Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
'కళావాచస్పతి' కొంగర జగ్గయ్య
#1
కళావాచస్పతి'
కొంగర జగ్గయ్య 
31-12-1928   5-3-2004
★★★★★★★★★★★★
ప్రముఖ తెలుగు సినిమా, 
రంగస్థల నటుడు, 
రచయిత, పాత్రికేయుడు, 
మాజీ పార్లమెంటుసభ్యుడు 
మరియు 
ఆకాశవాణిలో తొలితరం 
తెలుగు వార్తల చదువరి. 
సినిమాలలోను, 
అనేక నాటకాలలోను 
వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు 
జగ్గయ్య సుపరిచితులు. 
మేఘ గంభీరమైన ఆయన 
కంఠం కారణంగా ఆయన 
'కంచు కంఠం'జగ్గయ్యగా, 
'కళా వాచస్పతి'గా 
పేరుగాంచారు.


జగ్గయ్య గుంటూరు జిల్లాలోని 
తెనాలికి సమీపంలో 
దుగ్గిరాల దగ్గర 
మోరంపూడి అనే గ్రామంలో, 
1928, డిసెంబర్ 31 న 
ధనవంతుల కుటుంబంలో 
జన్మించారు. 
11 సంవత్సరాల 
అతి పిన్న వయసులోనే 
రామాయణంలోని 'లవుడి' పాత్రను 
బెంగాలీ రచయిత 
ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన 
'సీత' అనే ఒక హిందీ నాటకంలో 
పోషించారు.

విద్యార్ధిగా ఉన్నప్పుడే తెనాలిలో 
కాంగ్రెసు పార్టీ లో చేరి 
భారత స్వాతంత్ర్య పోరాటంలో 
చురుకుగా పాల్గొన్నాడు. 
పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే 
కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపు కు 
తెనాలి లో సెక్రటరీగా పనిచేసారు. 
ఆ సమయంలో నాగపూరు 
తదితర ప్రాంతాల్లో జరిగే 
పార్టీ సదస్సులకు హాజరై 
ఆ సదస్సుల్లో పార్టీ చేసే 
తీర్మానాలను తెలుగులోకి 
అనువదించి, 
వాటిని సైక్లోస్టైల్ తీయించి 
ఆంధ్రదేశంలో పంచిపెట్టేవారు. 
ఇంటర్మీడియట్ తరువాత 
కొంత కాలం 'దేశాభిమాని' 
అనే పత్రికలో 
ఉప సంపాదకుడిగానూ, 
ఆ తర్వాత 'ఆంధ్రా రిపబ్లిక్' అనే 
ఆంగ్ల వారపత్రికకు 
సంపాదకుడిగానూ 
పని చేశారు.

ఉన్నత చదువులకు గుంటూరు లోని 
ఆంధ్రా క్రిస్టియను కళాశాల లో చేరారు. 
ఇక్కడే నందమూరి తారక రామారావు తో 
పరిచయం ఏర్పడినది. 
ఈ కాలేజీలో ఎన్.టి.రామారావు, 
కొంగర జగ్గయ్య ఇద్దరు సహ విద్యార్థులు. 
వీళ్ళిద్దరూ కలిసి 
ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. 
జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు 
వరుసగా ఉత్తమ నటుడు 
పురస్కారం పొందారు. 
ప్రముఖ చిత్రకారుడు 
అడవి బాపిరాజు వద్ద 
చిత్రలేఖనంలో శిక్షణ పొందారు. 
విజయవాడ లో 
అరుణోదయ, 
నేషనల్ ఆర్ట్ థియేటర్స్ 
సంస్థల తరపున నాటకాలు వేశారు. 
డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న 
దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా 
ఉద్యోగమొచ్చింది. 
అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే 
రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం, 
నాటకాలు వేయడం చేస్తుండేవారు. ఎన్.టి.రామారావుతో కలిసి 
విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి 
ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. 
బుచ్చిబాబు వ్రాసిన
'దారిన పోయే దానయ్య' నాటిక 
వీరికి బాగా పేరు తెచ్చి పెట్టింది. 
ఆ తర్వాత ఢిల్లీలో 
ఆల్ ఇండియా రేడియోలో 
మూడు సంవత్సరాలపాటు 
వార్తలు చదివే ఉద్యోగం చేసారు. 
అక్కడ కూడా తెలుగువాళ్ళను పోగేసి 
నాటకాలు వేశారు. 
దుగ్గిరాల హైస్కూలులో పని చేసే టప్పుడే
'ఢిల్లీ రాజ్య పతనం' అనే నాటకంలో 
జమున తో వేషం వేయించారు జగ్గయ్య గారు.


త్రిపురనేని గోపిచంద్ తీసిన 
'ప్రియురాలు' సినిమాతో జగ్గయ్య 
సినిమాలలో అరంగేట్రం చేసారు. 
అయితే ఈ సినిమాగానీ, 
దీని తదుపరి చిత్రాలు కాని 
పెద్దగా విజయం సాధించలేదు. 
సినిమాల కోసం 
మొదట రేడియో ఉద్యోగానికి 
ఒక సంవత్సరం సెలవు పెట్టారు. 
తర్వాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిశ్చయించుకుని 
ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. 
'అర్ధాంగి' మరియు 'బంగారు పాప' 
చలన చిత్రాల విజయంతో 
మళ్ళీ వెలుగులోకి వచ్చారు. 
1950ల నుండి 1970ల వరకు 
తెలుగు చిత్ర పరిశ్రమకు 
ఎనలేని సేవ చేసారు. 
మరణించేవరకు కూడా 
అప్పుడప్పుడు సినిమాలలో 
నటిస్తూనే ఉండేవారు.
 
కొన్ని చలన చిత్రాలలో 
కథానాయకునిగా, 
ఎక్కువ చిత్రాలలో సహాయనటునిగా, 
హాస్య పాత్రలలో మరియు 
ప్రతినాయకుని పాత్రలలో నటించారు. 
"కళాకారుడు తనలోని 
కళాదాహాన్ని తీర్చుకోవడానికి 
రొటీన్ హీరో పాత్రలు సరిపోవు." అని 
నమ్మిన వారు కాబట్టే 
ఆయన విభిన్నమైన పాత్రల మీద 
ఆసక్తి చూపించారు. 
అలా కొన్నిసార్లు 
తనకు హీరో పాత్ర 
ఇవ్వచూపిన వాళ్లను కూడా 
అదే కథలోని కొంచెం క్లిష్టమైన 
లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని 
అడిగేవారు!
అప్పట్లో సాంఘిక చిత్రాల్లోని 
ప్రతినాయక పాత్రలు కూడా 
పౌరాణిక ప్రతినాయక 
పాత్రల్లానే ఉండేవి. 
ఆ పద్ధతి మార్చాలని జగ్గయ్య 
ప్రతినాయక పాత్రలను ఎంచుకున్నారు. కథానాయకుడు అందంగా ఉంటే 
ప్రతినాయకుడు కూడా 
అందంగానే ఉంటాడు. 
మన మధ్య తిరిగే మామూలు 
మనిషిలానే ఉంటాడు. 
అలా చూపించాలనే ఆయన 
ప్రతినాయక పాత్రలు చేశారు. 
ప్రతినాయకుడు అంటే, 
వికారంగా, కౄరంగా ఉండాలనే 
అభిప్రాయం పోగొట్టాడు. 
"విలన్ కూడా లవబుల్ గానే ఉండాలి. 
అప్పుడే అతను మరిన్ని 
మోసాలు చేయగలడు. 
అలాంటి పాత్రల్లో అభినయ సునిశితత్వాన్నిప్రదర్శించడానికి 
మంచి అవకాశముంటుంది." అనేది 
ఆయన అభిప్రాయం. 
ఆయన దాదాపు 
500 చిత్ర్రాల్లో నటించారు. 
ఆయన నటించిన 
ఏకైక తమిళ చిత్రం శివగామి.

 
జగ్గయ్య గురించి చెప్పేటప్పుడు 
ఆయన కంఠం గురించి 
ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
గంభీరమైన తన కంఠాన్ని 
ఎంతోమందికి అరువు ఇచ్చారు. 
100కు పైగా సినిమాలలో 
డబ్బింగు చెప్పారు. 
తమిళ చిత్రరంగ ప్రముఖుడైన 
శివాజీ గణేశన్ నటించిన 
తెలుగు సినిమాలలో 
జగ్గయ్యే ఆయనకు 
గాత్రధారణ చేసేవారు. 
అంతేకాదు తెలుగులోకి 
డబ్బింగు చేసిన 'జురాసిక్ పార్క్' అనే
ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు 
తన గాత్రాన్ని అరువు ఇచ్చారు.


జగ్గయ్య విద్యార్థిగా ఉన్నప్పుడే 
రాజకీయాలలో చాలా 
చురుకుగా ఉండే వారు. 
1967 లో నాలుగవ లోక్‌సభ కు 
జరిగిన ఎన్నికలలో 
ఒంగోలు నియోజక వర్గం నుండి 
కాంగ్రెసు పార్టీ తరుపున పోటీ చేసి, 
80 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.  
ఒంగోలు నియోజకవర్గం
కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. 
అయినా పెద్దల ఆశీస్సులతో, 
పరిశ్రమ వర్గాల ప్రోత్సాహంతో 
ధైర్యంగా రంగంలోకి దిగి గెలుపొందారు. 
అలా జగ్గయ్య లోక్‌సభకు ఎన్నికైన 
తొలి భారతీయ సినీనటుడు అయ్యారు.  


నోబెల్ పురస్కారము అందుకున్న 
రవీంద్రుని గీతాంజలిని 
'రవీంద్ర గీతా' అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. 
గీతాంజలికి ఇది 
తొలి తెలుగు అనువాదం. 
రవీంద్రనాథ ఠాగూరు రాసిన 
నాటకం సాక్రిఫైస్ (Sacrifice) ను 
తెలుగులోకి 'బలిదానం' అనే 
పేరుతో అనువదించారు.

పురస్కారాలు, సన్మానాలు
★★★★★★★★★★ 
•  భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 
    'పద్మభూషణ్' తో సత్కరించింది.
•  ఢిల్లీ లోని సంస్కృత విశ్వవిద్యాలయం 
   'కళావాచస్పతి' అనే బిరుదుతో
   జగ్గయ్యను సత్కరించింది.
•  తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 
   'గౌరవ డాక్టరేటు'తో సత్కరించింది.
•  తమిళనాడు ప్రభుత్వం 'కలైమామణి' 
   బిరుదు నిచ్చింది.
•  ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ'
   బిరుదుతో సత్కరించింది.

పాత్రికేయుడిగా,
పత్రికా సంపాదకుడిగా,
రంగస్థల, సినీనటుడిగా, 
సినిమా నిర్మాతగా,
రాజకీయవేత్తగా,రచయితగా 
ఇలా బహుముఖ
ప్రజ్ఞను ప్రదర్శించిన 
ప్రతిభామూర్తి జగ్గయ్య
2004, మార్చి 5 న 
76 సంవత్సరాల వయసులో 
చెన్నైలో గుండెపోటుతో 
కన్నుమూశారు.

      -పి.లక్ష్మీ నరసింహారావు,
         సికింద్రాబాదు

    【సాంకేతిక సహకారం:
     శ్రీ ఎ.వెంకట్,ఫోటో మేజిక్, 
     మండపేట,తూర్పుగోదావరి జిల్లా】
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)