Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#17
ఇలియడ్


హోమర్ రాసిన ఇలియడ్‌లో కథనం గ్రీసు సేనలకి, ట్రాయ్ సేనలకి మధ్య యుద్ధం తొమ్మిదో సంవత్సరంలో ఉండగా మొదలవుతుంది. కవి సాహిత్యాధిదేవత అయిన మూజ్‍ని (Muse) ప్రార్థించి గ్రీకు యోధులలో అగ్రేసరుడైన ఎఖిలీస్ కోపోద్రేకాలకి కారణమేమిటో చెప్పడంతో గ్రంథ రచన ప్రారంభం అవుతుంది. యుద్ధం మొదలయి తొమ్మిదేళ్లు గడచిన తరువాత గ్రీకు సైన్యం ట్రాయ్ మిత్రరాజ్యం అయిన క్రిసిని ముట్టడించి లొంగదీసుకుంటుంది. ఈ సందర్భంలో ఓడిపోయిన రాజ్యానికి చెందిన ఇద్దరు కన్యలు–క్రిసేయిస్ (Chryseis), బ్రెసేయిస్ (Briseis)–గ్రీకుల వశం అవుతారు. గ్రీకుల సేనాధిపతి అగమెమ్నాన్ క్రిసేయిస్‌ని తనకి దక్కిన బహుమానంగా తీసుకుంటాడు. ఏఖిలీస్ బ్రెసేయిస్‌ని తీసుకుంటాడు. క్రిసేయిస్ తండ్రి క్రిసెస్–సాక్షాత్తు ఒలింపియను దేవుడైన అపాలోకి (Apollo) హితుడు–కూతురు బంధ విమోచనకి అగమెమ్నాన్‍కి ఎంతో విలువైన నగలు, ఆభరణాలు పణంగా పెడతాడు కానీ అగమెమ్నాన్ లొంగడు. తన హితునికి ఎదురవుతున్న పరాజయం చూడగానే అపాలోకి కోపం వచ్చి అగమెమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి పడాలని శపిస్తాడు.

తమ సేనలు ఎండలలో పిట్టలలా రాలిపోతూ ఉంటే చూసి కంగారుపడి, ఎఖిలీస్ దైవజ్ఞులని సంప్రదించగా, కాల్చస్ (Calchas) అనే దైవజ్ఞుడు లేచి, ఇదంతా అపాలో శాపం వల్ల జరుగుతోంది అని చెబుతాడు. అప్పుడు అగమెమ్నాన్ అయిష్టంగానే క్రిసేయిస్‌ని వదలుకుందుకి ఆమోదిస్తాడు; కానీ ఒక మెలిక పెడతాడు. ఏమిటా మెలిక? తాను క్రిసేయిస్‌ని వదులుకుంటే ఆ స్థానంలో ఎఖిలీస్ తనకి బ్రెసేయిస్‌ని ఇచ్చెయ్యాలి! ఈ వంకాయల బేరం విని ఎఖిలీస్ కోపోద్రేకుడయి, కత్తి దూసి, అగమెమ్నాన్‌తో ద్వంద్వ యుద్ధానికి తయారవుతాడు. ఒక పక్క ట్రాయ్ సేనలు భీకర పోరాటంలో ఉండగా ఈ గిల్లికజ్జాలు ఏమిటని కాబోలు ఒలింపియను దేవత హేరా ఈ యోధుల మధ్య సంధి కుదర్చమని ఎథీనాని పంపుతుంది. నెస్టర్ సహాయంతో ఎథీనా చేసిన హితోపదేశం ఎఖిలీస్ కోపాన్ని చల్లార్చుతుంది. తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తాను ఇటుపైన యుద్ధం చెయ్యనని ప్రతిన పూని తన గుడారానికి చేరుకుంటాడు. ఎఖిలీస్ తన కోపం చల్లారక ముందే తన తల్లి అయిన సముద్రపు జలకన్య థేటిస్‌ని పిలచి తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం చెయ్యడానికి దేవతల రాజైన జూస్ నుండి సహాయం అర్థించమని అడుగుతాడు.

ఇది ఇలా ఉండగా అగమెమ్నాన్ క్రిసేయిస్‌ని ఆమె తండ్రి దగ్గరకు పంపేసి, బ్రెసేయిస్‌ని తన దగ్గరకి రప్పించుకుంటాడు. ఒడీసియస్ తన పడవలో క్రిసేయిస్‌ని తీసుకువెళ్ళి ఆమె తండ్రికి అప్పగించగా, అతను సంతృప్తి చెందినవాడై గ్రీకు సైనికులని శాపం నుండి విముక్తి చెయ్యమని అపాలోని కోరుకుంటాడు. గ్రీసుకీ ట్రాయ్‌కి మధ్య తాత్కాలికంగా యుద్ధ విరమణకి ఒప్పందం జరుగుతుంది.
గ్రీకు సేనలకి, ట్రాయ్ సేనలకి మధ్య యుద్ధం ఆగింది కానీ ఎఖిలీస్‌కి అగమెమ్నాన్‌కీ మధ్య విరోధ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దేవతల రాజైన జూస్‌ని కలుసుకోడానికి థేటిస్‌కి పన్నెండు రోజులు పట్టింది. జూస్ ట్రోయ్ పక్షం కాస్తే భార్య హేరాకి కోపం వస్తుంది; ఆమె గ్రీకుల పక్షం! కాని థేటిస్ కోరికని కాదనలేకపోయాడు, జూస్. హేరాకి కోపం రానే వచ్చింది. మానవుల మధ్య జరుగుతూన్న ఈ పోరాటంలో దేవతలు తల దూర్చడం శ్రేయస్కరం కాదని ఆమె కొడుకు హెఫయెస్టస్ హేరాకి హితోపదేశం చేస్తాడు.

[Image: Trojan.jpg]

ఈలోగా ట్రాయ్ పక్షంవారు యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అప్పుడు జూస్ ట్రాయ్ పక్షం వహించి వారికీ సహాయం చెయ్యడానికి వస్తాడు. జూస్ ట్రాయ్ పక్షం కాయడం, ఎఖిలీస్ అస్త్ర సన్యాసం చేసి ఇహ పోరాడనని భీష్మించుకుని కూర్చోవడం వల్ల గ్రీకు సేనలు బాగా నష్టపోతారు. చాల రోజులు జరిగిన ఆ భీకర పోరాటంలో పేరిస్-మెనలౌస్‌ల మధ్య, హెక్టర్-ఏజాక్స్‌ల మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధాలు చిరస్మరణీయమైనవి. అయినా సరే ట్రాయ్ సైన్యాలు గ్రీకు సేనావాహినిని తరిమి కొట్టాయి.

భారత యుద్ధంలో వ్యాసుడు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని, దినాలవారీగా, వ్యూహాలవారీగా, అస్త్రాలవారీగా ఎలా వర్ణిస్తాడో హోమర్ కూడా అలా ఆ యుద్ధాన్ని వర్ణించుకుంటూ వస్తాడు. చిట్టచివరికి ట్రాయ్ నగరాన్ని పడగొట్టలేక గ్రీసు సేనలు పడవలలో ఎక్కి పారిపోతారు. ఆ హడావిడిలో ఒక కొయ్యగుర్రాన్ని సముద్రపుటొడ్డున వదిలేసి మరీ పోతారు. ట్రాయ్ సేనలు వారి విజయానికి ఆ గుర్రం ఒక అభిజ్ఞానం అనుకుంటూ దానిని ఈడుచుకుని పట్టణం లోపలికి తీసుకుపోతారు. లోపలికి వెళ్లిన తరువాత ఆ కొయ్యగుర్రం తలుపులు తెరుచుకుని గ్రీకు సేనావాహిని బయటకి వచ్చి ట్రాయ్ నగరాన్ని పరిపూర్ణంగా కొల్లగొట్టి పోతారు.

భారత యుద్ధం ధర్మయుద్ధానికి ప్రతీక అయితే ట్రోయ్ యుద్ధం దేవతల అహానికి, స్వల్పబుద్ధికి ప్రతీక అనుకోవచ్చు.
   

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 10:50 PM



Users browsing this thread: 1 Guest(s)