెనుదిరిగి చూడలేదు. సవరణలుగాని, తిరిగి వ్రాయటంగాని చేయలేదు!! వింతకాదా?
    పిల్లలమర్రి పినవీరభద్రునివలె "వాణినారాణి" అనలేను కాని పోతనామాత్యునివలె "పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండుట" అనగలను.
                                వేదమంటే?
    1. "వేదం" ఏకవచనము. ఇది పవిత్ర విద్య అని అథర్వ వేదం. శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పబడింది.
    "ప్రాజాపత్యోవేదః అని తైత్తరీయం"
    2. "వేదాః" బహువచనము.
    "చత్వారోవా ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో బ్రహ్మవేద ఇతి" అని గోపథ పూర్వము వేదాలు నాలుగు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, బ్రహ్మవేదములు అని. బ్రహ్మవేదమే అథర్వ వేదము.
    3. ఏవమిమే సర్వేవేదా నిర్మితాః సంకల్పాః, సరహస్యాః, సబ్రాహ్మణాః, సోపనిషత్కాః, సేతిపసాః, సాన్వాఖ్యానాః, సపురాణాః, సస్వరాః, ససంస్కారాః, సనిరుక్తాః, సామశాసనాః సానుమార్పునాః సవాకోవాక్యాః అని గోపథ పూర్వము.
    వేదములన్నీ సంకల్పము, రహస్యము, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, ఇతి హాసములు, వ్యాఖ్యానములు, పురాణములు, స్వరములు, సంస్కారములు, నిరుక్తములు, అనుశాసనములు, అను మార్జనములు, వాక్కు యొక్క వాక్యముల సహితముగా నిర్మించబడినవి.
    4. "అనన్తావై వేదాః" అని తైత్తరీయము. వేదములు అనంతములైనవి.
    ప్రాజాపత్యో వేదాః
    వేదములు ప్రాజాపత్యములు అన్నాడు. ప్రజాపతి అనగా నేమి?
    1. "ప్రజాః సృష్ట్యాపాలయస్వేతి తస్మాత్ప్రజాప్తి రభవత్" అని గోపధ పూర్వము. ప్రజలను సృష్టించి పాలించుట వలన ప్రజాపతి అయినాడు. వేదములును అట్లే అయినవి.
    2. ప్రజాపతిరగ్నిః 3. ప్రజాపతిర్వైమనః 4. ప్రజాపతిర్వైవాచస్పతిః 5. సంవత్సరోవై ప్రజాపతిః 6. యజ్ఞ ప్రజాపతిః 7. ప్రజాపతిర్వై సవితా 8. ప్రాణాహి ప్రజాపతిః 9. అన్నంవై ప్రజాపతిః 10. పతద్వై ప్రజాపతిః 11. ప్రజాపతిర్వై భూతః 12. ప్రజాపతిర్భన్ధుః 13. ప్రజాపతిర్వై హిరణ్యగర్భః 14. ప్రజాపతిర్వై చంద్రమాః 15. ప్రజాపతిర్వై మహాన్దేవాః 16. ప్రజాపతిర్వై మనుః 17. ప్రజాపతిర్వై విశ్వకర్మా 18. ప్రజాపతిర్వై సుపర్ణోగరుత్మాన్ 19. ప్రజాపతిర్వై మూర్ధా 20. ప్రజాప్రతిర్వా ఓదనః 21. ప్రజాపతిః సర్వః 22. సర్వాణి చంధాంసి ప్రజాపతిః 23. ప్రజాపత్యోవా ఆశ్వః 24. ప్రజాపతిః సదస్యః 25. ప్రజాపతిః ఉద్గాతా 26. ప్రజాపతిరుద్గీతః 27. అథర్వావై ప్రజాపతిః 28. సత్యంహి ప్రజాపతిః 29. ఘృతంచ మధుర ప్రజాపతి రాసీత్ 30. ఆత్మాహ్యయం ప్రజాపతిః 31. పురుషోహి ప్రజాపతిః 32. పితరః ప్రజాపతిః 33. ప్రజాపతిర్దాతా 34. ప్రజాపతిర్వై జమదగ్నిః 35. ప్రజాపతిర్వై ద్రోణ కలశః 36. ఇమేలోకాః ప్రజాపతిః 37. ప్రజాపతిః సర్వే దేవతాః 38. ప్రజాపతిర్వా అమృతః 39. ప్రజాపతిర్హి స్వరాజ్యమ్.
     అపరిమితోహి ప్రజాపతిః
    ప్రజాపతి అపరిమితుడు. కావున వేదము అపరిమితము. "అనన్తావై వేదాః" అన్నదానికి సరిపోయింది.
    వేద సంహిత :
    మానవునికి జ్ఞానం కలిగించింది వేదం. వేదం మనిషికి ఎరుక పరిచింది. జ్ఞానం సాపేక్షం. మానవునికి తెలియనిదాన్ని తెలియపరచడం జ్ఞానం.
    మనిషికి అన్నం తెలియనినాడు అది తెలియపరుస్తే జ్ఞానం అవుతుంది. అది తెలిసిన తరువాత అన్నం జ్ఞానం కాదు.
    బట్ట తెలియనపుడు బట్టను గురించి తెలియపరచడం జ్ఞానం. అది తెలిసిన తరువాత వస్త్రం జ్ఞానం కాదు.
    అలాగే కుటుంబం ఏర్పడడం, వ్యవసాయం, వ్యాపారం, బంధుత్వం ఇలాంటివి ఇంకెన్నో!
    అయితే సత్యం, సత్యస్వరూపుడైన భగవానుడు మానవునికి ఎన్నటికీ అందరు. కాబట్టి అది ఎల్లకాలం జ్ఞానం అవుతుంది.
    కాని సత్యం, సత్యస్వరూపుడగు భగవానుడు మానవునికి ఎన్నటికీ గోచరించడు. అందువల్ల అందుకు సంబంధించిన సమస్త సాహిత్య సంపదా జ్ఞానమే అవుతుంది.
    మానవునికి లౌకిక, పారలౌకిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వేదమే ప్రవచించింది.
    ఎంతటి మహాత్ములు, మహామహులైనా పరాత్పరుని అంశామాత్రంగానే దర్శించారు. పరమాత్ముని పరిపూర్ణ స్వరూపం మానవునికి గోచరం కాలేదు - కాదు - కాబోదు.
    మానవుని మంచివాణ్ణి చేయడానికీ, మంచి మార్గమున నడిపించడానికీ, మనిషిని చేయడానికి అనాది నుంచి అనేక సంస్థలు, ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. నిరంతర యత్నం వలన మహర్షులు మహాత్ములు వాటిని ఏర్పరుస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. స్థిరపరుస్తున్నారు.
    మహర్షులు, మహాత్ములు నిస్వార్థులు. నిష్కల్మషులు. తేజోమూర్తులు. దివ్వెవలె తమ జీవితాలను మానవ కళ్యాణానికి అర్పించినవారు అంకితం చేసినవారు. వారు సూర్యచంద్రాదులవంటివారు. పర్వతములు, నదులు వృక్షములవంటివారు.
    ప్రకృతి ప్రాణులకు తన సర్వస్వం అర్పిస్తుంది. అంతే తాను వాటినుండి ఏదీ ఆశించదు.
    తనను కొట్టిన గొడ్డలికే పరిమళం ప్రసాదిస్తుంది చందన వృక్షం అంటాడొక కవి.
    అయితే చెట్టు ఉన్నపుడు చీడపురుగు వలె సమాజంలోని అన్నింటినీ తమ స్వార్థం కోసం మాత్రమే వాడుకునే స్వప్రయోజన పరులుంటారు. వీరు సమస్తాన్నీ తమ కొరకే వాడుకుంటారు! తామే నిస్వార్థులం అనే వేషం వేస్తారు! జనాన్ని నమ్మిస్తారు!!!
    మహర్షులు, మహాత్ములు సృష్టించిన సంస్థలు, ఆచారాలు సంప్రదాయాల స్వరూప స్వభావాలను దిగమింగి వీరు కనీసం త్రేన్చరు. వాటి స్థానంలో ఆత్మ కోల్పోయిన రూపాలను ప్రతిష్టించి దాన్నే సత్యం అని నమ్మిస్తారు. వీరికి చేతనయింది నమ్మించడం. జనం నమ్ముతారు!! రూపాలను విడిచి ప్రతిరూపాలవెంట పడ్తారు!!!
    స్వప్రయోజన నరులు స్వచ్చ గంగా జలాన్ని సహితం విషపూరితం చేయగలరు! కలుషితమే గంగాజలం అని నమ్మించగల అసాధ్యులు వీరు!
    అయితే అనాదిగా వీరు సమాజాన్ని వశపరచుకుంటున్నారు. వాస్తవ సంప్రదాయలకు అపార్థాలు కలిగిస్తున్నారు.
    మనకు తెలిసిన కొలదిమాత్రపు చరిత్రలో నాటి బౌద్ధం నుంచి నేటి గాంధీవాదం వరకు ఇదే జరిగింది. వివరణ అక్కరలేదు. నిజం చేదు. మొన్నటి మార్కృజానికీ అదే గతి పట్టింది!
    ఇది మనకు తెలిసిన కథ. మూల సిద్దాంతాలను పదిలపరచడానికి అనేక సదుపాయాలున్నాయనుకుంటున్న కాలం ఇది.
    వేదం ఏనాటిదో తెలియదు. ఎన్నడు మొదలయిందో తెలియదు. అది అనాగరిక మానవుని నుంచి నిర్మలంగా నిష్కల్మషంగా ప్రవహించింది. మనిషి మనసు మలినాన్ని దూరం చేసింది. మానవుని దైవత్వపు అంచులకు కొనిపోయింది.
    స్వప్రయోజనపరులకు వేదం ఒక్క లెక్కకాదు! వారు వేదాన్ని సహితం వేలం వేయగలరు!! వేటినో చూపి వీటినే వేదం అనిపించగలరు. అసలు వేదాన్ని అడుగున వేసి తాము చెప్పిందే వేదం అనిపించగలరు. అందుకే 'విస్సన్న చెప్పిందే వేదం' అన్న మాట జనులనోట సామెత అయింది.
    విస్సన్నలు అసలు వేదాన్ని తలదన్నిన వేదాలను కల్పించి ఉంటారు!
    అలాంటి సమయంలో వేదవ్యాస మహర్షి అవతరించి నిజమైన వేదాన్ని ఉద్ధరించారు.
    వ్యాసభగవానుడు త్రికాలజ్ఞుడు. అతడు రానున్న తరాలవారు కేవలం భౌతికవాదులు. జీవులు అవుతారని గ్రహించాడు.
    ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణ వత్సలః ||
    వ్యవధాత్యజ్ఞసంత్యై వేదమేకం చతుర్విధం ||
 
    కృపావాత్సల్యాలు గల వ్యాసభగవానుడు ఒకే వేదాన్ని నాలుగు విధాలుగా చేసినాడని భాగవతంలో చెప్పబడింది.
 
    "చకార వేదమేకం చతుర్విధం" అని ఒక్క వాక్యంలో చెప్పాడు. కాని మానవ కళ్యాణమే ధ్యేయంగా తన జీవితాన్నంతటినీ కప్పురంలా అర్పించిన వ్యాసుడు ఎంత శ్రమించిందీ చెప్పలేదు!
    పాఠ్యాంతరాలు గల కావ్యాలను పరిష్కరించడానికి పండితులు పడిన శ్రమ ఇంతంత కాదు. అనేక పాఠాలను చూచి నిర్ణయించడానికి అనేకమంది సాయము కావలసి వచ్చింది. కొన్నింటిని పరిష్కరించడానికి విశ్వవిద్యాలయాలు పండిత పరిషత్తులు పూనుకున్నాయి.
    "అనంతావైవేదాః" అనంతములైన వేదాలను పరిష్కరించి నాలుగుగా నిర్ణయించడం మానవ మాత్రులకు సాధ్యమయ్యేదికాదు.
    వ్యాస భగవానుడు మధ్యాహ్న సూర్యుడు ఆసీనుడై నక్షత్ర మండలం వంటి శిష్యమండలి పరివేష్టించి ఉండగా ఒక్కొక్క మంత్రము, సూక్తమును ఇందరు చదువుతూ నిర్ణయించి ఉండవచ్చు! మనోఫలకం మీద వెలసిన దృశ్యమే అద్భుతం! ఆశ్చర్యకరం!! ఆనందకరం!!!
    వ్యాస భగవానుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్లు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరములు నిరంతరం కృషిచేసి వేదములను నాలుగుగా నిర్ణయించినాడో! ఇవి మాత్రమే వేదములని చెప్పగలిగినాడో! ఇవే వేదములు అన్యములు కావు అని ఒప్పించడానికి వ్యాసుడు, అతని శిష్యగణము ఎంత శ్రమించినారో! దాన్ని గురించి కనీసం అంచనావేయగల శక్తి స్తోమతలు మనకు లేవు. మనది అల్పబుద్ధి! మనము అల్పాయుష్కులము!!
వ్యాస భగవానుడు మానవజాతికి చేసిన సేవను గురించి చెప్పుకునే శక్తిలేదు ఈనాటి 'దౌర్భాగ్య', 'కృతఘ్న' మానవాళికి!
వ్యాసుడు భరతవంశము అంతరించకుండ రక్షించినాడు! పంచమ వేదమగు శ్రీమహాభారతం రచించారు. మానవజాతికి అమృత తుల్యమైన శ్రీమద్భగవద్గీతను శ్రీకృష్ణపరమాత్మచే ప్రవచింపచేశాడు! మానవజాతికి శాంతిప్రదమగు భక్తిని శ్రీమద్భాగవతమున ప్రతిపాదించాడు! అనేక పురాణాలు రచించాడు!
    అతడు సంఘ సంస్కర్త అయినాడు!
    భిషస్వరుడు అయినాడు!
    రాజకీయవేత్త అయినాడు!
    అతడు కానిది ఏది?
    అతడు సర్వస్వమైనాడు!
వ్యాస భగవానుడు మానవజాతికి ఎన్నటికీ తరగని మహోపకారం చేసియూ తనకోసం ఏమి చేసికోలేదు. చెట్టుకిందనో పర్ణశాలలోనో ఉండి పిడికెడు మెతుకులు తిని ఇంతటి ఘనకార్యములు సాధించినాడు! కనీసం సాధించానని చెప్పుకొనలేదు.!!
దివ్వెవలె తనను వెలిగించుకొని మానవజాతికి వెలుగు ప్రసాదించినాడు!
అతడు సూర్యునివంటి తరగని వెలుగును మానవాళికి ప్రసాదించియు తాను దివ్వెవలెనే నిలిచినాడు!
మనం అల్పులం మనం అంతటి మహోన్నత మనిషికి భగవానునికి ఏమి ఇవ్వగలం?
    వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తీఃపుత్రమ కల్మషం |
    పారశరాత్మజం వన్దే శుకతాతం తపోనిధం ||
    వ్యాస భగవానుడు దర్శనం ఇస్తే అతని పాదారవిందములు చుంబించాలని ఉంటుంది! నాకు గల అసాధ్యములైన ఆశల్లో అది ఒకటి!
 
[+] 2 users Like sweet1guy's post
Like Reply
#4
భారత జాతికి అమృత ప్రాయములైన రామాయణ, భారత, భాగవతాలను రచించిన అతికొద్ది మందిలో నేనొకణ్ణి కావడం కేవలం భగవదనుగ్రహమే! ఇంతటి మహత్తమ కార్యము నావంటి సామాన్యునికి సాధ్యం కావడం అబ్బురం కాదా!
మహర్షి పోతనామాత్యుడు అన్నట్లు

పలికెడిది భాగవతమట

పలికించు విభుండు రామభద్రుండుటనే

బలికిన భవహరమగునట

పలికెద వేరొండు గాథ బలుకగనేలా!

వేదాలమీద చిన్నతనం నుంచి ఉన్న ఆసక్తికి పట్టిన గ్రహణం జ్ఞానోదయంతో విడిపోయింది. విచిత్రం ఏమంటే నాకు ఎవరూ జ్ఞానబోధ చేయలేదు. నేను ఎవరినీ ఆశ్రయించలేదు ఇందుకు రెండు కారణాలు కావచ్చు.

నామీద భగవంతునికి నిర్హేతుక జాయమాన కటాక్షం కలిగి ఉండాలి.

నేను పూర్వజన్మలో యోగభ్రష్టుణ్ణి అయ్యుండాలి. 'శుచీనాం శ్రీమతాంగేహేయోగ భ్రష్టోపిజాయతే' అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ గీతలో.

వేదం అనువదించాలని నాకు సంకల్పం కలిగినపుడు నా దగ్గర వేదానికి సంబంధించినవి తప్ప వేదం లేదు. వేదం కదా, దొరక్కపోతుందా అనే ధీమాతో ఉపక్రమించాను.

గ్రంథ సంపాదనమే ఒక యజ్ఞం అయింది. ఎంతో వెదికాను. గ్రంథాలయాలు అన్వేషించాను. విశ్వవిద్యాలయాలు గాలించాను. గ్రంథాలు కనిపించలేదనికాదు. అవి పూర్తిగా లేవు. ఉన్నవి ఉపకరించేవి కావు!

ఇది ఆదిలోనే హంసపాదుకదా!

నిరుత్సాహ పరుచును కదా!!

వదులుకొనవచ్చును కదా!!!

ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణ్ణి |

నరోదసీ అద్రుహా వేద్యాభిర్ని పర్వతాని నమేత స్థివాంసః||    3 - 4 - 56 -1

అన్వేషించగా, అన్వేషించగా వేదప్రతిష్ఠాన్ కొత్తఢిల్లీవారి ఋగ్వేద సంహిత ఆంగ్లానువాదం లభించింది. ఈ సంస్థ నాలుగు వేదాలను ఆంగ్లంలోకి అనువదించ సంకల్పించింది. మూలమంత్రము, రోమనులిపి అనగా ఆంగ్లము లిపిలో మంత్రము ఆ మంత్రపు ఆంగ్లానువాదం స్వామి సత్యప్రకాశ సరస్వతి, సత్యకామ విద్యాలంకార్ కలిసి చేశారు. ఇదొక మహత్తర కార్యం. కాని ఇప్పటికి అయిదు మండలాలవరకే ప్రచురించబడినాయి.

ఇది ఒక మహత్తర ప్రయత్నం. బహుశా భారతీయ దృక్పథంతో వేదాన్ని ఆంగ్లములో చెప్పే తొలి ప్రయత్నం కావచ్చు!

ఇది చదువుకోవడానికి బాగుంటుంది. కాని అనువదించి అందించడానికి ఉపకరించదు అనిపించింది. ఎంత ఉత్సాహంగా ప్రారంభించానో అంతనీరుకారి నిలిపివేశాను. గత్యంతరం లేకపోయింది.
Like Reply
#5
thank you brother, e thread ni ekkadiki marchinaduku
Like Reply
#6
సంహిత
 
    "సంహితం భవతి హ్యక్షిరణి ధనం ప్రతిష్ఠాయై" అని తాండ్యము
 
    సంహిత వర్గ సంయోగము, వేదమునందు కొంత భాగము, శాస్త్రము, సంధించబడినది అని శబ్దరత్నాకరము.
 
    సంహితమ్ కూడుకొనునది అని సంస్కృతాంధ్ర నిఘంటు.
 
    ఒకదాన్ని ప్రతిష్ఠించడానికి, స్థాపించడానికి చేసే కూర్పు సంహిత అవుతుంది. దీన్ని మనం ఈనాడు సంకలనం అంటున్నాం.
 
    వేదవ్యాసుడు వేదములను సంకలనం చేసినాడు. అందుకే అవి వేద సంహితలు 1. ఋగ్వేద సంహిత 2. యజుర్వేద సంహిత 3. సామవేద సంహిత 4. అథర్వవేద సంహిత.
 
    వేదాల్లోని సూక్తాలను వివిధ ఋషులు, వివిధ సమయాల్లో దర్శించారు. దర్శించింది అక్షర బద్ధం అయింది. అలా ఎంతకాలం ఎన్నివేల సంవత్సరాలు జరిగిందో చెప్పటం కష్టం. ఎంచేతంటే పాశ్చాత్యులకువలె మన చరిత్ర మూణ్ణాళ్లదికాదు! మనకు కాలం బ్రహ్మవలె అనంతం!!
 
    అలా పెరుగుతూపోయిన వాస్తవ సూక్తాలూ విస్సన్నలు చెప్పినవీ ఎన్ని కోట్లు అయినాయో! అందుకే "అనంతావైవేదాః"
 
    అంతటి అనంత రత్న, శిలారాసుల నుండి వన్కెకెక్కినరత్నాలను వెలికి తీసినాడు వ్యాస భగవానుడు. అలా రత్న రాసులను కూర్చి వాటి ద్రష్టలు స్మర్తలగు ఋషులను నిర్ణయించినాడు. సూక్తాలన్నిటినీ కూర్చాడు. అలా కూర్చి నాలుగు వేదాలను ఏర్పరచినాడు.
 
    ఇది ఎంత కష్టసాధ్యమో విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమా! నవంధ్యాని జానాతీం ప్రసవవేదానా గుర్వీం, విద్వాంసునకు మాత్రమే విద్వాంసుని శ్రమ అర్థం అవుతుంది.
 
    గొడ్రాలికి ఏం తెలుస్తాయి పురిటి నొప్పులు.
 
    ఇలా నాలుగు విధాలుగా వేదాన్ని విభజించడాన్ని "వేదచతుష్టయ" అని అంటారు. వేద చతుష్టయి వేదాల విషయ నిర్ణయం చేస్తుంది.
 
    1. ఋగ్వేదం దేవతల గుణగణములను స్తుతిస్తుంది.
 
    2. యజుర్వేదం వివిధ యజ్ఞములను నిర్దేశిస్తుంది.
 
    3. సామవేదం దేవతలను ప్రసన్నులను చేయుగాన విధిని వివరిస్తుంది.
 
    4. అథర్వవేదం బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.
 
    వేద చతుష్టయ కాక మరొక విభజనను వేదత్రయ, అనికూడా అంటారు. ఇది పద్య, గద్య, గేయ విభజన, వేదాలు పద్యాల్లో దర్శించినవీ, గద్యంలో దర్శించినవీ, గేయంలో దర్శించినవీ ఉన్నాయి. అలాంటి విభజనను 'వేదత్రయ' అంటారు.
 
    కొంచెపు బుద్ధిగల పాశ్చాత్య విద్వాంసులు "వేదత్రయ"ని మూడు ఋగ్యజుస్సామ వేదాలను అర్థం చెప్పారు. అవకాశం దొరికిందని అథర్వవేదం తరువాత వచ్చిందని చెప్పారు.
 
    "ఏవమేవం సర్వేవేదా నిర్మితాః సకల్పాః సరహస్యాః సబ్రహ్మణాః సోపనిషత్కాః సేతిహాసాః సాన్వ్యాఖ్యానాః సపురాణాః సస్వరాః ససంస్కారాః సనిరుక్తాః సోమశాసనాః సానుమార్జనాః సనాకోవాక్యాః" అంటుంది గోపథిపూర్వం.
 
    ఇన్నింటితో కూడింది వేదం. ఇన్నింటిని అధ్యయనంచేసి వేదాన్ని అర్థం చేసికోవాలి. శరీరం మాత్రమే తెలిసిన పాశ్చాత్యులకు ఆత్మజ్ఞానంతో కూడిన వేదం అర్థం కావడం కూపస్థమండూకానికి మహాసాగరం వంటిది!
 
    "వేదా బ్రహ్మాత్మ విషయాస్త్రికాండ విషయా ఇమే
 
    పరోక్షవాదా ఋషయః పరోక్షం మమచ ప్రియం" అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ భాగవతంలో.
 
    వేదం మూడింటిని ప్రతిపాదిస్తుంది. 1.బ్రహ్మ 2.ఆత్మ 3.ఆత్మ బ్రహ్మల ఏకత్వం. ఋషులు పరోక్షవాదులు. నాకూ పరోక్షం అంటేనే ప్రియం.
 
    "పరోక్షం" అంటే ప్రత్యక్షంగా కనిపించే దానికంటే వెనుకదాగి ఉండేది.
 
    కంటికి కనిపించని దానిని కనుగొనడమే కదా జ్ఞానం! ఋషులు పరోక్షవాదులు!! ప్రత్యక్షంగా దర్శించటం కష్టం!!!
 
    పాశ్చాత్యులు కంటికి కనిపించిన దానినే కానలేరు! భూమి గుండ్రంగా ఉందన్న వానిని శిక్షించారు!
 
    వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన మహర్షులు ఒక నిర్ణీత పద్ధతిన ఆరు వేదాంగాలను మూడు ఉపవేదములను ఏర్పాటు చేశారు.
 
    1.శిక్ష 2. వ్యాకరణము 3.నిఘంటు 4. ఛందస్సు 5. జ్యోతిష్యము 6.కల్పము. ఇవి వేదాంగములు.
 
    1. గాంధర్వవేదము 2. ఆయుర్వేదము 3. ధనుర్వేదము 4. అర్థవేదము ఇవి ఉపవేదములు.
 
    వేదార్థాన్ని గ్రహించడానికి 1. ఉపనిషత్తులు 2. కణాదుని వైశేషికము 3. గౌతముని న్యాయము 4. కపిలుని సాంఖ్యము 5. పతంజలి యోగము 6. జైమిని పూర్వమీమాంస 7. బాదరాయణుని ఉత్తర మీమాంస ఉపకరిస్తాయి.
 
    వేదము శృతి. శృతి శాస్త్రము కాదు. శాస్త్రానికి శృతిమూల భూతము. శృతి శాస్త్ర యోని "శాస్త్రయోనిత్వాత్"
 
    శాస్త్రమున శృతి అని భ్రమించరాదు. శృతి అపౌరుషేయము. శాస్త్రము మానవ నిర్మితము. వృక్షము శృతి. కర్రతో చేసిన వస్తువులు శాస్త్రము అనవచ్చు.
 
    ఇవన్నీ గ్రహించకనో, గ్రహించీ మనసు కొంచెపు వారిని చేయడానికో "వేదత్రయ"కి తప్పు వ్యాఖ్యానం చెప్పి మనను వేదాలు మూడే అని నమ్మేట్లు చేశారు తెల్లతోలువారు!
 
    నమ్మించేట్లు చేసేవాడు వంచకుడు!
 
    వంచకుడు చెప్పింది నమ్మేవాడు బానిస!!
 
    భాగవతంలో "వేదమేకం చతుర్విధం" అని చెప్పబడింది.
 
    "చత్వారోవా ఇవే వేదా ఋగ్వేదో యజుర్వేదః
 
    సామవేదో బ్రహ్మవేద ఇది" అని గోపథ పూర్వము.
 
    కావున మనవారు చెప్పిందే సత్యం. వేదాలు నాలుగు. అవి ఋగ్యజుస్సామ అథర్వవేదాలు. ఇందులో సంశయం ఉండడానికి ఆస్కారం లేదు. ఇది సత్యం! ఇది తథ్యం!!
 
    మనిషిని చూడగానే మనం అర్థం చేసుకోలేం. అతని మనసును, విజ్ఞానాన్ని, సంస్కారం మొదలైన వాటిని అన్నింటిని చూచినా ఎదుటి మనిషి మనకూ పూర్తిగా అర్థంకాడు. అంటే ప్రత్యక్షంగా మనకు కనిపించేదానికన్న పరోక్షం అధికం కదా!
 
    అట్లాగే వేదవాక్యాన్ని అర్థం చేసికోవడానికి కొన్ని దశలు ఉన్నాయి. 1. అన్నమయము. ఇది భౌతికము కంటికి కనిపించేది. 2. ప్రాణమయము. ఇది దృష్టిగోచరం. 3. మనోమయం. ఇది మనసును గ్రహించటం. 4. విజ్ఞానమయం. ఇది బుద్ధిని గ్రహించడం. 5. అత్యంత విశిష్ఠమైన ఆనందమయం. ఇది అనుభూతికి సంబంధించింది. సర్వోత్తమం "ఆనందోబ్రహ్మ" ఇది అందుకొనవలసిన లక్ష్యం.
 
    ఒక్క అగ్ని అనే పదానికి దీనిని అన్వయించి చూతాం.
 
    1. కంటికి కనిపించే అగ్ని అన్నమయము.
 
    2. అగ్నికి ప్రాణభూతుడగు సూర్యశక్తి ప్రాణమయము
 
    3. విశ్వస్థితికి కారణభూతమగు తేజస్సు మనోమయము.
 
    4. బుద్ధి వికాసమునకు కారణమగు తేజోశక్తి విజ్ఞానమయము.
 
    5. సకల విశ్వాంతరాళాలను వెలిగించు బ్రహ్మ జ్యోతి ఆనందమయము.
 
    అందువల్ల పదానికి గల బాహ్య అర్థంలో మాత్రమే వేదాన్ని అర్థం చేసికోవడం పరిమితి జ్ఞానంతో పరిశీలించడం సమంజసం కాదు.
 
                                                  వేదకాలం
 
    "అప్రాచ్యుడు"
 
    తిట్టాల్సి వచ్చినపుడు మా తండ్రిగారు వాడిన పదం అది! ప్రాచ్య దేశాలకు చెందనివాడు అప్రాచ్యుడు. అంటే మనం నేడు అతినాగరకులు అనుకుంటున్న ప్రాశ్చాత్యులు అప్రాచ్యులు. వారు ఆటవికులు, అనాగరకులుగా ఉన్నప్పుడు ప్రాచ్యదేశమైన భారతదేశం ఇతర దేశాలకు నాగరకత, సభ్యత, సంస్కృతి అందించింది. నాటి సుసంపన్న భారతదేశానికి కొందరు యాత్రికులుగా కొందరు దండయాత్రికులుగా వచ్చారు. కొందరు సాంస్కృతిక సంపదను, కొందరు రత్నరాసులను కొల్లగొట్టారు.
 
    కాని భారతదేశానికి అసలు సంపదలైన వేదములు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాలు అనంత సాహిత్య శిల్ప సంపదను దోచుకొని పోలేకపోయారు! అది భారతదేశపు వాస్తవ సంపద! అక్షయసంపద! అమృత సంపద! అనంత సంపద!
 
    "యునాన్ - -మిస్రొరూమా సబ్ మిట్ గయే జహాఁసె
    అబ్ తక్ మగర్ హై బాకీ నామెనిశాఁ హమారా" అంటాడు ఇక్బాల్ కవి.
 
    గ్రీకు, ఈజిప్టు రోమన్ నాగరకతలన్నా లోకంలో లేకుండా చెరిగిపోయాయి. అయినా ఇప్పటికీ మా ఊరూ పేరూ నిలిచి ఉన్నీయంటాడు.
 
    అంతటి విశిష్ఠ, సభ్య నాగరక సమాజానికి పునాది వేసింది వేదం. మన విశ్వాసం ప్రకారం కాలం అనంతం. వేదం అనంతం. మనం వేదాన్ని పరిరక్షించుకున్నాం. దాని పుట్టుపూర్వోత్తరాలు గురించి ఆలోచించలేదు.
ఒక మందానిలం వీచింది. ఒక వెన్నెల కాచింది. ఒక పరిమళము వ్యాపించింది. వాటిని పుట్టుపూర్వోత్తరాల కోసం గాలించటం పాశ్చాత్యులనుమతం. ఆనందించలేరు!
పాశ్చాత్యుల చరిత్ర సాంతం వందల, వేల సంవత్సరాలదే. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల చరిత్ర వందల ఏళ్లదే! అసలు హిస్టరీ, అనే పదం పుట్టి ఇంకా అయిదు వందల ఏళ్లుకాలేదు. కొలతలతో వేద కాలాన్ని కొలవడం గజం బద్దతో ఆకాశాన్నీ, బకెట్టుతో సముద్ర జలాన్నీ కొలవడం వంటిది!
 
    మనం ఇంకా బానిసలం కాబట్టి మన మహత్తును ఎరుగలేకున్నాం. వారి కొలతలనే నమ్ముతున్నాం. ఆత్మవిశ్వాసం లేని జాతికి అభ్యుదయం అంత సులభం కాదు!
 
    కాలం కొలతలు మనకు తెలిసినంతగా మరొకరికి తెలియవు. సృష్టి మొదలై ఇప్పటికి 195, 58, 85, 696 సంవత్సరాలయిందని ప్రతి సంవత్సరం పంచాంగం మీద గుణించి వేస్తున్నాం.
వేదం ఒకనాడు పుట్టి ఒకనాటికి పూర్తి అయిన కావ్యం లాంటిది కాదు. ఇది ఒక స్రవంతి. ఒక నిర్ఘరి. ఒక నది. ఒక ప్రవాహం. దర్శించిన ఋషి చెపుతూ పోయాడు. దానిని అక్షర బద్ధం చేస్తూపోయారు. ప్రవాహం వ్యాసుడు సంహితలు చేసేవరకు సాగింది. తదుపరి సకల నదులు కూడిన తటాకంవలె మానవాళికి ఉపకరిస్తున్నది.
పాశ్చాత్య విద్వాంసులు, మక్డొనెత్, కీత్ ప్రకారం వేదం క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల నాటిది. అంటే 3200 సంవత్సరాలకు పూర్వపుది. అంతకు పూర్వపు కాలాన్ని గురించి వారు ఆలోచించలేరు. క్రీస్తు పుట్టి ఇంకా రెండువేల సంవత్సరాలు కాలేదు!
 
    కలియుగం ప్రారంభం అయి 5096 సంవత్సరాలయిందని మన పంచాంగపు లెక్క ద్వాపరం ముగుస్తున్న సమయంలో భారత రచన జరిగింది. తరువాత రచించబడిన భాగవతంలో వేద విభజన జరిగిందని చెప్పబడింది. అంటే వేద సంహితం 6000 ఏళ్లనాటిదని చెప్పవచ్చు. కాని వేదం ఎప్పుడు ఆరంభం అయిందీ చెప్పడం దుస్తరం.
ఇంతకాలంగా ఒక నాగరకత, సభ్యత, సంస్కారం నిరంతరం కొనసాగడం ప్రపంచపు వింతల్లో ఒక్కటి! అయితే మనం చెప్పుకోలేం!!
పడమటి నాగరకతకు, మతానికి ఇంకా రెండువేల పసిప్రాయమే!
Like Reply
#7
వేదభాష
వేదకాలపు సమాజము, కుటుంబము, రాజ్యము మున్నగునవి సర్వ సంపూర్ణములు. ఒక పరిపుష్పమైన సంస్కృతము వంటి భాషకు జన్మనిచ్చిన మహోన్నత సంస్కారం గల సమాజం అది!
'సంస్కృతం' అనే పదంలోనే ఎంతో సంస్కారం ఉంది! సంస్కారంతో ప్రారంభం అయిన భాష మరొకటి లేదు. వర్గానికి చెందిన 1. ఇరానిక్ 2. హెల్లెనిక్ 3. ఇటలిక్ 4. సెల్లెటిక్ 5. ట్యుటనిక్ 6. లెటొస్లెవిక్ భాషలు పేరుకు మాత్రం మిగిలి ఉన్నాయి !
సంస్కృతాన్ని మాతృభాష అనే బదులు, మృతభాష అని పాశ్చాత్యులు అవమానించారు. సంస్కృతం వేదకాలం నుంచి ఈనాటి యంత్రయుగందాకా నిండువయసున్న సుందరివలె నాజూకుగా ఉంది. సమాజంలోని అన్ని రంగాలకు ఉపయోగపడేంత సమర్థవంతంగా ఉంది!
ఈనాటి రాజకీయాలు మాట్లాడ్డం రంకు లాంటిది. కాని ఒక్కొక్కసారి రంకు తప్పదు! భారతదేశానికి స్వతంత్ర్యం అనేది వచ్చిన తరువాత భాషను రాజకీయ రంకు చేయకుండా ఉంటే సంస్కృతం జాతీయభాష కావలసింది. అట్లా జరిగి ఉంటే ప్రాంతీయ భాషా రాజకీయం రాక్షసం ఉండేది కాదు!
తెలుగు భాష ఉచ్ఛారణ, పదాల అర్థాలు వగైరా గత పావు శతాబ్దంలో ఊహించనంతగా మారాయి. ఉదాహరణలు కొల్లలు. కాని ఉదాహరించడం అప్రస్తుతం.
అయినా ఇన్నివేల సంవత్సరాలుగా సంస్కృత పదాలు, భాష హిమవదున్నతములై నిశ్చలంగా, సజీవంగా నిలిచి ఉన్నాయి! ఇది ఎంతటి మహత్తర విషయమో మనం గ్రహించవలసి ఉంది! ఇది మనకు గర్వకారణం కావలసి ఉంది!!!
ఒక వింత ఏమంటే సంస్కృతం జాతీయభాష కాకున్నా మన జాతీయగీతాలు సంస్కృతంలోనే ఉన్నాయి!!
ఆంగ్లభాష అపర్యాప్తమని మధ్య గతించిన జార్జి బెర్నాండ్ షా విలపించడం మనం ఎరుగుదుము!
సంస్కృతం సాంతం ఒకే భాష కాదు. మూలభాష సంస్కృతం. ఇందులో కావ్యభాష, వైద్యభాష, తర్కభాష, జ్యోతిష్య భాష ఇలా అనేక శాఖలున్నాయి. ఒక్కొక్క భాషకు వేరువేరు సాంకేతిక పదాలుంటాయి సంస్కృత విద్వాంసునికి అన్ని శాఖలూ తెలియాల్సిన పనిలేదు. తెలియవు.
కావున సంస్కృతం తెలిసిన వానికి వేద సంస్కృతం తెలియకపోవచ్చును. వేద సంస్కృత పదాలకు వేరు నిఘంటు, వేద సంస్కృతానికి వేరు వ్యాకరణం ఉంటాయి! నా వరకు నాకు వేద సంస్కృతం అత్యంత సహజమైంది. సులభమైంది అనిపిస్తుంది. అది వెన్నెలవలె మందానిలంవలె ఉంటుంది. కృతకత తక్కువ. సహజత్వం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది.
వేదమే సూర్యునివంటిది, చంద్రునివంటిది, భూమివంటిది, గాలివంటిది.
సంస్కృతంలో ఉన్న రామాయణం, భారతాలు మరే జాతికీ, భాషకూ లేవు. ఇది సహజోక్తి! అతిశయోక్తి కాదు!!
 
                               వేదభాష - లిపి :
 
పాశ్చాత్యులు తమ స్వప్రయోజనం కోసం మనను తప్పుదారి పట్టించడంలో నూటికి వేయిపాళ్లు విజయవంతులైనారు. రాజ్యం వారిది. 'రాజానుమతో ధర్మం' మన నీతి. మనం ప్రత్యక్షాన్ని అంగీకరించాం. పరోక్షాన్ని కానలేకపోయాం.
నేను సామాన్యుల విషయం చెప్పడం లేదు. ఇందు విషయంలో అసాధారణులు, మహామహులుకూడా తప్పుటడుగు వేశారు! "స్వధర్మే నిధనం శ్రేయః" మరచారు.
వేదానికి 'శృతి' అనే పేరు కూడా ఉంది. శృతి అంటే విన్నది అని అర్థం. విన్నది కాబట్టి వేదం తొలుత అక్షర బద్ధం కాలేదనీ అప్పటికీ అక్షరం లేదని పాశ్చాత్యుల అభిప్రాయం, వాదం. నినాదం.
 
వేదం అపౌరుషేయం. ఋషి ద్రష్ట. స్మర్త అగును. ఋషి తాను తొలుత విన్నాడు. విన్నది వ్రాసినాడు. అందువలన అది "శృతి" అయింది. అంతేగాని లిపిలేక కాదు.
సంస్కృతానికి లిపి దేవనాగరి, లిపియొక్క అక్షరమాల సుమారు పరిపూర్ణము. పరిపూర్ణత సృష్టిలో దేనికీలేదు. ఒక్క భగవంతునికి తప్ప. భారతీయ భాషలన్నీ సుమారుగా అక్షరమాలనే అవలంబించాయి. మరీ విశేషమైన ఉచ్చారణలు తప్ప నాగర లిపిలో అన్ని భాషలు వ్రాయవచ్చు.
లిపిలేనిది వాటిని వ్రాయనిది అనంతములైన వేదాలను భద్రపరచడం అసాధ్యం!
ప్రపంచ చరిత్రలో ఇంతకాలం నుంచి భద్రపరచిన గ్రంథం ఒక్క వేదం మాత్రమే! మరే భాషకూ, జాతికీ ఇంతగర్వంగా చెప్పుకొనగల గ్రంథం లేదు. అందుకు మనం గర్వించాలి.
ఒక ఛందశ్శాస్త్రము, వ్యాకరణము ఏర్పడి లెక్కలేనన్ని వేదములు వెలువడిన భాషకు లిపి లేదనుట వంచించుట మాత్రమే!
నేడు నాగరకములు అనిపించుకుంటున్న అనేక జాతులకు లిపి లేదని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగవచ్చు. వాస్తవాలు సహితం ఆశ్చర్యం కలిగిస్తాయి.
నేడు ప్రపంచాన్ని ఆర్థికంగా శాసిస్తున్నామని భ్రమపడుతున్న అమెరికాకు డాలర్లున్నాయి! కాని స్వంత భాషలేదు - లిపి లేదు.
నేడు భారతదేశానికి జాతీయ భాషాయైన హిందీకి, లిపి లేదు. దేవనాగరియే దాని లిపి.
స్వంత లిపి గల భాషల్లో తెలుగు సహితంగా మరిన్ని భారతీయ భాషలున్నాయి.
వేదం తొలినుంచే అక్షరబద్ధమై వ్రాయబడింది అనేది నిర్వివాదాంశం. వేదం నూటికి నూరుపాళ్లు అక్షర బద్ధమైన రచన. ఇందు సంశయానికి ఇసుమంత తావులేదు.
 
                                             వేదం - స్వరం
 
వేదం శృతి. వినదగింది. వినసొంపుగా ఉండడానికి వేదానికి స్వరం ఉంది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యంగా ఉంటుంది. అది శక్తిమంతం సాధించగలదు.
వేదం చదివే పద్ధతులకు సహితం శాస్త్రం ఉంది. ఒక శబ్దాన్ని మరలమరల ఉచ్చరించడం విధానం. అందువలన వేదం కంఠోపాఠంగావడం సులభం అవుతుంది. ఇవి పదపాఠ, క్రమపాఠ, జట మున్నగు పద్ధతులు.
స్వర, పాదపద్ధతిన వేదాన్ని ఇంతకాలం నిలిపి ఉంచడానికి కొన్ని కుటుంబాలు, వంశాలూ అంకితం అయినాయి. ఇన్ని వేల, లక్షల సంవత్సరాలు ఎలా భద్రపరచారండీ?
ఇంతకాలం నిరంతరంగా జీవించి ఉన్న గ్రంథం మరొకటి లోకంలో లేదు.
మా తండ్రిగారు మహా విద్వాంసులు. వారి ద్రావిడ "తిరువాయ్ మొళిని" తెనిగించారు. అనేక గ్రంథాలు రచించారు. వారు 1979లో పరమపదించారు. ఆనాటికి వారి గ్రంథం ఒక్కటి కూడా మాకు లభించలేదు.
 
Like Reply
#8
reserved
Like Reply
#9
reserved
Like Reply
#10
reserved
Like Reply
#11
reserved
Like Reply
#12
                                           ఋగ్వేద సంహిత
 
    విశ్వమూలాయ విశ్వాత్మ సనాతన శరీరణే |
    నమో వైదిక ధర్మాయ లోక కళ్యాణ హే తవే ||
 
    వేదాలు నాలుగు. వాటిలో ఋగ్వేదానిది ప్రథమ స్థానము. ఉపనిషదాదులు ఋగ్వేదపు ఉల్లేఖనములు అధ్యయనము, పారాయణము మున్నగువానితో ప్రారంభం అవుతాయి.
 
    "ఋగ్రూపోవేదః ఋగ్వేదః"
 
    ఋక్కులు గలది కావున ఋగ్వేదం. ఋగ్వేదపు మంత్రాలను ఋక్కులు అంటారు.
 
    "తేషామ్ ఋగ్యత్రార్థ వశేన పాదవ్యవస్థా"
 
    వాక్యార్థం ఆధారంగా పాదం ఏర్పడిందాన్ని "బుక్" అంటారు.
  
    "ఋచ్యన్తే స్తూయన్తే దేవా అనయా ఇతి బుచ్"
 
    దేవతలను కీర్తించేదీ, స్తుతించేది బుక్.
 
    యజుర్వేద, సామవేద ఆలోచనా విధానం పూర్తిగా ఋగ్వేదంమీద ఆధారపడింది. యజుర్వేదం కార్మానుష్ఠానమును వివరిస్తుంది. ఋక్కుల గేయరూపమే సామవేదం అనవచ్చు.
 
    ఉపనిషత్తులు, బ్రాహ్మణములు అరణ్యకములు ఋగ్వేదం మీదనే ఆధారపడినాయని చెప్పవచ్చు.
 
                                          ఋగ్వేద శాఖలు
 
    ఋగ్వేద శాఖల్లో 1. శాకల 2. బాష్కల 3. అశ్వలయన 4. శాంఖ్యాయన 5. మాండూక్యాయన ప్రసిద్ధములు.
 
    1. ముద్గల 2. గాలవ 3. శాలీయ 4. వాత్స్య 5. శైశరీయ 6. బౌధ్య 7. అగ్నిమాదర 8. పరాశర
9. జాతూకార్ణ్య 10. ఆశ్వలాయన 11. శాంఖాయన 12. కౌహేతకి 13. మహాకౌహేతకి 14. శాంబవ్య 15. మాంభాక్య
16. బహువృచ 17. పైంగ్య 18. ఉద్దాలక 19. శతబలాక్ష 20. గజమహైతరేయ 21. బాష్కల 22. ఐతరేయ 23. వసిష్ఠ 24. సులభ 25. శౌనకములు.
 
    వీనిలో శాకల సంహిత అందుబాటులో ఉంది.. అచ్చవుతున్నది. ప్రచారంలో ఉంది. మనకు ప్రస్తుతం కనిపించే ఋగ్వేద సంహిత శాకలమే.
 
    'శాకల' ఒక వ్యక్తి పేరు కాదు. ఒక వ్యక్తి యొక్క శిష్య సమూహాన్ని సూచిస్తుంది. వైదిక సంప్రదాయంలో శాకల సంహితకే ఆధారం ఉంది.
 
                                ఋగ్వేద విభజన
 
    ఋగ్వేదము 1. అష్టకము 2. మండలము 3. అధ్యాయము 4. అనువాకము 5. సూక్తము 6. మంత్రములుగా విభజించబడింది.
 
    1. అష్టకము :- అష్టకంలో ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి ఋగ్వేదంలో ఎనిమిది అష్టకాలున్నాయి. అంటే మొత్తం 8x8-64 అధ్యాయాలున్నాయి. మనకు కళలు అరవై నాలుగు.
 
    అష్టకంలో మండలం ముగియదు. ఒక్కొక్కసారి అష్టకం తరువాత కూడా మండలం కొనసాగుతుంది. ఒక్కొక్కసారి అష్టకంలోనే ఒక మండలం ముగిసి మరొకటి మొదలవుతుంది.
 
    2. మండలం :- మండలంలో అధ్యాయాలుంటాయి. మండలానికి ఇన్ని అధ్యాయాలు ఉండాలని లేదు. కొన్నింటికి ఎక్కువ. కొన్నింటికి తక్కువ ఉంటాయి. మండలం అధ్యాయంతో ముగియాలని లేదు. ఒక్కొక్కసారి మండలం అయిపోయినా అధ్యాయం కొనసాగుతుంది.
    ఋగ్వేదంలో పది మండలాలున్నాయి. అందువలన దానిని 'దశతమీ' అనికూడా అంటారు.
Like Reply
#13
    3. అధ్యాయం :- అధ్యాయం కొన్ని అనువాకములు గలదు. అధ్యాయాలుకాగానే అష్టకంతో ముగుస్తుంది.
 
    4. అనువాకం :- అనువాకం కొన్ని సూక్తాల మాలిక. అనువాకం అధ్యాయంతో ముగియాల్సిన అవసరంలేదు. అధ్యాయం తరువాత కూడా కొనసాగుతుంది. అధ్యాయానికీ, మండలానికి ముడిలేనట్లే అనువాకానికి అష్టకానికీ ముడిలేదు.
 
    అనువాకం మండలంతో మొదలవుతుంది. అనువాక సంఖ్య మండలంతో ముగుస్తుంది. ప్రతి మండలం ఒకటవ అనువాకంతో మొదలవుతుంది.
 
    5. సూక్తం :- సూక్తం కొన్ని మంత్రాల మాలిక. ఇందులో ఇన్ని మంత్రాలు ఉండాలనే నియమంలేదు. కొద్ది మంత్రాలవీ ఎక్కువ మంత్రాలవీ ఉంటాయి. ఇది అనువాకంవలె మండలంతో మొదలై మండలంతో ముగుస్తుంది.
 
    మంత్రంతో ప్రారంభిస్తే 1. కొన్ని మంత్రాల కలయిక ఒక సూక్తం 2. కొన్ని సూక్తాలు అనువాకం 3. కొన్ని అనువాకాలు అధ్యాయం 4. కొన్ని అధ్యాయాలు మండలం 5. ఎనిమిది అధ్యాయాలది అష్టకం అవుతుంది.
 
    ప్రతి సూక్తానికి 1. ఋషి 2. దేవత 3. ఛందస్సు 4. వినియోగం ఉంటాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
 
    6. మంత్రం దీన్నే 'బుక్' అంటారు. ఇదే వేదానికి మూలం. మంత్ర సంఖ్య సూక్తంతో మొదలవుతుంది. సూక్తంతో ముగుస్తుంది. దీనికి సంఖ్యానియమం లేదు.
 
    ఇవికాక వర్గం అనే మరొక విభజన ఉంది. వర్గంలో నాలుగైదు ఒక్కొక్కసారి అంతకుమించి మంత్రాలు లేక ఋక్కులు ఉంటాయి. నేను వర్గం పాటించలేదు. చూపలేదు.
 
                                 ఋషి
 
    సూక్తం ఋషి - దేవత -ఛందస్సు వినియోగం సూచిస్తుందని చెప్పాం. క్రమంలో ఋషిని గురించి తెలిసికొందాం.
 
    ఋషిని సాయణుడు అతీంద్రియదర్శి అన్నాడు. మనకున్న చక్షురాదా ఇంద్రియాలకు అతీతంగా ఇతరులు చూడని దానిని దర్శించువాడని అర్థం.
 
    'నావృష్టిః కురుతే కావ్యం' అన్నదాన్ని ఆవిధంగా అర్థం చేసుకుంటే కవిలేక రచయిత దృగ్గోచరం కాని విషయాలను దర్శించువాడు కావాలని అర్థం.
 
    వేదం అపౌరుషేయం. అంటే మానవ ప్రోక్తం కాదు. ఋషులు వేదద్రష్టలు. స్మర్తలు. వారు అపౌరుషేయమైన వేదాన్ని దర్శించి మనకు అందించారు.
 
    వృష్టే శర్ధాయ సుమభాయ వేధసే నోధః సువృక్తిం ప్రభరామదుర్భ్యః"
 
    అని 1. మండలం 64 సూక్తపు తొలి మంత్రంలో 'నోధస్సు' అనే ఋషిని మరుత్తులను స్తుతించే మంత్రం వ్రాయమని కోరడం కనిపిస్తుంది.
 
    "యశోనపక్వం మధుగోషన్తరా భూతాంశో అశ్వినోః కామమప్రాః"
 
    అని భూతాంశుడను నేను స్తోత్రము రచించి అశ్వినుల మనోరథము పూరించానని 10 మండలం 9 అధ్యాయం 107 సూక్తపు 11 ఋక్కున చెప్పబడింది.
 
    ఇంకా చాలచోట్ల ఋషులు తామే సూక్తాలు రచించినట్లు చెప్పారు. కొన్నిచోట్ల సంపన్నులను నుతించి ధనం పొందినట్లు కూడా ఉంది.
 
    అంతమాత్రాన వేదం మానవప్రోక్తం అందామా ! కాదు అలా అనడానికి వీల్లేదు.
 
    సమస్త చరాచర సృష్టి ఈశ్వరీయం. ఇది సాంతం భగవంతుడు సృష్టించింది. ప్రకృతి సూత్రములు పరాత్పరుడు చేసినవి. మానవుడు పుట్టిననాటినుంచి నేటి వరకు ఇకముందు కూడా ప్రకృతి శాస్త్రాన్ని మార్చజాలడు. మనం ఈనాడు చూస్తున్న మహా మహా ఆవిష్కరణలన్నీ భగవంతుని శాసనానికి అనుగుణంగానే జరిగాయి జరుగుతాయి. మహామహా ఆవిష్కర్తల్లో ఎవరూ సృష్టించింది ఏమీలేదు. వారు ద్రష్టలు మాత్రమే. వారు దర్శించి మనకు అందించారు.
 
    అలాగే ఋషులు సహితం కర్తలుకారు. తాము ద్రష్టలం అని చెప్పుకున్నారు.
 
    ఎంతటి మహా సైంటిస్టైనా ఉన్నదానిని కనుగొనవలసిందే గడ్డిపరకను సృష్టించలేడు! కావున అందరూ ద్రష్టలే!! స్రష్టలు కాలేరు!!!
 
    ఒక్క పరాత్పరుడే సృష్టికర్త. అందువలన శ్రూయతే దృశ్యతేపివా వినిపించేది, కనిపించేదీ సకలం అపౌరుషీయమే! వేద ద్రష్టలను ఋషుల పేర్లు పురాణ ఋషుల పేర్లు కనిపించినా వీరు వారూ ఒకటికారు. నామ సారూప్యమే. వేదాలూ పురాణాలమధ్య కాలవ్యత్యాసం చాలా ఉంది. అందువలన పేరు ఒకటైనంత మాత్రాన ఋషి ఒకడే అనుకోవడానికి వీల్లేదు.
 
    వేద విశ్వామిత్రునికీ - రామాయణ విశ్వామిత్రునికీ - పురాణ విశ్వామిత్రునికీ పేరులో తప్ప సామ్యం కనిపించదు.
 
    ఋగ్వేదంలోని ఋషులకు కోప, తాప, శాపాలు కనిపించవు. పురాణ ఋషులకు మూడూ ఉంటాయి. అసలు కోపమే ప్రధానంగా గల పురాణ ఋషులున్నారు.
 
    వేద, పురాణ ఋషులకు నామసామ్యం తప్ప మరేదీలేదు. వేద ఋషులను పురాణ ఋషులని భ్రమించరాదు.  
 
Like Reply
#14
reserved
Like Reply
#15
reserved
Like Reply
#16
reserved
Like Reply
#17
    పరమేశ్వరుడే సమస్త చరాచర ప్రపంచంలో కంటికి కనిపించేదీ, చెవికి వినిపించే వాటిని అన్నింటినీ ప్రకృతిలో దేనికీ సత్యస్వరూపుడు. శాశ్వతుడు. ప్రకృతిలో దేనికీ సత్యస్వరూపము, శాశ్వతములు లేవు.
 
    భగవానుడు కల్పించిన ప్రకృతినే మానవుడు ఇంతవరకు తెలిసికొనలేక పోయినాడు. ఒక వ్యక్తి తన సమస్త జ్ఞానమున తన మనస్తత్వమును తెలియలేకున్నాడు - గెలుచుట చేతకాని పని !
 
    "లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
 
    నీకము జిత్తమున్ గెలువనేరవు" అన్నాడు భాగవతంలో ప్రహ్లాదుడు.
 
    ప్రకృతిని - తన ప్రకృతిని - ఎరుగలేని దుర్బలాతి దుర్బలుడు మానవుడు. అయినా తనకు అన్నీ తెలుసునని బీరాలు పలుకుతాడు.
 
    మానవుని వద్ద ఒక మహత్తున్నది. అది ఆలోచన. అన్వేషణ. అతడు పుట్టిన్నాటినుంచి అన్వేషిస్తున్నాడు. మానవుని భగవదన్వేషణ ఆగలేదు - ఆగదు. అతనికి భగవంతుడు లభించడు. ఏలనన కూటిలో రాయితీయలేనివాడు ఏటిలోనిరాయి తీయలేడు.
 
    తననే ఎరగనివాడు సకల చరాచర సృష్టికర్తను ఎరుగుట దుర్లభము. కాని అన్వేషణ ఆగదు. అన్వేషణ యందలి భాగమే దేవతలు, మహాత్ములు, ప్రవక్తలు.
 
    వీరిలో ఎవరూ పరాత్పరులుకారు. ఎవరూ సర్వేశ్వరుని సాంతంగా దర్శించలేదు. మహామహులు యోగులు ఋషులు ఆచార్యులు ప్రవక్తలు అందరూ భగవదంశాన్ని మాత్రమే దర్శించగలిగారు.
 
    అంశం తెలియజేయడానికీ తిరువనంతపురపు అనంత పద్మనాభస్వామిని దర్శించడానికి మూడు వాకిళ్లు ఏర్పరచినారు.
 
    అయితే మహాత్ములు చూపిన దేవతలను ఆరాధించడం దోషంకాదు. అతడు అందనివాడు. వారు అందినవారిని మనకు చూపినారు. ఆరాధించడమే మన పని. పరాత్పరుడు సత్యము. దేవతలు విశ్వాసము.
 
    సత్యము కనిపించనపుడు విశ్వాసమే మహత్తము.
 
    సముద్రం చూడనివాడు కూపాన్నే సముద్రం అనుకోవాలి.
 
    దేశంలో ప్రభుత్వం అంతటా ఉంటుంది. గ్రామస్తునికి గ్రామాధికారియే ప్రభుత్వం. శాఖ వానికి శాఖ ప్రభుత్వం అవుతుంది. అందువల్ల అవి మాత్రమే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం వేరే ఉంది. అది సర్వబలోపేత.
 
    గ్రామస్తునికి గ్రామాధికారి వంటి వారే అనేక దేవతలు.
 
    యేప్యన్న దేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః |
    తేపిమా మేమ కౌన్తేయ యజస్త్యని విధిపూర్వకమ్ ||
 
    అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో 9-23లో
 
    ఇతర దేవతల భక్తులు దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాంటివారు నన్నే పూజించినట్లవుతుంది. అయితే అవిధి పూర్వకంగా.
 
    పన్ను వసూలు చేసే వానికి ఇచ్చిన పన్ను ప్రభుత్వానికే చెందుతుంది కదా !
 
    "ఏకం సద్విప్రాబహుధావదంతి" అంటుంది వేదం. ఒకే సత్యాన్ని పండితులు అనేక విధాలుగా చెపుతారు అని.
 
    సత్య స్వరూపం అగోచరం. అలాంటపుడు పండితులు దాన్ని అనేక విధాలుగా చెప్పే అవకాశం ఏది? కాబట్టి పండితులు చెపుతున్నది సత్యపు ఏదో ఒక అంశాన్ని మాత్రమే.
 
    ఏకం సద్విప్రాబహుధా వదంతి, అంటే సూర్యచంద్రాది దేవతలందరు పరమాత్మ స్వరూపులని అర్థంకాదు.
 
సూర్య చంద్ర, గ్రహ, నక్షత్రాది సమస్త సృష్టికర్త భగవానుడు.
 
    భగవానుడు కర్త. సూర్యచంద్రాదులు సృష్టిమాత్రమే. వారు అశాశ్వతులు. వారికి అంతం ఉంది.
 
    తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోనః ప్రచోదయాత్
 
    3-4-62-1 మంత్రద్రష్ట విశ్వామిత్రుడు. " సవిత మా బుద్ధికి ప్రేరణ కలిగించునో ఎవడు సమస్త శ్రుతులందు ప్రసిద్ధుడో అట్టి ద్యోతమాన లోకస్రష్ట యొక్క పరబ్రహ్మాత్మక తేజమును మేము ఉపాసింతుము"
పరింజ్యోతి ఏది? ఏదైనను దానినే ఉపాసింతుము.
ఇదే మనం ప్రస్తుతం ఉపాసిస్తున్న గాయత్రి మంత్రం.
ఋగ్వేదం 10 మండలం 7 అధ్యాయం 121 సూక్తం 1-10 మంత్రాల్లో పరాత్పరుని గుణగణాలను వర్ణిస్తూ "కస్మైదేవాయ హనిషా విధేమ?" అనే ప్రశ్న కనిపిస్తుంది.
 
మానో హింపీజ్జనితాయః పృథివ్యాయోవాదివ సత్యధర్మాజజాన
యశ్వాపశ్చన్ద్రా బ్రహతీర్జనాన కస్మైదేవాయ హవిషావిధేమ
 
ఎవడు భూమిని సృష్టించినాడో ఎవని బలము సత్యమగునో ఎవడు ఆకసమును సృష్టించినాడో ఎవడు ఆనంద వర్ధకమగు విస్తీర్ణ జలరాశిని సృష్టించినాడో అట్టి దేవతకు హవిస్సులు అర్పించవలెను?
[+] 1 user Likes sweet1guy's post
Like Reply
#18
మొదటి అష్టకము

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే ||
ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవావాం ప్రథమా ధ్రువాణి |
నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని సమేత స్థివాంసః ||
మొదటి మండలము
మొదటి అధ్యాయము
మొదటి అనువాకము
మొదటి సూక్తము
ఋషి - వైశ్వామిత్ర మధుచ్చందుడు, దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి.
అ॒గ్నిమీ॑ళే పు॒రోహి॑తం య॒జ్ఞస్య॑ దే॒వమృ॒త్విజ॑మ్ ।
హోతా॑రం రత్న॒ధాత॑మమ్ ॥ ౧.౦౦౧.౦౧
అ॒గ్నిః పూర్వే॑భి॒రృషి॑భి॒రీడ్యో॒ నూత॑నైరు॒త ।
స దే॒వాఁ ఏహ వ॑క్షతి ॥ ౧.౦౦౧.౦౨
అ॒గ్నినా॑ ర॒యిమ॑శ్నవ॒త్పోష॑మే॒వ ది॒వేది॑వే ।
య॒శసం॑ వీ॒రవ॑త్తమమ్ ॥ ౧.౦౦౧.౦౩
అగ్నే॒ యం య॒జ్ఞమ॑ధ్వ॒రం వి॒శ్వతః॑ పరి॒భూరసి॑ ।
స ఇద్దే॒వేషు॑ గచ్ఛతి ॥ ౧.౦౦౧.౦౪
అ॒గ్నిర్హోతా॑ క॒విక్ర॑తుః స॒త్యశ్చి॒త్రశ్ర॑వస్తమః ।
దే॒వో దే॒వేభి॒రా గ॑మత్ ॥ ౧.౦౦౧.౦౫
యద॒ఙ్గ దా॒శుషే॒ త్వమగ్నే॑ భ॒ద్రం క॑రి॒ష్యసి॑ ।
తవేత్తత్స॒త్యమ॑ఙ్గిరః ॥ ౧.౦౦౧.౦౬
ఉప॑ త్వాగ్నే ది॒వేది॑వే॒ దోషా॑వస్తర్ధి॒యా వ॒యమ్ ।
నమో॒ భర॑న్త॒ ఏమ॑సి ॥ ౧.౦౦౧.౦౭
రాజ॑న్తమధ్వ॒రాణాం॑ గో॒పామృ॒తస్య॒ దీది॑విమ్ ।
వర్ధ॑మానం॒ స్వే దమే॑ ॥ ౧.౦౦౧.౦౮
స నః॑ పి॒తేవ॑ సూ॒నవేఽగ్నే॑ సూపాయ॒నో భ॑వ ।
సచ॑స్వా నః స్వ॒స్తయే॑ ॥ ౧.౦౦౧.౦౯
1. అగ్ని మీ"ళే పురోహి'తమ్ యజ్ఞప్య' దేవ మృత్విజ"మ్ | హోతా"రం రత్నధాతమమ్ ||
అగ్ని యజ్ఞమునకు పురోహితుడు. అగ్ని దేవతల ఋత్విజుడు. అగ్ని హోత అగును. అగ్ని సమస్త సంపదల ప్రదాత. అటువంటి అగ్నిని అర్చింతుము.
2. అగ్ని శాశ్వతుడు. అగ్నిని పూర్వఋషులు పూజించినారు. ప్రస్తుత ఋషులు పూజించుకున్నారు. అగ్ని దేవతలను యజ్ఞములకు తోడ్కొని వచ్చును.
3. అగ్ని వలన ధనము, విజ్ఞానము, సంపద, శక్తి, సమృద్ధి సంపద కలుగుచున్నవి. అగ్ని వలన యశస్సు, సంతానము కలుగుచున్నవి.
4. అగ్నియే యజ్ఞములను కాపాడుచున్నవి. ఆ యజ్ఞములు దేవతలకు అందుచున్నవి.
5. అగ్ని హోమద్రవ్యముల కారకుడు అగును. అగ్ని విశేష విజ్ఞానవంతుడు అగును. అగ్ని సత్యము అగును. అగ్ని సకల యశస్వి. అగ్ని దేవతల సహితుడయివచ్చును.
6. అగ్నీ ! నిన్ను యజించువారలకు నీవు శుభములను సమకూర్తువు. ఆ శుభములు మరల నీకే అందుచున్నవి.
7. అగ్నీ ! మేము నిన్ను దివారాత్రములు స్తుతించుచున్నాము. నీవు మా దోషములను దూరము చేయుచున్నావు. మేము నీదరికి చేరుదుము. నీకు నమస్కరింతుము.
8. అగ్ని ప్రకాశవంతుడు. అగ్ని యజ్ఞముల రక్షకుడు. అగ్ని ఫలప్రదాత. అగ్ని గృహములందు నిత్యనివాసి. అట్టి అగ్నికి నమస్కరింతుము.
9. తండ్రి తన సంతానమునకు సకల శుభములు కలిగించును. అగ్నీ ! నీవు మాకు తండ్రివలె సమస్తము సమకూర్చుము.              
ఆలోచనామృతము :
1. నిరంతర అన్వేషణయే జీవితము. వ్యక్తి, కుటుంబ, సమాజ, దేశ, లోక జీవితములందు అన్వేషణమే గోచరించుచున్నది.
అన్వేషణము లేనిదాని కొఱకు కాదు, ఉన్నదానికి కొఱకే. ప్రకృతి తనలో అనంతములయిన రహస్యములను దాచుకున్నది. వాటి కొఱకు అన్వేషణ సాగినది, సాగుచున్నది, సాగనున్నది.
ఒక వస్తువు ఎదుటనే ఉండును. కనిపించదు. వెదుకుచుందుము. ఇది జీవితానుభావము. బాల్యమున బొమ్మలకొఱకు - యవ్వనముల తోడుకొఱకు, సంతానము కొఱకు - వార్థక్యమున శాంతికొఱకు అన్వేషణయే జీవితము. జీవితము ముగియును. అన్వేషణ ముగియదు.
అన్వేషణమే వేదము. ఈ సమస్త చరాచర ప్రకృతికి మూలము ఏది ? ఏది దీనిని కాపాడుచున్నది ? ఏది దీనిని అంతమొందించుచున్నది. వీటిని కనుగొను అన్వేషణమే వేదము. సత్యమును కనుగొనువరకు అన్వేషణ ఆగదు. సత్యము దృగ్గోచరమగుట మానవునకు సాధ్యము కాదు. అయినను అన్వేషణ ఆగదు.
అగ్నియే సమస్తము అనుచున్నాడు.
సృష్టి సమస్తము వెలుగు-వేడి-శక్తి మీద ఆధారపడి ఉన్నది. ఈ మూడును అగ్నివలననే కలుగుచున్నవి. అగ్ని కర్రల మంట మాత్రముకాదు. సూర్యుడు, విద్యుత్తు మున్నగు వెలుగు-వేడి-శక్తిని ఇచ్చునవి అన్నియు అగ్నియే.
సూర్యుని వలన రాత్రి, పగలు కలుగుచున్నవి. మేఘములు వర్షమునకు కారణము అగుచున్నవి. వర్షము వలన సమస్తము ఫలించుచున్నవి. జీవితము నిలుచున్నది. కావున అగ్నియే జీవిత కారకము.
సమస్త పరిశ్రమలు - సాంతము పారిశ్రామిక నాగరికత విద్యుత్తు మీద ఆధారపడి ఉన్నది. విద్యుత్తు అగ్ని అగును. అగ్నియే పరిశ్రమలకు ఆధారమగును.
మనిషి బ్రతుకు వేడియే యగును. వేడి లేనిది మృత్యువు అగును. జీవము లేని దేహమును ఇంట ఉంచరాదు. అందుకే శవము తలవద్ద దివ్వె ! శవయాత్రలో అగ్గి పట్టినవాడు ముందు నడుచును. అగ్ని అగ్రమున ఉన్నది. కావున జీవము ఉన్నట్లు. దేహ దహనము సహితము అగ్నియే చేయుచున్నది.
మనిషి పుట్టినది మొదలు గిట్టు అగ్నియే ఆధారమయి ఉన్నది.
3. మానవుడు బయటికి కనిపించేవాడు మాత్రంకాడు. అతనికి అంతరము ఉన్నది. అదియే వాస్తవ మానవుడు.
వేదమునకు సహితము బాహిరము - అంతరము ఉన్నవి. బాహిరర్థములు వేరు. అంతరార్థములు వేరు. రెంటిని తెలుసుకొనవలసి ఉన్నది. గ్రహించవలసిన స్థూల పద్ధతి :- (i) అగ్నిమయము. కనిపించునది. ఈ అర్థమున అగ్ని కంటికి కనిపించు మంట - శక్తి అగును. (ii) మనోమయము. కంటికి కనిపించదు. కాని వంటిలో ఉండును. జఠరాగ్నివంటిది. దీనిని ఎరుగుట. (iii) జ్ఞానమయము. బయట - లోన ఉన్న అగ్ని యొక్క స్వరూప స్వభావ పరిజ్ఞానము. (iv) ఆనందమయము. తనలోని జ్యోతిని ఎరిగి జ్యోతి కరాకమయిన పరాత్పరుని ఎరుగుట.
వేదమును ఇట్లు అర్థము చేసికొనవలెను.
4. సమస్త సృష్టి, స్థితి, లయములకు పంచభూతములు (భూమి, నీరు, వెలుగు, వాయువు, ఆకాశము) ఆధారములు. మన మహర్షులు భూతములు ప్రాణముగలవని భావించినారు. మానవులకు వలెనే భూతములకు ఆవేశకావేషములు, అనురాగ అనుగ్రహములు ఉన్నవని గ్రహించినారు. వాస్తవముగా వానికి క్రోధము ఉన్నదని తుఫానులు, భూకంపములవంటివి వచ్చినపుడు గ్రహించవచ్చును. మంచి మనసునకు భూతములు పులకించును అను విషయము విజ్ఞానము ఇప్పటికి గ్రహించలేదు. ముందు గ్రహించవలసి వచ్చును.
భూతములను మనము సంతోషపరచిన అవి మనసు సంతోషపరచును.
ప్రస్తుత కాలమున మానవుడు పంచ భూతములకు దుఃఖము కలిగించుచున్నాడు. దుఃఖమును అనుభవించుచున్నాడు.
5. నరునకుగల మానవతా లక్షణములలో కృతజ్ఞత ప్రధానమయినది. మనకు ఉపకారము చేయు వానిని తలచుకొనుట, ప్రత్యుపకారముచేయుట కృతజ్ఞత అగును. ఉపకారిని తలచకుండుట, ప్రత్యుపకారము చేయకుండుట కృతఘ్నత.
రామాయణమున రాముడు వాలిని వధించి సుగ్రీవునకు ఉపకారము చేసినాడు. సుగ్రీవుడు రాజ్యమును, రమణులను పొందినాడు. ఉపకారము మరచినాడు. రాముడు సుగ్రీవునకు గుర్తుచేయదలచినాడు. లక్ష్మణుని పంపినాడు. లక్ష్మణుడు సుగ్రీవునకు కృతఘ్నతను ఎరుకపరచినాడు.
బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా |
నిష్కృతిర్వహితా సద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః ||
బ్రహ్మహత్యకు, సురాపానమునకు, దొంగతనమునకు, వ్రతభంగమునకు పెద్దలు ప్రాయశ్చిత్తము విధించినారు. కృతఘ్నతకు నిష్కృతిలేదు.
శ్రీమహా భారతమున 'కృతఘ్నుని మాంసము కుక్కలు సహితము తినవు' అను ఒక కథ ఉన్నది. కావున మనిషి అయినవాడు ఉపకారమును తలచుకొనవలసి ఉన్నది.  
పంచభూతములు మనకు అనంతములయిన ఉపకారము చేయుచున్నవి. పంచభూతములకు కృతజ్ఞత తెలియపరచుట మానవుని కనీస కర్తవ్యము. కృతజ్ఞత సంకేతము మాత్రమే. పరమాత్ముడు మనకు ప్రసాదించినదే మనము స్వామికి అర్పింతుము. పత్రం, పుష్పం,
వేదము యజ్ఞమును విధించినది. యజ్ఞముచేసి కృతజ్ఞత తెలియపరచమన్నది.
6. పురోహితుడు అనగా పూర్వము ఉండినవాడు. సృష్టికి పూర్వము ఉన్నవాడు. పరాత్పరుడు. ఈశ్వరుడు.
పురోహితుడు యజ్ఞమునకు అవసరము అయిన పదార్థములను సేకరించువాడు.
పురోహితుడు ముందు జరగవలసిన హితమును ఎరుగువాడు. ఎరుకచెప్పువాడు. హిత కార్యములు చేయించువాడు. పురోహితము ఒక సంస్థ అయినది. ఒక వ్యవస్థగా ఏర్పడినది. ఇది సమాజమునకు ఉపకరించుటకు ఏర్పడిన వ్యవస్థ.
పురోహితుడు సామాజిక శాస్త్రజ్ఞుడు. ఒక వ్యక్తి, ఒక సంఘపు సుఖ దుఃఖములను వినువాడు. సుఖ జీవనమునకు అవసరమగు సలహాలు ఇచ్చువాడు. అతడు ఆచార్యునివలె, వైద్యునివలె, మిత్రునివలె ఉపకరించువాడు.
ఈనాడు వాస్తవ పురోహితుని అవసరము సమాజమునకు ఎంతయిన ఉన్నది. ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవమున పురోహిత వ్యవస్థ అంతమైనది. అందుకు గోల్డ్ స్మిత్ మహాకవి విలపించినాడు. పాశ్చాత్య నాగరికత ప్రభావమున మనము పురోహిత వ్యవస్థను రూపుమాపినాము.
పారిశ్రామిక నాగరకత ప్రకృతిలోని, మానవునిలోని మంచి విలువలను లుప్తము చేసినది. ఆధునిక మానవుడు అంతరించిన విలువల కొఱకు అన్వేషణ ప్రారంభించినాడు. మానసిక వ్యధలను భరించలేకున్న మనిషి, తిరిగి పురోహిత వ్యవస్థను గుర్తించు దిశలో పయనించుచున్నాడు.
సృష్టి సాంతము వలయము వంటిది. కావున బయలుదేరిన చోటికి చేరుట అనివార్యము. వేదము చూపిన పురోహితము, మరల ఊపిరి పోసికొన వచ్చును.
7. హోత - యజ్ఞమును చేయించువాడు.
8. ఋషి - ఈ విశ్వము - విశ్వాంతరాళము - గ్రహములు - నక్షత్రములు మున్నగు సమస్తము సర్వేశ్వరుని సృష్టియే ! మానవుడు ఇంతవరకు దేనినీ కొత్తగా సృష్టించలేదు. సృష్టించలేడు. మానవుడు ఉన్నదానినే కనుగొన్నాడు. అతడు కనుగొన్నది భగవంతుని సృష్టిలో ఆవగింజంత. అంతకే తృళ్లిపడుచున్నాడు. తనను తాను ధ్వంసము చేసికొనుచున్నాడు.
వేదము మానవ నిర్మితము కాదు. వేదము అపౌరుషేయము. వేదము శ్రుతి. విన్నది మాత్రమే. వేదమునందలి మంత్రములను, సూక్తములను ఋషులు కనుగొన్నారు. వారు ద్రష్టలు-చూచినవారు; స్మర్తలు- గుర్తుంచుకున్నవారు మాత్రమే.
వేదములందరి ఋషులపేర్లు అనంతర కాలమున పురాణములకు ప్రాకినవి. వేదములకు ఆదిలేదు. పురాణములు ఈ మధ్యవి. వేదములందలి ఋషులు, పురాణములవారని భ్రమించరాదు. వేదములందలి ఋషుల పేర్లను పురాణములందు వాడుకున్నాము.
అమ్మ మనకు అన్నము తినుట నేర్పినది. మనకు తినుట వచ్చినది. నిత్యము తినుచున్నాము. అమ్మ మనకు తినుట నేర్పినదని గుర్తించుచున్నామా ! అట్లనిన అమ్మలేదనియా ! ఉన్నది. మనము మరచినాము. అమ్మవలె మానవునకు సమస్తము వేదమే నేర్పినది. మానవుడు సమస్తము వేదమునుండి నేర్పినాడు. వేదమును తల్లివలె మరచినాడు. స్తుతోమయా వేదమాతా అంటున్నది వేదము.
9. పితేవ సూనవే తండ్రి తనయుని చూచినట్లు తనను చూడమని అగ్నిని ప్రార్థించుచున్నాడు!
తండ్రి తనయునకు సమకూర్చనిది లోకమునందున్నదా! జీవితము సహితము సమస్తము తండ్రి సమకూర్చినదే కదా ! తనయుని కొఱకు ప్రాణములు అర్పించిన తండ్రులు ఉన్నారు.
 
పుత్రులు చెడ్డవారు ఉందురు.
తండ్రులు చెడ్డవారు ఉండరు.





[+] 2 users Like sweet1guy's post
Like Reply
#19
రెండవ సూక్తము
ఋషి - వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, దేవతలు - 1-3 వాయువు,4-6 ఇంద్రవాయువులు, 7-8 మిత్రావరుణులు, ఛందస్సు - గాయత్రి.
వాయ॒వా యా॑హి దర్శతే॒మే సోమా॒ అరం॑కృతాః ।
తేషాం॑ పాహి శ్రు॒ధీ హవ॑మ్ ॥ ౧.౦౦౨.౦౧
వాయ॑ ఉ॒క్థేభి॑ర్జరన్తే॒ త్వామచ్ఛా॑ జరి॒తారః॑ ।
సు॒తసో॑మా అహ॒ర్విదః॑ ॥ ౧.౦౦౨.౦౨
వాయో॒ తవ॑ ప్రపృఞ్చ॒తీ ధేనా॑ జిగాతి దా॒శుషే॑ ।
ఉ॒రూ॒చీ సోమపీతయే ॥ ౧.౦౦౨.౦౩
ఇన్ద్ర॑వాయూ ఇ॒మే సు॒తా ఉప॒ ప్రయో॑భి॒రా గ॑తమ్ ।
ఇన్ద॑వో వాము॒శన్తి॒ హి ॥ ౧.౦౦౨.౦౪
వాయ॒విన్ద్ర॑శ్చ చేతథః సు॒తానాం॑ వాజినీవసూ ।
తావా యా॑త॒ముప॑ ద్ర॒వత్ ॥ ౧.౦౦౨.౦౫
వాయ॒విన్ద్ర॑శ్చ సున్వ॒త ఆ యా॑త॒ముప॑ నిష్కృ॒తమ్ ।
మ॒క్ష్వి౧॒॑త్థా ధి॒యా న॑రా ॥ ౧.౦౦౨.౦౬
మి॒త్రం హు॑వే పూ॒తద॑క్షం॒ వరు॑ణం చ రి॒శాద॑సమ్ ।
ధియం॑ ఘృ॒తాచీం॒ సాధ॑న్తా ॥ ౧.౦౦౨.౦౭
ఋ॒తేన॑ మిత్రావరుణావృతావృధావృతస్పృశా ।
క్రతుం॑ బృ॒హన్త॑మాశాథే ॥ ౧.౦౦౨.౦౮
క॒వీ నో॑ మి॒త్రావరు॑ణా తువిజా॒తా ఉ॑రు॒క్షయా॑ ।
దక్షం॑ దధాతే అ॒పస॑మ్ ॥ ౧.౦౦౨.౦౯
1.వాయువా! నీవు దర్శనీయుడవు. నీ కొఱకు సోమములు సిద్ధముచేసి ఉంచినాము. నిన్ను ఆహ్వానించుచున్నాము. యజ్ఞమునకు విచ్చేయుము. సోమమును స్వీకరించుము.
2. ఋత్విజులు యజ్ఞవేత్తలు. మంత్రయుక్తముగ సోమమును సిద్ధము చేసినారు. వాయువా! నిన్ను స్తుతించుచున్నారు.
3. వాయువా ! నీవాక్కు శ్రవణపేయము. నీవాక్కు సోమమును వర్ణించును. నీవాక్కు సోమపానమునకు సాగును.
4. ఇంద్రవాయువులారా ! మీ కొఱకు సోమమును సిద్ధపరచినాము. సోమములు మీ కొఱకు నిరీక్షించుచున్నవి. మాకు ఆహారములు ప్రసాదించుటకు విచ్చేయుడు. సోమమును పరిగ్రహింపుడు.
5. ఇంద్రవాయువులారా ! మా కొఱకు ఆహారములను గొనిరండు. మీ కొఱకు సోమము సిద్ధముగా ఉన్నది. త్వరితగతిని విచ్చేయుడు.
6. ఇంద్రవాయువులారా ! మీ కొఱకు సోమమును సంస్కరించినాము, సిద్ధపరచినాము. మీరు ఉభయులు మానవ రూపములు దాల్చి విచ్చేయుడు. మీ యజ్ఞము సంపూర్ణము అగును.
7. పవిత్రమగు బలము కలవాడు మిత్రుడు. శత్రువును హింసించగలవాడు వరుణుడు. ఉభయులు వర్షము కురిపించగలవారు. మిమ్ము ఆహ్వానించుచున్నాను.
8. మిత్రావరుణులారా ! మీరు జలధరులు, నీటిని ధరించువారు, వర్షమును కురిపించువారు. మీరు ఉభయులు ఈ మహాయజ్ఞమునకు విచ్చేయుడు. క్రతుం బృంహంత మాశాథే.
9. మిత్రావరుణులారా ! మీరు మేధావంతులు. ఉపకార స్వభావము కలవారు. మంచి నివాసములు గలవారు. మీరు మా బలమును, యత్నములను వృద్ధిచేయుడు.
ఆలోచనామృతము :
1. అన్వేషణము అనంతము, నిరంతరము. నవీనములను ఎరుగుటయే అన్వేషణము. అగ్నియే సమస్తము అని అగ్నిని ఉపాసించినాడు. వాయువు, వర్షము సహితము జీవమునకు ఆధారములు అగును. వాయువు, జలము శక్తి ఉత్పత్తికి కారణములు అగును. ఏ ఒక్కటీ సమస్త జీవమునకు ఆధారముకాదు. ఒక్కొక్కదానిని వివరించుచున్నాడు.
2. వాయువులు, మరుత్తులు జీవహేతువులు. మరుత్తులకు మెరిసిపోవు ఆయుధములు-- మెరుపులు; వేగవంతములయిన రథములు- ఉరుములు; విలువయిన ఆభరణము-ఇంద్ర ధనుస్సులు ఉన్నవి. వాయువులు వర్షకారకములు.
3. ఇంద్రుడు : ఇంద్రజ్యేష్ఠో మరుద్గణ: ఇంద్రుడు మరుత్తులకు అన్న అగును.
య ఇందతి పరమైశ్వర్యాన్ భవతి స ఇంద్రః సకల ఐశ్వర్యములు కలవాడు. అతనిని మించిన ఐశ్వర్యవంతుడు లేడు. ఇంద్రుడు జ్ఞానవంతుడు, బలవంతుడు.
ఇంద్రచ్ఛత్రూణాం దారయితావా ద్రావయితావా ఇంద్రుడు శత్రువులను నాశనము చేయువాడు. పారద్రోలువాడు. ఈ శత్రువులు బాహిరములు కావచ్చును. ఆంతరికములు కావచ్చును.
ఇంద్రుడు "శతక్రతు" నూరు క్రతువులు చేసినవాడు. కర్మ ఫలాపేక్షగలది క్రతువు. ఫలాపేక్ష రహితమైనది, నూటికి నూరుపాళ్ళు ఫలాపేక్షలేనిది క్రతువు.
ఇంద్రుడు వర్షాధిదేవత, జ్ఞానాధిదేవత, ఆనందాధిదేవత.
4. మిత్రుడు : "పూతదక్షం" పవిత్రమైన బలము కలవాడు. మంచి పనులకు మాత్రము ఉపయోగపడునట్టి బలము కలవాడు. మేదయతి, స్నిహయతి, స్నేహయతే నా సమిత్రః ప్రేమించువాడు, స్నేహించువాడు, స్నేహము కనబరచువాడు మిత్రుడు.
5. వరుణుడు : 'వర్ణే' ఎన్నుకొనువాడు. శిష్టైర్ముముక్షుభిర్విప్రియతే వా స వరుణః శిష్టులు తమ యజ్ఞములకు ఆరాధనలకు ఎన్నుకున్నవాడు వరుణుడు. ఎన్నుకున్నవారిని మాత్రమే, శిష్టులను మాత్రమే అనుగ్రహించువాడు వరుణుడు. వరుణుడు సకల సంపదలు కలవాడు. పూజనీయుడు. అతడు వరుణరాజు.
6. సోమము : సోమము సూర్యుడు అగును. చంద్రుడు అగును. ప్రకాశమునకు సూర్యుడు, సౌందర్యమునకు చంద్రుడు అగును. ఇది సకల దాహములకు, బాధలకు వ్యాధులకు నివారకమగు జ్ఞాన విజ్ఞానామృతము. ఈ అమృతమును ఎరిగినవారు ఆనందమయులు.
సోమము ఒక ఓషధి. అది మాదకము, పుష్టివర్ధకము. ఈ ఓషధి ఆకులు చంద్రుని పెరుగుటను బట్టి పెరుగును. తరుగుటను బట్టి తరుగును. ఈ ఓషధిని రాతిమీద నూరి చేయు పానీయము సోమరసము. సోమరసము దేవతలకు ప్రియమయిన పానీయము. యజ్ఞములందు సోమము సిద్ధముచేసి దేవతలకు అర్పింతురు.
అతిథికి ప్రియమయినది ఎరిగి అర్పించుట యజమాని ధర్మము. కర్తవ్యము.
7. మిత్రుడు ఎటువంటివాడు కావలెనో ఉపదేశించినాడు. మిత్రుడు బలము గలవాడు, శత్రువును దూరము చేయగలవాడు, హర్షము కలిగించువాడు కావలెను.
అటువంటి మిత్రులు ఉన్న జీవితము సుఖప్రదము అగును. జీవితమును సుఖప్రదము చేయుటయే వేదము యొక్క ప్రధాన లక్ష్యము.
[+] 3 users Like sweet1guy's post
Like Reply




Users browsing this thread: