Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తాత్త్విక శిఖరం జిడ్డు కృష్ణమూర్తి
#1
'కళాదీపికాంజలి'!
★★★★★★★★
తాత్త్విక  శిఖరం
జిడ్డు కృష్ణమూర్తి
11-5-1895   17-2-1986
(ఈరోజు వారి వర్థంతి)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ ◆
జిడ్డు కృష్ణమూర్తి గారు
మే 11, 1895 న 
ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో 
ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 
జన్మించారు. 
జిడ్డు నారాయణయ్య,సంజీవమ్మ 
ఆయన తల్లిదండ్రులు.

ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 
1929 నుండి 1986 లో 
తను మరణించే వరకు 
ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ 
తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై 
అనేక ప్రసంగాలు చేశారు. 
ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు :
మానసిక విప్లవం, మనోభావ విచారణ, 
ధ్యానం, మానవ సంబంధాలు, 
సమాజంలో మౌలిక మార్పు.

"మనిషి తనంతట తానుగా భయం, 
కట్టుబాట్లు, అధికారం మరియు 
మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలి.". 
"అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, 
ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి”
“రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. 
నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, 
కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా 
ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ 
జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది."
ఆని ఆయన సిద్ధాంతం.

"జ్ఞాన సముపార్జనకు పరిమితి లేదు. పుస్తకాలు చదవడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం,
చదువు పూర్తయింది అనిపించుకోవడంతో 
సంపూర్ణ జ్ఞానంసాధించినట్టు కాదు. 
పుట్టిన క్షణం నుంచి
శరీరాన్ని త్యజించే వరకూ జీవితాంతం
నిరంతరాయంగా కొనసాగాల్సిన ప్రక్రియ."
అని ఆయన ఉద్భోదించారు.
                                  
జిడ్డు కృష్ణమూర్తిగారు మదనపల్లెలో జన్మించినా, తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో 
నివాసం పెట్టారు . మద్రాసు లోని 'అడయారు' దివ్యజ్ఞాన సమాజంకి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. అనీ బిసెంట్ దానికి అధ్యక్షురాలు. 
కృష్ణమూర్తి, ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట 
నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.

జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు
అడయారు గ్రంథాలయాధికారి ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డాడు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి, ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించాడు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటితో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. 
పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తిగారు సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేయసాగారు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో 
దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు 
ఆ దావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ 
ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ 
తన వద్దే ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. 
జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని 
ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువును అవునని కాని, కాదని కాని ఏమీ వెల్లడించలేదు. 
ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున 
తన తమ్ముని తీసుకుని ఆయన అమెరికా లోని కాలిఫోర్నియాకు వెళ్ళిపోయారు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 
1925 లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తి గారిని 
శోకంలో ముంచింది. 

ఆ దుఃఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవారు. నిత్యానంద మరణం కృష్ణమూర్తి గారిలో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ ఆయన ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక, ప్రతీ విషయాన్నీ శంకించేవారు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవారు. కరడు కట్టిన సాంప్రదాయ వాసనలతో బూజు పట్టిపోతున్న మతాలమీద ఆయనకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య (Occultism) మీద కూడా ఆయనకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ ఆయనకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణంతో ఆయన దృక్పథం మరింత బలీయమైంది.

కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్' అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిగారిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం వరకూ కృష్ణమూర్తిగారు అందుకు అభ్యంతరం 
ఏమీ చెప్పలేదు. అంతవరకూ తాను 
కృష్ణమూర్తినా లేక జగద్గురువునా 
అనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోయారు. సోదరుని మరణం ఆయనలో తెచ్చిన దుఃఖం కొంతకాలానికి ఆయనలో ప్రతిక్రియను తెచ్చింది. దుఃఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది ఆయనలోకి. 
ఆయనలో జీవం ప్రవేశించింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. 
ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. ఆయన నడచేదారిలో గులాబిపూలు పోసేవారుకూడా. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన సౌధాన్నీ, అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించారు. 
ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక, 
తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేరు. 
చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానికి అంతకూ వ్యతిరేకం కాజొచ్చారు. తన విశ్వాసానికి విరుద్ధంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా ఉండే నిమిత్తమో, 
భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి 
'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ 'ను రద్దుపరచారు.

ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది. 
డాక్టర్ అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని 
ఒత్తిడి తేబడింది. కాని లాభం లేకపోయింది. 
తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని, జగద్గురువును కానని చాటసాగేరు. చివరకు లాభం లేకపోయింది. ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో 
మౌనం దాల్చారు. అప్పటినుంచీ కృష్ణముర్తిగారు స్వతంత్రమానవుడు, స్వేచ్ఛాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి, గొప్ప జీవన శిల్పిగా రూపొందారు.అనేక రచనలు  చేసారు.

తెలుగులో - కొన్ని రచనలు
కృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం.
శ్రీలంక సంభాషణలు.
గతం నుండి విముక్తి
ఈ విషయమై ఆలోచించండి (1991) 
ముందున్న జీవితం
ధ్యానం
విద్య, అందు జీవితమునకుగల ప్రాధాన్యత
మన జీవితాలు-జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
స్వీయజ్ఞానం
స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
నీవే ప్రపంచం-జె.కృష్ణమూర్తి
గరుడయానం
నిరంతర సత్యాన్వేషణ-జిడ్డు కృష్ణమూర్తి

ఎక్కడో ఆంధ్ర దేశంలో పుట్టి,
తాత్త్విక శిఖరంగా
అంతర్జాతీయ ఖ్యాతినందుకొన్న
జిడ్డు కృష్ణమూర్తి గారు
1986 ఫిబ్రవరి 17న
ఈ భౌతిక ప్రపంచం నుండి  తరలిపోయారు.

'కళాదీపిక'
  1. వాట్స్పాప్ గ్రూపు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)