13 ఏళ్లకే సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు !
Eenaadu Dt: 2018 Dec 16 Wrote:దుబాయ్: తొమ్మిదేళ్ల వయసులోనే మొబైల్ యాప్ ఆవిష్కరించి అందరితో ఔరా! అనిపించుకున్నాడు ఆదిత్యాన్ రాజేశ్.
ఇప్పుడు 13 ఏళ్ల వయసులో ఏకంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీయే ప్రారంభించేశాడు. ఈ కుర్రాడిది భారతదేశమే. పుట్టింది కేరళలో.
అతడికి ఐదేళ్ల వయసులో కుటుంబమంతా దుబాయ్ వెళ్లిపోయింది. స్నేహితులు ఎవ్వరూ లేకపోవడంతో కంప్యూటర్తో చెలిమి
చేశాడు. యాప్ తయారు చేసి పత్రికలకెక్కాడు. ఇప్పుడు ‘ట్రైనెట్ సోల్యూషన్స్’ పేరుతో సొంత కంపెనీ ఆరంభించాడు.
‘నేను కేరళలోని తిరువిల్లాలో పుట్టా. నాకు ఐదేళ్లున్నప్పుడు కుటుంబమంతా దుబాయ్కు వచ్చింది. మా నాన్న నాకు
తొలుత చూపించిన వెబ్సైట్ బీబీసీ టైపింగ్. చిన్నారులు, విద్యార్థులు టైపింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
కంపెనీ స్థాపించాలంటే యజమానికి కనీసం 18 ఏళ్లు ఉండాలి. వయసు లేనప్పటికీ మేం కంపెనీ తరహాలోనే పనిచేస్తాం.
ఇప్పటికే 12 మంది వినియోగదారులతో పనిచేస్తున్నాం. డిజైనింగ్, కోడింగ్ సేవల్ని ఉచితంగా అందిస్తున్నాం’ అని ఆదిత్యాన్
రాజేశ్ అన్నాడు. ప్రస్తుతం అతడి కంపెనీలో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు. వారంతా అతడి పాఠశాల స్నేహితులే !
తొమ్మిదేళ్ల వయసులో రాజేశ్ ఆవిష్కరించిన యాప్ ‘ఆశీర్వాద్ బ్రౌజర్’. ఇది అచ్చంగా గూగుల్ క్రోమ్ను పోలి ఉంటుంది.
కస్టమైజేషన్ తక్కువగా ఉంటుంది. ఆండ్రాయిడ్ స్టూడియోను ఉపయోగించి దీనిని రూపొందించాడు. గూగుల్ ప్లే స్టోర్లో
అప్లోడ్ చేయాలంటే కనీసం 25 డాలర్లు కావాలి. డబ్బులు లేకపోవడంతో ప్లే స్టోర్ తరహాలో ఉండే ‘యాప్టాయిడ్’
మార్కెట్ప్లేస్లో ఉంచాడు.