Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
హిమజ్వాల - వడ్డేర చండిదాస్ నవలా పరిచయం
#2
చివరగా చండీదాసుగారి గురించి నాలుగు మాటలుఆయన ఒక సముద్రం. ఆయన సాహిత్యం ఒక సాగరం. సముద్రం ఎంత గుంభనంగా, అంతుబట్టకుండా ఉంటుందో ఆయనా అలాగే అనిపించేవారు. వచ్చీ పోయే అలల్లాగా ఆయన క్లుప్తంగా, తాత్వికంగా మాట్లాడేవారు. ఆయన మాటల్లో వెంటనే సమాధానం దొరకదు.
మీరు కృష్ణచైతన్య కాదు కదా
అటువంటి వారు ఎందరో
గీతాదేవిని ఎందుకు చంపారు?’
నేను చంపలేదుఆమె చనిపోయింది
గీతా దేవిలా ప్రవర్తిచే వారందరికీ అదేగతి పడుతుందని చెప్పదల్చుకున్నారా
ఏమో చెప్పలేం.అందరికీ అదేగతి పట్టాలని లేదు
గీతదేవి స్వార్థపరురాలు
స్వార్థం సహజం
త్యాగం అబద్ధమా’,
కృత్రిమం, కల్పితం
నవల ప్రయోజనం ఏమిటి?’
బయటికి కనిపించేదంతా జీవితం కాదు. అసలు జీవితం బయటికి కనిపించడం లేదు. నిజమైన  జీవితాలను దర్శింపజేయడమే లక్ష్యం
నవలలోని జీవితాలు సామాజిక వాస్తవికతకు దూరంగా ఉన్నాయి
ఏది సామాజికమో అది జీవితం కాదు. వాస్తవికమూ కాదు
వ్యక్తి అస్తిత్వమూ, సామాజిక అస్తిత్వమూ రెండూ జీవితాల్లో ఉన్నాయి. చైతన్య, శివరామ్ అలా వ్యవహరించడానికి సామాజిక అస్తిత్వం తాలూకు స్పృహే కారణం.

సామాజిక సంస్కారమే మనిషిని బందీని చేస్తూ ఉంటుంది. అలాగని వారిలో వ్యక్తి అస్తిత్వ చైతన్యం లేదని చెప్పలేం. మనిషిని ఎప్పుడు చైతన్యం డామినేట్ చేస్తుందన్నదే సమస్య.

చండీదాస్గారు వాదనను ఒప్పుకునేవారు కాదు. కమ్యూనిస్టులు వ్యక్తిని సమాజానికి ముడిపెట్టకుండా ఆలోచించలేరు అనేవారు.ఆయనతో చర్చలు అనంతంగా సాగిపోయేవిఎంత గట్టిగా కొట్లాడినా, ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన మనుషుల్ని ప్రేమించేవారు. మమ్మల్ని దీవించేవారు. ఇప్పుడాయన లేరు. ఆయన ఇచ్చిన తాత్విక స్ఫూర్తి ఉంది.
=========================================================
మనసు మాయాజాల మర్మాన్ని ఛేదించి, సాధించిన అక్షరవేత్తల సృష్టి చైతన్య స్రవంతి. దానికి అంకితమై రచనలూ, జీవితాన్నీ కొనసాగించిన దార్శనిక సృజనశీలి వడ్డెర చండీదాస్‌. అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పేదకులానికి ప్రాతినిధ్యంగా వడ్డెరను, 15 శతాబ్ది బెంగాలీ విప్లవ కవి పేరు నుంచి చండీదాస్ను స్వీకరించిన ఈయన కృష్ణాజిల్లా పెరిశేపల్లిలో జన్మించారు. వృత్తిరీత్యా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్ర ఆచార్యులు. 2005 జనవరి 30 తనువు చాలించారు.
      అనుభూతి భావజాలానికి గంభీర ఆలోచనలు జతచేసి రాసిన అనుక్షణికం, హిమజ్వాల నవలలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. రెండు వందలకుపైగా పాత్రలతో వాస్తవ సంఘటనలతో కులాలు, ఇంటిపేర్లు, చిరునామాలతో  కొత్తకోణంలో సంచలనం సృష్టించిందిఅనుక్షణికం’. ‘చీకట్లోంచి చీకట్లోకికథలు విడగొట్టిన నవలలా కనిపిస్తూ, ఒక స్త్రీ నిండు జీవితాన్ని చిత్రిస్తాయి. ‘డిజైర్అండ్లిబరేషన్‌’ ఆయన మాత్రమే రాయగల దార్శనిక గ్రంథం.
      శిలలాంటి ఏకాంతం నుంచి సెగలా వ్యాపించి, మంచులా చల్లబడిన తెలుగు పాఠకుల మనసుల్లో మంటలు రగిలించిన నవల హిమజ్వాల. చదువుతున్న కొద్దీ వదలనీయకుండా చేసే సమ్మోహనత్వం చండీదాస్తత్త్వం.
      నవలని చండీదాస్‌ 1960లో రాయాలనుకొని 1961లో మొదటి అధ్యాయం రాసి ఆపేశారు. మళ్లీ 1968లో ప్రారంభించి అయిదు నెలల్లో పూర్తి చేశారు. ఇలా ఏడేళ్లపాటు మనసులో ఒత్తిడితో, సెగలా రగులుతున్న ఆలోచనలకు నవలా రూపమిది. హిమజ్వాల ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా వచ్చింది. ‘జీవితం ఎంతకీ తరగని స్వయం జ్వలిత హారతి కర్పూరంఅనే చండీదాస్నాటకీయత, శుద్ధకథాకథనం, చేతనా స్రవంతి మూడింటి సంలీనంతో, మనిషి అంతరంగాన్ని ముందెన్నడూ సాహిత్యంలో లేనంతగా ఆవిష్కరించారు.
      మనసుకు సామాజిక కట్టుబాట్ల ముసుగులు వేయలేక, ఆనందం, అనుభూతే ప్రధానంగా సాగే జీవ మధురిమ గల ఇద్దరు వ్యక్తుల ఆంతరంగిక చిత్రణ నవల. మానవ ప్రవర్తనలోని విభిన్న పార్శ్వాలను ప్రేమ, కామం, శృంగారం, వైరాగ్యం, నిస్సహాయత, కోపం, కసి, సంకుచిత ధోరణి, ఇతరులపైకి నెట్టే మనస్తత్వం, స్వార్థం, పశ్చాత్తాపం మొదలుగా అనేకానేక మానవ ప్రవర్తనల ప్రతిఫలన దర్శనం. ఇందులోని ఇతివృత్తం మేధా జనితం, పాత్రలు వాస్తవ ప్రపంచంలోనివి. మేధలోని నిర్దేశాన్ని యథార్థ ప్రపంచపు పాత్రలు వినవు. పుట్టించిన రచయిత వాటిని నడిపించడు, దారి సూచన కన్నా, గమన వీక్షణ మేలని తప్పుకుంటాడు. అవి వాటి ఇచ్ఛానుసారం నడుచుకొని రచయితకు సిరా మరకలు మిగుల్చుతాయి.
      నవల రచనా కాలానికి మెట్రోపాలిటన్నాగరికత అప్పుడప్పుడే తెలుగు వారికి పూర్తి స్థాయిలో పరిచయమవుతున్న దశ. స్వేచ్ఛ పట్ల సహజమైన ఆసక్తి గల నాయిక గీతాదేవి. తనదైన వ్యక్తిత్వ ఔన్నత్యంతో జీవిస్తుంది. కుటుంబ బంధాలు, బలవంతపు కామక్రీడలు నచ్చక, జీవితాన్ని గాలిపటమంత స్వేచ్ఛగా వెళ్లదీస్తుంది. ప్రేమపేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న శివరాం దగ్గర రససిద్ధి లభించక సతమతమవుతుంది. కట్టుకున్న భర్తపరమ బూతులుతిట్టినప్పటికీ, లాలిత్య హృదయం తెలియని పశువులా భావిస్తుంది తప్ప, తన్మయత్వ మాధుర్యాలను మార్చుకోవాలని చూడదు. బరితెగించిన దానిలా కనిపించే గీత స్వచ్ఛమైన ప్రేమ కోరుకునే దివ్యత్వం గల స్త్రీ.
      ముందు నుంచి గీతాదేవిది సంకుచిత మనస్తత్వం కాదు. భయపడే పిరికితనమూ లేదు. గీత తీసుకున్న అనేకానేక నిర్ణయాలు మహిళలకు ఎన్నో సందేశాలు ఇస్తాయి. పురుషాధిక్య సమాజంపై పోరాటంలా కాక మనకు కావాల్సినవి వెతుక్కుంటూ వెళ్లే విధానాన్ని నేర్పిస్తాయి. స్త్రీ ఆలోచించాల్సిన, ఎదిరించాల్సిన, తెగించాల్సిన అవసరాలను, అందులోని నిజాయతీని, పర్యవసానాలను అందిస్తాయి.
      గీత శరీర సౌందర్యమే కాదు మనో సౌందర్యమూ ఉన్న మహిళ. అయితే దేహ సౌందర్యాన్ని మాత్రమే చూసే లోకానికి ఆమె హృదయం లోతు తెలియదు. పైపై మెరుపులకు సమ్మోహితులైన వారు ఆమె భావజాలాన్ని అర్థం చేసుకోక నిందిస్తారు. సూటిపోటి మాటలతో నిందించిన సీతమ్మ కూడా, నిజాన్ని తెలుసుకున్నాక పశ్చాత్తాప పడుతుంది. తన కూతురు నిర్మలకు చేసిన సహాయానికి కరిగిపోతుంది. మేనేజర్కామాన్ని హాస్యంతో చాలా తేలిగ్గా తిప్పికొట్టిన గీత, శివరాం విధానాన్ని అంతే మౌనంగా నిరసిస్తుంది. పరిస్థితులకు జడవని స్థిత ప్రజ్ఞత్వం కలది.
      ముఖ్యంగా తన భర్తకు రసస్పందన స్పర్శ రుచిని తెలపాలని ఆమె చేసే ప్రయత్నాలు ఫలించవు. శరీర విరుపులకు అలవాటైన అతనికి మనసు మర్మాలు తెలియవు. గీత చేసే బోధనలను వెకిలిగా తీసేస్తూ, పచ్చి నీచపు మాటలను ప్రయోగిస్తాడు. ‘‘కాపురం చేయడం ఇష్టం లేకపోతే ఎవడితోనైన లేచిపో’’ అని నిందిస్తాడు. ఆమె రసహృదయాన్ని గాయపరుస్తాడు. శరీర సుఖాన్ని మాత్రమే ఆశించే భర్తను వదిలి గీత తన దారిన పోతుంది. నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం లేదన్నట్లు విజయసారథి సాన్నిధ]్యంలో, అన్వేషిస్తున్న ప్రేమ మర్మాన్ని తెలుసుకొని దాసోహమవుతుంది.
      నాయికలా సమాన ఆలోచనల ఔన్నత్యం గల పాత్ర కృష్ణచైతన్యది. ఆస్తి, చదువు, ఉద్యోగం అన్నిటిపరంగా మంచి స్థాయిలో ఉన్నా, నిష్కల్మషమైన ప్రేమ కోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. నవల ప్రారంభంలోనే తారసపడ్డ వీరిద్దరూ ఆలోచనలు కలిసినా, సాన్నిహిత్యంగా జీవించడంలో నిర్ణయానికి తొందరపడరు. దాని ఫలితమే ఇద్దరూ చెరోదరికి వెళ్లి ఒకే ఆలోచన ఉన్న భాగస్వామి దొరకక అవస్థల పాలవుతారు. మొదటి అధ్యాయంలోని నిర్ణయమే ఇతివృత్తాన్ని పెంచుతుంది. ఒక యాక్సిడెంట్తో ప్రారంభమైన నవల మరో యాక్సిడెంట్తో ముగుస్తుంది. మొదటి యాక్సిడెంట్తో కలిసిన నాయిక, నాయకులు చివరి యాక్సిడెంట్తో శాశ్వతంగా విడిపోతారు. ఇది ఇందులోని మలుపు.
      గీతాదేవి, కృష్ణ, సారథిలది నిష్కల్మషమైన అమర ప్రేమ. శివరాంది కామం, అహంకారం నిండిన వ్యామోహం. గీతాదేవిని తిరిగి పొందడానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తాడు. జాలి, అసహ్యం రెండూ కలుగుతాయి అతని అభ్యర్థనలో. ఆమె తిరస్కరించే సరికి అసలు రూపం బయట పడుతుంది. తను పొందనిది ఇతరులకు దక్కకూడదనే క్రూర మనస్తత్వంతో ఆమెను హతమార్చుతాడు. ఆరోగ్యం సహకరించని భర్త చిదంబరరావుతో శృంగారం పొందలేక, అడవి కాచిన వెన్నెల్లా ఎదురుచూసే పాత్ర మాధురి. ఈమె ప్రణయ లేమిని కృష్ణ ఒంటరితనం తీరుస్తుంది. ఒక సాధువు ఇచ్చిన మందుకు దీర్ఘకాలంగా నయంకాని చిదంబరరావు వ్యాధి ఒక్క రాత్రిలో నయమవుతుంది. భర్త ఆరోగ్యం బాగవగానే  మాధురి తన దాహాన్ని తీర్చిన కృష్ణను మరిచిపోతుంది. తప్పించుకు వెళ్లడానికి చూస్తుంది. ఇది నచ్చని కృష్ణ తనే ముందుగా నిష్క్రమిస్తాడు. కృష్ణ, గీతలకు స్వచ్ఛంగా సాయపడే స్నేహ పాత్ర శశాంక.
      భార్య చనిపోయినప్పటి నుంచి ఒంటరిగా గడిపే విజయసారథి, వయసుకు అతీతంగా గీత చూపే ప్రేమలో తన్మయమవుతాడు. ఆమె జీవితానికి అండగా నిలుస్తాడు. సారథి మరణంతో మళ్లీ గీత, కృష్ణలు ఒక్కటవుతారు. అన్నీ బాగున్నాయని చదువరులు ఊపిరి పీల్చుకునేంతలో శివరాం పాత్ర వచ్చి గీతను బలిగొంటుంది.
      సంభాషణల పరంగా హిమజ్వాల లోతైన మహాసముద్రం. చాలాచోట్ల సన్నివేశంలోని సంభాషణలు చదివాక అందులోని అభివ్యక్తి నూతనత్వానికి, అనుభూతి గాఢతకి ముందుకుపోలేక తదేకంగా నిలిచిపోతాం. ‘అందమైన గాజు గుండెలోంచి తేనెమంచు స్రవించాలనుకోవడం మూర్ఖత’, ‘శరీరం వొక శతతంత్రుల వీణ. దాన్ని మీటి తంత్రుల మీద మూర్చనలు పోతేనే రససిద్ధి’... లాంటివి జీవితాన్ని చీల్చి మొలకెత్తించిన స్పందన సేద్యంలా ఉంటాయి. సందర్భోచితంగా సున్నిత హాస్య సంభాషణా శైలి చండీదాస్ప్రత్యేకత. కొత్త పదబంధాల ప్రయోగంలో చమత్కారం కనిపిస్తుంది. మాధురిని వర్ణిస్తూఅన్నపూర్ణ, ఊర్వశిలు కలబోస్తే తయారైన అన్నూర్వశిఅంటాడు రచయిత. ఇలాస్నానించివంటి పద ప్రయోగాలు మనల్ని కట్టిపడేస్తాయి.
      నిజానికి హిమజ్వాల ఉన్నత వర్గ పాత్రలతో నిండిన నవల. ఇందులో పాత్రలు  సంపన్న కుటుంబాలవి. గీత సంపన్నురాలు కాకపోయినా, వాళ్లతో గడపటానికి ఇష్టపడుతున్నట్టే అనిపిస్తుంది.
      మానవత్వ విలువలను పరిమార్చేది వ్యక్తివాదం. నవలవ్యక్తి వినా సంఘం లేదుఅని ప్రకటిస్తుంది. చైతన్య స్రవంతి మూలమల్లా మనిషి, అతని మనసే దానికి ప్రధానం. సమూహ లక్షణాలకు కట్టి పడేసిన మనసును, ముసుగు తొలగించి బహిర్గత పర్చడమే ఇలాంటి రచనలు చేసే పని. దాన్ని హిమజ్వాల చక్కగా నిర్వహించగలిగింది. మేధకు, కోరికలకు మధ్య జరిగిన సంఘర్షణలకు అక్షర చైతన్య రూపం హిమజ్వాల.
Like Reply


Messages In This Thread
RE: హిమజ్వాల - వడ్డేర చండిదాస్ నవలా పరిచయం - by lkveni58 - 25-06-2021, 12:44 PM



Users browsing this thread: 1 Guest(s)