Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గ్రీకు పురాణ గాథలు
#11
గ్రీకు పురాణ గాథలు 5
 

హిందూ పురాణ గాథలలో సృష్టి జరిగిన విధానం

ఇంతవరకు చదివిన తరువాత, గ్రీకు పురాణ గాథలలో అస్తవ్యస్త పరిస్థితి నుండి సృష్టి జరిగిన విధానం, సంతానోత్పత్తి కొరకు మొదటి జంట ఏర్పడిన విధానాలలోని ఆచార వ్యవహారాలు చూస్తే కాసింత ఆశ్చర్యం, కాసింత జుగుప్స పుట్టుకొస్తాయి. ఇటీవలి కాలంలో డార్విన్ ప్రవచించిన పరిణామ సృష్టివాదం బలం పుంజుకొనక పూర్వపు రోజులలో మానవుడి పుట్టుక గురించి మనకి ఉన్న అవగాహన పూజ్యం. ఉదాహరణకి ఒక పురాణంలో సృష్టి ఎలా ప్రారంభం అయిందని చెప్పేరో చూద్దాం*.

శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టేడు. శ్రీమన్నారాయణుడు ఎలా పుట్టేడని అడగొద్దు. ఆద్యంతాలు లేని సర్వాంతర్యామి ఆయన!

బ్రహ్మ మనస్సులోంచి (గ్రీకు కథనంలో ‘శిరస్సుని చీల్చుకుని’ అన్న ప్రయోగం ఉత్ప్రేక్ష అయి ఉంటుంది.) పుట్టినవారిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వీరు ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం ఒకొక్క పురాణంలో ఒకొక్కలా ఉంది. దత్తాత్రేయ పురాణం ప్రకారం అలా బ్రహ్మ మనస్సులోంచి పుట్టుకొచ్చినవారే సప్తమహర్షులు. బ్రహ్మ నీడ లోంచి కర్దమ ప్రజాపతి అనే పురుషుడు ఉద్భవించేడు. బ్రహ్మ దక్షిణ భాగం నుండి స్వాయంభువ మనువు అనే పురుషుడు జన్మించేడు. కనుక స్వాయంభువ మన్వంతరంలో సప్తమహర్షులు, కర్దమ ప్రజాపతి, స్వాయంభువ మనువు బ్రహ్మ కొడుకులే కదా! (ఇక్కడ లెక్క స్వాయంభువ మన్వంతరం ప్రకారం అని గమనించ గోరుతాను. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరంలో సప్తమహర్షులు వేరు; వారు కశ్యప, అత్రి, వసిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ. వీరు బ్రహ్మ మానసపుత్రులు కారు.)

బ్రహ్మ వామభాగం నుండి శతరూప అనే స్త్రీ ఆవిర్భవించింది. అనగా, శతరూప మొదటి స్త్రీ. స్వాయంభువ మనువు శతరూపని వివాహం చేసుకుంటాడు. వీరు ఆదిదంపతులు. అనగా స్వాయంభువ మనువు తన సోదరిని పెళ్లి చేసుకున్నాడన్నమాట! ఇది మొదటి జంట.

ఆదిదంపతులకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కొడుకులు, అకూతి, దేవహూతి, ప్రసూతి అనే కూతుళ్ళు పుట్టేరు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన రుచి అకూతిని వివాహం చేసుకుంటాడు. అనగా, రుచి తన సోదరుడికి, సోదరికి మధ్య ఉన్న వైవాహిక బంధం వల్ల పుట్టిన కుమార్తెని పెండ్లి చేసుకున్నట్లే కదా! ఇది రెండవ జంట.
కర్దమ ప్రజాపతి దేవహూతిని వివాహం చేసుకుంటాడు. ఇది మూడవ జంట. ఈ మూడవ జంటకి తొమ్మండుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగేరు. ఈ కుమార్తెల పేర్లు: కల, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్ధ్వ, చితి, భ్యాతి. విష్ణువు అంశతో పుట్టిన కుమారుడు కపిలుడు.

బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన అత్రి, ఈ తొమ్మండుగురులో రెండవ అమ్మాయి అనసూయ నాలుగవ జంట! అత్రి ఒక విధంగా తమ్ముడి కూతుర్నీ మరొక విధంగా మనవరాలినీ పెళ్ళాడినట్లే కదా!
అత్రి ఆయుర్వేదాన్ని సృష్టించిన మహాముని. ఊర్ధ్వరేతస్కుడైన అత్రి తేజస్సు భావనాపూర్వక మిథునం ద్వారా అతని కంటినుండి కిందకి పడబోతుండగా వాయుదేవుడు దానిని అనంతంలోకి విసిరికొట్టాడు. దిగంగన దానిని స్వీకరించి, గర్భం ధరించి, బ్రహ్మంశతో అమృత స్వభావుడు, ఓషధీ గణపతి, రజోగుణ ప్రధానుడు అయిన చంద్రుడిని కన్నది.
అత్రి, అనసూయల మరొక పుత్రుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాంశలతో, మూడు శిరస్సులతో జనియించిన దత్తాత్రేయుడు. మహా శక్తిసంపన్నుడు.
అత్రి, అనసూయలకు శివాంశతో పుట్టిన మూడవ పుత్రుడు నిర్లిప్తుడు, మహాకోపి అయిన దుర్వాస మహాముని.

దత్తాత్రేయ పురాణంలో ఉన్న ఈ అంశాలు చాలు సృష్టి ఎలా ఆరంభమయి, విస్తరించిందో చెప్పడానికి! వేదాలలో దృక్పథం వేరుగా ఉంటుంది. ఉపనిషత్తులలో మరొక విధంగా ఉంటుంది. ఇతర పురాణాలలో ఇదే సంగతి మరొక విధంగా ఉంటుంది.
ఈ కోణంలో చూస్తే గ్రీకు పురాణం గాథలు అంత ఏవగింపుగా అనిపించవు.

(*ఆధారం: 1. మేనమామ బిడ్డ – పింగళి రమణరావు (ఎలక్ట్రాన్), ఆంధ్రప్రదేశ్, జులై 1999. 2. విలువల వెల ఎంత? (కథాసంకలనం), వాహిని బుక్ ట్రస్ట్, హైదరాబాద్, 2006.)

Like Reply


Messages In This Thread
RE: గ్రీకు పురాణ గాథలు - by WriterX - 04-09-2021, 08:33 PM



Users browsing this thread: 1 Guest(s)